Friday, July 17, 2026

లోకాభిరామం : ఏకాంతమూ - ప్రశాంతమూ


ఏకాంతమూ... ప్రశాంతమూ...

ఈ ప్రశాంత ఏకాంత సాయంత్రంలో నిదురించు జహాపనా అంటాడు కవి. సాయంత్రం బాగుందట. అంత చక్కటి సాయంత్రంలో ఏకాంతం కూడా దొరికిందట. అయితే మరి అప్పుడు పడుకోవడంలో అర్ధం ఏమిటి? నాకు అర్ధం కాలేదు. ఏకాంతంలో మన వ్యక్తిత్వం నిస్సందేహంగా బయట పడుతుంది అంటాడు తాత్వికుడు. గాలిబ్‌ తన కవితలో ఒక చోట, దిక్కు తెలియని ఏదో ఒక చోటి నుంచి కొత్త ఆలోచన వచ్చేస్తుంది, గాలిబ్‌ కేవలం ఆ భావనలను కాగితం మీద పెడతాడు, అంటాడు. అంటే ఆలోచనలు తమవి కావు అంటున్నాడు అతను. ఏకాంతంలో ఉంటే మనిషి మనసు రెండు అంతస్తుల్లో పనిచేస్తుంది. ఒకటి మనకు తెలియకుండానే కొత్త ఎత్తులకు ఎదుగుతుంది. నాకు ప్రతినిత్యం రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర రాదు. ఏదో ఒక  అంశాన్నితీసుకుని ఆలోచన మొదలవుతుంది. చాలా సందర్భాలలో అది ఉపన్యాసంగా మారుతుంది. నాకు నేనే ఉపన్యాసం చేసుకుంటాను. అందులో అనుకోకుండా కొన్ని కొత్త ఆలోచనలు కనబడతాయి. చటుక్కున లేచి, లైట్‌ వేసి, మాటలు కాగితం మీద రాసి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాలిబ్‌ అనుభవమే ఇక్కడ నాకు కూడా కలుగుతున్నట్టు అర్ధం కదా. తన కవితలకు కావలసిన భావనలు ఒంటరితనంలో వచ్చాయని ఆయన భావించాడు. అంతుపట్టని సృజనాత్మకతలోనుంచి, ఆలోచనలోనుంచి, అవి కొత్తగా తలెత్తాయి. రచయితలకు చాలామందికి రాతకు కూర్చునే ముందు కొన్ని పరిస్థితులు అవసరం అనుకుంటారు. నాకు కూడా కొంతవరకు అవసరాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఏకాంతం కావాలి. కనీసం నిశ్శబ్దం కావాలి.

చిన్నప్పటి నుంచి నేను రాస్తుంటే, మా ఇంట్లో వాళ్ళు గోల చేయకుండా ఉండడం నాకు మొదటి నుంచి అలవాటు. పిల్లలకు కూడా నా సంగతి అర్థమయింది. ఏకాంతం కావాలి నిజమే. కానీ అది అనుకుంటే దొరికేది కాదు. దొరికినప్పుడు దాన్ని అనుభవించడం కూడా వీలు కాదు. మనిషి సంఘజీవి అని చాలా సులభంగా చెప్పేస్తారు. కానీ ఈ సంఘం మనిషిని తన మానాన తాను ఉండనివ్వదు. అందరూ కలిసి అర్ధం లేని కొన్ని ఆచారాలను తయారుచేసి అందరి తలకు చుట్టూ చుడతారు. కనుకనే అంత గోలలోనూ కవి, రచయిత ఏకాంతాన్ని కోరుకుంటాడు. గాలిబ్‌ కు ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయి? అందరికీ అది వీలవుతుందా?

నేను రేడియోలో ఉద్యోగం చేశాను. అక్కడ సమయాన్ని బట్టి తప్పకుండా రాయవలిసిందే. కార్యక్రమాలు చేయవలసిందే. నాకు మూడ్‌ లేదు, ఏకాంతం అంతకంటే లేదు, కనుక నేను రాయలేను, అని కూర్చుంటే ఉద్యోగం ఉట్టికి ఎక్కుతుంది. కనుక అవసరం కొద్దీ రాయడం అలవాటయింది. అయితే ఆ రాత వ్యక్తిగతంగా ఉండదు. అంత గొప్పగా కూడా ఉండనే ఉండదు. అక్కడి పరిస్థితులకు అది సరిపోతుంది. అంతేగాని నిజమైన భావుకతలో నుంచి, నిజమైన సృజనాత్మకత లోనించి, నిజమైన మార్మికత లోనుంచి మాటలు పలకాలంటే ఏకాంతం చాలా అవసరం.

ఒంటరితనాన్ని ఎవరికి వాళ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇరువురము కలిసి ఒంటరిగా నడుచుచు సాగితిమి అన్న పద్ధతిలో అందరి మధ్యలోను ఏకాంతాన్ని అనుభవించగలగాలి. అప్పుడు గాలిబ్‌ తీరుగానే కలం పట్టుకున్న ఎవరికైనా కాస్తంత తెలివి సులభంగా ముందుకు సాగుతుంది. కనుకనే ఏకాంతం రచయితలకు అసలైన అవసరం అంటాడు ఒక మహానుభావుడు. ఆయన అనుభవం కొద్ది ఆ మాట చెప్పినట్టు ఉన్నాడు చాలామందికి ఒంటరితనం నచ్చదు. నాకు ఒంటరితనం నచ్చుతుంది కానీ మరీ ఒంటరిగా ఉంటే అదేదో ఒక రకమయిన ఒంటరితనం మొదలవుతుంది. మనుషులు ఉండాలి. నా దగ్గర ఉండకూడదు. మనుషులు ఉండాలి, వాళ్లు మాట్లాడకూడదు. మనుషులు నన్ను పలకరించ కూడదు. నేను కూడా వాళ్ళను పలకరించను. మనుషులు ఉండాలి. తలుపులు అన్నీ మూసుకున్నా సరే ఏదో ఒక కిటికీ తెరిచి ఉంచు. ప్రపంచాన్ని నీ దగ్గరకు వస్తానంటే ఆపకు. అంటూ ఎప్పుడో ఒకసారి కవిత రాసుకున్నాను. బతుకంతా ఒంటరిగా ఉండనవసరం లేదు. దినంలో కనీసం కొన్ని గంటలు ఏకాకిగా ఉండగలగాలి. నాకు ఉద్యోగం చేసుకున్నంత కాలం ఈ అవకాశం కలగలేదు. కావాలనే ఉద్యోగం మానుకున్నాను. ఆ తరువాత ఒంటరితనమే ఒంటరితనం. ఇంట్లో వాళ్ళంతా పొద్దున్నే ఎవరి దారిన వాళ్లు పోతారు. పనిలేని వాడిని కనుక నేను ఇంట్లో మిగులుతాను. బూజులు చూస్తూ, పగుళ్లు లెక్కిస్తూ, ఆవులింతలు తీస్తూ రోజులు గడపవలసిన అవసరం లేదు. అందరూ వెళ్ళిపోయిన మరుక్షణం నా ప్రపంచం పరుచుకుంటుంది. నా పుస్తకాలు బయటికి వస్తాయి. నా కాగితం, కలాలు నాట్యం చేస్తాయి. నా చేత పిల్లి మొగ్గలు వేస్తాయి. రకరకాల రచనలు బయట పడతాయి. కనుకనే చూస్తుండగానే నేను రాసిన పుస్తకాలు తామరతంపరగా సెరిగి మూడంకెలకు చేరుకునే పరిస్థితి వచ్చింది.

అందరికీ ఏకాంతం ఇంత సులభంగా దొరకదు. చాలామందికి ప్రయత్నించినా సరే ఒంటరితనం దొరకదు. ఈ సంగతి నాకు తెలుసు. ఇంటికి తాళం వేయాలని నాకు కోపంగా వుండేది. తిరిగి వచ్చిన తర్వాత తాళం తీయాలని పిచ్చి కోపం వచ్చేది. కానీ సంవత్సరం దాకా ఇంటికి తాళం వేయవలసిన అవసరం లేకుండా పోయినప్పుడు నాకు తాళం గురించి, ఒంటరి తనం గురించి, అందులోని సౌకర్యం గురించి అర్ధం అయింది. అయితే అందరూ నాలాగే ఏకాంతం కోరుకునే వారు కారని కూడా నాకు అర్ధం అయింది. ఏకాంతం మనిషిని మార్చేస్తుంది. మనిషికి కొత్త దారులు చూపిస్తుంది. నేను టైనింగ్‌ క్లాసులో ఒక కథ చెబుతూ ఉండేవాడిని.

ఇద్దరు మిత్రులు ఒంటరితనం గురించి పందెం వేసుకున్నారు. వారిలో ఒకతను ధనికుడు. రెండో మనిషి మామూలు వాడు. మామూలు మనిషి, నేను ఎంతకాలమైనా ప్రపంచంతో పనిలేకుండా ఫోన్‌ లు టీవీలు లేకుండా, పత్రికలు కూడా లేకుండా గడపగలను, తిండి ఉంటే చాలు, అన్నాడు. ధనికుడు ఊరి బయట నాకు ఒక ఇల్లు ఉంది. అందులో నీకు వసతి ఏర్పాటు చేస్తాను. కిటికీలో నుంచి ఎప్పటికప్పుడు నీకు తిండి నీళ్ళు అందుతాయి. అంతేతప్ప మనుషుల అలికిడి కూడా వినిపించదు. ఆరు నెలలు నీవు కనుక ఆ పద్ధతిలో మా ఇంట్లో ఒంటరిగా ఉన్నావంటే నా ఆస్తి సగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. బీద మనిషి సరే అన్నాడు. ముహూర్తం నిశ్చయమైంది. అతడిని ఇంట్లో పెట్టి తాళం వేశారు. తిండి అందుతున్నది కాలం సాగుతున్నది. ఎక్కడ ఏ తేడా రాలేదు. ఐదున్నర నెలలు గడిచాయి. ధనవంతునికి వణుకు మొదలైంది. సగం ఆస్తికి కాలం చెల్లింది అనుకున్నాడు. ఐదు రోజులు మిగిలాయి. అతను కావలసిన కాగితాలు తయారు చేయించాడు. మిత్రుడు ఇంతకాలంగా గడిపిన ఇంటి దగ్గరికి వెళ్లి దూరం నుంచి చూచి వచ్చాడు. ఎక్కడ ఏ తేడా లేదు. బయట ఒక వాచ్‌ మన్‌ ఉంటాడు. లోపలి మనిషి వచ్చి పిలిస్తే గనుక తలుపు తీయాలి అని అతనికి ఆదేశాలున్నాయి. బయటి వారి పేరున మాత్రం తాళాలు తీయకూడదు. చివరి రోజు వచ్చింది.

మరుసటి నాటి ఉదయం వెళ్లి చూస్తే తాళాలు వేసినవి వేసినట్టు కనుక ఉంటే, ఆ మనిషి లోపలే ఉంటే అస్తి సగం అతనికి అందించాలి. కాగితాలతో సహా పంతం వేసిన మిత్రుడు ఉదయం అక్కడికి చేరాడు. ఆశ్చర్యంగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే మిత్రుడు లేడు. వాచ్‌మన్ తో వాకబు చేస్తే అయ్యా, ఆయన తెల్లవారుజామున తలుపు తీయమన్నాడు. నేను తలుపు తీశాను. ఆయన ముఖంలో గొప్ప వెలుగు కనిపించింది. గడ్డం కూడా పెరిగి ఉంది. జుట్టంతా పెరిగి ఉంది. ఆయన మారు మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను తప్పు చేయలేదు కదా అన్నాడు అతను. లోపలికి వెళ్ళి వెతికారు. పందెం వేసిన మిత్రుడు ఉన్న గదిలో ఒక కాగితం దొరికింది.

ఇన్నాళ్లు ఏకాంతంగా ఉండి నాకు ప్రపంచం గురించి ఆలోచించే అవకాశం అందించావు. భవిష్యత్తు గురించి నాకు గొప్ప ప్రణాళికలు దొరికాయి. నీ డబ్బుతో నాకు పనిలేదు.నా మార్గాన వెళ్ళిపోతున్నాను. మిత్రమా, నీకు ధన్యవాదాలు, అని రాసి ఉంది. మనిషి మీద ఒంటరితనం ప్రభావం అలాగుంటుంది.

ఈ పెద్ద మనిషికి ఏకాంతంలో తన గురించి తనకు తెలిసిపోయింది. నిజానికి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త మాట పుట్టాలంటే మనసులో కావలసినంత ఏకాంతం ఉండాలి. మన మెదడులో కోట్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. అవి అనుక్షణం మిగతావాటితో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాయి. కనుక మెదడులో పెద్ద గోల ఉంటుంది. ఆ గోలలో ఒక కొత్త ఆలోచన వచ్చినా సరే కలగలిసి పోతుంది. జాతరలోని గందరగోళంలో కూడా ఎవరో మన పేరు పిలిస్తే వినిపించి నట్టు, మెదడులోని గందర గోళంలో కొత్త ఆలోచన బయటకు రావడానికి కొంత దారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఏకాంతం. ఇది సూర్యకాంతం, అయస్కాంతం కాదు. అసలు సిసలైన ఒంటరితనం. అందరి మధ్యనా కూడా అలవాటు చేసుకోవలసిన ఒంటరితనం. నాకు కుదిరింది అని అనిపిస్తున్నది. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? లేకుంటే చించి చూడండి!


 

Sunday, July 12, 2026

Poem of Ghalib in Urdu English and Telugu


Poem of Ghalib

in Urdu Fnglish and Telugu ( One about a place where he wanted to live and die)










 

Friday, July 10, 2026

సూక్ష్మప్రపంచం - మన శరీరం లోపల పైన సూక్ష్మజీవుల గురించి


సూక్ష్మప్రపంచం

            ఈ విశ్వం చాలా విశాలమయినది. దాని పొడవు, వెడల్పుల కొలతలు మన ఊహలకు కూడా అందవు. అందులో ఉన్న గెలాక్సీల సంఖ్య ఆలోచనలకు అందదు. లెక్కలేని ఆ గెలాక్సీలలో ఒక్కొక్క దాంట్లో లెక్కలేన్నని చుక్కలు అంటే నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో సూర్యుడు కూడా ఒకటి. ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో భూమి ఒకటి. ఆ భూమి మీద బిలియన్‌ల సంఖ్యలో జనం ఉన్నారు. అందులో మనం ఉన్నాము. ఈ లెక్కన చూస్తే విశ్వంలో మనం సూక్ష్మజీవులం. ఇక మన శరీరం మీద ట్రిలియన్‌ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయని విషయం తెలిసినవారు చెబుతున్నారు. అంటే అవి ఎంత చిన్నవో మనం ఊహించలేము అని అర్థం. వాటిని పట్టించుకునేవాళ్లు చాలా కాలంగానే కొందరు ఉన్నారు. లూయి పాశ్చర్ అనే పెద్దమనిషి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. సూక్ష్మజీవులను పరిశీలించడం అన్న విషయాన్ని ఒక ప్రత్యేకరంగంగా నిలబెట్టిన ఘనత అతనిది అనవచ్చు. ఒక భూతద్దం చేత పట్టుకుని కనిపించిన ప్రతి వస్తువును పరిశీలించేవాడట. తిండి పెడితే తినడంకన్నా పరిశీలన ముఖ్యం అనుకునే వాడు. పక్కింటి వాళ్లు భోజనానికి పిలిస్తే భూతద్దం పట్టుకుని వెళ్లే వాడు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు పిలవడం మానేశారు.

            సూక్ష్మజీవులు కనిపించవు, కనుక అవి లేవు, అనుకుంటే మనకన్నా అమాయకులు మరెవరూ ఉండరు. అవి మన మీద, చుట్టుపక్కల, ఎటుచూస్తే అటు, ఆలోచనకు అందని సంఖ్యలో అంతటా నిండి ఉన్నాయి. మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. సబ్బుపెట్టి వళ్లంతా తెగ తోముకొని వుండవచ్చు. మన వంటిమీద గుంపులు గుంపులుగా సెంటిమీటర్ చర్మానికి లక్షల సంఖ్యలో బాక్టీరియా ఉండనే ఉంటుంది. మన వంటినుంచి అంటే చర్మం నుంచి ప్రతి నిత్యం బిలియన్‌ల సంఖ్యలో పొలుసులు ఊడి పడుతుంటాయి. పాశ్చర్ లాగా బూతద్ధం పెట్టి చూచినా అవి కనిపించవు. కనిపిస్తే మన పడక మనకు నరకం లాగ కనిపిస్తుంది. ఈ పొలుసులను తింటూ సూక్ష్మజీవులు మన మీద కాపురం ఉంటాయి. అక్కడ వాటికి మనం వదిలిన పొట్టు మాత్రమే కాక రుచికరమయిన నూనెలు, లవణాలు, ఖనిజాలు కూడా దొరుకుతాయి. వాటికి కనుక రుచి తెలిసే పద్దతి ఉంటే మన వంటిమీద మంచి విందు దొరుకుతున్నది అని అర్థం. వంటినిండా రంధ్రాలు ఉన్నాయి. కావలసిన్నని పగుళ్లు ఉన్నాయి. వాటిలోనుంచి సూక్ష్మజీవులకు తిండి సరఫరా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మనకు తిండి అప్ప్పుడప్ప్పుడు దొరుకుతుంది. వాటికి మాత్రం ఎప్ప్పుడూ దొరుకుతుంది.

            విందు తింటూ బ్రతికే సూక్ష్మజీవులు చర్మంమీద మాత్రమే కాదు, శరీరం మొత్తంలో, లోపల, బయట కూడా అదే పద్దతిలో అంటే లెక్కించలేని సంఖ్యలో ఉన్నాయి. పేగుల్లోకి వెళితే పెద్ద సంఖ్యలో ఉండే బాక్టీరియా లేకుండా మనకు తిండి అరగదు, అన్నది మనం అత్యవసరంగా తెలుసుకోవలనిన సత్యం. ముక్కులోపల కావలసిన్నని సూక్ష్మజీవులు ఉన్నాయి. కనుగుడ్డు మీద ఉండే తేమలో అవి ఈదుతూ ఉంటాయి. దంతాలమీది పింగాణీ పొరలో రంధ్రాలు వేస్తూ ఉంటాయి.

            మనిషి జీర్ణాశయంలో వంద ట్రిలియన్‌లకు పైబడి బాక్టీరియా ఉన్నాయని లెక్క తేలింది. అందులో కనీసం నాలుగు వందల రకాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని చక్కెరలను అరిగిస్తాయి. కొన్ని పిండి పదార్థాలను పట్టించుకుంటాయి. మరికొన్ని మిగతా సూక్ష్మజీవుల మీద దాడి చేస్తాయి. కడుపులో అంటే పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ యించుమించు మనకు సాయం చేసేవే. అయితే ఏమి పని చేస్తాయని తెలుసుకోవడానికి వీలు కుదరని రకాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. అవి పేగుల్లో అలా మనకు తెలియకుండానే కలకాలం కాపురం ఉంటాయి. వాటికి అలా ఉండడం అనుకూలంగా ఉంటుంది.

            మానవుని శరీరంలో సుమారు పది క్వాడ్రిలియన్ కణాలు ఉంటాయని లెక్క తేల్చారు. ఇక తరువాతి వాక్యం వినాలంటే గుండె గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉండాలి. సగటు మానవుని శరీరంలో బాక్టీరియాల సంఖ్య  వంద క్వాడ్రిలియన్‌ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైక్రోబయాలజీ రంగంవారు మనిషిని, మనిషి అనే కన్నా మరేదో అంటే బాగుంటుంది అంటారు. మనిషిలో మనిషి కణాలకన్నా మైక్రోబ్స్ కణాలు పదిరెట్లు ఎక్కువ ఉన్నాయి మరి. మనిషిమీద సూక్ష్మజీవులు బతుకుతున్నాయా లేక వాటిమీద మనిషి బతుకుతున్నాడా? ఇటువంటి ప్రశ్నలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, విషయంగా తెలుసుకోవడానికి మనకు, కొంచెం ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అసలు విషయం ఒప్ప్పుకోవాలంటే, మన శరీరంలో శరీరంకన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి మధ్యన మనం కూడా ఉన్నాము.

            బాక్టీరియా అనగానే రోగాలు కలిగిస్తాయని అందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. చాలా తెలివిగా వాటిని మట్టు పెట్టడానికి మనం సబ్బులు, ఆంటీయోటిక్స్ వంటివి క£నుగొని, మనలను మనం కాపాడుకుంటున్నామని భ్రమ పడుతున్నాము. వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులను తొలగించుకుంటున్నాము అన్నది, నిజం. కానీ అంతకన్నా పెద్ద సంఖ్యలో బాక్టీరియాలను పెంచి పోషించుకుంటున్నాము అన్నది, అంతకన్నా పచ్చి నిజం. ఈ మాట కూడా కొంతవరకు నిజం కాదేమో అని అనుమానం. బాక్టీరియాలకు సమాజాలు లేవు. ఊళ్లు, నగరాలు £ట్టుకోవాలన్న ఆశ అంతకన్నా లేదు. అయినా అవి మన సౌరమండలం కొనసాగినంత కాలం ఉండి తీరతాయి. భూగ్రహం నిజానికి వాటి స్వంతం. అవి మన పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అంటే మనిషి జాతికన్నా ముందు ఉన్నాయి. ఈ మనిషిజాతి కనిపించకుండా పోయిన తర్వాత కూడా అవి ఉండి తీరతాయి. అవి దయతలచి మనలను ఉండనిస్తున్నాయి, కనుక కొంతకాలం ఇక్కడ మనం కూడా ఉంటాము. బిలియన్‌ల సంవత్సరాలుగా భూమిమీద రకరకాల సూక్ష్మజీవులు కొనసాగాయి. మన తరువాత కూడా మనిషి లేకున్నా, అవి ఉండి తీరతాయి. ఇక్కడ మనం ఒక్క విషయం లెక్కలోకి తీసుకోవాలి. మనం లేనప్పుడు సూక్ష్మజీవులు ఉన్నాయి, కానీ సూక్ష్మజీవులు లేనిదే, మనం అనే మనుషులం, ఒక్క రోజు కూడా బతకజాలము. మనం వదిలిన మురికిని వదిలించడానికి సూక్ష్మజీవుల మీద ఆధారపడుతున్నాము అన్న సంగతి చాలా మందికి తోచకపోవచ్చు. పడేసిన వస్తువులు, అది పాచి అన్నం కావచ్చు, పశువులు, జంతువుల శరీరాలు కావచ్చు. కుళ్లడం బాక్టీరియాల వల్లనే జరుగుతున్నది. కుళ్లకుంటే వ్యర్థ పదార్థాలన్నీ అలాగే ఉండి పోతాయి. కుళ్లితేనే అవి మట్టిìలో క£లుస్తాయి. ఆ రకంగా మట్టిసారం పెరుగుతుంది. మనకు తెలిసిన, తెలియని జీవులను, మొక్కలను కుళ్లించడం ద్వారా సూక్ష్మజీవులు పైమట్టిని హ్యూమస్‌గా మారుస్తున్నాయి. అట్లా మారినందుకే మట్టిలోకి పోషకపదార్థాలు మళ్లీ చేరుతున్నాయి. కనుకనే అదే పొలంలో అయినా మళ్లీ పంటలు పండుతున్నాయి.

            మంచినీళ్లు శుభ్రంగా ఉండాలని మనం రకరకాలుగా ఏర్పాట్లు చేస్తుంటాము. బాక్టీరియా కారణంగా నీటి నాణ్యత తగ్గుతుంది. కానీ బాక్టీరియా కారణంగానే మరొక పరిస్థితిలో పెద్ద ఎత్తున నీళ్లు పరిశుభ్రం అవుతున్నాయి కూడా. నీటిలో చేరిన వ్యర్థపదార్థాలను కుళ్లించినందుకే ఆ మకిలి అడుగుకు చేరుతుంది. పైన తేటనీళ్లను మనం త్రాగగలుగుతాము.

            పేగుల్లో ఉండే బాక్టీరియా మనకు అవసరమయిన వైటమిన్‌లను తయారు చేస్తాయి. మందుబిళ్లలు తెచ్చి మింగనవసరం లేకుండానే మనకు అవసరమయిన పోషకపదార్థాలు సూక్ష్మజీవుల వలన అందుతాయి అన్నమాట. మనం తిన్న తిండిని చక్కెరలుగా మాÂర్చేది సూక్ష్మజీవులే. బయటినుంచి వచ్చిన బాక్టీరియామీద లోపల ఉన్న రకాలు తెల్ల రక్తకణాలకన్నా ముందే పోరాటాన్ని మొదలు పెడతాయి. తిండి అరగడం, ఆరోగ్యం నిలబడడం సూక్ష్మజీవుల వల్ల జరుగుతున్నది. అంటే అవి మనకు ఎంత అవసరం అన్నది అర్థం అవుతుంది.

            వాతావరణంలో సూక్ష్మజీవుల పాత్ర గురించి చెప్పుకోవాలంటే, ఆశ్చర్యరకమయిన వివరాలను అంగీకరించడా నికి సిధ్ధంగా ఉండాలి. మనకు తెలిసి, మనచుట్టూ ఉన్న గాలిలో ఎక్కువగా ఉండే భాగం నత్రజని అనే వాయువు. సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని వాడుకొని, మాంసకృత్తులకు ఆధారమయిన అమైనో ఆమ్లాలను తయారు చేస్తాయి. డిఎన్ఏలో ఉండే భాగాలను కూడా సూక్ష్మజీవులే తయారుచేస్తాయి. ఇది మనకు నిజానికి అర్థంకాని అద్భుతం. అపార్థానికి గురయిన అమాయక జీవులు తెలియకుండానే మనకు చేస్తున్న పకారం ఇది. పరిశ్రమలో నత్రజని ఎరువులను తయారుచేయడానికి అయిదువందల డిగ్రీల సెల్సియస్ వేడిమి అవసరం అవుతుంది. ఒత్తిడికూడా చాలా ఎక్కువగా వాడవలసి ఉండుంది. సూక్ష్మజీవులు మాత్రం ఈ చిక్కులేవీ లేకుండానే, మనకు కావలసిన పదార్థాలను తయారు చేసిపెడతాయి. కంటికి కనపడకుండా జరుగుతున్న ఈ ఉత్పత్తి కార్యక్రమం వల్లనే చిన్ననుండి పెద్ద జీవులన్నీ బతుకు కొనసాగించ గలుగుతున్నాయి.

            విశ్వంలో మానవులనే మనం ఉండి, మనకు మనం కూడా ఉపకారం చేసుకోలేక పోతున్నాము. మెదడు అంటూ ఒకటి ఉంది కనుక, మనం ఎందుకు ఉన్నాము, అని ప్రశ్నలు అడుగుతున్నాము. జవాబు దొరకక అసంతృప్తితో బ్రతుకు కొనసాగిస్తున్నాము. మనం రాకముందే భూమిమీద మనుగడ కొనసాగిస్తున్న సూక్ష్మజీవులు మాత్రం, కొత్తగా వచ్చిన మనలను ఈసడించకుండా ఉపకారం చేయడం నేర్చుకున్నాయి. ఎందుకు అని ప్రశ్న వేసుకోలేదు. చేతనయింది కనుక తమకు తెలిసిన పనిని చేస్తున్నాయి. మనకు మాత్రం మంచితనం మనసులోకి కూడా రాదు. ఒకవేలు ఎత్తి ఒకరిని అనేముందు, మిగతా మూడువేళ్ల గురించి పట్టించుకోవలసిన పరిస్థితి సూక్ష్మజీవుల విషయంలో ముమ్మాటికి నిజం.


 

Monday, July 6, 2026

సిమెంట్ సంతతి : నగ్నముని విలోమ కథలు నుంచి.


సిమెంట్ సంతతి

నగ్నముని విలోమ కథలు నుంచి.

లోకంలో వయసు వచ్చిన అందరు ఆడపిల్లలకు మల్లెనే ఆ పిల్ల కూడా మొదట్లో మంచుతో నేసిన జలతారు ముసుగు, మొహం మీదకు లాక్కుని, రేకు విడవడానికి కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా ఉండేది. కాళ్లలో లేళ్లు గంతులేసేవి. కనురెప్పల్ని కలలు కమ్ముకునేవి. కాళ్లూ, చేతులూ, ప్రతి అవయవం యవ్వన పరిమళపు సెలయేళ్లుగా తుళ్లి పడేవి. పెదవుల మీద వెన్నెల ఒలికి, పలువరసను పలకరించి, ఒంటిలో ఇంకిపోయేది.

నడిస్తే, నడుస్తున్న హారతిలా ఉండేది.

ఆ పిల్ల తండ్రి కాళ్లూ, చేతులూ మెదడూ ఎప్పుడూ ఎక్కడో పన్జేస్తుండేవి. అర్ధ రాత్తుళ్లు బగ్గుమని చివరి మంట మండే లాంతర్లాంటి కళ్ళతో యింటికి చేరేవాడు. కుష్టువ్యాధి వ్యాపించిన వాడిలాగా దరిద్రంతో తీసుకుంటుండేవాడు. దరిద్రం క్రమంగా అతని అన్ని అవయవాల్ని తినేస్తోంది. నెమ్మదిగా నెమ్మదిగా ఇంటి గోడలకి, యింట్లోనే యితర వస్తువులకి, మనుషులకి వ్యాపిస్తోంది ఆ వ్యాధి.

తల్లి వంటింటి అలుగ్గుడ్డ. ఎడతెరిపి లేని దగ్గుగా మారి, చింకి చాప మీద ముణగదీసుకునుండేది. అర్ధరాత్రి మసిబారిన లాంతరు కళ్ళతో, సగం సగం అవయవాల్తో యింటికొచ్చే కట్టెతో కాపరం చేసేది.

వీధిలోని పెంటకుప్పకీ, యింటికీ పెద్ద తేడా లేదు. పెంటకుప్ప మీద గులాబీ మొక్కలాగా ఆ పిల్ల తనని తాను చూసుకునే లోపల ఎదిగిపోయింది.

అవయవాలన్నీ అందమైన పువ్వుల్లోకి మారిపోయినై. కుండీలో పెడతానని, మేకలు తినెయ్యకుండా కాపలా కాస్తానని, అంటుకట్టి మరిన్ని అందమైన రంగురంగుల పూలు పూయిస్తానని, పుస్తకాల్లోంచి, పక్క వీధిలోంచి ఎగిరేచ్చాడో కుర్రవాడు.

వాడి మాటల్లో మత్తు పానీయాలున్నాయ్.

వాడి కళ్ళలో గురితప్పని పూల బాణాలున్నాయ్.

వాడి నిట్టూర్పుల్లో మధురంగా బంధించే లతలున్నాయ్.

వాడి చొక్కాకి గలగలలాడే జేబుంది.

వాడి ఒంట్లో సలసల కాగే రక్త సరసుంది.

వాడి చేతిలో గుండెల్ని సుతిమెత్తగా తెరిచే రహస్య తాళం చెవి వుంది.

అనుమతివ్వాలో లేదో తేల్చుకోకముందే ఆమె గుండెను తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నాడు వాడు. రోజులు అగరొత్తులుగా వెలిగినయ్.

వాగ్దానాల ఊసులు దవనపు వాసనలైనై.

సెలవులయి పోయినయ్.

వొచ్చినంత వేగంతో తిరిగి దూరపు కాలేజీ పుస్తకాల్లోకి పారిపోయాడు వాడు.

వెళిపోయేప్పుడు కిటికీలు ముయ్యలేదు. తలుపు దగ్గరికయినా వెయ్యలేదు. కలలు కళ్ళని కమ్మేస్తే గుండెని బార్లా తెరిచి, గాయం చేసి వెళ్ళిపోయాడు.

గుమ్మం దగ్గరే మొక్కగా వుండగానే మానైపోయి వాడి కోసం రెప్పలు పీకేసిన కళ్ళతో వెతికింది ఆ పిల్ల.

ఆ తరువాత ఆ గుమ్మం దగ్గరకి రకరకాల తాళాల వ్యాపారులొచ్చారు. వాళ్లంతా తాళాల దొంగలే తప్ప గుండె చప్పుడు వినగలిగిన వాళ్ళు కాదు. కొందరు పాత తాళాలకి కొత్త తాళాలు అమ్మేవాళ్ళయితే మరికొందరు కొత్త తాళాల్ని త్వరితంగా తుప్పుతాళాలుగా మార్చేసేవాళ్లే. ఆ యినప వ్యాపారులందరికీ ఇనప బీరువాలు తెరవగలిగిన తాళాలు కావాలి. అంతే.

వాళ్లంతా అనేక జంతువులని వెంట తీసుకొచ్చేవారు. అవి మానవ భాషలో తెగ అరిచేవీ, కరిచేవీ. తండ్రీ కొడుకులూ, అన్నదమ్ములూ, మామ అల్లుళ్లు, బావ, బావమరుదులు, రకరకాలైన జంతువులొచ్చేవి. ఒకడు బొజ్జతో ఖద్దరు వాసన కొడతాడు. మరొకడు కాంట్రాక్టుల వాసన వేస్తాడు. ఒకడు కాసేపు దేహంలోకి వుమ్మూసి బస్సెక్కో, రిక్షా ఎక్కో పాపం చేసినవాళ్ళా పారిపోతాడు. మరొకడు రాత్రంతా కాండ్రించి వూసి తెలతెలవాడుతుండగా మళ్లీ మామూలు ముఖం తగిలించుకుని జారుకుంటాడు. అందరి చర్మపుభాషా ఒకటే. ఒక్కడూ గుండె చప్పుడు వినడు.

ఉమ్ముల దారిలో చర్మం బీటలు వారుతోంది. శరీర వృక్షం బెరడు, పెళ్లులుగా రాలుతోంది. అయినా ఆశ చావదు. వాడెప్పుడో యీ దారంట వస్తాడు. పశ్చాత్తాప్పడతాడు. మనసులో తిరిగి మరులు పూయిస్తాడు. ఇల్లూ, పిల్లలూ చల్లని సంసారంతో సన్నజాజి పందిరి వేస్తాడు. వాడి కోసం రోడ్డుమీద మొహాలు చూడ్డం, వీలున్నప్పుడల్లా వీధులంట తిరగడం, పార్కులో మూల కూర్చుని రావడం మానలేదు ఆమె.

ఒక రోజున పార్కులోనే చాలా రాత్రి అయిపోయింది. రెండ్రోజుల్నుంచీ తిండి లేదు. నీర్సంగా ఉంది. ఇంటికి పోదామని లేచేసరికి వర్షం మొదలయింది. పరుగెత్తుకెళ్ళి పార్కులోనే మూల షెడ్డు లాంటిదుంటే అందులోకి జేరింది. అప్పటికే ఒంటిమీద బట్ట లాంటిది తడిసింది. మెరుపుల్తో వాన పెరుగుతోంది. కింద నాపరాయి, పైన రేకులు, జల్లు మీదకి చిందడం లేదు, కాస్త పర్వాలేదని ముణగదీసుకుని మూలకు జేరబడింది. ఎవరూ దరిదాపులో లేరు. దూరపు గుడ్డి లైట్ వెల్తురు. వర్షం. తన పక్కనే మెరుపుల్లో చూస్తే ఎవడో ఒకడు పడుకున్నట్లు కనబడింది. పరకాయించి చూసింది. మళ్లీ మెరుపులో చూసినప్పుడు అంత విషాదంలోనూ నవ్వొచ్చింది.

అది ఆ వూరుని ఒకప్పుడు ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలిన ఒక గొప్ప రాజకీయ నాయకుడి విగ్రహం. బతికుండగా ఆయన అనేక పదవులు అలంకరించాడు. చేతికి ఎముకల్లేవన్నారు. శ్రీమహావిష్ణువే సాక్షాత్తు యీయన రూపంలో ప్రజాసేవ నిమిత్తం అవతరించా డన్నారు. పేదల పాలిటి పెన్నిధి అన్నారు. సంఘసంస్కర్త అన్నారు.ఒకప్పుడు పార్కు మధ్యన తిన్నె మీద రాజసంగా నుంచుని నీరాజనాలు అందుకున్నదా విగ్రహం. ఇప్పుడు ప్రత్యర్థులు పదవిలో కొచ్చాక షెడ్డులో పడుంది.

ఆ సిమెంట్ విగ్రహాన్ని ఆనుకుని గోడకి చేరగిలబడిందామె. ఎప్పుడు పట్టిందో నిద్ర. వర్షం పడుతూనే వుంది. శరీరం నేల మీద మూలకి ముణగదీసుకుని తుఫానులో చెట్టులాగా వాలిపోయింది. కమ్మటి నిద్ర పట్టేసింది. పాత కల.

నిద్రలోనే వాడితో గడిపిననాటి కల దుప్పటిగా కప్పుకుంది.

అమాయకపు జంతువు మొహంతో వాడు వచ్చాడు. తలుపు తట్టాడు.

పశ్చాత్తాప్పడ్డాడు. క్షమించమన్నాడు.

తిరిగి గుండె తాళం తెరిచాడు. బలంగా, బరువుగా మాటల మత్తు వాసనల్తో యింటి నిండా వసంతం నింపాడు. వాడి కౌగిట్లో కళ్ళు మూసింది. ఆవేశంలో కొట్టుకుపోయింది. అలిసిపోయి ఒడ్డుకుజేరి పడిపోయింది.

వర్షం పెద్దదైంది. గులకరాళ్ళతో బాధడం మొదలెట్టిందల్లా క్రమంగా ఆకాశంలోని బండరాళ్లని దొర్లిస్తున్నట్లు మారిపోయింది. కసిగా నీటి ఖడ్గం గాలిని కోస్తోంది. భూమిని తరుముతోంది. ఎక్కడో పిడుగు పడింది. ఆ పిడుగు ఆమె మూసిన కనురెప్పల మీద పడింది. ఆమె గుండెల్లో పడింది. ఆమె కల మీద పడింది. ఆమెకి చప్పున మెలకువొచ్చింది. వెల్లకిలా పడుకున్నదల్లా వెంటనే లేవాలని ప్రయత్నించింది. లేవలేకపోయింది. ఒంట్లో సత్తువనంతా కూడా తీసుకుని లేవాలని ప్రయత్నించింది. కానీ, లేవలేకపోయింది. తన మీద ఏదో బరువుగా పడుకునుంది. దుంగలా పడుంది. రాతిబండలా కదలనివ్వకుండా మెదలనివ్వకుండా పడివుంది. భూమిలోకి అదుముతున్నట్లనిపిస్తున్నది. ఒక్కసారి ఖణేల్మన్న మెరుపులో ఆమెకి తానెక్కడవుందో, తనమీద ఏమి పడివుందో కనబడింది. తన శరీరంలోని అణువుల శక్తినంతటినీ కూడదీసి బలంగా తనపైనున్న ఆ సిమెంటు శరీరాన్ని పక్కకు తోసేసి నిలబడింది. మరో మెరుపులో కిందకిచూసింది. సిమెంటు విగ్రహం. తనవంకే నవ్వుతూ చూస్తున్న రాజకీయ నాయకుడి విగ్రహం. తిరిగి సిమెంటు చేతులతో దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె వూడిపోయిన తన చీర ముక్కని ఒంటి చుట్టూ చుట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. తను కలలో జేరింది ఆ విగ్రహం కౌగిట్లోకా! విగ్రహం చేతులు వెకిలిగా నవ్వుతూ ఆమెను తిరిగి పొదుపుకోవడానికి ముందుకొస్తున్నయ్. ఆమెకి మతిబోయి, పరుగెత్తుకుంటూ వర్షంలోనే బయటికి వచ్చి పడింది! కంగారులో దారి తప్పింది. ఎప్పటికో యింటికి జేరింది.

నెల తప్పింది.

కడుపులో సిమెంట్ బలంతో మరో మొక్క దేహం రాళ్ల మధ్య వేళ్లూనింది. మొక్కని పీకెయ్యలేకపోయింది.

ఆకాశం పొట్టచిరిగి పేగులుబయట పడ్డట్లు మెరుపులు.

దేహంపై నిరంతరం కురిసే మురికి వాన. లోకపు స్మశానం నిండా కంకాళాల్లా పెరిగిపోతున్న తాళపు చెవులు. ముఖాల్లో అడవి జంతువుల హాహాకారాలు. అయినా, ఆమెలో ఆశ చావలేదు. వాడెప్పుడో వస్తాడు. గాయాలు కడుగుతాడు. గుండెదగ్గర తిరిగి ప్రేమ పిల్లనగ్రోవి నూగుతాడు.

మరో గులాబీ మొక్క పెంట పోగులు ఎదుగుతోంది. వెయ్యి రేకల్తో వికసించబోతోంది. సిమెంటు చేతుల్లోకి, కాళ్ళ కిందకి, ప్రతి మురికి అవయం కిందకీ జేరి అణిగిపోబోతోంది.

రాజకీయ నాయక జంతువులు బతికి వున్నప్పుడే గాక, చచ్చి విగ్రహాలుగా మారి కూడా ప్రజల భవిష్యత్తుని విషయిస్తూనే వుంటారు. తమ సంతతిని పెంచుకుంటూనే వుంటారు.

సృష్టికి సిగ్గు లేదు.