లోకాభిరామం
విశ్వనాథ ప్రభావం
కోపమున కొకరు లక్ష్యముగా నుండుట సహజము. అట్టి వారి యందు మంచితనముగా కోపము ప్రదర్శించుట బాగుండును, తిట్టవచ్చును. కానీ యాకశ్మలమును మనసు నందుంచుకొని, నిరంతరము అనుమా నించుటయు, అవమానించుటయు మాత్రము మాన్యముగాదు. ఇతరుల ముందు విమర్శించుట కన్న నీచ లక్షణము మరొకటి లేదు. చేతనయిన ఎదురుగనే యనదలుచుకున్నదేదో యనవలెను. తెగులెక్కువయినచో అరవవచ్చును గూడ! అంతేగాని, మనసును గుళ్లుకొనుచు, పోయినంత గాలము, ఆ విషయమునే మననము జేసుకొనుట స్వీయారోగ్యమునేగాక వాతావరణము నంతటిని నాశనము జేయును. కోపము రావలెను. వచ్చినంత వేగముగ మాయము గావలెను. ఉత్తముల కోపము క్షణభంగురమను మాట యున్నది గదా!
ఈ వాక్యాలు 2000 సంవత్సరం జులై పదకొండునాడు నేను డయరీలో రాసుకున్నానంటే నమ్మగలరా? విషయం గురించి కాదు గానీ, మాట తీరును గమనిస్తే గ్రాంథికం మీద నాకున్న ప్రేమ కనబడుతుందనుకుంటాను.
విశ్వనాథ: కొందరు మహానుభావులు ప్రపంచాన్ని
ప్రభావితం చేస్తారంటారు. అక్షరాలకు ఉండగల అసలు బలాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో
ఉన్న కాలంలోనే, విశ్వనాథ సత్యనారాయణ గారి మాట తీరు మొహంలో
పిడిగుద్దులాగ వచ్చి తగిలింది. బి.ఎస్సీలో ఉండగానే రామాయణ కల్పవృక్షం ఆసాంతం
చదివాను.
అర్థమయిందా అని మీరు అడగవచ్చు. నేను
అర్థమవుతుందని చదవలేదు. అదేమిటో చూద్దామని చదివాను. అదే ఊపులో ఆయన నవలలు చదివాను.
నన్నయ ‘ప్రసన్న కథా కవితార్థ యుక్తి’ వంటి విమర్శ గ్రంథాలూ చదివాను. పశువుల కాపరి
చిత్రములు (కౌబాయ్ మూవీస్) గురించి ఆయన రాసిన సంగతులు చదివాను. ఒక మనిషిలో ఇంతటి
వైవిధ్యం, అందులోనూ అనుకోనంత లోతులు ఉండడం, ఆశ్చర్యం (ఈ మాట సరిపోదు, దాని అమ్మమ్మ లాంటి ఒక మాట ఉంటే బాగుండును!) ఆలోచన నన్ను వెర్రివాడిని చేశాయి.
‘ఇందొకటి యున్నది ఒకటి యనగా రెండు’ అంటారు విశ్వనాథ! అందరూ ఆయనను ఛాదస్తం అని
కొట్టిపడేయడం చూచాను. అది సులభమే, కానీ, ఆ లోతులను అందుకోవడానికి బోలెడంత శ్రమ పడాలి. నేనందులోనే
ఉన్నాను’ అన్నాను నన్నాక్షేపించిన మిత్రులతో!
నవలలు: ఈ అక్షరాలు రాసేందుకు కూచుంటే, చొక్కాపు వెంకటరమణ ఫోన్ చేశారు. ఆయనను కొన్ని క్షణాల
క్రితమే గుర్తు చేసుకున్నానని చెప్పాను. రమణగారు విజయవాడలో ఒక పత్రికలో ఉప
సంపాదకులుగా ఉన్నారు. ఆ పత్రికలో విశ్వనాథ వారి నవల ఒకటి ధారావాహికగ వస్తున్నది.
ఆయనేం రాసి పంపిస్తారేమన్నానా! రమణగారు వెళ్లి డిక్టేషన్ తీసుకుని వచ్చి కంపోజ్
చేయించే వారట. ఈయన వెళ్లి అరుగు మీద కూచుంటారు. ఆయన లోపల నుంచి వచ్చావా అంటారు.
రాసుకో అని అక్కడ నుంచే వాక్యాలు చెపుతూ బయటకు వస్తారు. పోయిన వారం కథ ఎక్కడ వరకు
వచ్చింది, ఎక్కడ ఆగిందని చెప్పవలసిన అవసరమే లేదు!
పుస్తకం డాట్కామ్లో ఒక అక్కయ్యగారు విశ్వనాథ
వారి గురించి రాసే ప్రయత్నం చేశారు. నవలల గురించి నాలుగు మాటలు రాశారు. విశ్వనాథ
వారి సాహిత్య సృష్టి సముద్రం వంటిది. అందులో నవల ఒక భాగం మాత్రమే. అది హిమాలయ
పర్వత శ్రేణికన్నా విస్తృతం! ఒక్కో వరుస నవలలను చదివితే ఒక ఆలోచనాక్రమం బయటపడుతుంది.
కొండ, సముద్రం కలగలిసి విరోధాభాసమా?
చరిత్ర నవలలు: కాశ్మీర, నేపాళ రాజవంశాల గురించిన నవలలు ఎంత నవలలో అంతగానూ చరిత్ర పుస్తకాలు. ఇక పురాణ
వైర గ్రంథమాల గురించి చెప్పనవసరమే లేదు. భారతదేశ చరిత్రను పడమటి వారు తమకు
అనుకూలంగా రాయించారన్నది విశ్వనాథ వారి వాదం. అసలు చరిత్రను ఆయన చరిత్రగా కాక,
నవలలుగా రాయడంతో చిక్కు వచ్చి పడిరది. చాలామందే చదివారు
గానీ, వాటి మీద జరగవలసినంత చర్చ జరగలేదు. విశ్వనాథ
వారు సమకాలీన రాజకీయం మీద చెణుకులుగా, వ్యాఖ్యలుగా రాసిన
నవలలు ఎంతమందికి తలకెక్కి నయని నాకొక అనుమానం. పులుల సత్యాగ్రహం, నందిగ్రామ రాజ్యం, ప్రళయనాయుడు
లాంటివన్నీ చిన్నచిన్న నవలలు. కానీ వాటిలో వ్యాఖ్యలు ఎంతో బలమయినవి.
‘పులిమ్రుగ్గు’ అని ఒక నవల. ఇది ఫాంటసీ అనే తరహా
కిందికి వస్తుంది. ఇందులో ఒక మనిషి పులిగా మారుతుంటాడు. ఆ కథను కూడా తమదయిన
శైలిలో చెప్పడం వల్ల మామూలు నవలలు చదివేవారికి, అది తలకెక్కలేదు. విశ్వనాథ వారి చిన్న కుమారుడు పావని (శాస్త్రి), నాకు మంచి మిత్రుడు. ఆయన ఈ నవలను ఒకప్పుడు మామూలు భాషలో
రాసి ఒక వారపత్రికలో అచ్చేయించాడు. అయినా శంఖం మోగలేదు. దూరదర్శన్లో సీరియల్గా
తీయడానికి పులిముగ్గు ఎంపికయింది అని సంతోషంగా చెప్పాడు ఒక రోజున. బోలెడు
గ్రాఫిక్స్, గందరగోళం అవసరమవుతాయి. తెలుగు టీవీ ఇంకా అంత
ఎత్తుకు చేరలేదు. ఏమనుకోకండి, మీ ఆశయం నెరవేరదు
అన్నాను. అన్నంతా అయింది. ‘పోనీ, మనం వేరే ప్రయత్నం
చేద్దాం, ఏ నవలయితే బాగుంటుంది, చెప్పండి’ అని మరో రోజు అడిగాడాయన. ఒక నవల
పేరు వెంటనే చెప్పాను. రాజకీయం, కుట్రలు, గూఢచారులు మొదలయిన మసాలా ఇంతకన్నా బలంగా ఉన్న నవల నాకు
తెలిసి, మరోటి లేదు. ‘భలే! మీరు నాన్నగారి రచనలను మరీ
లోతుగా పరిశీలించారండీ!’ అని మురిసిపోయాడు. పాపం, పావని. ‘సాహిత్యం - సైన్సు’ సంబంధాల గురించి నేను ఏదో పత్రికలో ఒక వ్యాసం
రాశాను. అందులో విశ్వనాథ నవలలోని కొన్ని అంశాలను ఉదాహరిం చాను. ఆయన ఒకానొక నవలలో,
బహుశా ‘దమయంతీ స్వయంవరం’ అనుకుంటాను, నీటి పారుదల, ఆనకట్టల గురించి ఒక చోట రాసిన అంశాలు
ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నది కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే మైదాన ప్రాంతానికి నీరు
అందించడం గురించి ఆయన వివరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. అదే సంగతి నా వ్యాసంలో
రాశాను. పావనితో ఆ తరువాత ఎప్పుడో మాట్లాడుతున్నప్పుడు అతను గతంలోకి వెళ్లిపోయి,
తండ్రిగారు, నీటిపారుదల
నిపుణులు, మిత్రులు కె.ఎల్.రావు గారితో జరిపిన చర్చల
గురించి చెప్పసాగాడు. ఆ తరువాత మరొకసారి తిరుమలలో కలిసి, ‘విజయవాడలో వరుసగా లెక్చర్లు ఏర్పాటు చేశాము. ఒక నెల మీరూ మాట్లాడాలి’ అన్నాడు.
కానీ, పాపం తానే మిగల్లేదు! నాకు విశ్వనాథ వంటి
మహామహుని గురించి మాట్లాడే అవకాశం మిగలలేదు.
పుస్తకాల వేట: నేను బిఎస్సీలో ఉండగా ఒక
రెడ్డిగారు సైకిలు మీద వచ్చి మా ఇంట్లో పాలు పోస్తూ ఉండేవారు. నా చేతుల్లో తరచు
పుస్తకాలు గమనించి నాతో మాట కలిపాడాయన. ఆయన సాహిత్యాభిమాని. విశ్వనాథ వారికి
వీరాభిమాని. నేను చదవని రెండు మూడు నవలలు ఆయన తేవడం, నేను చదవడం గుర్తుంది. తెరచిరాజు, చెలియలికట్ట ఆ
వరుసలోనే చదివాను. స్త్రీ పురుష సంబంధాల గురించి ఆ నవలలో ఆయన చిత్రించిన సంగతులు
కలవరపరిచేంత బలంగా ఉంటాయి. తెరచిరాజు చదివి నేను విహ్వలుడనయి ఏడ్చాను. వారం రోజులు
తిండి మరిచి ఆలోచించాను. అట్లాంటి పుస్తకాలను వెదికయినా సరే తెచ్చి చదవాలి.
విశ్వనాథ వారికి ఉన్నచోటే పుస్తకం రాయడం,
అక్కడే అచ్చేయించడం అలవాటు. కరీంనగర్లో ఉండగా ‘మ్రోయు
తుమ్మెద’ ‘సముద్రపు దిబ్బ’ నవలలను అక్కడి చింతల నరసింహులు అండ్ సన్స్ అనే సంస్థ
వారు అచ్చు వేశారు. వారు పుస్తకా లను అమ్మే ప్రయత్నం మాత్రం అంతగా చేసినట్లు లేదు.
వెతకగా వెతకగా వాళ్ల స్టేషనరీ పుస్తకాల దుకాణం హనుమకొండలో ఉందని తెలిసింది.
పనిగట్టుకుని అక్కడికి వెళ్లి అడిగాను. విన్న పెద్ద మనిషి ముందు ఆశ్చర్యంగా,
నావేపు చూచాడు. ‘ఉన్నయి’ అని లోపలి నుంచి రెండు పుస్తకాలు
తెచ్చి ఇచ్చాడు.
‘మ్రోయు తుమ్మెద’ ప్రపంచమంతా అన్ని భాషలలోనూ
చదవవలసిన నవల. దాని గురించి చెప్పుకోడానికి చాలా ఉంది. సంగీతము, నాదోపాసన, కరీంనగర్లోని ఒక
సంగీత కారుడు అందులోని విషయం.
అంత వెతికి తెచ్చుకున్న నా పుస్తకాన్ని ఎవరో
తీసుకుపోయారు. తిరిగి ఇవ్వలేదు. ఈ మాట చెపితే పుస్తక మిత్రులు రామడుగు
రాధాకృష్ణమూర్తి నాకు, ఒక జిరాక్స్ ప్రతి చేసి ఇచ్చారు.
భ్రమరవాసిని నాకు షామీర్పేట దగ్గర ఒకానొక
చీకటి రాత్రిలో కనిపించిందని చెపితే విశ్వనాథ ప్రభావము గురించి ఇక ముందుకు
చెప్పవలసిన అవసరం ఉండదేమో. నా దృష్టిలో ఆయన ఒక మనిషి కాదు. అటువంటివారు చాలా
అరుదుగా మనుషుల మధ్యన కనిపించి మాయమవుతారు.
No comments:
Post a Comment