Showing posts with label blog. Show all posts
Showing posts with label blog. Show all posts

Saturday, December 27, 2025

నిద్ర – మెలుకువ - సైన్స్ ప్రకారం అవగాహన

నిద్ర – మెలుకువ


నిద్ర – మెలుకువ

మా పక్కింటాయన నేను నిద్రలేచే సమయానికి చక్కగా స్నానం ముగించుకొని మరికొన్ని పనులు కూడా చేసి ఆనాటి పనికి సిద్ధంగా ఉంటాడు. అసలు మొదటినుంచి త్వరగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున్నే త్వరగా లేచే వాళ్ళు, ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారు అని అన్ని భాషల్లో రకరకాలుగా చెప్పేవారు. అయితే అందరికి ఆ రకంగా ఉండడం వీలు కాదు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్, అని కూడా ఒకమాట ఉంది. అంటే త్వరగా నిద్రలేస్తే పని బాగా జరుగుతుంది అని భావం. కనుకనే అందరూ త్వరగా నిద్రలేవాలి అనుకుంటారు.

కానీ కొంతమంది మాత్రం, రాత్రి చాలా సేపు వరకు పనిచేసి, ఉదయాన కొంచెం నెమ్మదిగా నిద్ర లేస్తారు. ఈ రకం తేడాలను పరిశోధకులు క్రోనోటైప్స్ అని గుర్తిస్తుంటారు. వారు మాత్రం త్వరగా నిద్రలేచేవారు గొప్పవారు, మిగతావారు కారు అన్న విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు.

అన్నిటికన్నా ముందు గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. కనీసం 60% మంది అటు రాత్రి పని చెయ్యరు, ఇటు ఉదయాన త్వరగా లేవరు. వాళ్ళ పద్ధతి రెండు పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన నిద్రలేవడం అన్ని లక్షణాల మీదనే ఆధారపడి లేదు అంటున్నారు పరిశోధకులు. రాత్రి పనిచేసే వాళ్లను గుడ్లగూబలు అంటారు. త్వరగా నిద్రలేచే వాళ్ళను భరత పక్షులు అంటారు. అది ఇంగ్లీష్ లో అని వేరుగా చెప్పనవసరం లేదు. ఈ తేడాలకు రకరకాల కారణాలు ఉంటాయి అని కూడా వారు చెబుతున్నారు. కొన్ని ఉద్యోగాలలో రాత్రి పని చేయవలసి వస్తుంది. కొంత మందికి అవసరం ఉండదు.

పరిశోధకులు చెబుతున్న ప్రకారం సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్లు ఎక్కువగా ఉదయాన త్వరగా లేస్తారు అనే అర్థం అవుతున్నది. ఈ తేడాలకు మరొక కారణంగా వయసు కూడా ఉంది. కుర్రవాళ్లు గబ్బిలాలుగా రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉంటారట. వయసు పెరుగుతున్న కొద్దీ, త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటు అవుతుందట.

ఇంతకూ నిద్ర మెలకువల కారణంగా ఆనందంగా బతకడం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఉదయాన త్వరగా లేచేవారు దినమంతా హుషారుగా, సాధారణంగా ఆనందంగా ఉంటారు అని తెలిసింది. టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో ఈ మధ్యన పెద్ద ఎత్తున ఒక పరిశోధన జరిగింది. అక్కడ కూడా త్వరగా నిద్ర లేచేవాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు ఫలితాలు కనిపించాయి. విద్యార్థులు త్వరగా నిద్రలేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారు అని కూడా తెలిసింది.

ముఖ్యంగా విద్యార్థులలో 26.6% మంది గబ్బిలాలు అంటే రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. అటువంటి వారికి ఆనందం తక్కువగా ఉందట. భరత పక్షులు అనిపించుకున్న పిల్లలు చురుకుగా ఉన్నారట. అంతేకాదు సంతోషంగా కూడా ఉన్నారట. ఇక జర్మనీలో లైప్చిష్ యూనివర్సిటీలో కూడా ఈ మధ్య ఇటువంటి పరిశోధన జరిగింది. త్వరగా నిద్రలేచే వాళ్ళకు జీవితాలలో మంచి సంతృప్తి ఉంటుంది అని తెలిసింది. ఇక రాత్రి ఎక్కువ కాలం మెలుకువ ఉండేవారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరి కొన్ని మానసిక సమస్యలు, మత్తుపదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి.

విషయం అనుకున్నంత సజావుగా లేదు. రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉన్నవాళ్లు, అసలు తక్కువ కాలం నిద్రపోతున్నట్టు తెలుస్తున్నది. త్వరగా నిద్రలేవడం కన్నా నిద్ర సమయం ఎక్కువ సమస్యగా ఉంటున్నది. త్వరగా నిద్రలేచే వారికి తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు కూడా కనిపించింది.

ఈ విషయాలన్నీ గమనిస్తుంటే ముఖ్యమైన ప్రశ్న మరొకటి ముందుకు వచ్చింది. నిద్రలో ఈ తేడాలు అసలు ఏ కారణంగా మొదలవుతాయి అన్నది ఆ ప్రశ్న. సహజంగా ఉన్న ఈ పరిస్థితిని ప్రయత్నించి మార్చడానికి వీలు కుదురుతుందా అన్నది మరో ప్రశ్న. ఈ అంశం గురించి వార్విక్ విశ్వవిద్యాలయంలో వివరంగా పరిశోధనలు జరిగాయి. అక్కడ వారికి ఈ క్రోనోటైప్స్ అంటే నిద్ర పద్ధతికి, మనిషి వ్యక్తిత్వానికి మధ్య సంబంధాలు ఉన్నట్లు కనిపించింది. తమను తాము చక్కని క్రమశిక్షణతో నియంత్రించుకోగలవారు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు, అని గమనించారు. అసలు వ్యక్తిత్వంలో స్వయం నియంత్రణ, చక్కని క్రమపద్ధతి, ఆశా భావం ఉంటే నిద్ర వారి నియంత్రణలో ఉంటుంది అని గమనించారు. ఇక సులభంగా మనసును బయటపెట్టి గలగలా మాట్లాడేవారు, రహస్యాలు దాచుకోకుండా ఉండేవారు రాత్రి ఎక్కువ కాలం మెలుకువగా ఉంటున్నారని గమనించారు. జన్యు పరంగా వ్యక్తిత్వ లక్షణాలు వచ్చేవారు, దాని ఆధారంగా నిద్ర విషయంగా కూడా తేడాలు కనబరుస్తారని తెలిసింది.

అన్నిటికి మించి మరొక్క విషయం గుర్తించాలి. క్రోనోటైప్స్ అంటే గుడ్లగూబలు (రాత్రి పని చేసేవారు), భరత పక్షులు (త్వరగా నిద్రలేచేవారు) అన్న లక్షణాలు, శిలాక్షరాలుగా గట్టిగా నిలిచి ఉండవు అంటున్నారు. ఈ పరిస్థితి జన్యుపరంగా కాక మరెన్నో లక్షణాల కారణంగా స్థిరమవుతుంది, అని పరిశోధకులు గమనించారు. కుటుంబంలోని అలవాట్లు, ఉద్యోగం ప్రకారం వచ్చే అవసరాలు, మామూలుగా బతుకు తీరు ఆధారంగా కూడా ఈ నిద్ర పరిస్థితులు నిర్ణయమవుతాయి, అంటున్నారు పరిశోధకులు. కేవలం జన్యు కారణాల వల్లనే కాక నిద్ర తీరు మీద మరెన్నో ప్రభావాలు ఉన్నాయి అన్న అంశం గట్టిగా తేలింది. కనుక ఈ లక్షణాలు కొంత ప్రయత్నిస్తే మార్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా వార్విక్ విశ్వవిద్యాలయంలో ఈ మార్పు గురించి మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరగా నిద్ర లేవదలుచుకున్నవారు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది, అంటున్నారు పరిశోధకులు. ఉదయాన త్వరగా నిద్రలేచినందుకు చక్కని బహుమతి కూడా ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలి, అని వారి సలహా. నిద్ర లేవగానే హాయిగా వేడి వేడి కాఫీ తాగడం కూడా అటువంటి బహుమతులలో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా లేచినందుకు హాయిగా వాకింగ్ వెళ్లి రావచ్చు. తమ కోసం ప్రత్యేకంగా మరొక రకంగా కాలం గడపవచ్చు.

వార్సా యూనివర్సిటీ లో ఈ అంశం గురించి మరికొన్ని పరిశోధనలు జరిగాయి. రుతువుల ప్రకారం కూడా ఈ విషయంలో మార్పులు వస్తాయి అని అక్కడ గమనించారు.

మొత్తానికి త్వరగా నిద్రలేచినందుకు, బతుకు ఆనందంగా గడుస్తుంది అన్న గ్యారంటీ మాత్రం లేదు, అని అర్థమయింది. నిద్ర లేచినందుకు బతుకులో హాయి, బతుకులో హాయిగా ఉన్నందుకు నిద్ర లేచే తీరూ, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా ప్రభావాలు చూపుతాయి. ఫలితంగా సంతృప్తి కలుగుతుంది, అని కూడా అంటున్నారు. దినమంతా చురుకుగా పని చేయాలి, బ్రతుకులో మంచి గమ్యాలు ఉండాలి, అప్పుడు సమయానికి నిద్ర వస్తుంది. కావాలనుకున్నప్పుడు మెలకువ కూడా వస్తుంది. అది చివరగా అర్థం చేసుకోవాల్సిన సూత్రం.

Thursday, December 4, 2025

Prapanchatantram ప్రపంచతంత్రం - ఒక పరిశీలన

 ప్రపంచతంత్రం - ఒక పరిశీలన


ఆధునిక ప్రపంచంలో బతుకుతున్నాం. అన్ని హంగులూ వాడుకుంటున్నాం. అయితే, ప్రపంచం గురించి,  హంగుల గురించి ఆలోచన మాత్రం తక్కువయినట్లు కనపడుతుంది. గేదె ఉంటుందని తెలియదు. పేడ వేస్తుందని తెలియదు. పాలు ఇస్తుందని తెలియదు. తెల్లవారేసరికి తలుపు ముందర పాలప్యాకెట్లు మాత్రం ఉండాలి. పల్లెలలో కూడా కొంతమంది పరిస్థితి ఇట్లాగే ఉంది. పల్లెలకు, పట్నాలకు తేడా కనిపించడం లేదు. నీళ్లు ఇక్కడా లేవు, అక్కడా లేవు. కార్లూ, టెలివిజన్‌లు, సెల్‌ఫోన్‌లు అంతటా ఉన్నాయి. అవి లేనిదే కాలం గడవడంలేదు. కరెంటు లేకున్నాసరే యంత్రాలను పనిచేయించేందుకు, జనరేటర్లు, ఇన్‌వర్టర్లు ఎక్కడచూచినా కనపడుతున్నాయి.

          మొదటినుంచి మనిషి బాధంతా సౌకర్యం కొరకే. ఆ సౌకర్యం ఎట్లా అమరుతున్నది అన్న ప్రశ్న అందరి మెదళ్లలోనూ పుట్టదు. నాడి చూచి, కుప్పె అరగదీసి మందు నాకించే కాలం పోయింది. జలుబయింది అన్నా సరే బోలెడన్ని పరీక్షలు జరగాలి. స్కాన్‌లు, గందరగోళం జరగాలి.

          ఒక్కసారి తలపైకెత్తి చూస్తే అంతులేని ఆకాశం కనపడుతుంది. ఇంకా లోతుకు పోతే అనంతమయిన అంతరిక్షం ఉందట, అదంతా కలిసి విశ్వం అంటారట. కొంతమంది చాలా తెలుసు అన్నట్టు ఈ విషయాలను గోలగోలగా చెప్తుంటారు. లక్షలు, కోట్ల సంవత్సరాలకు ముందు పేలుడు జరిగిందంటారు. కొత్త పరిశోధకులు వచ్చి అదేమీ లేదంటారు. రాబోయే లక్షల సంవత్సరాల గురించి ఏదేదో చెప్పి భయపెడుతుంటారు. ఈ విశ్వం ఒక పెద్ద పేలుడు జరిగినందుకు మొదలయిందా? ఎవరు చెప్పాలి? లేదంటున్నారు కూడా! అది ఎప్పుడూ ఉన్నదే అంటున్నారు.

          మన గురించి, మన ఉనికి గురించి, మన పరిసరాలను గురించి కొంతమంది గట్టిగానే ఆలోచించారు. బోలెడంత సమాచారాన్ని ఒకచోట చేర్చారు. అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సిద్ధాంతాలను, సూత్రాలను తయారు చేశారు. కొంతకాలానికి ఇవన్నీ కలిసి సైన్స్‌ అనే ఒక అర్థంకాని జ్ఞానభాండాగారం పుట్టింది. అర్థంచేసుకోగలిగినవారికి కూడా అందులో విషయాలు, వైవిధ్యం అడ్డుతగులుతున్నాయి. ఇక వాటి గురించి పట్టించుకోకుండా, తన బతుకంటే సైన్స్‌ అని తెలియకుండా బతుకుతున్నవారికి సైన్స్‌కన్నా గందరగోళం మరొకటి లేదు అనిపించే పరిస్థితి వచ్చింది.

          సైన్స్‌ అంటే ఇంతకుముందు అన్నట్టు సమాచారం కుప్పగా కూడిన ఒక లైబ్రరీయా? అందులోకి తొంగిచూచేందుకు అందరికీ అవకాశం ఉండదా? ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? అడిగినవారికి జవాబులు ఎవరు అందించాలి? సైన్స్‌ అన్నది  అంతంలేని ఒక అన్వేషణ. ఒక కార్యక్రమం. ఒక ప్రక్రియ. ప్రశ్నల పరంపర. అర్థం అయినవాటి గురించి, కానివాటి గురించీ, అనుమానాలను పెంచుకుని, ఎందుకు? ఎట్లా? అని ప్రశ్నలు అడగాలి. వాటికి జవాబులు వెతకాలి. అదే సైన్స్‌.  ఒకప్పుడు సైన్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ప్రపంచాన్ని పరిశీలించినవారే మనిషి ఆలోచనలను కూడా పరిశీలించారు.  అంటే, సైన్స్‌కు సైకాలజీకి అప్పట్లో తేడా లేదు. ప్రశ్నల సంఖ్య పెరిగింది. వాటికి జవాబులు కుప్పతిప్పలుగా ఎదురయ్యాయి.  చర్చ మొదలయింది. శాఖలు మొదలయ్యాయి. ఒక్కొక్కరకం ప్రశ్నలకు సైన్స్‌లోనే ఒక్కొక్కశాఖ మొదలయింది. కొంతకాలానికి ప్రశ్న అడిగినవారికి కూడా అర్థంకాని జవాబులు, అంశాలు ఎదురయ్యాయి. మొదటవచ్చిన ప్రశ్న మరీ అమాయకంగా కనిపించింది. ఆ రంగంలో లోతు ఎక్కువయింది. ఆ లోతులోకి దిగినవారికి మిగతా లోతుల అంతు అసలు ఉందని కూడా తోచని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మామూలు మనిసికి, సైన్స్‌కూ మధ్య ఒక అగాధం ఏర్పడింది.  సైన్స్‌ అనే ప్రపంచం మనది కాదన్న భావం మొదలయింది.

          ప్రశ్నలకు జవాబులు కనుగొనే ఆనందంలో సైంటిస్టులు కూడా తాము మామూలు మనుషులమన్న మాట మరచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నలకే జవాబులు వెతికారు. తమ బతుకులలోనే మరిన్ని ప్రశ్నలు ఉన్నాయన్న సంగతి మరిచిపోయారు. ఎదురయిన సైన్స్‌ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వెతుకుతున్నారు కనుక సమాధానం దొరుకుతుంది. సమాధానంతో సంతృప్తి మాత్రం కలగదు. ఈ సమాధానం నిజమని తేల్చుకునేది ఎట్లాగ? అన్నది మరొక గొప్ప ప్రశ్నగా ఎదురవుతుంది. ఒకసారి ఒక ప్రశ్నతోనే తలబద్దలు కొట్టుకోవాలి. అన్ని ప్రశ్నలూ అడిగితే, గజిబిజి తప్ప మరేమీ మిగలదు. ఆ క్రమంలో ప్రశ్నలు వచ్చాయి, జవాబులు వచ్చాయి. బతుకు కొంత అర్థమయింది. సైన్స్‌ మరింత అర్థమయింది. అది తెలిసినవాళ్లకు ఇది పట్టకుండా ఉంది. సైన్స్‌ అర్థమయినవాళ్లకు మిగతా ప్రపంచం పట్టకుండా ఉంది. లైబ్రరీలు మరీ పెద్దవయిపోయాయి. పుస్తకాలు ఉన్నాయని తెలుసు. ఏ పుస్తకం ఎక్కడ ఉందో వెతకడమే ఒక పెద్ద సమస్య. ఆ పుస్తకంలో ఉన్న సంగతిని పట్టించుకుని అర్ధం చేసుకోవడం అంతకన్నా పెద్ద సమస్య.

          దినపత్రికలు చదవడం అలవాటున్నవాళ్లకు ఆ మధ్యన అందరూ దైవకణం గురించి గోల చేయడం గుర్తు ఉండే ఉంటుంది. అంతకుముందు కొంతకాలం ఎయిడ్స్‌ గురించి గొడవ గొడవగా చెప్పుకున్నారు. అప్పుడప్పుడు సైన్స్‌లో ఏదో  ఒక సంచలనాత్మక విషయం తలెత్తుతుంది. అప్పుడు మొత్తం ప్రపంచం అటువేపు మళ్లి ‘సైన్స్‌ ఉంది’ అనుకుంటారు. భూకంపం వచ్చినప్పుడు అందరికీ హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గుర్తుకు వస్తుంది. మామూలు పరిస్థితిలో అది ఉందని కూడా ఎవరికీ గుర్తుండదు. అక్కడ పనిచేసేవాళ్లకు తప్ప!

          ఎవరు ఏ విషయం పట్టించుకున్నా, పట్టించుకోకున్నా బతుకులు కొనసాగుతాయి. బతుకంటే సైన్స్‌ కనుక సైన్స్‌ కూడా కొనసాగుతుంది. బతుకులో సంగతులను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించినవాళ్లకు సైన్స్‌ ఉందన్న భావం అప్పుడప్పుడు కలుగుతుంది. న్యూటన్‌ తలమీద ఆపిల్‌ పడితే, ఆయన ఒక దారిని చూపించి అవగాహన కలిగించాడు. డార్విన్‌కు ప్రపంచమంతా పరిణామక్రమంగానే కనిపించింది. జీవులలో లక్షణాలు వంశక్రమంలో వస్తాయని మరొకాయన చెప్పాడు. ఆవిరితో ఇంజన్‌ నడుపుతానన్నాడు మరొక పెద్ద మనిషి. స్థలం, కాలం వంపు తిరిగాయి అన్నాడు ఇంకొకాయన. ఇవన్నీ వాళ్లు కాకుంటే, మరొకరు ఎవరో ఎప్పుడో కనుగొని ఉండేవారే. కానీ, చాలా విషయాలను చాలామంది కనుగొన్నారు.  కొంతమంది కొత్తదారులు వేశారు. కొంతమంది ఆ దారులలో నడిచారు. దారులు వేసినవారు మన జ్ఞాపకాల నుంచి మరుగున పడి ఉండవచ్చు. కొంతమంది మాత్రం వద్దన్నా, గుర్తుకు వస్తుంటారు.

          విద్యుత్తు వాడుతున్నాం. లైట్‌ బల్బులు వాడుతున్నాం. సెల్‌ఫోన్‌ వాడుతున్నాం. మరెన్నో సదుపాయాలను వాడుకుని  బతుకులను సుఖమయం చేసుకున్నాం. అందిన సుఖాలకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత చెపుదామంటే, ఎవరికి చెప్పాలి?  ఏ ఒక్క సదుపాయమూ మంత్రం వేసినట్టు ఒక్క క్షణంలో ప్రత్యక్షం కాలేదు. రేడియోతరంగాలు ఉన్నాయని కనుగొన్నారు.  సమాచారాన్ని తరంగాలుగా మార్చవచ్చునని మరొకచోట కనుగొన్నారు. అందుకు కావలసిన హంగులను ఇంకెక్కడో కనుగొన్నారు. సెల్‌ఫోన్లో మాటా, పాటా మాత్రమే కాక, బొమ్మలను కూడా పంపగలుగుతున్నాం. ఇవాళ మన జేబులో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ చేయగలిగిన పనిని నాలుగు దశాబ్దాల క్రితం ఒక పెద్ద గదినిండా పరిచిన కంప్యూటర్‌కూడా చేయగలిగేది కాదు. అంటే, ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రానిక్స్‌ అని ఒక రంగం వచ్చింది. అందులో పరికరాలు రాను రాను చిన్నవిగా మారుతున్నాయి. సర్క్యూట్లు, బ్యాటరీలు, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఇవన్నీ నిజానికి పూర్తి వేరు వేరు రంగాలు. అవన్నీ కలిసి సైల్‌ఫోన్‌గా మనముందుకు వచ్చి మురిపిస్తున్నాయి. ఎవరయినా ఒకప్పటి వేలితో తిప్పే పాత టెలిఫోన్‌ను గురించి ఆలోచిస్తున్నారా? ఇవాళ వేలితో ఫోన్‌ తెరమీద మనం చేస్తున్న విన్యాసాలు, జానపదం సినిమాలో మాంత్రికుని ‘హాం ఫట్‌’ కన్నా ఆశ్చర్యకరంగా ఉన్నాయని అనుకుంటున్నారా?

          అది సైన్స్‌ గొప్పదనం! సైన్స్‌ ఆధారంగా పెరిగిన సాంకేతికశాస్త్రం గొప్పదనం! వాటి గురించి ఎంత తెలుసుకుంటే, అంతగా ఆనందం, ఆశ్చర్యాలు సొంతమవుతాయి. వాడుతున్న సౌకర్యం వెనుకనున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పాలంటే, కుదరదు. కానీ, వారి కృషి గురించి అర్థంచేసుకోవడం మాత్రం కొంతవరకయినా వీలవుతుంది.

          ప్రశ్నలు అడిగితే, జవాబులు దొరుకుతాయి. ప్రశ్నలను సైన్స్‌ పద్ధతిలో అడిగితే, సైన్స్‌ పద్ధతిలో జవాబులు కూడా దొరుకుతాయి.  ప్రశ్న అడగడానికి ముందు పరిశీలను అవసరం. ఆ పరిశీలనలోనుంచి అనుభవం వస్తుంది. అందులోనుంచి  అనుమానాలు వస్తాయి. చాలామందికి ఈ అనుమానాలు రాలేదన్న భావం ఉంటుంది. ప్రశ్నలు అడిగే స్వభావాన్ని మనమంతా  ప్రయత్నించి అణగదొక్కుతున్నాం. అడగడానికి లక్షల ప్రశ్నలు ఉన్నాయి. అడిగితే, ఆశ్చర్యకరమయిన సమాధానాలు      ఉన్నాయి. సమాధానాలతోబాటు ప్రపంచం గురించిన మన అవగాహనలు విస్తరిస్తాయి. మరిన్ని ప్రశ్నలు పుడతాయి. మరిన్ని సంగతులు తెలుస్తాయి. సంగతులు తెలిసినకొద్దీ ప్రపంచం మనకు మరింత తెలిసిందిగాను, అర్థమయినట్టుగానూ కనబడడం మొదలవుతుంది. కొన్ని విషయాలు కొత్తగా అర్థమయినప్పుడు మనమేదో కనుగొన్నామన్న ఆనందం కూడా కలుగుతుంది. ఈ రకంగా సైన్స్‌తో పరిచయం పెంచుకోవడానికి మనము సైంటిస్టులను కానవసరం లేదు. ఆ పద్ధతిలో ఆలోచించడం నేర్చుకుంటే సరిపోతుంది.

 

Sunday, November 30, 2025

Lokabhiramam Gauli anaga Balli లోకాభిరామం - గౌళి అనగా బల్లి

లోకాభిరామం

గౌళి అనగా బల్లి


పల్లి పసాదం
నగరేషు కాంచీ అన్నారట. నగరాలలోకి నగరం కాంచీపురమేనని భావం. కాంచీపురం, కాంచీ అయింది. మరింత కుంచించి కంచి అయింది. అది నిజానికి కొంచెం చిన్న నగరమే. కానీ, ఒకే ఊళ్లో అన్ని గుడులు. మళ్లీ కుంభకోణంలోనే అనుకుంటాను, ఉండడం. ఈ రెండు చోట్లా అడుగడుగున గుడి ఉంది. (అందరిలో గుడి ఉందా? ఉండే ఉంటుంది. ఈ మాటలతో ఒక సినిమా పాట ఉండేదని మనవి!) ఎన్ని గుళ్లున్నా కంచిలో అందరూ వెళ్లేది మాత్రం మీనాక్షి అమ్మవారి దగ్గరికి. అంతకన్నా ఎక్కువగా వరదరాజ స్వామి గుడికి.
గుడి - గుడులు - గుళ్లు ఒక మాట! గుండు - గుండ్లు - గుళ్లు మరో మాట. ఈ రెండు రకాల గుళ్లకు తేడా ఉంది. తిరుపతి - తిరుమలల్లో గుడులు, గుళ్లు ఉంటాయి. తిరిగి వచ్చేటప్పుడు గుండ్లు, గుళ్లు ఉంటాయి. కంచి గుడులలో గుండు కొట్టుకునే ఆచారమేమీ లేదు. కానీ అక్కడ యాత్రలలో గుండ్లు, గుళ్లు కనపడతాయి. తిరుపతి నుంచి కంచికి చాలా తక్కువే దూరం. యాత్రలకు బయలుదేరిన వారు సాధారణం తిరుపతి నుంచి కంచికి పోతారు. అక్కడ నుంచి శ్రీరంగం, మరో క్షేత్రం.
కాంచీపురంలో ఒక చివరన అమ్మవార్లు కామాక్షమ్మ కొలువుతీరి ఉంటే, మరో చివరన వరదులుంటారు. ఆయన నిజమయిన పేరు దేవాధిరాజ పెరుమాళ్‌. ఆయన ఉత్సవంలో తుపాకులు, వందిమాగదులు వంటి రాజోపచారాలు ఎక్కువగా ఉంటాయి. కంచిలో శివకంచి, విష్ణు కంచి అని విభాగాలుండేవట. అట్లాంటి పేర్లు నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ, వరదుల కోవెలకు దారి తీసే నగర భాగం పేరు చిన్నకంచి! ఆ గుడిలోకి వెళ్లిన తరువాత అడుగడుగునా తెలుగు. ఈ కాలం బోర్డుల సంగతి పక్కనబెట్టండి. మెట్టుమెట్టునా, గోడలలో తెలుగు పేర్లు మాటలు చెక్కి ఉన్నాయి.
వరదరాజ స్వామి గుడి మనం ఊహించిన గుడివలె ఉండదు. మరీ పెద్ద ఆవరణం. ఎన్నో మండపాలు. ఒక పెద్ద కోనేరు. మరీ పెద్ద తోట కూడా ఉంటాయక్కడ. దేవుడు కొన్ని రోజులపాటు వెళ్లి తోట లోని మండపంలో ఉంటాడు. అక్కడ తోట ఉత్సవం (తోటోత్సవం) జరుగుతుంది.
ప్రవేశించగానే ఉండే పెద్ద ఆవరణలో ఒక పక్కన ఒక చిన్న మండపం ఉంది. అక్కడ నుంచి ఒకాయన కొన్ని తినుబండారాల పేరు చెప్పి ‘పల్లి పసాదం దీస్కో!’ అంటూ అరుస్తున్నాడు. ఇక్కడ వేరుశనగ కాయలు, పల్లీ లేదా ఫల్లీలు ప్రసాదంగా పెడతారేమోనను కున్నాను. కానీ అట్లాగేమీ కనిపించలేదు. పులిహోర, చక్ర పొంగలితోబాటు, లడ్డు, చక్కిలాలు, అతిరసం లాంటివి ఉన్నాయి. కొందరికి అరిసెలుగా తెలిసిన అతిరసాలు ఇక్కడ ఉన్నంత రుచిగా మరెక్కడా ఉండవని అనుభవం మీద తెలుసుకున్నాను. అనుకోకుండా దొరికిన మైసూర్‌పాకు ప్రసాదం కూడా మహా రుచిగా ఉంది. అన్నింటికన్నా స్పెషల్‌ కొడల ఇడ్లీ. అరటి మానులాగ గుండ్రంగా, మూరెడంత పొడుగుంది ఒక ఇడ్లీ. ఒకరిద్దరే ఉంటే దాన్ని కొన్నా తినలేరు. అరడజను మందికి ఒక పూట అది ఆహారంగా సరిపోతుంది. ఈ రకం ఇడ్లీ కంచిలో మాత్రమే దొరుకుతుంది. అక్కడి హోటేళ్లలో కూడా, కొన్ని (చాలా తక్కువ, ఒకటి రెండు) చోట్ల మాత్రం దొరుకుతుందది. అక్కడయితే ఒకరికి సరిపడేంత యిస్తారు. నేనడిగిన చోటే, ‘బుధవారమయితే ఉంటుంది’ అన్నారు. గుళ్లో, నా వేషం కారణంగా దొరికిన చిన్న ముక్కతోనే సంతృప్తి పడవలసి వచ్చింది.
పల్లి అన్న మాట ముందు వచ్చింది. మధ్యలో వచ్చింది. సంగతి మాత్రం రాలేదు. గుర్తుంది. గుడిలోకి ప్రవేశించాము అనుకుని దూరితే అక్కడ నరసింహస్వామి ఎదురవుతాడు. బయటకు వచ్చి మరింత ముందుకు పోతే అందరూ ఒకపక్కన మెట్లెక్కుతుంటారు. బోర్డు ఉంది గానీ, చూడకుండా వెళ్లిన వారికి, అక్కడ పెరుందేవీ తాయారు అనే అమ్మవారు చిరునవ్వుతూ దర్శనమిస్తారు. మేము మొదటిసారి వెళ్లినపుడు, అమ్మవారి గోపురం మీద బంగారు తాపడం లాంటి ఏదో జరుగుతున్నదని ఉత్సవమూర్తిని మాత్రం మరో పక్కన ఉంచారు. అక్కడే దర్శనం. మరింతకూ అసలు స్వామి, వరదరాజు, లేదా దేవాధిరాజ పెరుమాళ్‌ ఏరీ? ఆయన వెతుక్కుంటూ వెళితేగాని దొరకడు. సరయిన తోవచూపే బోర్డులు కూడా లేవు. చుట్టూ తిరిగి ఆవరణలో పూర్తి వెనక్కు వెళ్లాలి. అక్కడ ఒక మూల మెట్లుంటాయి, తెలుగక్షరాలతో సహా. ఎక్కి, తొక్కి ముందుకు, పైకి చేరాలి. తలుపులో ప్రవేశిస్తే, మరో బోలెడన్ని మెట్లుంటాయి. కీళ్ల నొప్పులుగల వారికి ఈ స్వామి పరీక్ష పెడతాడు. ఇంకొంచెం లోపలికి వెళితే, అదిగో స్వామి అంటారు. అక్కడ మళ్లీ మెట్లు! ఆ మీద నిజంగా, నిలువెత్తుకన్నా పెద్ద స్వామి. గాలి సరిగా ఆడని ఆ గుడిలో మనం ఉండేది కొంచెం సేపే! అయినా దేవుడు కనిపిస్తాడు.
దేవాధిరాజ స్వామిని చూచిన తరువాత, అసలు సంగతి నాకు అర్థమయింది. అక్కడ పక్కనే బంగారు బల్లి ఉంటుంది. స్వామిని చూడటానికి టికెట్‌ లేదు. బల్లిని తాకడానికి రెండు రూపాయలు. మరింత ముందుకు వెళ్లి కుడికి తిరిగితే కర్ర మెట్లు ఎక్కాలి. కీళ్లనొప్పులా? ఆపైన పై కప్పులో బంగారు బల్లి, బారెడు పొడుగున తాపి ఉంటుంది. పైకి ఎక్కితేనే అందుతుంది. పిల్లలయితే ఎవరయినా ఎత్తుకోవాలి. బల్లిని ఆ చివర నుంచి ఈ చివర దాకా నిమరాలి. మెట్లు, మరోపక్క దిగి, మరిన్ని మెట్లు, మరికొన్ని మెట్లు దిగి బయటకు రావాలి. ఈ బల్లిని, బల్లిని తాకిన వారిని, తాకిన తర్వాత, బతికున్న బల్లిని ముట్టుకున్నా బాధ లేదని మనవారి నమ్మకం!
ఎన్నిసార్లు చూచినా ఈ గుడిలో నాకు తెలుగు వాళ్లే ఎక్కువగా కనిపించారు. మన వారికి వెంకన్న, ఎంకన్న తెలుసుగానీ, ఈ వరదయ్య గురించి అంతగా పట్టినట్లు లేదు. అందరూ ఈ గుడికి బల్లి కొరకే వస్తారు. దారిలో ‘బల్లి ఎక్కడ?’ అని అడిగిన తెలుగు వారికి, ‘ముందు దేవుడిని చూడాలి. అప్పుడు బల్లి కనిపిస్తుంది’ అని చెప్పాను. అసలు సంగతి వారికి తరువాత అర్థమయి ఉంటుంది. అందరూ వచ్చేది బల్లి కొరకయితే, అక్కడ ప్రసాదం కూడా బల్లి ప్రసాదమే కావాలి గదా? తమిళంలో బల్లిని పల్లి అంటారేమో? అనుమానం లేదు తమిళంలో పల్లి అంటే బల్లి. ఇక తీసుకోండి అనాలని అర్థంకాని ఆ అయ్యవారు ‘పల్లి పసాదం దీస్కో!’ అని అరుస్తున్నాడు. కానీ ఎవరూ ప్రసాదం తీసుకోవడం లేదు. పైసలు లేందే ప్రసాదం లేదు గద మరి!
బల్లిని ముట్టుకుంటే, అది పైన బడితే ఏదో జరుగుతుందని ఎవరన్నారో మరి? బల్లిపాటు ఫలితాల గురించి, అంటే శరీరంలో ఏయే భాగం మీద బల్లి పడితే ఏమవుతుందని చెప్పే పట్టిక ఒకటి ఉంటుంది. శిరస్సున పడితే కలహంతో మొదలయి, గుహ్యం - మరణం అని ఆ లిస్టు అంతమవుతుంది. వెతికి వెతికి బల్లి ముడ్డి మీద ఎప్పుడు, ఎట్లా పడేను? పడదు. వీలు లేదు. పడినా ఎవరూ చావరు!
మన వారికి ఇటువంటి నమ్మకాలు కావలసినన్ని తెలుసు. వాటి వెనుకనున్న సంగతి తెలుసుకోవాలని మాత్రం ఎవరూ ప్రయత్నించరు. కనుకనే వరదయ్య కన్నా ఆయన వెనుకనున్న బల్లికి గొప్ప పేరన్నమాట. వరదయ్య ప్రసాదం బల్లి ప్రసాదంగా మారింది. బల్లి కావాలే కాని దాని ప్రసాదం ఎవరికి కావాలి? పట్టదు గాక పట్టదు.
***
మంత్ర బియ్యం: చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చదువుతున్న రోజుల్లో విన్న ఈ మాట ఈ మధ్యన గుర్తుకు వచ్చింది. దొంగతనం జరుగుతుంది. లేదంటే ఒక పొరపాటు పని జరిగినట్టు తెలుస్తుంది. అది ఎవరు చేసిందీ బయటపడదు. తెలిస్తే గద శిక్ష! అప్పుడు మంత్ర బియ్యం (సమాసం బాగుండలేదు. మంత్రం బియ్యం అనాలి) ప్రయోగిస్తారు. ఆ బియ్యాన్ని ఎవరు మంత్రించి ఇచ్చేవారో గుర్తులేదు. మొత్తానికి అక్షతల వంటి బియ్యం వస్తాయి. అందరికీ కొంచెం కొంచెంగా పెడతారు. ఏ తప్పూ చేయని వారు వాటిని శుభ్రంగా నమిలి తింటారు. తప్పు చేసిన వారు ఆ బియ్యం తింటే ఏదో అవుతుందని ఒక భయం. ఒక పిల్లవాడు బియ్యం తిని వాంతి చేసుకున్నాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు. బియ్యంలో మంత్రం లేదు గానీ, బోలెడు సైకాలజీ ఉందని తరువాత అర్థమయింది. భయం మనిషిని పట్టి ఇస్తుంది.
***
కోదండం: పిల్లవానికి తీవ్రమయిన శిక్ష అంటే ఆ కాలంలో కోదండం వేసేవారు. కోదండం అంటే నిజానికి రాముని బాణం. కానీ ఇక్కడ మాత్రం రెండు చేతులకు కలిపి తాడు పట్టించి, ఆ తాటి నుంచి వాడు పై కప్పులోని కొండి నుంచి వేలాడుతుంటాడు. కింద కంప (ముళ్లుండే కొమ్మలు) ఉంటే మరింత గట్టి శిక్ష! తాడు వదిలి కింద పడలేక, వేలాడలేక, వాడు పడే బాధ వర్ణనకు అందదు. పశ్చాత్తాపానికి దారి తీస్తుందేమో కూడా!

Thursday, November 13, 2025

Abhishek Raghuram : Nadasudarasa - Arabhi

Abhishek Raghuram

Nadasudarasambilanu  - Arabhi


nAda sudhA rasamb(i)lanu

nar(A)kRti(y)AyE manasA

 

Anupallavi

vEda purAN(A)gama

SAstr(A)dulak(A)dhAramau (nAda)

 

CharaNam

svaramul(A)runn(o)kaTi ghaNTalu

vara rAgamu kOdaNDamu

dura naya dESyamu tri guNamu

nirata gati SaramurA

sarasa sangati sandarbhamu gala giramulurA

dhara bhajana bhAgyamurA

tyAgarAju sEvincu (nAda)

Tuesday, November 4, 2025

Loka 14 Katha cheputanu Ookodatava (కథ చెపుతాను ఊ కొడతావా?

Katha cheputanu Ookodatava
(కథ చెపుతాను ఊ కొడతావా?)


వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. ` ఎవరన్నారో తెలియదు.

---

చాలామంది కథలు రాస్తారు. కానీ నిజానికి కథలు చెప్పడం అసలు పద్ధతి. పురాణం అన్నా, హరికథ అన్నా కథ చెప్పడమే. ఇక జానపద పద్ధతిలో జముకులకథ, బయిండ్లకథ, బుర్రకథ లాంటివి ఎన్ని చెప్పినా కథ చెప్పడమే కానీ ముందు రాసుకుని దాన్ని నోటికి నేర్చుకుని చెప్పే పద్ధతి లేనేలేదు. చుక్క సత్తయ్య ఒగ్గు కథ గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్లకు నమస్కారం. ఎన్ని కథలు చెపుతావు అని అడిగితే దండకంలాగ బోలెడన్ని పేర్లు ఒక లయలో చెప్పేసేవాడు. వాటన్నిటికీ పుస్తకాలు లేదా వ్రాతప్రతులు ఉన్నాయని అనుకునే వాళ్లకు నిరాశ ఎదురవుతుంది. సత్తయ్యకే కాదు, జానపద కథలు చెప్పే వాళ్లకు ఎవరికీ ఒక స్క్రిప్టు ఉండదు. వాళ్లకు కథ తెలుస్తుంది. గతంలో తమ వంటి వారు చెప్పిన తీరు విని ఉంటారు. కనుక ఎప్పటికప్పుడు కథను తమ లయలో మాటలను పేరుస్తూ అందంగా చెప్పేస్తూ ఉంటారు. పురాణానికి పుస్తకం ఉంటుంది.  హరికథకు కొంతవరకు ఒక రాత ప్రతి ఉంటుంది. కనీసం పాటలకయినా ప్రతి ఉంటుంది. కథకు మాత్రం కథకుల కౌశలాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రూపం వస్తుంది.
మా ఇంట్లో బుడ్డన్న పనిచేసే వాడు. పాతకాలం పద్ధతిలో చెప్పాలంటే అతను మా జీతగాడు. వ్యవసాయం పనులను అన్నింటినీ తానే చేస్తుంటాడు. అవసరం కొద్దీ మిగతా వాళ్లు ఎప్పటికప్పుడు రోజుకూలీకి వస్తారు. బుడ్డన్న మాత్రం సంవత్సరమంతా మాతోనే ఉంటాడు. అట్లా అతను కొన్ని సంవత్సరాల పాటు మాతో ఉన్నాడు. నేను ప్రేమగా ‘బుడ్డడు’ అని పిలుచు కునే మా బుడ్డన్న గొప్ప గాయకుడు. ఆ సంగతి వానికి తెలియదు. ఆ కాలంలో నాకు అంతకన్నా తెలియదు. రేడియోలో వారు జానపద సంగీతాన్ని సేకరించి, దాన్ని లలిత సంగీతం వాళ్లచేత పాడిరచడం అప్పట్లో పద్ధతి. అది అన్యాయమని నాకు తరువాత అర్థమయింది. ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లలో జానపద సంగీతాన్ని జానపదుల చేతే పాడిస్తూ ఉంటే నాకు బుడ్డన్న గుర్తుకు వస్తాడు. అయితే బుడ్డన్న గురించి చెపితే శాఖా చంక్రమణం అవుతుంది. నిజానికి వాని తమ్ముడు అడివన్న. వాడు నాకంటే వయసులో చిన్నవాడు. కనుక నాకు వాడు దోస్తు. వాడు మా పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అప్పుడప్పుడు నాతో కబుర్లతో గడిపే వాడు. వాడు కథల పుట్ట. ఎన్ని కథలు ఎంత బాగా చెప్పాడో గుర్తుకు తెచ్చుకుంటే నాకు కళ్లకు నీళ్లొస్తాయి. నీళ్లెందుకు? పాపం అడివన్న ఇప్పుడు లేడు. వాడు ఉంటే కూచోబెట్టి కథలు చెప్పించి పుస్తకాలకు, పత్రికలకు వాడి పేరుననే ఎక్కించే వాడిని కాదా? అది నా బాధ. అది ఇప్పుడు వీలుకాదు.
నేను కథలు రాయకూడదని నిర్ణయించుకున్నాను. వ్యాసాలు, అందునా సైన్స్‌ వ్యాసాలు రాయాలన్నది నా నిర్ణయం. అయినా సరే, ఆ వ్యాసాలలో నా రాతతీరు మాట్లాడుతున్నట్టే ఉంటుందని చాలామంది నాకు చెప్పారు. ఆ తరువాత నాకు కూడా ఆ విషయం తలకెక్కింది, అర్థమయింది కూడా. మనం ప్రపంచానికి చెప్పదలుచుకున్న సంగతిని మాటలతోనే చెపుతాము. ఆ మాటలను, పాటలను, రచనలను కనిపించే అక్షరాల ద్వారా అందించడం చాలా తరువాత వచ్చింది. కొంత మంది మాత్రమే కలం పట్టుకుని కూచుంటే, మాట తీరున కాకుండా మరో రకంగా రాస్తారు. ఆ రచన చదువుతుంటే రచయిత చెపుతున్న భావం వినిపించదు, కనిపించదు. రాతలో కనిపించిన అక్షరాలు శిలా శాసనాలయితే బాగుంటాయి. కథలు, కవితలయితే అవి చెప్పినట్టుగా ఉంటేనే బాగుంటాయి. కథ అంటేనే చెప్పబడినది అని అర్థం కదా! 
కొంతమంది ఉపన్యాసం చెప్పినా, ముందు రాసుకుని చెపుతున్నట్టు ఉంటుంది. అది బాగుండదు అనడానికి లేదు. చెప్పే తీరును బట్టి అది కూడా ఆకర్షణీయంగా ఉండవచ్చు. వేలుక్కుడి కృష్ణన్‌ అని ఒక తమిళ పండితుడు గొప్పగా ప్రవచనాలు చెపుతాడు. గంటలు మాట్లాడినా ఆయన ప్రవచనంలో అనవసర మయిన మాటలుగానీ, చెప్పిందే మళ్లీ చెప్పడం గానీ ఉండదు. మొదట్లో ఆయన పద్ధతి గొప్పగా ఉందని అనిపించింది. రానురాను అది కొంచెం బిగిసుకు పోయిన పద్ధతేమో అని అనిపించ సాగింది. ఇక మరికొందరు ఉప న్యాసం చెపితే ‘ఎందుకు చెపుతున్నా ననంటే అండీ’ అంటూ మరీ పిచ్చాపాటి పద్ధతికి దిగుతారు. చెప్పిందే మళ్లీ చెప్పడం గురించి మళ్లీ మళ్లీ చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. చెప్పవలసిన విషయాన్ని మరీ మనసుకెక్కించాలంటే ఒకసారి పునశ్చరణ చేయాలని పద్ధతి ఉంది గానీ అదే పనిగా రుబ్బుతూ ఉంటే దాన్ని పిండి పిసకడం అంటారు. ఈ మధ్యన పురాణాలు, ప్రవచనాలు వింటూ ఉంటే నాకు ఈ సంగతి క్షణక్షణం గుర్తుకు వస్తుంది. కథ ముందుకు సాగదు, విషయం బయటకు రాదు, మాటలు మాత్రం సాగుతూనే ఉంటాయి.
ఇంతకూ ఈ విషయం ఎత్తుకుని ఎందుకు చెపుతున్నాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇన్నాళ్లుగా రాస్తున్నానుగానీ నన్ను ఎవరయినా రచయిత అంటే, ఒక్క క్షణం నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను రాయడం లేదు, నాకు తెలిసిన సంగతులను, అర్థమయిన సంగతులను మళ్లీ చెపుతున్నాను. ఈ చెప్పడం లోని అనుభవం అది రాసే వాళ్లకు తెలిసినట్టే చదివే వాళ్లకు కూడా తెలుస్తుంది. గ్రాంథికంగా, లేకున్నా సరే పడికట్టు పద్ధతిలో రాసిన మాటలు చదువుతుంటే ఊపు ఉండదు. అందులో రచయిత గొంతు వినిపించదు. ఈ గొంతు అన్నమాటను అందరూ పట్టుకోవాలని నాకు గట్టి నమ్మకం. పుస్తకం చేతికి ఎత్తుకుంటే పేజీలో అక్షరాలు కాక, టీవీ తెరమీద లాగ ఆ విషయం చెప్పిన మనిషి కనిపించాలి. అక్షరాలు ఆయన మాటలయి వినిపించాలి. విశ్వనాథ సత్య నారాయణగారిలా అందరూ రచనలు చేసి ఉండక పోవచ్చు. ఆయనకు కూచుని రాయడం అలవాటు లేదట. ఆయన చెపుతూ ఉంటే పక్కన మరెవరో కూచుని రాసేవారట. పుట్టపర్తి వారి గురించి కూడా ఇదే మాట విన్నాను. వాళ్ల రచనల్లో మాటల ధోరణి వినిపించింది అంటే ఆశ్చర్యం లేదు. అందరు రచయితలు అట్లా డిక్టేటర్స్‌ కాదు. ఎవరికి వారు కూచుని రాసుకున్నారు. ఈ మధ్యవరకు నేను కూడా అదే పద్ధతి. అయినాసరే తమ గొంతు పాఠకులకు వినిపించేలా రచయితలంతా రాయడానికి ప్రయత్నం చేశారు. చాలామంది ఆ పనిని విజయవంతంగా చేయగలిగారు.
సులభంగా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. వార్తా పత్రికను ఒకదాన్ని ఎత్తుకుని ఏ అంశాన్నయినా తీసుకుని చదివి చూడండి. వార్తలలో వ్యక్తి కనిపించ కూడదు. కేవలం విషయం కనిపించాలి. కాబట్టి దాన్ని బొటాబొటిగా రాస్తారు. వ్యాఖ్య అయితే వెంటనే రాసిన మనిషి గొంతు వినిపిస్తుంది.
రచయితలందరూ మంచి మాటకారులు కాదు, బాగా ప్రసంగాలు చేయగలిగిన వారందరూ బాగా రాయలేకపోవచ్చు. ఇందుకు కారణం వారి గొంతు. కలం పట్టుకుని కూచుంటే గొంతులో గుండె వచ్చి ఇరుక్కుంటే రచన ముందుకు సాగదు. ఎదురుగా ఎవరో కూచున్నారని ఊహించుకుని వాళ్లకు చెపుతున్నట్టు రచన మొదలు పెడితే అది చాలా సులభంగా జరుగుతుంది. అడివన్న కథ చెపుతూ ఇంచుమించు అక్కడ ప్రత్యక్ష పురాణం పద్ధతిలో సీన్‌ను సృష్టించే వాడు. డైలాగు చెపితే దాన్ని రాసిన అక్షరాన్ని ఏ భావమూ లేకుండా చదివినట్టు చెప్పామనుకోండి. అర్థం ఉండే మాటలు కూడా అర్థం లేనట్టు కనిపిస్తాయి. ‘అయ్యో! అంత పని జరిగిందా?’ అనే ఒక డైలాగును మా కుటుంబమంతా కలిసి ఒకనాడు టీవీలో విన్నాము. ఆ చెప్పిన అమ్మాయికి చేతులెత్తి నమస్కరించాలి. భావం ఏ మాత్రం పలకకుండా ఆమె చెప్పిన పద్ధతిలో ఆ డైలాగు చెప్పాలని మా ఇంట్లో వాళ్లమంతా ఇవాళటికీ పోటీ పడుతుంటాము. గొంతు! అచ్చు అక్షరంలో కూడా గొంతు! దాన్ని గురించి కాసేపు ఆలోచించండి. అప్పుడు నేను కథ చెపుతాను. మరి ఊ కొడతారా?
aలక్‌ : చాలామంది ముందు కవిత రాసుకుని దాన్ని కవి సమ్మేళనంలో వినిపిస్తారు. నాకు తెలిసిన కొందరు చెప్పవలసినదంతా ముందు చెప్పేసి అప్పుడు దాన్ని అచ్చు రూపంలోకి మారుస్తారు. నేను కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాను. ఈ నాలుగు మాటలను కూడా నేను కలంతో రాయలేదు.