Monday, June 23, 2025

Lokabhiramam 2 - Science Panduga


సైన్స్ పండుగ

సైన్సు అందించిన అందమయిన మత్తులో హాయిగా గడుస్తున్న దినం కాదిది. ఆ రోజు గడిచింది. ఇది మరుసటి రోజు. అవగాహనకు అందని అంశాలను, అనర్థాలకు దారితీస్తున్న అంశాలను, మరింత సులభంగా పరిశీలించడానికి, ఇప్పటివరకూ వచ్చిన సైన్సు, కొంత వెసులుబాటు మాత్రమేనని, అందరికీ అర్థమయింది, అంటాడు ఆల్డస్‌ హక్స్‌లే.
---
సైన్సుకు స్వంతంగా విలువలు ఉండవు. విలువలు మనుషులకు ఉంటాయి. సైంటిస్టులు మనుషులు. సైన్సును వాడుకునేవాళ్లు మనుషులు.
---
పుష్పా! ఈ సదస్సుల్లో నేను పాల్గొనడానికి పద్ధతేమిటి?’ యించుమించు ఈ అర్థం వచ్చే ప్రశ్న ఏదో అడిగాను. ‘అదేమిటి? నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను’ అన్నాడు పుష్పా. అవును. పుష్ప అమ్మాయి కాదు. పుష్పమిత్ర భార్గవ అనే పి.ఎం. భార్గవ. జంటనగరాల్లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ అనే గొప్ప సంస్థను ప్రారంభించిన డైరెక్టర్‌ ఆయన. ఆ సంస్థ అప్పటివరకూ ఆర్‌ ఆర్‌ లాబ్స్‌లోనే భాగంగా ఉండేది. స్వంత భవనాలు, మిగతా సౌకర్యాలు వచ్చిన తరువాత ప్రారంభోత్సవానికి ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలను చాలామందిని పోగేసి రెండు వారాలపాటు సదస్సులు నిర్వహించారు. నేను అడిగింది,  ఆ సదస్సుల్లో పాల్గొనడం గురించే. నేను మాలిక్యులార్‌ బయాలజీ చదువుకున్నాను. పిఎచ్‌. డి కూడా చేశాను. కానీ సదస్సుల నాటికి కేవలం సైన్సు జర్నలిస్టును!  సైంటిస్టును కాదు. సదస్సుల వివరాలను, పాల్గొంటున్నవారి వివరాలను కలిపి ఒక పెద్ద పుస్తకం వేశారు. దేశవిదేశాలలోని వారెంతో మంది, పాల్గొన డానికి అప్లికేషన్స్‌ పంపారు. వారిలోంచి ఎంపికయినవారు రెండుమూడు వర్గాలలో, సెలెక్టెడ్‌ పార్టిసిపెంట్స్‌ ‘చాలా ముఖ్యమయిన వ్యక్తులు’ మాత్రం ఆహ్వానాలు అందుకుని వచ్చారు. పెద్ద సంస్థల డైరెక్టర్లు, ప్రభుత్వంలో సెక్రటరీలలాంటి వారితో సమానంగా, ఆ లిస్టులో నా పేరు ఉంది. అప్పట్లో దేశంలో ఉండిన రెండు సైన్సు పత్రికల ఎడిటర్లు కూడా వచ్చారు. ఆరుగురు నొబేల్‌ బహుమతి గ్రహీతలు వచ్చారు. డి.ఎన్‌.ఎ నిర్మాణం కనుగొన్న ఫ్రాన్సిస్‌ క్రిక్‌, టెస్ట్‌ట్యూబ్‌ బేబీలను ప్రారంభించిన ఎడ్వర్డ్స్‌ లాంటివారు అక్కడ ఉన్నారు. కానీ, సమావేశంలో మొదటి ఉపన్యాసం ఎఫ్రాయిమ్‌ కచాల్‌స్కీ అనే పరిశోధకుడు సమర్పించారు. దీన్ని ప్రోటొకాల్‌ అంటారు. అంటే మర్యాదలు పాటించడ మని అర్థం!
ఎఫ్రాయిమ్‌ కచాల్‌స్కీ అనే ఆ భారీ మనిషి, ఇజ్రాయిల్‌ దేశానికి అధ్యక్షుడు, మన భాషలో రాష్ట్రపతిగా పనిచేశాడు. ఆ దేశంలో గొప్ప సైంటిస్టులను, పండితులను ప్రెసిడెంట్‌ చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు ఐన్‌స్టయిన్‌ను అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశా ఆ మార్గంలోనే మన దేశంలో అవ్వల్‌ ఫకీర్‌ జైనులాబుదీన్‌ అబ్దుల్‌ కలామ్‌ గారు అధ్యక్షులయ్యారు. కచాల్‌స్కీ పేరున్న జన్యుశాస్త్రవేత్త. మంచి ప్రసంగం చేసినట్టు గుర్తుంది. వివరాలు గుర్తుకు రావడం లేదు. మొత్తానికి ఆయన మృదుభాషి. స్నేహశీలి. అంతకుముందు నా పరిశోధనపత్రం ఒకటి, ఇజ్రాయల్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌లో అంగీకరింపబడింది. కానీ, మనదేశానికి, ఆ దేశానికీ సంబంధాలు సరిగా ఉండనందుకు నేను వెళ్లలేక పోయాను. ఒక మధ్యాహ్నం కచాల్‌స్కీ గారితో చాలాసేపు కబుర్లు నడిచాయి. ఒక ఇంటర్‌వ్యూ రికార్డు చేశాను. అంతా ముగిసి బయటికి వచ్చిన తరువాత, ఆయన్ను అనుక్షణం, ఇంటలిజెన్స్‌వారు పహరా కాస్తున్నారన్న సంగతి అర్థమయింది. ఒకాయన వచ్చి, నా రికార్డర్‌ లాక్కున్నాడు. ఆయనతో ఏం మాట్లాడావని గట్టిగా అడిగాడు. ‘నేను సైన్సు మాట్లాడాను, కావాలంటే, ఆ క్యాసెట్‌ పట్టుకు పో’ అన్నాను. అతను ఊరుకున్నాడు. మిగతా పాత్రికేయులను ఆయన దరిదాపులకు రానీయలేదట! ఆ దేశం నుంచి మైకేల్‌ సేలా అని మరో గొప్ప ప్లాంట్‌ జెనెటిసిస్ట్‌ వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు. 
జెనెటిక్స్‌ను ఎంతో ప్రేమగా చదువుకున్న నాకు ‘ఫ్రాన్సిస్‌ హ్యారీ క్రాంప్టన్‌ క్రిక్‌’ మరీ గొప్పవాడుగా కనిపించాడు. నాకు కొంతమందిపట్ల మరీ ఆరాధనా భావం ఉంటుంది. అవకాశం ఉన్నాసరే, వారికి మరీ దగ్గరగా పోవడానికి మనసు ఒప్పుకోదు. క్రిక్‌తో గుంపులో మాట్లాడడమేగాని, ఒంటరిగా కబుర్లు చెప్పే ప్రయత్నం చేయలేదు, అందుకనే.
కార్ల్‌టన్‌ గాజుసేక్‌ అని మరో నొబేల్‌ లారేట్‌ వచ్చారు. ఆయన విశృంఖల భావాలు గల మనిషిగా  పేరున్న వ్యక్తి. కొండజాతులవారు, జెనెటిక్స్‌లో వారి పద్ధతుల పాత్ర గురించి గొప్ప పరిశోధనలు చేసినా, ఎందుకో అందరూ ఆయనను చూచి జంకుతారనిపించింది. నేను మాత్రం ఆయనను టైమ్‌ కొరకు అడిగాను. ‘నీవేమీ రికార్డ్‌ చేయనంటే, ఎంతసేపయినా మాట్లాడవచ్చు’ అన్నారాయన. మేమిద్దరం గంటకన్నా ఎక్కువసేపు ఎన్నో సంగతులు మాట్లాడుకున్నాము. స్త్రీ పురుష సంబంధాల గురించి ఆయనకు, కొండ జాతులవారిలాగే, కొన్ని విచిత్రమయిన అభిప్రాయాలున్నాయని అర్థమయింది. అది తప్పు కాదేమో అనిపించేలాగ మాట్లాడారాయన. మేమంతసేపు మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపించిందిలాగుంది, సిసిఎంబి వారి అఫీషియల్‌ ఫోటోగ్రాఫర్‌ మా ఫోటో తీసి మరునాడు ఉదయానికి నోటీస్‌ బోర్డులో పెట్టాడు. నేను కాపీ తీసుకున్నాను. నేను రాసిన మరో వ్యాసంతో పాటు అది ఒక దినపత్రికలో అచ్చయింది. ఆ పత్రిక వాళ్లు అరుదయిన ఆ ఫోటోను పడేశారు. కనుక అదిప్పుడు నా దగ్గరమాత్రం లేదు.
జర్మనీ నుంచి వచ్చిన మరో నొబేల్‌ బహుమతి గ్రహీత యువకుడు. అతను బంజారా హోటేల్‌ నుంచి సైకిల్‌ మీద, తార్నాకా రావడానికి ప్రయత్నించాడు. మన మ్యాపుల కారణంగా, ఊరంతా తిరిగి తిరిగి చివరకు రానే వచ్చాడు. అప్పట్లో అదొక సంచలన వార్త. సైంటిస్టులు, పరిశోధకులు కూడా మనుషులే అనడానికి మరెన్నో ఉదాహరణలను ఈ సదస్సు సందర్భంగా నేను చూడగలిగాను.
ఇంగ్లండ్‌ నుంచి ఎడ్విన్‌ డాస్‌ దంపతులు వచ్చారు. డాస్‌ గారిని ఎడ్డీ అని పిలుస్తున్నారందరూ.  ఆయన ‘అయామ్‌ ఎడ్డీ!’ అని పరిచయం చేసుకుంటున్నాడు. కరిగే ప్లాస్టిక్‌లను కనుగొని, వాటి గురించి మరింత కృషి చేస్తున్న గొప్ప పరిశోధకుడాయన. వింత ఏమిటంటే, ఆయనకు ఐంద్రజాలికుడు అంటే మెజిషియన్‌గా కూడా. ప్రపంచమంతటా మంచి పేరుంది. మ్యాజిక్‌ అంతా సైన్సే అనడానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఒకనాటి సాయంత్రం సతీమణి సాయంతో ఆయన చక్కని ప్రదర్శన చేశారు. అందరికీ ఆయనంటే ఉన్న గౌరవం నాలుగింతలయింది. ఈ సందర్భంగా సిసిఎంబి ఆస్థాన మెజీషియన్‌, మ్యుజీషియన్‌ మధుసూదన్‌ వామన్‌ పండిత్‌ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది. పరిశోధకుడు పండిత్‌ మంచి మెజీషియన్‌. అంతకన్నా హార్మోనియం మీద హిందూస్తానీ సంగీతంలో మంచి దిట్ట. దేశంలోని ప్రసిద్ధ గాయకులందరితోపాటు సహకార వాద్యం వాయించాడు. పండిత్‌ ఆ తరువాత మంచి మిత్రుడయ్యాడు.
గొప్ప పరిశోధకులంతా వేరు దేశాల వారే, అనుకుంటున్న నాకు, పెట్రోలు తినే సూక్ష్మజీవులను కనుగొన్న ఆనంద చక్రబర్తి, ఎయిడ్స్‌ పరిశోధకుడు శార్‌ఙ్గరవన్‌ (ఈ పేరును అచ్చు వేయడం కుదరదేమో, శారంగరవన్‌ అనవచ్చు! తన పేరును సరిగా పలికిన అరుదయిన మనుషులలో నేనూ ఒకడినని ఆయనచేతే అనిపించుకున్నాను), మరో టాటా (నిజంగా ఒక టాటా పరిశోధకుడు ఉన్నాడు) కనిపించి, మిత్రులయి భుజాలు పొంగేలా చేశారు. ఈ సదస్సుల సందర్భంగా కళల గురించి ఒక సెషన్‌ జరిగింది. మన చిత్రకారులు పి.టి.రెడ్డి, ఎం.ఎఫ్‌. హుసేన్‌, కవి విక్రమ్‌ సేఠ్‌, ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు చార్ల్స్‌ కోరియా మరెందరో ఆ సెషన్‌లో పాల్గొన్నారు.
సమాపన కార్యక్రమంలో ప్రధాని రాజీవ్‌ గాంధీ పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత మేమంతా భోజనాలకు బయలుదేరాము. ‘ప్రధాని మనతో భోజనం చేయనున్నారు. ఆయన కొరకు వేచి ఉండాలి’ అని వార్త వచ్చింది. తాంక్స్‌ గివింగ్‌ డే, టర్కీ డిన్నర్‌లో రాజీవ్‌గాంధీగారితో మాట్లాడే అవకాశం కూడా దొరికింది. ఆకర్షణ గల అందగాడతను. ప్రధానమంత్రి ఉండగా, ఫ్రాన్సిస్‌ క్రిక్‌ జెనెటిక్స్‌ అంటే ఏమిటి? అని ఒక పాపులర్‌ ప్రసంగం అంతకు ముందు చేశారు. నొబేల్‌ బహుమతి గ్రహీత విషయాన్ని సులభంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. సైన్స్‌ ఏజ్‌ మాసపత్రిక సంపాదకుడు సురిందర్‌ ఝా ఆ ప్రపంగ పాఠాన్ని పత్రికలో అచ్చు వేయాలనుకున్నాడు. రికార్డింగ్‌ కోసం భార్గవను అడిగాడు. సిసిఎంబి వారు అన్ని ప్రసంగాలను రికార్డు చేశారు. క్రిక్‌ ఉపన్యాసాన్ని వదిలేశారు. భార్గవ, అంటే పుష్ప నన్ను అడిగాడు. నేను రికార్డింగ్‌ ఇచ్చాను. ప్రసంగపాఠం అచ్చయింది.
సంగీతోత్సవాలు, నాటకోత్సవాలు జరుగుతుంటాయి. సిసిఎంబిలో జరిగింది సైన్స్‌పండుగ. అంత ఎత్తున కాకున్నా, అడపాదడపా సైన్స్‌ ఉత్సవాలు జరిగితే ప్రజలకు, సైన్స్‌కు మధ్యన ఉందనుకుంటున్న దూరం తగ్గుతుంది.

This article is from my column Lokabhiramam in Andhrabhoomi Daily Sunday magazine.
It also appeared in my book Lokabhiramam Part 1

Spread the word if you like my blog and the posts here

No comments: