Friday, July 10, 2026

సూక్ష్మప్రపంచం - మన శరీరం లోపల పైన సూక్ష్మజీవుల గురించి


సూక్ష్మప్రపంచం

            ఈ విశ్వం చాలా విశాలమయినది. దాని పొడవు, వెడల్పుల కొలతలు మన ఊహలకు కూడా అందవు. అందులో ఉన్న గెలాక్సీల సంఖ్య ఆలోచనలకు అందదు. లెక్కలేని ఆ గెలాక్సీలలో ఒక్కొక్క దాంట్లో లెక్కలేన్నని చుక్కలు అంటే నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో సూర్యుడు కూడా ఒకటి. ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో భూమి ఒకటి. ఆ భూమి మీద బిలియన్‌ల సంఖ్యలో జనం ఉన్నారు. అందులో మనం ఉన్నాము. ఈ లెక్కన చూస్తే విశ్వంలో మనం సూక్ష్మజీవులం. ఇక మన శరీరం మీద ట్రిలియన్‌ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయని విషయం తెలిసినవారు చెబుతున్నారు. అంటే అవి ఎంత చిన్నవో మనం ఊహించలేము అని అర్థం. వాటిని పట్టించుకునేవాళ్లు చాలా కాలంగానే కొందరు ఉన్నారు. లూయి పాశ్చర్ అనే పెద్దమనిషి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. సూక్ష్మజీవులను పరిశీలించడం అన్న విషయాన్ని ఒక ప్రత్యేకరంగంగా నిలబెట్టిన ఘనత అతనిది అనవచ్చు. ఒక భూతద్దం చేత పట్టుకుని కనిపించిన ప్రతి వస్తువును పరిశీలించేవాడట. తిండి పెడితే తినడంకన్నా పరిశీలన ముఖ్యం అనుకునే వాడు. పక్కింటి వాళ్లు భోజనానికి పిలిస్తే భూతద్దం పట్టుకుని వెళ్లే వాడు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు పిలవడం మానేశారు.

            సూక్ష్మజీవులు కనిపించవు, కనుక అవి లేవు, అనుకుంటే మనకన్నా అమాయకులు మరెవరూ ఉండరు. అవి మన మీద, చుట్టుపక్కల, ఎటుచూస్తే అటు, ఆలోచనకు అందని సంఖ్యలో అంతటా నిండి ఉన్నాయి. మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. సబ్బుపెట్టి వళ్లంతా తెగ తోముకొని వుండవచ్చు. మన వంటిమీద గుంపులు గుంపులుగా సెంటిమీటర్ చర్మానికి లక్షల సంఖ్యలో బాక్టీరియా ఉండనే ఉంటుంది. మన వంటినుంచి అంటే చర్మం నుంచి ప్రతి నిత్యం బిలియన్‌ల సంఖ్యలో పొలుసులు ఊడి పడుతుంటాయి. పాశ్చర్ లాగా బూతద్ధం పెట్టి చూచినా అవి కనిపించవు. కనిపిస్తే మన పడక మనకు నరకం లాగ కనిపిస్తుంది. ఈ పొలుసులను తింటూ సూక్ష్మజీవులు మన మీద కాపురం ఉంటాయి. అక్కడ వాటికి మనం వదిలిన పొట్టు మాత్రమే కాక రుచికరమయిన నూనెలు, లవణాలు, ఖనిజాలు కూడా దొరుకుతాయి. వాటికి కనుక రుచి తెలిసే పద్దతి ఉంటే మన వంటిమీద మంచి విందు దొరుకుతున్నది అని అర్థం. వంటినిండా రంధ్రాలు ఉన్నాయి. కావలసిన్నని పగుళ్లు ఉన్నాయి. వాటిలోనుంచి సూక్ష్మజీవులకు తిండి సరఫరా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మనకు తిండి అప్ప్పుడప్ప్పుడు దొరుకుతుంది. వాటికి మాత్రం ఎప్ప్పుడూ దొరుకుతుంది.

            విందు తింటూ బ్రతికే సూక్ష్మజీవులు చర్మంమీద మాత్రమే కాదు, శరీరం మొత్తంలో, లోపల, బయట కూడా అదే పద్దతిలో అంటే లెక్కించలేని సంఖ్యలో ఉన్నాయి. పేగుల్లోకి వెళితే పెద్ద సంఖ్యలో ఉండే బాక్టీరియా లేకుండా మనకు తిండి అరగదు, అన్నది మనం అత్యవసరంగా తెలుసుకోవలనిన సత్యం. ముక్కులోపల కావలసిన్నని సూక్ష్మజీవులు ఉన్నాయి. కనుగుడ్డు మీద ఉండే తేమలో అవి ఈదుతూ ఉంటాయి. దంతాలమీది పింగాణీ పొరలో రంధ్రాలు వేస్తూ ఉంటాయి.

            మనిషి జీర్ణాశయంలో వంద ట్రిలియన్‌లకు పైబడి బాక్టీరియా ఉన్నాయని లెక్క తేలింది. అందులో కనీసం నాలుగు వందల రకాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని చక్కెరలను అరిగిస్తాయి. కొన్ని పిండి పదార్థాలను పట్టించుకుంటాయి. మరికొన్ని మిగతా సూక్ష్మజీవుల మీద దాడి చేస్తాయి. కడుపులో అంటే పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ యించుమించు మనకు సాయం చేసేవే. అయితే ఏమి పని చేస్తాయని తెలుసుకోవడానికి వీలు కుదరని రకాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. అవి పేగుల్లో అలా మనకు తెలియకుండానే కలకాలం కాపురం ఉంటాయి. వాటికి అలా ఉండడం అనుకూలంగా ఉంటుంది.

            మానవుని శరీరంలో సుమారు పది క్వాడ్రిలియన్ కణాలు ఉంటాయని లెక్క తేల్చారు. ఇక తరువాతి వాక్యం వినాలంటే గుండె గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉండాలి. సగటు మానవుని శరీరంలో బాక్టీరియాల సంఖ్య  వంద క్వాడ్రిలియన్‌ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైక్రోబయాలజీ రంగంవారు మనిషిని, మనిషి అనే కన్నా మరేదో అంటే బాగుంటుంది అంటారు. మనిషిలో మనిషి కణాలకన్నా మైక్రోబ్స్ కణాలు పదిరెట్లు ఎక్కువ ఉన్నాయి మరి. మనిషిమీద సూక్ష్మజీవులు బతుకుతున్నాయా లేక వాటిమీద మనిషి బతుకుతున్నాడా? ఇటువంటి ప్రశ్నలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, విషయంగా తెలుసుకోవడానికి మనకు, కొంచెం ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అసలు విషయం ఒప్ప్పుకోవాలంటే, మన శరీరంలో శరీరంకన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి మధ్యన మనం కూడా ఉన్నాము.

            బాక్టీరియా అనగానే రోగాలు కలిగిస్తాయని అందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. చాలా తెలివిగా వాటిని మట్టు పెట్టడానికి మనం సబ్బులు, ఆంటీయోటిక్స్ వంటివి క£నుగొని, మనలను మనం కాపాడుకుంటున్నామని భ్రమ పడుతున్నాము. వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులను తొలగించుకుంటున్నాము అన్నది, నిజం. కానీ అంతకన్నా పెద్ద సంఖ్యలో బాక్టీరియాలను పెంచి పోషించుకుంటున్నాము అన్నది, అంతకన్నా పచ్చి నిజం. ఈ మాట కూడా కొంతవరకు నిజం కాదేమో అని అనుమానం. బాక్టీరియాలకు సమాజాలు లేవు. ఊళ్లు, నగరాలు £ట్టుకోవాలన్న ఆశ అంతకన్నా లేదు. అయినా అవి మన సౌరమండలం కొనసాగినంత కాలం ఉండి తీరతాయి. భూగ్రహం నిజానికి వాటి స్వంతం. అవి మన పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అంటే మనిషి జాతికన్నా ముందు ఉన్నాయి. ఈ మనిషిజాతి కనిపించకుండా పోయిన తర్వాత కూడా అవి ఉండి తీరతాయి. అవి దయతలచి మనలను ఉండనిస్తున్నాయి, కనుక కొంతకాలం ఇక్కడ మనం కూడా ఉంటాము. బిలియన్‌ల సంవత్సరాలుగా భూమిమీద రకరకాల సూక్ష్మజీవులు కొనసాగాయి. మన తరువాత కూడా మనిషి లేకున్నా, అవి ఉండి తీరతాయి. ఇక్కడ మనం ఒక్క విషయం లెక్కలోకి తీసుకోవాలి. మనం లేనప్పుడు సూక్ష్మజీవులు ఉన్నాయి, కానీ సూక్ష్మజీవులు లేనిదే, మనం అనే మనుషులం, ఒక్క రోజు కూడా బతకజాలము. మనం వదిలిన మురికిని వదిలించడానికి సూక్ష్మజీవుల మీద ఆధారపడుతున్నాము అన్న సంగతి చాలా మందికి తోచకపోవచ్చు. పడేసిన వస్తువులు, అది పాచి అన్నం కావచ్చు, పశువులు, జంతువుల శరీరాలు కావచ్చు. కుళ్లడం బాక్టీరియాల వల్లనే జరుగుతున్నది. కుళ్లకుంటే వ్యర్థ పదార్థాలన్నీ అలాగే ఉండి పోతాయి. కుళ్లితేనే అవి మట్టిìలో క£లుస్తాయి. ఆ రకంగా మట్టిసారం పెరుగుతుంది. మనకు తెలిసిన, తెలియని జీవులను, మొక్కలను కుళ్లించడం ద్వారా సూక్ష్మజీవులు పైమట్టిని హ్యూమస్‌గా మారుస్తున్నాయి. అట్లా మారినందుకే మట్టిలోకి పోషకపదార్థాలు మళ్లీ చేరుతున్నాయి. కనుకనే అదే పొలంలో అయినా మళ్లీ పంటలు పండుతున్నాయి.

            మంచినీళ్లు శుభ్రంగా ఉండాలని మనం రకరకాలుగా ఏర్పాట్లు చేస్తుంటాము. బాక్టీరియా కారణంగా నీటి నాణ్యత తగ్గుతుంది. కానీ బాక్టీరియా కారణంగానే మరొక పరిస్థితిలో పెద్ద ఎత్తున నీళ్లు పరిశుభ్రం అవుతున్నాయి కూడా. నీటిలో చేరిన వ్యర్థపదార్థాలను కుళ్లించినందుకే ఆ మకిలి అడుగుకు చేరుతుంది. పైన తేటనీళ్లను మనం త్రాగగలుగుతాము.

            పేగుల్లో ఉండే బాక్టీరియా మనకు అవసరమయిన వైటమిన్‌లను తయారు చేస్తాయి. మందుబిళ్లలు తెచ్చి మింగనవసరం లేకుండానే మనకు అవసరమయిన పోషకపదార్థాలు సూక్ష్మజీవుల వలన అందుతాయి అన్నమాట. మనం తిన్న తిండిని చక్కెరలుగా మాÂర్చేది సూక్ష్మజీవులే. బయటినుంచి వచ్చిన బాక్టీరియామీద లోపల ఉన్న రకాలు తెల్ల రక్తకణాలకన్నా ముందే పోరాటాన్ని మొదలు పెడతాయి. తిండి అరగడం, ఆరోగ్యం నిలబడడం సూక్ష్మజీవుల వల్ల జరుగుతున్నది. అంటే అవి మనకు ఎంత అవసరం అన్నది అర్థం అవుతుంది.

            వాతావరణంలో సూక్ష్మజీవుల పాత్ర గురించి చెప్పుకోవాలంటే, ఆశ్చర్యరకమయిన వివరాలను అంగీకరించడా నికి సిధ్ధంగా ఉండాలి. మనకు తెలిసి, మనచుట్టూ ఉన్న గాలిలో ఎక్కువగా ఉండే భాగం నత్రజని అనే వాయువు. సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని వాడుకొని, మాంసకృత్తులకు ఆధారమయిన అమైనో ఆమ్లాలను తయారు చేస్తాయి. డిఎన్ఏలో ఉండే భాగాలను కూడా సూక్ష్మజీవులే తయారుచేస్తాయి. ఇది మనకు నిజానికి అర్థంకాని అద్భుతం. అపార్థానికి గురయిన అమాయక జీవులు తెలియకుండానే మనకు చేస్తున్న పకారం ఇది. పరిశ్రమలో నత్రజని ఎరువులను తయారుచేయడానికి అయిదువందల డిగ్రీల సెల్సియస్ వేడిమి అవసరం అవుతుంది. ఒత్తిడికూడా చాలా ఎక్కువగా వాడవలసి ఉండుంది. సూక్ష్మజీవులు మాత్రం ఈ చిక్కులేవీ లేకుండానే, మనకు కావలసిన పదార్థాలను తయారు చేసిపెడతాయి. కంటికి కనపడకుండా జరుగుతున్న ఈ ఉత్పత్తి కార్యక్రమం వల్లనే చిన్ననుండి పెద్ద జీవులన్నీ బతుకు కొనసాగించ గలుగుతున్నాయి.

            విశ్వంలో మానవులనే మనం ఉండి, మనకు మనం కూడా ఉపకారం చేసుకోలేక పోతున్నాము. మెదడు అంటూ ఒకటి ఉంది కనుక, మనం ఎందుకు ఉన్నాము, అని ప్రశ్నలు అడుగుతున్నాము. జవాబు దొరకక అసంతృప్తితో బ్రతుకు కొనసాగిస్తున్నాము. మనం రాకముందే భూమిమీద మనుగడ కొనసాగిస్తున్న సూక్ష్మజీవులు మాత్రం, కొత్తగా వచ్చిన మనలను ఈసడించకుండా ఉపకారం చేయడం నేర్చుకున్నాయి. ఎందుకు అని ప్రశ్న వేసుకోలేదు. చేతనయింది కనుక తమకు తెలిసిన పనిని చేస్తున్నాయి. మనకు మాత్రం మంచితనం మనసులోకి కూడా రాదు. ఒకవేలు ఎత్తి ఒకరిని అనేముందు, మిగతా మూడువేళ్ల గురించి పట్టించుకోవలసిన పరిస్థితి సూక్ష్మజీవుల విషయంలో ముమ్మాటికి నిజం.


 

Monday, July 6, 2026

సిమెంట్ సంతతి : నగ్నముని విలోమ కథలు నుంచి.


సిమెంట్ సంతతి

నగ్నముని విలోమ కథలు నుంచి.

లోకంలో వయసు వచ్చిన అందరు ఆడపిల్లలకు మల్లెనే ఆ పిల్ల కూడా మొదట్లో మంచుతో నేసిన జలతారు ముసుగు, మొహం మీదకు లాక్కుని, రేకు విడవడానికి కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా ఉండేది. కాళ్లలో లేళ్లు గంతులేసేవి. కనురెప్పల్ని కలలు కమ్ముకునేవి. కాళ్లూ, చేతులూ, ప్రతి అవయవం యవ్వన పరిమళపు సెలయేళ్లుగా తుళ్లి పడేవి. పెదవుల మీద వెన్నెల ఒలికి, పలువరసను పలకరించి, ఒంటిలో ఇంకిపోయేది.

నడిస్తే, నడుస్తున్న హారతిలా ఉండేది.

ఆ పిల్ల తండ్రి కాళ్లూ, చేతులూ మెదడూ ఎప్పుడూ ఎక్కడో పన్జేస్తుండేవి. అర్ధ రాత్తుళ్లు బగ్గుమని చివరి మంట మండే లాంతర్లాంటి కళ్ళతో యింటికి చేరేవాడు. కుష్టువ్యాధి వ్యాపించిన వాడిలాగా దరిద్రంతో తీసుకుంటుండేవాడు. దరిద్రం క్రమంగా అతని అన్ని అవయవాల్ని తినేస్తోంది. నెమ్మదిగా నెమ్మదిగా ఇంటి గోడలకి, యింట్లోనే యితర వస్తువులకి, మనుషులకి వ్యాపిస్తోంది ఆ వ్యాధి.

తల్లి వంటింటి అలుగ్గుడ్డ. ఎడతెరిపి లేని దగ్గుగా మారి, చింకి చాప మీద ముణగదీసుకునుండేది. అర్ధరాత్రి మసిబారిన లాంతరు కళ్ళతో, సగం సగం అవయవాల్తో యింటికొచ్చే కట్టెతో కాపరం చేసేది.

వీధిలోని పెంటకుప్పకీ, యింటికీ పెద్ద తేడా లేదు. పెంటకుప్ప మీద గులాబీ మొక్కలాగా ఆ పిల్ల తనని తాను చూసుకునే లోపల ఎదిగిపోయింది.

అవయవాలన్నీ అందమైన పువ్వుల్లోకి మారిపోయినై. కుండీలో పెడతానని, మేకలు తినెయ్యకుండా కాపలా కాస్తానని, అంటుకట్టి మరిన్ని అందమైన రంగురంగుల పూలు పూయిస్తానని, పుస్తకాల్లోంచి, పక్క వీధిలోంచి ఎగిరేచ్చాడో కుర్రవాడు.

వాడి మాటల్లో మత్తు పానీయాలున్నాయ్.

వాడి కళ్ళలో గురితప్పని పూల బాణాలున్నాయ్.

వాడి నిట్టూర్పుల్లో మధురంగా బంధించే లతలున్నాయ్.

వాడి చొక్కాకి గలగలలాడే జేబుంది.

వాడి ఒంట్లో సలసల కాగే రక్త సరసుంది.

వాడి చేతిలో గుండెల్ని సుతిమెత్తగా తెరిచే రహస్య తాళం చెవి వుంది.

అనుమతివ్వాలో లేదో తేల్చుకోకముందే ఆమె గుండెను తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నాడు వాడు. రోజులు అగరొత్తులుగా వెలిగినయ్.

వాగ్దానాల ఊసులు దవనపు వాసనలైనై.

సెలవులయి పోయినయ్.

వొచ్చినంత వేగంతో తిరిగి దూరపు కాలేజీ పుస్తకాల్లోకి పారిపోయాడు వాడు.

వెళిపోయేప్పుడు కిటికీలు ముయ్యలేదు. తలుపు దగ్గరికయినా వెయ్యలేదు. కలలు కళ్ళని కమ్మేస్తే గుండెని బార్లా తెరిచి, గాయం చేసి వెళ్ళిపోయాడు.

గుమ్మం దగ్గరే మొక్కగా వుండగానే మానైపోయి వాడి కోసం రెప్పలు పీకేసిన కళ్ళతో వెతికింది ఆ పిల్ల.

ఆ తరువాత ఆ గుమ్మం దగ్గరకి రకరకాల తాళాల వ్యాపారులొచ్చారు. వాళ్లంతా తాళాల దొంగలే తప్ప గుండె చప్పుడు వినగలిగిన వాళ్ళు కాదు. కొందరు పాత తాళాలకి కొత్త తాళాలు అమ్మేవాళ్ళయితే మరికొందరు కొత్త తాళాల్ని త్వరితంగా తుప్పుతాళాలుగా మార్చేసేవాళ్లే. ఆ యినప వ్యాపారులందరికీ ఇనప బీరువాలు తెరవగలిగిన తాళాలు కావాలి. అంతే.

వాళ్లంతా అనేక జంతువులని వెంట తీసుకొచ్చేవారు. అవి మానవ భాషలో తెగ అరిచేవీ, కరిచేవీ. తండ్రీ కొడుకులూ, అన్నదమ్ములూ, మామ అల్లుళ్లు, బావ, బావమరుదులు, రకరకాలైన జంతువులొచ్చేవి. ఒకడు బొజ్జతో ఖద్దరు వాసన కొడతాడు. మరొకడు కాంట్రాక్టుల వాసన వేస్తాడు. ఒకడు కాసేపు దేహంలోకి వుమ్మూసి బస్సెక్కో, రిక్షా ఎక్కో పాపం చేసినవాళ్ళా పారిపోతాడు. మరొకడు రాత్రంతా కాండ్రించి వూసి తెలతెలవాడుతుండగా మళ్లీ మామూలు ముఖం తగిలించుకుని జారుకుంటాడు. అందరి చర్మపుభాషా ఒకటే. ఒక్కడూ గుండె చప్పుడు వినడు.

ఉమ్ముల దారిలో చర్మం బీటలు వారుతోంది. శరీర వృక్షం బెరడు, పెళ్లులుగా రాలుతోంది. అయినా ఆశ చావదు. వాడెప్పుడో యీ దారంట వస్తాడు. పశ్చాత్తాప్పడతాడు. మనసులో తిరిగి మరులు పూయిస్తాడు. ఇల్లూ, పిల్లలూ చల్లని సంసారంతో సన్నజాజి పందిరి వేస్తాడు. వాడి కోసం రోడ్డుమీద మొహాలు చూడ్డం, వీలున్నప్పుడల్లా వీధులంట తిరగడం, పార్కులో మూల కూర్చుని రావడం మానలేదు ఆమె.

ఒక రోజున పార్కులోనే చాలా రాత్రి అయిపోయింది. రెండ్రోజుల్నుంచీ తిండి లేదు. నీర్సంగా ఉంది. ఇంటికి పోదామని లేచేసరికి వర్షం మొదలయింది. పరుగెత్తుకెళ్ళి పార్కులోనే మూల షెడ్డు లాంటిదుంటే అందులోకి జేరింది. అప్పటికే ఒంటిమీద బట్ట లాంటిది తడిసింది. మెరుపుల్తో వాన పెరుగుతోంది. కింద నాపరాయి, పైన రేకులు, జల్లు మీదకి చిందడం లేదు, కాస్త పర్వాలేదని ముణగదీసుకుని మూలకు జేరబడింది. ఎవరూ దరిదాపులో లేరు. దూరపు గుడ్డి లైట్ వెల్తురు. వర్షం. తన పక్కనే మెరుపుల్లో చూస్తే ఎవడో ఒకడు పడుకున్నట్లు కనబడింది. పరకాయించి చూసింది. మళ్లీ మెరుపులో చూసినప్పుడు అంత విషాదంలోనూ నవ్వొచ్చింది.

అది ఆ వూరుని ఒకప్పుడు ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలిన ఒక గొప్ప రాజకీయ నాయకుడి విగ్రహం. బతికుండగా ఆయన అనేక పదవులు అలంకరించాడు. చేతికి ఎముకల్లేవన్నారు. శ్రీమహావిష్ణువే సాక్షాత్తు యీయన రూపంలో ప్రజాసేవ నిమిత్తం అవతరించా డన్నారు. పేదల పాలిటి పెన్నిధి అన్నారు. సంఘసంస్కర్త అన్నారు.ఒకప్పుడు పార్కు మధ్యన తిన్నె మీద రాజసంగా నుంచుని నీరాజనాలు అందుకున్నదా విగ్రహం. ఇప్పుడు ప్రత్యర్థులు పదవిలో కొచ్చాక షెడ్డులో పడుంది.

ఆ సిమెంట్ విగ్రహాన్ని ఆనుకుని గోడకి చేరగిలబడిందామె. ఎప్పుడు పట్టిందో నిద్ర. వర్షం పడుతూనే వుంది. శరీరం నేల మీద మూలకి ముణగదీసుకుని తుఫానులో చెట్టులాగా వాలిపోయింది. కమ్మటి నిద్ర పట్టేసింది. పాత కల.

నిద్రలోనే వాడితో గడిపిననాటి కల దుప్పటిగా కప్పుకుంది.

అమాయకపు జంతువు మొహంతో వాడు వచ్చాడు. తలుపు తట్టాడు.

పశ్చాత్తాప్పడ్డాడు. క్షమించమన్నాడు.

తిరిగి గుండె తాళం తెరిచాడు. బలంగా, బరువుగా మాటల మత్తు వాసనల్తో యింటి నిండా వసంతం నింపాడు. వాడి కౌగిట్లో కళ్ళు మూసింది. ఆవేశంలో కొట్టుకుపోయింది. అలిసిపోయి ఒడ్డుకుజేరి పడిపోయింది.

వర్షం పెద్దదైంది. గులకరాళ్ళతో బాధడం మొదలెట్టిందల్లా క్రమంగా ఆకాశంలోని బండరాళ్లని దొర్లిస్తున్నట్లు మారిపోయింది. కసిగా నీటి ఖడ్గం గాలిని కోస్తోంది. భూమిని తరుముతోంది. ఎక్కడో పిడుగు పడింది. ఆ పిడుగు ఆమె మూసిన కనురెప్పల మీద పడింది. ఆమె గుండెల్లో పడింది. ఆమె కల మీద పడింది. ఆమెకి చప్పున మెలకువొచ్చింది. వెల్లకిలా పడుకున్నదల్లా వెంటనే లేవాలని ప్రయత్నించింది. లేవలేకపోయింది. ఒంట్లో సత్తువనంతా కూడా తీసుకుని లేవాలని ప్రయత్నించింది. కానీ, లేవలేకపోయింది. తన మీద ఏదో బరువుగా పడుకునుంది. దుంగలా పడుంది. రాతిబండలా కదలనివ్వకుండా మెదలనివ్వకుండా పడివుంది. భూమిలోకి అదుముతున్నట్లనిపిస్తున్నది. ఒక్కసారి ఖణేల్మన్న మెరుపులో ఆమెకి తానెక్కడవుందో, తనమీద ఏమి పడివుందో కనబడింది. తన శరీరంలోని అణువుల శక్తినంతటినీ కూడదీసి బలంగా తనపైనున్న ఆ సిమెంటు శరీరాన్ని పక్కకు తోసేసి నిలబడింది. మరో మెరుపులో కిందకిచూసింది. సిమెంటు విగ్రహం. తనవంకే నవ్వుతూ చూస్తున్న రాజకీయ నాయకుడి విగ్రహం. తిరిగి సిమెంటు చేతులతో దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె వూడిపోయిన తన చీర ముక్కని ఒంటి చుట్టూ చుట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. తను కలలో జేరింది ఆ విగ్రహం కౌగిట్లోకా! విగ్రహం చేతులు వెకిలిగా నవ్వుతూ ఆమెను తిరిగి పొదుపుకోవడానికి ముందుకొస్తున్నయ్. ఆమెకి మతిబోయి, పరుగెత్తుకుంటూ వర్షంలోనే బయటికి వచ్చి పడింది! కంగారులో దారి తప్పింది. ఎప్పటికో యింటికి జేరింది.

నెల తప్పింది.

కడుపులో సిమెంట్ బలంతో మరో మొక్క దేహం రాళ్ల మధ్య వేళ్లూనింది. మొక్కని పీకెయ్యలేకపోయింది.

ఆకాశం పొట్టచిరిగి పేగులుబయట పడ్డట్లు మెరుపులు.

దేహంపై నిరంతరం కురిసే మురికి వాన. లోకపు స్మశానం నిండా కంకాళాల్లా పెరిగిపోతున్న తాళపు చెవులు. ముఖాల్లో అడవి జంతువుల హాహాకారాలు. అయినా, ఆమెలో ఆశ చావలేదు. వాడెప్పుడో వస్తాడు. గాయాలు కడుగుతాడు. గుండెదగ్గర తిరిగి ప్రేమ పిల్లనగ్రోవి నూగుతాడు.

మరో గులాబీ మొక్క పెంట పోగులు ఎదుగుతోంది. వెయ్యి రేకల్తో వికసించబోతోంది. సిమెంటు చేతుల్లోకి, కాళ్ళ కిందకి, ప్రతి మురికి అవయం కిందకీ జేరి అణిగిపోబోతోంది.

రాజకీయ నాయక జంతువులు బతికి వున్నప్పుడే గాక, చచ్చి విగ్రహాలుగా మారి కూడా ప్రజల భవిష్యత్తుని విషయిస్తూనే వుంటారు. తమ సంతతిని పెంచుకుంటూనే వుంటారు.

సృష్టికి సిగ్గు లేదు.

 

 


 

Wednesday, July 1, 2026

సూర్యుని తరుముతూ పరుగు


సూర్యుని తరుముతూ పరుగు

ఛేజింగ్ ద సన్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని చూసినప్పుడల్లా ఒక అనుమానం ఎదురవుతుంది. డు ము వు లు ప్రథమ అనే సూత్రం ప్రకారం సూర్యుడు అంటే ఒక మగ మనిషి. రామః రాముడు అవుతాడు. కృష్ణః కృష్ణుడు అవుతాడు. అదే పద్ధతిలో సూర్యః పోయి సూర్యుడు అవుతాడు. వీళ్లంతా దేవుళ్ళు. మగవాళ్లు. అయినా రాముడు. కృష్ణులకు మీసాలు ఉండవు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి ఒక ఊరు. అక్కడ సూర్యుని గుడి ఉంటుంది. అందులోని దేవునికి మీసాలు ఉంటాయి. ఆ గుడిని చాలా కష్టపడి కట్టారు. సంవత్సరంలో ఒకనాడు ఆకాశంలోని సూర్యుని కిరణాలు (ఈ సూర్యుని గురించి రాయవలసిన చోట సూర్య గోళం అని రాయడం అలవాటయింది.) గుడిలోని సూర్యుని మీద నేరుగా పడే విధంగా దాన్ని కట్టారు. గాలిగోపురంలో అందుకు అనువుగా కిటికీల్లాంటివి ఉన్నాయి మరి. గుడిలో దేవుడు మగ దేవుడు. చిత్రంగా ఆడదేవతలు ఉంటారు. ఆలుమగలు ఉంటారు. ఆ సంగతులు ఇక్కడ అవసరంలేవు.. మరి దేవుడు అంటే సూర్యుడు మగవాడా అవునంటున్నారు మరి పెద్దలు. ఆయనకు రథం ఉంటుంది. దానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే తొడలు లేని సారథి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి సంగతులు మాకు చెప్పి చెప్పి తలకెక్కించారు. ఆకాశంలోని సూర్యుడు మండే వాయువుల ముద్ద అని కూడా చెప్పారు. బడిలో ఎక్కడ అటువంటి పాఠం చదివిన గుర్తు లేదు.. ఆ సంగతులు మరేదో మార్గంలో తెలిశాయి. ఆలోచన గల ఎవరికయినా తికమక మొదలవుతుంది. ఆకాశంలోని సూర్యునికి రథం ఉంటే కనిపించాలి కదా! అది ఎన్నడూ కనిపించలేదు మరి!

మండే వాయువుల ముద్దకు రథం ఎందుకు గుర్రాలు ఎందుకు

సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో 90 శాతం, ఇంకా ఎక్కువ మంది అవును అంటారు. ఈ మధ్యన కొంత మంది, పిల్లలు మాత్రమే ధైర్యంగా కాదు అనగలుగుతున్నారు. సూర్యుడు ఒకచోట ఉంటాడు. కదిలిన మనకు తెలిసే విధంగా కదలడు, అన్నారు ఆ పిల్లలు. భూమి సూర్య గోళ్లను చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంతో పాటు అది బొంగరం లాగా తన చుట్టూ తాను తిరుగుతుంది. కనుక మనకు సూర్యుడు ఉదయించిన భావం కలుగుతుంది, అని పిల్లలకు అర్థమైంది అన్నమాట.

సన్ (ఎస్ యు ఎన్) అంటే సూర్యుడు. సన్ (ఎస్ ఓ ఎన్) అంటే కొడుకు. ఎంత బాగుందీ పద్ధతి నా కొడుకు నాకు ఆకాశంలో సూర్యుని వలె వెలుగుతూ కనబడతాడు. అందరు పిల్లలు అలాగే కనబడతారు. సూర్యుడు, చంద్రుడు విరాట్ పురుషునికి రెండు కళ్ళు అన్నారు, వెనకటివారు. ఆరింటికి పోలికే లేదు. అని ఎంతమందికి అర్థమయింది

మనిషి దేవుళ్లను సృష్టించాడు. వారికి తనలాగే రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్టు ఊహించాడు. అంతకన్నా మరొకరకంగా ఊహించడం అమాయకం మనిషికి చేతకాలేదు. విరాట్ పురుషునికి 1000 కళ్ళు, 1000 కాళ్లు ఉన్నాయి అన్నారు. అది ఎట్లా వీలవుతుంది అని ఆలోచన కలిగినట్లు లేదు. ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు గనుక వదిలేద్దాం.

విజ్ఞాన సర్వస్వంలో చూస్తే ఆకాశంలో సూర్యుడు ఎల్లో డ్వార్ఫ్ రకం నక్షత్రం అని రాసి ఉంది. దాని ద్రవ్యరాశి 1,909 X 10 10 (అంటే ఒకటి పక్కన పది సున్నలు పెట్టాలన్నమాట) కిలో గ్రాములు. డయామీటర్ అంటే చుట్టుకొలత 1,392,000 కిలోమీటర్లు అని కూడా ఉంది అక్కడ. అది భూమి నుంచి తొమ్మిది కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. మరీ సరిగా చెబితే.92,955,887.6 మైళ్ళ దూరంలో ఉంది. అంత దూరాన్ని కుదించి 9 కోట్ల 30000 అంటే కొంపేమీ మునగదు. సూర్యుడు అంటే నక్షత్రం. అది చిన్న నక్షత్రం. అది పుట్టినప్పుడు కొంత పదార్థం దూరంగా చిమ్మింది. ఆ పదార్థం ముద్దలు కట్టి గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. భూమి పదార్థంలో కొంత భాగం దూరం పోయి చంద్రగోళం తయారయింది. అది భూమి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు, చంద్రుడు మధ్య పోలిక లేదని తెలిసిపోయింది. సూర్య గోళం మండుతుంది కనుక వెలుగునిస్తుంది. చంద్ర గోళానికి స్వంత కాంతి లేదు. ఈ అక్షరాలను మీరు పగలు చదువుతున్నారంటే, అందుకు అవసరమైన వెలుగు సూర్య గోళం మంట నుంచి వస్తున్నది.

ఆదిత్యాయ, సోమాయ అంటూ మనవాళ్లు గ్రహాలకు దండం పెడతారు. బడిలో మాత్రం సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతుంటాయి, అని చెప్పారు. ఇప్పుడు పాత లెక్క తప్పు, లుతో గ్రహం కాదు. ఉన్న గ్రహాలు ఎనిమిది మాత్రమే అంటున్నారు. మన సంప్రదాయంలో రాహుకేతువులను గ్రహాలు అన్నారు. వాళ్ళిద్దరూ సూర్యుని, చంద్రుని మింగితే గ్రహణం వస్తుంది అని మాకు చిన్నప్పుడు చెప్పారు. ఇప్పటి పిల్లలకు గ్రహణం గురించి బాగా తెలుసు.

ఒక విషయం గురించి రకరకాలుగా చెబితే ఎవరికైనా తికమక, అనుమానం తప్పదు. చంద్రుడు మగ (మనిషి కాదు సుమా!), నక్షత్రాలు ఆయన భార్యలు అన్నారు. సూర్యుడు, (సూర్య గోళం) ఒక నక్షత్రం. దాని చుట్టూ తిరిగే భూమి నక్షత్రం కాదు. సూర్యుని కన్నా చాలా చిన్నది అది. ఆ భూగోళం చుట్టూ తిరిగే బుజ్జి గోళం చంద్రుడు. లేదా చంద్రగోళం. ఆయనకు నక్షత్రాలు భార్యలు అంటే అది పొసగని సంగతి.

సంప్రదాయంలో చెప్పే సంగతులు వేరు. ప్రత్యక్షంగా మనం చూసేది వేరు అని ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. తికమక అవసరం లేదు. ఎవరినీ తప్పు అనడం అంతకన్నా అవసరం లేదు. పడమటి దేశాల వారు చంద్రుడిని స్త్రీగా భావిస్తారని ఎవరికైనా తెలుసునా కానీ అది నిజం.

ఋగ్వేదంలో ఒక మాట ఉంది. కాంతిగల, కాంతి కలిగించే కాంతి వెలిగితేనే, మొత్తం విశ్వమంతా వెలుగుతుంది, అని అక్కడ చెప్పారు. పాశ్చాత్య నాగరికతలో సూర్యునికి అపోలో అని పేరు. అపోలో అంతరిక్ష నౌకలు సూర్యుని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అవి చంద్రగోళ మీద దిగాయి కూడా.

అన్నింటికీ మించి గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. సూర్య గోళం నుంచి భూగోళం వరకు గల దూరం ఎంతో విచిత్రమయినది. అంతకన్నా దగ్గరగా, లేక దూరంగా ఉన్న గ్రహాల మీద జీవం లేదు. ఇన్నర్ ప్లానెట్స్ అనే దగ్గర గ్రహాలు మండిపోతుంటాయి. దూరం గ్రహాలు చెప్పరానంత చల్లగా ఉంటాయి. భూగోళం మీద మాత్రమే నీరు ఉంది. అది ఆవిరి, నీరు, మంచు అనే మూడు స్థితులలో ఉండగలుగుతుంది. కనుకనే ఇక్కడ జీవం ఉంది. నీటిని, సూర్యుని వెలుగును వాడి జీవం పిండి పదార్థం అనే తిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నది. జీవుల మనుగడకు సూర్యుడే ఆధారం. వానలు కురిసి అంతా బురద అయిన తర్వాత మళ్లీ ఎండకాస్తే, పరిస్థితి మామూలు అవుతుంది. భూమి మనకు తగిన విధంగా పొడిబారుతుంది. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదు. పగలు, రాత్రులు లేవు. రుతువులుండవు. వర్షాలు కురవవు!

ఇంతకూ సూర్యుడు అనాలా సూర్య గోళం అనాలా ఎవరైనా చెపితే బాగుంటుంది!