Thursday, March 5, 2026

కుక్క - మానవుడు మొదట్లో...


కుక్క - మానవుడు మొదట్లో...


కుక్క - మానవుడు

మనిషి, ఆరడుగుల ఎత్తున్న మరో మనిషిని నమ్మడు. అంగుళం తాళాన్ని నమ్ముతాడు. అంతకన్నా ఎక్కువగా తన కుక్కను నమ్ముతాడు. మనిషి జాతికి మరో జంతువు గురించి పట్టనప్పటి నుంచి కుక్క తోడుగా ఉంది. పదిహేనువేల సంవత్సరాల క్రితం, అంటే వ్యవసాయం కూడా అంతగా రాని నాటినుంచే కుక్కలు సాయంగా వచ్చాయి. అయినా, మానవ నాగరికతలో కుక్క పాత్ర గురించి తెలిసింది తక్కువ. అటు వేటలో, తరువాత పశుపోషణలో కుక్కలు ఎంతో సాయం చేశాయన్నది నిజం.

కుక్కలను గురించి పరిశోధకులు చాలామంది పట్టించుకున్నారు. డార్విన్‌ కుక్కల నడవడిని పరిశీలించాడు. తన నాచురల్‌ సెలెక్షన్‌ సిద్ధాంతానికి వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడు. 20వ శతాబ్దంలో నొబేల్‌ గ్రహీత కాన్రాడ్‌ లోరెంజ్‌ కుక్కల గురించి విస్తృతంగా పరిశీలనలు సాగించాడు. స్కాట్‌, ఫుల్లర్‌ అనే జన్యుశాస్త్రవేత్తలు కుక్కల నడవడిని విశ్లేషించారు. ఇటీవలి కాలంలో మాత్రం కుక్కల గురించి పరిశోధనలు అంతగా జరగేలదనాలి. 21వ శతాబ్దం వచ్చిన తర్వాత మాత్రం వాటి మీదకు మరోసారి చూపు మరలింది. తోడేళ్ల నుంచి కుక్కలుగా మార్పులో జరిగిన అంశాలు, వాటి తెలివి, భావావేశాల గురించి ఎంతో పరిశోధన జరిగింది, జరుగుతున్నది కూడా. కనుక, కుక్కల గురించి ఎన్నో కొత్త అంశాలు తెలియవస్తున్నాయి.

పెంపుడు జంతువుగా కుక్క : నిజానికి మానవుడు కుక్కలను ప్రయత్నించి మచ్చిక చేయలేదు. వేట పద్ధతి నుంచి జీవన విధానం మారుతున్న రోజులలో కుక్కలు వాటంతటవే మనిషి పంచన చేరాయి. తోడేళ్లు, క్రమంగా కుక్కలుగా మారాయని, డి ఎన్‌ ఏ విశ్లేషణలో బయటపడింది. ఇప్పటి తోడేళ్లను గమనిస్తే, రాతియుగం మానవుడు వాటిని, చేరదీసి మచ్చిక చేసిన వీలు కనిపించదు. అంటే, వెనుక కాలంలో తోడేళ్లు మరింత మెత్తని స్వభావం కలిగి ఉండేవని అర్థం చెప్పవచ్చు. ఆ జాతి గతించింది. వారసులుగా మన కుక్కలు మిగిలి ఉన్నాయి. అప్పటి తోడేళ్లు మనుషుల ప్రాంతాలతో తిండి కోసం తిరిగాయి. వాటి పిల్లలను మనుషులు చేరదీశారు. అప్పటి మానవులకు జంతువుల కూనలను తెచ్చి పెంచుకోవడం అలవాటు! అట్లా మనుషుల మధ్య పెరిగిన జంతువులను మచ్చిక చేసి పనులు నేర్పడం సులభం. ఆ దారిలో మనిషికి కుక్కల సాయం మొదలయింది. కాపలా, వేటలాంటి లక్షణాలు కూడా నేర్చిన తర్వాత వాటి సాయం పెరిగింది. అంటే కుక్కలను మచ్చిక చేయడం, అనుకోకుండా జరిగిన పని! కానీ, దానివల్ల అటు తోడేళ్లకు, ఇటు మనుషులకు మంచి జరిగింది. సహవాసం సాగింది.

మచ్చిక క్రమం : ఉత్తర ఇజ్రాయెల్‌లో ఒక సమాధిలో, ఒక వ్యక్తి కుక్కమీద చెయ్యి వేసి ఉండడం కనిపించింది. ఆ కుక్క పిల్లకు, అప్పటి తోడేలు పిల్లలకూ ఎంతో తేడా ఉంది. ముఖ్యంగా దాని దంతాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అంటే, ఆ కాలానికి తోడేళ్లు కొన్ని, కుక్కలుగా మారినట్లు లెక్క. కుక్క పిల్లను మనిషితోబాటు, ఖననం చేశారంటే పరస్పర సంబంధం, ప్రేమ అర్థమవుతాయి. 12వేల సంసవత్సరాల నాటి ఈ సమాధి, కుక్కల చరిత్రలో ఒక గొప్ప సూచనగా నిలిచింది. కానీ, అంతకుముందు, ఎక్కడ, ఏ రకంగా, కుక్కలు మచ్చికయిందీ చెప్పగల ఆధారాలు, నేటివరకు అందలేదు.

గడచిన సంవత్సరం, సైబీరియాలో జరిపిన తవ్వకాలలో ఒకచోట కుక్క పుర్రె దొరికింది. అది 33వేల సంవత్సరాలు నాటిదని లెక్క తేలింది. పుర్రె నిర్మాణం కుక్కల పుర్రెలాగున్నా, పళ్లు మాత్రం తోడేలు పద్ధతిలో ఉన్నాయి. గతంలో బెల్జియంలో దొరికిన ఒక పుర్రె కూడా 31వేల ఏండ్ల వాటిదని ఈ మధ్య నిర్ణయించారు. ఇవి బహుశ: ఈనాటి కుక్కల పూర్వీకుల జాతికి చెందనవని అభిప్రాయం, అనుమానం వచ్చాయి. కానీ, ఈనాటి కుక్కలు ఈ క్రమంలోనివి కావని ఆధారాలు కూడా అందాయి. 24,000 నుంచి 13,000 సంవత్సరాల మధ్యన, భూమిమీద మంచుయుగం వచ్చింది. అప్పుడు మానవులు దక్షిణ ప్రాంతాలకు తరలివచ్చారు. మునపటి కుక్కలు వారితో రాలేదు. మచ్చిక కార్యక్రమం మరోసారి మొదలయింది.

మచ్చిక ఎక్కడ? : పురాతత్వ పరిశోధనలో అందిన ఆధారాల ప్రకారం, కుక్కల మచ్చిక మునుముందు పడమటి ఆసియా ప్రాంతంలో మొదలయింది. ఆ ప్రాంతాలను ఇప్పుడు మిడిల్‌ ఈస్ట్‌ (మధ్యప్రాచ్యం) అంటున్నారు. 2005లో కుక్కల డి ఎన్‌ ఏ నిర్మాణ క్రమాన్ని (జీనోమ్‌) పూర్తిగా గుర్తించారు. అంతకుముందు దొరికిన, కుక్కలు, వాటి పూర్వీకులనుకున్న తోడేళ్ల జన్యు పదార్థాలను కూడా తరచి చూస్తే, పరిణామం, మచ్చికల గురించి మరెంతో తెలుస్తుంది. ఇలాంటి పరీక్షలు జరిగాయి. కుక్కలన్నింటిలోనూ మిడిల్‌ఈస్ట్‌ పద్ధతి జన్యు నిర్మాణమే కనిపించింది. కనుక పురాతత్వ పరిశోధన వెల్లడించిన చరిత్ర సరయినదేనని గట్టిగా తెలిసింది. స్వీడన్‌ పరిశోధకులు పీటర్‌ సవొరైనెన్‌ మాత్రం కుక్కల పుట్టుకస్థానం ఆగ్నేయ ఆసియా అంటున్నాడు. జీవజాతులు వేరువేరు చోట్లకు చేరిన కొద్దీ, వాటి జన్యువులలో వైవిధ్యం తగ్గి, మొదటి రూపం వస్తుంది. యాంగ్జీ నది ప్రాంతపు కుక్కలలో మాత్రం ఆ లక్షణం కనిపించ లేదు. యూరోపియన్‌ కుక్కలలో కూడా మధ్యప్రాచ్యం డి ఎన్‌ ఏ లక్షణాలు అంతగా కనిపించలేదట. కనుక పరిణామచరిత్రలో ఇంకా ప్రశ్నలు మిగిలాయి.

కుక్కల శక్తియుక్తులు : మనుషులకు సాయం చేయడంలో మరొక జంతువేదీ కుక్కలకు సాటిరాదు. చింపాజీలకు కూడా మనుషుల శరీరం కదలిక సూచనలు అంతబాగా అర్థం కావు. వేలు చూసినా అర్థం చేసుకోవడం ఒక్క కుక్కలకే చేతనయింది. కుక్కలకు ‘నేర్చుకునే శక్తి, కోరికలు’ చాలా ఎక్కువ. మనుషుల నడవడిని అవి మరీమరీ పరిశీలించి, అర్థాలు తెలుసుకుంటాయి. కుక్కలకు మనుషుల ముఖ కవళికలు ఎంతో నచ్చుతాయి. కోపం, మెచ్చికోలు సులభంగా అర్థమవుతాయి. అసలు, ఆ ముఖం ఎటువేపు ఎందుకు చూచేదీ వాటికి అర్థమవుతుంది. కళ్లులేని వారికి, కుక్కలు తోడుగా ఉంటున్నాయని తెలుసు. ఆ రకం కుక్కలను గురించి ఫ్లోరెన్స్‌ గానేట్‌ వంటి జంతుశాస్త్రజ్ఞులు లోతుగా పరిశోధించారు. కళ్లులేని వారి ‘చూపును’ కూడా కుక్కలు, చురుకుగా అర్థం చేసుకో గలుగుతాయని ఆమె అంటున్నారు.

కుక్కలకు తమ పరిసరాలను గురించి అంతగా తెలియదని ఒక్కోసారి అనిపిస్తుంది. బ్రిటా ఓస్ట్‌హౌస్‌ అనే పరిశోధకురాలు ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగంలో రెండు హాండిల్స్‌ ఉంటాయి. వాటిలో ఒకదాని నుంచి కట్టిన దారం అటు చివరన మాంసం ముక్క ఉంటుంది. అయినా కుక్కలు, ఆ దారం సంగతి పట్టించుకోకుండా, తిండికి దగ్గరగా ఉన్న హ్యాండిల్‌ను లాగాయి. కుక్కలకు కాలంలో వెనక, ముందుల గురించి కూడా అంతగా తెలియదని అర్థమయింది. గతం అనుభవాలను అవి గుర్తుంచుకోవు. రానున్న కాలం కొరకు జాగ్రత్తలూ వాటికి తోచవు. అందుకే ఒంటరిగా వదిలిన కుక్కలు మరీ సమస్యలకు గురవుతాయి. సమస్యలకు కారణమూ అవుతాయి. వదిలివెళ్లిన యజమాని ఏదో ఒకనాటికి తిరిగి వచ్చే సంగతి వాటికి తోచదు.

కుక్కల ముక్కు, వాసన శక్తి ఎంతో ప్రత్యేకమన్న సంగతి తెలిసిందే. మనుషుల వాసన శక్తి, కుక్కలతో పోలిస్తే, చాలా తక్కువ. మనుషులకు సూచనగా కూడా తెలియని వాసనలను కుక్కలు పసిగడతాయి. మనిషి రక్తంలో, డయబెటిస్‌ కారణంగా, చక్కెరలు ప్రమాద స్థాయికి చేరుకుంటే కుక్కలు గుర్తించి హెచ్చరిక చేయ గలుగుతున్నాయి. అవసరమయితే, అర్థరాత్రి కూడా, ఆ మనిషిని నిద్రలేపి, హెచ్చరించే రకంగా, కుక్కలకు శిక్షణ ఇవ్వగలిగారు. కుక్కలలో వాసనకు సంబంధించి వోమెరో నేసల్‌ ఆర్గన్‌ అనే, రెండవ (అదనపు) వ్యవస్థ ఉంటుంది. పై వరుస కోరపళ్ల మీద నుంచి ఒక డక్ట్‌ ఉండి, ముక్కులలోకి తెరుచుకుంటుంది. ఈ దారి వెంట కూడా వాసనలు తెలుస్తుంటాయి. ఈ వ్యవస్థ గురించి మరింత పరిశోధన జరగవలసి ఉంది. మిగతా కుక్కల వాసనను గుర్తించడం దీని పని అని పరిశోధకులు భావిస్తున్నారు.

అనుకోని నిజాలు

కుక్కల మధ్య బంధం : మచ్చికయిన తర్వాత కుక్కల కుటుంబం పద్ధతి పూర్తిగా మారిపోయింది. తోడేళ్లకు ప్రపంచమంటే కుటుంబం ఒకటే. తల్లి, తండ్రి, వాటి పిల్లలు కలిసి గుంపుగా తిరగడం వాటికి బాగా అలవాటు. పెరిగిన పిల్లలు కూడా, తల్లిదండ్రుల తోనే ఉండిపోతాయి. తమ తరువాత పుట్టిన పిల్లలను పెంచడంలో అవి సాయపడతాయి. తోడేళ్లనుంచి వచ్చిన కుక్కలకు మాత్రం ఈ కుటుంబం పద్ధతి ఏ మాత్రం చేతగాదు. కుక్కల మధ్యన ప్రేమ, కలిసి ఉండడంలాంటివి కనిపించవు. అడవులలో పెరిగే కుక్కలు కూడా కుటుంబాలుగా ఉండవు. ఆడతోడును ఎంచుకోవడంలో వాటికి ఒక పద్ధతి లేదు. ఇక పెంపుడు కుక్కలకు, యజమాని, ఆ కుటుంబం మాత్రమే స్వంత కుటుంబంగా కనబడుతుంది. మిగతా కుక్కల సంగతి పట్టనే పట్టదు. నిజానికి, కుక్క, మనిషికి తేడా కుక్కలకు తెలియదంటారు. మనిషితో కలిసి మనిషినే జట్టు నాయకులుగా గుర్తించి బతుకుతాయవి!




 

Wednesday, March 4, 2026

ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర నుంచి శ్రీశైల విశేషాలు


ఏనుగుల వీరాస్వామయ్య 
రచించిన కాశీ యాత్ర చరిత్ర 

నుంచి శ్రీశైల విశేషాలు















 

Tuesday, March 3, 2026

కిటికీ : సాకీ కథకు నా తెలుగు అనువాదం


కిటికీ

సాకీ కథకు నా తెలుగు అనువాదం


కిటికీ

ఎచ్‌.ఎచ్‌. మన్రో (సాకీ)

మా ఆంట్‌ కొంచెంసేపట్లో వస్తుంది, మిస్టర్‌ నటల్‌’ అన్నది ఆ పదిహేనేళ్ల పడుచు. ‘ఈలోగా మీరు ప్రయత్నించి నా ఉనికిని భరించాలి’.

రావలసిన ఆ అత్తగారికి బదులు ఎదురుగా వచ్చిన నీస్‌ కు సరిగ్గా ఏదో మాట చెప్పి సంతృప్తిపరచాలి. ఆలోగా ఆంట్‌ మీద గౌరవం తగ్గకూడదు. ఫ్రామ్‌టన్‌ నటల్‌ సమస్యలో పడ్డాడు. అతను చికిత్స కోసం ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే, వరుసబెట్టి, అంతకు ముందెన్నడూ ఎరుగనివాళ్లను కలిసినందుకు అసలు ప్రయోజనం ఉంటుందా అన్న అనుమానం అతనికి లోలోపల ఉండనే ఉన్నది.

చికిత్సకోసం అతను పల్లె ప్రాంతాలకు పోతున్నాడంటే, వాళ్ల అక్కయ్య సలహా ఇచ్చింది. ‘ఎలాగుంటుందో నాకు తెలుసు. నీవు ఎక్కడో పాతుకుపోతావ్‌. ఎవ్వరితోనూ మాట్లాడవు. నీ నాడులు మరింత పాడవుతాయి. అక్కడ నాకు తెలిసినవాళ్లందరికీ పరిచయాలు చేస్తూ, నేను నీకు ఉత్తరాలు ఇస్తాను. నాకు గుర్తున్నంత వరకూ వాళ్లలో కొంతమంది చాలా మంచివాళ్లు’ అన్నది ఆమె.

ఆ ఉత్తరాలలోనుంచి ఒకదాన్ని మిసెస్‌ సాపుల్టన్‌కి ఇవ్వడానికి ఫ్రామ్‌టన్‌ వచ్చాడు. మరి ఆమె మంచివాళ్లలోకి చేరుతుందా అన్నది అతని అనుమానం.

ఈ చుట్టుపక్కల మీకు చాలామంది తెలుసా?’ అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్నామన్న సంగతిని గ్రహించిన ఆ నీస్‌ అడిగింది.

ఒక్కరూ తెలియదు. మా అక్క ఒకప్పుడు ఇక్కడ ఉండేది. సుమారు నాలుగేళ్ల క్రితం రెక్టరీలో ఉండేది. ఆమె ఇక్కడివాళ్లను పరిచయం చేస్తూ నాకు ఉత్తరాలు ఇచ్చింది’ అన్నాడు ఫ్రామ్‌టన్‌. అతని చివరి మాటల్లో ఒక రకమయిన అయిష్టత ధ్వనించింది.

అయితే ఆంట్‌ గురించి మీకు అసలు తెలియదన్నమాట?’ బింకంగా ఉన్న ఆ యువతి పరిశోధనగా అడిగింది.

ఆమె పేరు, చిరునామా తప్ప!’ ఆగంతకుడు ఒప్పుకున్నాడు.

మిసెస్‌ సాపుల్టన్‌కి పెళ్లయిందా? లేక భర్త పోయాడా అని అతను ఆలోచిస్తున్నాడు. గదిలోని చెప్పరాని సంగతులేవో మగవాళ్ల ఉనికిని సూచిస్తున్నాయి.

మూడు సంవత్సరాల క్రితం ఆమె గొప్ప విషాదంలో పడింది. అంటే, మీ అక్కయ్యగారు వెళ్లిపోయిన తరువాత అన్నమాట!’ అన్నది ఆ పాప.

ఏమిటది?’ ఫ్రామ్‌టన్‌ అడిగాడు. ఎందుకో ఈ ప్రశాంతమయిన ప్రాంతంలో అనుకోని ఆపదలు అమరినట్టు అతనికి కనిపించలేదు.

ఒక అక్టోబర్‌ మధ్యాహ్నాన ఆ కిటికీ ఎందుకు తెరిచి ఉందని మీరు ఆశ్చర్యపడి ఉంటారు’ లాన్‌ మీదికి తెరుచుకుని ఉన్న ఒక పెద్ద ఫ్రెంచ్‌ విండో వేపు చూపిస్తూ, నీస్‌ అన్నది.

నిజానికి ఉండవలసినకన్నా ఎక్కువ వేడిగానే ఉంది. అయితే, ఆ కిటికీకి, జరిగిన దురంతానికి సంబంధం ఏదయినా ఉందా?’ అన్నాడు ఫ్రామ్‌టన్‌.

ఆ కిటికీలోనుంచి, సరిగ్గా ఇదే రోజున మూడు సంవత్సరాల నాడు ఆమె భర్త, ఆయనతో ఆమె ఇద్దరు తమ్ముళ్లు వేటకోసం వెళ్లిపోయారు.  వాళ్లు ఇక తిరిగి రాలేదు. మైదానం మీదుగా వేట ప్రాంతానికి వెళుతుండగా, వాళ్లు ముగ్గురు ఒక బురదగుంటలో చిక్కుకున్నారు. అంతకు ముందు సంవత్సరాలలో ఆపద లేదనుకున్న ప్రదేశాలు, అకస్మాత్తుగా బురదగా మారాయి. వాళ్ల శరీరాలు కూడా దొరకలేదు. అది అన్నింటికన్నా భయంకరమయిన సంగతి’.

ఇక్కడ అమ్మాయి గొంతులో మునుపటి బింకం పోయింది. అందులో మానవతలోని బలహీనత కనిపించింది.

పాపం ఆంట్‌, వాళ్లు ఏదో ఒక రోజున తిరిగి వస్తారని ఎప్పుడూ అనుకుంటుంది. వాళ్లతో పాటు పోయిన చిన్న స్పానియల్‌ కుక్క కూడా  కలిసి, ఆ కిటికీ గుండా నడిచి చాలా మామూలుగా వాళ్లు వచ్చేస్తారని ఆమె ఆశ. అందుకే సాయంత్రమయితే చాలు, చీకటిపడే వరకూ ఆ కిటికీ తెరిచే ఉంటుంది. పాపం, పిచ్చి ఆంట్‌. తెల్లని వాటర్‌ ప్రూఫ్‌ కోటు చేతిమీద వేసుకుని తన భర్త, ఇంకా తమ్ముడు రోనీ, వెళ్లిన తీరు గురించి ఎన్నిసార్లు చెప్పిందో! తమ్ముడు ఒక పాట పాడుతూ ఈమెని ఎప్పుడూ ఏడిపించేవాడట. ఆ పాట ఇష్టంలేదని ఈవిడ అన్నది కనుక, అతను ఎప్పుడూ దాన్నే పాడతాడట! మీకు తెలుసా? ఒక్కోసారి ప్రశాంతమయిన ఒక సాయంత్రాన వాళ్లు నిజంగానే కిటికీలోంచి నడిచి వస్తారేమోనని నాకూ అనిపిస్తుంది.  ...... ’

ఆమె ఉలిక్కిపడి మాటలు ఆపింది. ఫ్రామ్‌టన్‌కు తెరపి దొరికింది. ఆలస్యానికి క్షమాపణలు చెబుతూ ఆంట్‌ గదిలోకి వేగంగా వచ్చింది.

మీకు తోడుగా సరదాగా వేరా, ఉందనుకుంటాను?’ ఆమె అన్నది.

ఆమె చాలా ఆసక్తి కలిగించే మనిషి’ ఫ్రామ్‌టన్‌ అన్నాడు.

కిటికీ తెరిచి ఉన్నందుకు మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను? నా భర్త, తమ్ముళ్లు వేటనుంచి నేరుగా ఇంటికి వస్తారు. ఈ దారి గుండానే వస్తారు. బురద ప్రాంతంలో వేటాడడానికి వెళ్లారు. లోపలికి వచ్చి కార్పెట్లనంతా పాడుచేస్తారు. మీ మగవాళ్లంతా అంతే! అవునంటారా?’   మిసెస్‌ సాపుల్టన్‌ గబగబా అన్నది. ఆమె సంతోషంగా వేట గురించి, పక్షులు తగ్గిపోవడం గురించి, చలికాలంలో బాతులు దొరకడం గురించి ఏవో చెపుతూనే ఉన్నది.

ఫ్రామ్‌టన్‌కు అదంతా పచ్చి భయంకరంగా ఉంది. మాటలను అంతకన్నా తక్కువ భయంకరమయిన విషయం మీదికి మార్చడానికి అతను అరకొర ప్రయత్నాలు చేశాడు. కానీ కుదరలేదు. ఇల్లుగలావిడ తన మనసులోని భ్రమను ఒకదాన్ని తనకు వినిపిస్తున్నదని అతనికి తెలుసు.  ఆమె కళ్లు అదే పనిగా తెరిచిన కిటికీలోనుంచి బయట లాన్‌ మీదుగా చూస్తున్నాయి. సరిగ్గా ప్రమాదం జరిగిన రోజునే ఏళ్ల తరువాత తాను అక్కడికి రావడం అనుకోకుండా జరిగినా, దురదృష్టమని అతనికి నమ్మకం మొదలయింది.

డాక్టర్లు నాకు పూర్తి విశ్రాంతి అవసరమంటారు. ఏ రకంగానూ ఆదుర్దా కూడదంటారు. శరీరాన్ని కుదిపే ఈ పనులూ కూడదంటారు’  ఫ్రామ్‌టన్‌ ప్రకటించాడు.

కొత్తవారికి లేదా అనుకోకుండా కలిసినవారికి, ఎదుటివారి జబ్బులు, అవకరాలు, వాటి కారణాలు, చికిత్స గురించి తెలుసుకోవాలని గొప్ప ఆదుర్దాగా ఉంటుందని అందరిలాగే, భ్రమలో పడ్డ ఫ్రామ్‌టన్‌, ‘ఇక తిండి విషయంలో వాళ్లు మరీ పట్టుదలగా ఉన్నారు’ అంటూ ఏదో చెపుతున్నాడు.

నో?’ ఆవులిస్తున్న మిసెస్‌ సాపుల్టన్‌ ఆపి ఒక్కసారిగా ఆ మాట అన్నది.

అనుకోకుండా ఆమె చురుకుగా కనిపించసాగింది. అది ఫ్రామ్‌టన్‌ మాటలవల్ల మాత్రం కాదు.

అదుగో, చివరకు రానే వచ్చారు. సరిగ్గా టీ సమయానికి. వాళ్లు కళ్లదాకా బురదలో కూరుకున్నట్టు కనిపిస్తున్నది కదూ?’ ఆమె అరిచింది.

ఫ్రామ్‌టన్‌ కొంచెంగా వొణికిపోయాడు. సానుభూతి తెలిపే పద్ధతిలో ఒకసారి నీస్‌ వేపు చూచాడు. ఆ అమ్మాయి కళ్లు పెద్దగా తెరుచుకుని భయంగా కిటికీలోంచి చూస్తున్నది. పేరులేని భయంతో అదిరిపోతూ ఫ్రామ్‌టన్‌ కుర్చీలో గుండ్రంగా తిరిగాడు. అతనూ అటువేపే చూచాడు.  సంజ చీకట్లు ముదురుతున్నాయి. గడ్డిమీద నడుస్తూ మూడు ఆకారాలు కిటికీవేపు వస్తున్నాయి. వాళ్లు ముగ్గురూ తుపాకీలు చంకన పెట్టుకున్నారు.  ఒకతని బుజం మీద తెల్లని కోటు బరువుగా వేలాడుతున్నది. అలసిపోయిన స్పానియల్‌ ఒకటి వాళ్ల వెనుకే వస్తున్నది. వాళ్లు నిశ్శబ్దంగా ఇంటిదాకా వచ్చారు. ఆ మసక వెలుతురులోనుంచే ఒక మొరటు కుర్ర గొంతు గట్టిగా పాడటం వినిపించింది. ఫ్రామ్‌టన్‌ తన చేతికర్రను, టోపీని భయంతో  గట్టిగా పట్టుకున్నాడు. హాలు ద్వారం, ముందరి రాళ్ల బాట, గేటు, అతని పరుగుదారిలో చూచాయిగా తెలిశాయి. రోడ్డుమీద వెళుతున్న ఒక సైకిల్‌ మనిషి ఇతనికి కొట్టుకోకుండా రోడ్డు దిగి దూరంగా వెళ్లవలసి వచ్చింది.

వచ్చేశాం మైడియర్‌!’ తెల్లవాన కోటు మోస్తున్న మనిషి, కిటికీలోంచి వస్తూ అన్నాడు. బాగా బురద, కానీ చాలామటుకు ఆరిపోయింది. మేం వస్తుంటే, పరుగున వెళ్లిపోయాడే, ఎవరాయన?’

ఒక అసాధారణమయిన మనిషి. పేరు మిస్టర్‌ నటాల్‌’ మిసెస్‌ సాపుల్టన్‌ చెప్పింది. తన అనారోగ్యం గురించి మాత్రమే చెప్పాడు. మీరు వస్తూ ఉంటే, కనీసం క్షమాపణ గుడ్‌ బై ఒక్క మాటన్నా చెప్పకుండా పరుగెత్తిపోయాడు. అతను దయ్యాన్ని చూచాడని ఎవరయినా అనుకుంటారు’.

కుక్కను చూచి భయపడ్డాడనుకుంటాను!’ నీస్‌ ప్రశాంతంగా అన్నది. ‘తనకు కుక్కలంటే తెగని భయమని ఆయన చెప్పాడు. గంగానది ఒడ్డున ఊరకుక్కలు వెంటబడి ఆయనను ఒక స్మశానంలోకి తరిమాయట! అతను రాత్రంతా కొత్తగా తవ్విన ఒక గొయ్యిలో ఉండిపోయాడట. కుక్కలు ఆ పైనే పళ్లికిలిస్తూ, గురగురలాడుతూ చూస్తూ ఉన్నాయట! ఎవరికయినా భయపడిపోవడానికి అది చాలు!’

క్షణంలో కల్పనలు చెప్పడం ఆమె ప్రత్యేకత!


 

Monday, March 2, 2026

జలపాతం - నేను చూచిన నీటి గురించి...


జలపాతం

నేను చూచిన నీటి గురించి...





ఇది నా చేతిరాత!





 

Saturday, February 28, 2026

కలలు - వాటి తీరుతెన్నులు


కలలు - వాటి తీరుతెన్నులు 


కలలు

కలలు కనండి. అప్పుడే అవి నిజమవుతాయి." అన్నారట ఆవుల్‌ పకీర్‌ జైనులాబుదీన్‌ అబ్దుల్‌ కలాం గారు.
ఆయనెవరని ఎవరికయినా అనుమానం వచ్చిన పక్షంలో పూచీ మొత్తం ఆ అనుమానం వచ్చిన వాళ్లదే. భారత రత్న బిరుదం పొందిన ఒకానొక శాస్తవేత్త గురించి తెలియక పోవడం గురించి ఏమనడానికీ లేదు. ఇంతకూ విషయం కలల గురించి. కలాం గురించి కాదు.
కానీ కలల గురించి ఆయనగారన్న మాటలు కలకాలం మననం చేసుకోదగినవి. వాస్తవం గురించి అంతగా ఆలోచించడానికి ఉండదు. అది మన ఎదుటనే ఉంటుంది. లేని దాన్ని గురించీ, వాస్తవం కన్నా మరింత గొప్పగా ఉండే దాన్ని గురించీ ఆలోచించాలి. ఊహిం౦చాలి. కలలుగనాలి. అప్పుడవి నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచన లేకుంటే ప్రయత్నం దాకా పరిస్థితి పోనే పోదు. కలాం గారు అందుకే కలలు కనమన్నారు. కానీ ఆయన చెప్పింది పగటి కలల గురించి మాత్రం కాదు.


పగటి కలలు గాలిమేడలు ఒకటేనని వెనకటనే పెద్దలు చెప్పారు. మౌలుకువగా ఉన్నప్పుడు రావలసినవి ఆలోచనలు. కలలు కానే కాదు. పగలే కలలు కంటున్నారంటే పని చేయవలసిన సమయంలో పడుకుని నిద్ర పోతున్నారనయినా అనుకోవాలి. లేదంటే అలవిమాలిన ఆలోచనలు చేస్తున్నారనయినా అనుకోవాలి. ఈ రెంటి వలనా (ప్రయోజనం ఉండదని వేరే చెప్పాలా? అలా కాకుండా గుండె నిండా ఒక విషయాన్ని నింపుకుని తెలిసీ తెలియకుండా కూడా దాన్ని గురించే ఆలోచనలు సాగితే ఏదో ఒకనాడు ఆ సంగతి కలలోకి కూడా వచ్చేస్తుంది. అది కలలోకి వచ్చిందంటే దాన్ని గురించి అంతగా ఆలోచన జరుగుతు న్నదని అర్థం. కొన్ని సంగతులను గురించి ఆలోచనలు మనకు తెలియకుండానే మనసు లోతుల్లో జరుగుతుంటాయని చాలా మందికి తెలియక పోవచ్చు. నిజానికి ఇటువంటి విషయాలే నిద్రలో కూడా మనసులోకి వచ్చి కలలవుతాయి. కలాం గారు కలలు కనమన్నారంటే గట్టి ఆలోచన ఏదో చెయ్యమ న్నారని అర్థం. జాయిగా నిద్రపోయి కలలు కనమని మాత్రం కాదు. ఆయన చెప్పిన దాంట్లో మరొక చిత్రం ఉంది. ఊరికే కలగని వదిలేస్తే చాలదు. అది నిజమయ్యే దాకా కష్టపడి పని చేయాలి. అలాగంటే నిద్ర పోకూడదని కూడా అర్థమేమో. చెప్పినమాట, వినడానికి ఒక అర్థాన్ని సూచిస్తే బాగా ఆలోచించిన మీదట మరో అర్థాన్ని సూచించింది. అదే పెద్దల మాటల్లో ఉండే గొప్పదనం.
ఒక రాజు ఉండే వాడు. ఆయన దగ్గర మామూలుగానే మంది మార్బలమూ ఉన్నారు. వారిలో ఒక పహరాదారు కూడా ఉన్నాడు. అతనొక రోజు రాజుతో అయ్యా! మీరివాళ తోటలోకి పోకండి. అక్కడ మీ కోసం ఆపద ఎదురు చూస్తూ ఉన్నది" అని చెప్పాడు. రాజు చూద్దామనుకుని తగు జాగ్రత్తలతో తోటలోకి వెల్లాడు. అక్కడ నిజంగానే ఆపద ఎదురయింది. జాగ్రత్తగా ఉన్నాడుగనుక రాజు తప్పించుకు వచ్చాడు. మరుసటిరోజు కూడా పహరాదారు అటువంటిదే మరో హెచ్చరిక చేశాడు. అదీ నిజమయింది. ఇంతకూ నీకీ ఆపదల గురించి ముందే ఎట్లా తెలిసిందని రాజు పహరా మనిషిని అడిగాడు. నాకా సంగతులు కలలో తెలిశాయని చెప్పి రాజును రక్షించినందుకు తనకేదో గొప్ప బహుమానం దొరుకుతుందని ఆశగా చూచాడతను. రాజు మాత్రం కోపగించుకుని  రాత్రిపూట కాపలా కాయమంటే హాయిగా నిద్రపోయి కలలు గంటున్నావా నాయనా? అసలు నీ వల్ల నాకు ఎక్కువ ఆపద ఉండేట్టుంది!” అంటూ అతడిని ఉద్యోగంలోంచి తీసేశాడట.
ఇది వినడానికి ఏదో చిన్న పిల్లల కథలాగున్నా ఇందులో గొప్ప కిటుకుంది. మెలుకువగా ఉండవలసిన వాళ్లు నిద్రపోతే కుదరదు. అందరికీ నిద్రపోయి హాయిగా కలలు గనే అవకాశమే ఉండదు. జీవితంలో కష్టాలూ కడగండ్లూ మొదలయితే నిద్ర రాదు. ఇక కలల గురించి ఆలోచనే అవసరం లేదు. ఖర్మ గాలి నిద్ర వచ్చినా కలలో కూడా కష్టాలే ఎదురయ్యి భయ పెడతాయి. పీడకలలంటే అవే మరి!
కల వస్తుంది. భయమయినా మెలుకువవుతుంది. బాగున్నా మెలుకువవుతు౦ది. సాధారణంగా కల సాంతంగా జ్ఞాపకముండదు. ఏదో కొంత మాత్రమే చూచాయగా గుర్తొస్తుంది. మెలుకువయిన వెంటనే కల గురించి బాగా ఆలోచిస్తే బాగా గుర్తొస్తుందట. ఈలోపల మరే సంగతిమీదికి ధ్యాస పోయినా ఇక అక్కడికి కల అయిపోయినట్టే, కుక్కలగురించి ఒక విచిత్రమయిన సంగతి చెపుతారు. అదెంతవరకు నిజమో అసలు నిజమవునో కాదో కూడా తెలియదు. కుక్కకు ఫలానా ఇంట్లో లేదా ఫలానా చోట తినడానికేదో ఉందని కల వస్తుందట. అది లేచి చెవులు ఝాడించకుండా బయలుదేరిందంటే ఆ పూటకు కడుపు నిండినట్లే లెక్క. లేచిన తర్వాత చెవులు ఝాడిస్తే మాత్రం కలలో కనబడిన సంగతులన్నీ కడిగేసినట్లు మెదడులోంచి మాయమవుతాయంటారు. "వింటాడు. వెంటనే చెవులు ఝాడిస్తాడు" అనే మాట ఈ ధారణలోంచే పుట్టిందట. సైన్సులో కలల గురించి చాలా చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఈ చెవులు ఝాడించడం
గురించి మాత్రం ఎక్కడా చదివిన గుర్తు లేదు. ఎలకలు కలలు గంటాయని వాటికి కలల కారణంగా తెలివి పెరుగుతుందని ఈ మధ్యన ఒక పరిశోధకుడు వెల్లడించాడు. కొత్తగా నేర్చుకున్న సంగతులు కలలద్వారా మనసులో మననమయ్యి గట్టిగా గుర్తుండిపోతాయని మరొక సిద్ధాంతం వచ్చింది.
డిఎన్‌ఏ నిర్మాణాన్ని కనుగొన్న ప్రొఫెసర్‌ వాట్సన్ ఆ తర్వాత తన పరిశోధనలను కలల వేపు మళ్లించాడంటే మనిషి జీవితంలో కలలకు౦డే ప్రాముఖ్యం అర్థమవుతుంది. కల ఎంత కాలం కొనసాగు తుందన్నది మరో చిక్కుప్రశ్న. అది చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటుంది. ఆ కొద్దీ సేపట్లోనే చాలా కాలం గడిచిన భావాన్ని కలిగిస్తుందని చెపుతారు. కల కాలగమనంలో మనలను వెనుకకు తీసుకు పోతుంది. అప్పుడప్పుడు ముందుకు కూడా తీసుకు పోతుంది. ఆ పోయినచోట కథ ఎంతకాలం నడుస్తుందో ఎప్పుడయినా గమనించారా? నా మటుకు నాకు ఒకే రోజు కలలో కొన్ని సంవత్సరాలు గడిచిన అనుభవం కలుగలేదు.
ఒకరోజు ఒక సంఘటన మాత్రమే కలగా రావడం అలవాటు. లవణరాజు కల గురించి కథలు వచ్చాయి. ఆయన పేరుకే గాదు. నిజంగానే రాజు. భోగభాగ్యాలతో బతుకుతుంటాడు. ఒకనాడు ఆయన సభకు ఒక ఐంద్రజాలికుడు వస్తాడు. అతను
రాజుమీద మచ్చు జల్లుతాడు. ఆ దెబ్బతో రాజు కలగంటాడు. ఆ కలలో డెబ్బయి ఏళ్లు గడుస్తాయి. రాజుకు పిల్లలు పుడతారు. అతను బీదవాడవుతాడు. పిల్లలు తమకు వేడి మాంసం కావాలంటారు. రాజు అగ్ని ప్రవేశం చేస్తాడు. అప్పుడు కల ముగుస్తుంది. మెలుకువయిన తర్వాత తనకు క్షణాలలో అంతటి అనుభవమూ, ఆత్మవివేచనమూ కలిగించిన కలగురించి ఆలోచిస్తాడు.
జీవితం ముందుకే సాగుతుంది. కల మాత్రం అటూ ఇటూ ఎటయినా పోతుంది. కానీ ఈ నిడివి గురించిన సంగతి మాత్రం అంత సులభంగా తలకెక్కదు. ఒకే రకమయిన సంఘటన పదేపదే కలగా రావడమూ ఉంది. ఈ రకంగా మళ్లీ మళ్లీ వచ్చే కలల గురించి శాస్త్రవేత్తలు భాష్యాలు చెపుతుంటారు. అవి మనసులోతులలో నిలిచి భావాలకు ప్రతీకలుగా ఉంటాయంటారు. అసలు ఏ ఇబ్బందీ లేని కలలు కొన్ని ఉన్నాయి. అవి సినిమాలో హీరో హీరోయిన్‌లకు వచ్చేస్తుంటాయి. వాళ్లకు కల వచ్చిందంటే చాలు. అదంతా అచ్చమయిన సినిమా ఇంద్రలోకంలా ఉంటుంది. సినిమా జంటలకు మరోపని ఉండదు. ఘాటుగా ప్రేమించడం పాటలు పాడడంతప్ప. ఆ పాటలు మరీ అందంగా ఉండాలంటే వారు కలలు కనేస్తారు.
ఆ కలలలోకంలో కిందనుంచి పొగలొస్తుంటాయి. మిగతా లోకంలో పొగ గాలితో మీదకు కదిలితే ఈ సినిమా కల పొగ మాత్రం నేలబారుగానే పోతుంది. ఆ లోకంలో గాల్లో చెమ్కీలు ఎగురుతుంటాయి. బాల్కనీలో అట్ట చంద్రుడుంటాడు. వాళ్లు పున్నమి అని పాడుతున్నాసరే చందుడు మాత్రం పూర్తిగా ఉండడు. 

ఇటువంటి కలలు కనడం మేలా? కలాం గారు చెప్పిన కలలు కనడం మేలా?


కె.బి.గోపాలం




 

Friday, February 27, 2026

కుక్క - పిల్లి చైనా జానపద కథ


కుక్క - పిల్లి 

చైనా జానపద కథ


కుక్క - పిల్లి

అనగనగా ఒకప్ప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక భార్య కూడా ఉండేది. భార్యకు ఒక ఉంగరం ఉండేది. అది అదృష్టం ఉంగరం. అది ఎవరి దగ్గర ఉంటే వారికి కావలసినవి అన్నీ దొరుకుతాయి. అయితే ఆయనకు, ఆయన భార్యకు ఆ సంగతి తెలియదు. కనుక వాళ్లు ఆ ఉంగరాన్ని ఏదో అవసరానికి తక్కువ ధరకే అమ్మేశారు. ఉంగరం పోయింది. ఇక వాళ్లు రానురాను బీదవాళ్లు అయ్యారు. చివరకు పూటగడిచేది ఎలాగో తెలియని పరిస్థితి వచ్చింది.

ఆయన, ఆవిడల దగ్గర ఒక కుక్క, ఒక పిల్లి ఉండేవి. ఆయనకు, ఆవిడకే తిండిలేదు గనుక కుక్కకు, పిల్లికి కూడా ఆకలి తప్పలేదు. వాటికి ఉంగరం సంగతి తెలుసు. యజమానులకు అదృష్టాన్ని తిరిగి కలిగించడం గురించి అవి చాలాకాలం ఆలోచించాయి. అంత కాలము వాటి కడుపులు మండుతూనే ఉన్నాయి. కనుక మెదడు మాత్రం పదునెక్కింది.

చివరకు కుక్క ఒక ఆలోచన చెప్పింది. “ఏదో రకంగా ఉంగరాన్ని తిరిగి తేవాలి” అన్నది. పిల్లి సరేనన్నది. “ఆ ఉంగరంలో మహత్తు ఉందని నాకు నమ్మకం కలిగింది” అన్నది కుక్క. “నిజమేనేమో! అయితే ఆ ఉంగరాన్ని లీ ఫాన్‌కు అమ్మారు. దాన్ని ఆయన జాగ్రత్తగా పెట్టేలో పెట్టి తాళం వేశాడు. లీ ఫాన్ ఇల్లు పూలతోటకు ఆవల ఉంటుంది. అది బాగా పెద్దగా ఉంటుంది. గోడలు ఎత్తుగా ఉంటాయి. పెద్ద ఇనుపగేటు కూడా ఉంటుంది. లోపలికి వెళ్లడం ఎవరికీ కుదరదు” అన్నది పిల్లి.

అయితే ఒక ఉపాయం చెపుతాను. నీవు ఒక చుంచును పట్టాలి. దాన్ని ఇద్దరము కలిసి లీ ఫాన్ ఇంటికి తీసుకుపోదాము. అది గేటు కిందనుంచి దూరుతుంది. పెట్టెకు రంధ్రం వేస్తుంది. ఉంగరాన్ని వెతికి తెస్తుంది. చుంచు ఒప్ప్పుకోలేదనుకో, దాన్ని తినేస్తాను అని నీవు భయపెట్టాలి. చుంచుచేత ఈ పని చేయించాలి” అన్నది కుక్క.

పిల్లికి ఆలోచన నచ్చింది. అది త్వరలోనే ఒక చుంచును పట్టుకున్నది. అంతా కలిసి ఉంగరం ఉన్న పెట్టె ఉన్న ఇంటికి బయలుదేరారు. మధ్యలో ఒక నది ఉంది. మరి పిల్లికి ఈదడం చేతకాదు. కనుక అది కుక్క వీపుమీద ఎక్కింది. చుంచు దానితోబాటే ఉంది. కుక్క నది ఈది అందరినీ అవతలికి చేర్చింది. అప్పుడు పిల్లి చుంచుతోబాటు లీ ఫాన్ ఇంటికి చేరింది. అక్కడే ఉంగరంగల పెట్టె ఉంది మరి. చుంచు పెట్టెదాకా చేరింది. కొరికి కొరికి దానిలో రంధ్రం వేసింది. ఉంగరాన్ని వెతికి తెచ్చింది.

పిల్లి ఉంగరాన్ని తీసుకుని నోట్లో పెట్టుకున్నది. నది వద్దకు వచ్చింది. అక్కడ కుక్క ఎదురు చూస్తున్నది. పిల్లి దానిమీద ఎక్కింది. కుక్క నది ఈదింది. అవతలి గట్టుకు అంతా చేరుకున్నారు. ఇంటికి బయలుదేరారు. అదృష్టం ఉంగరాన్ని యజమానులయిన ఆయన, ఆవిడగారలకు ఇవ్వాలి.

కుక్కకు వీధుల వెంట తిరగడం మాత్రమే తెలుసు. కనుక నగరంలోని వీధులన్నీ దాటుతూ అది ఇంటికి నడక ప్రారంభించింది. పిల్లి మాత్రం ఇళ్ల పై కప్ప్పుల మీదకు ఎక్కుతుంది. పక్క ఇంటి మీదకు దూకుతుంది. అది నిజంగానే ఇళ్ల మీద దూకుతూ తొందరగా యజమానుల వద్దకు చేరింది. ఉంగరాన్ని ఆయన, ఆవిడగారలకు ఇచ్చింది.

అప్ప్పుడు ఆయన తన ఆవిడతో “మన పిల్లి మహామంచిది. మనకు మంచి చేసింది. కనుక మనం దానికి మంచి తిండి పెడదాము. స్వంత బిడ్డలాగ చూచుకుందాము” అన్నాడు.

కుక్క కొంతసేపటికి ఇల్లు చేరగలిగింది. వాళ్లు దాన్ని కొట్టారు. అరిచి తిట్టారు. ఉంగరం తేవడంలో అది సాయం చేయలేదని యజమానుల కోపం. పిల్లి మాత్రం చప్ప్పుడు చేయకుండా వెచ్చని పొయ్యిలో పడుకున్నది. అక్కడినుండే గుర్రుగుర్రు మన్నది. నిజం మాత్రం చెప్పలేదు. చెపితే తనకు అందే బహుమానం కుక్కకు కూడా అందుతుందని అనుమానం. ఇక తనకు నిజంగా రావలసిన బహుమానాన్ని పిల్లి దోచుకున్నది, కనుక కుక్కకు తెగ కోపం వచ్చింది. పిల్లి కనబడితే చాలు అది వెంటపడి తరమడం మొదలుపెట్టింది.

ఇవాళటికీ కుక్కలు, పిల్లులను తరుముతూనే ఉన్నాయి.


 

Thursday, February 26, 2026

ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో గురించి నా వ్యాసం 2వ భాగం


ఉర్దూ రచయిత సాదత్  హసన్  మంటో 

గురించి నా వ్యాసం 2వ భాగం


2

ఇస్మత్ చుగ్తాయి లాగే మంటో కూడా సంచలనాలకు కారణమయి కోర్టు దాకా వెళ్లాడు. అయినా, ఇద్దరిదీ ఒకటే పద్ధతి. నిజాన్ని ఉన్నది ఉన్నట్టు ఎత్తి చూపడం మా ధర్మం అంటారు ఇద్దరు.

            మంటో బతుకుకూడా అదుపులేకుండానే జరిగింది. అతను తెగ తాగేవాడంటారు. ఒక వ్యాసంలో అతనే రోజుకు  ఒక సీసా మాత్రమే తాగానని రాసుకున్నాడు. ఒక కథలో మాత్రం ఒకేనాడు పదిహేను కాయలు లాగించినట్టు కూడా రాస్తాడు. బతుకు, రచనలు అతడిని భయపెట్టిన జాడలు కనిపించవు. ‘అవలక్షణాలు, అనారోగ్యాలు, అపభ్రంశాలు అన్నీ  కలగలసి ఉన్న నా పాత్రలను నేను నావిగా అంగీకరిస్తున్నాను’ అంటాడు మంటో. అతను 42 సంవత్సరాల వయసులోనే  వెళిపోయాడు. అయినా, ఇవాళటి వరకూ అందరినీ తన గురించి ఆలోచించే రకంగా రచనలను వదిలి వెళ్లాడు. చదువుకున్నది అంతంతే అయినా, ఇంగ్లీష్ మీద వల్లమాలిన అభిమానం చూపించాడు. ఫ్రెంచ్, రష్యన్ సాహిత్యాన్ని కూడా అంత అభిమానంగానూ చదివాడు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోతే, రైల్వే స్టేషన్‌లో బుక్‌స్టాల్ నుంచి పుస్తకాలను దొంగిలించాడు కూడా! విక్టర్ హ్యూగో, ఆస్కార్ వైల్డ్, ఆంటన్ చెహోవ్ రచనలను అనువదించాడు కూడా. ఆ తరువాత అతనికి వాళ్లలాగ తాను కూడా రాయవచ్చును అనిపించినట్టు ఉంది. ఇక ఆగకుండా 24 సంవత్సరాలపాటు 22 కథా సంకలనాలు, 5 రేడియో నాటకాల సంకలనాలు, 3 వ్యాస సంకలనాలు ప్రచురించాడు. బొమ్మలు కూడా గీశాడు. ఒక నవల రాశాడు. ఏడు, ఎనిమిది సినిమాలకు కథ, మాటలు రాశాడు. అంత తక్కువ కాలంలో అన్ని రచనలు చేశాడంటే,  అతనికి అడుగడుగునా కథావస్తువు కనిపించి ఉంటుంది. సమాజంలో అంతటా కుళ్లు ఉండనే ఉన్నది. దాన్ని గురించి అంత విస్తృతంగానూ, వివరంగానూ రాయగలగడం అసలు గొప్ప! ఆ పని చేశాడు గనుకనే, మంటో రచనలను వదలకుండా  చదువుతున్నారు. వాటి గురించి చర్చిస్తున్నారు.

            ఉర్దూ కథా సాహిత్యంలో సాదత్ హసన్ మంటో స్థానం గురించి వర్ణించడం సులభం కాదు. మంటోతో సమానంగా ప్రభావం చూపిన రచయితలు మరెవరూ కనిపించరు. సాహిత్యంలో అతని తిరుగుబాటు పద్ధతి మరెవరికీ చేతకాలేదు.  అతను రాసిన భాష, అతని పేరు తప్ప అతడిని ఒక మతానికి పరిమితం చేయడానికి ఆధారాలు కనిపించవు. నిజానికి ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదు. అది సైనికుల అవసరాలకోసం పుట్టిన ఆధునిక భాష. అందులో అభివ్యక్తి అందుకే సులభంగా వీలయింది! ఆ భాషను వాడుకుని మంటో అన్ని మతాలలోని నమ్మకాలను కడిగే ప్రయత్నం చేశాడు.  అతనికి మతమంటూ ఉంటే అది మానవత్వం మాత్రమే. బడుగు మనుషులు అతనికి దగ్గరివాళ్లు. బాధలు అతను ఎత్తి చూపిన సత్యాలు. మంటో దేశ విభజనను ఒక మతం దృష్టి నుంచి చూడలేదు. ఒక భాష దృష్టి నుంచి అంతకన్నా చూడ లేదు. కేవలం విభజనను ఒక బాధాకర సంఘటనగా మాత్రమే చిత్రించాడు. అప్పుడు జరిగిన దుండగాలు, రక్తపాతాలు,  మానభంగాలు, నగరాల నాశనాలు, అతడిని భూకంపంలా కదిలించాయి. అదే కాలంలో అప్పటి పరిస్థితులను గురించి  కిషన్ చందర్, రాజిందర్ సింగ్ బేదీ, అహ్మద్ నదీమ్ ఖాస్మీ, ఇస్మత్ చుగ్తాయి లాంటివాళ్లు చాలా రచనలు చేశారు. అయినా, అప్పటి పరిస్థితులు మంటో రచనలలో కనిపించినంత స్ఫుటంగా మరెవరి రచనల్లోనూ రాలేదు. మతం పేరిట  మనుషులను విడదీయడం మంటోకు నచ్చలేదు. సంస్కృతిని, నాగరికతను, కళలను, మాట, ఆట, పాటలను పంచుకోవడం కుదరదన్నది అతని వాదన. ఆ విషయాలనే తన పద్ధతిలో చెప్పాడు. ‘టోబా టేక్‌సింగ్’ అన్న కథను ఇవాళటి వరకు ప్రపంచం మరవలేకపోతున్నది.

            మంటో కథలన్నీ ఇంటర్‌నెట్‌లో దొరకుతున్నాయంటే, అతని ప్రభావం గురించి, అది నేటి వరకూ కొనసాగుతున్న తీరు గురించి అర్థమవుతుంది. మంటో మాత్రం ఈ ప్రభావాలను గురించి ఆలోచించనే లేదు. తాను నమ్మిన విషయం గురించి దేవునితోనయినా తలపడేందుకు సిద్ధమేనన్నాడు. ‘లక్షమంది ముస్లింలు, లక్షమంది హిందువులు ఆ సమయంలో హతులయ్యారు అనకండి. రెండు లక్షలమంది మానవులు పోయారు అనండి’ అంటాడు అతను ఒకచోట. దేశం విడిపోయి నప్పుడు అంతమంది చావవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. అందునా, ఏ సంబంధమూ లేని అమాయకులు చావడం అంతకన్నా అర్థంకాదు. ఒక మతం వారిని చంపిన మరొక మతం వారు, ఆ మతాన్నే చంపిన భావంతో సంబరం చేసుకున్నారేమో! కానీ, మతాన్ని తుపాకులతో చంపడం వీలయ్యే పనికాదు అని కూడా మంటో అంటాడు.

            మంటో మాటలు సూటిగా ఉంటాయి. అక్కడ తెరలు, పొరలకు చోటు లేదు. చెప్పవలసిన మాట చెప్పవలసిన బలంతో చెప్పడమే అతని రచనలలోని బలం! ఉదాహరణగా చెప్పడానికి లెక్కలేనని కథలు ఉన్నాయి. ఆ కథల గురించి  ఎంత చర్చ జరిగినా తక్కువే. ‘దేఖ్ కబీరా రోయా’ (చూచి, కబీర్ ఏడ్చాడు) అన్న కథ నభూతో నభవిష్యతి. కథలో కబీర్ లక్ష్మి విగ్రహాన్ని చూచి ఏడుస్తాడు. కాలే కడుపులతో కూడా సైనికులు ఆజ్ఞలను పాటించవలసి వచ్చింది, అని కూడా ఏడుస్తాడు.

            అతని కథలు అప్పట్లో చాలామందికి అర్థం కాలేదన్న అనుమానం పుడుతుంది. ప్రభుత్వంవారు మాత్రం బూతులు అంటూ ప్రతిబంధకాలు వేశారు. అటు రచయితకు, ఇటు పాఠకునికి అనవసరంగా కాలయాపన అన్నారు. కోర్టు కేసులు  చాలాకాలం నడిచాయి. ఇస్మత్ కూడా లాహోర్ వెళ్లి మంటోతోబాటు అక్కడే తన కేసు గెలిచింది. మంటోకు పెద్ద జుర్మానా వేశారు. జుర్మ్ అంటే నేరం. నేను నేరం చేయలేదంటూ మంటో మళ్లీ కోర్టుకెక్కాడు. ఆ కేసు నిర్ణయించవలసిన  జడ్జ్ మంటో మతానికి చెందినవాడే. సముద్రంగా చేరిన రక్తంలో నుంచి పశ్చాత్తాపం అనే ముత్యాలు కనీసం బయటికి రావాలన్నాడు మంటో. ఆ మాట ప్రజలకు పట్టలేదు. మొత్తానికి జడ్జ్ కేసును కొట్టివేశాడు. లేకుంటే, ఒక గడ్డం వాడు నాకు  శిక్ష వేశాడని మంటో ఒక కథ రాస్తాడు అంటూ, ఆ జడ్జ్ చమత్కరించాడు.

            1955లో మంటో మరణించాడు. అంతకు కొంతకాలం ముందే అతను ‘పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్లు తనను మెచ్చి  తన శవపేటిక మీద ఒక మెడల్ పెడతారంటూ, అది తనకు అవమానంగా నిలుస్తుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. నిజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం అంతపనీ చేసింది! మంటో శతజయంతి సంవత్సరంలో అతనికి ‘నిషాన్``ఇమ్‌తియాజ్’  అనే బిరుదుతో పతకాన్ని ఇవ్వనే ఇచ్చింది.         మంటో భారతీయుడు కాడంటే అన్యాయం. అతను పాకిస్తానీ అన్నా అన్యాయమే. మంటోకు ఒక దేశం లేదు. ఒక మతం లేదు. మానవత్వమే అతని మతం. మంచి అన్నదే అతని తీరు.

            ఈ ప్రపంచంనిండా సమస్యలు మాత్రమే కాదు, కుళ్లు నిండుకుని ఉన్నది. దాన్ని ఎత్తి చూపించకుంటే, అది ఎవరికి పట్టకుండా కొనసాగుతుంది. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా, ఎవరూ దాన్ని గురించి మాట్లాడరు. రచనలు అంతకన్నా చేయరు. ఏవో మంచి మాటలతో కాలక్షేపం చేస్తారు. వివాదాలను సృష్టించి, సమాజాన్ని నిద్ర నుంచి మేల్కొల్పాలి, అనుకునే రచయితలు అరుదుగా మాత్రమే కనపడతారు. అక్కడక్కడ కొందరు రచయితలు ధైర్యం చేసినా, విషయాన్ని  కొన్ని సమస్యలకే పరిమితం చేస్తారు. సమాజంలో అట్టడుగువర్గాలుగా ఉన్న పనివాళ్లు, సానివాళ్లు, దురలవాట్లకు లోనయి కుళ్లుతున్నవాళ్లు కథా వస్తువులుగా కనిపించడం అరుదే! యమకూపం అనే పేరుతో తెలుగులో వచ్చిన రష్యన్ నవల ‘యామా`ద పిట్’ వంటి రచనలకు మన సాహిత్యంలో చోటు ఉందా? సాదత్ హసన్ మంటో కథలలో కొన్నింటిని గురించి చర్చించే ధైర్యం మనకు మిగలి ఉందా? మంటో రచనలలో అందమయిన మనుషులకు చోటు లేదు. కథ ఎంత అందంగా నడిచినా, అందులో విషయం ఆనందకరంగా మాత్రం ఉండదు. మంటో రచనలలో సెక్స్ మరీ బాహాటంగా కనిపిస్తుంది. ఆడవాళ్ల వర్ణనలు కూడా కనిపిస్తాయి. కానీ, చదవరికి అవి గిలిగింతలు పెట్టవుకాక పెట్టవు. పైగా, అసహ్యం కలిగిస్తాయి! ఆలోచనలేని పాఠకునికి మంటో వెకిలి రచయితగా కనిపించవచ్చు. కానీ, మంటో మనసులోని బాధ అందితే మాత్రం, ఆ తరువాత కొంత కాలం అది దెయ్యంలా వెంటాడుతుంది.             మంటో గొప్ప కథలు తెలుగులో సంకలనాలుగా వచ్చినట్టున్నాయి. రాకుంటే మాత్రం ఆ దిశగా ప్రయత్నం జరగాలి. ఆయన రచనల్లో అందరూ చదివి తీరవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి మీద గట్టి చర్చలు జరగాలి. ఆ లోగా మంటో తీరు గురించి పరిచయం చేసుకోవడం సాహిత్యాభిమానుల, మానవతావాదుల కనీస కర్తవ్యం.