Sunday, July 19, 2026

దారి దోపిడీ : మారూన్ అబ్బూద్

 


దారి దోపిడి

 

మారున్ అబ్బూద్ (లెబనాన్)

 

బూ ఖట్టర్ దుమ్ము కొట్టుకుని, జుట్టు, గుడ్డలు రేపుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. రైఫిల్ ను దాని స్థానంలో వెళ్ళాడదీశాడు. పిస్టల్ పక్కనే ఉన్న గూట్లో పెట్టాడు. చొక్కాలో, జేబుల్లో, పటకాలో దాచుకున్న వస్తువులను షెల్ఫ్ లోని బండమీద బోర్లించాడు. కాళ్లు ముడుచుకుని కూచున్నాడు. పొయ్యి పక్కనే అతను మామూలుగా కూచునే స్థలం అది.

భార్య బర్ సిత్తా ఒక జగ్, ఒక పళ్లెం తీసుకుని వచ్చింది. అతను అక్కడే తల వెంట్రుకలు, ముఖం కడుక్కోసాగాడు. అయితే అంత సేపు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఆపి ఆమెను ఒక ప్రశ్న అడుగుతాడు. ముఖం మీద నరుగును పట్టించుకోడు. పైకి చూస్తే, అది అతని కళ్ళలోకి పోయి మండుతుంది. కళ్ళు మూసుకుని మళ్లీ తెరుస్తాడు. మాటలు ఆగకుండానే, కళ్ళు మాత్రం మామూలు కావాలి మరి. అట్లా చాలా సేపు అతను మాట్లాడాడు. బర్ సిత్తా నీళ్ళు పోయడంలో కొంత పొరపాటు జరిగితే, అతను ఒళ్లంతా కదుపుతూ కేకలు వేస్తాడు. అంతలోనే తప్పు చేశానని తెలుసుకొని, క్షమా ప్రార్ధనలు మొదలు పెడతాడు. ముఖం తుడుచుకుంటూ కూడా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. సమాధానం గురించి పట్టించుకోడు. అందుకోసం ఎదురు చూడడు కూడా. ఇక మీసాలు మెలిపెట్టే సమయం వచ్చింది.. జానపద కథలో ఒకతనిలాగా అతను వాటిని సర్దుకుంటాడు. అప్పుడు నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరం ఉంటుంది.

కొంతసేపు తరువాత కుటుంబం అంతా ఎత్తు ఉండని భోజనాల బల్లచుట్టూ చేరుకున్నారు. ఒక్కొక్కరికి ఒక పెద్ద రొట్టె, మడతపెట్టిన చేతిగుడ్డలాగ ఉండేది, అందింది. దాన్ని వాళ్లంతా తొడ మీద పెట్టుకుంటారు. తిండి తినే సమయంలో మాట్లాడడానికి తండ్రి అనుమతించడు. ఎవరయినా ఒక ప్రశ్న అడిగితే, సూటిగా జవాబు అందుతుంది. మిగతావాళ్లంతా తమ భోజనంమీద మాత్రమే దృష్టిపెట్టాలి. ఒక గిన్నెలో అత్తిపళ్ళు, లేదా మొలాసెస్ ఉంటాయి. అక్కడ మాత్రం చేతులు కలిసే అవకాశం ఉంటుంది.

తిండి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత బూ ఖట్టర్ సలహాలు, నియమాలు చెబుతాడు. ఆరోజు జరిగిన తప్పుల గురించి చెబుతాడు.(బూ అంటే అబూ, అంటే తండ్రి.) ముందు భార్యకు, తర్వాత పిల్లలకు. చివరకు అతను తన ఇద్దరు సేనానాయకుల వేపు తిరుగుతాడు. వాళ్లే అతని కొడుకులు. వాళ్ల పేర్లు ఖట్టర్, షల్హూబ్. పనిచేయవలసిన పద్ధతి చెబుతాడు. ఆనాడు వాళ్లు ఏదైనా పొరపాట్లు చేసిఉంటే వాటిగురించి విమర్శ వినిపిస్తాడు.

నువ్వు వెనకనుంచి అతని వద్దకు వెళ్లావు. ముందు నుంచి వెళ్లి ఉండవలసింది. సొమ్మంతా యిమ్మని అడిగి వేచి ఉన్నావు. అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తితే మరింత బాగుండేది. అతడిని కొట్టి ఉండాలి. కనీసం గట్టిగా అరచి ఉండాలి. చచ్చేట్టు భయపెట్టి ఉండాల్సింది. ఇక షల్హూబ్, నీ సంగతి అతను కొనసాగించాడు. నేను చెప్పినట్టు నాలుగు దారులు కలిసే చోట నిలబడితే, ఆ పందిగాడు తప్పించుకుపోయేవాడు కాదు. వాడి దగ్గరే డబ్బంతా ఉందని పందెం వేయవచ్చు. పోనీ లే, ఇప్పుడు అనుకుని లాభంలేదు. మళ్లీ అవకాశం వస్తుంది. అప్పుడన్నా జాగ్రత్తగా ఉండు.

ఇవాళ ఏమీ కలిసి రాలేదు, అన్నాడు అతను భార్యవేపు తిరిగి. మా మీద నీకు కోపం వచ్చి ఉండాలి. ఉమ్ ఖట్టర్ మెల్లగా నవ్వింది. (ఉమ్ అంటే అమ్మ అని అర్థం). బూ ఖట్టర్ మరేవో విషయాల గురించి మాట్లాడాడు. నిట్టూర్చాడు. ప్రార్థనకు సిద్ధం కండి, అన్నాడు. అంతా మోకరిల్లారు.

అతను నిటారుగా స్తంభంలా లేచి నిల్చున్నాడు. కొడుకుల్లో ఒకడు మోకరిల్లిన తీరు పద్ధతిగా లేదు. వాడిని వెళ్లి పొమ్మ న్నాడు. తండ్రి, పెద్ద కొడుకుల నాయకత్వంలో ప్రార్థన జరిగింది. కన్నెమాత ప్రార్థన అయింది. బూ ఆమెకు జయం అంటూ,  హెయిల్ మేరీ చెప్పాడు. మరుసటి రోజు అదృష్టం కలిగించమని ఆమెను ప్రార్థించాడు.

అతనిక  నేరుగా పడక చేరుకున్నాడు. వెల్లకిలా పడుకున్నాడు. దుప్పటి కప్పుకుంటూ బర్ సిత్తా! అని పిలిచాడు. మాకోసం రేపు మధ్యాహ్నానికి తిండి కట్టి ఉంచాలి. శుక్రవారం మధ్యాహ్నభోజనం! మరువ వద్దు. ఆలూ ఉడికించి పెడితే చాలు. కొంచెం సేపు తర్వాత దండు మీదనుంచి తల పైకి ఎత్తాడు. నా ప్యాంట్ కూడా చిరిగింది. విన్నావా? ఏమంటావు? నా కోటు పిగిలిపోతున్నది. వాడు కనిపించాలి గాని! ఈసారి వదలను గొణుగుతున్నాడు.

దుప్పటిలో కొంతసేపు మాత్రమే గడిచింది. ముడతలు పడ్డ బట్టతల మళ్లీ బయటకు వచ్చింది. కత్తులు సానపెట్టండి. తుపాకులు శుభ్రం చేయండి. తుపాకీ మందు ఆరబెట్టండి. మళ్లీ ఇవాళ వలె జరగకూడదుఅన్నాడు కొడుకులతో.

ఆశ్చర్యంగా ఉమ్ ఖట్టర్ ఏమిటి సంగతి?’ అన్నట్టు సైగ చేసింది. తండ్రి నిద్రపోయేదాకా ఆగమని కొడుకు సైగ చేశాడు. కొంతసేపు తర్వాత అబ్బాయి వివరించాడు. ఇవాళ ఇద్దరు మనుషులు దొరికారు. ఒకడిని దోచాము. రెండవ అతను తప్పించుకుపోయాడు. అతను మంచి ధైర్యం, ఉత్సాహం గల యువకుడు.

అబ్బాయి ఒక వెండి ఉంగరం చూపించాడు. దానిమీద అక్షరాలు చెక్కి ఉన్నాయి. దాన్ని చూడగానే తల్లి ముఖంలో కోపం కనిపించింది. అది పాపం ప్రియురాలికి కానుకగా చేయించింది. ఎలా దొంగిలించారు? అన్నది. ఖట్టర్ తండ్రి వైపు చూపించాడు. నాకు కాదు. ఆయనకు చెప్పు, అన్నాడు. నేను కాదంటే, జాలి గురించి చెబితే, కోపగించుకుంటాడు, తిడతాడు. ఏదో అడ్డు చెపుతావు. వాళ్ల పెద్దలు పాడుగాను! మన పని మనం చేయాలి అంటాడు. అది అబ్బాయి వివరణ.

త్వరలోనే ఇల్లు ప్రశాంతమయింది. బూ ఖట్టర్ గురకలు మాత్రం లయగా పడి లేస్తున్నాయి. అతను నిద్రలో మాట్లాడుతున్నాడు. ఎవరినో భయపెడుతున్నాడు. లొంగిపొమ్మంటున్నాడు. సోదా చెయ్యి! అని కొడుకుకు చెబుతున్నాడు.

అతను మామూలుగానే ఉదయాన్నే లేచాడు. చాలాసార్లు క్రాస్ చేసుకున్నాడు. పడకలోనే కన్నెమాత ప్రార్థనలు చేశాడు. అది చాలాకాలం సాగుతుంది. తప్పులు క్షమించమని ఆమెను ప్రార్థిస్తాడు. క్షమాపణలు చెబుతాడు. దొరికిన సొమ్ములో పావుభాగం యిస్తానని మొక్కుకుంటాడు. చర్చ్ లో షాండెలియర్, ఒక కొవ్వొత్తి స్టాండ్, ధూపం లేదా కొవ్వొత్తులు ఇస్తానని మొక్కుకుంటాడు. నిజంగా మంచి లాభం దొరికితే ఏకంగా పోత గంట చేస్తానంటాడు.

గంటసేపు ప్రార్థనలు సాగిన తర్వాత వాళ్లు దారిలో తమ మామూలు చోటుకి చేరుకుంటారు. తిండి మూట పట్టుకుని కడగొట్టు కొడుకు చివరన వస్తున్నాడు.

బూ ఖట్టర్ తన జపమాల తేవడం ఎన్నడూ మరిచిపోడు. అతని జపం జరుగుతూనే ఉంటుంది. ఒక పూస తప్పినట్టు అనుమానం వస్తే చాలు, మళ్ళీ లెక్కింపు మొదటికి చేరుతుంది. ప్రార్థన లెక్క చక్కగా ఉండాలన్నది అతని కోరిక. అందులో పొరపాట్లు ఉండకూడదు. మరి అనుగ్రహం అందే దారి మరొకటి గాని ఉందా?

అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. విధి తన ముందుకు ఇవాళ ఎవరిని పంపుతుంది, అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు. అంతలో ప్రార్థన గంట మోగింది. అతను క్రాస్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళనందుకు క్షమాపణలు చెప్పుకున్నాడు. మనసులో మాత్రం తాను అక్కడే ఉన్నట్టు భావించాలి, అని వేడుకున్నాడు.

సూర్యోదయం సమయానికి తన మాటు దగ్గరకు చేరుకున్నాడు. పూజ గంట అదేపనిగా మోగుతున్నది. ఫెజ్ టోపీని నుదురు మీదనుంచి కొంచెం వెనుకకు కదిలించాడు. భూమి మీద మోకరిల్లాడు. కొడుకులతోబాటు, ప్రార్థన సాగించాడు. మళ్లీ అంతా పొంచి ఉన్నారు. నిత్యం సంపాదన కొరకు ఎదురు చూస్తున్నారు. వర్జిన్ కనికరిస్తుందని బూ ఖట్టర్ కు నమ్మకంగా ఉంది.

ఎవరో పాడుతూ రావడం వినిపించింది.

బూ ఖట్టర్ ఇద్దరు కొడుకులను సిద్ధంగా ఉండమని సైగ చేశాడు. వస్తున్న మనిషి భద్రంగా ఉన్నానని సంతోషంగా ఉన్నాడు. చేతిలో జపమాల పట్టుకుని ప్రార్థన చేస్తున్న మనిషి అతనికి కనిపించాడు. గతుక్కుమన్నాడు అతను. భయం అతనికే ఆశ్చర్యం కలిగించింది. కనిపించిన మనిషి ప్రార్థనలో ఉన్నాడు. ధైర్యం నటిస్తూ అతను నమస్కారం చేశాడు గౌరవంగా. బూ ఖట్టర్ తన ఎర్రని ఉబ్బిన కళ్ళతో కోపంగా చూచాడు.

ఆ చూపులను తప్పించుకుని అతను ముందుకు నడుస్తున్నాడు. జపమాల పైకెత్తి బూ ఖట్టర్ ఆగమని సైగ చేశాడు. అతను పట్టకుండా నడిచి పోతున్నాడు. చూడూ! తరువాత బాధపడే పని ఏది నా చేత చేయించకు. నా ప్రార్థన ముగియనీ! అతను గట్టిగా అన్నాడు.

తాను అతని చేతికి చిక్కిపోయినట్టు ఆ మనిషికి అర్థమయింది. అతనే! అనుకున్నాడు ఆ వ్యక్తి.

బూ ఖట్టర్ ప్రార్థన సాగించాడు. వ్యక్తి వేచి ఉన్నాడు. చివరకు దగ్గరకు వచ్చాడు. వేలెత్తి చూపిస్తూ, ఉన్నదంతా వలిచి ఇచ్చేయ్! అన్నాడు బూ ఖట్టర్.

నా దగ్గర ఏమీ లేదు. బూ ఖట్టర్

నీ దగ్గర ఏమీ లేదా? నేను బూ ఖట్టర్ అని ఎవరు చెప్పారు?’

నేను గుర్తుపట్టాను

దేవుడు నీ కళ్ళు పోగొట్టా! సరే, ఉన్నదంతా ఇచ్చేసెయ్!

పిల్లల కొరకు పిండి కొందామని పది మజీదులు అరువు తెచ్చుకున్నాను.

దేవుడు నీకు మళ్ళీ యిస్తాడు గాని, అవి ఇచ్చేయ్!

నన్ను వాటిని ఉంచుకోనీ, కన్నెమేరీ పేరున!

బూ ఖట్టర్ తల ఊపాడు. డబ్బు యిమ్మని సైగ చేశాడు.

బోలెడంత ఏడుపు, అరుపు, వేడుకోలు తరువాత మేరీమాత పేరున డబ్బు పంచుకోవడానికి బూ ఖట్టర్ సరేనన్నాడు. జరగవలసిన దాంట్లో సగమే జరిగిందన్న సంతృప్తితో ఆ మనిషి గొణుగుతూ వెళ్ళిపోయాడు.

బూ ఖట్టర్ డబ్బుతో క్రాస్ చేసుకున్నాడు. తర్వాత జేబులో వేసుకున్నాడు. ఏం బోనీ! అన్నాడతను పవిత్రంగా.

కన్నెమేరీని ప్రార్థిస్తూ అతను ఆకాశం వైపు చూచాడు. నీ కళ్ళ కోసమే అతనిమీద దయ చూపించాము. మరి మాకు ఏదో ఇవ్వు, అన్నాడతను.

గాడిదలను అదిరిస్తూ కొంతమంది రావడం కనిపించింది. ధరల గురించి, వాతావరణం గురించి, మరెన్నో సంగతుల గురించి వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అదిగో మన అదృష్టం, వస్తున్నది అన్నాడు బూ ఖట్టర్ కొడుకులతో. బోలెడంత మంది ఉన్నారు అని కూడా అన్నాడు.

ఖట్టర్ రైఫిల్ సిద్ధం చేశాడు. షల్హూబ్ కత్తి తీశాడు. శత్రువు ఎదుట ఉన్నట్టే దాన్ని ఎత్తి పట్టుకున్నాడు.

గాడిదలను తోలుతూ ముగ్గురు మనుషులు ఉన్నారు. బూ ఖట్టర్. గట్టి కేక వేశాడు. అది నదిలో ప్రతిధ్వనించి మరింత గట్టిగా వినిపించింది. సరే పెద్దమనుషులూ! ఉన్నదంతా ఇచ్చేయండి! లేదంటే.... ముగ్గురిలోనూ ఒకడు పొగరు మోతు కుర్రాడు. మొరటుగా ఏదో అన్నాడు. అమ్మను తిట్టాడు. వాడిని భయపెట్టడానికి బూ ఖట్టర్ తుపాకీ పేల్చాడు. అతనూ పేల్చాడు.

కానీ చివరి షాట్ మాత్రం బూ ఖట్టర్ రైఫిల్ నుంచి వచ్చింది. సంగతి తేలిపోయింది. యువకుడు పడిపోయాడు. మిగతా వాళ్ళు లొంగిపోయారు. వాళ్ల దగ్గర ఉన్నదంతా దోపిడీ అయింది. చివరకు దుస్తులు, తిండి కూడా!

సంతోష దినాన సంపాదన లెక్కించడానికి బూ ఖట్టర్ కూచున్నాడు. ముప్ఫయి అయిదు బంగారం ముక్కలు, కొన్ని రియాల్స్, నాణాలతో నిండిన పెద్ద సంచి ఒకటి. అది చాలా బరువుగా ఉంది. ఎత్తడానికి బూ ఖట్టర్ మూలగ వలసివచ్చింది.

కొల్లగొట్టిన మిగతా వస్తువులను చూచాడు. నగిషీ గల కంచు గొడ్డలి, ఒక కత్తి, ఒక మాంసం చీల్చే కత్తి, మరొక రైఫిల్.

దేవుడు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా అతను నేలను ముద్దాడాడు. మీరు నేలను ముద్దాడండి! కృతజ్ఞత చెప్పాలని కూడా తెలియదు! కొడుకులతో అన్నాడు. డబ్బు, ఆయుధాలు. అదృష్టం అంటే అది! అతను నవ్వాడు.

దొంగ సొమ్మును చూస్తూ అతను కన్నెమేరీతో సరదా మాటలు మొదలు పెట్టాడు. అమ్మా, ధన్యవాదాలు! దేవుడు నీకు దీర్ఘాయువు ఇచ్చుగాక! ఇవాళ నీవు బూ ఖట్టర్ కు వాని అవకాశం ఇచ్చావు. ఎక్కడా లేని గంట చేయిస్తాను. నీకు! పిల్లలూ, వాళ్ల తిండి సంచి విప్పండి! తిండి తీయండి.

నది మధ్యలో ఒక బండ మీద ముగ్గురూ కూచున్నారు. విజయం తరువాత ఎక్కడలేని ఆనందంతో ఆకలితో బాగా తిన్నారు. చిన్నవాడు దొంగిలించిన సంచి నుంచి జున్ను ముక్క తీసుకున్నాడు. బూ ఖట్టర్ వాడి చెంప వాయించాడు.

గౌరవం చూపించాలి, గాడిదా! ఇవాళ శుక్రవారం! కొవ్వు ఎట్లా తింటావూ! వాళ్లు ఈ సంగతి పట్టించుకోలేదు కనుకనే మనకు దొరికారు, అన్నాడతను.


Friday, July 17, 2026

లోకాభిరామం : ఏకాంతమూ - ప్రశాంతమూ


ఏకాంతమూ... ప్రశాంతమూ...

ఈ ప్రశాంత ఏకాంత సాయంత్రంలో నిదురించు జహాపనా అంటాడు కవి. సాయంత్రం బాగుందట. అంత చక్కటి సాయంత్రంలో ఏకాంతం కూడా దొరికిందట. అయితే మరి అప్పుడు పడుకోవడంలో అర్ధం ఏమిటి? నాకు అర్ధం కాలేదు. ఏకాంతంలో మన వ్యక్తిత్వం నిస్సందేహంగా బయట పడుతుంది అంటాడు తాత్వికుడు. గాలిబ్‌ తన కవితలో ఒక చోట, దిక్కు తెలియని ఏదో ఒక చోటి నుంచి కొత్త ఆలోచన వచ్చేస్తుంది, గాలిబ్‌ కేవలం ఆ భావనలను కాగితం మీద పెడతాడు, అంటాడు. అంటే ఆలోచనలు తమవి కావు అంటున్నాడు అతను. ఏకాంతంలో ఉంటే మనిషి మనసు రెండు అంతస్తుల్లో పనిచేస్తుంది. ఒకటి మనకు తెలియకుండానే కొత్త ఎత్తులకు ఎదుగుతుంది. నాకు ప్రతినిత్యం రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర రాదు. ఏదో ఒక  అంశాన్నితీసుకుని ఆలోచన మొదలవుతుంది. చాలా సందర్భాలలో అది ఉపన్యాసంగా మారుతుంది. నాకు నేనే ఉపన్యాసం చేసుకుంటాను. అందులో అనుకోకుండా కొన్ని కొత్త ఆలోచనలు కనబడతాయి. చటుక్కున లేచి, లైట్‌ వేసి, మాటలు కాగితం మీద రాసి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాలిబ్‌ అనుభవమే ఇక్కడ నాకు కూడా కలుగుతున్నట్టు అర్ధం కదా. తన కవితలకు కావలసిన భావనలు ఒంటరితనంలో వచ్చాయని ఆయన భావించాడు. అంతుపట్టని సృజనాత్మకతలోనుంచి, ఆలోచనలోనుంచి, అవి కొత్తగా తలెత్తాయి. రచయితలకు చాలామందికి రాతకు కూర్చునే ముందు కొన్ని పరిస్థితులు అవసరం అనుకుంటారు. నాకు కూడా కొంతవరకు అవసరాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఏకాంతం కావాలి. కనీసం నిశ్శబ్దం కావాలి.

చిన్నప్పటి నుంచి నేను రాస్తుంటే, మా ఇంట్లో వాళ్ళు గోల చేయకుండా ఉండడం నాకు మొదటి నుంచి అలవాటు. పిల్లలకు కూడా నా సంగతి అర్థమయింది. ఏకాంతం కావాలి నిజమే. కానీ అది అనుకుంటే దొరికేది కాదు. దొరికినప్పుడు దాన్ని అనుభవించడం కూడా వీలు కాదు. మనిషి సంఘజీవి అని చాలా సులభంగా చెప్పేస్తారు. కానీ ఈ సంఘం మనిషిని తన మానాన తాను ఉండనివ్వదు. అందరూ కలిసి అర్ధం లేని కొన్ని ఆచారాలను తయారుచేసి అందరి తలకు చుట్టూ చుడతారు. కనుకనే అంత గోలలోనూ కవి, రచయిత ఏకాంతాన్ని కోరుకుంటాడు. గాలిబ్‌ కు ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయి? అందరికీ అది వీలవుతుందా?

నేను రేడియోలో ఉద్యోగం చేశాను. అక్కడ సమయాన్ని బట్టి తప్పకుండా రాయవలిసిందే. కార్యక్రమాలు చేయవలసిందే. నాకు మూడ్‌ లేదు, ఏకాంతం అంతకంటే లేదు, కనుక నేను రాయలేను, అని కూర్చుంటే ఉద్యోగం ఉట్టికి ఎక్కుతుంది. కనుక అవసరం కొద్దీ రాయడం అలవాటయింది. అయితే ఆ రాత వ్యక్తిగతంగా ఉండదు. అంత గొప్పగా కూడా ఉండనే ఉండదు. అక్కడి పరిస్థితులకు అది సరిపోతుంది. అంతేగాని నిజమైన భావుకతలో నుంచి, నిజమైన సృజనాత్మకత లోనించి, నిజమైన మార్మికత లోనుంచి మాటలు పలకాలంటే ఏకాంతం చాలా అవసరం.

ఒంటరితనాన్ని ఎవరికి వాళ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇరువురము కలిసి ఒంటరిగా నడుచుచు సాగితిమి అన్న పద్ధతిలో అందరి మధ్యలోను ఏకాంతాన్ని అనుభవించగలగాలి. అప్పుడు గాలిబ్‌ తీరుగానే కలం పట్టుకున్న ఎవరికైనా కాస్తంత తెలివి సులభంగా ముందుకు సాగుతుంది. కనుకనే ఏకాంతం రచయితలకు అసలైన అవసరం అంటాడు ఒక మహానుభావుడు. ఆయన అనుభవం కొద్ది ఆ మాట చెప్పినట్టు ఉన్నాడు చాలామందికి ఒంటరితనం నచ్చదు. నాకు ఒంటరితనం నచ్చుతుంది కానీ మరీ ఒంటరిగా ఉంటే అదేదో ఒక రకమయిన ఒంటరితనం మొదలవుతుంది. మనుషులు ఉండాలి. నా దగ్గర ఉండకూడదు. మనుషులు ఉండాలి, వాళ్లు మాట్లాడకూడదు. మనుషులు నన్ను పలకరించ కూడదు. నేను కూడా వాళ్ళను పలకరించను. మనుషులు ఉండాలి. తలుపులు అన్నీ మూసుకున్నా సరే ఏదో ఒక కిటికీ తెరిచి ఉంచు. ప్రపంచాన్ని నీ దగ్గరకు వస్తానంటే ఆపకు. అంటూ ఎప్పుడో ఒకసారి కవిత రాసుకున్నాను. బతుకంతా ఒంటరిగా ఉండనవసరం లేదు. దినంలో కనీసం కొన్ని గంటలు ఏకాకిగా ఉండగలగాలి. నాకు ఉద్యోగం చేసుకున్నంత కాలం ఈ అవకాశం కలగలేదు. కావాలనే ఉద్యోగం మానుకున్నాను. ఆ తరువాత ఒంటరితనమే ఒంటరితనం. ఇంట్లో వాళ్ళంతా పొద్దున్నే ఎవరి దారిన వాళ్లు పోతారు. పనిలేని వాడిని కనుక నేను ఇంట్లో మిగులుతాను. బూజులు చూస్తూ, పగుళ్లు లెక్కిస్తూ, ఆవులింతలు తీస్తూ రోజులు గడపవలసిన అవసరం లేదు. అందరూ వెళ్ళిపోయిన మరుక్షణం నా ప్రపంచం పరుచుకుంటుంది. నా పుస్తకాలు బయటికి వస్తాయి. నా కాగితం, కలాలు నాట్యం చేస్తాయి. నా చేత పిల్లి మొగ్గలు వేస్తాయి. రకరకాల రచనలు బయట పడతాయి. కనుకనే చూస్తుండగానే నేను రాసిన పుస్తకాలు తామరతంపరగా సెరిగి మూడంకెలకు చేరుకునే పరిస్థితి వచ్చింది.

అందరికీ ఏకాంతం ఇంత సులభంగా దొరకదు. చాలామందికి ప్రయత్నించినా సరే ఒంటరితనం దొరకదు. ఈ సంగతి నాకు తెలుసు. ఇంటికి తాళం వేయాలని నాకు కోపంగా వుండేది. తిరిగి వచ్చిన తర్వాత తాళం తీయాలని పిచ్చి కోపం వచ్చేది. కానీ సంవత్సరం దాకా ఇంటికి తాళం వేయవలసిన అవసరం లేకుండా పోయినప్పుడు నాకు తాళం గురించి, ఒంటరి తనం గురించి, అందులోని సౌకర్యం గురించి అర్ధం అయింది. అయితే అందరూ నాలాగే ఏకాంతం కోరుకునే వారు కారని కూడా నాకు అర్ధం అయింది. ఏకాంతం మనిషిని మార్చేస్తుంది. మనిషికి కొత్త దారులు చూపిస్తుంది. నేను టైనింగ్‌ క్లాసులో ఒక కథ చెబుతూ ఉండేవాడిని.

ఇద్దరు మిత్రులు ఒంటరితనం గురించి పందెం వేసుకున్నారు. వారిలో ఒకతను ధనికుడు. రెండో మనిషి మామూలు వాడు. మామూలు మనిషి, నేను ఎంతకాలమైనా ప్రపంచంతో పనిలేకుండా ఫోన్‌ లు టీవీలు లేకుండా, పత్రికలు కూడా లేకుండా గడపగలను, తిండి ఉంటే చాలు, అన్నాడు. ధనికుడు ఊరి బయట నాకు ఒక ఇల్లు ఉంది. అందులో నీకు వసతి ఏర్పాటు చేస్తాను. కిటికీలో నుంచి ఎప్పటికప్పుడు నీకు తిండి నీళ్ళు అందుతాయి. అంతేతప్ప మనుషుల అలికిడి కూడా వినిపించదు. ఆరు నెలలు నీవు కనుక ఆ పద్ధతిలో మా ఇంట్లో ఒంటరిగా ఉన్నావంటే నా ఆస్తి సగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. బీద మనిషి సరే అన్నాడు. ముహూర్తం నిశ్చయమైంది. అతడిని ఇంట్లో పెట్టి తాళం వేశారు. తిండి అందుతున్నది కాలం సాగుతున్నది. ఎక్కడ ఏ తేడా రాలేదు. ఐదున్నర నెలలు గడిచాయి. ధనవంతునికి వణుకు మొదలైంది. సగం ఆస్తికి కాలం చెల్లింది అనుకున్నాడు. ఐదు రోజులు మిగిలాయి. అతను కావలసిన కాగితాలు తయారు చేయించాడు. మిత్రుడు ఇంతకాలంగా గడిపిన ఇంటి దగ్గరికి వెళ్లి దూరం నుంచి చూచి వచ్చాడు. ఎక్కడ ఏ తేడా లేదు. బయట ఒక వాచ్‌ మన్‌ ఉంటాడు. లోపలి మనిషి వచ్చి పిలిస్తే గనుక తలుపు తీయాలి అని అతనికి ఆదేశాలున్నాయి. బయటి వారి పేరున మాత్రం తాళాలు తీయకూడదు. చివరి రోజు వచ్చింది.

మరుసటి నాటి ఉదయం వెళ్లి చూస్తే తాళాలు వేసినవి వేసినట్టు కనుక ఉంటే, ఆ మనిషి లోపలే ఉంటే అస్తి సగం అతనికి అందించాలి. కాగితాలతో సహా పంతం వేసిన మిత్రుడు ఉదయం అక్కడికి చేరాడు. ఆశ్చర్యంగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే మిత్రుడు లేడు. వాచ్‌మన్ తో వాకబు చేస్తే అయ్యా, ఆయన తెల్లవారుజామున తలుపు తీయమన్నాడు. నేను తలుపు తీశాను. ఆయన ముఖంలో గొప్ప వెలుగు కనిపించింది. గడ్డం కూడా పెరిగి ఉంది. జుట్టంతా పెరిగి ఉంది. ఆయన మారు మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను తప్పు చేయలేదు కదా అన్నాడు అతను. లోపలికి వెళ్ళి వెతికారు. పందెం వేసిన మిత్రుడు ఉన్న గదిలో ఒక కాగితం దొరికింది.

ఇన్నాళ్లు ఏకాంతంగా ఉండి నాకు ప్రపంచం గురించి ఆలోచించే అవకాశం అందించావు. భవిష్యత్తు గురించి నాకు గొప్ప ప్రణాళికలు దొరికాయి. నీ డబ్బుతో నాకు పనిలేదు.నా మార్గాన వెళ్ళిపోతున్నాను. మిత్రమా, నీకు ధన్యవాదాలు, అని రాసి ఉంది. మనిషి మీద ఒంటరితనం ప్రభావం అలాగుంటుంది.

ఈ పెద్ద మనిషికి ఏకాంతంలో తన గురించి తనకు తెలిసిపోయింది. నిజానికి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త మాట పుట్టాలంటే మనసులో కావలసినంత ఏకాంతం ఉండాలి. మన మెదడులో కోట్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. అవి అనుక్షణం మిగతావాటితో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాయి. కనుక మెదడులో పెద్ద గోల ఉంటుంది. ఆ గోలలో ఒక కొత్త ఆలోచన వచ్చినా సరే కలగలిసి పోతుంది. జాతరలోని గందరగోళంలో కూడా ఎవరో మన పేరు పిలిస్తే వినిపించి నట్టు, మెదడులోని గందర గోళంలో కొత్త ఆలోచన బయటకు రావడానికి కొంత దారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఏకాంతం. ఇది సూర్యకాంతం, అయస్కాంతం కాదు. అసలు సిసలైన ఒంటరితనం. అందరి మధ్యనా కూడా అలవాటు చేసుకోవలసిన ఒంటరితనం. నాకు కుదిరింది అని అనిపిస్తున్నది. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? లేకుంటే చించి చూడండి!


 

Sunday, July 12, 2026

Poem of Ghalib in Urdu English and Telugu


Poem of Ghalib

in Urdu Fnglish and Telugu ( One about a place where he wanted to live and die)










 

Friday, July 10, 2026

సూక్ష్మప్రపంచం - మన శరీరం లోపల పైన సూక్ష్మజీవుల గురించి


సూక్ష్మప్రపంచం

            ఈ విశ్వం చాలా విశాలమయినది. దాని పొడవు, వెడల్పుల కొలతలు మన ఊహలకు కూడా అందవు. అందులో ఉన్న గెలాక్సీల సంఖ్య ఆలోచనలకు అందదు. లెక్కలేని ఆ గెలాక్సీలలో ఒక్కొక్క దాంట్లో లెక్కలేన్నని చుక్కలు అంటే నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో సూర్యుడు కూడా ఒకటి. ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. వాటిలో భూమి ఒకటి. ఆ భూమి మీద బిలియన్‌ల సంఖ్యలో జనం ఉన్నారు. అందులో మనం ఉన్నాము. ఈ లెక్కన చూస్తే విశ్వంలో మనం సూక్ష్మజీవులం. ఇక మన శరీరం మీద ట్రిలియన్‌ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నాయని విషయం తెలిసినవారు చెబుతున్నారు. అంటే అవి ఎంత చిన్నవో మనం ఊహించలేము అని అర్థం. వాటిని పట్టించుకునేవాళ్లు చాలా కాలంగానే కొందరు ఉన్నారు. లూయి పాశ్చర్ అనే పెద్దమనిషి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. సూక్ష్మజీవులను పరిశీలించడం అన్న విషయాన్ని ఒక ప్రత్యేకరంగంగా నిలబెట్టిన ఘనత అతనిది అనవచ్చు. ఒక భూతద్దం చేత పట్టుకుని కనిపించిన ప్రతి వస్తువును పరిశీలించేవాడట. తిండి పెడితే తినడంకన్నా పరిశీలన ముఖ్యం అనుకునే వాడు. పక్కింటి వాళ్లు భోజనానికి పిలిస్తే భూతద్దం పట్టుకుని వెళ్లే వాడు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు పిలవడం మానేశారు.

            సూక్ష్మజీవులు కనిపించవు, కనుక అవి లేవు, అనుకుంటే మనకన్నా అమాయకులు మరెవరూ ఉండరు. అవి మన మీద, చుట్టుపక్కల, ఎటుచూస్తే అటు, ఆలోచనకు అందని సంఖ్యలో అంతటా నిండి ఉన్నాయి. మనం పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. సబ్బుపెట్టి వళ్లంతా తెగ తోముకొని వుండవచ్చు. మన వంటిమీద గుంపులు గుంపులుగా సెంటిమీటర్ చర్మానికి లక్షల సంఖ్యలో బాక్టీరియా ఉండనే ఉంటుంది. మన వంటినుంచి అంటే చర్మం నుంచి ప్రతి నిత్యం బిలియన్‌ల సంఖ్యలో పొలుసులు ఊడి పడుతుంటాయి. పాశ్చర్ లాగా బూతద్ధం పెట్టి చూచినా అవి కనిపించవు. కనిపిస్తే మన పడక మనకు నరకం లాగ కనిపిస్తుంది. ఈ పొలుసులను తింటూ సూక్ష్మజీవులు మన మీద కాపురం ఉంటాయి. అక్కడ వాటికి మనం వదిలిన పొట్టు మాత్రమే కాక రుచికరమయిన నూనెలు, లవణాలు, ఖనిజాలు కూడా దొరుకుతాయి. వాటికి కనుక రుచి తెలిసే పద్దతి ఉంటే మన వంటిమీద మంచి విందు దొరుకుతున్నది అని అర్థం. వంటినిండా రంధ్రాలు ఉన్నాయి. కావలసిన్నని పగుళ్లు ఉన్నాయి. వాటిలోనుంచి సూక్ష్మజీవులకు తిండి సరఫరా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. మనకు తిండి అప్ప్పుడప్ప్పుడు దొరుకుతుంది. వాటికి మాత్రం ఎప్ప్పుడూ దొరుకుతుంది.

            విందు తింటూ బ్రతికే సూక్ష్మజీవులు చర్మంమీద మాత్రమే కాదు, శరీరం మొత్తంలో, లోపల, బయట కూడా అదే పద్దతిలో అంటే లెక్కించలేని సంఖ్యలో ఉన్నాయి. పేగుల్లోకి వెళితే పెద్ద సంఖ్యలో ఉండే బాక్టీరియా లేకుండా మనకు తిండి అరగదు, అన్నది మనం అత్యవసరంగా తెలుసుకోవలనిన సత్యం. ముక్కులోపల కావలసిన్నని సూక్ష్మజీవులు ఉన్నాయి. కనుగుడ్డు మీద ఉండే తేమలో అవి ఈదుతూ ఉంటాయి. దంతాలమీది పింగాణీ పొరలో రంధ్రాలు వేస్తూ ఉంటాయి.

            మనిషి జీర్ణాశయంలో వంద ట్రిలియన్‌లకు పైబడి బాక్టీరియా ఉన్నాయని లెక్క తేలింది. అందులో కనీసం నాలుగు వందల రకాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని చక్కెరలను అరిగిస్తాయి. కొన్ని పిండి పదార్థాలను పట్టించుకుంటాయి. మరికొన్ని మిగతా సూక్ష్మజీవుల మీద దాడి చేస్తాయి. కడుపులో అంటే పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులు అన్నీ యించుమించు మనకు సాయం చేసేవే. అయితే ఏమి పని చేస్తాయని తెలుసుకోవడానికి వీలు కుదరని రకాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. అవి పేగుల్లో అలా మనకు తెలియకుండానే కలకాలం కాపురం ఉంటాయి. వాటికి అలా ఉండడం అనుకూలంగా ఉంటుంది.

            మానవుని శరీరంలో సుమారు పది క్వాడ్రిలియన్ కణాలు ఉంటాయని లెక్క తేల్చారు. ఇక తరువాతి వాక్యం వినాలంటే గుండె గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉండాలి. సగటు మానవుని శరీరంలో బాక్టీరియాల సంఖ్య  వంద క్వాడ్రిలియన్‌ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైక్రోబయాలజీ రంగంవారు మనిషిని, మనిషి అనే కన్నా మరేదో అంటే బాగుంటుంది అంటారు. మనిషిలో మనిషి కణాలకన్నా మైక్రోబ్స్ కణాలు పదిరెట్లు ఎక్కువ ఉన్నాయి మరి. మనిషిమీద సూక్ష్మజీవులు బతుకుతున్నాయా లేక వాటిమీద మనిషి బతుకుతున్నాడా? ఇటువంటి ప్రశ్నలు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, విషయంగా తెలుసుకోవడానికి మనకు, కొంచెం ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అసలు విషయం ఒప్ప్పుకోవాలంటే, మన శరీరంలో శరీరంకన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటి మధ్యన మనం కూడా ఉన్నాము.

            బాక్టీరియా అనగానే రోగాలు కలిగిస్తాయని అందరికీ ఒక ఆలోచన కలుగుతుంది. చాలా తెలివిగా వాటిని మట్టు పెట్టడానికి మనం సబ్బులు, ఆంటీయోటిక్స్ వంటివి క£నుగొని, మనలను మనం కాపాడుకుంటున్నామని భ్రమ పడుతున్నాము. వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులను తొలగించుకుంటున్నాము అన్నది, నిజం. కానీ అంతకన్నా పెద్ద సంఖ్యలో బాక్టీరియాలను పెంచి పోషించుకుంటున్నాము అన్నది, అంతకన్నా పచ్చి నిజం. ఈ మాట కూడా కొంతవరకు నిజం కాదేమో అని అనుమానం. బాక్టీరియాలకు సమాజాలు లేవు. ఊళ్లు, నగరాలు £ట్టుకోవాలన్న ఆశ అంతకన్నా లేదు. అయినా అవి మన సౌరమండలం కొనసాగినంత కాలం ఉండి తీరతాయి. భూగ్రహం నిజానికి వాటి స్వంతం. అవి మన పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అంటే మనిషి జాతికన్నా ముందు ఉన్నాయి. ఈ మనిషిజాతి కనిపించకుండా పోయిన తర్వాత కూడా అవి ఉండి తీరతాయి. అవి దయతలచి మనలను ఉండనిస్తున్నాయి, కనుక కొంతకాలం ఇక్కడ మనం కూడా ఉంటాము. బిలియన్‌ల సంవత్సరాలుగా భూమిమీద రకరకాల సూక్ష్మజీవులు కొనసాగాయి. మన తరువాత కూడా మనిషి లేకున్నా, అవి ఉండి తీరతాయి. ఇక్కడ మనం ఒక్క విషయం లెక్కలోకి తీసుకోవాలి. మనం లేనప్పుడు సూక్ష్మజీవులు ఉన్నాయి, కానీ సూక్ష్మజీవులు లేనిదే, మనం అనే మనుషులం, ఒక్క రోజు కూడా బతకజాలము. మనం వదిలిన మురికిని వదిలించడానికి సూక్ష్మజీవుల మీద ఆధారపడుతున్నాము అన్న సంగతి చాలా మందికి తోచకపోవచ్చు. పడేసిన వస్తువులు, అది పాచి అన్నం కావచ్చు, పశువులు, జంతువుల శరీరాలు కావచ్చు. కుళ్లడం బాక్టీరియాల వల్లనే జరుగుతున్నది. కుళ్లకుంటే వ్యర్థ పదార్థాలన్నీ అలాగే ఉండి పోతాయి. కుళ్లితేనే అవి మట్టిìలో క£లుస్తాయి. ఆ రకంగా మట్టిసారం పెరుగుతుంది. మనకు తెలిసిన, తెలియని జీవులను, మొక్కలను కుళ్లించడం ద్వారా సూక్ష్మజీవులు పైమట్టిని హ్యూమస్‌గా మారుస్తున్నాయి. అట్లా మారినందుకే మట్టిలోకి పోషకపదార్థాలు మళ్లీ చేరుతున్నాయి. కనుకనే అదే పొలంలో అయినా మళ్లీ పంటలు పండుతున్నాయి.

            మంచినీళ్లు శుభ్రంగా ఉండాలని మనం రకరకాలుగా ఏర్పాట్లు చేస్తుంటాము. బాక్టీరియా కారణంగా నీటి నాణ్యత తగ్గుతుంది. కానీ బాక్టీరియా కారణంగానే మరొక పరిస్థితిలో పెద్ద ఎత్తున నీళ్లు పరిశుభ్రం అవుతున్నాయి కూడా. నీటిలో చేరిన వ్యర్థపదార్థాలను కుళ్లించినందుకే ఆ మకిలి అడుగుకు చేరుతుంది. పైన తేటనీళ్లను మనం త్రాగగలుగుతాము.

            పేగుల్లో ఉండే బాక్టీరియా మనకు అవసరమయిన వైటమిన్‌లను తయారు చేస్తాయి. మందుబిళ్లలు తెచ్చి మింగనవసరం లేకుండానే మనకు అవసరమయిన పోషకపదార్థాలు సూక్ష్మజీవుల వలన అందుతాయి అన్నమాట. మనం తిన్న తిండిని చక్కెరలుగా మాÂర్చేది సూక్ష్మజీవులే. బయటినుంచి వచ్చిన బాక్టీరియామీద లోపల ఉన్న రకాలు తెల్ల రక్తకణాలకన్నా ముందే పోరాటాన్ని మొదలు పెడతాయి. తిండి అరగడం, ఆరోగ్యం నిలబడడం సూక్ష్మజీవుల వల్ల జరుగుతున్నది. అంటే అవి మనకు ఎంత అవసరం అన్నది అర్థం అవుతుంది.

            వాతావరణంలో సూక్ష్మజీవుల పాత్ర గురించి చెప్పుకోవాలంటే, ఆశ్చర్యరకమయిన వివరాలను అంగీకరించడా నికి సిధ్ధంగా ఉండాలి. మనకు తెలిసి, మనచుట్టూ ఉన్న గాలిలో ఎక్కువగా ఉండే భాగం నత్రజని అనే వాయువు. సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని వాడుకొని, మాంసకృత్తులకు ఆధారమయిన అమైనో ఆమ్లాలను తయారు చేస్తాయి. డిఎన్ఏలో ఉండే భాగాలను కూడా సూక్ష్మజీవులే తయారుచేస్తాయి. ఇది మనకు నిజానికి అర్థంకాని అద్భుతం. అపార్థానికి గురయిన అమాయక జీవులు తెలియకుండానే మనకు చేస్తున్న పకారం ఇది. పరిశ్రమలో నత్రజని ఎరువులను తయారుచేయడానికి అయిదువందల డిగ్రీల సెల్సియస్ వేడిమి అవసరం అవుతుంది. ఒత్తిడికూడా చాలా ఎక్కువగా వాడవలసి ఉండుంది. సూక్ష్మజీవులు మాత్రం ఈ చిక్కులేవీ లేకుండానే, మనకు కావలసిన పదార్థాలను తయారు చేసిపెడతాయి. కంటికి కనపడకుండా జరుగుతున్న ఈ ఉత్పత్తి కార్యక్రమం వల్లనే చిన్ననుండి పెద్ద జీవులన్నీ బతుకు కొనసాగించ గలుగుతున్నాయి.

            విశ్వంలో మానవులనే మనం ఉండి, మనకు మనం కూడా ఉపకారం చేసుకోలేక పోతున్నాము. మెదడు అంటూ ఒకటి ఉంది కనుక, మనం ఎందుకు ఉన్నాము, అని ప్రశ్నలు అడుగుతున్నాము. జవాబు దొరకక అసంతృప్తితో బ్రతుకు కొనసాగిస్తున్నాము. మనం రాకముందే భూమిమీద మనుగడ కొనసాగిస్తున్న సూక్ష్మజీవులు మాత్రం, కొత్తగా వచ్చిన మనలను ఈసడించకుండా ఉపకారం చేయడం నేర్చుకున్నాయి. ఎందుకు అని ప్రశ్న వేసుకోలేదు. చేతనయింది కనుక తమకు తెలిసిన పనిని చేస్తున్నాయి. మనకు మాత్రం మంచితనం మనసులోకి కూడా రాదు. ఒకవేలు ఎత్తి ఒకరిని అనేముందు, మిగతా మూడువేళ్ల గురించి పట్టించుకోవలసిన పరిస్థితి సూక్ష్మజీవుల విషయంలో ముమ్మాటికి నిజం.