I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Thursday, September 10, 2026
Tuesday, September 8, 2026
Saturday, August 29, 2026
పిచ్చివాళ్ల స్వర్గం : మరణతరంగం నుంచి
పిచ్చివాళ్ల స్వర్గం
ఐజాక్
బషేవిస్ సింగర్
చచ్చి స్వర్గం
చేరుకుంటే సులభంగా ఉంటుంది. ప్రపంచం గురించి ఆలోచించనక్కర లేకుండా అమృతం తాగుతూ,
రంభ డాన్సు చూస్తూ, హాయిగా బతకవచ్చుననుకునే వాళ్లూ ఉండే ఉంటారు. మంచి వాళ్లకు
బతికినంత కాలం కష్టాలుంటాయి. ఈ భూమి మీద నూకలు చెల్లితే అంతా సుఖమే సుఖం! అని
మనవాళ్లు అనాదిగా నమ్ముతున్నదే. అలా నమ్మిన ఒక కుర్రవాడి పాత్ర చుట్టూ అల్లిన కథ
పిచ్చివాళ్ల స్వర్గం. ఐజక్ బషేవిస్ సింగర్ అనే పోలాండ్ రచయిత రాసిన ఇద్దిష్
కథ ఇది. అసలు కథ ఏమిటంటే...
అనగనగా
ఒక ధనవంతుడు. ఆయన పేరు కదిష్. ఆయనకు ఒక్కడే కొడుకు.ఆ అబ్బాయి పేరు అట్సెల్. వాళ్లింట్లో ఒక దూరపు
చుట్టాల అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె పేరు ఆక్సా. అట్సెల్ అందగాడు. అక్సా కొంచెం
పొట్టి. కానీ అందగత్తె. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. వాళ్లిద్దరూ కలిసి తినేవారూ, కలిసి
తిరిగేవారూ, చదువుకునేవారూ, ఆడుకునేవారు
కూడా. మొగుడు పెళ్లాలాట కూడా ఆడేవారు అప్పుడప్పుడు. పెద్దయింతర్వాత వాళ్లిద్దరికీ
పెళ్లి చేసేయాలని పెద్దలనుకున్న సంగతీ అందరికీ తెలుసు. పెరిగారు, పెద్దవాళ్లయ్యారు.
కానీ అట్సెల్కు ఒక మాయదారి రోగం పట్టుకుంది. ఎన్నడూ కనివిని ఎరుగని మాయరోగం అది.
ఆ అబ్బాయి ఎప్పుడూ తానుచనిపోయాననుకునే వాడు!
తనకలాంటి
ఆలోచనలు ఎక్కడినుంచి వచ్చాయి? ఇంట్లో ముసలి పని మనిషి ఎప్పుడూ కథలు
చెపుతుంది గదూ! ఆవిడే స్వర్గం గురించి చెప్పిందట! స్వర్గానికెళితే కష్టపడవలసిన
పనిలేదు. చదువుకోవలసిన అవసరం అంతకంటే లేదు. అమృతం తాగుతూ హాయిగా బతకవచ్చు!
అట్సెల్
నిజానికి సోమరి. పొద్దున్నే లేవాలన్నా, బడికి పోవాలన్నా, పని
చేయాలన్నా తనకు ఇష్టం ఉండేది కాదు. పెద్దవాడయితే తండ్రి వ్యాపారమంతా తనే
చూచుకోవలసి వస్తుందే మోనన్న భయం కూడా ఉండేదతనికి. మరి సుఖపడాలంటే స్వర్గానికి
పోవాలి. స్వర్గానికి పోవాలంటే చావక తప్పదు. ఇలా ఆలోచించి, ఆలోచించి, చివరకు
ఆ అబ్బాయి తను చనిపోయినట్టు ఊహించడం మొదలుపెట్టాడు.
పాపం
అమ్మా నాన్నా, చాలా బెంగ పెట్టుకున్నారు. అక్సా కూడా ఏడిచింది. అట్సెల్ మాత్రం
ఎంత చెప్పినా వినడు. ‘‘ఏమిటి మీ పిచ్చి? ఒకవేపు నేను చనిపోయి పడి ఉంటే మీరంతా
కబుర్లేమిటి? నన్ను పాతేసెయ్యండి! నేను స్వర్గానికి
వెళ్లిపోవాలి!’’ అనేవాడు.
ఎంతోమంది
డాక్టర్లు ఎన్నో మందులు వేశారు. ఎన్నో రకాలుగా నచ్చ జెప్పడానికి ప్రయత్నించారు.
‘‘నువ్వింకా తింటూ, తాగుతూ, రాయిలా ఉండి చచ్చావంటావేమిటి?’’ అన్నారు. ఇంకేముంది అట్సెల్ తిండి మానేశాడు. నిజంగానే చచ్చే పరిస్థితి
వచ్చింది!
కదిష్
అందరికన్నా పెద్ద డాక్టరుగారి దగ్గరకు వెళ్లాడు. తన కొడుకు సంగతి వివరించాడు. అంతా
విన్న డాక్టరుగారు ‘‘ఏం ఫరవా లేదు! ఎనిమిది రోజుల్లో మీవాడి రోగం కుదురుస్తాను.
కానీ ఒక షరతు! నేను ఏం చేయమంటే అది చేయాలి మీరు! ఎందుకని ప్రశ్నించకుండా!’’
అన్నారు.
ఆయన
ఇంట్లో అందరికీ ఈ విషయం వివరించాడు. ఆ రోజు నుంచే వైద్యం మొదలయింది. డాక్టరుగారు
ఏం చెపితే అది క్షణాల్లో అమలు జరగాలి. అది నియమం. డాక్టర్ అట్సెల్ గదిలోకి
ప్రవేశించారు. నలిగిన గుడ్డలతో చిక్కిపోయిన అట్సెల్. మంచంలో పడి ఉన్నాడు. డాక్టర్
మొహం చిట్లించి, ‘‘ఏమిటది? ఇంకా
ఈ శవాన్ని ఇంట్లో దాచుకున్నారేమిటి? అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయండి!’’ అంటూ
అరిచారు. అట్సెల్ తల్లిదండ్రులు అదిరిపోయారు. ఆ అబ్బాయి మాత్రం మొహం చింకిచాటంత
చేసుకుని ‘‘నేనెప్పుడో చెప్పాను! చూడండి! నేను చనిపోయానో లేదో? డాక్టరుగారు
కూడా అదే మాటన్నారు!’’ అన్నాడు.
డాక్టరుగారి
షరతు జ్ఞాపకం తెచ్చుకుని ఇంట్లో అందరూ శవయాత్రకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇదంతా
చూస్తున్న ఆట్సెల్ సంతోషం పట్టలేక గంతులు వేశాడు. ‘‘ఆకలి! అన్నం కావాల’’న్నాడు.
‘‘స్వర్గంలో తిందువుగానిలే!’’అన్నారు డాక్టరుగారు.
ఆ
ఇంట్లోనే డాక్టరుగారి ఆదేశం ప్రకారం ఒక గదిని స్వర్గంగా మార్చేశారు. గోడలు
కనిపించకుండా తెరలు, నేల కనిపించకుండా తివాచీలు ఏర్పాటు
చేశారు. కథలో స్వర్గంలో లాగ దీపాలు అమర్చారు. సేవకులంతా దేవదూతల్లాగ
అలంకరించుకున్నారు.
అట్సెల్
ని శవపేటికలో పెట్టి ఊరేగింపు మొదలుపెట్టారు. అబ్బాయి నిద్ర పోయింది చూచి, అతడిని
స్వర్గం గదిలో దిగబెట్టారు. నిద్రలేచిన అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘‘నేనెక్కడున్నాను? ఎవరక్కడ?’’ అన్నాడు. దేవత ప్రత్యక్షమయి ‘‘ఇది స్వర్గం మహాప్రభో!’’ అని జవాబిచ్చాడు.
‘‘సరే! నాకాకలిగా ఉంది. ఆహారం, అమృతం కావాల’’న్నాడు అట్సెల్. ముఖ్య
సేవకుడు చప్పట్లు చరవగానే తెరలు తొలగించుకుని సేవకులు బంగారు పళ్లాలలో అన్ని
పదార్థాలు పట్టుకువచ్చి అట్సెల్ ముందు అమర్చారు. బాగా తిని వెంటనే మళ్లీ
నిద్రలోకి జారుకున్నాడు అబ్బాయి. మరురోజు పొద్దున్న నిద్రలేచాడు గానీ, అది
పగలో రాత్రో తెలియలేదతనికి, అట్సెల్ నిద్రలేచాడని గమనించగానే, సేవకులంతా
సిద్ధమయి అచ్చం మొదటి రోజులాగానే ఆహారం ఏర్పాటు చేశారు.
‘ఇదేమి బ్రేక్ఫాస్ట్? కాఫీ, బ్రెడ్
రోల్స్ కావాల’న్నాడతను.
‘కానీ స్వర్గంలో అవేవీ ఉండవు. ఎప్పుడూ
ఇదే తిండి! మహాప్రభో’ అన్నారు సేవకులు.
‘అస్సలిప్పుడేమిటి? పగలా? రాత్రా?’ అన్నాడు
అట్సెల్.
‘అంటే ఏమిటది? ఇక్కడదంతా
ఉండదు!’ అన్నారు సేవకులు.
ఎలాగోలాగ
తిండి అయిందనిపించి, ‘మరి కాలక్షేపానికి నేనిప్పుడేం చేయాలి?’ అని
ప్రశ్నించాడా అబ్బాయి.
‘స్వర్గంలో ఎవరూ ఏమీ చేయరండీ!’ జవాబు.
మిగతా
దేవతల గురించి అడిగితే చాలా దూరం అన్నారు.
‘మరి మా అమ్మా, నాన్నా ఎప్పుడొస్తారు?’ అని
అడిగాడు అట్సెల్.
‘మీ నాన్నగారు ఇరవై ఏళ్ల తర్వాత, అమ్మగారు
ముప్పయి ఏళ్లకు!’ అన్నారు.
‘మరి అక్సా సంగతి ఏమిటి?’
‘ఆమె రావాలంటే యాభయి సంవత్సరాలు కావాలి!’
‘అంటే అప్పటిదాకా, నేనిలా ఒంటరిగా
ఉండవలసిందేనా?’’
‘అంతే మహాప్రభో!’
‘సరే, ఇప్పుడు అక్సా ఏం చేస్తుంది మరి?’’
‘‘కొన్నాళ్లు మీ కోసం ఏడుస్తుంది.
నెమ్మదిగా మరిచి పోయింతర్వాత ఇంకో అందమయిన కుర్రవాణ్ణి చూచి పెళ్లి చేసుకుంటుంది.
భూమ్మీద బతికేవాళ్లు ఎప్పుడూ అంతేగదా!’ అన్నారు సేవకులు. అట్సెల్కు తిండి
ఒంటబడుతున్నది. కానీ చేయడానికి పని మాత్రం లేదు. ఎనిమిది రోజులు అలా గడిచే సరికి
అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది. పట్టలేక సేవకుడితే ‘‘స్వర్గంకన్నా భూమిమీదే
బాగుంటుందేమో!’ అన్నాడు.
‘అయ్యో! ఏం బాగులెండి! చదువుకోవాలి!
పనిచేయాలి! ఒక్కటా? అంతా కష్టం?’’ అన్నాడు సేవకుడు.
‘‘ఆ ఏం కష్టంలే? ఇలా
పడి ఉండేకన్నా కట్టెలు కొట్టినా సుఖంగా ఉంటుంది! అయినా ఇలా ఎన్నాళ్లుండాలి నేను’
అన్నాడు ఆ అబ్బాయి.
‘ఎప్పటికీ ఇలాగే’ జవాబు.
‘ఛీ! అలాగయితే నేను ఛస్తాను!’
‘చచ్చినవాళ్లు మళ్లీ చావడానికి
వీల్లేదు!’
చింతలో
పడ్డాడు అట్సెల్.
కొన్ని
క్షణాల తరువాత ఒక సేవకుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాప్రభో! తప్పు కాయాలి. తప్పు ఎక్కడ
జరిగిందో తెలియదు. కానీ మీరు చనిపోలేదు! ఇంకా బతికే ఉన్నారు!’ అన్నాడు.
ఎగిరి
గంతేసి అట్సెల్ ‘ఏమిటి? నేనింకా బతికే ఉన్నానా? మరి
నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? వెంటనే మా ఇంటికి తీసుకెళ్లండి!’
అన్నాడు.
సేవకులు
తన కళ్లకు గంతలు కట్టి, కాసేపు అటూయిటూ తిప్పి, చివరకు
ఇంట్లో అందరూ ఉన్న గదిలోకి తెచ్చారు. గంతలు విప్పారు. మళ్లీ ప్రపంచం చూచిన అట్సెల్
సంతోషం పట్టలేకుండా ఉందప్పుడు. బ్రతకడమెంత హాయిగా ఉంటుందో అర్థమయిందతనికి. అక్సాని చూచి, ‘నీవింకా
ఎవరినో పెళ్లి చేసేసుకుని ఉంటావనుకున్నాను! నా అదృష్టం ఇంకా ఇక్కడే ఉన్నావు!’
అన్నాడు.
వాళ్లిద్దరి
పెళ్లి ఘనంగా జరిగింది. కానుకలు, కట్నాలు కూడా ఘనంగా వచ్చాయి. సోమరితనం
మానేసి, అట్సెల్ వ్యాపారం మొదలు పెట్టాడు. బాగ్దాద్, భారతదేశమూ
తిరిగాడు. చాలాకాలం తర్వాత గానీ, అట్సెల్కు డాక్టరు చేసిన వైద్యం
గురించి తెలియదు. పిచ్చివాళ్ల స్వర్గం గురించి అతను తన పిల్లలకు, వాళ్లకూ కథలుగా
చెపుతూ ఉండేవాడు.
కథకు
ముగింపు మాత్రం ఎప్పుడూ ఒకటే. ‘నిజంగా స్వర్గంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు!’
అని.
Friday, August 14, 2026
అర్థం తెలుసా? దేశభక్తి, వందేమాతరం మరిన్ని విషయాల గురించి... On patrotism, and such matters
విషయానికి
రాగలగడం చాలా గొప్ప విషయం — మెక్ లియోడ్ జి ప్రెస్టన్ (ఈయనగారెవరో తెలియదు.
కానీ చాలా గొప్ప
మాట
అన్నారు.)
అర్థం
తెలుసా?
ఒక అనర్ధం జరుగుతుంది. దేశం మొత్తం
ఒక్కటి అవుతుంది. ఆ భావన కొంత కాలం నిలుస్తుంది. ముందే ఎన్నికల
కాలం. పులి మీద పుట్ర లాగా పుల్వామా
అనర్ధం ముంచుకు వచ్చింది. అది నిజంగా అనర్ధం. యుద్ధాలు, సేనలు అంటే
ఒకరి మీద ఒకరు పడి కొట్టుకు చావడానికే
కదా? యుద్ధం
అన్న పద్ధతిని మొదలు పెట్టిన వారు ఎవరో తెలియదు.
అంతకన్నా అర్ధంలేని పద్ధతి మరొకటి లేదు.
తెలివి గల మనిషి ఆ తెలివిని ఉపయోగించుకుని సమస్యలకు
సమాధానాలు వెతకవచ్చు. అంతేకాని పాశవికంగా, రాక్షసంగా ఎదురుపడి చంపుకుని అందులో
బలాబలాలు
తేల్చుకుంటాం అంటే అంతకన్నా అమానుషం
మరొకటి లేదు. అయినా చరిత్ర అంటేనే యుద్ధాల వరుస. ప్రస్తుతం
యుద్ధం జరగడం లేదు. కానీ ఇరు దేశాల మధ్యన
పొంతన లేదన్న సంగతి కూడా మరవడానికి లేదు.
హ్యాపీమోన్ జేకబ్ అనే జె ఎన్ యు
ప్రొఫెసర్ ఒకాయన ఈ మధ్యన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. దానిపేరు లైన్
ఆఫ్ కంట్రోల్. జేకబ్ అసలే మంచి పేరు
లేని ఆ విశ్వవిద్యాలయంలో,
రాజకీయాలు బోధిస్తూ ఉంటాడు. మౌలికాంశాలను
బోధిస్తూ ఉంటే చిక్కు లేదు. ఈ పెద్దమనిషి
భారత - పాకిస్తాన్
సంబంధాల మీద నిపుణుడు. ఈ విషయం గురించి రెండు
దేశాలలోనూ చర్చలు సమావేశాలు జరుగుతుంటాయి, అంటే మనలాంటి
వాళ్లకు కొంచెం విచిత్రంగానే తోస్తుంది. సైన్యం
దారి సైన్యం చూస్తుంటే, విద్యావంతులు, పరిశోధకులు మరో పక్కన మాటలు, మంతనాలు సాగిస్తున్నారు, అన్నమాట.
తన రంగం గురించి బాగా తెలుసుకోవాలి కనుక
ఈ ప్రొఫెసర్ గారు భారతదేశంలోని సైనిక అధికారులను చాలామందిని
కలిసి విషయ సేకరణ చేస్తుంటాడు. పదవిలో
ఉన్నవారు అంత సులభంగా మాట్లాడారని, రిటైర్
అయినవారు
సులభంగానే ఎన్నో విషయాలు చెబుతారని ఈ
పరిశోధకుడు తన పుస్తకంలో వెల్లడిస్తాడు. నేను ఆ పుస్తకాన్ని
కొన్నాను. రెండు మూడు పత్రికలలో సమీక్ష
చదివిన తరువాత ఆ పుస్తకం చదవాలి అనిపించింది. కనుక కొన్నాను.
చదివాను కూడా!
పరిశోధకుడు దేశంలో సైన్యాధికారులను
మెప్పించి, ఒప్పించి
లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట కొంతకాలం
గడిపి అక్కడి పరిస్థితులను ఆకళింపు
చేసుకున్నాడు. ఈలోగా అటువేపు వారిని కూడా రకరకాలుగా బుజ్జగించి,
పాకిస్తాన్ వెళ్లడానికి పర్మిషన్
తెచ్చుకున్నాడు. అంతేకాదు,
సరిహద్దు వెంట అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి
వారితో కలిసి మంతనాలు చేయడానికి కూడా
కావలసిన అనుమతులను సంపాదించాడు.
మనదేశంలో లాగే అటు పాకిస్తాన్ లో కూడా
ప్రజలకు పక్క దేశం ప్రజల మీద నిజంగా ఏవగింపు లాంటివి లేవు.
అయితే రాజకీయంగా అవసరం గనుక, మీడియా వారు అంతకన్నా చేయగలిగింది లేదు
గనుక, రకరకాల మార్గాల
ద్వారా అవతలి దేశం మీద అందరికీ
గుండెలనిండా అసహ్యం కలిగే పరిస్థితులను, కావాలని తయారు చేస్తున్నారంటే
ఆశ్చర్యం కాదు. ప్రజలకు ప్రజలకు మధ్యన
వైరుధ్యం ఉండవలసిన అవసరం లేదు. నేను ఈ రకం మాటలు చెబితే
నన్ను కూడా దేశభక్తి లేనివాడు అని తన్ని
తగలేస్తారు. ఇక్కడ దేశభక్తి గురించిన ప్రసక్తి లేనే లేదు. అవతలి దేశంలో
ఉంటున్నవాళ్ళు కూడా మనుషులే. కానీ
దేశాన్ని నడిపిస్తున్న వారు మాత్రం బహుశా మనుషులు కారు. ఇది రెండు
వైపులా సత్యమే. వీళ్లకు తగినట్టే మిలిటరీ
ఉంటుంది. నిష్కారణంగా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఇరువైపుల నుంచి
కాల్పులు జరుగుతుంటాయని, అమాయకుల ప్రాణాలను బలికొంటారని అర్ధం
కానివ్వరు. హ్యాపీమోన్ జేకబ్ పుస్తకం
మొత్తం చదివితే విషయం అర్థమవుతుంది.
నిజానికి ఈ వ్యాసంలో నేను
చెప్పదలచుకున్నది పాకిస్తాన్, భారత
దేశాల మధ్యన ఉన్న సంబంధాలను గురించి
కానేకాదు. అందుకే విషయానికి రావడం కష్టం,
అన్న ఒక మంచి మాటను ముందే ఉటంకించాను. దేశంలో అందరికీ ఈ
మధ్యన కొంచెం మరుపు పాలయిన దేశభక్తి
ఒక్కసారిగా ఉప్పొంగింది. పంద్రాగస్టు, ఛబ్బీస్
జనవరి వచ్చాయంటే
పాటలు పాడుతూ, వీధుల వెంట ఊరేగింపులు
చేసిన చిన్నతనపు అనుభవాలు గుర్తుకువస్తాయి. తలుచుకుంటే ఒళ్లు
గగుర్పొడుస్తుంది. తరువాత జరిగిన చైనా, పాకిస్తాన్ యుద్ధాల సందర్భంగా,
దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన దేశభక్తి,
మరొకసారి కళ్లముందు మెదులుతుంది.
అప్పటికి నేను అవగాహన లేని కుర్రవాడిని. అయినా దసరా, దీపావళి
లాగే
స్వాతంత్రదినం కూడా ఇవ్వాళటికి నాకు
పండుగలాగా కనిపిస్తుంది. దసరా, దీపావళి
గురించి తెలియని నేటి
యువతరానికి ఇక దేశభక్తి గురించి ఎవరు
చెప్పాలి?
మొత్తానికి అందరికీ ఈ గడ్డు సమయంలో,
సైనికుల పట్ల తమకు గల భావాలను వ్యక్తం చేయ వలసిన అవసరం ఉందని
అర్ధమయింది. మా వీధి చివరన కూడలిలో బహుశా
ఆటోవాళ్లు, మరికొంత
మంది కలిసి ఒక జెండా ఎగురవేసి, అక్కడ
దేశభక్తి పాటలు వినిపించారు. కానీ
సందర్భానికి తగినట్లు కాకుండా వాళ్లంతా హాయిగా జోకులు వేసుకుని
నవ్వుకుంటున్నారు. అసలు విషయం
చెప్పడానికి వాళ్లకు తగిన నాయకత్వం లేదు. నాలాంటివాడు ఎవడైనా
ముందుకు వెళ్లి చెబుతానంటే, బహుశా వాళ్ళు వినే లక్షణం కనిపించదు.
వాళ్లను వదిలి పెట్టవలసిందే. ఒక సాయంత్రం
మా కాలనీలోని ఆడవాళ్లు కొంతమంది చేరి,
కొవ్వొత్తులు వెలిగించి, వీధుల వెంట నినాదాలు చేస్తూ తిరిగారు.
( నేను వాడిన ఆడవాళ్లు
అన్నమాట నాకే బాగుండ లేదు.) స్త్రీ జనం అనడం కన్నా ఇదే కొంత మేలు అనుకున్నాను.
వీళ్ళ భావన చాలా
బాగుంది. కానీ వీరిలో కూడా సందర్భానికి అవసరమైన సమాచారదృష్టి మాత్రం లేదు. మరేమీ
తోచ లేదు
కనుక అదేపనిగా భారత్ మాతాకీ జై అంటూ
ఉన్నారు వాళ్ళు. అప్పుడప్పుడు ఎవరో కలుగజేసుకుని వి వాంట్ జస్టిస్ అని
కూడా నినాదాన్ని ఇస్తున్నారు. వాళ్లకు
ఏమి న్యాయం కావాలి అన్నది వాళ్లకే తెలియదు. మృతవీరులకు నివాళులు
అర్పిస్తున్నారు కనుక, వారి గురించి
నినాదాలు ఉండాలి. చిత్రంగా మన దగ్గర ఏ నినాదం కావలసి వచ్చినా, అది మరొక
భాషలో ఉండాలి. కార్మికుల ఐక్యత
వర్థిల్లాలి అనడానికి మజ్దూర్ యూనియన్ జిందాబాద్ అంటారు. ముర్దాబాద్ అనే
మాట మరొక చోట వాడుకుంటారు. లేదంటే
ఇంగ్లీషులో నినాదాలు చేస్తారు. మన భాష మీద మనకు పట్టు లేదు.
కనుకనే పెద్దపెద్ద మాటలు సంస్కృతం నుంచి
అరువు తెచ్చుకుని వాడుకునే పద్ధతి చాలాకాలంగా కొనసాగుతున్నది.
ఇక నినాదాల విషయానికి వస్తే సంస్కృతంలో
నినాదాలు ఇచ్చేవారు ఎవరూ, బహుశా అందుబాటులో లేరు. వీర జవాన్
అమర్ రహే అంటే సరిపోయేది. ఆ రెండు
ముక్కలు కూడా వీరికి దొరకలేదు. భారత్ మాతాకి జై అన్నారు. ఎవరు ఈ
బారత్ మాత? ఇది నా ఇవాళటి విషయం.
విషయానికి చేరుకునే సరికే నాకు
అందుబాటులో ఉన్న ఈ పేజీ అడుగుకు చేరుకున్నాను. అయినా మునిగింది లేదు.
భారతమాత అన్నమాట ఒక భావన మాత్రమే.
తెలుగులో కొంతమంది భరతమాత అని కూడా రాస్తారు. సంస్కృతం,
వ్యాకరణం తెలిసినవారికి ఇక్కడ ఒక చిక్కు
ఎదురవుతుంది. భరతుని మాత భారతమాత. అంటే శకుంతల. ఆమెను
కాదు మనం ప్రార్థిస్తున్నది. భారతదేశం
అనే మాతను ఊహించుకుని పూజించుకుంటున్నాము. మాతృదేశం అన్న
భావన మనలో గట్టిగా ఉంటుంది. దేశమంటే
మట్టి కాదోయ్, దేశమంటే
మనుషులోయ్ అన్నారు గురజాడ! మరి
ఇప్పుడు ఎవరు ఈ భారతమాత?
భక్తి కావాలంటే అందుకు ఒక ఆలంబన కావాలి.
నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, అజాయమానుడు
అని
ఆయన గురించి ఒక పక్కన చెప్పుకుంటూనే
ఆయనకు వేలాది ఆకారాలను ఆపాదించుకుని, అర్చావతారములు
అంటూ పూజలు చేస్తున్నాము. అందులో ఒక
దేవుడు సరిపోక లెక్కలేనన్ని దేవుళ్లను తయారు చేసుకున్నాము.
కనుక గజిబిజి పుట్టింది. తెలియజెప్పే
వారు లేక కొంతమందికి విషయం అర్థం కావడం లేదు.
అచ్చంగా ఇదే పద్ధతిలో దేశం మీద అభిమానం
ఉండాలంటే, ఆ
దేశాన్ని ఒక మనిషిగా చూడగలగాలి. దేవుడిని కూడా
మనిషిగా చూసిన మనం, దేశాన్ని, ఒక తల్లిగా
చూచి పూజించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అభ్యంతరం అంతకన్నా
ఉండకూడదు.
ఇంకొక తికమక గురించి ఇక్కడే చెప్పుకుంటే
పోతుంది. వందేమాతరం అంటూ బంకించంద్రుడు తన నవలలో
వాడుకున్న ఒక పాటను జాతీయగీతం, నేషనల్ సాంగ్ గా
వాడుకుంటున్నాము. ఏవో కొన్ని విశేషణాలు ఉన్న మొదటి
భాగాన్ని మాత్రమే అవసరం వచ్చినప్పుడు
పాడుకుంటున్నాము. సప్త కోటి కంఠ కలకల నినాద అంటూ తరువాత సాగే
చరణాలు ఉన్నాయి, అని కూడా చాలా మందికి
తెలియదు. ఇక అసలైన జాతీయగీతానికి వస్తే జనగణమన అధినాయక
అంటూ ఒక పురుషుడిని ప్రార్థిస్తున్నాము.
రవీంద్రుని దృష్టిలో ఈ
పురుషుడు జార్జి చక్రవర్తి అని నేను ఇవాళ అంటే
అందరూ నన్ను తన్ని తగలేస్తారు. ఎవరు ఈ అధినాయకుడు? భారత మాత అనే భావన ఒక పక్కన ఉండగా ఎందుకు
ఒక పురుషుడిని ప్రార్థించడం? ఆ పురుషుడు ఒక దేవుడు అనుకుందామా? అప్పుడు అంతకన్నా పెద్ద చిక్కు
మొదలవుతుంది? ఆ దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు? రవీంద్రుడు ఏ మతానికీ చెందని ఒక దేవుని
గురించి
పాడుకున్నాడు. ఆంత భావనాబలం మనకు ఉన్నదా
చెప్పండి! ఈ విషయం గురించి ఇక్కడ నేను ఇంతకన్నా ఎక్కువ
ప్రస్తావించ దలుచుకోలేదు.
అందరూ నాకంటే ఎక్కువ తెలిసిన వారే!
ఆలోచించండి! ఆలోచన లేని వారికి కనీసం మీరైనా చెప్పండి! తికమకలో
పడి తెలియకుండా ముందుకు సాగేకన్నా, ఉన్నచోట నిలబడి ఆలోచించడం మేలు కదా!


