Monday, December 8, 2025

Sunday, December 7, 2025

Lokabhiramam లోకాభిరామం - పోగాలము

లోకాభిరామం

పోగాలము

పోగాలము

వానికి గోపియను పేరుబెట్టిరి. వాడు వాస్తవముగనే ముక్కుమీద గోపము గలవాడాయెను. వాడు నాకు చాలా గొప్ప పేరున్నదనును. ఆ పేరెక్కడనున్నదని ప్రశ్న బుట్టును. కొందరికి వారి పేరు గోడమీద నుండును. గోడ మీదకన్నను, గోడకు తాపితము జేసిన నొక జెక్క మీద చెక్కబడి యుండుననిన కడు సమంజసముగా నుండును. వీనికట్టి పేరు లేదు. అట్లున్న పేరు గొప్ప పేరెట్లగును? అది చెక్క మీద పేరగును. ఒకనికి గొప్ప పేరున్నదన్న నేమి భావము? వాని ప్రతిష్ఠ ఘనముగా నున్నదని గదా! అందుకే పేరు ప్రతిష్ఠలను నొక సమాసమేర్పడినది. అందొకటి యున్న రెండవది గూడ తోడుగా నుండునని భావము.

వానికి తలిదండ్రులు బెట్టిన పేరు గోపాలము. తెనుగున పేరల జివరన డుమువులుండవలెనని గదా వ్యాకరణము. వాడు గోపాలుడు. తమిళమున గోపాలన్‌ అందురు. అది యేకవచనమే. గోపాలర్‌ అన్న గాని బహువచనము గాదు. తెనుగున డు అన్న నేకవచనము. అది యందరికి నచ్చదు. నీవొక్కరివే. కాని నిన్నెవరో ‘మీరు’ అని సంబోధించిన నొక గౌరవము, ఒక యానందము. ఒకప్పుడొకడు నా వద్దకు వచ్చి యేదో ఫిర్యాదు చేయనుండెను. వాడు మాటిమాటికి ‘మేము’ అనుచుండెను. నాకు కొంచెము తిక్క. అది కొంచెము గాదు, పుష్కలముగనున్నది. వానిని ‘ఏదీ, కొంచెము పక్కకు జరుగుమంటిని. వానికర్థము గాలేదు. యేలయని యడిగెను. ‘కొంచెము జరుగుమని మరల యంటిని. నేనధికారిని, అతడు సేవకుడు. కనుక జరిగెను. ఒక్కనివే యుంటివి. మాటిమాటికి మేమనుచుంటివి. నీవసలే స్థూలకాయుడవు, వెనుకనెవ్వరయిన యుండిరో చూడవలెనని, జరగమంటిని’ అని వారించితిని. వానికి కొంత అర్థమయినది. కొంత గాలేదు.

డుమువులలో రెండవది ము. రాముడను వాడు ‘రామము’గా మారును. అది యేకవచనమా? ఎన్ని పదములున్నవను యనుమానమేరికిని గలుగదు. అదియును ఒకనినే సూచించును. అయినను, అవగాహనము కొరవడినందుకు అందొక సౌలభ్యము దోచును. ఈ గోపియను కోపికి, గోపాలము అనిపేరు వడినది. పట్నము పాపమని యెవ్వరును వ్రాయుట లేదు. పట్నం అని వ్రాయుచున్నారు. ఎక్కడికి బదులుదేరితివని ప్రశ్న. పట్నమునకని ఉత్తరువు. అంత పట్టింపు లేనివారు ‘పట్నానికి’ అని బదులిత్తురు. ఈ మధ్యన పుస్తకములు, పత్రికలలో గూడ ‘పట్నంకు’ అను ప్రయోగము గనుపించుచున్నది. సంస్కృతమున విభక్తి ప్రత్యయములున్నవి. నగరం అన్న మాటలో నగరమునకు అను నర్థము గూడ నిమిడియున్నది. నగరమునందు, అనుటకు నగరే యనవలయును. మన వారు నగరంనందు యని నగుబాట్లగుదురేమో? భాషయననది ప్రవహించు నది వంటిది. మారుచుండ వలెను. నిజమే. కానీ మార్పు వలననెవరికో కొంత వెసులు బాటుండదగును. గోపాలము, తన పేరు గోపాలం అని వ్రాయును. నా పేరు, నా యిచ్చ యనుకొన్నాడేమో? డుమువులున్నంత కాలమది తెనుగు పేరు. అవి లేకున్ననది దెగులు పేరు.

ఒక గాయకుడు వచ్చెను. భజరే గోపాలం, అని పాటబాడెను. గోపాలుని భజింపుమని గదా పాట యర్థము? రామ శబ్దమకారాంతము. రామముగా వ్రాసిననది డుమువులు పద్ధతిలో పేరు. రామం అని వ్రాసినచో నది సంస్కృత శబ్దమగును. రామునికను నర్థమిచ్చును. ఈ గోపాలమను వాడు బ్రౌను దొర రాసిన తెనుగు నిఘంటువును అచ్చునకు తయారు జేయు కార్యక్రమమునందు పాలుగొనెను. యంత్రమునందు అక్షరముల పొందిక జేయునపుడు, పదముల యంతమందుండు ము వర్ణమును పూర్ణానుస్వారముగ మార్చవలెనని ప్రచురణకర్తలు ప్రస్తావన దెచ్చిరి. వీడు, ఎంతమాత్రము కుదరదనెను. మనము నిఘంటవును, పరిష్కరించుట లేదు. మన యిచ్చవచ్చినట్టు మార్పులు జేయుట తగదని వారికి నచ్చజెప్పెను. అంతటి యాలోచనము గలిగిన వానికి స్వకీయ నామధేయము గురించి మాత్రము సత్యము దోచియుండ లేదెందులకు?

ప్రథమ విభక్తి యందు మూడవ యక్షరము ‘వు’. ప్రభు శబ్దము దెనుంగన ప్రభువుగా మారును. వధూ శబ్దము వధువుగా పరివర్తనము జెందును. సేతువు తీతువు అను మాటలున్నవి తీతువనగా తీయుదువని గాదు. తీతువనునది యొకానొక పక్షివిశేషము. గోపాల శబ్దమునకు మాత్రము వ్యాకరణమున నియమము లుండవు. ఇప్పుడు సమాజమున గరణములు లేరు. ఉన్నను వారు గరణీకము జేయుటలేదు. భాషల యందు వ్యాకరణమును నట్లే మృగ్యమగుచున్నది. ఆంగ్లమును గూడ నడుము విరిచి, ఎవరి చేతయిన రీతిని వారు వ్రాయుచున్నారు.

భాషయనునది భావ వినిమయ మాధ్యమము. ఎదుటి వారికి నీవు జెప్పునట్టిదేదో తలకెక్కిన చాలునని యర్థము. బిచ్చగానిని కొందరు పైకి బొమ్మందురు. అనగా మరియొక యింటికని వారి లెక్క. పైకి బోవుట యన్న ప్రాణము బోవుట యనుట గూడనున్నది. జనుల భాష ఈ తీరున నానాటికి తీసికట్లగుచుండగా, పత్రికలు, టెలివిజనుల వారు మరింత కృతకమయిన భాషను వాడకలోకి దెచ్చియుండిరి. ‘లోతట్టు ప్రాంతములు జలమయమయినవి. జనము తీవ్ర ఇబ్బందులకు గురయి వాపోవుచున్నారం’దురు. వాపోవుటయనగా వానికి దెలియునా? నోరంతయు దెరిచి బొబ్బబెట్టుట. జనులు ‘వా’ యని యంగలార్చుచుండిరా? తీవ్ర యిబ్బందులనునది సరియగు సమాసము గాదు. అటువంటివే, నేపథ్యము, పరిస్థితి వంటి మాటలు లేక వారికి వాక్యము వీలుగాదు. తెలుగు నేర్పెడి గొప్ప పండితుడొకడు సమయలేమి, లేదా అటువంటి మాటయేదో వాడెను. ఆయనకు ఎవరు జెప్పవలెను? తప్పు దెలుసుకొనుట ఒక ఎత్తు. దానిని అంగీకరించుట మరియొక ఎత్తు. ఈ రెంటి తరువాత సరిదిద్దుటయను స్థాయి వచ్చును.

భాష పరిణామశీలము. ఇది సత్యము. పరిణామమనగా, ఏదియో యవసరము, వెసులుబాటు కొరకు కొన్ని మార్పులు రావచ్చును. కడుపుగోసినను మాటరాని వారి వలన భాష భ్రష్టువట్టిన యది పరిణామ మనబడదు!

గోపాలమునకు మద్రాసను, చెన్నపట్నమునుంచి ఉత్తరమొకటి వచ్చెను. దాని మీద వీని పేరు ‘కపాలమ’ని వ్రాసియున్నది. కొత్త పేరు దొరికినదని వాడెంతో సంతసించెను. అట్టి వానికి, వాని పేరు సరిగా లేదని జెప్పుట ఎట్లు?

ఇందొక విషయమున్నది. ఒకటి యనగా రెండు. మొదటిది గోపాలమనువాని పేరును గురించిన వాక్యార్థము. వాని పేరెట్లున్నను కడమ వారికి పట్టదు. కనుకనే పోగాలము అన్ననుగూడ వాడు బహుశా పలుకును. పేరు ఎవరికి వారు ఇష్టపూర్తిగా పెట్టుకొనునది కాదు. తల్లిదండ్రులు నిర్ణయింతురు, ఆ పేరుతో పిలుచుచుందురు. కొంతకాలము వరకు అది తన పేరని ఏరికిని ధ్యాసయే యుండదు. కొన్ని వందల సార్లు అందరును అదే పేరుతో పిలిచినందుకు, ఇది నా పేరను నిర్ధారణము కలుగును. ఈ గోపాలమను వాడు ఈ మధ్య వరకు తన పేరు గురించి అంతగా పట్టించుకోలేదనునది సర్వవిదితము. కానీ ఈ మధ్య వాడు తన పేరును ‘విజయగోపాలుడని’ వ్రాసుకొనుచున్నాడు. ఇందొక విషయమున్నది. వాని భార్యామణి పేరు విజయ. ఆపె వలన వీనికి కడు విజయములు చేతికందినవి. కనుక వాడట్లు పేరు పెట్టుకొనెను.

మరి రెండవ విషయముండవలెను గద! అది భాషకు సంబంధించినది. తెలుగనునది యిట్లు గూడ యుండెనని అందరు మరిచిరి. చిన్నయసూరి పద్ధతి తెలుగు మరొక రకము. అనవుడు, నావుడు అను మాటలకర్థము తెలియక బడి పంతుండ్లు కూడ తికమక పడిన సంగతి చెప్పుచుందురు. అది తెలుగు కాదనుటకు లేదు. అందులోని కమ్మదనము అందిన వారికి అది అమృతోపమానముగ దోచును. ఇక ప్రాంతములను బట్టి మాట తీరనునది గూడ మరియొక విశేషము. యాస, భాష అను రెండు మాటల మధ్యన అంతరము తెలుసుకొనవలెను. ఈ రెంటిలో ఏదయినను భాషలో మాధుర్యము, భావము  పలికినంత వరకు అది యంగీకార యోగ్యమే. కానీ మిడిమిడి జ్ఞానము వలన తప్పులు వ్రాయుటను మాత్రము సహించకూడదు,. ఈ మధ్యన ఎటుచూచినను జనము పోటెత్తుచుండిరట. నీరు కూడ పోటెత్తునట. ఏదో జరిగినది అని చెప్పుటకు జరిగిన పరిస్థితి అనుట ఒక యాచారమయినది. ఇట్లు చాల విషయములు మాట్లాడవచ్చును. వాటిని మరొకసారి చూతముగాక.

My poems - నా కవితలు రెండు : చించు & నేను

నా కవితలు రెండు

చించు & నేను






Friday, December 5, 2025

Pakshi Kappa Bhutan పక్షి - కప్ప : భూటాన్ జానపద కథ

పక్షి - కప్ప

భూటాన్ జానపద కథ


పక్షి - కప్ప

 డాంగ్‌ భూ డింగ్‌ భూ అనగనగా ఒక పెద్ద లావుపాటి కప్ప ఉండేది. దానికి కోకిల తో పెళ్లి అయింది. అయినా కప్ప మనసులో తన గురించి ఉన్న భావాలను కోకిల అర్థం చేసుకోలేక పోయింది. కప్ప ఎప్పుడు వింతగా ఉంటుంది, అనుమానాస్పదంగా ఉంటుంది. కోకిలమ్మ కప్ప మనసు తెలుసుకోవాలని అనుకున్నది. ఒకనాడు ఆవిడ సంతోషంగా కప్ప ముందుకు వెళ్లి, టిబెట్‌ వెళ్లి నా బంధువులు అందరిని చూడాలని ఉన్నది అన్నది. కప్ప తన పెద్ద తలను ఒక రకంగా ఆడించింది. అది ఒక రకంగా గురగుర లాడింది. అందులో సరే వెళ్ళు అన్న మాట వినిపించింది.

కోకిలమ్మ కప్పకు కమ్మని వీడ్కోలు చెప్పింది. భూటాన్‌లో ఉత్తరంగా ఉండే కొండలవైపు ఎగురుతూ వెళ్ళసాగింది. కోకిల గాలిలో అలా కొంతకాలం ఎగురుతూ ఉండిపోయింది. ఇక కప్ప తనను చూడలేదు అనిపించినప్పుడు మళ్లీ కిందకు దిగింది. మడుగు పక్కనే ఉండే ఒక చెట్టు మీదకు వచ్చి వాలింది. ఆ చెట్టు గుబురుగా ఉన్న ఆకుల్లో రహస్యంగా దాగి ఉండి పోయింది. అట్లా కప్పను గమనిస్తూ కొంతకాలం గడిచింది. ఆ రోజు బాగా ఎండగా ఉంది. వేడిగా కూడా ఉంది. అందుకని చాలాసేపు కాకముందే కప్ప మడుగు లోని ఒక తామరాకు మీదకు దూకింది. కాళ్లు చేతులు సాగదీసి ఒళ్ళు విరుచుకుని అది గట్టిగా ఆవులించింది. చల్లని వాతావరణంలో హాయిగా ఎండ కాగుతూ ఉండిపోయింది. అట్లా కూర్చున్న చోటే తనలో తాను అది గొణుగుతున్నది. ఆ గొణుగుడు మడుగులో ఉన్న మిగతా జంతువులకు వినపడుతూనే ఉన్నది.

కోయిలా కోయిలా నా కోయిలా

మోన్లా ఖార్చుంగ్‌ మీద బహుశా ఎక్కుతుంటుంది

ఛాబ్‌ సాంగ్‌ లో బాగా తడిసి ఉంటుంది

చెమటతో ఆమె వీపు చిత చిత అయి ఉంటుంది

 

చూస్తుండగానే మడుగు లోని జంతువులు అన్ని విరగబడి నవ్వ సాగాయి. ఆ నవ్వులతో వాతావరణం ప్రతిధ్వనించింది. కప్పకు అదేదో సరదాగానే ఉన్నట్టుంది. అది తన పాటలు మళ్ళీ మళ్ళీ పాడసాగింది. కోకిలను వెక్కిరిస్తున్నాను అనుకుంటున్నది. ఇదంతా చూస్తూ కోకిలమ్మ అవమానంగా తల దించుకున్నది. కళ్ల నిండా నీళ్లు పెట్టుకున్నది. మొత్తానికి అతని మనసులో ఉన్నది ఇదన్నమాట. ఒక్కసారిగా కోకిల ఆకుల చాటు నుంచి బయటకు వచ్చింది. కప్ప ముందు వాలింది. కోకిల కదలి పోతున్నది.

నేను బయలుదేరి కనీసం ఒక రోజు కూడా కాలేదు. ఇక నీవు నన్ను ఈ రకంగా అవమాన పరుస్తున్నావా? ఈరోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అన్నది కోకిల. కప్ప ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన పెద్ద పెద్ద కళ్ళు పెట్టి అదే పనిగా చూస్తూ ఉండిపోయింది. కళ్ళు మరింత పెద్దవిగా కనిపించాయి. కప్ప మరీ వికారంగా కనిపించింది. ఇటువంటి కప్పను కోకిల ఇంతకాలం ఎలా భరించింది? కప్ప కూడా తప్పు తెలుసుకున్నట్టు ఉంది. అవమానంగా అది నీళ్లలోకి పెద్ద చప్పుడుతో దూకింది. అది మళ్లీ బయటకు రానేలేదు.

నీవు ఉన్నావు కనుక ఈ నీళ్ళు కూడా అపవిత్రం అయ్యాయి. దప్పిగొని చస్తున్నా సరే నేను ఇటువంటి నీళ్లను తాగను. అన్నది కోకిల.

కప్పకు కోకిలకు పెళ్లి ఎట్లాగ అయిందో తెలియదు కానీ ఈ రకంగా వాళ్లిద్దరూ విడిపోయారు.

కోకిలలు మడుగులలో నీళ్లు తాగవని భూటాన్‌ వాసులు చాలామంది నమ్ముతారు. నిజానికి తెల్లవారగా చూస్తే కోకిలలు గడ్డి మీది మంచు నీటిని తాగుతూ ఉండడం కనిపిస్తుంది.

Thursday, December 4, 2025

Prapanchatantram ప్రపంచతంత్రం - ఒక పరిశీలన

 ప్రపంచతంత్రం - ఒక పరిశీలన


ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం. అన్ని హంగులూ వాడుకుంటున్నాం. అయితే, ప్రపంచం గురించి,  హంగుల గురించి ఆలోచన మాత్రం తక్కువయినట్లు కనపడుతుంది. గేదె ఉంటుందని తెలియదు. పేడ వేస్తుందని తెలియదు. పాలు ఇస్తుందని తెలియదు. తెల్లవారేసరికి తలుపు ముందర పాలప్యాకెట్లు మాత్రం ఉండాలి. పల్లెలలో కూడా కొంతమంది పరిస్థితి ఇట్లాగే ఉంది. పల్లెలకు, పట్నాలకు తేడా కనిపించడం లేదు. నీళ్లు ఇక్కడా లేవు, అక్కడా లేవు. కార్లూ, టెలివిజన్‌లు, సెల్‌ఫోన్‌లు అంతటా ఉన్నాయి. అవి లేనిదే కాలం గడవడంలేదు. కరెంటు లేకున్నాసరే యంత్రాలను పనిచేయించేందుకు, జనరేటర్లు, ఇన్‌వర్టర్లు ఎక్కడచూచినా కనపడుతున్నాయి.

          మొదటినుంచి మనిషి బాధంతా సౌకర్యం కొరకే. ఆ సౌకర్యం ఎట్లా అమరుతున్నది అన్న ప్రశ్న అందరి మెదళ్లలోనూ పుట్టదు. నాడి చూచి, కుప్పె అరగదీసి మందు నాకించే కాలం పోయింది. జలుబయింది అన్నా సరే బోలెడన్ని పరీక్షలు జరగాలి. స్కాన్‌లు, గందరగోళం జరగాలి.

          ఒక్కసారి తలపైకెత్తి చూస్తే అంతులేని ఆకాశం కనపడుతుంది. ఇంకా లోతుకు పోతే అనంతమయిన అంతరిక్షం ఉందట, అదంతా కలిసి విశ్వం అంటారట. కొంతమంది చాలా తెలుసు అన్నట్టు ఈ విషయాలను గోలగోలగా చెప్తుంటారు. లక్షలు, కోట్ల సంవత్సరాలకు ముందు పేలుడు జరిగిందంటారు. కొత్త పరిశోధకులు వచ్చి అదేమీ లేదంటారు. రాబోయే లక్షల సంవత్సరాల గురించి ఏదేదో చెప్పి భయపెడుతుంటారు. ఈ విశ్వం ఒక పెద్ద పేలుడు జరిగినందుకు మొదలయిందా? ఎవరు చెప్పాలి? లేదంటున్నారు కూడా! అది ఎప్పుడూ ఉన్నదే అంటున్నారు.

          మన గురించి, మన ఉనికి గురించి, మన పరిసరాలను గురించి కొంతమంది గట్టిగానే ఆలోచించారు. బోలెడంత సమాచారాన్ని ఒకచోట చేర్చారు. అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సిద్ధాంతాలను, సూత్రాలను తయారు చేశారు. కొంతకాలానికి ఇవన్నీ కలిసి సైన్స్‌ అనే ఒక అర్థంకాని జ్ఞానభాండాగారం పుట్టింది. అర్థంచేసుకోగలిగినవారికి కూడా అందులో విషయాలు, వైవిధ్యం అడ్డుతగులుతున్నాయి. ఇక వాటి గురించి పట్టించుకోకుండా, తన బతుకంటే సైన్స్‌ అని తెలియకుండా బతుకుతున్నవారికి సైన్స్‌కన్నా గందరగోళం మరొకటి లేదు అనిపించే పరిస్థితి వచ్చింది.

          సైన్స్‌ అంటే ఇంతకుముందు అన్నట్టు సమాచారం కుప్పగా కూడిన ఒక లైబ్రరీయా? అందులోకి తొంగిచూచేందుకు అందరికీ అవకాశం ఉండదా? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? అడిగినవారికి జవాబులు ఎవరు అందించాలి? సైన్స్‌ అన్నది  అంతంలేని ఒక అన్వేషణ. ఒక కార్యక్రమం. ఒక ప్రక్రియ. ప్రశ్నల పరంపర. అర్థం అయినవాటి గురించి, కానివాటి గురించీ, అనుమానాలను పెంచుకుని, ఎందుకు? ఎట్లా? అని ప్రశ్నలు అడగాలి. వాటికి జవాబులు వెతకాలి. అదే సైన్స్‌.  ఒకప్పుడు సైన్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ప్రపంచాన్ని పరిశీలించినవారే మనిషి ఆలోచనలను కూడా పరిశీలించారు.  అంటే, సైన్స్‌కు సైకాలజీకి అప్పట్లో తేడా లేదు. ప్రశ్నల సంఖ్య పెరిగింది. వాటికి జవాబులు కుప్పతిప్పలుగా ఎదురయ్యాయి.  చర్చ మొదలయింది. శాఖలు మొదలయ్యాయి. ఒక్కొక్కరకం ప్రశ్నలకు సైన్స్‌లోనే ఒక్కొక్కశాఖ మొదలయింది. కొంతకాలానికి ప్రశ్న అడిగినవారికి కూడా అర్థంకాని జవాబులు, అంశాలు ఎదురయ్యాయి. మొదటవచ్చిన ప్రశ్న మరీ అమాయకంగా కనిపించింది. ఆ రంగంలో లోతు ఎక్కువయింది. ఆ లోతులోకి దిగినవారికి మిగతా లోతుల అంతు అసలు ఉందని కూడా తోచని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మామూలు మనిసికి, సైన్స్‌కూ మధ్య ఒక అగాధం ఏర్పడింది.  సైన్స్‌ అనే ప్రపంచం మనది కాదన్న భావం మొదలయింది.

          ప్రశ్నలకు జవాబులు కనుగొనే ఆనందంలో సైంటిస్టులు కూడా తాము మామూలు మనుషులమన్న మాట మరచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నలకే జవాబులు వెతికారు. తమ బతుకులలోనే మరిన్ని ప్రశ్నలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వెతుకుతున్నారు కనుక సమాధానం దొరుకుతుంది. సమాధానంతో సంతృప్తి మాత్రం కలగదు. ఈ సమాధానం నిజమని తేల్చుకునేది ఎట్లాగ? అన్నది మరొక గొప్ప ప్రశ్నగా ఎదురవుతుంది. ఒకసారి ఒక ప్రశ్నతోనే తలబద్దలు కొట్టుకోవాలి. అన్ని ప్రశ్నలూ అడిగితే, గజిబిజి తప్ప మరేమీ మిగలదు. ఆ క్రమంలో ప్రశ్నలు వచ్చాయి, జవాబులు వచ్చాయి. బతుకు కొంత అర్థమయింది. సైన్స్‌ మరింత అర్థమయింది. అది తెలిసినవాళ్లకు ఇది పట్టకుండా ఉంది. సైన్స్‌ అర్థమయినవాళ్లకు మిగతా ప్రపంచం పట్టకుండా ఉంది. లైబ్రరీలు మరీ పెద్దవయిపోయాయి. పుస్తకాలు ఉన్నాయని తెలుసు. ఏ పుస్తకం ఎక్కడ ఉందో వెతకడమే ఒక పెద్ద సమస్య. ఆ పుస్తకంలో ఉన్న సంగతిని పట్టించుకుని అర్ధం చేసుకోవడం అంతకన్నా పెద్ద సమస్య.

          దినపత్రికలు చదవడం అలవాటున్నవాళ్లకు ఆ మధ్యన అందరూ దైవకణం గురించి గోల చేయడం గుర్తు ఉండే ఉంటుంది. అంతకుముందు కొంతకాలం ఎయిడ్స్‌ గురించి గొడవ గొడవగా చెప్పుకున్నారు. అప్పుడప్పుడు సైన్స్‌లో ఏదో  ఒక సంచలనాత్మక విషయం తలెత్తుతుంది. అప్పుడు మొత్తం ప్రపంచం అటువేపు మళ్లి ‘సైన్స్‌ ఉంది’ అనుకుంటారు. భూకంపం వచ్చినప్పుడు అందరికీ హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గుర్తుకు వస్తుంది. మామూలు పరిస్థితిలో అది ఉందని కూడా ఎవరికీ గుర్తుండదు. అక్కడ పనిచేసేవాళ్లకు తప్ప!

          ఎవరు ఏ విషయం పట్టించుకున్నా, పట్టించుకోకున్నా బతుకులు కొనసాగుతాయి. బతుకంటే సైన్స్‌ కనుక సైన్స్‌ కూడా కొనసాగుతుంది. బతుకులో సంగతులను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించినవాళ్లకు సైన్స్‌ ఉందన్న భావం అప్పుడప్పుడు కలుగుతుంది. న్యూటన్‌ తలమీద ఆపిల్‌ పడితే, ఆయన ఒక దారిని చూపించి అవగాహన కలిగించాడు. డార్విన్‌కు ప్రపంచమంతా పరిణామక్రమంగానే కనిపించింది. జీవులలో లక్షణాలు వంశక్రమంలో వస్తాయని మరొకాయన చెప్పాడు. ఆవిరితో ఇంజన్‌ నడుపుతానన్నాడు మరొక పెద్ద మనిషి. స్థలం, కాలం వంపు తిరిగాయి అన్నాడు ఇంకొకాయన. ఇవన్నీ వాళ్లు కాకుంటే, మరొకరు ఎవరో ఎప్పుడో కనుగొని ఉండేవారే. కానీ, చాలా విషయాలను చాలామంది కనుగొన్నారు.  కొంతమంది కొత్తదారులు వేశారు. కొంతమంది ఆ దారులలో నడిచారు. దారులు వేసినవారు మన జ్ఞాపకాల నుంచి మరుగున పడి ఉండవచ్చు. కొంతమంది మాత్రం వద్దన్నా, గుర్తుకు వస్తుంటారు.

          విద్యుత్తు వాడుతున్నాం. లైట్‌ బల్బులు వాడుతున్నాం. సెల్‌ఫోన్‌ వాడుతున్నాం. మరెన్నో సదుపాయాలను వాడుకుని  బతుకులను సుఖమయం చేసుకున్నాం. అందిన సుఖాలకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత చెపుదామంటే, ఎవరికి చెప్పాలి?  ఏ ఒక్క సదుపాయమూ మంత్రం వేసినట్టు ఒక్క క్షణంలో ప్రత్యక్షం కాలేదు. రేడియోతరంగాలు ఉన్నాయని కనుగొన్నారు.  సమాచారాన్ని తరంగాలుగా మార్చవచ్చునని మరొకచోట కనుగొన్నారు. అందుకు కావలసిన హంగులను ఇంకెక్కడో కనుగొన్నారు. సెల్‌ఫోన్లో మాటా, పాటా మాత్రమే కాక, బొమ్మలను కూడా పంపగలుగుతున్నాం. ఇవాళ మన జేబులో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ చేయగలిగిన పనిని నాలుగు దశాబ్దాల క్రితం ఒక పెద్ద గదినిండా పరిచిన కంప్యూటర్‌కూడా చేయగలిగేది కాదు. అంటే, ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రానిక్స్‌ అని ఒక రంగం వచ్చింది. అందులో పరికరాలు రాను రాను చిన్నవిగా మారుతున్నాయి. సర్క్యూట్లు, బ్యాటరీలు, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఇవన్నీ నిజానికి పూర్తి వేరు వేరు రంగాలు. అవన్నీ కలిసి సైల్‌ఫోన్‌గా మనముందుకు వచ్చి మురిపిస్తున్నాయి. ఎవరయినా ఒకప్పటి వేలితో తిప్పే పాత టెలిఫోన్‌ను గురించి ఆలోచిస్తున్నారా? ఇవాళ వేలితో ఫోన్‌ తెరమీద మనం చేస్తున్న విన్యాసాలు, జానపదం సినిమాలో మాంత్రికుని ‘హాం ఫట్‌’ కన్నా ఆశ్చర్యకరంగా ఉన్నాయని అనుకుంటున్నారా?

          అది సైన్స్‌ గొప్పదనం! సైన్స్‌ ఆధారంగా పెరిగిన సాంకేతికశాస్త్రం గొప్పదనం! వాటి గురించి ఎంత తెలుసుకుంటే, అంతగా ఆనందం, ఆశ్చర్యాలు సొంతమవుతాయి. వాడుతున్న సౌకర్యం వెనుకనున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే, కుదరదు. కానీ, వారి కృషి గురించి అర్థంచేసుకోవడం మాత్రం కొంతవరకయినా వీలవుతుంది.

          ప్రశ్నలు అడిగితే, జవాబులు దొరుకుతాయి. ప్రశ్నలను సైన్స్‌ పద్ధతిలో అడిగితే, సైన్స్‌ పద్ధతిలో జవాబులు కూడా దొరుకుతాయి.  ప్రశ్న అడగడానికి ముందు పరిశీలను అవసరం. ఆ పరిశీలనలోనుంచి అనుభవం వస్తుంది. అందులోనుంచి  అనుమానాలు వస్తాయి. చాలామందికి ఈ అనుమానాలు రాలేదన్న భావం ఉంటుంది. ప్రశ్నలు అడిగే స్వభావాన్ని మనమంతా  ప్రయత్నించి అణగదొక్కుతున్నాం. అడగడానికి లక్షల ప్రశ్నలు ఉన్నాయి. అడిగితే, ఆశ్చర్యకరమయిన సమాధానాలు      ఉన్నాయి. సమాధానాలతోబాటు ప్రపంచం గురించిన మన అవగాహనలు విస్తరిస్తాయి. మరిన్ని ప్రశ్నలు పుడతాయి. మరిన్ని సంగతులు తెలుస్తాయి. సంగతులు తెలిసినకొద్దీ ప్రపంచం మనకు మరింత తెలిసిందిగాను, అర్థమయినట్టుగానూ కనబడడం మొదలవుతుంది. కొన్ని విషయాలు కొత్తగా అర్థమయినప్పుడు మనమేదో కనుగొన్నామన్న ఆనందం కూడా కలుగుతుంది. ఈ రకంగా సైన్స్‌తో పరిచయం పెంచుకోవడానికి మనము సైంటిస్టులను కానవసరం లేదు. ఆ పద్ధతిలో ఆలోచించడం నేర్చుకుంటే సరిపోతుంది.

 

Wednesday, December 3, 2025

Tuesday, December 2, 2025