Friday, December 12, 2025

M Balamuralikrishna MSG TVG 1962

M Balamuralikrishna  : MSG  & TVG   1962


Ramapriya Varnam
Vatapi and
Sujanajeevana in Khamas

ఆమె కథ పాలస్తీనా జానపద కథ - Palastine folk tale told in Telugu

ఆమె కథ

పాలస్తీనా జానపద కథ


ఆమె కథ

ఒకావిడ ఉండేది. ఆమె పేరు కన్ఫ్యూషియా. ఒకసారి ఒక దర్వేష్‌ ఆమె ఇంటిముందు నుంచి వెళుతున్నాడు. ఆయన మెడలో ఒక పెద్ద జపమాల వేసుకుని ఉన్నాడు. బాగా ఒళ్లు పెరిగి నవనవలాడుతూ ఉన్నాడు. కన్ఫ్యూషియా ఆయనను చూచింది. కొంత ఆశ్చర్యంతో పిలిచి ‘ఏం అమ్ముతున్నావు?’ అని అడిగింది.

పేర్లు’ అతను జవాబిచ్చాడు.

పేర్లా?’ కన్ఫ్యూషియా మళ్లీ అడిగింది.

అవును. నేను పేర్లు అమ్ముతాను.’

ఒక పేరుకు ఎంత తీసుకుంటావు?’ కన్ఫ్యూషియా అడిగింది.

అయిదు నూర్ల దీనార్లు’ అన్నాడతను.

కన్ఫ్యూషియా కూడబెట్టుకున్న డబ్బులు సరిగ్గా అయిదు నూర్లే ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్లి అయిదు నూర్ల దీనార్లు తెచ్చి దర్వేష్‌కు ఇచ్చేసింది. ‘ఇవాళ నుంచి నీ పేరు ఫేర్నీ’ అన్నాడు అతను.

సాయంత్రం కన్ఫ్యూషియా వాళ్లాయన ఇంటికి వచ్చాడు. కన్ఫ్యూషియాను పిలిచాడు. ‘కన్ఫ్యూషియా, కన్ఫ్యూషియా! బయట బండి నిలబడి ఉంది. సరుకులు దింపుకో!’ అన్నాడు.

కన్ఫ్యూషియా మాత్రం జవాబు ఇవ్వలేదు.

భర్త మళ్లీ కన్ఫ్యూషియాను పిలిచాడు. జవాబు మాత్రం రాలేదు.

కన్ఫ్యూషియా, ఏమిటి సంగతి? ఎందుకు బదులు పలకడం లేదు?’ అతను అడిగాడు.

నా పేరు ఫేర్నీ!’ కన్ఫ్యూషియా చెప్పింది.

ఫేర్నీయా!’

అవును ఫేర్నీ’ అన్నది కన్ఫ్యూషియా.

ఈ పేరు ఎవరు పెట్టారు?’ భర్త అడిగాడు.

ఒక ఫకీరు. ఆయన ఇటుగా వెళుతున్నాడు. పేర్లు అమ్ముతున్నాడు. అయిదు నూర్ల దీనార్లు ఇచ్చి ఆయన దగ్గర పేరు కొన్నాను’ జవాబుగా కన్ఫ్యూషియా చెప్పింది.

అయిదు నూర్లే!’ కన్ఫ్యూషియా మొగుడు ఆశ్చర్యంతో అడిగాడు.

జవాబుగా ఆమె తల ఆడించింది.

భర్తకు చాలా కోపం వచ్చింది. అతను మళ్లీ కోటు తొడుక్కున్నాడు. ‘నేను వెళుతున్నాను. నీకన్నా పిచ్చి ఆడమనిషి మరొకరు కనిపించేదాకా మళ్లీ ఈ ఇంటిముందుకు రాను’ అని గట్టిగా చెప్పాడు.

అతను ఇంటి నుంచి బయలుదేరాడు. చాలా రోజులు ఆలా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడయినా ఒక ఫకీరు కనిపిస్తే, వెళ్లి పేర్లు అమ్మే దర్వేష్‌ నీవేనా? అని అడుగుతాడు. ఆ మనిషి కాదంటాడు.

ఒకనాడు అతను దారి వెంట నడుస్తున్నాడు. ఒక ఆడమనిషి కనిపించింది. ‘మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు?’ అని ఆమె అడిగింది.

నరకం నుంచి’ జవాబుగా అన్నాడతను.

అక్కడ మీకు మా నాన్న కనిపించాడా?’ ఆ ఆడమనిషి అడిగింది.

, ఆయనను చూచాను’ జవాబిచ్చాడు.

ఎలాగున్నాడు?’

పరిస్థితేమీ బాగోలేదు.’

మీరు తిరిగి అక్కడికి వెళుతున్నారా?’ ఆడమనిషి అడిగింది.

అవును’ ఇతను చెప్పాడు.

కొన్ని వస్తువులు తీసికెళ్లి నాన్నగారికి ఇస్తారా?’ ఆమె అడిగింది.

ఎందుకివ్వను.’

ఆడ మనిషి అతడిని ఇంటిదాకా తీసుకుపోయింది. కొంత వెన్న, కొన్ని డబ్బులు, భర్తగారి ఒక కోటు తెచ్చి ఇచ్చింది. అతను అన్ని వస్తువులను చక్కగా మూటగట్టుకుని బయలుదేరాడు.

ఆ ఆడమనిషి భర్త ఇంటికి వచ్చాడు. భోజనం చేశాడు. అతనికి బయటకు వెళ్లి నేస్తాలతో కబుర్లు చెప్పాలని అనిపించింది. పెళ్లాన్ని పిలిచాడు. కోటు తెచ్చి ఇమ్మన్నాడు.

ఆమె కోటు ఎవరో ఒకాయనకు ఇచ్చేశాను అని చెప్పింది. భర్త ఆశ్చర్యంతో ఎందుకు అని అడిగాడు.

ఆయనేమో నరకం నుంచి వచ్చానన్నాడు. అక్కడ మా నాన్నగారిని చూచావా అని అడిగాను. అవును చూచాను అన్నాడు. కష్టాలలో ఉన్నాడు అని కూడా చెప్పాడు. అందుకనే నేను ఆయనకు కొంచెం వెన్న, కొన్ని డబ్బులు, నీ కోటు ఇచ్చేశాను, నాన్నకు ఇమ్మన్నాను.

బాప్‌రే, అతను ఎటువేపు వెళ్లాడు?’ అన్నాడు ఆ మనిషి.

ఆమె సైగచేసి చూపించింది. వెంటనే అతను బయటికి పరుగు పెట్టాడు. గుర్రం ఎక్కాడు. అదే దారిలో బయలు దేరాడు. కొన్ని గంటలు పోయిన తరువాత ఒక మనిషి కనిపించాడు. అతను నిజంగానే కన్ఫ్యూషియా మొగుడు. ఇతను రావడం చూచి అతను పక్కనే ఉన్న ఒక గోడ రంధ్రంలో తన చేతిలోని మూటను దాచేశాడు. అమాయకంగా గోడకు ఆనుకుని నిలబడ్డాడు.

వచ్చినతను కన్ఫ్యూషియా మొగుడి దగ్గరకు వెళ్లి అడిగాడు.

వెన్న, కోటు తీసుకుపోతున్న ఒక మనిషిని ఎవరినయినా చూచావా తమ్ముడూ?’

అవునండీ’ కన్ఫ్యూషియా మొగుడు జవాబుగా అన్నాడు.

చాలాదూరం వెళ్లి ఉండడు. నేను అతడిని పట్టుకోగలనంటావా?’

తప్పకుండా. కానీ మీరు గుర్రం దిగి నడకలో పోతే, పట్టుకోగలరు.’

అదెట్లా?’

గుర్రానికి నాలుగు కాళ్లుంటాయి. మనిషికి రెండే కాళ్లుంటాయి. రెండు కాళ్లు ఉంటే వాటి మధ్యన పొంతన చాలా బాగుంటుంది. మరి నాలుగు కాళ్లు ఉంటే, పొంతన కలగాలంటే ఎక్కువ కాలం పడుతుందిగదా? నాలుగు కాళ్ల్లు ఒక పద్ధతిలో ముందుకు కదలకపోతే, మరి ఆ మనిషి చాలా దూరం వెళ్లిపోతాడు కదా?’

అయితే, అప్పటివరకూ, నా గుర్రాన్ని జాగ్రత్తగా చూస్తావా? నేను తిరిగి వచ్చేదాకా?’ అంటూ అతను గుర్రం మీది నుంచి దిగి అన్నాడు.

ఎందుకు ఉండను?’ జవాబుగా ఈ మనిషి అన్నాడు.

అతను కంటికి కనిపించకుండా పోయేదాకా కన్ప్యూషియా మొగుడు అక్కడే ఉన్నాడు. ఆ తరువాత మూటతో సహా గుర్రమెక్కి వేగంగా బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు చేరగానే బయటినుంచే గట్టిగా అరిచాడు.

ఫేర్నీ, నేను వచ్చేశాను’ అని.

(పాలస్తీనా జానపద గాధ)

నేను ఈ కథను ఉర్దూ నుంచి నేరుగా అనువదించిన.

Thursday, December 11, 2025

ప్రశ్న ప్రాముఖ్యం In Telugu - Importance of Question

ప్రశ్న   ప్రాముఖ్యం


ప్రశ్న - ప్రాముఖ్యం

కే బి గోపాలం

 

ఒక అమ్మాయి మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్ళింది. అక్కడ ఆమెను ఇక్కడి నుంచి చంద్రుడి వరకు గల దూరం ఎంత అని ప్రశ్న అడిగారు. సార్! మనం మందులు చంద్రుడి మీద కూడా అమ్ముతామా? అని ఎదురు ప్రశ్న వేసింది అమ్మాయి.

సరైన ప్రశ్న అడగగలిగిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ప్రశ్నలు అడిగినందుకే ప్రపంచం పరిస్థితి మారింది. వ్యక్తిగా అయినా, సమూహంగా అయినా ప్రశ్న అడగ గలగాలి. ఎవరూ ప్రశ్న అడగకుంటే జరగవలసిన మంచి చెడు జరుగుతూనే ఉంటాయి. ప్రశ్న అడిగితే బహుశా వాటి దారి మారవచ్చు.

తొలినాటి నుంచి మనిషి ప్రపంచం గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు కనుకనే ఇవాళ ప్రపంచం ఈ పద్ధతిలో ఉంది. ఒక విషయం తెలిసిన వెంటనే మనిషి మనసులో ఆ సంగతి గురించి వంద ప్రశ్నలు పుడుతాయి. పుట్టాలి కూడా. కానీ చాలామంది ప్రశ్న అడగరు. ప్రతి విషయం గురించి ప్రశ్న అడిగితే అడిగిన మనిషికి ఏమీ తెలియదు అనుకుంటారేమో అని అనుమానం. ఒక ప్రశ్న అడిగారు. దానికి జవాబు వచ్చింది. జవాబు మీద మరొక ప్రశ్న పుడుతుంది. ఒకటే కాదు ఎన్నో ప్రశ్నలు పుడతాయి. ఈ రకంగానే మనకు గాని మరొకరికి గాని కొత్త, పాత విషయాలు అన్నీ తెలుస్తాయి.

ప్రశ్నలు అడిగిన కొద్ది వ్యవహారం రకరకాల దిక్కుల్లోకి విస్తరిస్తుంది. అంటే కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. అర్థమవుతాయి. ప్రశ్నల ఆధారంగా పెరిగే తెలివి ఒకే దారిలో నడవదు. వంద మార్గాలను వీలు చేస్తుంది.

వానకాలం అన్నారు. కానీ వానలు లేవు. ఎక్కడ కురుస్తున్నాయో తెలియదు. ఎండాకాలంలో ఎండలు మాత్రం మండుతాయి. చలికాలం గురించి మనం పట్టించుకోము. మరి ఈ కాలాల పరిస్థితి ఒకప్పుడు ఉన్నట్టు, ఒకప్పుడు అనుకున్నట్టు ఎందుకు ముందుకు సాగడం లేదు? మీ మనసులో ఈ ప్రశ్నకు పుట్టి ఉంటే, ప్రపంచం మీద మనిషి ప్రభావం గురించి ఎన్నో ప్రశ్నలు పుడతాయి.

మనం ఉన్నాము అంటే మన చుట్టూ ప్రపంచం, ప్రకృతి ఉన్నాయి కనుక కొనసాగుతున్నాము. అవేవీ లేకుండా కేవలం మంచు, నీరు, భూమి మాత్రమే ఉన్నచోట మనం ఉన్నట్టు ఊహించండి. అక్కడ మనం కాక మరేమీ లేనట్టు ఊహించండి. మన బతుకు ముందుకు సాగుతుందా? అనుమానం వచ్చి ఉంటుంది. అన్ని విషయాల గురించి ఆలోచన అవసరం లేదు. అవి అట్లాగే ఉంటాయి కనుక ఉంటాయి.. మనం పట్టించుకునే అవసరం లేదు, అనుకుంటే బతుకు సాగుతుంది. కానీ అందులో రుచి ఉండదు. ఏం జరుగుతున్నది తెలుసుకుంటే అనుకూలమైన విషయాలను కొనసాగించి, కానీ వాటిని ఆపగలిగే పరిస్థితి అందుబాటులోకి రావచ్చు. ప్రకృతిని పరిశీలించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా బ్రతకడం అంటే బండగా బతకడం అని అర్థం. ప్రకృతి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారికి మరింత ముందుకు సాగడానికి అనువుగా వందలాది ప్రశ్నలు వందలాది మార్గాలు కనబడుతుంటాయి. పరిశీలించే వారిది వెలుగులో జరిగే బతుకు. ఆ గుణం లేని వారిది మసక చీకటిలో బతుకు. ఉల్లిగడ్డలో ఎన్ని పొరలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకోవలసిన విషయాలు కూడా అదే పద్ధతిలో పొరలు పొరలుగా దాగి ఉంటాయి. తెలుసుకుంటే కలిగే ఆనందం వేరు. తెలియకుండా బతకడం అది మరో తీరు.

ప్రశ్న అడిగాము, జవాబు కూడా దొరికింది. కొన్నిసార్లు ఒకే ప్రశ్నకు రకరకాల జవాబులు దొరుకుతాయి. అందులో మరి ఏ జవాబును అంగీకరించాలి, ఏ జవాబు గురించి మరింత లోతుగా పరిశీలించాలి అన్నది అసలైన చిక్కు. వచ్చిన జవాబు నిక్కచ్చితనం గురించి తెలుసుకోగలగడం, అసలు సిసలైన తెలివి. తగిన సాక్ష్యాలను, ఆధారాలను వెతికి అర్థం చేసుకోవడం చాలా గొప్ప తెలివి. ప్రతి విషయం గురించి అనుమాన పడుతుంటే అది సరైన పరిస్థితి కాదేమో అని అనుమానం రావచ్చు. కానీ ఎదురైన విషయాలను అన్నింటిని తలవంచి అంగీకరించడం మాత్రం తగిన పద్ధతి కానే కాదు. ఈ రకంగా ముందుకు సాగడం బహుశా అనుకొన్నంత సులభం కాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రశ్నలకు జవాబు దొరకకపోవచ్చు. అలాగని ప్రశ్నలు అడగకుండా ఉండడం మాత్రం తగిన పద్ధతి కాదు.

ప్రపంచం గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్న విషయాలనే వాటి లక్షణాలను బట్టి రకరకాల శాఖలుగా విభజించి మొత్తాన్ని కలిపి సైన్స్ అన్నారని ఇప్పటికైనా అర్థం అయితే మనం మరింత ముందుకు సాగవచ్చు. సైన్స్ కానిది ఏదీ లేదు. ఏం ఉన్నా, ఏం జరిగినా, జరగబోతున్నా అంతా ఒక అవగాహన ప్రకారం జరుగుతుంది.. ఆ అవగాహనకే సైన్స్ అని పేరు. మనిషి మొదటి నాటి నుంచి గాలి గురించి, నీరు గురించి, నేల గురించి మరిన్నింటినో గురించి మహత్తరమైన సమాచారాన్ని సేకరిస్తూ సాగాడు. ఆ మొత్తం సమాచారం క్షణంలో మనకర్థం కావాలంటే కుదిరే పద్ధతి కాదు. అలాగని అది అవసరం లేదు అనుకుంటే కూడా కుదరదు. ప్రతి అంశం గురించి ప్రతి ఒక్కరికి కొంతైనా తెలిసి ఉండాలి. అప్పుడు కొన్ని అంశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా అర్థమవుతాయి. ఆకాశం వేరు, నేల వేరు. కానీ వాటి మధ్య సంబంధం మాత్రం తప్పకుండా ఉంది. ఆ రెంటికి మధ్యన ఎన్నో అంశాలు ఉన్నాయి. వాతావరణం అంటే చుట్టూ ఉన్న గాలి అని సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ వాతావరణం అంత సులభమైన విషయం కాదు. దానిమీద నేల ప్రభావం, సుదూరంగా ఉన్న సూర్యుని ప్రభావం, నక్షత్రాల ప్రభావం, మరెన్నో ప్రభావాలు ఉంటాయి. ఒక్కసారి ఈ విషయం గురించి లోతుగా ఆలోచిస్తే సైన్స్ విస్తరణ సులభంగా అర్థమవుతుంది.

ప్రపంచమంతా, విశ్వమంతా రసాయనాల మయం. ఆ రసాయనాలు రకరకాల రూపాలలో ఉంటాయి. ఒకదానితో ఒకటి రకరకాలుగా కలుస్తుంటాయి. మారుతుంటాయి. మార్చుతుంటాయి. ఈ జరిగే చర్యకు ఒక పద్ధతి ఉంటుంది.

ఏదో ఒక్క విషయాన్ని ఎంచుకున్నా సరే దాన్ని గురించి లోతుగా తెలుసుకోవడానికి జీవితకాలం పడుతుంది. అటువంటిది ఉన్న ఇన్ని రకాల సంగతులను గురించి తెలుసుకోవడం సులభంగా వీలవుతుందా? కాదు అని వేరుగా చెప్పనవసరం లేదు. కనుక ఏదో కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకుందాము అంటే కూడా అది పద్ధతి కాదు.

సైన్స్ నిజానికి మ్యాజిక్ లాగా కనపడవచ్చు. కొన్ని మార్పులు అనుకోకుండా జరుగుతాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి. వాటి గురించి అడిగితే సైన్సును పట్టించుకునే వాళ్ళు సంతోషంగా వివరాలను అందజేస్తారు. అదే మాంత్రికుడిని రూపాయలు ఎలా సృష్టించావు అని అడిగితే నవ్వి ఊరుకుంటాడు తప్ప జవాబు చెప్పడు. అంటే అక్కడ ఏదో అర్థం కాని అంశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అతను వివరించేపితే మరునాడు అతని ప్రదర్శన ఎవరూ చూడరు. అందులో మన కంటికి కనిపించని కిటుకు ఏదో ఉంటేనే అది ఇంద్రజాలం అనే మ్యాజిక్. సైన్స్ లో మాత్రం కనిపించినా, కనిపించకుండా కనీసం అవగాహనకు రాగలిగిన పద్ధతులు మాత్రమే ఉంటాయి.. ఈ తేడా మనం తెలుసుకోవాలి.

నాకైతే మరి మ్యాజిక్ లో సైన్స్ ఉందా అన్న ప్రశ్న కూడా పుట్టింది. తప్పకుండా ఉండి ఉంటుంది అని కూడా తోచింది. ఆ సంగతి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మ్యాజిక్ రహస్యం బయటపడుతుంది. పట్టించుకోకుండా ఉన్నంతవరకు అది మంత్రజాలం. వివరం తెలుసుకుంటే చేతి ఒడుపు, కనుకట్టు. అంటే లేనిది కనిపించేట్టు చేసే ఒక పద్ధతి. ఉన్నది మరొక రకంగా కనిపించేట్టు చేసే పద్ధతి. ఆ పద్ధతి వాళ్ళ దగ్గరే ఉంటుంది.

సైన్స్ మాత్రం అందరి దగ్గర ఉంటుంది. ప్రశ్నిస్తే జవాబు రూపంలో అది మన దగ్గర ఉంటుంది.