Showing posts with label Tales. Show all posts
Showing posts with label Tales. Show all posts

Tuesday, January 6, 2026

జాతక కథలు 113 రహస్యంగా : Jataka Tales - Sheela vimamsana Jatakam...

జాతక కథలు 113 రహస్యంగా

శీల విమంషణ జాతకం

జేతవనంలో ఉండగా బుద్ధుడు శీల నియంత్రణ గురించిన ఈ కథను చెప్పాడు.

ఒకానొక రాత్రి అప్పుడప్పుడే దీక్ష పొందిన 500 మంది భిక్కులు తీవ్రంగా ఆలోచనలో పడి తిరిగి మామూలు జీవితంలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వారిని కాపాడే ఉద్దేశంతో బుద్ధుడు ఆనందుని పిలిచి ఆ బిక్కులందరినీ జేతవనంలో సమావేశపరచమన్నాడు. అందరూ వచ్చారు. బుద్ధుడు వారిని సంబోధిస్తూ భిక్షువులారా గతంలో ఒకసారి ఒక బుద్ధిగల మానవుడు తప్పు చేయడాన్ని ఏ రకంగానూ దాచలేము అని అర్థం చేసుకొని తప్పులు చేయకుండా బతకగలిగాడు, అంటూ ఒక కథ వారికి చెప్పాడు.

పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చదువుకోవడానికి సరైన సమయం వచ్చిన తరువాత ఆ బాబును ఒక పేరుగల గురువు వద్ద చేర్చారు. ఆ గురువుగారి వద్ద 500 మంది శిష్యులు ఉండేవారు.

ఆ గురువుగారికి అందమైన ఒక కూతురు ఉండేది. ఆమె పెళ్లి వయసుకు వచ్చింది. తగిన భర్తను వెతకాలని గురువుగారు ప్రయత్నంలో పడ్డారు. నా వద్ద గల యోగ్యులైన శిష్యులలో ఒకరిని ఎంచుకుంటే బాగుంటుంది అనుకున్నారు.

ఒకనాడు ఆయన శిష్యులందరినీ ఒకచోట చేర్చి ఒక ప్రకటన చేశారు. శిష్యులారా! నాకు పెళ్లి ఈడుకు వచ్చిన ఒక కూతురు ఉన్నది. ఆమెకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మరి అంతకుముందు ఆమెకు తగిన దుస్తులు, నగలు అన్ని ఏర్పాటు చేయాలి కదా అటువంటి వస్తువులను మీరు దొంగిలించి తేవాలని నా నిర్ణయం. వెలగల వస్తువులు ఏవైనా సరే, కానీ ముఖ్యంగా, వాటిని మీరు పూర్తి రహస్యంగా ఎవరూ చూడకుండా దొంగిలించాలి. మీరు ఆ వస్తువు దొంగిలించినట్టు ఎవరైనా చూసినట్లయితే అటువంటి వస్తువు నాకు అవసరం లేదు. దొంగిలించిన వస్తువులను నేరుగా నా వద్దకు తీసుకురండి. వివరం చెప్పండి. అయితే ఎవరూ చూడకుండా వాటిని సేకరించాలి అన్నారు ఆ గురువుగారు.

శిష్యులు గురువు చెప్పిన నిబంధనను అంగీకరించి తమ ప్రయత్నంలో పడ్డారు. పోటీలో నిజంగా గెలిస్తే తమకు ఒక చక్కని భార్య దొరుకుతుంది అని వారి ఆనందం. ఇక రాత్రి, పగలు, వారు నగరంలో దొంగ చాటుగా వెళ్లి దుస్తులు, నగలు, ఇతర వెలగల సామాన్లు దొంగలించుకు వచ్చారు. ఒకరి తరువాత ఒకరు ఆ వస్తువులన్నింటినీ గురువుగారికి చేర్చారు. గురువుగారు వాటన్నింటినీ వివరంగా దొంగిలించిన వారి పేర్లతో పాటు ఒక పట్టికలో నమోదు చేసుకున్నారు.

గురువుగారు అందుకు ఏర్పాటు చేసిన గది నిండిపోయింది. అప్పుడు ఆయన శిష్యులందరినీ పిలిపించారు. అందులో ఒక శిష్యుడిని ముందుకు పిలిచి, “నీవు ఒక్కడవు నాకోసం ఏమీ తేనేలేదు, అన్నారు.

నిజమేనండీ, గురువుగారూ, అన్నాడు ఆ శిష్యుడు.

ఏం? ఎందుకని?” గురువుగారు ప్రశ్నించారు.

గురువుగారూ, మీరు ఈ దొంగతనాలన్నింటినీ మేము అతి రహస్యంగా చేయాలని కదా చెప్పారు. తప్పు చేసే తీరును రహస్యంగా ఉంచడం కుదరదని నాకు అనిపించింది. దుర్మార్గంగా చేసే ఏ పనీ రహస్యంగా ఉండదు. తెలివి తక్కువవారు తాము చాలా తెలివిగానే దొంగిలించాము అనుకోవచ్చు. కానీ ఎవరో ఒకరు ఆ సంగతిని గమనించే ఉంటారు. కనుక నేను ఏ వస్తువు తేలేదు, అన్నాడు శిష్యుడు.

ఆ మాటలతో గురువుగారు ఎంతో సంతృప్తి చెందారు. మిగతా శిష్యులతో వారు దొంగలించిన వస్తువులను ఎవరివి వారికి అప్పగించి క్షమాపణలు చెప్పమన్నారు.

అల్లుడు కాబోతున్న శిష్యుడిని పిలిచి యువకుడా, నా వద్ద కావాలసినంత ఆస్తి ఉన్నది. నా కుమార్తె పెళ్లి కొరకు ఎటువంటి వస్తువులకు నాకు లోటు లేదు. నేను నిజానికి ఒక గుణవంతుడైన యువకుని వెతకాలని మాత్రమే ప్రయత్నించాను. కనుక మీకు అందరికీ ఇదొక పరీక్షగా పెట్టాను. అందరిలోకి మా అమ్మాయి చేయి పట్టడానికి నీ ఒక్కడివే యోగ్యుడైన వాడవని తేలింది, అన్నారు.

చిరకాలంలోనే అమ్మాయిని తగిన దుస్తులు, నగలతో అలంకరించి ఆ శిష్యుడితో ఆమెకు పెళ్లి జరిపించారు.

ఈ కథ చెప్పి బుద్ధుడు, “భిక్షువులారా! తెలివిలేని శిష్యులు మూర్ఖంగా ప్రవర్తించి పెళ్లి చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తెలివిగల ఒక శిష్యుడు మాత్రం తన నీతివంతమైన ప్రవర్తనతో చక్కని భార్యను పొంది గురువు అభిమానానికి పాత్రుడయ్యాడు. కథ విన్నారు కదా?” అన్నాడు.

ఆ తరువాత ఆ 500 మంది బిక్షువులు సన్మార్గంలో విద్య గడించి అర్హతులయ్యారు.

బుద్ధుడు కథ గురించి చెబుతూ సారీపుత్త ఆ కథలోని గురువు, ఇక నేను ఆ తెలివీ, నీతీ గల శిష్యుడను అని విషయం వివరించాడు.