Sunday, June 7, 2026

లోకాభిరామం : తోలుబొమ్మలాట

 


లోకాభిరామం : తోలుబొమ్మలాట


తోలుబొమ్మలాట
మా ఊరు పాలమూరు అనే మహబూబ్‌ నగరానికి దగ్గరగ ఉన్నది. కనుక మా దగ్గర పోరగాండ్లకంత సీన్మ చూడడం బాగ అలవాటు. సీన్మకు వోదమా అన్నది ప్రశ్న అయితే నాతానైతే దుడ్లులేవు. ఇయాల నీవు వెట్టు. మల్ల వొయినప్పుడు నేను వెడుత, అంటూ సాగేవి. అయినా ఆ సినిమాలు అందరికీ అర్ధ్థమవుతయి కనుకనా. లవకుశ లేదంటే ఓ మైరావణ వంటి సినిమా వస్తే అందరికీ అర్థమవుతుంది. రాము అని ఒక సీన్మ వచ్చింది. అందులో ఒక తండ్రి, తల్లిలేని పిల్లగాణ్ణి పెంచునేందుకు నానా యాతన వడతడు. ఎద్దులబండ్లు కట్టుకుని వల్లెలనుంచి కూడ మనుషులు వచ్చి ఆ సినిమాను చూసి చేతనైనంత ఏడ్చి ఎళ్లిపొయినరు. అంతేగాని మరేవో పిచ్చి సీన్మలు వస్తే అవి అర్ధం అయి చావవు గద!
కనుకనే వల్లెలో చిరుతల రామాయణం అంటాని ప్రతిరాత్రి కాలక్షేపం కొంతకాలం గడిచింది. బైండ్ల కథలు, జముకుల కథలు లాంటి వినోద కార్యక్రమాలు గూడ పల్లెలో వుష్కలంగ ఉండేటివి. ఇక ఏనుగొండ అనే మా వల్లెకు మరింత ప్రత్యేకత ఉంది. బోగమాట అనే వీధినాటకం మాపల్లెలో బాగ పెరిగింది. కేశవయ్యగారు అనే ఒక పెద్దమనిషి వీధి నాటకాలు రాసేవాడు. వాటికి వరుసలు కట్టేవాడు. అవసరమైన దుస్తులు కుట్టేవాడు. కిరీటాలు, భుజకీర్తులు తయారు చేసేవాడు. ఈ రకంగా ఆయన ఒకే మనిషి అన్ని కళలకు కేంద్రంగా ఉండి, ఊళ్లో పిల్లలను, పిల్లలేనేమి పెద్దలను గూడ చేరదీసి బోగమాట నేర్పించెటోడు. మూడున్నర వజ్రం అని ఒగ ఆట ఉండేది. దాని అస్సలు పేరు కృష్ణగారడీ. అటువంటి ఆట నుంచి మొదలు మా ఊర్లె గూడ లవకుశ ఆడేవాండ్లు. బబ్రువాహన ఆడేవాండ్లు. ఎన్నెన్నో కథలు ఆడేవాండ్లు. పండుగ లేక ఎవరన్న పెద్దఇంట్లో పెండ్లిగాని వచ్చిందంటే ఊళ్లో కేంద్రంలో బోగమాట ఏర్పాటు అవుతుంది. దానికి కావలసిన ఖర్చును ఎవరో ఒకరు భరిస్తరు. ఫలానివాండ్లు ఆట చెప్పినరు అని ఊరంతా పాకి పోయేది. ఇక రాత్రంతా కూసోని ఆట చూచేందుకు అందరు సిద్ధం.
ఇది ఇట్లుండంగ చిన్నప్పుడు నేను అప్పుడో ఇప్పుడో తోలుబొమ్మలాట చూసిన గుర్తు. ఈ తోలుబొమ్మలాట వాండ్లు
స్థానికులు కాదు. రాయలసీమ నుంచి వస్తరని తరువాత తరువాత తెలిసింది. ఈ ఆటకు పెద్ద గుడారం అవసరం లేదు.
ఆడేవాళ్లు మాత్రం గుడ్డలతోటి తడుకలతోటి ఒక గది వంటిది కడతరు. దానికి ఒక వైపున బట్టతో తెర ఏర్పాటు చేస్తరు.
ఆ లోపల కళాకారులు ఉంటరు. వాళ్ల దగ్గర ఇంచుమించు మనిషి ఉండేటంత ఆకారంలో ఉండే బొమ్మలుంటయి. ఆ బొమ్మలను కర్రల సాయంతోని తెరమీద అదిమివట్టుకుని వెనకనుంచి పడే ఎలుతురులో ఆ బొమ్మలు తెర మీద కనిపించేటు చేసి ఆట సాగించేవాండ్లు. చక్కగ పాటలు డైలాగులు గూడ ఉంటయి. తోలుబొమ్మలాటలో భారతం కన్న రామాయణం ఎక్కువ చూసినట్లు గుర్తు ఉంది. హనుమంతుడు వస్తడు. దశకంఠుడు వస్తడు. అతని ముందు ఆంజనేయుడు తోక చుట్టుకోని అల్లంత ఎత్తున ఎక్కి కూర్చుంటాడు. రావణునికి పది తలలు ఉంటయి. తెరమీద సగం వెడల్పు అతనే కనిపిస్తడు. అంత ఎత్తు కూడా ఉంటడు. వెనుక వాండ్లు పాటలు పాడుకుంటు కింద పెట్టిన సానరాళ్ళ మీద కాలితోటి దరువులు ఏసుకుంటు చక్కగ కథను రక్తి కట్టించేవాండ్లు. హనుమంతుడు ఏసిన కుప్పిగంతులు వాళ్లు తెర మీద చూపించిన తీరు ఏంతో ప్రత్యేకంగ ఉండేది. నాకు నిజానికి వాళ్లు పాడిన పాటలు జ్ఞాపకం లేవు. అయితే తోలుబొమ్మలాట లోని ఒక అంశం మాత్రం గట్టిగ గుర్తు ఉన్నది.
హాస్యం పేరిట తోలుబొమ్మలాటలో మధ్యన అత్త, పిల్లోడు అని రెండు పాత్రలు వస్తయి. పిల్లోడు అనే అల్లుని చేత అత్త పని
చేయించాలంటని ప్రయత్నిస్తుంది. గడ్డి తీసుకు రమ్మంటది. తిండి ఆశ పెడుతది. తాటి బెల్లం, తమిద రొట్టెలు పెడత
అయ్య పోరా గడ్డికి, మా అయ్య పోరా గడ్డికి అంటుంది. వాడు ఆమెకు అయ్య కాదు. వాని ద్వారా నాటకంలో బండ బూతులు
పలికించేవాండ్లు. ఆ కాలంలో హాస్యం అంటే బూతు లేకుండ గడిచేది కాదేమో. మూడు రొట్టెలు ముడ్డికి, నా మొ.... పోత
గడ్డికి, అంటూ వాడు పాడతడు. ఇక చూడవచ్చిన వాళ్ళ ఆనందానికి అంతు ఉండదు. నాకు కూడా ఈ ఒక్క పాట జ్ఞాపకం. అంతటితో ఆగకుండా పిల్లోని పాత్రకు పొడుగాటి బెల్లకాయ కూడ ఉన్నట్టు చూపించేవారు. అప్పట్లో అది బూతుగా
అనిపించలేదేమో? నాకు ఇవ్వాళటికి ఆ నంగతి అర్థం గాదు.
ఈ మధ్యన ఎక్కడ తోలుబొమ్మలాట వాండ్లు కనిపిస్తున్న జాడ లేదు. సురభి వాండ్ల నాటకం కంపని హైదరాబాద్‌ కు చేరింది గాని రాయలసీమలోనే ఉన్న తోలుబొమ్మల వాండ్లు మాత్రం పట్నం చేరినట్టు లేదు. అక్కడనో ఇక్కడనో తోలుబొమ్మలాట పద్ధతిలోనే మరేమో వస్తువులను తయారు చేసి అమ్ముతున్నట్టు కనిపించింది. చిన్న చిన్న బొమ్మలు కూడా అమ్మకానికి కనిపించినయి. మొత్తం నాటకం జరగాలంటే పెద్ద జట్టు ఉండాలె గద? అది బహుశా వీలవుతున్నట్టు లేదు.
నిజానికి తోలు బొమ్మలు తయారు చేయాలంటే, అదొక పెద్ద తతంగం. దాని గురించి ఎక్కడనో చదివే అవకాశం కూడా దొరికింది. చాలాకాలంపాటు బొమ్మల కోస్రం జింక చర్చం వాడేవాండ్లట. జింకలను వేటాడడం ఇప్పుడు కుదరదు. అసలు అవి ఉన్నాయో లేదో గూడ తెలువదు. కనుక ఆ మధ్యన బొమ్మల కోస్రం మేక చర్మాన్ని వాడడం మొదలయిందట.
పెద్ద సైజు బొమ్మలను తయారు చేయాలంటే ఒక మేక చర్మం సరిపోదు. రావణానురుని బొమ్మకు మూడు మేకల చర్మం అవుసరం అవుతుందట. అందుట్లో ఒక మేక పది తలకాయలకు పోతే, ఒకటి కాళ్లకు పోతే, మరొకటి శరీరానికి సరిపోతుంది. ముందు ఆ చర్చాన్ని పారదర్శకంగ వచ్చేట్టు తయారు చేయాలె. ఆ తరువాత దానిమీద బొమ్మ ఆకారం కత్తిరించాలె. దుస్తుల ప్రకారం బొమ్మ గీసి అందుట్లోనుంచి వెలుగు బయటకు కనిపించేటట్టు రంధ్రాలు వేయాలె. ఆ రంధ్రాల వెంట గీతలు గీసి రంగులు వూయాలె. నిజంగనే పాత కాలంలో రంగులు కూడా వాండ్లే తయారు చేసుకునేవారు. ఉదాహరణకు మోదుగు వువ్వులనుంచి అవసరమైన పనువు, ఎరుపు రంగును తయారు చేసే వాండ్లట. ఇప్పుడు అదంతా కుదిరే పరిస్థితి కాదు. కనుక రసాయనం రంగులను వాడక తప్పదు.
అసలు ముందు చర్మాన్ని బొమ్మలకు అనుగుణంగ పారదర్శకంగ తయారు చేయడమే పెద్ద కళ. దాన్ని బొమ్మలు ఆడించే వాండ్లే చేసుకుంటరు అంటే అంతకంటే ఆశ్చర్యం లేదు. కనుకనే ఈ కళ రానురాను మరుగున వడుతున్నది. కొన్ని బొమ్మలు కేవలం నలుపు తెలుపు రంగులో ఉండడం కూడా నేను చూసిన. అటువంటి బొమ్మలు ఆడించినవుడు అంత ఆకర్షణీయంగా ౦డవేమో.
నేను ఆ మధ్యన కాకిపడిగెలు అనే ఇంకో రకం బొమ్మలాట చూసిన. ఇందులో తెర, దీవం నీడలు మరో రకంగా ఉంటయి.
కథ పటాల వలే చిత్రించి ఉంటుంది. దీవం వట్టుకొని పటాలముందు బొమ్మలు చూపిస్తూ కథలు చెబుతంటరు.
జానపద కళలు మరుగున పడుతున్నయి. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాస్త్రీయ సంగీతం లాంటివి కూడ కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నయి. అందరికీ అందుబాటులో ఉన్నయి అనుకున్న పనులు కూడా లేకుండ పోతే ఇక చివరికి మిగిలేది ఏమిలేదు. ఆ సినిమా ఎవరికి కావాలె? చాలామందికే గావాలె. వాండ్లుకు మరి పాతకాలపు కళల
గురించి తెలియదు.
బైండ్ల కథలు, జముకుల కథలు, బుర్రకథ మొదలైనవి ఆయా పద్ధతులను వృత్తిగా చెప్పేవాండ్లు మాత్రమే నేర్చుకుని మిగతా
వారికి అందిస్తారు. ఔత్సాహికులు వీటిని నేర్చుకోని అందరిముందు ప్రదర్శించడం కుదిరేదికాదు. చుక్క సత్తయ్య లాంటివారు
ఒకతను అందరికీ నేర్పించే ప్రయత్నం చేసినట్టు ఉన్నరు. మిగతావాటి గురించి ఈ రకమైన ప్రయత్నాలు కనిపించవు.
కానీ మా చిన్నతనంలో మా ఊరికి ఒక పంతులు వచ్చి ఉండిపోయినడు. అతను పల్లెలోని యువకులందరినీ ఒక చోటచేర్చి చిరుతల రామాయణం అనే ఒక పద్ధతి జానపద ప్రదర్శనను నేర్పించినడు. అందులో సుమారు 50 మంది పాత్రధారులు. రామాయణం కథ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పాడినట్టు గుర్తుంది. ప్రదర్శన వారం రోజులపాటు సాగినట్టు గుర్తుంది. యువకులందరూ ఒకటికి రెండు పాత్రలు నేర్చుకుని రోజు రోజుంతా ఆ పాటలను కూనిరాగాలుగా తీయడము నాకు ఇవ్వాళటికి గుర్తుంది. మొత్తానికి చిరుతల రామాయణం ప్రదర్శన చాలా బాగ జరిగింది. దీనికి ఒక వేదిక అంటని లేదు. కళాకారులు చుట్టూ గుండ్రంగా నిలబడతరు. చేతులలో చిరుతలు అనే వాయిద్యాన్ని వట్టుకోని దానితో లయబద్ధంగా వాయిస్తూ పాటలు పాడుతుంటరు. ఆ సందర్భంలో కథ జరుగుతున్న పాత్రలు మధ్యలోకి వచ్చి తమతమ సంభాషణలను వినిపించినట్టు గుర్తున్నది.
కళాప్రదర్శనలలో ఈ రకంగా పాల్గొన్న యువత నిజంగ గొప్ప ప్రేరణ పొందిన భావం నాకు మిగిలి ఉంది. ఇప్పుడు పల్లెల్లో
ఎవరికైనా ఇటువంటి పనులు గుర్తున్నయా? అడగడానికి నేనెవరిని? నేను కనీసం చూడడానికి కూడా పల్లెకు పోవడం లేదు. పల్లె పట్టణానికి వచ్చే అవకాశం లేనే లేదు. ఆ మధ్యన ఆయనెవరో ఒక 12 తీగల వాయిద్యం వాయిస్తడని పాలమూరు నుంచి వచ్చినడు. అతని గురించి ఫేస్బుక్ లో ట్విట్టర్‌ లో దుమారం రేగింది. అంతేగాని అతని ప్రదర్శన వలుచోట్ల పెట్టి చూసినవాళ్లు ఎంత మందో నాకు తెలియదు.
కథలు మారిపోతున్నయి. కళలు మారిపోతున్నయి. కాలాలు మారిపోతున్నయి. పాత పద్ధతులు ఎవరికి వట్టవు. అవి పరిశోధన పుస్తకాలలో మాత్రమే మిగిలి పోతయేమో. జానపద నంగీతం పరిస్థితి కూడ ఇంచుమించు అట్లగే ఉంది. ఈ మధ్యన జానపద శైలిలో వచ్చే సంగీతాన్ని జానపదం అనుకుని అందరూ ఆనందంగ వింటున్నరు. అసలు జానపదుల పాటలు ఏమయ్యినయి అర్ధం గాదు. ఆ సంగతి చెప్పినా ఎవరికీ వట్టదు. నేనిక్కడ ఒక విషయం గురించి ఏడవాలని ప్రయత్నించడం లేదు. గుర్తుకు వచ్చిన కొన్ని అంశాలు ఎక్కడైనా మిగిలి ఉన్నయేమో తెలుసుకుందం అని ఒకటే నా ఆశ.




Thursday, June 4, 2026

Moula Sahib Interview in Telugu

 


Moula Sahib Interview in Telugu


We Heard his Nadaswaram so much!
Now listen to his words!
He speaks of Artists, art, Nadaswaram, Technique and many things!



Wednesday, June 3, 2026

Tuesday, June 2, 2026

గలోష్ - మిఖయిల్ మిఖయిలోవిచ్ జోషెంకో కథ (రష్యా)


గలోష్ 

మిఖయిల్  మిఖయిలోవిచ్ జోషెంకో రచన 1927   (రష్యా)

గలోష్

మియిల్ మిఖయిలోవిచ్ జోషెంకో

 

(గలోష్ అంటే చలి దేశాలలో బూట్లమీదుగా వేసుకునే ఒక ప్లాస్టిక్ తొడుగు)

 

అది నిజంగానే సులభం, ట్రామ్‌లో ఒక గలోష్‌ను పోగొట్టుకోవడం గురించి చెపుతున్నాను.
ముఖ్యంగా నీవొకవేపును పిండేస్తూ ఉంటే ఇక మరొక దుర్మార్గుడు వెనకనుంచి నీ కాలును తొక్కేస్తూ ఉంటే మరీను. ఒక్కసారిగా ` గలోష్ మాయం.
గలోష్‌ను పోగొట్టుకోవడం అంటే కేవలం చాలా సింపుల్.
నా గలోష్ ఊరికే ఊడి వచ్చింది. రెప్పపాటు, అంటే కంటిరెప్పపాటులోగా అని, మీరు అనవచ్చు.
నేను ట్రామ్‌లోకి ఎక్కానా ` రెండు గలోష్‌లు ఉన్నాయి. వాటిని ఇంకా నేను చూడగలను. ఎక్కుతూ ` స్థిరం చేసుకోవడానికి అన్నట్టు నేను వాటిని ముట్టుకున్నాను కూడా.
అయినాసరే, నేను దిగే సమయానికి ` ఒకే గలోష్, కనబడుతూనే ఉంది, ఒక కాలిమీద ఉంది, కానీ మిగతా గలోష్ పోయంది. నా బూటు అక్కడే ఉంది. ఇక సాక్‌ను కూడా చూడగలుగుతున్నాను. ఇక నా లాగూ కూడా తన చోట్లోనే ఉంది. కానీ గలోష్ లేదు.
ఇక ట్రామ్‌వెంట పరుగెత్తడం, వీలుకాదుగా.
మిగిలిన గలోష్‌ను తీసేశాను, దాన్ని న్యూస్‌పేపర్‌లో చుట్టాను ` ఇక నా దారిన వెళ్లిపోయాను. ‘పని ముగిసిన తరువాత కొంచెం పట్టించుకుంటాను’ అనుకున్నాను. ‘దాన్ని అంత సులభంగా వదిలివేయజాలను. అది ఎక్కడున్నా సరే, వెదికి పట్టుకోవాల్సిందే’.
పని ముగిసిన వెంటనే, ప్రారంభించాను. నాకు తెలిసిన ఒకానొక ట్రామ్ డ్రైవర్‌తో మొట్టమొదట మాట్లాడాను.
అతను నా నమ్మకాన్ని మరింత గట్టి చేశాడు.
నిన్ను నీవు అదృష్టవంతుడిగా లెక్కపెట్టుకో. నీవు దాన్ని ట్రామ్‌లో పోగొట్టుకున్నావ్. మరేదయినా చోటనయితే ఇంత గట్టిగా చెప్పగలిగేవాడిని కాదు. కానీ, ట్రామ్‌లో మాత్రం నీ గలోష్ ఇప్పటికే దొరికినట్టు లెక్క! మాకు పోగొట్టుకుపోయిన వస్తువుల గురించి ఒక ప్రత్యేకమయిన ఆఫీసు ఉంది, తెలుసా కేవలం అక్కడికి వెళ్లు, తెచ్చేసుకో. అది దొరికినట్టే’ అతను అన్నాడు.
సరే, థాంక్యూ, నా మెదడులోనుంచి బరువు దిగిపోయింది. గలోష్ నిజానికి కొత్తది తెలుసా. దాన్ని ఓ రెండు సంవత్సరాలుగా మాత్రమే వేసుకుంటున్నాను’ నేనన్నాను.
మరుసటి నాడు నేను ఆ ఆఫీసుకు వెళ్లాను. ‘అన్నలారా, నా గలోష్ నాకు తిరిగి దొరికే అవకాశం ఏమయినా ఉందా? అది ట్రామ్‌లో నానుంచి దూరమయింది’ అడిగాను.
తప్పకుండా, ఏ రకం గలోష్ అది?’ వాళ్లు అడిగారు.
ఒక మామÖలురకం గలోష్. సైజు పన్నెండు’ నేను చెప్పాను.
మా దగ్గర పన్నెండువేలు, పన్నెండు సైజువి ఉన్నాయని మా వాళ్లన్నారు. గుర్తించడానికి వీలుగా ఏదయినా చెప్ప్పు.’
దాన్ని గుర్తించడానికి లక్షణాలు చాలా మామÖలు రకం. మడమ దగ్గర కొంచెం మురికి పట్టింది. ఇక లోపల లైనింగ్ లేదు. లైనింగ్ అరిగిపోయింది.
మా దగ్గర, అటువంటి గలోష్‌లు వెయ్యి ఉన్నాయని, మా వాళ్లంటున్నారు. గుర్తించడానికి ప్రత్యేకంగా ఏమయినా సమాచారం ఉందా?’
ఉన్నాయి, ప్రత్యేకమయిన లక్షణాలు. వేళ్ల దగ్గర ఇంచుమించు చిరిగి ఉంది ` అది వేలాడుతున్నట్టు ఉంది. ఇక మడమ ఉండీలేనట్టు ఉంది. అడి బాగా అరిగిపోయింది. కానీ సైడ్స్ మాత్రం మరీ అంత పాడవలేదు. అవి ఇంకా ఒక్క ముక్కగానే ఉన్నాయి’ నేనన్నాను.
కాసేపు కూచో, వెంటనే వెళ్లి చూస్తాం’ వాళ్లన్నారు.
కొంచెంసేపయినా కాకముందే వారు నా గలోష్‌తో వెనక్కు వచ్చేశారు. నాకు పట్టరాని సంతోషం అయ్యింది. మరీ కదిలిపోయాను. ‘అవును, వీళ్ల పద్ధతులు చాలా బాగా పని చేస్తున్నాయి. ఎంత మర్యాదగల మనుషులు వీళ్లు’ అనుకున్నాను. ‘ఒక్క గలోష్ కొరకు ఇంత కష్టపడుతున్నారు’ అనుకున్నాను.
అంతులేని థాంక్స్, నేను బతికి ఉన్నంతకాలం’ నేనన్నాను. ‘దయచేసి నాకిచ్చేసేయండి, వెంటనే కాలికి వేసుకుంటాను. నిజంగా ధన్యవాదాలు’
లేదు, డియర్ కామ్రేడ్,’ వాళ్లన్నారు. ‘అంత సులభంగా కుదరదు. మాకు ఎలా తెలియాలి’ వాళ్లన్నారు కదా. ‘ఇది నీవు పోగొట్టుకున్నదే అని’
అది తప్పకుండా నాదే.  నా గౌరవం సాక్షిగా మాట ఇస్తున్నాను’ నేను అన్నాను.
మేం నిన్ను నమ్ముతాము. ఇక మీ పట్ల మా సానుభూతి కూడా ఉంది. కానీ బహుశా నీవు పోగొట్టుకున్నది ఇదే గలోష్ కావచ్చు. కానీ, మేం దాన్ని అలాగ ఇవ్వడానికి లేదు. నీవు నిజంగా గలోష్ పోగొట్టుకున్నట్టు సర్టిఫికెట్ మాకు అవసరం. ఈ సత్యాన్ని నీవు మీ హౌస్ మేనేజ్‌మెంట్ ఆఫీసు నుంచి ధృవీకరించుకురావాలి. అప్ప్పుడు ఇక ఏ ఆలస్యమÖ లేకుండా, నీవు న్యాయంగా పోగొట్టుకున్న వస్తువును నీకు తిరిగి ఇస్తాము.’
కానీ అన్నలారా, ప్రియమయిన నా కామ్రేడ్‌లారా, ఈ వాస్తవం గురించి ఆఫీసులో ఎవరికీ తెలియదు. వాళ్లు సర్టిఫికేషన్ ఇవ్వకపోవచ్చు’ నేను చెప్పాను.
అవును, ఇస్తారు, అదే వాళ్లపని. మరి ఇక వాళ్లు ఉన్నది దేనికి?’ వాళ్లన్నారు.
నేను గలోష్ వేపు మరోసారి చూచి వచ్చేశాను.
మరుసటినాడు నేను మా ఆఫీసు పెద్ద దగ్గరికి వెళ్లాను.
నాకు ఒక డాక్యుమెంట్ ఇవ్వండి, లేదంటే నా గలోష్ పోయినట్టే’ అన్నాను.
ఆహా, నీవు నిజంగా దాన్ని పోగొట్టుకున్నావా లేక తమాషా చేస్తున్నావా? ఊరికే ఒక ముక్కను సంపాదించుకోవాలని పథకం వేస్తున్నావేమో?’ ఆయన అన్నాడు.
దేవుని మీద ఒట్టు, దాన్ని నేను పోగొట్టుకున్నట్టు’ నేను చెప్పాను.
కేవలం నీ మాట ఆధారంగా, నేను ఇవ్వలేనన్నది, చెప్పనవసరం లేని సంగతి’ ఆయన అన్నాడు. ‘ఇక ఇప్ప్పుడు నీవు ట్రామ్ డిపోనుంచి గలోష్ పోగొట్టుకున్నట్టు ఒక సర్టిఫికేషన్ తీసుకువస్తే, నీకు నేను ఒక డాక్యుమెంట్ ఇవ్వగలుగుతాను. లేకుంటే, నా వల్ల కాదు.’
కానీ వాళ్లే నన్ను మీ దగ్గరికి ఊరికే పంపించారు.’
మరయితే, ఒక స్టేట్‌మెంట్ రాయి’ అన్నాడాయన.
ఏమని రాసేది?’
ఫలానా ఫలానా రోజున ఒక గలోష్ పోయింది అని రాయి, ఇక విషయం తేలేవరకు నేను పైన ఇచ్చిన చిరునామాలోనే ఉంటానని మాట ఇస్తున్నాను అని కూడా రాయి’ చెప్పాడాయన.
నేను స్టేట్‌మెంట్ రాశాను. మరుసటి నాడు నాకు అఫీషియల్‌గా సర్టిఫికేషన్ అందింది.
దానితో నేను ఆఫీసుకు వెళ్లాను, ఇక అక్కడ, మీరు ఊహిస్తారో లేదో, ఏ మాత్రం నస లేదా ఆలస్యం లేకుండా, వాళ్లు నా గలోష్‌ను నాకు ఇచ్చివేశారు.
కానీ ఇక నా గలోష్ నా కాలిమీదికి వచ్చిన తరువాత నేను మరీ పొంగిపోయాను. అవును, వీళ్ల పద్ధతి బాగా ఇంకా నిజంగా పని చేస్తుంది! అనుకున్నాను. ఒక వెనకబడిన దేశంలో నా గలోష్ గురించి వీళ్లు ఇంతకాలం, కష్టం ఖర్చు చేయడం గురించి మీరు ఊహించగలరా? లేదు,  వాళ్లు దాన్ని ట్రామ్‌లోనుంచి బయటకు విసిరి ఉండవచ్చు ` అంత సులభంగాను. కానీ ఇక్కడ మాత్రం, ఒక వారంలోపల అది నాకు తిరిగి చేరింది. ఎంత మంచి వ్యవస్థ!
కానీ కష్టం ఏమిటంటే, వారం రోజుల పాటు ఈ రావడం, పోవడాలతో, నేను మొదటి గలోష్‌ను పోగొట్టుకున్నాను.
న్యూస్‌పేపర్‌లో చుట్టి దాన్ని చంకలో పెట్టుకుని మోస్తూనే ఉన్నాను. ఇక దాన్ని ఎక్కడ వదిలానన్నది మాత్రం గుర్తులేదు. ట్రామ్‌లో మాత్రం కాదు ` అదే పెద్ద సమస్య. దాన్ని నేను ట్రామ్‌లో పోగొట్టుకోలేదన్నది నిజంగా సిగ్గుచేటు ` ఇక ఇప్ప్పుడు నేను దాన్ని ఎక్కడ వెతకాలి?
కానీ మిగతా గలోష్ నాకు చిక్కింది. దాన్ని నేను అల్మారామీద పెట్టాను.
కాస్త మనసు బాగా లేనప్ప్పుడు, నేను గలోష్ వేపు చూస్తాను. ఇక నా మనసు తేలికవుతుంది. వ్యవస్థ చాలా గొప్పదని నాకు నేనే చెప్ప్పుకుంటాను.

(1927లో ప్రచురించిన కథ)




 

Monday, June 1, 2026

లోకాభిరామం : సైన్స్ కూడా నమ్మకమే


సైన్స్ కూడా నమ్మకమే

సైన్సు- గండుచీమనాకు సంగీతం చీమ కుట్టిందని, ఒకానొక సారి అన్నట్టు గుర్తు. నాకు సాహిత్యం చీమ కూడా కుట్టింది. వీటన్నింటికీ మించి సైన్సు అనే గండుచీమ రక్తం వచ్చేదాకా కుట్టింది. ‘మీరు కొందరిని మతోన్మాదులు అంటున్నారు. వారు మనలను సైన్సు ఉన్మాదులు అంటారేమో చూడండి’ అని అడిగేంత ఘాటుగా కుట్టింది ఆ చీమ. ఈ మధ్యన ఏదో రాతకు తయారవుతున్న ప్రయత్నంలో భాగంగా, మనం మేలుకుని ఉన్నా, నిద్ర పోయినా, అంతా బయోకెమిస్ట్రీ, అని వాక్యం రాసుకున్నాను. నాకు ఈ ప్రపంచమంతా సైన్సుగానే కనపడుతుంది. మిగతావారికి అట్లాగ ఎందుకు కనిపించడం లేదని, అనుమానం కూడా వస్తుంది.

మనం ఉందనుకుంటున్న ఈ విశ్వం, అందులో సౌరమండలం, అందులో భూమి, అందులో జీవం, అందులో మనం మొదలైనవన్నీ మన, (మనలాంటి వారే అయిన తరతరాల మనుషుల) మెదడుల్లో నుంచి పుట్టిన అవగాహనలు. ఆలోచనలు పుడతాయి. వాటి గురించి ప్రయోగాలు జరుగుతాయి. కొన్ని విషయాలకు రుజువులు దొరుకుతాయి. అవన్నీ కలిపి సైన్సుగా నిలుస్తాయి. భౌతిక ప్రపంచంలో కూడా పదార్ధంగా, యదార్ధంగా ఉన్నవాటిని గురించిన సైన్సు ఒక భాగం. కేవలం అనుభవంలో మాత్రమే ఉండే ఆలోచనలు, సిద్ధాంతాలు కూడా ఒక భాగం! ఇది కూడా సైన్సే! వీటన్నింటికీ, ప్రపంచమంతటా ఆయా పరిస్థితుల్లో ఒకేరకమైన అనుభవాలు, ఆధారాలు దొరుకుతాయి. కనుక అది ఒక సైన్సు!

ఈ మన మెదడు (మెదడుల)లోనే మరికొన్ని ఆలోచనలు మొదలవుతాయి. అవి అందరికీ ఒకే రకంగా అనుభవంలోకి రాక పోవచ్చు. వాటికి ఆధారాలు అందరికీ ఒకే రకంగా అందవు కూడా! ఆలోచన ధోరణి, మెదడు మొదలైన సైకాలజీ దీనికి మొదటి ఉదాహరణేమో?

విశ్వం ఉందని అందరూ అంటున్నారు గనుక మనమూ ఉందంటున్నాం. అది నిజంగా ఉందని ఎవరూ చూడలేదు. ఉందన డానికి చెపుతున్న లెక్కలు, ఆధారాలు మొదలైనవి అందరికీ ఒకేలాగ అర్థం కావడంలేదు. సైన్సు చదువుకున్న వారికి కూడా సైన్సు అర్థం కాలేదు. సైంటిస్టులం అంటున్నవారు కూడా సైన్సు వేరు, బతుకు వేరు అనుకుంటున్నారు. నమ్మకాలు మెదడు లోనే పుడతాయి. అనుభవాలూ మెదడులోనే పుడతాయి. వాటిలో ఒకదానికి ఒకటి జోడించి చూడడం చేతగాదు. అంతా గజి బిజి గందర గోళం అవుతుంది. ఏది ఉంది, ఏది లేదు తేల్చుకోలేము. బతుకంటే భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటే నవ్వుతారు మరి. నవ్వేవారి తప్పు లేనేలేదు. వారలకు అంతగా చీమ కుట్టలేదు మరి. సైన్సయినా, మరోటయినా ఉందనుకుంటే ఉంది. లేదను కుంటే లేదు.

ఒక మిత్రుడెవరో చాలాకాలం తరువాత కనబడతారు. ఎవరెవరి గురించో అడుగుతాము. ఫలానా వాడు ఎక్కడా? అంటే ‘అయ్యో! తెలియదా? వాడుపోయి నాలుగేళ్లయింది!’ అంటాడా మిత్రుడు. మనమేమో ఆ ‘ఫలానా’ ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనుకుంటున్నాము. ఆయన పోయి నాలుగేళ్లయినా, మనకు మాత్రం ఆ క్షణాన్నే పోయాడు. అసలా సంగతి గురించి ఇంకా నమ్మకం కుదరదు. భౌతికమైన మనిషి సంగతే ఇట్లాగయితే, ఉన్నామో లేదో, ఎవరికీ తెలియని అనుభవైక వేద్యాల సంగతేమిటి?

తరం-తరం: మా తాతయ్య పుస్తక ప్రియులు. ఆయన వదిలి వెళ్లిన పుస్తకాలే అందుకు నిదర్శనాలు. ఎనిమిది రకాల రామాయణాలున్నాయి ఆయన లైబ్రరీలో. తాతయ్య పుస్తకాలలో టూరిజం, సైన్సు(!) రకం పుస్తకాలున్నాయని గమనించాను. ఆ కాలంలోనే ఆధునిక వైద్యం, ఆరోగ్యం లాంటి విషయాల మీద పుస్తకాలు వచ్చాయని, వాటిని తాతయ్య తెచ్చి చదువుకున్నాడని తెలిస్తే ఈ ‘తిక్కదనం’ నాటి నుంచీ ఉందని అర్ధమైంది. మ్యాజిక్, గుర్రాల పెంపకం, ఆయుర్వేదం,  చిట్కా వైద్యం లాంటి విషయాల గురించి కూడా తాతయ్య పుస్తకాలు సేకరించి పెట్టుకున్నాడు. నాకు చేతనయినంత కాలం ఆయన పుస్తకాలను నేను కాపాడుకున్నాను. చదువు పేరిట ఇల్లు వదిలి, తిరిగి వచ్చేసరికి, ఇంట్లో పుస్తకాలు మిగలలేదు. మిగిలినవి పుస్తకాల లాగ లేవు. అది గమనించి నేను పడ్డ బాధ వర్ణనాతీతం.

నాన్న సంప్రదాయ విద్య బాగా చదువుకున్న వ్యక్తి. కాని ఎందుకో ఆయన లైట్ రీడింగ్ మీద మాత్రమే మనసు పెట్టినట్టు గమనించాను. ఆయన కొన్న పుస్తకాలన్నీ ఇంచుమించు అదే రకం. అవి కూడా మిగలలేదు. సంవత్సరాల తరబడి సేకరించిన చందమామలు, నవలలు మాయమయినవి. నాన్న, నేనూ ఆ విషయంగా పెద్ద బాధపడినట్టు లేదు.

నాన్న సాంప్రదాయం మనిషే. అయినా పిసరంత కూడా ఛాదస్తం లేదు. ఎమ్మెస్సీలో క్లాస్‌మేట్స్ (గరల్స్) ప్రోద్బలంతో నేను మీసాలు పెంచుకున్నాను. ఇంటికి వెడితే అది చూచి తంతారేమోనని భయం. తలవంచుకుని ఇంట్లోకి వెళుతున్నాను. అరుగు మీద కూచున్న నాన్న నా ముఖంలోకి చూసి ‘భేష్ బాగుందిరా నాన్నా!’ అని నిజంగా మెచ్చుకున్నారు. మూన్ ఫేస్ అంటారే! ఇంచుమించు అమ్మాయి ముఖం నాది. పైగా రంగు. మీసాలతో మగతనం కనిపించిందని వ్యాఖ్య! అదీ నాన్న పద్ధతి. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతుంటే నేను ఎడతెరిపి లేకుండా ‘అదేమి?  ఇదేమి’ అని ప్రశ్నలడగాలి. ఆయన సమాధానాలు చెబుతారు. కొన్ని ప్రశ్న తరువాత ‘చల్ బే (పోరా!)’ అంటారు. అది మాకు ఒక ఆట! నాకు బాగా గుర్తుంది! ఆ రకంగా ఆయన వెంట తిరుగుతూ ఎన్ని సంగతులు తెలుసుకున్నానో మరి! డిటెక్టివ్ నవలలు చదివితే పరిశీలన, విశ్లేషణ అలవాటవుతాయని నాన్న చెప్పాడు. పైగా నాన్న చర్చకు, ప్రశ్నలకు అవకాశం కల్పించాడు. నాకు మరీ ధైర్యం ఎక్కువైంది కూడా. కొన్ని సందర్భాల్లో ‘నాకు తెలిసింది ఇంత. మా పెద్దలు చెప్పింది, వారికి తెలిసింది ఇంతే!’ అని ఓటమిని కూడా అంగీకరించే వాడు నాన్న! నాన్నకు నేనివాళ కృతజ్ఞత చెప్పగలనా?

నాకు ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్ వచ్చిందని అమ్మ ఒక పండుగ పథకం వేసింది. బంధువులు మిత్రులు అందరూ వచ్చారు. పూజ (సత్యనారాయణ వ్రతమా?) ఏర్పాట్లు అయినయి. ‘రా! కూచో!’ అన్నది అమ్మ! ‘అమ్మా, నాకు మనస్థిమితం కుదరదు. పిచ్చి ఆలోచనలు వస్తాయి. అట్లా చేయడం తప్పుగాదా? అని అడిగాను. అందరూ నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్న మాత్రం ‘వాణ్ని వదిలిపెట్టండి’ అని అమ్మతో తాను పూజకు కూర్చున్నాడు. ‘మా వెనక కూచుని చూడు!’ అన్నారు అంతే! నాన్న ఒకనాడు కూడా ‘ఈ విషయం మీరు చేసి తీరాల్సిందే’ అని చెప్పిన గుర్తులేదు మాకెవరికీ!

తరం మారింది: సైన్సు ప్రకారం బతకడమని ఒకటుందని చాలామంది సైంటిస్టులకే తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణం గురించి పరిశోధించడానికి వెళ్లిన ఒకాయన బురద నీళ్లలో స్నానం చేశాడని యూనివర్సిటీ రోజుల్లో చెప్పుకున్నారు. అట్లాగని, మతాన్ని, నమ్మకాలను కాదనడం సైన్సనుకుంటున్నారేమో? మతం వ్యక్తిగతం, సైన్సు సార్వజనీనం! పరిశీలన, ప్రయోగం లాంటి అంచెలతో సాగుతుంది సైన్సు పద్ధతి! అది వంటబట్టడానికి సైన్సు చదవనవసరం లేదు.

నాకొడుకు మరీ చిన్నవాడుగా వున్నప్పుడు, వాడూ, నేనూ మాత్రమే మహబూబ్‌నగరం దాకా బస్సులో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది గానీ, పిల్లలిద్దరూ చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారితో నేను తెగ గోల చేసేవాడిని. బస్సులో గోల చేయలేదు గానీ! నేనూ నా కొడుకు మాట్లాడుతునే ఉన్నామని తర్వాత అర్థమైంది. వాడికి బయట తిరగడం అదే కొత్త! కనిపించిన ప్రతి సంగతి గురించీ ప్రశ్నలడుగుతాడు. నాకు తెలిసింది నేను చెబుతాను. పాలమూరు అనే మహబూబ్‌నగర్ దగ్గరయింది. పక్కనకూచున్న పెద్దాయన, ఊరి మొదట్లోనే దిగడానికి సిద్ధమయ్యాడు. దిగబోతూ నావేపు చూచి ‘ఒక మాట చెప్పనాఅన్నాడు. ‘చెప్పండి’ అన్నాను. ‘మీ కొడుకుకు చాలా తెలివి ఉంది. మీకు అంతకన్నా ఎక్కువ ఓపిక ఉంది’ అన్నాడాయన! నేనీ సంగతి గురించి వ్యాఖ్యానించను.

కవిసమ్మేళనం-కొబ్బరి పచ్చడి: పుస్తక మేళాలో ఈ సంవత్సరం స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది మిత్రులు కనిపించారు కూడా. అక్కడ కవిసమ్మేళనం జరుగుతుందని మైకులో చెపుతున్నారు. పాల్గొంటున్న కవులందరూ మిత్రులు, కనీసం పరిచితులు. ఈ సంగతే నాతో ఉన్న మా అమ్మాయితో చెప్పాను కూడా. వేదిక ముందుకు వెళ్లేసరికి కవులంతా వేదికను అలంకరించారు. అంటే వేదికను ఎక్కారని అర్థం. కొంచెంసేపు ఉండి వెళ్లిపోదాములే! అంటున్నాను అమ్మాయితో. ఇంతలో ఫోను మోగింది. దూరం వచ్చి వింటే ‘ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయమంటారా సార్’ అని ప్రశ్న. వంటాయన! రామాయణంలో పిడకల వేటలాంటి టైటిల్ గుర్తువచ్చింది. సైన్సుకూ, ఈ ముక్కకూ సంబంధం లేదని మనవి!


 

Friday, May 29, 2026

నక్షత్రాలు ఏమయినయి ?


నక్షత్రాలు ఏమయినయి?


చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడ పల్లెకు పోయి ఆరుబయట పండుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేటివి. పట్నం జేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువయిపోయింది. అందుకు కారణం కాంతి కాలుష్యం అని సులభంగనే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడ వెదజల్లబడి అక్కడ చుక్కలు మనకు కనిపించకుండ చేస్తున్నయి. ఈ వెలుగుల కారణంగ ఆకాశం వెలుగుతున్నది అని అర్థం.
నక్షత్రాలను, అంతరిక్షంలోని ఇతర అంశాలను పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు, ఇదంతా పెద్ద సమస్యగ చాల కాలంగనే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూచినరు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూచినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాలకంటే వేరుగ ఉంటయి. మనిషి వెలుగులు మరి ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు అంటే ప్రయోగాలు మొదలయ్యనయి.
జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగ పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నరు. అటువంటి ఒక పట్టణంలో ఆకాశం బాగ వెలుగుతుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తయి. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగ మనిషి కండ్లు గూడ చూడగలుగుతయి అంటున్నరు. కనుక మనుషులు ఆకాశంలోకి తొంగి చూచి ఈ పటాలలో కనిపించే తీరు వారికి కనిపిస్తున్నదా లేదా అన్న అంశాన్ని బేరీజు వేసుకుంటరు.
2011 సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నరు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశినరు. ప్రాంతానికి ప్రాంతానికి మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చినరు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10% కంటే ఎక్కువగ ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడ చాల ఎక్కువ గద. మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నరు.
మామూలుగ ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగ పెరిగిపోతుంది. అదేదో చక్రవడ్డీ పెరిగినట్టు పెరుగుతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట.
కైబా గారు అనుచరులతో కలిసి ఈ మధ్యనే సైన్స్ అనే పత్రికలో ఒక పరిశోధన పత్రాన్ని ప్రకటించినరు. ఒకరికి ఎవరికో మొదటి రోజుల్లో 250 నక్షత్రాలు కనిపిస్తే ఆ వ్యక్తికి 18 సంవత్సరాలు వయసు వచ్చే లోపల కేవలం 100 నక్షత్రాలే కనిపిస్తయి అని లెక్క తేల్చినరు. ఆ సమయంలో ఆకాశంలో వెలుగు నాలుగంతలు పెరిగిపోయిందని అర్థం.
అటు అంతరిక్ష నౌకలో వారు మాత్రం, ఏటేటా రెండు శాతం పెరుగుదలను మాత్రమే గమనించినట్లు చెప్పినరు. అది అసలు నిజం పరిస్థితి కానే కాదు. ఉపగ్రహాలు తమ లెక్కలలో చాలా తక్కువ మార్పులు మాత్రమే చూపిస్తున్నయి, అని కైబా బృందం వారు నిస్సందేహంగ తేల్చివేశినరు. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించని కనిపించవేమో అంటున్నరు.
టెక్నాలజీ లో వస్తున్న మార్పుల కారణంగ ఈ కాలుష్యం బాగ పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చినరు. ఒకప్పుడు వీధి దీపాలలోని ఎర్రని వెలుగు ఒక రకంగ ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి బల్బులను వాడుతున్నరు. అందులో నుంచి వచ్చే కాంతి కొంత నీలంగ ఉంటుంది. నీలం వెలుగు సులభంగ పరుచుకుంటుంది. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మాత్రం ఈ రకం వెలుగును అంతగా చూడలేవు. పైగా అవి నగరాలలోని వెలుగును మాత్రమే బాగా చూడగలుగుతయి. ఇళ్లలో నుంచి కిటికీలోనుంచి బయటకు వచ్చి అదే తలంలో పరుచుకునే వెలుగును మనుషులు బాగా చూడగలుగుతరు. దాని ప్రభావానికి సులభంగా గురవుతరు.
ఇటువంటి వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగ ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతయి. చివరకు మిణుగురు పురుగులు కూడ ఈ వెలుగుకు తికమక పడతయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగ ఉంటుంది.
వాతావరణం వేడెక్కుతున్నది అని ఒక పక్కన గోల చేస్తున్నరు. ఈ వెలుగు కాలుష్యం కూడా అదే పద్ధతిలో ప్రపంచమంతటా పరుచుకుని ఉంటుంది. ఎవరికి వారు దీని నుంచి బయటపడే మార్గం లేనేలేదు. వాతావరణం వేడెక్కడం కూడ ఇదే పద్ధతిలో ఏటా పది శాతం ప్రకారం పెరిగి ఉంటే తప్పకుండ దానిమీద తీవ్రమైన ప్రయత్నాలు జరిగి కొంతవరకు అదుపు కూడా వీలయి ఉండేది. ఈ కాంతి కాలుష్యాన్ని ఎవర పట్టించుకోవడం లేదు.
నిజానికి రాత్రిపూట ఎక్కువ వెలుగు ఉంటే భద్రతగ ఉంటుంది అని చాలామంది భ్రమ పడుతున్నరు. వెలుగు బాగ ఉన్నందుకు రాత్రిపూట దారుల మీద ప్రమాదాలు తక్కువ కావచ్చు, నిజమే. అయితే ఆ రకమైన రక్షణ అనుకున్నట్టు జరగడం లేదు అని పరిశోధకులు అభిప్రాయం. పుడుతున్న ఈ వెలుగులు నిటారుగ ఆకాశంలోకి వెదజల్లబడతయి కానీ, మామూలుగ కిందికి సాగవు.
ఆకాశం మళ్ళ మొదటిలాగ కనిపించాలంటే ఏం జేయాలె అన్నది ఒక ప్రశ్న.
అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం అనేది ఒకటి తయారయి ఉందని, అది తీవ్రంగ పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగ వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నరు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు కిందకు మాత్రమే రావాలె అని వారు సలహా ఇస్తున్నరు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడ చెబుతున్నరు.
వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాల అవసరం. ఇంటి బయట రాత్రంత అనవసరంగ వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగ చర్చించి అక్కడి పరిస్థితులకు అనుకూలంగ ఏర్పాటు చేసుకోవాలె. అందర చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు.
కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగ అంచనా వేసేందుకు లేదు. ప్రకృతి అందం పాడుగాకుండ ఈ వెలుగులను వాడాలె. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్న అందమైన దృశ్యం. దాన్ని చేతనయినంతవరకు కాపాడుకోవాలె. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగ గుర్తించి పరిశీలించాలె. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతయినా చెప్పగలుగుతరు. రాత్రి ఆకాశం నిజంగా అందమయినది.
కాంతి అన్నది పరిశోధకులకు మాత్రమే సమస్య కాదు. పట్టణాలలో బతికే వారికి ఈ సమస్య గురించి అసలు తెలియనే తెలియదు. ఆకాశంలో నక్షత్రాలు ఉంటయి అన్న సంగతి వాళ్ళు మరిచిపోయినరు. రాత్రి చీకటి ఆకాశము మనకెంతో అవసరం. పొద్దు మూకితే చాలు ఆ అందాలు కనిపించే ఏర్పాట్లను మనం జాగ్రత్తగ చేసుకోవాలె. వీలయినప్పుడంత నగరాల వారు కూడ దూరంగా వెళ్లి నక్షత్రాలను చూచి ఆనందించడం నేర్చుకోవాలె.