Lokabhiramam
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Wednesday, December 17, 2025
సలహాలు - సంప్రదింపులు : On Suggestions and discussions
సలహాలు - సంప్రదింపులు
సలహాలు - సంప్రదింపులు
పని బాగా జరుగుతున్నంత కాలం పక్కవారి గురించి ఆలోచన
కూడా రాదు. సమస్య ఎదురయితే మాత్రం, బాసునో, మరొకరినో సాయం అడగాలనిపిస్తుంది. సమస్యను మరొకరి
ముందు పెట్టడం వరకే మన పని అనుకుంటే, అక్కడితో మన పెరుగుదల ఆగిపోతుంది. పై అధికారులు
మనకు సహాయం చేయడానికే ఉన్నారు. మరి మన దగ్గరకు ఎవరైనా సమస్యతో వస్తే ఏం చెప్తాము? తెలుసుననుకుని సులభంగా ఒక సమాధానం చెప్పి పంపిస్తామా? మన సమస్యలన్నింటికీ బాసులు సమాధానం చెప్పి పంపుతున్నారా? నిజంగా అట్లా జరుగుతున్నదంటే, ఎక్కడో లోపం ఉందని అర్థం! బాసుకు ఏదో అనుమానం
వస్తుంది. అప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు సమాధానం చెపుతారు?
సమస్యను తెచ్చి మన ముందు పడేస్తే, ఆ పడేసిన వారి బాధ్యత ముగిసినట్లు కాదు. మనమయినా
సమస్యను మరొకరి ముందుకు నెట్టి, చేతులు దులుపుకోలేము. మనమయినా మరొకరయినా, సమస్యతో బాటు సలహాలను జోడించాలి. ‘మీరు చెప్పండి. మేము మీరు చెప్పినట్టు
చేస్తాం!’ అంటారు చాలామంది. మరి చెప్పవలసిన వారికి సమస్య ఎదురయితే ఎవరు చెప్పాలి.
ఏదో ఒకనాడు మనమూ ఆఫీసర్లవుతాము. బాసులవుతాము. ఇంట్లో పెద్దవాళ్లమవుతాము. బాధ్యత
అంతా మన తలకెక్కినప్పుడు బరువు తెలుస్తుంది. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? నా స్థానంలో మీరుంటే ‘ఈ విషయంలో ఏం చేయాలనుకుంటారు? మీరే ఏదో ఒకటి చెప్పండి!’ అనే బాసు మీద కోపగించుకునేవారు చాలామంది ఉంటారు.
నిర్ణయాలు వేరు, సలహాలు వేరు. ఏం చేయాలో చెపితే, అది నిర్ణయమవుతుంది. ఇలా చేయవచ్చునేమో, అని చెపితే అది సలహా. సమస్యను ఎస్కలేట్ చేసిన
వారు, అంటే పైవారి ముందు పెట్టిన వారు నిర్ణయం చేయలేకనే ఆపని చేస్తారు. నిర్ణయం
సరయిందన్న నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు. అప్పుడు చెప్పే తీరులో ఈ సంగతి చక్కగా
కనిపించాలి. ఇది సమస్య, ఇది నా నిర్ణయం అని చెప్పడం బాగుండదు. ఈ నిర్ణయం
బాగుంటుందని అనుకుంటున్నాను, అంటే, అది సలహాగా మారుతుంది. సంప్రదింపుల ద్వారా, సమస్యకు గల సమాధానాలను వీలయినన్ని ముందు ఉంచుకుని, వాటిని చర్చించి, ఒకటి, రెండింటిని ఎంచుకోవచ్చు. అమలు చేసి చూడవచ్చు.
సమస్యను ముందుంచిన వారే, నిర్ణయాన్ని సూచించడం అంతగా అలవాటు లేదు.
ఎందుకొచ్చిన బెడద అనుకుంటారు చాలామంది. బాసులకు కూడా సరైన అవగాహన లేకుంటే ‘ఇక
నేనెందుకు?’ అంటారు. ఇవి రెండూ తప్పు పద్ధతులే. సలహాలు, సంప్రదింపులు మాత్రమే సరయిన పద్ధతి. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ పద్ధతిని
పాటించవచ్చు. ఇంట్లో, మిత్రుల మధ్య కూడా ఈ పద్ధతిని పాటిస్తే, అందరికీ సంతృప్తిగా ఉంటుంది. ‘ఇడ్లీ తిందాం పదండి’ కన్నా ‘ఏం తిందాం?’ అన్నమాట బాగుంటుంది. అందరికీ తమ అభిప్రాయం చెప్పే వీలు కలుగుతుంది. చివరికి
ఎవరిమాట నెగ్గినా, సలహా ఇచ్చినా సంతృప్తి మిగులుతుంది. ఈ సంతృప్తి, మరింత ఆలోచించడానికి, బాధ్యతతో ప్రవర్తించడానికీ, అవసరమయిన బలాన్ని ఇస్తుంది. దీన్నే ఎంపవర్మెంట్ అంటారు.
నిర్ణయాలు చేసే శక్తి కాకున్నా, నిర్ణయాల వరకు చేరుకునే కార్యక్రమంలో భాగం ఉంటే
ఆ వ్యక్తులకు మానసిక బలం పెరుగుతుంది. అదే ఎంపవర్మెంట్. కూరలు కొనడం తనకు తెలియదు
అనుకుంటే జీవితమంతా తెలియకుండానే పోతుంది. కూరలు కొనడంలోని మెళకువలు అర్థం అయే
పరిస్థితిని కలిగిస్తే రేపు కూరలు కొనే బాధ్యతను పంచుకోవడానికి మనకే సాయం
దొరుకుతుంది. ఎందుకు తెలియదు? ఏం తెలియదు? ఏ రకం కూరల గురించి తెలియదు? లాంటి ప్రశ్నలడిగితే, మరో వ్యక్తికి ఎంపవర్మెంట్ జరుగుతుంది. అలాగని
ఎడ్డెం తెడ్డెం ప్రశ్నలడిగితే పని జరగదు. పైగా, ఆ మనుషులు మరింత కుంగిపోతారు. కొత్తగా
ఆలోచించడానికి దారితీసే ప్రశ్నలుండాలి. విషయం గురించి ఎదుటివారి ఆలోచనలు మరింత
పెరిగే రకంగా ప్రశ్నలు అడగాలి. ఇలాగే అడుగుతారు కూడా. మనకు ఆ సంగతి అర్థం కాకుంటే, ఆ ప్రశ్నలు ‘చొప్పదంటు ప్రశ్నలు’గా చికాకు ప్రశ్నలుగా కనిపించి, వినిపించి చికాకు కలుగుతుంది. అందుకే ఎవరైనా ప్రశ్నలు అడిగినా, మనం అడగవలసి వచ్చినా ఒక్క క్షణం ఆలోచించడం మంచిది. అప్పుడు విషయం మరింత
సులువుగా అర్థమవుతుంది. రెండువేపుల నుంచి చక్కని సలహాలు వస్తాయి. సమస్యకు సమాధానం
దొరుకుతుంది.
జాగ్రత్తగా గమనిస్తే, ఈ సందర్భంలోని ప్రశ్నలకు ఒక పద్ధతి ఉంటుంది.
వాటికి సూటిగా ఒక జవాబు ఉండదు. ‘ఎందుకు?’ ఎట్లా?’ ‘ఏమయి ఉండవచ్చు?’ లాటి ప్రశ్నలకు జవాబులు కేవలం అభిప్రాయాలు. అవి రకరకాలుగా ఉంటాయి. ఉండాలి
కూడా! సమస్య తెచ్చిన వారికి ఈ ప్రశ్నల కారణంగా, మరింత అవగాహన వీలవుతుంది. మరిన్ని జవాబులు
మెదడులో మెరుస్తాయి. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. జవాబు నేనే యిచ్చానన్న ధీమా
కలుగుతుంది. అసలిది సమస్యగా ఎందుకు కనిపించింది? అన్న అనుమానం కూడా రావచ్చు. కావలసింది కూడా అదే! ఈ ప్రపంచంలో ఏ సమస్యకూ, ఎవరివద్దా రెడీమేడ్ జవాబులు ఉండవు. ఉంటే, అసలివి సమస్యలు కావు! సరైన సమయంలో సరయిన
ప్రశ్నలు అడిగితే, సమస్య మబ్బులాగా విడిపోతుంది. అందరికీ నచ్చే
సమాధానాలు కనబడతాయి. అందరికీ నమ్మకం కలుగుతుంది. అది సలహా, సంప్రదింపులోని బలం!
బాసు మనలను అభిప్రాయం అడిగారంటే, మన తెలివిని, ఆలోచన శక్తిని వారు నమ్ముతున్నారని, గౌరవిస్తున్నారని అర్థం! అదే పద్ధతిని మనం కూడా మనవారిమీద, చివరకు పిల్లలమీద కూడా ప్రయోగించవచ్చు. అటువంటి ప్రశ్న ఎదురయిన మరుక్షణం మన
బాధ్యత పెరుగుతుంది. కనుక మరింత జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం మొదలవుతుంది.
సమస్యకు సమాధానం మననుంచి వస్తే అది అప్పటికప్పుడు కనిపించే విలువ, లాభం. ఇక ముందు ఈ రకం సందర్భాలలో కూడా ముందే ఆలోచించి, సలహాలతో కూడా ముందుకు సాగే నమ్మకం కలుగుతుంది. అది ఎప్పటికైనా పనికివచ్చే
మానసిక బలం. అది మరింత గొప్పలాభం!
అంతా నాకే తెలుసు, నీకేం అధికారం, అని మనం అనవచ్చు. మనమీదివారు మనల్ని అనవచ్చు! మనిషిని మానసికంగా కుంగదీయడానికి
అంతకన్నా కావలసింది లేదు! ఎవరికీ ఎవరికన్నా ఎక్కువ తెలియదు. నాలుగు తలలు ఒక చోట
చేరితే సలహాలు, సంప్రదింపులు సాగుతాయి. అది తెలివి!
Tuesday, December 16, 2025
Sunday, December 14, 2025
Lokabhiramam Kavita Na Kavita లోకాభిరామం - కవితా నా కవితా
లోకాభిరామం
కవితా నా కవితా!
కవితా నా కవితా
“సపట్ మలాం, ఐ కోల్డ్ లోషన్!’’ అంటాడు, ఉన్నట్టుండి చిన్న సురేందర్రెడ్డి. ఎమ్మెస్సీలో క్లాసులో మరో పెద్ద సురేందర్రెడ్డి
(ఆకారంలో కూడా) ఉండేవాడు గనుక తప్ప ఈ సురేంద్రుడు ఎవరికీ చిన్నగాడు! కొంత కాలానికి
అతను అప్రయత్నంగా ఆ మాట అన్న వెంటనే అందరూ గొల్లున నవ్వడం అలవాటయింది. ఎందుకో
తెలుసా? ఆ మాటలకు అర్థం లేదు. మెదడులో పేరుకుంటున్న
బరువును విదిలించడానికి, అతను ఆ మాటలంటాడు. సురేందర్, చార్మినార్ దగ్గర్లోని ఒక కాలేజీలో చదువుకున్నాడు. దారిలో ఒక గోడ మీద సపట్
మలాం, ఐ కోల్డ్ లోషన్ వ్యాపార ప్రకటన రాసి ఉండేది. ఆ
ప్రకటనలో మరే వివరాలూ ఉండవు. నలు చదరంగా సున్నం వేసి, దానిమీద పెద్ద నల్లని అక్షరాలతో ఈ రెండు మందుల పేర్లు రాసి ఉంటాయి! అంతే! ఆ
అక్షరాలు మనవాడి మనసు గోడలమీద నిలబడి, అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అనుకోకుండానే!
ఆలోచింపచేసే అక్షరాలు: ఒక మాట, పాట విన్నా, ఒక చక్కని బొమ్మను చూచినా (బొమ్మ అంటే సినిమా
అనే అర్థం కూడా వాడుకలో ఉండేది!) మనసు, మెదడు కొంచెం సేపు ఒకటయి పోవాలి. ఏమిటిది అన్న ప్రశ్న పుట్టి కాసేపు మనసును
కుదిపి, మరేదీ గుర్తురాకుండా పట్టి ఉంచాలి. అచ్చులో
వచ్చినది పత్రిక గానీ, పుస్తకం గానీ, కరపత్రం గానీ, అది కూడా అట్లాగే మనల్ని పట్టి కట్టేయాలి.
కాలక్షేపం కోసం చదువుతున్నామనుకున్న రచనల్లో కూడా ఎన్నో ఉత్తమమయినవి ఉంటాయి. బూతు
పత్రికలో కథ చదివి, ‘ఈ రచయిత తన రచనలను ఈ పత్రికకు ఎందుకు పంపి
ఉంటాడ’ని ఆలోచించడం గుర్తుంది. రాసింది నిజంగా బూతు కథ! (ఏది బూతు, ఏది కాదు అన్న అంశం గురించి చాలా చర్చ జరగవలసి ఉంది!) కాని, అందులో రచయిత ప్రదర్శించిన సృజన, ఒరిజినాలిటీ, మామూలు పత్రికల్లో రాసే చాలా మందిలో
కనిపించలేదు. అందుకనే నేను అంతసేపు, ఆయనను గురించి ఆలోచించాను. ఇంతకూ నేను బూతు పత్రికలు చదివానని మీకు అర్థమయింది
గదూ! ‘బజార్లో కూచుని బూతు పుస్తకం చదవడం ధైర్యమని అనుకున్నాను. తలుపులు వేసుకుని, గదిలో ఒంటిగాడిగా గడపడానికి ధైర్యం కావాలని తర్వాత అర్థమయింది’ అని
రాసుకున్నాను కూడా ఒకప్పుడు.
రచన-ఆలోచన: ఆలోచన లేకుండా రచన పుడుతుందా? కవిత్వం చెప్పడానికి ఏమిటి అవసరం అని కవిత రాస్తూ, శివుడుగా పిలవబడే శివారెడ్డిగారు, ఆలోచన ఉంటే చాలదా అంటారు. కవికి, కథకులకు కొంచెం ప్రేరణ, బోలెడంత ఆలోచన ఉంటే చాలు, రచన తన్నుకు వస్తుంది. బస్సు టికెట్టు వెనక, సిగరెట్టు పెట్టె చించి, దాని వెనుక మొదలు అది ప్రవాహమయి పారుతుంది.‘జల దంతావళ్ మస్తక స్థిత
ముక్తారాశిపై గూర్చుండి, యననీ రాగమునందొక కమ్మని గీతమ్మా లాపింప
గాంక్షింతు!’ అన్నాను ఒకప్పుడు. అవును మరి, అమరకోశం, శబ్దమంజరీ అన్నంలో నంచుకు తిని పెరిగిన
వాతావరణమాయె. ఈ మాటలన్నది నేనేనా? అనుకున్నాను గూడా! ఈ అక్షరాలను నేను దేని వెనకాలా రాసింది లేదు. కానీ ఇంత
కాలమయినా గుర్తుండిపోయాయి. ఆలోచనలకు తగిన సృజన, రచన ఎక్కడ కుదురుతుంది అన్నది ప్రశ్న. బడిలో గోడ పత్రిక పెట్టాలని
అనుకున్నారు. అందుకు పేరు వెతుక్కు రమ్మని నన్ను అడిగారు. మా చిన్నాయనగారు
పండితుడు, కవి, రచయిత. కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. ఆయనను సాయం అడిగాను. ఏడవ తరగతి నాటి
మాట! ఇంకా గుర్తున్నాయి. శేముషీ చకోర చంద్రిక, అనీ మనీషా సుమనోవల్లరి అని ఆయన సూచించిన పేర్లు. అవును మరి కప్పగంతుల వారి
శిష్యుడాయన. కానీ, బడిలో మాత్రం పత్రికకు విద్యా జ్యోతి అని పేరు
పెట్టారు!
నిప్పు-మంట: ఇంటి వాతావరణంలోనూ ఆధునికత కరువు! ఆ ప్రభావంలోనుంచి బయట పడడానికి
మాత్రం నేను బయటపడవలసి వచ్చింది. ‘నేను సముద్రాన్ని కాను, నేను నదిని కాను, నేను కనీసం వాగునూ బావిని కూడా కాను. ఒక చుక్క నీరు రాల్చీ రాల్చని మునిసిపాలిటీ కుళాయిని నేను’ అని రాశాను. మిత్రుడు
దేవరాజు మహారాజు కవితకు ‘ఆఫీసు’ అని శీర్షిక పెట్టాడు. అంతకు ముందు నేను పత్రికలకు
కవితలు పంపే ఉంటాను కానీ అవి అచ్చులో రావని తెలుసు! ఫీల్డ్వర్క్ పనిమీద బస్సులో
కరీంనగర్ జిల్లాకు పోతున్నాను. పక్కసీట్లో పెద్దమనిషి ఆంధ్రజ్యోతి వార పత్రిక
చదువుతున్నాడు. ఆ కాలంలో కథల మధ్యన బాక్సుకట్టి చిన్న కవితలు వేసేవారు. ఎందుకో
పక్కాయన చదువుతున్న పత్రికలోకి తొంగి చూసాను. నా కవిత! కింద నాపేరు! అప్పుడు నా
మానసిక పరిస్థితి ఇవాళ నాకు ఆలోచనకు అందడం లేదు. ఆయనను పలకరించి ‘ఇది నా కవిత
తెలుసా?’ అంటే నవ్వుతాడేమో? ఆ తర్వాత కూడా ఎవరికీ చెప్పినట్టు లేదు. కవిత అచ్చయిందని. అట్లాగే బస్సులోనే ఓ
కవిత రాయడం గుర్తుంది. బాగా చలిగా ఉంది. దొరికిన కాయితం వెనుక నాలుగు మాటలు
రాసుకున్నాను. ‘ఈ దేశం చలి నా ఎముకలను కొరికేస్తున్నది. అన్నా ఏదీ కొరివి? గుండెను మండిoచి చలి కాచుకుందాం!’ అని! ఈ కవిత ఎవరికీ పంపించలేదు. ఎక్కడా అచ్చు కాలేదు.
మనసులోనే ఉంది. అసలు కవిత, కథ మన పద్ధతి కాదని పీహెచ్డీ రోజుల్లోనే నిర్ణయించుకున్నాను. నాకా రోజు బాగా
గుర్తుంది. ఆదివారాలు జరిగే సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా శీలా వీర్రాజు గారితో
సభ జరిగింది. నాటినుంచి నేటికీ మిత్రులయిన కవులు, రచయితలు చంద్ర, దేవిప్రియ (సీనియర్స్) మొదలు నందిని సిధా
రెడ్డి, నాళేశ్వరం శంకరం లాంటి వారందరు ఉన్నారు.
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ, బస్టాపులో చెట్లకింద అరుగుల మీద మా చర్చాగోష్టి సాగింది. నన్ను పరిచయం చేస్తూ, ‘బడిoగ్ పోయెట్’ అన్నారెవరో. ‘ఎవర్ బడిoగ్ పోయెట్!’ అని జోక్ కూడా చేశారు. ‘కాదు నేను కవిత, కథ రాయదలుచుకోలేదు. మీరందరూ రాసేది చదువుతాను. మరేదయినా రాస్తాను. నేను వేరే
దారి వెతుక్కుంటాను. అందరిలో ఒకడిని కాదలుచుకోలేదు!’ అన్నాను కాస్త గర్వంగానే!
సైన్సు రాయడం మొదలుపెట్టాను!
తన్నుకు వస్తుందది!: ఇవాళటికీ నన్నెవరయినా రచయితగా పరిచయం చేస్తే ఆశ్చర్యంగా
ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కలం, మనసును కాస్త ఉండమని, కాగితాలను నలుపు చేస్తుంది. 1986లో ఒక దీర్ఘ రచన చేసాను. అదేమిటో నాకు తెలియదు.
నేను వేరేదో పనిలో ఉన్నప్పుడు మహారాజు వస్తే ఆ కాయితాలు అందించి, చదువుతూ ఉండమన్నాను. కొంచెం సేపు తర్వాత లేచి నిలబడ్డాడు. వెళ్లిపోవాలను
కుంటున్నాడేమో, నేనేమో పనిలో ఉన్నాననుకుని మీదికి
ప్రశ్నార్ధకంగా చూస్తే, ‘ఏం లేదు! నీకు నమస్తే పెడదమని లేచిన! మంచి కవిత
రాసినవు!’ అన్నాడు. ఆ కాగితాలను చదివిన మిత్రులు రచయిత కె.చిరంజీవి ‘కానీ, ఇందులో కాస్త కన్ఫ్యూజన్ ఉంది’ అన్నారు. మనసులోనే ‘శభాష్’ రాసింది దాని
గురించే గద అనుకున్నాను. రావూరి భరద్వాజ గారు ‘మామయ్యా ఒకరోజు కవితా స్రవంతిలో
దీన్ని మొత్తంగా చదువు!’ అన్నారు. నేను వద్దన్నాను. నెలనెలా వెన్నెల కృష్ణారావు
గారు ఆ పదకొండు పేజీల రచన తీసుకున్నారు. అందులోంచి ‘సంతకాలు’ పేరున కొన్ని
పంక్తులను ఆంధ్రప్రభ వీక్లీలో అచ్చువేయించారు. ఆ కాయితాలు నాకు తిరిగి మాత్రం
రాలేదు. 33 ఏళ్లు వచ్చినా ఏం చేస్తున్నానని అర్థం కాలేదు
అంటూ రాసిన ఆ రచన చిత్తు ప్రతి తర్వాత దొరికింది.
***
ఒకానొక వేద పండితుని ఇంట ఒక జీతగాడు (పాలేరు) ఉన్నాడు. సాయంత్రం గురువుగారు
పాఠం చెబుతుంటే, పక్కనే పశువుల పాకలో పనిచేస్తూ అతను వింటూ
ఉంటాడు. ఒకనాడు గురువుగారి దృష్టి మరెక్కడికో మళ్లి పాఠం ఆగింది. ఎక్కడ ఆగిందీ
ఆయనకు గుర్తు రావడం లేదు. జీతగాడు ఒక నల్లని వడ్లగింజను తెచ్చి గురువుగారి ముందు
నిలబడి, గోటితో దాన్ని గిల్లి పడేసి వెళ్లిపోయాడు.
గురువుగారు ఆశ్చర్యంగా చూచారు ‘కృష్ణానాం వ్రీహీణాం నఖ నిర్భిన్నం!’ పాఠం ముందుకు
సాగింది. ఆ మాటలను నోటితో చెప్పగూడదని, చేతితో చేసి చూపించాడు ఆ జీతగాడు!
***
మరో గురువుగారు పాఠం చెప్పాలి. కానీ పెంపుడు పిల్లి ‘మియ్యావ్’ అంటూ ఆయన
చుట్టే తిరుగుతుంది. పాఠం సాగనీయదు. గురువుగారు దాని కాలికి తాడు కట్టి దాన్ని
స్తంభానికి కడతారు. పాఠం సాగుతుంది. గురువుగారు ఒకసారి ఊరికి వెళ్లవలసి వచ్చింది.
సీనియర్ మోస్ట్ శిష్యుడు గారిని పాఠం సాగించమని చెప్పారు. పిల్లిని ఎందుకు
కడతారో తెలియని ఆ శిష్యుడు, పిల్లి వెంటబడి, పరిగెత్తుతున్నా పట్టుకుని స్తంభానికి కట్టి
పాఠం చెప్పాడు. అలా కథ సాగింది. తరువాత పండితులయి ఎక్కడెక్కడికో వెళ్లిన ఆ
శిష్యులంతా పాఠం చెప్పే ముందు పిల్లిని వెతికి తెచ్చి స్తంభానికి కట్టసాగారు.
పిల్లి లేనిదే పాఠం జరగని రోజులు వచ్చాయి!
Friday, December 12, 2025
M Balamuralikrishna MSG TVG 1962
M Balamuralikrishna : MSG & TVG 1962
ఆమె కథ పాలస్తీనా జానపద కథ - Palastine folk tale told in Telugu
ఆమె కథ
పాలస్తీనా జానపద కథ
ఆమె కథ
ఒకావిడ ఉండేది. ఆమె పేరు కన్ఫ్యూషియా. ఒకసారి ఒక దర్వేష్ ఆమె ఇంటిముందు నుంచి
వెళుతున్నాడు. ఆయన మెడలో ఒక పెద్ద జపమాల వేసుకుని ఉన్నాడు. బాగా ఒళ్లు పెరిగి
నవనవలాడుతూ ఉన్నాడు. కన్ఫ్యూషియా ఆయనను చూచింది. కొంత ఆశ్చర్యంతో పిలిచి ‘ఏం
అమ్ముతున్నావు?’ అని అడిగింది.
‘పేర్లు’ అతను జవాబిచ్చాడు.
‘పేర్లా?’ కన్ఫ్యూషియా మళ్లీ అడిగింది.
‘అవును. నేను పేర్లు అమ్ముతాను.’
‘ఒక పేరుకు ఎంత తీసుకుంటావు?’ కన్ఫ్యూషియా అడిగింది.
‘అయిదు నూర్ల దీనార్లు’ అన్నాడతను.
కన్ఫ్యూషియా కూడబెట్టుకున్న డబ్బులు సరిగ్గా అయిదు నూర్లే ఉన్నాయి. ఆమె
లోపలికి వెళ్లి అయిదు నూర్ల దీనార్లు తెచ్చి దర్వేష్కు ఇచ్చేసింది. ‘ఇవాళ నుంచి
నీ పేరు ఫేర్నీ’ అన్నాడు అతను.
సాయంత్రం కన్ఫ్యూషియా వాళ్లాయన ఇంటికి వచ్చాడు. కన్ఫ్యూషియాను పిలిచాడు.
‘కన్ఫ్యూషియా, కన్ఫ్యూషియా! బయట బండి నిలబడి ఉంది. సరుకులు
దింపుకో!’ అన్నాడు.
కన్ఫ్యూషియా మాత్రం జవాబు ఇవ్వలేదు.
భర్త మళ్లీ కన్ఫ్యూషియాను పిలిచాడు. జవాబు మాత్రం రాలేదు.
‘కన్ఫ్యూషియా, ఏమిటి సంగతి? ఎందుకు బదులు పలకడం లేదు?’ అతను అడిగాడు.
‘నా పేరు ఫేర్నీ!’ కన్ఫ్యూషియా చెప్పింది.
‘ఫేర్నీయా!’
‘అవును ఫేర్నీ’ అన్నది కన్ఫ్యూషియా.
‘ఈ పేరు ఎవరు పెట్టారు?’ భర్త అడిగాడు.
‘ఒక ఫకీరు. ఆయన ఇటుగా వెళుతున్నాడు. పేర్లు
అమ్ముతున్నాడు. అయిదు నూర్ల దీనార్లు ఇచ్చి ఆయన దగ్గర పేరు కొన్నాను’ జవాబుగా
కన్ఫ్యూషియా చెప్పింది.
‘అయిదు నూర్లే!’ కన్ఫ్యూషియా మొగుడు ఆశ్చర్యంతో
అడిగాడు.
జవాబుగా ఆమె తల ఆడించింది.
భర్తకు చాలా కోపం వచ్చింది. అతను మళ్లీ కోటు తొడుక్కున్నాడు. ‘నేను
వెళుతున్నాను. నీకన్నా పిచ్చి ఆడమనిషి మరొకరు కనిపించేదాకా మళ్లీ ఈ ఇంటిముందుకు
రాను’ అని గట్టిగా చెప్పాడు.
అతను ఇంటి నుంచి బయలుదేరాడు. చాలా రోజులు ఆలా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడయినా
ఒక ఫకీరు కనిపిస్తే, వెళ్లి పేర్లు అమ్మే దర్వేష్ నీవేనా? అని అడుగుతాడు. ఆ మనిషి కాదంటాడు.
ఒకనాడు అతను దారి వెంట నడుస్తున్నాడు. ఒక ఆడమనిషి కనిపించింది. ‘మీరు ఎక్కడి
నుంచి వస్తున్నారు?’ అని ఆమె అడిగింది.
‘నరకం నుంచి’ జవాబుగా అన్నాడతను.
‘అక్కడ మీకు మా నాన్న కనిపించాడా?’ ఆ ఆడమనిషి అడిగింది.
‘ఆ, ఆయనను చూచాను’ జవాబిచ్చాడు.
‘ఎలాగున్నాడు?’
‘పరిస్థితేమీ బాగోలేదు.’
‘మీరు తిరిగి అక్కడికి వెళుతున్నారా?’ ఆడమనిషి అడిగింది.
‘అవును’ ఇతను చెప్పాడు.
‘కొన్ని వస్తువులు తీసికెళ్లి నాన్నగారికి
ఇస్తారా?’ ఆమె అడిగింది.
‘ఎందుకివ్వను.’
ఆడ మనిషి అతడిని ఇంటిదాకా తీసుకుపోయింది. కొంత వెన్న, కొన్ని డబ్బులు, భర్తగారి ఒక కోటు తెచ్చి ఇచ్చింది. అతను అన్ని
వస్తువులను చక్కగా మూటగట్టుకుని బయలుదేరాడు.
ఆ ఆడమనిషి భర్త ఇంటికి వచ్చాడు. భోజనం చేశాడు. అతనికి బయటకు వెళ్లి నేస్తాలతో
కబుర్లు చెప్పాలని అనిపించింది. పెళ్లాన్ని పిలిచాడు. కోటు తెచ్చి ఇమ్మన్నాడు.
ఆమె కోటు ఎవరో ఒకాయనకు ఇచ్చేశాను అని చెప్పింది. భర్త ఆశ్చర్యంతో ఎందుకు అని
అడిగాడు.
ఆయనేమో నరకం నుంచి వచ్చానన్నాడు. అక్కడ మా నాన్నగారిని చూచావా అని అడిగాను.
అవును చూచాను అన్నాడు. కష్టాలలో ఉన్నాడు అని కూడా చెప్పాడు. అందుకనే నేను ఆయనకు
కొంచెం వెన్న, కొన్ని డబ్బులు, నీ కోటు ఇచ్చేశాను, నాన్నకు ఇమ్మన్నాను.
‘బాప్రే, అతను ఎటువేపు వెళ్లాడు?’ అన్నాడు ఆ మనిషి.
ఆమె సైగచేసి చూపించింది. వెంటనే అతను బయటికి పరుగు పెట్టాడు. గుర్రం ఎక్కాడు.
అదే దారిలో బయలు దేరాడు. కొన్ని గంటలు పోయిన తరువాత ఒక మనిషి కనిపించాడు. అతను
నిజంగానే కన్ఫ్యూషియా మొగుడు. ఇతను రావడం చూచి అతను పక్కనే ఉన్న ఒక గోడ రంధ్రంలో
తన చేతిలోని మూటను దాచేశాడు. అమాయకంగా గోడకు ఆనుకుని నిలబడ్డాడు.
వచ్చినతను కన్ఫ్యూషియా మొగుడి దగ్గరకు వెళ్లి అడిగాడు.
‘వెన్న, కోటు తీసుకుపోతున్న ఒక మనిషిని ఎవరినయినా చూచావా తమ్ముడూ?’
‘అవునండీ’ కన్ఫ్యూషియా మొగుడు జవాబుగా అన్నాడు.
‘చాలాదూరం వెళ్లి ఉండడు. నేను అతడిని
పట్టుకోగలనంటావా?’
‘తప్పకుండా. కానీ మీరు గుర్రం దిగి నడకలో పోతే, పట్టుకోగలరు.’
‘అదెట్లా?’
‘గుర్రానికి నాలుగు కాళ్లుంటాయి. మనిషికి రెండే
కాళ్లుంటాయి. రెండు కాళ్లు ఉంటే వాటి మధ్యన పొంతన చాలా బాగుంటుంది. మరి నాలుగు
కాళ్లు ఉంటే, పొంతన కలగాలంటే ఎక్కువ కాలం పడుతుందిగదా? నాలుగు కాళ్ల్లు ఒక పద్ధతిలో ముందుకు కదలకపోతే, మరి ఆ మనిషి చాలా దూరం వెళ్లిపోతాడు కదా?’
‘అయితే, అప్పటివరకూ, నా గుర్రాన్ని జాగ్రత్తగా చూస్తావా? నేను తిరిగి వచ్చేదాకా?’ అంటూ అతను గుర్రం మీది నుంచి దిగి అన్నాడు.
‘ఎందుకు ఉండను?’ జవాబుగా ఈ మనిషి అన్నాడు.
అతను కంటికి కనిపించకుండా పోయేదాకా కన్ప్యూషియా మొగుడు అక్కడే ఉన్నాడు. ఆ
తరువాత మూటతో సహా గుర్రమెక్కి వేగంగా బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు
చేరగానే బయటినుంచే గట్టిగా అరిచాడు.
‘ఫేర్నీ, నేను వచ్చేశాను’ అని.
(పాలస్తీనా జానపద గాధ)




