Showing posts with label Reality. Show all posts
Showing posts with label Reality. Show all posts

Saturday, August 1, 2026

లోకాభిరామం - వానొచ్చె వరదొచ్చె : On rain and then Sambaru


వానొచ్చె వరదొచ్చె

పొటుకు - పొట్కు- టపక్‌

ఇల్లంత టపక్‌ పెడ్తున్నాది. పెద్దా పుస్కం తడ్సీ పోతుంది’ అని ఎర్రని గుడ్డలో చుట్టిన ఒక లావుపాటి పుస్తకాన్ని తెచ్చింది బువ్వమ్మ. ఆ పెద్ద పుస్కం పవిత్ర గ్రంథం ఖురాన్‌. తెచ్చిందేమో నిప్పులు కడిగే ఆచార్లవారి ఇంటికి. వాన కాలమంతా ఆ పుస్తకం ఆచార్లవారి ఇంట్లో గూట్లో సురక్షితంగా ఉంటుంది. అక్కడి మిగతా పుస్తకాలు అన్నింటితోబాటు! బువ్వమ్మ ఇల్లు పూరి గుడిసె అనుకుంటాను. ఆచార్ల వారిది మట్టిమిద్దె. అప్పటికి రాతిగోడలు వచ్చినయి కానీ, సిమెంటు కప్పులు రాలేదు.

మట్టిమిద్దె అంటే గోడలు కూడా మట్టివయి, ఆ మీద కప్పు ఉంటుంది. రాతిగోడల మీద కూడా మట్టిమిద్దె ఉంటుంది. దూలాలు లావుగ ఉంటయి. వాటిమీదనుంచి గోడల మీదకు కొంచెం సన్నటి వాట్లు ఉంటయి. (ఈ మాటంటే వేట్లు? అని అడిగాడు నా కొడుకు! మీకు అర్ధమయితే సరే, కాకుంటే వదిలేయండి.) ఆ వాట్లమీద చిలుక చెక్క పరిచి ఉంటుంది. కలిగిన వారయితే పలకలుగా తీర్చిన చిలుకు చెక్కలను, మధ్య ఖాళీలు లేకుండా పరిపిస్తరు. లేదంటే పొయ్యిలోకి కొట్టిన కట్టెలను పేర్చి, మీద గడ్డి పరిచి, ఆ మీద మట్టి వరస వేస్తరు. మట్టిమిద్దెలో ఎండలకు పగుళ్లు వస్తయి. గడ్డి, చిన్న మొక్కలు పెరుగుతయి. చుట్టు గోడలను మిద్దెకన్న కొంచెం ఎక్కువ ఎత్తు వరకు కడతరు. వాటిని కుంబిగోడలు అంటరు. వాటిమీద కూడా పగుళ్లు, గడ్డి మొక్కలు ఉంటయి. వానలు రాబోతున్నయంటే, మొక్క లన్నింటినీ పీకి, చవిటి మన్ను తెప్పించి మిద్దె నిండ పరిపించాలె. మొదటి వానలకే మట్టి తడిసి పరుచుకుంటుంది. దిమ్మిస పీటతో కొట్టి దాన్నంత చదును చేయాలె. వాలు సరిగ్గ వుండేట్లు సరిచేయాలె. ఇదంతా సక్రమంగ జరిగితే పడిన వాననీరు గూనలలోంచి కిందకు పడుతుంది. ఈ పనులు వీలవుతయి, కావు. కుదురుతయి, కుదరవు! ఇంక వాన వచ్చిందంటే చాలు పొటుకు మొదలవుతుంది.

వాతావరణం మారిపోతున్నదని చెప్పడానికి పరిశోధకుల దాక పోనవసరం లేదు. గతంలో వాన కాలమంటే  ప్రతినిత్యం ఉదయం, అస్తమానం వాన కురవవలసిందే. ముసుర్లు పట్టుకుంటే అయిదారు రోజులు ఏకాకారంగా వాన కొనసాగేది. గోనెసంచీ, గొంగడీ కప్పుకుని, అంత దూరం బడికిపోతే ‘సెలవు! వెళ్లిపొండి!’ అనేవారు. ఇంటి కంటే బడి మరింత అధ్వాన్నం. అందునా, మా బడి పక్కనే పెద్ద చెరువు కూడ ఉంది. నీళ్లు గదుల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతటి వానలో ఇల్లు, పూరి గుడిసె అయినా, మట్టిమిద్దె అయినా పొటుకు తప్పదు. పగుళ్లు, మొక్కల వేళ్లుంటే, ఎక్కువగ, లేదంటే, అక్కడా ఇక్కడా మిద్దెలోంచి నీరు ఇంకి చుక్కచుక్కగ పడుతుంది. అదే పొటుకు. మా ఇల్లు నిజంగ తాతల కాలం నాటిది. రకరకాల పాత్రలను ఆ పొటుకు పడుతున్న చోట పెట్టి, నేలన్న తడి కాకుండ జాగ్రత్తపడి, మిగిలిన చోట పండుకోవాలె. పొటుకు మరీ ఎక్కువగా ఉంటె, వానలోనే జాగ్రత్తగ మిద్దె ఎక్కి ఆ భాగంలో తొక్కాలె. చవిటి మన్ను జారుడుగ ఉంటుంది. కాలు జారితే ప్రమాదం! మట్టిమిద్దెలు పోయినయి! పొటుకు మాత్రం మిగిలింది. ఎవరన్నా ఒకేపని గురించి, సంగతి గురించి, తెరిపిలేకుండ అడుగుతూ (నస!) కష్టపెడుతున్నరనుకోండి. దాన్ని పొట్కు-పొటుకు పెడుతున్న రని వర్ణించేవారు. ఆర్‌సీసీ మిద్దెల్లో కూడా లీకులున్నయి. పొటుకుల ఉండే ఉంటయి. ఎండను తట్టుకోవాలని వేసే కూల్‌హోమ్‌ కారణంగ పగుళ్లు వస్తయని చెప్పినరు ఒకరు. మరేమి, అట్లాంటివి జరిగితే పొటుకు తప్పదు!

బల్లి సాంబారు: ఉల్లి సాంబారు అని వేరుగ ఏదయినా ఉంటుందా? సాంబారు వెంగాయం అని చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయని తెలుసు. వాటిని అట్లాగే వేసి సాంబారు వండుతారనుకుంటాను. ‘బిసి బేళె హుళి అన్న’ అంటే వేడి పప్పుపులుసు అన్నం అని అర్ధం. అందులో వెంగాయం అంటే ఉల్లి పాయలు పెద్ద ముక్కలు వేయడం చూచాను. (నిజమే, నాకు తిండి గురించిన చింత ఎక్కువ. ఎర్రోనికి ఏమి చింత? అంటే ఎప్పటికి తిండిమీదనే చింత’ అని ఒక మాట ఉంది. ఈ ఏర్రోడు వెర్రివాడా లేక ఎర్రని వాడా? శివరాజు సుబ్బారావు అనే బుచ్చిబాబుగారు, వరంగల్‌ నవీన్‌గారి పద్ధతిలో పోతున్నది రాత. నా పేరులోనూ ‘బుచ్చి’ ఉంది. వరంగల్లు మీద కావలసినంత ప్రేమ ఉన్నది! అక్కడికే పోవాలె మనం ఇప్పుడు. వరంగల్‌లో ఎమ్‌ఎస్‌సి చదువుతున్నము. మధ్యాహ్నం పూట మొదటి పంక్తి భోజనాలు అయిపోయినవి. అమ్మాయిల హాస్టలు చిన్నది. అక్కడికి కూడా తిండి ఈ హాస్టల్‌నుంచే పోతుంది. అక్కడ కూడ అందరూ తిన్నరు. ఆలస్యమయి రెండవ పంక్తికి వచ్చిన వారు తింటుంటే సాంబారులో బల్లి పడిందని తెలిసింది! అసహ్యం అన్న మాట పక్కనపెడితే తెలియకుండ తిన్నవారికి, రెండవ పంక్తిలోని వారికీ, ఎవరికీ ఏమి కాలేదు! అంతా ఆరోగ్యంగ ఉన్నరు. సంగతి తెలిసిన తరువాత ‘కడుపులో తిరుగుతున్నది!’ అని కొందరు హెల్త్‌ సెంటర్‌కు పరిగెత్తినరు. పరిగెత్తినరంటే ఆరోగ్యంగ ఉన్నరనే గదా అర్థం. డాక్టర్‌ రెడ్డిగారు వాండ్లను పరీక్షించి డైజీన్‌ లాంటి మాత్ర ఏదో ఇచ్చి పంపించినరు. బల్లిని ఉడికించి తింటేనే ఏం కాలేదు. అది మీద పడితే ఏమవుతుంది! ఆ బల్లి అనారోగ్యంగ ఉండి, దాన్ని ద్వారా క్రిములేమైన సోకితే ఏమన్న అవుతుందేమో?ఏమో?

ఉల్లి సాంబారు: మేము (ఇంట్లో) ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనపకాయ లాంటివి తినము. ఛాదస్తమే! అయినా తినము. ఎక్కడన్న ఉల్లిపాయల వంట తిన్నమంటే, తరువాత వాసన తెలుస్తుంది. మాకుండే ఛాదస్తం వెనక కొన్ని పద్ధతులున్నయని చెప్పంగ విన్న. కొన్ని పదార్థాలు చూడడానికి బాగుండవు. కొన్నింటి వాసన బాగుండదు. కొన్ని అర్ధం లేని చాదస్తం! క్యాబేజ్‌ కొత్తగ వచ్చినపుడు నాన్న అడ్వెంచరస్‌ గనుక కొని తెచ్చినడు. అది భయంకరమయిన వాసన.అప్పటి క్యాబేజీతో పోలిస్తే ఇప్పటిది ఎంత మేలో చెప్పలేము. అప్పట్లో పురుగుమందులు ఇంతగ లేవు కనుక ఆకుల మధ్యన పురుగులు కూడ ఉండేవి! ‘కన్న మన్ను తెచ్చి వండమంటరు!’ అని అమ్మ గులుగుడు (గొణుగుడు) నాకు గుర్తుంది. ‘మెప్పులకై కన్నతావు అప్పు వడక’ అన్నారు త్యాగయ్యవారు. కన్న అంటే కనిన అంటే చూచిన అని అర్ధం. అంతేగానీ ప్రసవంతో సంబంధం లేదు. బిడ్డను చూస్తము గనుక అది కానుపు! ‘నిను కన్నది కానుపు’ అని రామదాసుల వారంటే అది చూడడం గురించే, ప్రసవం గురించి కానే కాదు! అందుకే కన్న మన్ను అంటే కనపించిన మన్ను అని.

మళ్లీ, మేము ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనిగెంకాయె తినము (ఈసారి అసలు సంగతే చెప్త!) మా బిల్డింగులో ఒక్కోసారి సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తరు. ఒక్కో ఇంటివారు ఒక వంటకం చేసి తెచ్చి, అందరూ ఒక చోట తినడం అదొక సరదా! మా ఇల్లుగలావిడ, మా యజమాని, మా ప్రొఫెసరు గారు (మాయావిడ, నా భార్య) సాంబారు వండమంటే సరేనని వండింది. అందులో ఆన్యన్‌ అనే ఉల్లిపాయల్లేవు. అయినా చాలా రుచిగ ఉందన్నరు అందరు! ఆనియన్‌ అదే ఆన్యాన్‌ లేకుండా సాంబారు ఎట్లా చేస్తరని అందరూ హాచ్చెర్య పడిపోయేశినరు. తరువాత ఒకటి రెండుసార్లు కూడా సాంబారు తయారీ బాధ్యత మా ఇంటికే వచ్చినట్టు గుర్తు! అన్య అంటే ఇతరము. తమిళంలో అన్యన్‌, అన్నియన్‌ అవుతుంది. అపరిచితుడు ఎందుకు మనకు మన సినిమాలో?

మూడు పైసల నాటకం: అంకుశ్‌ బోర్‌హాడే అనే పేరు మీరు విని ఉండరు. అతను మరాఠీ అయి వుంటడని కొందరికి తోచి ఉండవచ్చు. బెర్ట్‌హోల్ట్‌ బ్రెష్‌ట్‌, జెర్మనీలో ప్రసిద్ధ నాటక రచయిత. అతని పేరును బ్రెఖ్‌ట్‌, బ్రెహ్ట్‌ అని కూడ పలుకుతరు. అతని సాంఘిక నాటకాలు సంచలనం కలిగించినయి. అందులో ఒకదాని అనువాదం ‘ద త్రీ పెన్నీ ఆపెరా’ పోనీ ఓపెరా అనండి! నాకు అభ్యంతరం లేదు. జబ్బార్‌ పటేల్‌ అనే మరాఠీ నాటక కారుడు దానికి అనువాదం కాదు గానీ అనుసరణ చేశినడు. ‘తీన్‌ పైసాచా తమాషా’ అని దాని పేరు. తమాషా అనేది మరాఠీ జానపద నాటక పద్ధతులలో ఒకటి. అక్కడ మొదలయి, ఈ నాటకం సాగుతుంది. అందులో నాయకుని పేరు అంకుశ్‌ బోర్‌హాడే. అతను నాటకం మొదలయిన తరువాత చాలాసేపటి వరకు రంగం మీదకి రాడు. అతనొక రౌడీ, దాదా! పాత్ర వచ్చే ముందు ఆ పేరును ప్రతిధ్వనులతోపాటు హాలంతా కదిలిపోయిందేమో అనిపించే పద్ధతిలో వినిపింపచేసిన తీరు నాకు ఇంకా గుర్తుంది. మనసులో మనం ఒక ఎస్వీ రంగారావును ఊహించుకుంటే, అక్కడ అందమైన యువకుడు ఎదురయ్యినడు. నాటకం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో, అంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. పుణె (పూనా లేక పునహా) బాల గంధర్వ రంగమంచ్‌లో చూచిన నేను. అంకుశ్‌ పెళ్లవుతుంది. హాలంతా రంగు దీపాలు వెలిగినయి. ప్రేక్షకులందరు పెళ్లి వారయ్యినరు! ము! బావుంటుంది, మరాఠీ వారి నాటక విద్య! ఆ హాల్లో నిత్యమూ నాటకం ఉంటుంది. మిగతా చోట్ల సినిమా చూచినట్టే జనం టిక్కెట్లు కొని నాటకాలు చూస్తరు. ఈ అలవాటు మహారాష్ట్రలో ఇంకా కొనసాగు తున్నది. మన దగ్గర హైదరాబాదులో ప్రయత్నం జరిగింది కానీ, కొనసాగలేదు మరి.


 

Monday, July 6, 2026

సిమెంట్ సంతతి : నగ్నముని విలోమ కథలు నుంచి.


సిమెంట్ సంతతి

నగ్నముని విలోమ కథలు నుంచి.

లోకంలో వయసు వచ్చిన అందరు ఆడపిల్లలకు మల్లెనే ఆ పిల్ల కూడా మొదట్లో మంచుతో నేసిన జలతారు ముసుగు, మొహం మీదకు లాక్కుని, రేకు విడవడానికి కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా ఉండేది. కాళ్లలో లేళ్లు గంతులేసేవి. కనురెప్పల్ని కలలు కమ్ముకునేవి. కాళ్లూ, చేతులూ, ప్రతి అవయవం యవ్వన పరిమళపు సెలయేళ్లుగా తుళ్లి పడేవి. పెదవుల మీద వెన్నెల ఒలికి, పలువరసను పలకరించి, ఒంటిలో ఇంకిపోయేది.

నడిస్తే, నడుస్తున్న హారతిలా ఉండేది.

ఆ పిల్ల తండ్రి కాళ్లూ, చేతులూ మెదడూ ఎప్పుడూ ఎక్కడో పన్జేస్తుండేవి. అర్ధ రాత్తుళ్లు బగ్గుమని చివరి మంట మండే లాంతర్లాంటి కళ్ళతో యింటికి చేరేవాడు. కుష్టువ్యాధి వ్యాపించిన వాడిలాగా దరిద్రంతో తీసుకుంటుండేవాడు. దరిద్రం క్రమంగా అతని అన్ని అవయవాల్ని తినేస్తోంది. నెమ్మదిగా నెమ్మదిగా ఇంటి గోడలకి, యింట్లోనే యితర వస్తువులకి, మనుషులకి వ్యాపిస్తోంది ఆ వ్యాధి.

తల్లి వంటింటి అలుగ్గుడ్డ. ఎడతెరిపి లేని దగ్గుగా మారి, చింకి చాప మీద ముణగదీసుకునుండేది. అర్ధరాత్రి మసిబారిన లాంతరు కళ్ళతో, సగం సగం అవయవాల్తో యింటికొచ్చే కట్టెతో కాపరం చేసేది.

వీధిలోని పెంటకుప్పకీ, యింటికీ పెద్ద తేడా లేదు. పెంటకుప్ప మీద గులాబీ మొక్కలాగా ఆ పిల్ల తనని తాను చూసుకునే లోపల ఎదిగిపోయింది.

అవయవాలన్నీ అందమైన పువ్వుల్లోకి మారిపోయినై. కుండీలో పెడతానని, మేకలు తినెయ్యకుండా కాపలా కాస్తానని, అంటుకట్టి మరిన్ని అందమైన రంగురంగుల పూలు పూయిస్తానని, పుస్తకాల్లోంచి, పక్క వీధిలోంచి ఎగిరేచ్చాడో కుర్రవాడు.

వాడి మాటల్లో మత్తు పానీయాలున్నాయ్.

వాడి కళ్ళలో గురితప్పని పూల బాణాలున్నాయ్.

వాడి నిట్టూర్పుల్లో మధురంగా బంధించే లతలున్నాయ్.

వాడి చొక్కాకి గలగలలాడే జేబుంది.

వాడి ఒంట్లో సలసల కాగే రక్త సరసుంది.

వాడి చేతిలో గుండెల్ని సుతిమెత్తగా తెరిచే రహస్య తాళం చెవి వుంది.

అనుమతివ్వాలో లేదో తేల్చుకోకముందే ఆమె గుండెను తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నాడు వాడు. రోజులు అగరొత్తులుగా వెలిగినయ్.

వాగ్దానాల ఊసులు దవనపు వాసనలైనై.

సెలవులయి పోయినయ్.

వొచ్చినంత వేగంతో తిరిగి దూరపు కాలేజీ పుస్తకాల్లోకి పారిపోయాడు వాడు.

వెళిపోయేప్పుడు కిటికీలు ముయ్యలేదు. తలుపు దగ్గరికయినా వెయ్యలేదు. కలలు కళ్ళని కమ్మేస్తే గుండెని బార్లా తెరిచి, గాయం చేసి వెళ్ళిపోయాడు.

గుమ్మం దగ్గరే మొక్కగా వుండగానే మానైపోయి వాడి కోసం రెప్పలు పీకేసిన కళ్ళతో వెతికింది ఆ పిల్ల.

ఆ తరువాత ఆ గుమ్మం దగ్గరకి రకరకాల తాళాల వ్యాపారులొచ్చారు. వాళ్లంతా తాళాల దొంగలే తప్ప గుండె చప్పుడు వినగలిగిన వాళ్ళు కాదు. కొందరు పాత తాళాలకి కొత్త తాళాలు అమ్మేవాళ్ళయితే మరికొందరు కొత్త తాళాల్ని త్వరితంగా తుప్పుతాళాలుగా మార్చేసేవాళ్లే. ఆ యినప వ్యాపారులందరికీ ఇనప బీరువాలు తెరవగలిగిన తాళాలు కావాలి. అంతే.

వాళ్లంతా అనేక జంతువులని వెంట తీసుకొచ్చేవారు. అవి మానవ భాషలో తెగ అరిచేవీ, కరిచేవీ. తండ్రీ కొడుకులూ, అన్నదమ్ములూ, మామ అల్లుళ్లు, బావ, బావమరుదులు, రకరకాలైన జంతువులొచ్చేవి. ఒకడు బొజ్జతో ఖద్దరు వాసన కొడతాడు. మరొకడు కాంట్రాక్టుల వాసన వేస్తాడు. ఒకడు కాసేపు దేహంలోకి వుమ్మూసి బస్సెక్కో, రిక్షా ఎక్కో పాపం చేసినవాళ్ళా పారిపోతాడు. మరొకడు రాత్రంతా కాండ్రించి వూసి తెలతెలవాడుతుండగా మళ్లీ మామూలు ముఖం తగిలించుకుని జారుకుంటాడు. అందరి చర్మపుభాషా ఒకటే. ఒక్కడూ గుండె చప్పుడు వినడు.

ఉమ్ముల దారిలో చర్మం బీటలు వారుతోంది. శరీర వృక్షం బెరడు, పెళ్లులుగా రాలుతోంది. అయినా ఆశ చావదు. వాడెప్పుడో యీ దారంట వస్తాడు. పశ్చాత్తాప్పడతాడు. మనసులో తిరిగి మరులు పూయిస్తాడు. ఇల్లూ, పిల్లలూ చల్లని సంసారంతో సన్నజాజి పందిరి వేస్తాడు. వాడి కోసం రోడ్డుమీద మొహాలు చూడ్డం, వీలున్నప్పుడల్లా వీధులంట తిరగడం, పార్కులో మూల కూర్చుని రావడం మానలేదు ఆమె.

ఒక రోజున పార్కులోనే చాలా రాత్రి అయిపోయింది. రెండ్రోజుల్నుంచీ తిండి లేదు. నీర్సంగా ఉంది. ఇంటికి పోదామని లేచేసరికి వర్షం మొదలయింది. పరుగెత్తుకెళ్ళి పార్కులోనే మూల షెడ్డు లాంటిదుంటే అందులోకి జేరింది. అప్పటికే ఒంటిమీద బట్ట లాంటిది తడిసింది. మెరుపుల్తో వాన పెరుగుతోంది. కింద నాపరాయి, పైన రేకులు, జల్లు మీదకి చిందడం లేదు, కాస్త పర్వాలేదని ముణగదీసుకుని మూలకు జేరబడింది. ఎవరూ దరిదాపులో లేరు. దూరపు గుడ్డి లైట్ వెల్తురు. వర్షం. తన పక్కనే మెరుపుల్లో చూస్తే ఎవడో ఒకడు పడుకున్నట్లు కనబడింది. పరకాయించి చూసింది. మళ్లీ మెరుపులో చూసినప్పుడు అంత విషాదంలోనూ నవ్వొచ్చింది.

అది ఆ వూరుని ఒకప్పుడు ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలిన ఒక గొప్ప రాజకీయ నాయకుడి విగ్రహం. బతికుండగా ఆయన అనేక పదవులు అలంకరించాడు. చేతికి ఎముకల్లేవన్నారు. శ్రీమహావిష్ణువే సాక్షాత్తు యీయన రూపంలో ప్రజాసేవ నిమిత్తం అవతరించా డన్నారు. పేదల పాలిటి పెన్నిధి అన్నారు. సంఘసంస్కర్త అన్నారు.ఒకప్పుడు పార్కు మధ్యన తిన్నె మీద రాజసంగా నుంచుని నీరాజనాలు అందుకున్నదా విగ్రహం. ఇప్పుడు ప్రత్యర్థులు పదవిలో కొచ్చాక షెడ్డులో పడుంది.

ఆ సిమెంట్ విగ్రహాన్ని ఆనుకుని గోడకి చేరగిలబడిందామె. ఎప్పుడు పట్టిందో నిద్ర. వర్షం పడుతూనే వుంది. శరీరం నేల మీద మూలకి ముణగదీసుకుని తుఫానులో చెట్టులాగా వాలిపోయింది. కమ్మటి నిద్ర పట్టేసింది. పాత కల.

నిద్రలోనే వాడితో గడిపిననాటి కల దుప్పటిగా కప్పుకుంది.

అమాయకపు జంతువు మొహంతో వాడు వచ్చాడు. తలుపు తట్టాడు.

పశ్చాత్తాప్పడ్డాడు. క్షమించమన్నాడు.

తిరిగి గుండె తాళం తెరిచాడు. బలంగా, బరువుగా మాటల మత్తు వాసనల్తో యింటి నిండా వసంతం నింపాడు. వాడి కౌగిట్లో కళ్ళు మూసింది. ఆవేశంలో కొట్టుకుపోయింది. అలిసిపోయి ఒడ్డుకుజేరి పడిపోయింది.

వర్షం పెద్దదైంది. గులకరాళ్ళతో బాధడం మొదలెట్టిందల్లా క్రమంగా ఆకాశంలోని బండరాళ్లని దొర్లిస్తున్నట్లు మారిపోయింది. కసిగా నీటి ఖడ్గం గాలిని కోస్తోంది. భూమిని తరుముతోంది. ఎక్కడో పిడుగు పడింది. ఆ పిడుగు ఆమె మూసిన కనురెప్పల మీద పడింది. ఆమె గుండెల్లో పడింది. ఆమె కల మీద పడింది. ఆమెకి చప్పున మెలకువొచ్చింది. వెల్లకిలా పడుకున్నదల్లా వెంటనే లేవాలని ప్రయత్నించింది. లేవలేకపోయింది. ఒంట్లో సత్తువనంతా కూడా తీసుకుని లేవాలని ప్రయత్నించింది. కానీ, లేవలేకపోయింది. తన మీద ఏదో బరువుగా పడుకునుంది. దుంగలా పడుంది. రాతిబండలా కదలనివ్వకుండా మెదలనివ్వకుండా పడివుంది. భూమిలోకి అదుముతున్నట్లనిపిస్తున్నది. ఒక్కసారి ఖణేల్మన్న మెరుపులో ఆమెకి తానెక్కడవుందో, తనమీద ఏమి పడివుందో కనబడింది. తన శరీరంలోని అణువుల శక్తినంతటినీ కూడదీసి బలంగా తనపైనున్న ఆ సిమెంటు శరీరాన్ని పక్కకు తోసేసి నిలబడింది. మరో మెరుపులో కిందకిచూసింది. సిమెంటు విగ్రహం. తనవంకే నవ్వుతూ చూస్తున్న రాజకీయ నాయకుడి విగ్రహం. తిరిగి సిమెంటు చేతులతో దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె వూడిపోయిన తన చీర ముక్కని ఒంటి చుట్టూ చుట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. తను కలలో జేరింది ఆ విగ్రహం కౌగిట్లోకా! విగ్రహం చేతులు వెకిలిగా నవ్వుతూ ఆమెను తిరిగి పొదుపుకోవడానికి ముందుకొస్తున్నయ్. ఆమెకి మతిబోయి, పరుగెత్తుకుంటూ వర్షంలోనే బయటికి వచ్చి పడింది! కంగారులో దారి తప్పింది. ఎప్పటికో యింటికి జేరింది.

నెల తప్పింది.

కడుపులో సిమెంట్ బలంతో మరో మొక్క దేహం రాళ్ల మధ్య వేళ్లూనింది. మొక్కని పీకెయ్యలేకపోయింది.

ఆకాశం పొట్టచిరిగి పేగులుబయట పడ్డట్లు మెరుపులు.

దేహంపై నిరంతరం కురిసే మురికి వాన. లోకపు స్మశానం నిండా కంకాళాల్లా పెరిగిపోతున్న తాళపు చెవులు. ముఖాల్లో అడవి జంతువుల హాహాకారాలు. అయినా, ఆమెలో ఆశ చావలేదు. వాడెప్పుడో వస్తాడు. గాయాలు కడుగుతాడు. గుండెదగ్గర తిరిగి ప్రేమ పిల్లనగ్రోవి నూగుతాడు.

మరో గులాబీ మొక్క పెంట పోగులు ఎదుగుతోంది. వెయ్యి రేకల్తో వికసించబోతోంది. సిమెంటు చేతుల్లోకి, కాళ్ళ కిందకి, ప్రతి మురికి అవయం కిందకీ జేరి అణిగిపోబోతోంది.

రాజకీయ నాయక జంతువులు బతికి వున్నప్పుడే గాక, చచ్చి విగ్రహాలుగా మారి కూడా ప్రజల భవిష్యత్తుని విషయిస్తూనే వుంటారు. తమ సంతతిని పెంచుకుంటూనే వుంటారు.

సృష్టికి సిగ్గు లేదు.

 

 


 

Saturday, June 27, 2026

లోకాభిరామం : మాటాట On Words play



మాటాట

సంత్ తుక్కారామ్‌జీ మహరాజ్ అంటే ఎవరో తెలుసునా? మన ‘ఘనా ఘన సుందరా’ బ్రాండు భక్త తుకారామ్ ఆయనే. తుకారామ్ గొప్ప తాత్వికుడు. ఆ సంగతి మనకు అందలేదు. మనకు సినిమాలో చూచిన భారతము, రాహీ మాసూమ్ రజా గారి పుణ్యమా అని మరింత వివరంగా అందింది. అది ఎట్లనో గుర్తుకు వచ్చిందా? దూద అను దూరదర్శన్‌లో మహా భారత్ సీరియల్ కారణంగా. అంతేగానీ వ్యాసుని భారతములో, జైమిని భారతములోనున్న నూటొక్క సంగతులు మనకు అందలేదు. పుస్తకానికీ, పత్రికకు, కవర్‌పేజీ ఉన్నట్టే, ప్రతి విషయానికి ఒక ముఖం ఉంటుంది. మనకు ముఖ పరిచయ ము అని ఒక పద్ధతి ఉన్నది. ఈ వ్యాసమున్న పేజీలో నా బొమ్మ వేస్తరు. అది చూచినవారు, నేను బజారులో ఎదురుపడినా గుర్తించలేరు. ఎవరన్న గుర్తు పట్టినరే అనుకుందము. నేను లోకాభిరామము రాసే గోపాలమును అని తెలుస్తుంది తప్ప, నా గురించి మిగత సంగతులు తెలియవు. అట్లనే తుకారాం అనంగనే మనకు ముందు అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వస్తరు. సినిమా చూచి ఉంటే, ఆ భక్తుడు గుర్తుకు వస్తడు. ఆ సినిమాలో తుకారాముని కొండ, అద్దమందు పద్ధతిలో చూపి వదిలిపెట్టినరని నా నమ్మకము. నేనా బొమ్మ (అంటే సినిమా, అంటే ఫిలిం) చూడనేలేదు. అయినా ఆయన మహిమలు, మొదలైనవి అంత చూపి ఉంటరని నాకు తోస్తుంది. ఎట్ల తోస్తుంది, అంటే అటువంటి సినిమాలు, అనగా చలన చిత్రములు శాన చూచిన గద, అందుకు తోస్తుంది. ఆ తుకోబా ఇంకా ఏమి చెప్పెను, ఏమి పాడెను, ఎట్ల బతికెను అని మనము తెలుసుకునేందుకు అవసరము ఉండాలె. అవకాశము ఉండాలె. సినిమాలు అంటే, కదిలే బొమ్మలు, చూచి మరిచిపోవుట మంచిది గానీ, మరీ వాటిని గురించి తల పగులగొట్టుకొనడము అనవసరమని గద!

సోది, గదూ! ఇంతకు తుకారామ్‌జీ గురించి ఎందుకు ప్రస్తావించిన? నాకు గుర్తు ఉన్నది, కాని ఈలోపల మనసు పరిపరి విధములుగా పోయి ఎన్నో చెప్పవలెనని అనిపించినది. తుకారామ్ అన్ని పాటలు ‘పాండురంగ’ గురించి రాయలేదు. ఎన్నో ఆలోచింప దగిన లోతయిన చేదు నిజములను ఆయన తన అభంగములనే పాటలలో రాసినడు. రాయలేదు, చెప్పినడు. లేక పాడినడు. అందుట్లో ఒక దాంట్లో, మాటలే నాకు ఆభరణములు, మాటలే నాకు వస్త్రములు, అంటూ చెప్పి, ఈ మాటలనే నీకు పూజగా అందింతును అంటడు. ఈ మాటలను మొదట్లో చదివినపుడు, కొన్ని నాళ్లు ఆ పెద్ద మనిషి తలనిండ నిండి, పరుచుకుని మరొక ఆలోచన రాకుండ చేసినడు. వ్యవసాయ విశ్వవిద్యాలయము వారు నన్ను ఒక ఉపన్యాసం చేయమని పిలిచినరు. నేను ఆ ఉపన్యాసాన్ని ఈ కవితతో ప్రారంభించిన. నాకు వచ్చినది మాటలు ఒకటే, ఆ మాటలనే మీకు అందిస్త అనే భావము కలిగింది. మొదటి నిముషములోనే హాలు చప్పట్లతో మారుమోగింది. ఆ చప్పట్లు నాకు కాదుగద! అవి టోకున తుకోజీ మహరాజ్ గారికే.

ఇంతకు, ఇయాల, అంటే, ఈ పొద్దు, అంటే ఈ దినము, ఈనాడు (పాపము శమించుగాక) నేను చెప్పదలచిన విషయంబెట్టిదనిన, మాట లేకుంటే ఈ పొరుపంచికము, అనగా దునియా, అనగా లోకము, అనగా ప్రపంచము ఎట్లుండును? అని మా వన్ సెవెన్ నైన్ అనే పీఎస్‌జీ అన్నగారు ఉద్యోగములో ఉండంగ, తమ బల్లమీది అద్దము కింద, ఒక కాగితము, కాగితము, కాయిదము, లేకా కాకితము ముక్క, తుంపు, బిట్టు, మీద ‘మౌనేన కలహం నాస్తి’ అని రాసి పెట్టుకుని యుండిరి. మాట్లాడకుండ ఉంటే కొట్లాటలు రావని ముందు అనిపిస్తుంది, నా వంటి, లాంటి, మాదిరి, పోలిన, తుంటరికి. ఉంటే ఎందుకు మాట్లాడవు? అని పేచీ కొట్లాటకు దిగవచ్చును గద!

మాటలు లేకుండ ఈ ప్రపంచము నడుచునా? అయ్యా! అమ్మ! ఇది నాకున్న కొద్దిపాటి, బుర్ర, మెదడును తొలచుచున్న,  తొలుచుచున్న, కలచుచున్న, మలచుచున్న, కలియబెట్టుచునున్న ప్రశ్న! క్రోశ్న, క్రొశ్చన్, క్వశ్చన్, యశ్చన్, యథా, తథా’ ఈ చివరి నాలుగు మాట రాజములు, తోచినవి, గనుక రాసితిని. నిజముగా రాయవలెనని గాదు. రీజనింగ్ పరీక్ష గురించి తెలిసిన వారు ఎవరయినను తరువాత రాదగు మాట ప్రశ్చన్ అని గుర్తించి ఉందురు గాక.

నేను ఎక్కువ మాట్లాడుతనని నాకు తెలుసు. ‘నీవు చాలమటుకు మాట్లాడకుండ ఉంటవు కనుక అవకాశము వచ్చినపుడు, గలగలమని మాట్లాడుతవు’ అని ఒక మిత్రుడు, నేస్తము, చెలికాడు, ఉద్దిగాడు చెప్పెను, వాక్రుచ్చెను నిజంగనే! అంతేకాదు అవకాశము వస్తే చాలు చెట్టుతో, పుట్టతో, గుట్టతో నేను మాట్లాడే ప్రయత్నము చేస్త! మాటలు నన్ను చాలామందికి మిత్రునిగా మార్చినయి. ఒకనాడు నేను బస్సు కొరకు అందరి మాదిరి, లాగనే, వోలెనే, వలెనే, పోలికగనే, దారి, రోడ్ పక్కనే నిలబడి ఉన్న, ఉంటిని. పక్కన ఒకాయన నిలబడి ఉన్నడు. శానమంది ఉండి ఉంటరు. ఈయన చేతిలో ఒక పుస్తకము ఉన్నది. అది అరుదయిన రకము. నాకు నచ్చిన రకము. పట్టలేక ‘ఏమండీ మీ గురించి తెలుసుకోవచ్చునా?’ అని అడిగిన. నాలుగయిదు మాటల తరువాత మాకు పరోక్షముగ పరిచయము ఉన్నదని తేలిపోయినది. ఇంక మాట్లాడుకుంటూ ఎక్కవలసిన బస్ వచ్చినా, అక్కడ కొంతకాలము గడిపినట్టు నాకు గుర్తుంది. అది మాట బలము.

రామాయణములో రాముని మంచితనము గురించి చాలా చాల రాసుకున్నరు. కానీ ఒక మాట నాకు బాగా గుర్తుంటుంది. రాముడు ‘పూర్వభాషి’ యట. అంటే మనము పలకరిస్తమని ఎదురు చూడకుండ, తానే ముందు పలకరిస్తడట. దాన్ని ఈనాటి మేనేజ్‌మెంట్ పరిభాషలో ‘ప్రోయాక్టివ్’ అంటరు. మీరు పలకరిస్తారేమో అని నేను ఎదురు చూస్తున్న. ఈ ఊరికి, ఆ ఊరికి దూరాల లెక్కలో మీరు గూడ అట్లనే ఎదురు చూస్తుండవచ్చు గద! ఎవరూ ముందు మాట్లాడరు. ఈ లోపల పుణ్య కాలము మించిపోవును. లఖ్‌నవీ నవాబులు మీరు ముందు, మీరు ముందు అంటూ మర్యాద చేస్తుంటే బండి ఎళ్లిపోయినట్టు, ఇక్కడ కాలమనే బండి ఎళ్లిపోవును. తస్మాత్ స్పీక్ ఫస్ట్!

మాయావిడ కారు నడుపుతరు. నాకు ఆ పని చేతరాదు, చేతగాదు. ఆమె పక్కన కూచుని హాయిగ దేశమంత తిరుగుత. నేను కారులో ఎక్కినప్పుడు చాలామాట్లు, మేము మా ఇంటికి దగ్గరగ వున్న పెట్రోలు బంకులో ఆగుతము. పెట్రోలు పోయించు కుంటము. ‘మీకు ఇక్కడి వాండ్లు దోస్తులు కాలేదా?’ అని నేను మా శ్రీమతిని అడిగిన. ‘ఆ పిల్లగాండ్లతోటి నాకేమి దోస్తీ’ అన్నట్టు ఆమె నా దిక్కు ఒక చూపు చూచింది. ముందున్న కారు ఓనరునకు అక్కడి అబ్బాయి, బాబు, పిలగాడు ఒక పత్రికను ఉచితంగా ఇవ్వడము గమనించిన. తరువాత మా కారులో సహస్రం, అనగా వెయ్యి రూపాయల రాతినూనె వేయించుకున్నము. పోయించుకున్నము. ఆ యువకుడు పైసలు తీసుకుని ఊరుకున్నడు. ‘ఏం తమీ! నాకు పత్రిక ఇయ్యవా?’ అని అడిగిన. ‘ఎందుకియ్యను సార్!’ అని నవ్వుతూ అతను నాకు గూడ పత్రిక ఇచ్చినడు. ‘ఈసారి గనుక నేను ఆ బాబుకు కనిపిస్తినా, తప్పక చిరునవ్వు నవ్వుతడు’ అని తర్వాత మాయావిడ, మాయామె గారితో అన్న, అన్నాను. (అన్నగాదు భర్త) ఆమె మాత్రము నవ్వి ఊరుకోలేదు. ‘మీలాగ మాట్లాడడము నాకు రాదు’ అన్నది. ఎందుకురాదు? మాటలు రావా? మొగమాటమా? అడిగితే పత్రిక దొరికింది. కాదంటే, అది ఎటువంటి వారికి దొరుకుతుందన్న కిటుకు తెలుస్తుంది. మాట్లాడకుండ ఉంటే పోట్లాట రాదు నిజమే ఉచిత పత్రిక కూడ రాదు, అడగనిదే అమ్మకూడ అన్నము పెట్టదు, అని మాట ఉన్నది.

మనసు నిండ అనుమానాలు ఉంటే ఇట్లనే అయితది, అవుతది, అవుతుంది (మరోటి) ఔతుంది కరెక్టా, అవుతుంది కరెక్టా? మిగతా రెండు మాటలు తప్పా! వివరాలు మునుముందు వీలు వెంట చర్చించెదము గాక. నేను, ఇవాళ మాటలకు అర్థములు మారుట, కొత్త అర్థములు పుట్టుట గురించి రాయాలని అనుకున్నాను. మామూలుగా చేసే పద్ధతిలో గాక, రాసి చూతము అని మొదలుపెట్టితిని. ఇన్ని మాటలు వచ్చినవి. ఇవన్నీ గూడ ఎన్నడో ఒకనాడు చెప్పవలెననుకున్న మాటలే. మిగిలిన మాటలు చెప్పే టందుకు మరింత అవకాశము దొరకనే దొరకదా?

ఝలక్: టప్పాభై సత్తార్ మియా అనగానెవరో మీకు తెలుసునా? మనకు పట్టాభి సీతారామయ్య గారి గురించి గుర్తు ఉండి ఉంటే మంచిదే. ఆయన గొప్ప నాయకుడు. విజనరీ. ఆయన పేరును ఉరుదూలో రాసినరు. తెలుగులో అటువంటి పేరు ఉంటుందని తెలియని ఒక మనిషి చదవను ప్రయత్నిస్తే అది నేను రాసిన విధముగ పలికినదట. ఉరుదూలో అక్షరాలను కలుపుతరు. తెలుగు ఇంగ్లీషు లాగ విడివిడిగ రాయరు. అది చిక్కు. నా ఆలోచనలు కూడ అట్లనే సాగినట్లున్నయి. అయినా తప్పు జరగలేదనే అనుకుంటున్న!

 

Sunday, June 14, 2026

లోకాభిరామం - బ్యాడల పుళి (On languages and me)


లోకాభిరామం - బ్యాడల పుళి 


బ్యాడల పుళి

నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్‌నగర్ వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె. అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే చోట్ల కన్నడంలో హకారం వస్తుంది.  హాలు అంటే పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె. పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది. శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది. బొమ్మల్లో, విగ్రహాల్లో మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము. ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి పక్కనా? కుడి అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ, కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను. పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది. ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది. ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా, పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’ పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు. సంప్రదాయమంటే, అదేమిటి అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్‌రైస్‌లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె) కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్ హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్‌లో ఉరుదూ ప్రభావం బాగ ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్‌గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమిఅన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు) అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ! ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో, ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది. మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని అనుకుంటున్న. జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్‌కు నా మీద కావలసినంత అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు కన్నడములో, లేదా తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి? అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు.  అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ, మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి విన్నవించుకుంట.