Tuesday, March 31, 2026

పగిలిన అద్దం - సాదిఖ్ హిదాయత్ (ఇరాన్) In Telugu now!


పగిలిన అద్దం - సాదిఖ్ హిదాయత్ (ఇరాన్)

వసంత రుతువు మొదట్లో పూసిన పువ్వులాగా ఓడెట్ ఫ్రెష్ గా ఉంది. ఆకాశం రంగు కళ్ళు ఆశ గొలుపుతుంటాయి. జుట్టు బుగ్గల మీదకు జారి దోబూచులాడుతూ ఉంటుంది. తెల్లని మృదువైన ముఖంతో ఆమె గంటల తరబడి ఆ కిటికీ ముందు కూర్చుని ఉంటుంది. కాళ్లు ఒకదానిమీద మరొకటి వేసుకుని నవల చదువుతూ ఉంటుంది. లేదంటే ఏ మేజోళ్లనో బాగు చేస్తుంది. అయితే ఆమె తన వయోలిన్ మీద గరిజారి నాట్యం వరుసలు వాయించినప్పుడు మాత్రం నా గుండె ఊగిసలాడుతుంది.
నా గది కిటికీ, ఓడెట్ గది కిటికీకి ఎదురుగా ఉంటుంది. నా కిటికీలో నుంచి ఎన్ని నిమిషాలు, గంటలు, బహుశా ఆదివారం మొత్తం రోజు, ఆమెను చూస్తూ ఉండిపోయానో! అందునా రాత్రి ఆమె తన స్టాకింగ్స్ తీసేసి మంచం మీద చేరే సమయంలో మరీనూ!
ఈ రకంగా మా మధ్యన ఒక చెప్పరాని అనుబంధం ఏర్పడింది. ఒక్కనాడు ఆమెను చూడకుంటే, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ఒక్కనాడు ఆమె వైపు మరీ ఎక్కువసేపు చూస్తానేమో, ఆమె లేచి కిటికీ మూసేస్తుంది. ఇద్దరమూ రెండువారాలుగా ఒకరిని ఒకరు గమనిస్తూ ఉన్నాము. అయితే ఆమె పట్టనట్టు మ్లానంగా ఉండేది. ఆమె కనీసం చిరునవ్వలేదు. నాపట్ల తన భావాలు తెలిసే రకంగా ఏ కదలికా చేయలేదు. అయితే ఆమె చూపులు సీరియస్ గా ఉన్నాయి.
ఒక ఉదయాన ఆమెకు నేను నేరుగా ఎదురుపడవలసి వచ్చింది. అప్పుడు నేను తిండి తినడానికి వీధి చివరి కెఫేకు వెళుతున్నాను. బయటకు రాగానే ఓడెట్ కనిపించింది. చేతిలో వయోలిన్ పెట్టెతో ఆమె మెట్రోవేపు పోతున్నది. హలో, అన్నాను. ఆమె చిన్నగా నవ్వింది. ఆమె వయోలిన్ పెట్టె పట్టుకోవచ్చా, అని అడిగాను. అంగీకారంగా తల ఆడించింది. తాంక్స్, అన్నది. ఆ ఒక్క మాటతో మా పరిచయం మొదలయింది.
ఆనాటి తర్వాతే మేము కిటికీలు తెరిచినప్పుడుల్లా ఒకరితో ఒకరం మాట్లాడుకో సాగాము. దూరం నుంచే సైగలతో సంభాషణ సాగేది. ప్రతిసారి ప్రతిఫలంగా మేము లూగ్జెంబూర్గ్ గార్డెన్ కు చేరి కలుసుకునేవాళ్ళము. తరువాత ఏదో సినిమాకు, నాటకానికి గాని వెళ్ళాము. లేదంటే మరేదో పద్ధతిలో ఒకరితోబాటు మరొకరుగా, గంటల తరబడి గడిపాము. ఓడెట్ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తల్లి, ఆమె గారి రెండో భర్త, ఎక్కడికో వెళ్లారు. ఉద్యోగం పేరున ఆమె మాత్రం పారిస్ లోనే ఉండిపోయింది.
ఆమె చాలా తక్కువ మాట్లాడుతుంది. అయితే చిన్న పిల్లల మనస్తత్వం గలది. కొంచెం మొండిరకం కూడా. ఒక్కోసారి నాకు కోపం తెప్పించేది. రెండు నెలలపాటు మేము దోస్తీ కొనసాగించాము. ఒకనాడు, ఆ సాయంత్రం న్యూలీలో జరిగే సంతకు పోవాలనుకున్నాము. ఆ రాత్రి ఓడెట్ తన కొత్త నీలిరంగు డ్రెస్ వేసుకున్నది. మామూలుకంటే ఎక్కువ సంతోషంగా కనిపించింది. మేము రెస్టొరాంట్ నుండి బయటకు వచ్చి మెట్రో దిక్కువగా నడుస్తుంటే, ఆమె దారి పొడుగునా తన బతుకు గురించి చెప్పింది.
జనం గుంపులుగా వస్తున్నారు, పోతున్నారు. వీధివెంట అన్నిరకాల సరదా వ్యాపారం సాగుతున్నది. ఎంటర్టేనర్స్ ప్రదర్శనలు చేస్తున్నారు. షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. లాటరీ టికెట్, మిఠాయిలు, సర్కస్, చిన్న ఎలక్ట్రిక్ కార్లు, గిరగిరా తిరిగే బెలూన్లు, మరేమో రైడ్స్, రకరకాల ప్రదర్శనలు, అన్నీ ఉన్నాయి. అమ్మాయిల అరుపులు, మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. గుసగుసలు కూడా. అవి మోటార్ల ధ్వనులు, సంగీతాలలో కలిసి పోతున్నాయి.
మేము కార్ రైడ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. అది ఒక కారు కాదు. కొన్ని కార్లు, ట్రెయిన్ లాగా, ఒక దానికి ఒకటి తగిలించి ఉంటాయి. అవి ఒక గుండ్రని దారిలో తిరుగుతాయి. కదిలేటప్పుడు పైన ఒక గుడ్డతో కప్పు వేస్తారు. బయట నుంచి చూసే వారికి అవి ఒక పచ్చని పురుగులాగా కనిపిస్తాయి. ఎక్కుతూ ఉన్నప్పుడు, ఓడెట్ తన గ్లోవ్స్, పర్స్ నా చేతికి యిచ్చింది. రైడ్ సమయంలో పడిపోకుండా అది జాగ్రత్త. మేము పక్కపక్కనే దగ్గరగా కూచున్నాము. రైడ్ స్టార్టయింది. పచ్చని పైకప్పు వేసి, ఐదు నిమిషాల పాటు మమ్మల్ని ఎవరికీ కనబడకుండా దాచేశారు.
కవర్ తీసేశారు. మా పెదవులు మాత్రం కలిసే ఉన్నాయి. నేను ఓడెట్ ను ముద్దు పెట్టుకుంటే ఆమె అడ్డు చెప్పలేదు. మేము దిగి నడుస్తుంటే, శుక్రవారం మార్కెట్ కు రావడం తనకు ఇది మూడవసారి మాత్రమే అని ఆమె చెప్పింది. వాళ్ళ అమ్మ వద్దని ఆంక్ష పెట్టింది. ఇక మేము ఏవేవో ప్రాంతాలు చూస్తూ తిరిగాము. బాగా అలసిపోయి, తిరుగుదారి పట్టే సమయానికి నడిరాత్రి అయింది. అయినా ఓడెట్ వెళ్లడానికి యిష్టపడలేదు. ప్రతి షో దగ్గర ఆమె ఆగుతుంది. నేను ఆగక తప్పదు. రెండుమూడు మార్లు ఆమె చేయి పట్టుకుని లాక్కుపోవలసి వచ్చింది. ఆమె తప్పక నావెంట వచ్చింది. చివరకు ఆమె జిల్లెట్ రేజర్ బ్లేడ్ అమ్మే స్టాల్ ముందు ఆగింది. అంగడి మనిషి ప్రదర్శన చేస్తూ ఉపన్యసిస్తున్నాడు. ఈసారి నాకు బాగా కోపం వచ్చింది. చెయ్యి పట్టి గట్టిగా లాగాను. ఆడవాళ్లకు సంబంధం లేని సంగతి అన్నాను. ఆమె చెయ్యి లాగేసుకున్నది. తెలుసు, అయినా చూస్తాను, అన్నది.
జవాబు చెప్పకుండా మెట్రో వేపు నడిచాను. ఇల్లు చేరేసరికి వీధిలో మనుషులెవరూ లేరు. ఓడెట్ కిటికీ చీకటిగా ఉంది. నేను నా గదిలోకి వెళ్లి లైట్ వేసాను. కిటికీ తెరిచాను. నిద్ర రావడం లేదు. కొంతసేపు ఏదో చదివాను. ఒంటిగంట అవుతున్నది. కిటికీ మూసి పడుకుందామని లేచాను. ఓడెట్ తన కిటికీ కింద, వీధి దీపం వెలుతురులో నిలబడి ఉంది. నాకు ఆశ్చర్యం కలిగింది. గట్టిగా కిటికీ వేశాను. దుస్తులు మారుస్తుంటే ఓడెట్ పూసల పర్స్, గ్లోవ్స్, నా జేబులో ఉండడం గుర్తుకు వచ్చింది. డబ్బులు, ఇంటి తాళం చెవి, పర్సులో ఉన్నాయని తెలుసు. వాటిని గట్టిగా కట్టి కిటికీలో నుంచి పడేశాను.
మూడు వారాలు గడిచాయి. అంతకాలమూ నేను ఆమె గురించి పట్టించుకోలేదు. తన కిటికీ తెరిస్తే, నాకిటికి మూశాను. ఈ లోపల నేను లండన్ వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. బయలుదేరడానికి ఒక నాడు ముందు, ఒకసారి ఆమె, తన వయోలిన్ పెట్టెతోబాటు మెట్రో వేపు పోతూ వీధి చివరన ఎదురు పడింది. హలో, అని నాలుగు మాటలు మాట్లాడాను. నా ప్రయాణం గురించి ఆమెకు చెప్పాను. రాత్రి నా ప్రవర్తన గురించి క్షమాపణ కూడా చెప్పాను. ఓడెట్ తన పూసల పర్స్ తెరిచి, ఒక అద్దం తీసి, నా చేతికి యిచ్చింది. అది మధ్యలో పగిలి ఉంది. కిటికీలోనుంచి నీవు పర్స్ పడేసినప్పుడు అది పగిలింది. దాంతో దురదృష్టం వస్తుందని తెలుసా? అడిగింది.
నేను జవాబుగా నవ్వాను. ఛాదస్తం, అన్నాను. వెళ్లే లోగా మళ్ళీ కలుస్తానని మాట యిచ్చాను. అయితే అది కుదరలేదు.
లండన్ లో ఒక నెల గడిచిన తర్వాత ఓడెట్ నుంచి ఉత్తరం వచ్చింది.
ప్యారిస్, 21 సెప్టెంబర్ 1930
ప్రియాతి ప్రియ జెమ్ షీడ్,
ఎంత ఒంటరిగా ఉన్నాను నీకు తెలియదు. ఒంటరితనం నన్ను బాధిస్తున్నది. ఈ రాత్రి నేను నీకు కొన్ని సంగతులు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే, ఉత్తరం రాస్తుంటే, నీతో మాట్లాడుతున్నట్టే ఉంది. నేను ఇంత సులభంగా నీవు అంటున్నందుకు క్షమించు. నా బాధ ఏమిటో నీకు తెలిస్తే బాగుండును!
దినాలు ఎంత పొడుగయ్యాయి? గడియారం ముళ్ళు మరీ మెల్లగా కదులుతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. నీకు కూడా కాలం బరువుగానే సాగుతున్నదా? అక్కడ బహుశా మరో అమ్మాయిని కలిసి ఉంటావు. అయితే నీ తల ఎప్పుడూ పుస్తకంలోనే మునిగి ఉంటుందని తెలుసు! అయినా! ఇక్కడ ప్యారిస్ లో అట్లాగే ఉండే వాడివి కదా! నీ చిన్న గది ఎప్పుడూ నా కళ్ళ ముందు మెదులుతుంది. ఒక చైనీస్ విద్యార్థి అందులోకి వచ్చాడు. నేను నా కిటికీ మీద మందం కర్టన్ వేసి ఉంచాను. బయటకు ఇక కనిపించదు. నాకు ప్రియతముడు అక్కడ లేడు గదా! అదేదో పాటలో పల్లవి అలాగే ఉంటుంది. మరో దేశానికి వెళ్లిన పక్షి తిరిగి రాదు! అని.
నిన్న హెలెన్ తో లూగ్జెంబూర్గ్ పార్క్ లో తిరగబోయాను. ఆ రాతి బెంచ్ దగ్గరకు పోయే సమయానికి నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. అదే బెంచ్ మీద ఇద్దరమూ కూర్చున్నాము. నీవు మీ దేశం గురించి మాట్లాడావు. ఎన్నెన్నో ప్రమాణాలు చేశావు. నేను అన్నీ నమ్మాను. ఇప్పుడు నా స్నేహితులంతా నన్ను ఆటపట్టిస్తున్నారు. అందరూ నా గురించి ఏవో అంటున్నారు. నిన్ను గుర్తుంచుకోవడానికి గరిజారి వాల్ట్స్ వాయిస్తుంటాను. నీతో పాటు తీయించుకున్న ఫోటో బల్లమీద ఉంది. ఆ బొమ్మ చూచినప్పుడల్లా నమ్మకం పెరుగుతుంది. మోసం చేయదు, అనుకుంటాను. అయితే నీవు కూడా అట్లాగ అనుకుంటున్నావో లేదో తెలియదు. ఆ రాత్రి నా అద్దం పగిలిన తర్వాత, నీవే దాన్ని నాకు తిరిగి ఇచ్చావు మరి, నా గుండె నన్ను హెచ్చరిస్తున్నది. జరగకూడనిదేదో జరుగుతుంది, అంటున్నది. మనం చివరిసారిగా కలిసిననాడు, ఇంగ్లాండ్ వెళుతున్నాను, అన్నావు. నీవు చాలా దూరం వెళ్ళిపోతున్నావని నా హృదయం ఆనాడు చెప్పింది. మళ్ళీ కలువలేమన్న అనుమానం మొదలైంది. అనుకున్నంతా జరిగింది. ఎందుకంత దుఃఖంగా ఉన్నావు? అని మేడం బ్లోరే అడిగారు. ఆమె నన్ను తనతో బ్రిటనీ తీసుకు వెళతానన్నారు. అయితే నేను వెళ్లలేదు. అక్కడ పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుసు.
సరేలే, పట్టించుకోకు. జరిగిందేదో జరిగింది. నా మాటలు ఒక రకంగా ఉంటే, అందుకు కారణం ఉంది. నన్ను దయచేసి క్షమించు. నిన్ను కష్టపెట్టి ఉంటే, నన్ను మరిచిపోతావని అనుకుంటున్నాను. నా ఉత్తరాలన్నీ, కాల్చివేస్తావు. అంతేనా జిమ్మీ!
ఈ క్షణాన ఎంతటి బాధ, దుఃఖంలో ఉన్నానని నీకు తెలిస్తే మేలు. నేను అన్నింటితోను విసిగిపోయాను. పనిలో కూడా మనసు నిలవడం లేదు. ఇంతకు ముందు అట్లా ఉండేది కాదు. ఇంకా, ఇట్లా వేలాడబడి ఉండడం ఇష్టం లేదు. మిగతా వాళ్లకు నావల్ల దుఃఖం కలగవచ్చు. అందరి బాధ ఒక్కచోట చేర్చినా, నా బాధకు సరిరాదు. ఆదివారం నాడు పారిస్ వదిలి పోవాలని నిర్ణయించాను. ఆరున్నర ట్రెయిన్ లో కలేస్ పోతాను. అక్కడి నుంచే కద, నీవు వెళ్ళిపోయింది. ఇక సముద్రంలోని నీలి నీళ్లను చూస్తాను. అవి అన్ని దురదృష్టాలను కడిగేస్తాయి. ప్రతిక్షణం వాటి రంగు మారుతూ ఉంటుంది. అది దుఃఖమయ మంత్ర శక్తి గురగురతో తీరం ఇసుకను తాకుతుంది. నురగలు పుడతాయి. ఇసుక ఆ నురుగను కొరుకుతుంది. మింగేస్తుంది. ఇక ఆ అలలు నా చివరి ఆలోచనలను తమతో మోసుకుపోతాయి. మరణం ఒకరిని చూచి ముసిముసిగా నవ్విందంటే, ఆ నవ్వుతో వద్దకు లాక్కుంటుంది. అటువంటిది ఏదీ ఉండదని నీవు అనవచ్చు. నేను అబద్ధాలు చెప్పలేదని నీవు చూస్తావు.
దూరం నుంచి నా ముద్దులు అంగీకరించు,
ఓడెట్ లా సూర్
జవాబుగా నేను ఓడెట్ కు రెండు ఉత్తరాలు రాశాను. ఒక దానికి జవాబు రాలేదు. మరొకటి తిరిగి వచ్చింది. మరుసటి సంవత్సరం పారిస్ కు తిరిగి వెళ్ళాను. వీలైనంత త్వరగా సెయింట్ జాక్వెస్ వీధికి వెళ్లాను. అక్కడే నా పాత మకాం ఉండేది. నా గదిలో నుంచి ఒక చైనీస్ విద్యార్థి గరిజారీ నాట్యగీతం వరుసలు ఈల వేస్తున్నాడు. ఓడెట్ గది కిటికీ మాత్రం మూసి ఉంది. ఇంటి తలుపు మీద టు లెట్ అని కాగితం అతికించి ఉంది.

 


 

Monday, March 30, 2026

లోకాభిరామం - ఓటి రొండు ఒనరంగ మూడు (On numerals and alphabet)


లోకాభిరామం

ఓటి రొండు ఒనరంగ మూడు


ఒంట్లు - ఓనుమాలు

అసలు ఓనమాలు అంటే ఏమో ఇప్పుడు ఎవరికయిన గుర్తున్నదా? ఒకప్పుడు తెలుగు అక్షరాలు నేర్పించాలంటే, ముందు వాటిని పలకడం నేర్పి తరువాతనే రాత మొదలు పెట్టేవారు. అక్షరమాల పాఠం, ఓం నమశ్శివాయ, సిద్ధం నమ: అన్న ప్రార్థనతో మొదలవుతుంది. కనుక అక్షరాలు నేర్వడమంటే ఓనమాలతోనే మొదలవుతుంది. చదువురాని వారిని పల్లె మనుషులు ‘ఓనుమాలు’ కూడ రానివాడు, అనేవారు. అక్షరాలు దిద్ది నేర్చుకోవాలి. అంటే గురువు రాసిన అక్షరాల్ని అదే దారిలో రాసి, రాసి నేర్చుకోవాలి. ఈ పని ఇసుకలో జరిగేదంటే నమ్మగలరా? కలిగినవారు బియ్యం వాడేవారు. ఇవాళటికీ అక్షరాభ్యాసమన్నా, నామకరణమన్నా బియ్యంలో రాస్తరు. ఎందుకో అడగకుండ, అదే దారిని పోతే, అది సంప్రదాయ మవుతుంది. తరువాత మట్టి పలక వచ్చింది. మార్కాపురం మట్టిరేకు మీద కర్ర ఫ్రేము ఉంటే అది పలక. రాతి పొరలాంటి ఈ పలక పగులుతుంది. మళ్లీ మళ్లీ పలక పగిలితే వీపు పగిలే ప్రమాదం ఉంది. పలక మీద రాయడానికి బలపం కావాలి. అది కూడా పలక లాంటి పదార్థంతో తయారయిందే. చదువు తక్కువ, హంగులు ఎక్కువయితే, ‘చదువు చారెడు, బలపాలు దోశెడు’ అనేవారు మా చిన్నతనంలో. నేనింకా పలక స్థాయిలో ఉండగానే రేకు పలకలు వచ్చినయి. కానీ, వాటి మీద రాత అంత బాగ కుదిరేది కాదు. నాకు పలక మీద దిద్ది అక్షరాలు నేర్చుకున్నట్టు గుర్తులేదు. నేనంతే, నా కొడుకూ అంతే. పుస్తకాల్లో చూచి అక్షరాలు నేర్చుకున్నము. పెద్దయిన తరువాత నేను ఉర్దూ, తమిళం కూడ ఈ పద్ధతిలోనే నేర్చుకున్న. తమిళం అక్షరాలు కనిపిస్తే చాలు చదవాలని కోరిక. మట్ట పొగాకు, (అరటి మట్టలో చుట్టిన వండిన పొగాకు) ప్యాకెట్‌ మీద స్టిక్కరుంది. కూడ బలుక్కుని అందులోని అక్షరాలు ‘పకవకి వికరల్‌’ అనుకున్న. తరువాత అది భగవతీ విలాస్‌ అని అర్థమ యింది. ఉర్దూ పత్రిక షమాలోని ఫొటో కార్టూన్‌ నాకు ‘జోడో కా టౌన్‌’గా కనిపించింది.

బడిలో చేరేనాటికే అఆలు (అనే ఓనమాలు) వచ్చు. బడిలో నాన్ననే సారు. ఏదో పనిలో ఉండి పిల్లలందరినీ పలక నిండ, అఆలు రాయమన్నరు. నాకది నచ్చినట్లు లేదు. రాయమన్నది అ, ఆలు. పలక నిండ రాయాలె. ఒకవేపున అ, రెండో వేపున ఆ మాత్రం, నిజంగ పలక నిండేంత పెద్దవిగ క్షణంలో రాసి చూపించిన. నాన్న మంచి హాస్యప్రియులు. కొడుకు తెలివితనం చూచి ఎంత మురిసిపోయినడో! ఆయన నవ్వు నాకు ఇంకా గుర్తుంది! నాకు అఆలు వచ్చునన్న సంగతి ఆయనకు తెలుసు గద!

తెలుగులో అచ్చులన్నీ ముందు నేర్పి, తరువాత హల్లులకు పోతము. హిందీ అయినా అంతే. పడమటి ఇంగ్లీషులో ఎ, తరువాత బి ఎందుకు వస్తుందో, నాకర్థం కాలేదు. ఆల్ఫా, బీటా అన్న ప్రాచీన భాషలోనే ఆ పద్ధతి ఉంది. ఇంతకూ వాండ్లకు అన్ని అచ్చులు లేనే లేవాయె! ఇంగ్లీషులో అక్షరమాలను ఆల్ఫబెట్‌ అంటరు. మన వాళ్లు తెలియక ఆల్ఫబెట్స్‌ అంటుంటరు. ఇక్కడి మొదటి మాటకే మొత్తం అక్షరాలు అని అర్థం. దానికి ఇంకొక బహువచనం లేదు. చిత్రంగా ఉర్దూలో కూడా అలిఫ్‌ (అకారం) తరువాత బే (బ) వస్తుంది. పడమటి పద్ధతిలో!

ఒంట్లు: ఒంటి అంటే ఒంటరి అంటే ఒకటి అని అర్థం. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్‌, సప్త, అష్ట, నవ, దశ వరకు ఒకటి తప్ప అన్ని రెండక్షరాలకు మించని పేర్లు. మరీ చైనీసులోనయితే, పై, సై, కై అని ఒకే అక్షరం పేర్లుంటయట. అంటే వాటిని పలకడం, గుర్తుంచుకోవడం సులభం. ఇంగ్లీషులో వన్‌, టూ, త్రీ వరకు ఒక అక్షరం, ఫోర్‌, ఫైవ్‌, సిక్స్‌ ఒకటిన్నర అక్షరాలు. ఆ తరువాత క్రమం చెడుతుంది. ఈ రకమయిన అపక్రమం ఉన్నందుకు అంకెలను గుర్తుంచుకునే వీలు తగ్గుతుందట. రెండు సెకండ్లలో పలుకగలిగినన్ని అంకెలు బాగ గుర్తుంటయట. చైనా పిల్లలు, పెద్దలు, పది, పదకొండు అంకెలను రెండు మూడు మార్లు చదివి అప్పజెప్ప గలుగుతరట. తెలుగు, ఇంగ్లీషులో ఎనిమిది అంకెలు దాటితే గుర్తుండవని లెక్క. ఒక్కసారి విని ఫోన్‌ నెంబర్‌ రాసుకోగలిగిన వారు చాలా తెలివిగలవారి కింద లెక్క. మన ఫోన్‌ నంబర్లు ఎనిమిది అంకెలకు మించేవి కావు. సులభంగానే గుర్తుండేవి. మొబైల్‌ విప్లవంతో పల్లె, పట్నం తేడా లేకుండ ప్రతి నంబర్లో పది అంకెలుంటున్నయి. అయితే నంబర్లు గుర్తు పెట్టుకోవలసిన అవసరం కూడా తగ్గుతున్నది!

పది దాటి ముందుకు పోతే, అంకెల తీరు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. పది ఒకండు పదకొండు. పది, రెండు పన్నెండు. పదమూడు, పది నాలుగు వరుస బాగానే కదులుతుంది. అంటే పది స్థానం చెప్పి, తరువాత ఏదో తీరుగ ఒకట్ల స్థానం చెపుతున్నమని గద. ఇరవై, మూడు పదుల ముప్పయి, నలుబయి తరువాత కూడా అదే తీరు సాగుతుంది. కానీ హిందీలో గ్యారహ్, బారా, తేరా అంటూ పూర్తి కొత్త మాటలు వచ్చినయి. వీటిలో ఎక్కడా దస్‌ కనిపించదు. ఇంగ్లీషులో పదకొండు, పన్నెండులకు మాత్రం ఎలెవన్‌ (లెవన్‌ అనగూడదండీ), ట్వల్వ్‌ అని కొత్త రూపాలు వచ్చినయి. ఆ తరువాత టెన్‌ పోయి టీన్‌ అవుతుంది. తర్టీన్‌, ఫోర్‌టీన్‌, ఫిఫ్‌టీన్‌ అట్లా వరుస పోతుంది. ఇక్కడ తీరు తిరగబడి, ఒకట్ల స్థానం ముందు, ఆ తరువాత పది వస్తున్నయి. ఆ తర్వాత కూడా అదే తీరు ఉంటుందా, అంటే, ట్వంటీ వన్‌, సెవెంటీ వన్‌ అని దశమాలు ముందు వస్తయి. జెర్మన్‌లోనయితే, ‘ఒకటి మరియు ముప్పయి’ పద్ధతిలో అయిన్‌ ఉండ్‌ డ్రైషిష్‌ అంటారు. వాళ్లకూ పదకొండు, పన్నెండు నచ్చక కొత్త పేర్లు పెట్టినరు. ఆ తరువాత, డ్రైత్సేన్‌ అంటే డ్రై మూడు, త్సేన్‌  పది. ఇరుపదులు, ఇరువయి. బాగుంది. ట్వెంటీ అంటే గూడా బాగానే ఉంది. త్స్యాన్‌త్సిష్‌ (జెర్మన్‌) ఎట్లుంది. ఆఖ్‌ట్‌ అంటే ఎనిమిది. పదునెనిమిదిని మనమే పదెనిమిది బదులు, వైదికం పిల్లిలాగ వత్తి పలుకుతున్నము.

బ్లింక్‌: మాల్‌కమ్‌ గ్లాడ్‌వెల్‌ అని ఒక పెద్దాయన (వయసుకు చిన్నవాడే!) ఉన్నాడు. బ్లింక్‌ అని ఒక పుస్తకం రాశాడు. ఆ మాటకు కన్నురెప్పపాటు అని అర్థం. మనం ఒక సంగతి గురించి ఎన్నిరోజులు, ఎంతసేపు చర్చించినా, నిర్ణయం మాత్రం ఒక కన్ను రెప్పపాటులోనే చేస్తున్నమంటరాయన. ఆయన బ్లింక్‌లో రాసిన సంగతులు ముందు నాకయితే అర్థంగాలేదు. తరువాత బోలెడంత ఆలోచనలో పడేసినయి. మంచి పుస్తకం చేయవలసింది అదే గద! అందుకే ఈ పుస్తకాన్ని పైరేట్‌ (దొంగ) అచ్చు వేసి మన వాళ్లు ఫుట్‌పాత్‌ల మీద కూడా అమ్ముతున్నరు. మంచి పుస్తకాలు విలువ తగ్గించి కాలిబాట మీదకు చేర్చడం, మనం గౌరవం ఇచ్చే పద్ధతి.

ఈ గ్లాడ్‌వెల్‌ ఈ మధ్యన ఇంకో పుస్తకం రాసినడు. పేరు ఔట్‌లయ్యర్స్‌. అంటే మామూలుగా కాకుండా మరో రకంగా ఉండేవి, ఉండేవారని అర్థం. ఆ పుస్తకంలో తెలివి, చదువులాంటి ఎన్నో సంగతుల గురించి చర్చ ఉంది. అందులో భాగంగ ‘ఆసియా వారు అంకెలకు పేర్లు పెట్టిన పద్ధతి పారదర్శకంగ, అర్థమయే రకంగ ఉంది. పడమటి భాషల్లో అట్లా లేదు!’ అని ఒక పరిశోధకుడు, తరచి, తరచి తెలుసుకున్న సంగతి కూడ రాసినరు. ఆసియా పిల్లలు అందుకని, కూడిక, గుణకారం లాంటి లెక్కలు సులభంగ చేస్తరట. పడమటి పిల్లలకు నాలుగో తరగతి నుంచి లెక్కలంటే ఏవగింపు మొదలవుతుందని కూడా ఒక పరిశోధనా ఫలితం ఇచ్చినరు. మరి నాకు అంకెలు, లెక్కలంటే, అంత ఇష్టం లేదు! ఎందుకనో?

అపశకునం అంకెలు: తెలుగులో ఆరు తరువాత వచ్చే అంకె పేరు ‘ఏడుపు’ అన్నట్లుంది కదూ! అందుకే అది చాలమందికి ఇష్టం లేదు. ధాన్యం కొలిచేప్పుడు, ఆరు తరువాత ‘ఆరున్నొకటి, ఆరొకటి, అప్పుడు ఎనిమిది’ అనడం నేను విన్న. మా ఇంట్లో ఒక దుప్పటి ఉండేది. దానిపేరు పదిగోడు. అదేమిటిదని ఇప్పుడు నాకే అనుమానం వస్తుంది. ఆ దుప్పటి ధర పదిన్నిఏడు రూపాయలు. అమ్మినతను ఆ అంకెను పదిగోడు అని పలికినడు. ఇదీ చాదస్తంలో ఒక భాగమే.

ఏడున్నర అన్న అంకెను కూడా ఇష్టపడని వారు కొందరున్నరు. అందుకు కారణమేమో నాకు అంతు పట్టలేదు. సాఢేసాత్‌ ముహూర్తం అన్నమాట మెదడులో నిలబడి ఉంది. ఈ ముహూర్తం పనికిరానిది అని మాత్రం గుర్తుంది. సాఢేసాత్‌ గురించి కొంచెం బూతుగ ఉండే వివరణను విన్న కానీ, ఇక్కడ చెప్పను.

మన వాళ్లు ఛాదస్తులనుకుంటే, అమెరికాలో హొటేల్‌లో 13వ అంతస్తు ఉండదట. అపోలో 13 అన్యాయంగ ప్రమాదానికి గురయిందట. (మరెన్నో కూడా అదే దారిన పోయినయి) మొత్తానికి వారికి పదమూడు నచ్చదు. హిందీలో పదమూడు అని అర్థం వచ్చే ‘తేరా’ అన్న మాటకు ‘నీది’ అని అర్థం ఉంది. నానక్‌, ధాన్యం కొలిచి పోస్తున్నడు. బారా తరువాత తేరా వచ్చింది. ‘తేరా’ అంటే నీది, అంటే భగవంతుడిదని, మొత్తం ధాన్యం ఆ అంకెతోనే కొలిచినడంటరు! పనికిరాని అంకెలో గురునానక్‌ గురువు కాకముందే భగవంతుడిని చూడగలిగినడని కథగ చెప్పడం విన్న.


 

Tuesday, March 24, 2026

భాషలు - భవిష్యత్తు


భాషలు - భవిష్యత్తు

 

నాలుగవ తరగతి పాఠ్యపుస్తకాల్లో వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, జీవన విధానాల గురించి పాఠాలున్నాయి. వారివారి పండుగల గురించి ప్రత్యేకతల గురించి కూడా, వివరంగా కాకున్నా, చూచాయగా కొంత చెప్పారక్కడ. అందులో మన రాష్ట్రం గురించిన పాఠం చదువుకుని బయట రోడ్డు మీదకు వస్తే, పాపం పిల్లలకు ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి.

 

ఒకప్పుడు మనిషి వేషం, భాష, తీరు, తెన్ను చూచి ఏ ప్రాంతం వారో చెప్పడం వీలయేది. సినారె గారు చెప్పినట్లు, నాగరికత, మన గోచీలు పీకించి ఇరుకు పాంట్లు తొడిగించింది. ఇటీవల ఆడపిల్లలంతా పంజాబీ పద్ధతిలోకి మారిపోయారు. దేశం ఈ చివరనుంచి ఆ చివర వరకు ఏ ప్రాంతం వారయినా ఒక్కలాగే కనబడుతున్నారు. ఇంకొంచెం నాగరికత ముదిరితే, ఇక్కడవారు కారేమో అన్న అనుమానాలకు కారణమవుతున్నారు. నోరు తెరిచి మాటాడడం మొదలు పెడితే, అందరి నోటా ఒకేలాంటి మాట. మాతృభాషలో సంభాషణ అనాగరికతకు గుర్తు.

 

టెక్నాలజీ అందరినీ ఒకే గాట కట్టేస్తుందని అర్థం వచ్చే సూత్రం ఒకటి ఉంది. టెలిఫోను, ఒక కాలంలో, కలిగిన వాళ్ల ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడది పల్లెటూర్లో, గల్లీలో వాళ్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. రూపాయి జేబులో ఉన్నవారెవరయినా టెలిఫోను వాడుకోవచ్చు. అదొక పద్ధతి. టెక్నాలజీ మనకు అందించిన మరొక అద్భుతం టెలివిజన్. అందులో రకరకాల ఛానల్స్, రకరకాల ప్రోగ్రాములు. ఏ కార్యక్రమం ఏ భాషలో తయారయిందో అర్థం కాదు. అసలా మనుషులు మనవాళ్లేనా అని అనుమాన  పడుతుంటే, అచ్చమయిన తెలుగులో మాటలు వినపడడం మొదలవుతుంది. చాణక్యుడు ఒకనాడు హిందీలో మాట్లాడతాడు. మరోరోజు తెలుగులో మాట్లాడతాడు. మరీ కొన్ని ఛానల్స్ లోనయితే అందరూ కలిసి, ఎవరికీ అర్థం కాని భాషలో, కేకలు వేస్తుంటారు. అది సంగీతమని అనుకొమ్మంటారు. ఒక కార్యక్రమాన్ని అరడజను భాషల్లోకి డబ్ చేస్తే గిట్టుబాటు. అందులోని విషయానికీ, కట్టు బొట్టు వగైరా వివరాలకూ, వినబడే భాషకూ పొంతన ఉంటుందా, అన్న ప్రశ్న ఎవరికీ పట్టదు. ఏతావాతా, అందరమూ మనమన భాషలను మరిచిపోతున్నాం. ఇంకా మరిచిపోకుంటే ఇంకొన్ని రోజుల్లో తప్పనిసరిగా మరిచిపోతాం.

కంప్యూటర్ రంగంలో భారతీయులు ఎటుచూచినా జెండా ఎగరేసి, జై అంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇందుకు మనవారికి గల భాషాపాండిత్యం కారణమని గమనించాలా? మనం సులభంగా ఇంగ్లీషు నేర్చుకుని నాలుగు బొట్లేరు ముక్కల నుండి నవల్సు దాకా అప్పజెప్పగలుగుతాం. సల్మాన్ రుష్దీ, విక్రం చంద్రా, చిత్రా దివాకరుని వగైరాల్లాంటి ఆంగ్ల రచయితలను కోకొల్లలుగా ప్రపంచానికి పంచుతాం. మనకు అంటే చదువుకున్న భారతీయులకు, ఇంగ్లీషు చేతగావడం, కంప్యూటరు రంగంలో ఒక పెద్ద అనుకూలమయిన అంశం అయి కూచుంది. చైనా, జపాను వారికి చదువు రాదని కాదు. ఇంగ్లీషు మాత్రం మనకు వచ్చినంత బాగా రాదుగాక రాదు. అదీ సంగతి!

 

కొత్తశకాలు, సహస్రాబ్దాలు వస్తే రానివ్వండి. కొత్తదనాన్ని తెస్తే తేనివ్వండి. కానీ గుర్తించవలసిన సంగతులను మాత్రం కొన్నింటిని గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉంది. వెనకటి సంగతేమో గానీ, ప్రస్తుతం ప్రపంచంలో ఆరువేల భాషలు వాడుకలో ఉన్నాయి. అంటే, ఇంకా ఎవరి భాష వారికి, ఉందనే అనుకోవచ్చు. ప్రగతి గతి ఇలాగే సాగితే, 2100 నాటికి, మిగిలే భాషలు మూడువేలకు తక్కువేనని అంచనా. పండుగలకు ప్రతి దానికీ ప్రత్యేకతలు ఉండేవి. ఫలానా పండుగని ప్రత్యేకంగా పట్టింపులుండేవి. యూరోపు వాడి యంత్రాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అన్ని పండుగలకూ సేమ్యాలు మిగిలి పోయాయి. అవి కూడా మన పాత పద్ధతి సేమ్యాలు కానేకావు. అచ్చంగా అలాగే, ప్రపంచమంతటా ఇంటర్నేషనల్ భాష, అయిన ఇంగ్లీషు ఒక్కటే, మిగిలినా ఆశ్చర్యపడనసరం లేదు!

 

ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అన్ననాడు వారి ఉద్దేశ్యం ఒకటయితే, ఇవాళ నిజంగా ప్రపంచమంతా ఒకటే కుటుంబమయింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో, అయిదవ వంతు మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారట. అందరినీ ఒకేగాట కట్టే సంస్కృతీ విశేషానికి ఉదాహరణగా ముందు ఇంగ్లీషు భాషను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కొంత భాగంలో కొంతకాలం పాటు, సడకులుండేవి. సడకేమిటి? అసహ్యంగా!’ అన్నవాళ్లున్నారు. దాన్ని రోడ్డు అనాలి అని నచ్చజెప్పారు. ఇప్పుడా సడకులన్నీ ఇంచుమించు రోడ్డులయినయి. అదలా ఉంచితే మనం మాత్రం ఇంగిలీషు, కొంచెం తెలుగు శైలిగల టింగిలీషు భాష వంటబట్టించుకున్నాం. వాట్ యార్?’ అన్న మాటలో, యార్ (నేస్తం) అనేది ఉరుదూ మాటని మనకు తోచనే తోచదు. ఇది మన రాష్ట్రానికి, మన దేశానికి పరిమితమయిన పద్ధతి కానే కాదు. ప్రపంచమంతటా ఎవరికి వారు తమదయిన ఇంగ్లీషు మాటకారితనాన్ని తయారు చేసుకుంటున్నారు.

 

ఇంటర్నెట్, ఇతర మల్టిమీడియా మాధ్యమాలను గురించి తలుచుకుంటే, ఇంగ్లీషు తప్ప మరో భాష మిగిలేనా అన్న అనుమానం రాకమానదు. అందరికీ, కనీసం కొందరికయినా అర్థమయే ఇంగ్లీషు ఒకరకమయితే, స్థానిక భాషల పదజాలాన్ని ఇంగ్లీషుతో కలిపి, తయారు చేసే భాషలు మరింత విచిత్రం. ఉత్తర భారతంలో హింగ్లిష్, దక్షిణంలో టింగ్లిష్ అని మనం సరదాగా అనుకుంటాం. కానీ అవసరం వచ్చినప్పుడు, ఇంగ్లీషు వాడికి అర్థమయ్యేలా విషయం చెప్పగలం కూడా! సింగపూర్ లో సింగ్లీష్ ఉంది. అందులో మలయ్, చైనీస్ భాషలు ఇష్టంగా కలిసి ఉంటాయి. అది అక్కడివాళ్లకు తప్పతే మరొకరికి అర్థం కాదట!

 

గోపాలం కె.బి.

17 ఫిబ్రవరి 2001


 

Monday, March 23, 2026

లోకాభిరామం : భాష - బహాసా


లోకాభిరామం : భాష - బహాసా


భాష - బహాసా

అనవసరంగారు :
రేడియోలో ఎవ్-సాయదార్లకు వాతావర్ణ సూచనలుంటయి, ఎప్పుడన్న విన్నరా? మేమయితే ఇదే ప్రశ్నను ఇన్నరా? అని అడిగినా అర్ధం చేసుకుంటము. వ్యవసాయము మా దగ్గర ‘ఎగుసము’ అవుతుంది. వేసవి, వేసంగి, యాసంగి అంటే ఒకటే మాటనా? మాటల మూలాలను వెతుకుతూ పోతే చిత్రమయిన సంగతులు ఎదురవుతయి. ఈ ఎదురయ్యేవి వెదుర్లు, వెదుళ్లు మాత్రం కాదు. వేంకటేశ్వరుని అందరు వెంకటేశ్వరుడు అంటరు. ఆయనకు పట్టింపు లేదు. ఎంకటేశ్వర అన్నా కోపం రాదాయనకు. యంగటేస్పరా అన్నాసరే ఏమీ అనుకోడు. మరాఠీవారి సంగతి మరీ విచిత్రం. వ్యంకట్రావ్, వ్యంకటేశ్ అని రాస్తరు. సంస్కృతంతో సంబంధం లేదని అర్ధం. చాలా గొప్పవారు కూడా సంబంధం అన్నమాటను సమ్మంధం,  సమంధం,  సమ్మందం అని పలకగా విన్నాను. గౌతులచ్చన్నగారని ఒక నాయకుడు, ఇప్పటివారికి తెలియదు. బెమ్మానందంరెడ్డి అనేవారు. అదేమిటని అడిగిన వారిని ‘ఆయనకు లేని అనుమానం నీకెందుకు’ అని కూడా అన్నరు. తిరిగి మరోసారి రేడియోలోకి వస్తే (ప్రసారంలో కాదు గానీ) ఒకాయన ‘అనవసరంగారు వెధవ రిపోర్టు తెమ్మన్నారండీ!’ అన్నరట. విషయమేమిటో ఎవరికయినా తోచినదా? రేడియోలో అనౌన్సరుగారలు ఉందురు. ప్రజలకు వారు మాత్రమే తెలియుదురు. రేడియో స్టేషన్ చూడబోయే వారంత, తమ అభిమాన అనౌన్సర్లని చూడాలని ప్రయత్నింతురు. ఇంతయినా, ఆయన కెవరికో గౌరవంగానే అనౌన్సరుగారు, అనవసరంగా కనిపించారు. వారి పేరు అనవసరం. వారు అవసరమే! ఇంతకూ వెధవ రిపోర్టేమిటి. అది వెదర్ (వాతావరణ) రిపోర్టుకు పట్టిన గతి లెండి!
వెంఢాకాలం: వేంకటేశ్వరులంత వారని పట్టుకుని ఎంగటేసనో, వ్యంకటేశనో అంటే తప్పుగదా! అట్లాంటివారు మరి, అనాడీల కింద లెక్కవుతరు గదా! (అనాడీలనగా ఏమీ తెలియని అమాయకులు అంతే గానీ, నాడిలేని వారు మాత్రం కారు) కనుక ఒక పెద్దాయన ఎస్టర్ (యెస్టర్)డేని మార్చి వెస్టర్‌డే అన్నారు. మరొకాయన ఇస్త్రీని విస్త్రీ అన్నారు. (అవునండీ, ఇంతకు తెలుంగులో ఈ ఇస్త్రీని ఏమంటరు. చలవమడతలని ఒక మాట వినిపించేది. కానీ, ఇది వేడి (ఏడి)కాదు మడత గదా! ఉర్దూలో ఒత్తుల సమస్య చిత్రంగ ఉంటుంది. సికిందర్ అని రాయాలంటే ఆ మాటకు ముందు ఒక ‘అ’కారాన్ని రాస్తరు. ఎందుకు రాసిందీ, తెలియని వారు ఇస్కందర్ అని పలుకుతరు. స్కూల్ అన్న మాటను, స్టేషన్ అన్న పదాన్నీ (అనిన, అన్న) రాసి సకూల్, సటేషన్ అనరు. ఇస్టేషన్, ఇస్కూల్ అంటరు.
బాగా మాట్లాడుతున్నమనుకుని మనవాళ్లు కొందరు శవం అన్న మాటను ‘శ్రవం’ అంటారు. అట్లాగే ఎండకాలం పోయి వెంఢాకాలమవుతుంది.
రెండు, రొండవుతుందని తెలుసా మీకు. కన్యా శుల్కంలో అప్పారావుగారు, ఒక పాత్రచేత ప్రయత్నంగ ‘రొండు’ అని పలికించినరు. ఆ రకంగా వారు పాత్రల మధ్య తేడా చూపించినరు. మనమేమో తేడా తెలియక రెండు, రొండు ఒకటే ననుకుంటున్నాము. ఒకాయన ఏకంగా ‘రొండు చింతలు’ అన్నడు.అది రెంటచింతల అనే ఊరి పేరని నాకు తరువాత అర్థమయింది.
పెద్దగా ఉరిమితే మనవాండ్లు అర్జునుని పేర్లు తలుచుకునేవారు. మా ఊళ్లో, ఊరిలో ఒక ముసలమ్మ ‘అర్జున,  బీమ,  ఆకేశవేని, భూతల్లి, దడదడ, గుడగుడ’ అని ఏదో చదివేది.
పట్టమహిషి: ‘మిరపకాయ కొరికి చూస్తే చుర్రే చుర్రే, దున్నపోతును గన్న తల్లి, బర్రే బర్రే’ అని పల్లెపాట ఒగటి, ఒకటి ఉన్నదట. బర్రె అనే మాట, అందరికీ తెలిసినది కాకుంటే ఆశ్చర్యం లేదు. కొందరు దానిని గేదె అంటరు. మరికొందరు ఎనుము అంటరు. ఈ ఎనుమలలో కొన్ని ఆ నలుపులోనే తెలుపుచాయలో ఉంటయి. వాటి వెంట్రుకలు కూడ తెల్లగ ఉండడం చూచిన గుర్తు నాకుంది. తెల్లని ఆవు, అసలు సిసలు తెలుపు రంగు ఉంటుంది. తెల్లబర్రె మాత్రం ఆ నలుపులోననే ఒక తెలుపు. దాన్ని మా ప్రాంతంలో ‘పల్లబర్రె’ అనేవారు. ఇప్పటికీ అంటనే ఉంటరు. బర్రెలకు, ఆవులకు దూడలు ఉంటయి. ‘దూడమ్మా, దూడా’ అని కూడా జానపద గీతం ఉంది. స్త్రీల పాటలలో ఆవుదూడ, పులి గురించినది చాలా ఆర్తిని కలిగించే పాట. ‘కాటుక కన్నులా గంగ్యావు కోడె, మీయమ్మను మేము పొడగాన లేదు’ అని మావాళ్లు పాడడం నాకింకా గుర్తుంది. తెల్లని ఆవుదూడకు కళ్లు నల్లగ ఉంటే, నిజంగా కాటుక పెట్టినట్టు ఉంటుంది. మా ఇంట్లో పుట్టిన ఇటువంటి దూడ, కోడె దూడయి, ఎద్దయి మా మధ్యన, ఇంట్లో మనిషిగ పెరిగి, పోయింది. దాని పేరు గుమ్మడి. నాన్నగారుంటే, వాని పేరు అని సరిదిద్ది ఉండేవారు! అంత ప్రేమ ఆయనకు గుమ్మడి మీద. గుమ్మడి సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత మేమెవరము కనిపించకపోతే నేరుగ వంటింట్లోదాక వచ్చేది.
విషయం మరెక్కడికో వెళ్లిపోయింది గానీ, దూడను కొంతమంది ‘దుడ్డె’ అని అంటరు. బిడ్డను బిడ్డె అని పలికిన వారిని చూచిన, విన్న. బిడ్డలు అనే మాటను ‘బిడ్లు’ అంటరని పుట్టపర్తివారు వ్యాసంలో రాసినరు.
ఇంతకూ నేను అడగదలచుకున్న ప్రశ్న అట్లనే ఉండిపోయింది. యముని మహిషపు లోహ ఘంటలు అంటరు సిరిసిరి అనగా శ్రీశ్రీగారు. అంత ఎమ్ ధర్మరాజు వారి వాహనం గదా? బంగారపు గంటలెందుకు లేవో? మహిషమనగా బర్రె, గేదె, ఎనుము (తప్పు!) పుంలింగమయితే దున్న, దున్నపోతు గద! మహిషియనగా బర్రె, గేదె, ఎనుము. రాజుగారి భార్యను పట్టమహిషి అంటరెందుకని(?)
ఇంద్రునికి వృషభముతో పోలిక చెప్పిన సందర్భాలున్నయి. వేదంలో కూడా రకమయిన పోలికలు చెప్పినరు. గొప్ప కవులను కవివృషభులు అనడము విన్నము. కనీసం చదివినము. రాజుగారిని సింహంతోనో, ఎద్దుతోనో పోల్చి చూపిస్తరు. అందుకే పట్టమహిషి అనడం వెనక మరేదో సంస్కృతం కిటుకు ఉండి ఉంటుందని నాకు తీవ్రమైన అనుమానం! అంతేగానీ అర్ధంలేని జోక్ వేసి, అనర్థం చేయడం నా ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని మనవి!
సింహము, సింగమవుతుంది. టామిల్ అనగా తమిళంలో చింగం కూడా అవుతుంది. (జానీ లీవర్ అనే హాస్యనటుడు చ్యూయింగ్ గమ్‌ను చింగం అన్నాడు. హాస్యానికని అన్నాసరే, అది అంటుకుంటుంది!) యశోదై యిలైచ్చింగం అని బాలకృష్ణుని వర్ణించింది గోదామాత. సింహి, అనే మాట ఉందా? సింగానికి మాత్రం సింగి ఉంది. సింగమ్మ అన్నది తెలిసిన పేరు. శివంగి అనే మాట ఎట్లా వచ్చింది? మరి శివాంగి అంటే ఎవరు. శివునియందు సగమయిన పార్వతి, శివాంగియయి ఉండవలె. శివాన్విత అన్న పేరు ఒకటి గుర్తుంది.
శివంగి సంగతి మీకంతా తెలుసా? మగసింహం వేటకు పోదు. శివంగి మాత్రమే పోతుంది. ఆయమ్మ కొట్టుక తెచ్చిన తిండిని సింహరాజు తిని పడుకుంటడు. ఆ రాజుకు ఒకే శివంగి కాక కావలసినన్ని శివంగులు ఉంటాయి. అదొక దర్జా. అందులో తిండి వెసులుబాటు కూడా ఉందన్నమాట.
భాష, బాస (బహాసా) విచిత్రమయినది. ఆసక్తి కరమయినది కూడ!
నల్లని దున్నను కారెనుము, కారుదున్న అనడం ఉంది. ఇంకా దూడను వేయని బర్రెను ‘పడ్డ’ అంటము మా ప్రాంతంలో. లేత బర్రెపాలు అంటే ఈని, అనగా దూడను కని ఎక్కువ కాలం కాని బర్రెపాలు. ఆ పాలలో దూడ కొరకు రకరకాల ప్రత్యేక రసాయనాలు ఉంటయి. కనుక అవి కాచితే గడ్డ కడతయి. జున్నుపాలు అను పేరుతో దానిని తింటము. ఆ పాలు తాగినా, తిన్నా వాతం చేస్తుందనే వారు. అంటే ఆ పాలలో మనకు పడని ప్రొటీన్లు ఏవో వుండి, శరీరంలో మార్పులకు కారణ మవుతాయని నాకు అర్ధమయింది. ఈ పరిస్థితి నాలుగు దినాలు సాగుతుంది. ఆ తరువాత పాలు కాచినా గడ్డ కట్టవు. కానీ వాటిలో జిగురు మాత్రం ఎక్కువ ఉంటుంది. వాటి రుచి కూడా వేరుగ ఉంటుంది. రెండు మూడు నెలల తరువాత పాలు మామూలవుతయి.
బర్రె తిన్న తిండి, తాగిన కుడితి కారణంగా పాల రుచి మారుతుందంటే కొంతమందికి అర్ధం కాకపోవచ్చు. కుడితి, తవుడు తిన్న బర్రె పాలు, పెరుగులో కొంత పులుపు ఉంటుంది. పత్తి గింజలు తిన్న బర్రె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డితో కూడ పాలలో తేడా వస్తుంది. ఆ పాలతో చేసిన పెరుగులో కూడా రుచి తేడా తెలుస్తుంది.
ఇదం, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని లేకుండ, రైతుల ఇండ్లలో అందరికీ తెలిసిన విజ్ఞానం. పాలు పాకెట్లనుంచి, మెషీన్‌నుంచి వస్తయనుకునే వారికి ఇవేం అర్ధమవుతయి?

 

Thursday, March 19, 2026

నది నాతో మాట్లాడినది - దాశరథి కవిత 1


నది నాతో మాట్లాడినది

దాశరథి కవిత








 

Wednesday, March 18, 2026