Lokabhiramam
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Tuesday, September 8, 2026
Saturday, September 5, 2026
లోకాభిరామం : నవలా తరంగం - శిలాహాసం On a Tamil novel by LaSaRa
నవలా
తరంగం - శిలాహాసం
నాకు పుస్తకాలు కొనే అలవాటు ఉంది. లేదు.
నాలుగయిదు భాషలు చదువుతాను. కనుక నేను కొనదలచుకున్న పుస్తకాలకు సరిపడేన్ని పైసలు
నా దగ్గర లేవు. కొన్న పుస్తకాలకు తగిన స్థలం ఇంట్లో లేదు. అయినా, ఫుట్పాత్ మీద మొదలు, పెద్ద అంగళ్లలో
వరకు పుస్తకాలను చూస్తూ తిరగడం మాత్రం మానలేదు. అట్లనే వాల్డెన్ అనే ఒక అంగట్లోకి
పోతిని (ఈ వాల్డెన్ అనే మాటకు అడవులు అని అర్థం ఉందని నా అనుమానం! జెర్మన్!)
అక్కడ బెస్ట్ సెల్లర్స్ ఉండనే ఉంటయి. వాటి గురించి ఫ్లిప్కార్ట్, క్రాస్వర్డ్ వంటి వారంత ఊదరగొడుతునే ఉంటరు. వాల్డెన్లో
ఒకచోట కొన్ని పుస్తకాల ధరలు తగ్గించి అమ్ముతున్నట్లు కనిపించింది. అనుకోకుండా
అందులో ‘కథ’ అనే సంస్థ వారు వేసిన మంచి పుస్తకాలు కనిపించినయి. ఒకటి
అనుకున్నవాణ్ని, అయిదు పుస్తకాలు తెచ్చి కూచుని చదివిన. అవన్నీ
తమిళ రచనలకు ఇంగ్లీషు అనువాదాలు. వాటిల్లో ఒకటి రెండు చిరు నవలల జమిలి పుస్తకం.
రచయిత పేరు ‘లాసరా’ అని ఉంది. లోపల వివరంగా
చూస్తే ఆ పెద్దాయన పేరు లాల్గుడి సప్తర్షి రామామృతం అని అర్థమయింది. (ఈ తమిళుల
తస్సదియ్య సంస్కృతాన్ని కొమ్ములు విరిచి, చెవులు నులిమి ఎంత
చెయ్యాలెనో అంత చేస్తరు. పేరును ‘లాల్గుడి సప్తరిషి రామామిర్తం’ అని
రాసుకున్నారు. ఈ పుస్తకంలో లాసరా రాసిన రెండు చిరు నవలలున్నాయి. ఒకటి కల్
సిరిక్కిరదు, అంటే రాయి నవ్వింది, రెండవది ప్రాయశ్చిత్తం. ఈ రెండూ కలిసి నిజానికి ఒకటే నవల. మొదటి నవల అనువాదంలో
72 పేజీలు చదివి వదిలేస్తే, బాగనే ఉంది. తరువాతి నవల 80 పేజీలు చదివిన తరువాత మరింత బాగుంది. ఈ కథలో రాయి అంటే అమ్మవారి విగ్రహం. ఆమె
మొదటి కథలో నవ్విందేమో తెలియదు. రెండవ భాగంలో ఆ సంగతి అర్థమవుతుంది. కమలాంబిక
నవ్వుతుంది. కానీ, ప్రాయశ్చిత్తం ఎవరికి, ఏమో తెలియదు. రెండవ భాగంలో నిజానికి కొత్త పాత్రలు కొన్ని వచ్చి కొంప ముంచింది
లేదు. కానీ, కథ ముందుకు సాగుతుంది. ప్రాయశ్చిత్తం తరువాత
కూడా కథ మరింత ముందుకు నడుస్తుందేమో? నడిస్తే
బాగుండునన్న భావం మిగులుతుంది. ఈ రెండు చిరు నవలలను కలిపిన నవల గురించి
వ్యాఖ్యానించడానికి నాకు మనస్కరించడం లేదు. అయినా వాటిని గురించి అందరికీ
చెప్పాలన్న భావం మాత్రం బలంగ మిగిలింది. ఈ రచయిత
మరో బోలెడన్ని నవలలు, కథలు రాసినరు. అందులో కొన్ని ఉచితంగ నెట్లో
అందుబాటులో ఉన్నయి. నాకు ధారాళంగ తమిళం చదవడం రాదు. ఎవరయినా చదివి వినిపిస్తే
అర్థం చేసుకోగలను. లాసరా రచనలు కడు సరళంగ సాగుతయి కనుక మరింత సులభంగ, అర్థమవుతయని నమ్మకం. ఇంతకు ఒకటి రెండు సందర్భాలలో తమిళం
చదువు అభ్యాసం చెయ్యలేదే, అని అనిపించడం
వాస్తవం. ఈ అనువాద నవల చదివిన తరువాత ఆ భావం మరింత బలంగ మరోసారి కలిగింది.
నవలలో ధర్మరాజన్ గారని ఒక నడివయసు కూడ దాటిన
పెద్దాయన నాయకుడు. ఆయనను ఆదర్శంగ చూడడమా, మెచ్చుకోవడమా,
జాలి పడడమా, అసహ్యించుకోవడమా,
మనకు, కనీసం నాకు
అంతుపట్టలేదు. ఇటువంటి ఒక పాత్ర మరెక్కడో ఒక్కచోట మాత్రం ఎదురయిందని అనుమానం.
‘తెరచిరాజు’లోనా?
కథాక్రమంబెట్టిదనిన: నాకు కథ చెప్పాలనిపించడం
లేదు. అంత కలగాపులగంగ గుర్తొస్తున్నది. అది కావాలని, రచయిత పన్నిన పన్నాగమని నాకర్థమవుతున్నది. ధర్మరాజన్కు తలిదండ్రులు లేరు.
పెద్దనాయన దగ్గర బుద్ధులు నేర్చి, ఆయన చెప్పినందుకు
ప్రపంచం మీద పడతడు. మంచి ఉద్యోగమే చేస్తడు. కానీ, వ్యక్తిగతంగ నాకులాగే, ఎక్కడా నిలకడ లేదు.
ధర్మరాజన్ను చూచి అందరూ గౌరవిస్తరు. తలకెత్తుకుంటరు. ఆయన మాత్రం జారిపోయి
కష్టాలలో మునిగిపోతడు. ఆయన దగ్గర ఉద్యోగం చేసిన ఒక అమ్మాయి, వివాహిత, ఆమెకు కొడుకు కూడ ఉంటడు. కానీ, ఆమెకు సుఖం లేదు. మొగుడు ఎందుకూ పనికిరాని సన్నాసి. ఆ అమ్మాయికి, ధర్మరాజన్కు బిడ్డ-తండ్రి వంటి ప్రేమ. ధర్మరాజన్కు ధర్మత:
కమలాంబిక గుడిలో పూజారితనం హక్కుగ ఉంటుంది. అక్కడ పెదనాయన కొడుకు ఉన్నడు. పని
చేయడం ఇష్టమే. పైసలు మాత్రం వద్దు. ఒక మార్వాడీ ఇంట్లో వంటవానిగ పనికి చేరుతడు మన
నాయకుడు. కథలోని అమ్మాయి నగలు ఆ మార్వాడీ దగ్గర కుదువబెట్టి ఉన్నయి. వాటినీయన
దొంగిలిస్తడు. సేఠ్ చని పోతడు. మన హీరో జెయిలు పాలవుతడు. తిరిగి బయటకి వస్తడు. కథ
సాగుతుంది.
చెప్పిన గద, కథ చెప్పాలని లేదని! సినిమాకు కుదరదేమో గానీ, టీవీ సీరియల్కు బాగ పనికివచ్చే రచన యిది. ఇన్ని మలుపులు, ఇన్ని రకాల పాత్రలు, మామూలుగ మనకు నవలల్లో కనపడవు! ఇంగ్లీషు, నవలలు చదవడం అలవాటున్న వాండ్లందరు, ఈ పుస్తకం సంపాయించి చదవాలని
నాకనిపించింది. ఇది గొప్ప నవల కాదు. గొప్ప నవల అంటే ఎట్లుంటుందో నాకు తెలియడము
లేదు. ఆ చర్చలోకి పోయే సంకల్పము ప్రస్తుతము లేదు. కానీ, లాసరా రచనలు అందరూ చదవదగినవి. ఈ మాట నేననడం లేదు.
డా.గాబ్రియేలా అయిషింజర్ ఫెరొ-లుజీ అనే
భాషావేత్త, ద్రావిడ భాషల గురించి పరిశోధించినరు. ఆమె ఈ రచయితను ఆకాశానికెత్తింది.
ఆమె చెప్పిన ఒక సంగతి మాత్రం నాకు ముఖంలో గుద్దినట్లుగ తగిలింది. లాసరా ప్రతీకలను
అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మల బ్రతుకు తీరు, వారి సంప్రదాయాలు తెలిసి ఉండాలంటుంది ఆమె. శ్రీపాద గురించి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి ఈ మాట ఎవరయినా అని
ఉండవచ్చు. అనకున్నా, ఇప్పుడు నేనంటున్న. ఈ మహా రచయితల ఎక్స్ప్రెషన్
సిసలయిన బాపనితనం నిండినదే.
ఒక రచయిత నాలుగయిదు రచనలు చదివితే, రచయితను గుర్తించగలగడం నిజంగా ఒక ఫీటు. లాసరా విషయంలో ఇది
నిజమంటారు మరో తమిళ విమర్శకులు. లాసరా కాస్త కఠినమయిన రచయిత. ఆయన చెప్పినదంత
అర్థమయిందని నేను అనలేను అంటారు గాబ్రియేలా! ఆయన వాక్యాలు సింపుల్కన్న సింపుల్.
భాష తప్పకుండా సింపుల్. ఎక్కడ ప్రయత్నించినా కాంప్లెక్సిటీ కనిపించదు. కానీ,
ఆ పాత్రలు, అవి చేసే పనులు,
అనే మాటలు మనలను ఆలోచనల్లో ముంచుతయి. ధర్మరాజన్ ఒకనాడు
దారి పక్కన కూచుని, ముందు ఉత్తరీయం పరిచి, పిల్లంగ్రోవి మీద సంగీతం వాయించడం మొదలుపెడతడు. ఆయనకు ఆ పని చేయవలసిన అవసరం
ఏమి? అర్థంకాదు. కానీ, దాంతోనే ‘ప్రాయశ్చిత్తం’ మొదల వుతుంది. ‘చదువరులారా, రండి. కన్నీళ్ల కలయిక, నదులన్నిటి
సంగమంకన్న గొప్పది. అక్కడ ఇక మన అవసరం లేదు. మనం వాళ్లని వదిలేద్దము! సరేనా!’ అంటూ
ముగుస్తుంది రెండవ నవల, తరువాత కమలాంబ నవ్వుతుంది!!
అనువాదం: అనువాదం విషయంలో ఎందరో పెద్దలు
సిద్ధాంతాలు చేసినరు. నాకవేవీ పట్టలేదు. నా సిద్ధాంతాలు నేను చేసుకుని కొన్ని
అనువాదాలు చేసిన. తిట్లు దీవెనలు, రెండూ తిన్న. నన్ను
అర్థం చేసుకోలేని వారున్నరని అర్థమయింది. అనువాదం చేస్తున్నది కాల్పనిక
సాహిత్యమయితే, మూల రచయిత, దయ్యమయి మనకు పట్టాలె. వారి శైలి
కూడ విషయమంత బలంగ, అనువాదంలో ప్రతిబింబింప వలె. ఇది నా పద్ధతి.
కల్ సిరిక్కిరదు, తమిళ ప్రతి చదవడానికి ప్రయత్నించిన తరువాత,
పద్మా నారాయణన్ అనువాదం బాగుందని తోచింది గాని, భాష, భావం కలయిక,
అంటే అభివ్యక్తి మూలానికి ఎంత సమీపంగ ఉన్నదీ తెలియలేదు.
అనువాదం చదువుతుంటే, అడుగడుగున, మూలభాష గుర్తుకు రావాలని నాకనిపిస్తుంది. రచన అసలయిన ఇంగ్లీషు ఇడియంతో
సాగుతుంటే నాకు అసౌకర్యంగ తోస్తుంది. ఈ విషయం గురించి చాల మందితో, చాల చర్చించిన. ఇంకా అది కొనసాగవలసి ఉంది.
ప్రాయశ్చిత్తం: తిరిగి గోమతి యింట్లో, ఆయన తన పెట్టెను పరీక్షించాడు. తాళం బదులు ఒక తీగ చుట్టి
ఉంది. తన బట్టలన్నీ ఉన్నాయని గమనించాడు. కాఫీ ఫిల్టరు, స్టీలుగ్లాసు కూడా. పాస్బుక్, ఎఫ్డీ రసీదు,
చెక్కుబుక్కు లేవు. పోలీసు వాళ్లు తీసేసుకుని ఉంటారు. ఒక
వస్తువు కంటికి కనపడింది. అది గుడ్డలో చుట్టి ఉంది. ఆకారం వల్ల అదేమిటో తెలిసింది
- తన పిల్లంగ్రోవి. ఆయన దాన్ని తీశాడు. శుభ్రంగా తుడిచాడు, కళ్లతో తడిమాడు.. ఆయన తన పరిసరాలను మరిచిపోయాడు.
మూడున్నర సంవత్సరాలు... మొదటి స్వరపు తీయని
గాలి వెలికివచ్చి గుండెను తడిపింది. ఆయన సర్వస్వాన్ని ముంచెత్తింది. లోపల ఒక
పచ్చని చిగురు తలయెత్తింది.
అక్కడ రచయిత రాసిన మాటలు మనసులో కుచ్చుకుంటయి.
అదే రచన యొక్క సక్సెస్కు గుర్తింపు. అట్లని రచన గొప్పది కానవసరం లేదు.
ఈ జమిలి నవల నిజంగా ఒక మసాలా మిక్స్! కానీ
మసాలా నవల్లో ఇలాంటి మాటలుంటయా? ఏమో?
Tuesday, September 1, 2026
చింపిరిజుట్టు పరిశోధన On Anthropology!
ఆదివారం 11
ఫిబ్రవరి 2001 ఆంధ్రభూమి దినపత్రిక
చింపిరి
జుట్టు పరిశోధన
పరిశోధన, సైంటిస్టు
అనగానే మనకంతా చింపిరి జుట్టు, గడ్డం, పాతకాలం తరహా దుస్తులు వేసుకున్న ఒక
పిచ్చి మారాజు మనసులో మెదులుతాడు. పరీక్షనాళికలో రంగురంగుల ద్రవాలను కలిపి సక్సెస్
అని కేకలేస్తాడతను. సినిమాలు, నవలల పుణ్యమా
అని మనకు ఇలాంటి ఆలోచనలు స్థిరపడతాయి. అటు సైన్స్ అంచులను తాకుతూ, ఇటు సాంఘికశాస్త్రం గురించి కూడా
పట్టించుకుంటూ ఆంత్రపాలజీ అనే శాస్త్రం ఒకటి ఉంది. దాన్ని అచ్చంగా అనువదించాలంటే
మానవశాస్త్రం అనాల్సి ఉంటుంది. మానవుల తీరుతెన్నులు, జీవన విధానాలను వర్ణించే శాస్త్రం అది. అందులో ముక్కులు కొలవడం మొదలు, మునుపటి వారి విశేషాలను సేకరించడం దాకా
ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. అసాధారణంగా జీవిస్తున్న జాతులను పట్టించుకోవడం ఈ రంగం
వారి ప్రస్తుత ప్రత్యేక కార్యక్రమం.
ఆదిలాబాద్ లోని గోండులను గురించి పరిశోధించడానికి
జర్మనీ నుంచి హేమిండార్ఫ్ దంపతులు వచ్చి మర్లవాయి అనే ఊళ్లో గోండ్లతోనే కలిసి
జీవించారు. శ్రీమతి హేమిండార్ఫ్ సమాధి అక్కడే ఉంది ఇంకా. ఈ దంపతులు గోండులు
అయిపోయారన్నా అతిశయోక్తి లేదు. పరిశోధన శాలలు, పరికరాలు, సమావేశాలు, అందుకు తగిన ఆధునిక కాలం హంగులు ఏవి
అవసరం లేకుండా ఈ రకం పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. మిచిగన్ యూనివర్సిటీ
మానవశాస్త్ర పరిశోధకుడు టామ్ ఫ్రిక్ రెండు సంవత్సరాలకు పైగా కాల్ ఆఫ్ అనే
మధ్యతరగతి కుటుంబీకుడితో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్లు ఉండేది ఒక
నిజమైన పల్లె. అక్కడ సౌకర్యాలు అంతగా లేవు. అటువంటి ప్రాంతాల్లో బతుకుతున్న వారి
జీవితాలను పరిశోధించడమే ఫ్రిక్ పెట్టుకున్న పని. అందుకు వారి మధ్య వారిలో, ఒకడుగా
బతకడం కన్నా మంచి మార్గం లేదు. తాను పరిశోధకుడనే విషయాన్ని పక్కనపెట్టి ఫ్రిక్ తన
యజమానితో కలిసి వారి పొలాల్లో పని చేస్తుంటాడు. పశువులను కాస్తుంటాడు. ఈ పేరుతో
బీద రైతుల పనితీరును, పరిశోధకుడు స్వయంగా నేర్చుకుంటున్నాడు. ఆయా విషయాలను గురించి
ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుంటున్నాడు. అతను మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఆగి, అప్పుడు విరామం దొరికినప్పుడు ఆ రోజు
సేకరించిన వివరాలు అన్నింటిని ఒక పుస్తకంలో రాసుకుంటాడు. మారుతున్న మధ్యతరగతి
జీవితాలు, వారి
పనితీరులన్నీ త్వరలోనే ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నంలో ఇదొక భాగం!
కాలువ గట్టు మీద నిలబడి, కర్రతో గుచ్చి, రాయి వేసి, లోతు గురించి, ప్రవాహం గురించి తెలుసుకోవచ్చు. నేరుగా
అందులోకి దిగి సంగతులను మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రిక్ పాటిస్తున్నది ఈ
రెండవ మార్గం. దీన్ని పనిలోనే పరిశీలన అనవచ్చు. పరిశోధనకు వస్తువైన వారికి
అనవసరంగా కాలయాపన జరుగుతున్నది అన్న భావం ఉండదు. పరిశోధకులకు వివరాలు అనుమానం
లేకుండా అర్థమవుతాయి. ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగింది. ఏ విషయాలయితే, ఈ మధ్య తరగతి
రైతు కుటుంబాలు, సమస్యలుగా
గుర్తించి చర్చిస్తున్నారు అన్నది గమనించి ఈ పరిశోధకుడు వాటిని
పట్టించుకుంటున్నాడు. మారిపోతున్న ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడికక్కడ ఉండిపోయే
వీలు లేదు. రైతులకు సమాచారం కావాలి. వారి ఫలసాయం పైచోట్లకు అందాలి. కొత్త కొత్త
పద్ధతులు అన్ని రంగాల్లోనూ వస్తుంటే పట్టించుకోకుండా ఉండలేరు. అవి కాక మానవ
సంబంధాల విషయంగా వచ్చే మార్పులు మరోవైపు ఉన్నాయి.
మన పరిస్థితులు మారుతున్నాయని మనకి ఎవరూ ప్రత్యేకంగా
చెప్పనవసరం లేదు. కానీ దేశమంతా మారుతున్న పరిస్థితులలో తేడాలు, పోలికలు, అందుకు కారణాలు కూడా తెలిస్తే కొన్ని
సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. జనజీవనం గురించి పట్టించుకోవడం పరిశోధన. అదే
చింపిరి జుట్టు పరిశోధన!
Saturday, August 29, 2026
పిచ్చివాళ్ల స్వర్గం : మరణతరంగం నుంచి
పిచ్చివాళ్ల స్వర్గం
ఐజాక్
బషేవిస్ సింగర్
చచ్చి స్వర్గం
చేరుకుంటే సులభంగా ఉంటుంది. ప్రపంచం గురించి ఆలోచించనక్కర లేకుండా అమృతం తాగుతూ,
రంభ డాన్సు చూస్తూ, హాయిగా బతకవచ్చుననుకునే వాళ్లూ ఉండే ఉంటారు. మంచి వాళ్లకు
బతికినంత కాలం కష్టాలుంటాయి. ఈ భూమి మీద నూకలు చెల్లితే అంతా సుఖమే సుఖం! అని
మనవాళ్లు అనాదిగా నమ్ముతున్నదే. అలా నమ్మిన ఒక కుర్రవాడి పాత్ర చుట్టూ అల్లిన కథ
పిచ్చివాళ్ల స్వర్గం. ఐజక్ బషేవిస్ సింగర్ అనే పోలాండ్ రచయిత రాసిన ఇద్దిష్
కథ ఇది. అసలు కథ ఏమిటంటే...
అనగనగా
ఒక ధనవంతుడు. ఆయన పేరు కదిష్. ఆయనకు ఒక్కడే కొడుకు.ఆ అబ్బాయి పేరు అట్సెల్. వాళ్లింట్లో ఒక దూరపు
చుట్టాల అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె పేరు ఆక్సా. అట్సెల్ అందగాడు. అక్సా కొంచెం
పొట్టి. కానీ అందగత్తె. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. వాళ్లిద్దరూ కలిసి తినేవారూ, కలిసి
తిరిగేవారూ, చదువుకునేవారూ, ఆడుకునేవారు
కూడా. మొగుడు పెళ్లాలాట కూడా ఆడేవారు అప్పుడప్పుడు. పెద్దయింతర్వాత వాళ్లిద్దరికీ
పెళ్లి చేసేయాలని పెద్దలనుకున్న సంగతీ అందరికీ తెలుసు. పెరిగారు, పెద్దవాళ్లయ్యారు.
కానీ అట్సెల్కు ఒక మాయదారి రోగం పట్టుకుంది. ఎన్నడూ కనివిని ఎరుగని మాయరోగం అది.
ఆ అబ్బాయి ఎప్పుడూ తానుచనిపోయాననుకునే వాడు!
తనకలాంటి
ఆలోచనలు ఎక్కడినుంచి వచ్చాయి? ఇంట్లో ముసలి పని మనిషి ఎప్పుడూ కథలు
చెపుతుంది గదూ! ఆవిడే స్వర్గం గురించి చెప్పిందట! స్వర్గానికెళితే కష్టపడవలసిన
పనిలేదు. చదువుకోవలసిన అవసరం అంతకంటే లేదు. అమృతం తాగుతూ హాయిగా బతకవచ్చు!
అట్సెల్
నిజానికి సోమరి. పొద్దున్నే లేవాలన్నా, బడికి పోవాలన్నా, పని
చేయాలన్నా తనకు ఇష్టం ఉండేది కాదు. పెద్దవాడయితే తండ్రి వ్యాపారమంతా తనే
చూచుకోవలసి వస్తుందే మోనన్న భయం కూడా ఉండేదతనికి. మరి సుఖపడాలంటే స్వర్గానికి
పోవాలి. స్వర్గానికి పోవాలంటే చావక తప్పదు. ఇలా ఆలోచించి, ఆలోచించి, చివరకు
ఆ అబ్బాయి తను చనిపోయినట్టు ఊహించడం మొదలుపెట్టాడు.
పాపం
అమ్మా నాన్నా, చాలా బెంగ పెట్టుకున్నారు. అక్సా కూడా ఏడిచింది. అట్సెల్ మాత్రం
ఎంత చెప్పినా వినడు. ‘‘ఏమిటి మీ పిచ్చి? ఒకవేపు నేను చనిపోయి పడి ఉంటే మీరంతా
కబుర్లేమిటి? నన్ను పాతేసెయ్యండి! నేను స్వర్గానికి
వెళ్లిపోవాలి!’’ అనేవాడు.
ఎంతోమంది
డాక్టర్లు ఎన్నో మందులు వేశారు. ఎన్నో రకాలుగా నచ్చ జెప్పడానికి ప్రయత్నించారు.
‘‘నువ్వింకా తింటూ, తాగుతూ, రాయిలా ఉండి చచ్చావంటావేమిటి?’’ అన్నారు. ఇంకేముంది అట్సెల్ తిండి మానేశాడు. నిజంగానే చచ్చే పరిస్థితి
వచ్చింది!
కదిష్
అందరికన్నా పెద్ద డాక్టరుగారి దగ్గరకు వెళ్లాడు. తన కొడుకు సంగతి వివరించాడు. అంతా
విన్న డాక్టరుగారు ‘‘ఏం ఫరవా లేదు! ఎనిమిది రోజుల్లో మీవాడి రోగం కుదురుస్తాను.
కానీ ఒక షరతు! నేను ఏం చేయమంటే అది చేయాలి మీరు! ఎందుకని ప్రశ్నించకుండా!’’
అన్నారు.
ఆయన
ఇంట్లో అందరికీ ఈ విషయం వివరించాడు. ఆ రోజు నుంచే వైద్యం మొదలయింది. డాక్టరుగారు
ఏం చెపితే అది క్షణాల్లో అమలు జరగాలి. అది నియమం. డాక్టర్ అట్సెల్ గదిలోకి
ప్రవేశించారు. నలిగిన గుడ్డలతో చిక్కిపోయిన అట్సెల్. మంచంలో పడి ఉన్నాడు. డాక్టర్
మొహం చిట్లించి, ‘‘ఏమిటది? ఇంకా
ఈ శవాన్ని ఇంట్లో దాచుకున్నారేమిటి? అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయండి!’’ అంటూ
అరిచారు. అట్సెల్ తల్లిదండ్రులు అదిరిపోయారు. ఆ అబ్బాయి మాత్రం మొహం చింకిచాటంత
చేసుకుని ‘‘నేనెప్పుడో చెప్పాను! చూడండి! నేను చనిపోయానో లేదో? డాక్టరుగారు
కూడా అదే మాటన్నారు!’’ అన్నాడు.
డాక్టరుగారి
షరతు జ్ఞాపకం తెచ్చుకుని ఇంట్లో అందరూ శవయాత్రకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇదంతా
చూస్తున్న ఆట్సెల్ సంతోషం పట్టలేక గంతులు వేశాడు. ‘‘ఆకలి! అన్నం కావాల’’న్నాడు.
‘‘స్వర్గంలో తిందువుగానిలే!’’అన్నారు డాక్టరుగారు.
ఆ
ఇంట్లోనే డాక్టరుగారి ఆదేశం ప్రకారం ఒక గదిని స్వర్గంగా మార్చేశారు. గోడలు
కనిపించకుండా తెరలు, నేల కనిపించకుండా తివాచీలు ఏర్పాటు
చేశారు. కథలో స్వర్గంలో లాగ దీపాలు అమర్చారు. సేవకులంతా దేవదూతల్లాగ
అలంకరించుకున్నారు.
అట్సెల్
ని శవపేటికలో పెట్టి ఊరేగింపు మొదలుపెట్టారు. అబ్బాయి నిద్ర పోయింది చూచి, అతడిని
స్వర్గం గదిలో దిగబెట్టారు. నిద్రలేచిన అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘‘నేనెక్కడున్నాను? ఎవరక్కడ?’’ అన్నాడు. దేవత ప్రత్యక్షమయి ‘‘ఇది స్వర్గం మహాప్రభో!’’ అని జవాబిచ్చాడు.
‘‘సరే! నాకాకలిగా ఉంది. ఆహారం, అమృతం కావాల’’న్నాడు అట్సెల్. ముఖ్య
సేవకుడు చప్పట్లు చరవగానే తెరలు తొలగించుకుని సేవకులు బంగారు పళ్లాలలో అన్ని
పదార్థాలు పట్టుకువచ్చి అట్సెల్ ముందు అమర్చారు. బాగా తిని వెంటనే మళ్లీ
నిద్రలోకి జారుకున్నాడు అబ్బాయి. మరురోజు పొద్దున్న నిద్రలేచాడు గానీ, అది
పగలో రాత్రో తెలియలేదతనికి, అట్సెల్ నిద్రలేచాడని గమనించగానే, సేవకులంతా
సిద్ధమయి అచ్చం మొదటి రోజులాగానే ఆహారం ఏర్పాటు చేశారు.
‘ఇదేమి బ్రేక్ఫాస్ట్? కాఫీ, బ్రెడ్
రోల్స్ కావాల’న్నాడతను.
‘కానీ స్వర్గంలో అవేవీ ఉండవు. ఎప్పుడూ
ఇదే తిండి! మహాప్రభో’ అన్నారు సేవకులు.
‘అస్సలిప్పుడేమిటి? పగలా? రాత్రా?’ అన్నాడు
అట్సెల్.
‘అంటే ఏమిటది? ఇక్కడదంతా
ఉండదు!’ అన్నారు సేవకులు.
ఎలాగోలాగ
తిండి అయిందనిపించి, ‘మరి కాలక్షేపానికి నేనిప్పుడేం చేయాలి?’ అని
ప్రశ్నించాడా అబ్బాయి.
‘స్వర్గంలో ఎవరూ ఏమీ చేయరండీ!’ జవాబు.
మిగతా
దేవతల గురించి అడిగితే చాలా దూరం అన్నారు.
‘మరి మా అమ్మా, నాన్నా ఎప్పుడొస్తారు?’ అని
అడిగాడు అట్సెల్.
‘మీ నాన్నగారు ఇరవై ఏళ్ల తర్వాత, అమ్మగారు
ముప్పయి ఏళ్లకు!’ అన్నారు.
‘మరి అక్సా సంగతి ఏమిటి?’
‘ఆమె రావాలంటే యాభయి సంవత్సరాలు కావాలి!’
‘అంటే అప్పటిదాకా, నేనిలా ఒంటరిగా
ఉండవలసిందేనా?’’
‘అంతే మహాప్రభో!’
‘సరే, ఇప్పుడు అక్సా ఏం చేస్తుంది మరి?’’
‘‘కొన్నాళ్లు మీ కోసం ఏడుస్తుంది.
నెమ్మదిగా మరిచి పోయింతర్వాత ఇంకో అందమయిన కుర్రవాణ్ణి చూచి పెళ్లి చేసుకుంటుంది.
భూమ్మీద బతికేవాళ్లు ఎప్పుడూ అంతేగదా!’ అన్నారు సేవకులు. అట్సెల్కు తిండి
ఒంటబడుతున్నది. కానీ చేయడానికి పని మాత్రం లేదు. ఎనిమిది రోజులు అలా గడిచే సరికి
అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది. పట్టలేక సేవకుడితే ‘‘స్వర్గంకన్నా భూమిమీదే
బాగుంటుందేమో!’ అన్నాడు.
‘అయ్యో! ఏం బాగులెండి! చదువుకోవాలి!
పనిచేయాలి! ఒక్కటా? అంతా కష్టం?’’ అన్నాడు సేవకుడు.
‘‘ఆ ఏం కష్టంలే? ఇలా
పడి ఉండేకన్నా కట్టెలు కొట్టినా సుఖంగా ఉంటుంది! అయినా ఇలా ఎన్నాళ్లుండాలి నేను’
అన్నాడు ఆ అబ్బాయి.
‘ఎప్పటికీ ఇలాగే’ జవాబు.
‘ఛీ! అలాగయితే నేను ఛస్తాను!’
‘చచ్చినవాళ్లు మళ్లీ చావడానికి
వీల్లేదు!’
చింతలో
పడ్డాడు అట్సెల్.
కొన్ని
క్షణాల తరువాత ఒక సేవకుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాప్రభో! తప్పు కాయాలి. తప్పు ఎక్కడ
జరిగిందో తెలియదు. కానీ మీరు చనిపోలేదు! ఇంకా బతికే ఉన్నారు!’ అన్నాడు.
ఎగిరి
గంతేసి అట్సెల్ ‘ఏమిటి? నేనింకా బతికే ఉన్నానా? మరి
నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? వెంటనే మా ఇంటికి తీసుకెళ్లండి!’
అన్నాడు.
సేవకులు
తన కళ్లకు గంతలు కట్టి, కాసేపు అటూయిటూ తిప్పి, చివరకు
ఇంట్లో అందరూ ఉన్న గదిలోకి తెచ్చారు. గంతలు విప్పారు. మళ్లీ ప్రపంచం చూచిన అట్సెల్
సంతోషం పట్టలేకుండా ఉందప్పుడు. బ్రతకడమెంత హాయిగా ఉంటుందో అర్థమయిందతనికి. అక్సాని చూచి, ‘నీవింకా
ఎవరినో పెళ్లి చేసేసుకుని ఉంటావనుకున్నాను! నా అదృష్టం ఇంకా ఇక్కడే ఉన్నావు!’
అన్నాడు.
వాళ్లిద్దరి
పెళ్లి ఘనంగా జరిగింది. కానుకలు, కట్నాలు కూడా ఘనంగా వచ్చాయి. సోమరితనం
మానేసి, అట్సెల్ వ్యాపారం మొదలు పెట్టాడు. బాగ్దాద్, భారతదేశమూ
తిరిగాడు. చాలాకాలం తర్వాత గానీ, అట్సెల్కు డాక్టరు చేసిన వైద్యం
గురించి తెలియదు. పిచ్చివాళ్ల స్వర్గం గురించి అతను తన పిల్లలకు, వాళ్లకూ కథలుగా
చెపుతూ ఉండేవాడు.
కథకు
ముగింపు మాత్రం ఎప్పుడూ ఒకటే. ‘నిజంగా స్వర్గంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు!’
అని.

