Tuesday, September 1, 2026

చింపిరిజుట్టు పరిశోధన On Anthropology!

 


ఆదివారం 11 ఫిబ్రవరి 2001 ఆంధ్రభూమి దినపత్రిక

చింపిరి జుట్టు పరిశోధన

పరిశోధన, సైంటిస్టు అనగానే మనకంతా చింపిరి జుట్టు, గడ్డం, పాతకాలం తరహా దుస్తులు వేసుకున్న ఒక పిచ్చి మారాజు మనసులో మెదులుతాడు. పరీక్షనాళికలో రంగురంగుల ద్రవాలను కలిపి సక్సెస్ అని కేకలేస్తాడతను. సినిమాలు, నవలల పుణ్యమా అని మనకు ఇలాంటి ఆలోచనలు స్థిరపడతాయి. అటు సైన్స్ అంచులను తాకుతూ, ఇటు సాంఘికశాస్త్రం గురించి కూడా పట్టించుకుంటూ ఆంత్రపాలజీ అనే శాస్త్రం ఒకటి ఉంది. దాన్ని అచ్చంగా అనువదించాలంటే మానవశాస్త్రం అనాల్సి ఉంటుంది. మానవుల తీరుతెన్నులు, జీవన విధానాలను వర్ణించే శాస్త్రం అది. అందులో ముక్కులు కొలవడం మొదలు, మునుపటి వారి విశేషాలను సేకరించడం దాకా ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. అసాధారణంగా జీవిస్తున్న జాతులను పట్టించుకోవడం ఈ రంగం వారి ప్రస్తుత ప్రత్యేక కార్యక్రమం.

ఆదిలాబాద్ లోని గోండులను గురించి పరిశోధించడానికి జర్మనీ నుంచి హేమిండార్ఫ్ దంపతులు వచ్చి మర్లవాయి అనే ఊళ్లో గోండ్లతోనే కలిసి జీవించారు. శ్రీమతి హేమిండార్ఫ్ సమాధి అక్కడే ఉంది ఇంకా. ఈ దంపతులు గోండులు అయిపోయారన్నా అతిశయోక్తి లేదు. పరిశోధన శాలలు, పరికరాలు, సమావేశాలు, అందుకు తగిన ఆధునిక కాలం హంగులు ఏవి అవసరం లేకుండా ఈ రకం పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. మిచిగన్ యూనివర్సిటీ మానవశాస్త్ర పరిశోధకుడు టామ్ ఫ్రిక్ రెండు సంవత్సరాలకు పైగా కాల్ ఆఫ్ అనే మధ్యతరగతి కుటుంబీకుడితో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్లు ఉండేది ఒక నిజమైన పల్లె. అక్కడ సౌకర్యాలు అంతగా లేవు. అటువంటి ప్రాంతాల్లో బతుకుతున్న వారి జీవితాలను పరిశోధించడమే ఫ్రిక్ పెట్టుకున్న పని. అందుకు వారి మధ్య వారిలో, ఒకడుగా బతకడం కన్నా మంచి మార్గం లేదు. తాను పరిశోధకుడనే విషయాన్ని పక్కనపెట్టి ఫ్రిక్ తన యజమానితో కలిసి వారి పొలాల్లో పని చేస్తుంటాడు. పశువులను కాస్తుంటాడు. ఈ పేరుతో బీద రైతుల పనితీరును, పరిశోధకుడు స్వయంగా నేర్చుకుంటున్నాడు. ఆయా విషయాలను గురించి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుంటున్నాడు. అతను మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఆగి, అప్పుడు విరామం దొరికినప్పుడు ఆ రోజు సేకరించిన వివరాలు అన్నింటిని ఒక పుస్తకంలో రాసుకుంటాడు. మారుతున్న మధ్యతరగతి జీవితాలు, వారి పనితీరులన్నీ త్వరలోనే ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నంలో ఇదొక భాగం!

కాలువ గట్టు మీద నిలబడి, కర్రతో గుచ్చి, రాయి వేసి, లోతు గురించి, ప్రవాహం గురించి తెలుసుకోవచ్చు. నేరుగా అందులోకి దిగి సంగతులను మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రిక్ పాటిస్తున్నది ఈ రెండవ మార్గం. దీన్ని పనిలోనే పరిశీలన అనవచ్చు. పరిశోధనకు వస్తువైన వారికి అనవసరంగా కాలయాపన జరుగుతున్నది అన్న భావం ఉండదు. పరిశోధకులకు వివరాలు అనుమానం లేకుండా అర్థమవుతాయి. ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగింది. ఏ విషయాలయితే, ఈ మధ్య తరగతి రైతు కుటుంబాలు, సమస్యలుగా గుర్తించి చర్చిస్తున్నారు అన్నది గమనించి ఈ పరిశోధకుడు వాటిని పట్టించుకుంటున్నాడు. మారిపోతున్న ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడికక్కడ ఉండిపోయే వీలు లేదు. రైతులకు సమాచారం కావాలి. వారి ఫలసాయం పైచోట్లకు అందాలి. కొత్త కొత్త పద్ధతులు అన్ని రంగాల్లోనూ వస్తుంటే పట్టించుకోకుండా ఉండలేరు. అవి కాక మానవ సంబంధాల విషయంగా వచ్చే మార్పులు మరోవైపు ఉన్నాయి.

మన పరిస్థితులు మారుతున్నాయని మనకి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ దేశమంతా మారుతున్న పరిస్థితులలో తేడాలు, పోలికలు, అందుకు కారణాలు కూడా తెలిస్తే కొన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. జనజీవనం గురించి పట్టించుకోవడం పరిశోధన. అదే చింపిరి జుట్టు పరిశోధన!


Saturday, August 29, 2026

పిచ్చివాళ్ల స్వర్గం : మరణతరంగం నుంచి


పిచ్చివాళ్ల స్వర్గం

ఐజాక్‌ బషేవిస్‌ సింగర్‌

చచ్చి స్వర్గం చేరుకుంటే సులభంగా ఉంటుంది. ప్రపంచం గురించి ఆలోచించనక్కర లేకుండా అమృతం తాగుతూ, రంభ డాన్సు చూస్తూ, హాయిగా బతకవచ్చుననుకునే వాళ్లూ ఉండే ఉంటారు. మంచి వాళ్లకు బతికినంత కాలం కష్టాలుంటాయి. ఈ భూమి మీద నూకలు చెల్లితే అంతా సుఖమే సుఖం! అని మనవాళ్లు అనాదిగా నమ్ముతున్నదే. అలా నమ్మిన ఒక కుర్రవాడి పాత్ర చుట్టూ అల్లిన కథ పిచ్చివాళ్ల స్వర్గం. ఐజక్‌ బషేవిస్‌ సింగర్‌ అనే పోలాండ్‌ రచయిత రాసిన ఇద్దిష్‌ కథ ఇది. అసలు కథ ఏమిటంటే...

అనగనగా ఒక ధనవంతుడు. ఆయన పేరు కదిష్‌. ఆయనకు ఒక్కడే కొడుకు.ఆ  అబ్బాయి పేరు అట్సెల్‌. వాళ్లింట్లో ఒక దూరపు చుట్టాల అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె పేరు ఆక్సా. అట్సెల్‌ అందగాడు. అక్సా కొంచెం పొట్టి. కానీ అందగత్తె. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. వాళ్లిద్దరూ కలిసి తినేవారూ, కలిసి తిరిగేవారూ, చదువుకునేవారూ, ఆడుకునేవారు కూడా. మొగుడు పెళ్లాలాట కూడా ఆడేవారు అప్పుడప్పుడు. పెద్దయింతర్వాత వాళ్లిద్దరికీ పెళ్లి చేసేయాలని పెద్దలనుకున్న సంగతీ అందరికీ తెలుసు. పెరిగారు, పెద్దవాళ్లయ్యారు. కానీ అట్సెల్‌కు ఒక మాయదారి రోగం పట్టుకుంది. ఎన్నడూ కనివిని ఎరుగని మాయరోగం అది. ఆ అబ్బాయి ఎప్పుడూ తానుచనిపోయాననుకునే వాడు!

తనకలాంటి ఆలోచనలు ఎక్కడినుంచి వచ్చాయి? ఇంట్లో ముసలి పని మనిషి ఎప్పుడూ కథలు చెపుతుంది గదూ! ఆవిడే స్వర్గం గురించి చెప్పిందట! స్వర్గానికెళితే కష్టపడవలసిన పనిలేదు. చదువుకోవలసిన అవసరం అంతకంటే లేదు. అమృతం తాగుతూ హాయిగా బతకవచ్చు!

అట్సెల్‌ నిజానికి సోమరి. పొద్దున్నే లేవాలన్నా, బడికి పోవాలన్నా, పని చేయాలన్నా తనకు ఇష్టం ఉండేది కాదు. పెద్దవాడయితే తండ్రి వ్యాపారమంతా తనే చూచుకోవలసి వస్తుందే మోనన్న భయం కూడా ఉండేదతనికి. మరి సుఖపడాలంటే స్వర్గానికి పోవాలి. స్వర్గానికి పోవాలంటే చావక తప్పదు. ఇలా ఆలోచించి, ఆలోచించి, చివరకు ఆ అబ్బాయి తను చనిపోయినట్టు ఊహించడం మొదలుపెట్టాడు.

పాపం అమ్మా నాన్నా, చాలా బెంగ పెట్టుకున్నారు. అక్సా కూడా ఏడిచింది. అట్సెల్‌ మాత్రం ఎంత చెప్పినా వినడు. ‘‘ఏమిటి మీ పిచ్చి? ఒకవేపు నేను చనిపోయి పడి ఉంటే మీరంతా కబుర్లేమిటి? నన్ను పాతేసెయ్యండి! నేను స్వర్గానికి వెళ్లిపోవాలి!’’ అనేవాడు.

ఎంతోమంది డాక్టర్లు ఎన్నో మందులు వేశారు. ఎన్నో రకాలుగా నచ్చ జెప్పడానికి ప్రయత్నించారు. ‘‘నువ్వింకా తింటూ, తాగుతూ, రాయిలా ఉండి చచ్చావంటావేమిటి?’’ అన్నారు. ఇంకేముంది అట్సెల్‌ తిండి మానేశాడు. నిజంగానే చచ్చే పరిస్థితి వచ్చింది!

కదిష్‌ అందరికన్నా పెద్ద డాక్టరుగారి దగ్గరకు వెళ్లాడు. తన కొడుకు సంగతి వివరించాడు. అంతా విన్న డాక్టరుగారు ‘‘ఏం ఫరవా లేదు! ఎనిమిది రోజుల్లో మీవాడి రోగం కుదురుస్తాను. కానీ ఒక షరతు! నేను ఏం చేయమంటే అది చేయాలి మీరు! ఎందుకని ప్రశ్నించకుండా!’’ అన్నారు.

ఆయన ఇంట్లో అందరికీ ఈ విషయం వివరించాడు. ఆ రోజు నుంచే వైద్యం మొదలయింది. డాక్టరుగారు ఏం చెపితే అది క్షణాల్లో అమలు జరగాలి. అది నియమం. డాక్టర్‌ అట్సెల్‌ గదిలోకి ప్రవేశించారు. నలిగిన గుడ్డలతో చిక్కిపోయిన అట్సెల్‌. మంచంలో పడి ఉన్నాడు. డాక్టర్‌ మొహం చిట్లించి, ‘‘ఏమిటది? ఇంకా ఈ శవాన్ని ఇంట్లో దాచుకున్నారేమిటి? అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయండి!’’ అంటూ అరిచారు. అట్సెల్‌ తల్లిదండ్రులు అదిరిపోయారు. ఆ అబ్బాయి మాత్రం మొహం చింకిచాటంత చేసుకుని ‘‘నేనెప్పుడో చెప్పాను! చూడండి! నేను చనిపోయానో లేదో? డాక్టరుగారు కూడా అదే మాటన్నారు!’’ అన్నాడు.

డాక్టరుగారి షరతు జ్ఞాపకం తెచ్చుకుని ఇంట్లో అందరూ శవయాత్రకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న ఆట్సెల్‌ సంతోషం పట్టలేక గంతులు వేశాడు. ‘‘ఆకలి! అన్నం కావాల’’న్నాడు. ‘‘స్వర్గంలో తిందువుగానిలే!’’అన్నారు డాక్టరుగారు.

ఆ ఇంట్లోనే డాక్టరుగారి ఆదేశం ప్రకారం ఒక గదిని స్వర్గంగా మార్చేశారు. గోడలు కనిపించకుండా తెరలు, నేల కనిపించకుండా తివాచీలు ఏర్పాటు చేశారు. కథలో స్వర్గంలో లాగ దీపాలు అమర్చారు. సేవకులంతా దేవదూతల్లాగ అలంకరించుకున్నారు.

అట్సెల్ ని శవపేటికలో పెట్టి ఊరేగింపు మొదలుపెట్టారు. అబ్బాయి నిద్ర పోయింది చూచి, అతడిని స్వర్గం గదిలో దిగబెట్టారు. నిద్రలేచిన అబ్బాయి ఆశ్చర్యపోయాడు. ‘‘నేనెక్కడున్నాను? ఎవరక్కడ?’’ అన్నాడు. దేవత ప్రత్యక్షమయి ‘‘ఇది స్వర్గం మహాప్రభో!’’ అని జవాబిచ్చాడు. ‘‘సరే! నాకాకలిగా ఉంది. ఆహారం, అమృతం కావాల’’న్నాడు అట్సెల్‌. ముఖ్య సేవకుడు చప్పట్లు చరవగానే తెరలు తొలగించుకుని సేవకులు బంగారు పళ్లాలలో అన్ని పదార్థాలు పట్టుకువచ్చి అట్సెల్‌ ముందు అమర్చారు. బాగా తిని వెంటనే మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు అబ్బాయి. మరురోజు పొద్దున్న నిద్రలేచాడు గానీ, అది పగలో రాత్రో తెలియలేదతనికి, అట్సెల్‌ నిద్రలేచాడని గమనించగానే, సేవకులంతా సిద్ధమయి అచ్చం మొదటి రోజులాగానే ఆహారం ఏర్పాటు చేశారు.

ఇదేమి బ్రేక్‌ఫాస్ట్‌? కాఫీ, బ్రెడ్‌ రోల్స్‌ కావాల’న్నాడతను.

కానీ స్వర్గంలో అవేవీ ఉండవు. ఎప్పుడూ ఇదే తిండి! మహాప్రభో’ అన్నారు సేవకులు.

అస్సలిప్పుడేమిటి? పగలా? రాత్రా?’ అన్నాడు అట్సెల్‌.

అంటే ఏమిటది? ఇక్కడదంతా ఉండదు!’ అన్నారు సేవకులు.

ఎలాగోలాగ తిండి అయిందనిపించి, ‘మరి కాలక్షేపానికి నేనిప్పుడేం చేయాలి?’ అని ప్రశ్నించాడా అబ్బాయి.

స్వర్గంలో ఎవరూ ఏమీ చేయరండీ!’ జవాబు.

మిగతా దేవతల గురించి అడిగితే చాలా దూరం అన్నారు.

మరి మా అమ్మా, నాన్నా ఎప్పుడొస్తారు?’ అని అడిగాడు అట్సెల్‌.

మీ నాన్నగారు ఇరవై ఏళ్ల తర్వాత, అమ్మగారు ముప్పయి ఏళ్లకు!’ అన్నారు.

మరి అక్సా సంగతి ఏమిటి?’

ఆమె రావాలంటే యాభయి సంవత్సరాలు కావాలి!’

అంటే అప్పటిదాకా, నేనిలా ఒంటరిగా ఉండవలసిందేనా?’’

అంతే మహాప్రభో!’

సరే, ఇప్పుడు అక్సా ఏం చేస్తుంది మరి?’’

‘‘కొన్నాళ్లు మీ కోసం ఏడుస్తుంది. నెమ్మదిగా మరిచి పోయింతర్వాత ఇంకో అందమయిన కుర్రవాణ్ణి చూచి పెళ్లి చేసుకుంటుంది. భూమ్మీద బతికేవాళ్లు ఎప్పుడూ అంతేగదా!’ అన్నారు సేవకులు. అట్సెల్‌కు తిండి ఒంటబడుతున్నది. కానీ చేయడానికి పని మాత్రం లేదు. ఎనిమిది రోజులు అలా గడిచే సరికి అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది. పట్టలేక సేవకుడితే ‘‘స్వర్గంకన్నా భూమిమీదే బాగుంటుందేమో!’ అన్నాడు.

అయ్యో! ఏం బాగులెండి! చదువుకోవాలి! పనిచేయాలి! ఒక్కటా? అంతా కష్టం?’’ అన్నాడు సేవకుడు.

‘‘ఆ ఏం కష్టంలే? ఇలా పడి ఉండేకన్నా కట్టెలు కొట్టినా సుఖంగా ఉంటుంది! అయినా ఇలా ఎన్నాళ్లుండాలి నేను’ అన్నాడు ఆ అబ్బాయి.

ఎప్పటికీ ఇలాగేజవాబు.

ఛీ! అలాగయితే నేను ఛస్తాను!’

చచ్చినవాళ్లు మళ్లీ చావడానికి వీల్లేదు!’

చింతలో పడ్డాడు అట్సెల్‌.

కొన్ని క్షణాల తరువాత ఒక సేవకుడు ప్రత్యక్షమయ్యాడు. ‘మహాప్రభో! తప్పు కాయాలి. తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ మీరు చనిపోలేదు! ఇంకా బతికే ఉన్నారు!’ అన్నాడు.

ఎగిరి గంతేసి అట్సెల్‌ ‘ఏమిటి? నేనింకా బతికే ఉన్నానా? మరి నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? వెంటనే మా ఇంటికి తీసుకెళ్లండి!’ అన్నాడు.

సేవకులు తన కళ్లకు గంతలు కట్టి, కాసేపు అటూయిటూ తిప్పి, చివరకు ఇంట్లో అందరూ ఉన్న గదిలోకి తెచ్చారు. గంతలు విప్పారు. మళ్లీ ప్రపంచం చూచిన అట్సెల్‌ సంతోషం పట్టలేకుండా ఉందప్పుడు. బ్రతకడమెంత హాయిగా ఉంటుందో అర్థమయిందతనికి.      అక్సాని చూచి, ‘నీవింకా ఎవరినో పెళ్లి చేసేసుకుని ఉంటావనుకున్నాను! నా అదృష్టం ఇంకా ఇక్కడే ఉన్నావు!’ అన్నాడు.

వాళ్లిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. కానుకలు, కట్నాలు కూడా ఘనంగా వచ్చాయి. సోమరితనం మానేసి, అట్సెల్‌ వ్యాపారం మొదలు పెట్టాడు. బాగ్దాద్‌, భారతదేశమూ తిరిగాడు. చాలాకాలం తర్వాత గానీ, అట్సెల్‌కు డాక్టరు చేసిన వైద్యం గురించి తెలియదు. పిచ్చివాళ్ల స్వర్గం గురించి అతను తన పిల్లలకు, వాళ్లకూ కథలుగా చెపుతూ ఉండేవాడు.

కథకు ముగింపు మాత్రం ఎప్పుడూ ఒకటే. ‘నిజంగా స్వర్గంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు!’ అని.


 

Friday, August 28, 2026

లోకాభిరామం : మాదదయో (ఇప్పుడే కాదు) On Kurosawa Movie Madadayo


 

ఇప్పుడే కాదు..

Published originally on Saturday, 13 April 2019 - Andhrabhoomi daily Sunday Magazine

ఎవరికీ నమ్మకంగా తెలియని విషయం గురించి మనకు అసలు అనుమానం ఉండనే కూడదు - ఆన్ వార్డ్ రాడ్ క్లిఫ్ (రచయిత)

* * *
ఒక మనిషికి జీవితకాలంలో తినడానికి కొంత తిండి కోటా ఉంటుంది అంటారు. బతుకు ముగియకముందే అంత తిండి తినేస్తే ఆ తర్వాతి కాలంలో వారికి తిండి ప్రాప్తం ఉండదు, అంటారు. బహుశా సినిమాల విషయంలో నాకు ఇటువంటి పరిస్థితి ఎదురయినట్టు అనిపిస్తుంది. చిన్నప్పుడు సినిమాలు తెగ చూసేవాడిని. డబ్బులు ఉన్నాయని కాదు, మిత్రులు, అన్నయ్య కలిసి సినిమాలు చూడడానికి మంచి వెసులుబాటు కలిగించేవారు. 'పరీక్షలు వచ్చే సంవత్సరం కూడా రాయవచ్చు. కానీ సినిమా మళ్లీ వస్తుందో రాదో, కనుక సినిమా చూడడమే మేలు' అని, నాన్న ఒక సందర్భంలో అన్నాడు. అది నా గురించి కాదు అని అనుమానం. కానీ విషయం మాత్రం నిజమే. సినిమాలు అంతగానూ చూచాను. కనుక ప్రస్తుతం నాకు సినిమాలు చూడడానికి ఓపిక లేకుండా ఉంది. అరగంట సేపు చూస్తే చాలు అలసట, అసహ్యం లాంటి లక్షణాలు అన్నీ మొదలయ్యి ఇక సినిమా చాలు అనిపిస్తుంది.
అక్కడో ఇక్కడో అరకొర సినిమాలు నచ్చినవి కూడా ఉన్నాయి. అంటే వాటిని ఇంచుమించు పూర్తిగా చూడగలిగాను అని అర్థం. అలాంటి వాటిలో అన్నిటికన్నా ముందు 'క్షణక్షణం' గురించి చెప్పాలి. బహుశా ఈ మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉంటాను. అయినా మరోసారి చెప్పడానికి సందేహం లేదు. ఆ సినిమా అయిదు నిమిషాలు చూచిన తరువాత, అదేదో కాపీ వ్యవహారం అని అర్థం అయిపోయింది. కానీ శ్రీదేవి అమాయకత్వం, వెంకటేష్ ఏదీ పట్టి లేదు అన్నట్టు ప్రవర్తించడం, విలన్ తీరు, ఇలాంటివన్నీ కలిసి సినిమా చాలా నచ్చింది. మూసగా అందులో ప్రేమలో పాటలు అలాంటివి ఏమీ లేవు. ఏదో ఒక చిన్న సంగతిని పట్టుకుని సినిమా మొత్తం నడుస్తుంది. హిందీ విలన్ పాత్ర చాలా ఆకర్షణీయంగా ఉంది. కనుక ఆ సినిమాను ఇంచుమించు పూర్తిగా చూచాను. రెండోసారి, మూడోసారి, పన్నండోసారి చూసినప్పుడు ఆ సినిమాను నేను ఎప్పుడూ పూర్తిగా చూడలేదు అని అర్థమయింది.
నిజం చెప్పాలంటే నా దగ్గర చాలా సినిమాలు ఉన్నాయి. వాటిని నేను ఇంట్లోనే అంచెలంచెలుగా చూస్తుంటాను. ఇక ఇంటర్నెట్‌లో అయినా సరే సినిమా చూడడానికి అదే పద్ధతి. నాకు సినిమా చూడడానికి ఓపిక లేదు అన్న మాట వాస్తవమే కానీ, నేను సినిమాలు చూడను అంటే మాత్రం అబద్ధం అవుతుంది. అయితే తెలివిగల మనుషులలోకి నన్ను కూడా లెక్క వేసుకుంటాను కనుక, కొన్ని తిక్క పనులు చేయాలి. అందరూ చూసే సినిమాలు చూస్తే మనం తెలివిగల వాళ్లు కింద లెక్క కాదు. ఎవరికీ తెలియని కొన్ని సినిమాలు, కొంతమంది డైరెక్టర్లు, మరి కొంతమంది నటులు వగైరాలను గురించి మాట్లాడుతూ ఉండాలి. అది ఫ్యాషన్ మరి. అందుకే ప్రయత్నించి అరుదైన సినిమాలు చూడడం నేర్చుకున్నాను. ఆ క్రమంలోనే అకిరా కురొసావా గురించి కూడా తెలుసుకున్నాను. నాకు తెలియకుండానే ఈ పెద్ద మనిషి తీసిన ఒకటి రెండు సినిమాలు చూశాను.
పెళ్లయిన కొత్తలోనే, అమాయకురాలు మా ఆవిడని కూడా వెంటబెట్టుకుని వెళ్లి కగేముషఅనే ఒక సినిమా చూశాను. అది ఒక సమురాయ్ వీరునికి సంబంధించిన కథ. నిజం చెబుతున్నాను. సినిమా నాకు ముక్క అర్థం కాలేదు. మా ఆవిడకు అంతకన్నా అర్థం కాలేదు. ఆ తరువాతో, అంతకు ముందో ఎప్పుడో గానీ సెవెన్ సమురాయి అనే సినిమా కూడా చూశాను. ఇది నలుపు - తెలుపు సినిమా. అంటే చాలా ముందు తీసింది అని అర్థం. అందులో గూండాల బాధలు ఎదుర్కోవడానికి ఊరి వాళ్లు పైనుంచి వీరులను అరువు తెచ్చుకోవడం అసలు కథ. నిజానికి మన దేశంలో సూపర్ డూపర్ హిట్‌గా వచ్చిన షోలేఅనే సినిమాకు ఆధారాలు కురొసావా సినిమాలో ఉన్నాయి అంటారు. కిరాయి వీరులు అన్న మాట ఒకటి తప్పిస్తే రెండు సినిమాలలో పోలిక లేనే లేదు. మళ్లీ ఒకసారి చెబుతున్నాను, ఆ సినిమా కూడ నాకు అర్థం కాలేదు.
సినిమా చూస్తే పోతుంది కదా? అందులో అర్థం కావడానికి ఏముంది? అనుకోవచ్చు కూడా. అట్లాగే అనుకుని అకిరా కురొసావా సినిమాగా తీసిన రషోమన్ అని ఒక కథను నాటకంగా చూశాను. దాన్ని లలిత కళాతోరణంలో ఎమ్మెస్ సత్యు లాంటి కొన్ని పెద్ద పేర్ల ప్రభావం కింద ప్రదర్శించారు. నాకు ముక్క అర్థం కాలేదు. ఆ తరువాత కొంచెం తెలివి తెలిసినప్పుడు, అకుటగవ అనే రచయిత సంకలనాన్ని సంపాదించి ఆ కథ మొత్తం చదివాను. కథ వేరు, నాటకం, సినిమా వేరు. వెర్రి కాకపోతే నాకు ఎందుకని ఈ డైరెక్టర్ల సినిమాలు చూడాలని యావ? ఫ్యాషన్ మరి.
అకిరా కురొసావా చాలా సినిమాలు తీశాడు. నేను వాటిలో చాలా చూచినట్టు కూడా ఉన్నాను. అతని వయసు పెరిగిన కొద్దీ, సినిమాలు, కథలు, తీసిన తీరు అన్నింటిలోనూ మార్పు కనబడింది. కురొసావా చివరిగా తీసిన చిత్రం మాదదయో!ఇది ఒక ప్రశ్నకు జవాబు! 30వ సినిమాగా తీశారు కాబట్టి, అప్పటికి కురొసావా రిటైర్మెంట్ మూడ్‌లో ఉన్నట్టున్నాడు. కనుక రిటైర్మెంట్ గురించి బొమ్మ తీశాడు. ఈ సినిమా మాత్రం నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది.
మాదదయోనాకు అంతగా నచ్చడానికి బహుశా కొన్ని కారణాలు ఉన్నాయి. సినిమా తీసిన కురొసావా వృద్ధాప్యంలో ఉన్నాడు. నేను కూడా 60 ఏళ్లు దాటిన వాడిని. సినిమాలో నాయకుడైన సెంసయ్ అంటే గురువుగారు అప్పటివరకు తాను చేసిన అధ్యాపక వృత్తికి వీడ్కోలు చెప్పి, పుస్తకాలు రాస్తూ సుఖంగా బతుకుతాను అంటాడు. అందుకు అనువుగా ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనకు భార్య ఉంది. ఆమె కూడా భర్తను గురువుగారు అంటుంది. పిల్లలు మాత్రం లేరు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన వద్ద జర్మన్ నేర్చుకున్న కుర్రవాళ్లు అంతా, ఇప్పుడు పెద్దవాళ్లయి మంచి పొజిషన్లలో ఉన్నారు. వాళ్లంతా ఆయన పిల్లలుగా ఉంటారు. ఏటా ఆయన పుట్టినరోజు జరుపుతారు. సినిమా మొత్తంలోకి ఈ పుట్టినరోజు పార్టీలు ప్రత్యేక ఆకర్షణలు. విద్యార్థులు కుటుంబాలతో సహా ఒకచోట చేరుతారు. సెన్సయ్ గారిని ఘనంగా సన్మానిస్తారు. అదేమి ఆచారమో తెలియదుగానీ, ఒక పేద్ద గ్లాసు నిండి బియర్ పోసి ఆయన గారికి తాగడానికి ఇస్తారు. ఆయన ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేస్తాడు. అప్పుడు సినిమా పేరు వినిపిస్తుంది. విద్యార్థులంతా కలిసి 'మాదకై' అని అడుగుతారు. గురువుగారు 'మాదదయో' అంటాడు. మాదకై అంటే 'సమయం వచ్చిందా?' అని అర్థం. మాదదయో అంటే 'అప్పుడే రాలేదు!' అని అర్థమట. గురువుగారిని ఇక జీవితం నుండి సెలవు తీసుకుంటావా? అని పిల్లలు అడగడం, ఆయన ఇప్పుడే కాదు మరింత కాలం బతుకుతాను అనడం, ఇంచుమించు అదే వయసులో ఉన్న నాకు బాగా నచ్చింది అంటే ఆశ్చర్యమేముంది?
విద్యార్థులు గురువుగారి గురించి పట్టించుకున్న తీరు కంటతడి పెట్టిస్తుంది. రిటైర్ అయిన తరువాత భార్యా భర్తలు ఇద్దరూ బతుకుతున్న ఇంట్లో రక్షణ ఎంతగా ఉందో చూడాలని, ఇద్దరు విద్యార్థులు రాత్రిపూట ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తారు. 'దొంగలకు దారి' అన్న బోర్డు ఎదురవుతుంది. ఆ సన్నివేశం నిజంగా చాలా బాగుంటుంది. మొత్తానికి రక్షణ బాగుంది, అని తెలుస్తుంది. ఎదురు గోడ మీద మూత్రం పోయడం గురించి రాసి ఉంటుంది. స్వంతదారు ఆ పొలాన్ని మరెవరికో అమ్మడంతో గురువుగారు అక్కడి నుండి కదలవలసి వస్తుంది. విద్యార్థులంతా కలిసి ఆయనకు ఒక గుడిసె ఏర్పాటు చేస్తారు. ఆ గుడిసెకు ద్వారం ఉండదు. మిగతా సౌకర్యాలు అన్నీ ఉంటాయి. చుట్టుపక్కల ఎట్లున్నా అసలైన జపాను పద్ధతిలో కాగితాలతో పరదాలు మొదలయినవి ఏర్పాటు చేసిన ఆ గుడిసె మాత్రం చాలా బాగుంటుంది. విద్యార్థులు ప్రతి నిత్యం అక్కడికి వస్తుంటారు. ఎవరిలోనూ అది కేవలం ఒక చిన్న గుడిసె అన్న భావన కనిపించదు.
సినిమాలో పుట్టినరోజు పార్టీలు మళ్లీమళ్లీ వస్తాయి. వాటికన్నా ముఖ్యంగా చెప్పుకోవలసింది, పిల్లి గురించిన విషయం.
గురువుగారికి ఒక పిల్లి దొరుకుతుంది. దాన్ని ఇంచుమించు సొంత బిడ్డలా పెంచుకుంటారు. మధ్యలో ఆ పిల్లి కనిపించకుండా పోతే వెదకడంతో సినిమా ఎంతో ముందుకు సాగుతుంది. అక్కడ కొంచెం విసుగు కలిగిన భావన కనిపించవచ్చు కానీ, అది కూడా సినిమా నిర్మాణంలో భాగం ఏమో అనిపించింది.
జీవితం పట్ల, అందులో తనకు కావలసిన సౌకర్యాలు, సంగతుల పట్ల, పెద్ద వయసులో కూడా ఒక మనిషికి ఉండే ఆసక్తి గురించి కురొసావా తీసిన సినిమా, నాకు మాత్రం అద్భుతంగా కనిపించింది. నిజానికి సినిమా మొత్తం ఈ ఒక్క విషయం మీదనే ఆధారపడి ఉంటుంది అనవచ్చు. అందరికీ నచ్చిన ఒక పెద్ద మనిషి, తన జీవితాన్ని తాను ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. అప్పుడే అందులో నుంచి బయటపడాలి అని అనుకోవడానికి కూడా వీలు లేనంతగా, తను జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. నాకు నిజానికి జీవితం మీద అంత గట్టి ప్రేమ లేదు. అయినా సరే సినిమాలో ప్రొఫెసర్ కనబరిచిన తీరు, నాకు చాలా నచ్చింది.
సినిమాలో నిజానికి ఎక్కడా కూడా గోల గందరగోళం కనిపించదు. వినిపించదు కూడా. అంతా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. కురొసావా అందుకు తగినట్టు బ్యాక్‌గ్రౌండ్‌లో పాశ్చాత్య శాస్ర్తియ సంగీతాన్ని వినిపించాడు. పార్టీలో కూడా అటువంటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం, మనిషి మీద ఒక ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కెమెరా కదలికలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. పరుగులు ఫైట్లు లాంటివి ఊహించడానికి కూడా ఈ సినిమాలో ఉండవు. ఉన్నది చిన్న గుడిసె అయినా, అది గుడిసెలాగా కనిపించదు. అందంగా ఉంటుంది. వచ్చిన విద్యార్థులు నిజానికి విద్యార్థులు కాదు. వాళ్లంతా పెద్దపెద్ద ఉద్యోగాల్లో చేరిన వాళ్లు. నగరంలో నాయకులుగా చెలామణి అవుతున్న వారు కూడా. ఈ సంగతి పార్టీ సందర్భంగా బయటపడుతుంది.
సినిమాలో ప్రొఫెసర్ లాగే మొత్తం సినిమా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది ఈ సినిమా ప్రత్యేకత. ఆ ప్రొఫెసర్ మన వంటి ప్రేక్షకులను కూడా తన పద్ధతిలోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాడు. అది అతను నేరుగా చేయడు. అప్రయత్నంగా అది జరిగిపోతూ ఉంటుంది. స్వార్థం ఏ మాత్రం కనిపించని తీరు, మనసును తాకుతుంది. సింప్లిసిటీ అనే ఒక లక్షణం, మనం కూడా నేర్చుకుంటే బాగుండును, అనిపిస్తుంది.
మనకు సినిమా అంటే కేవలం ఒక సరదా. సినిమాలలో జరిగే విషయాలు మామూలు జీవితాలలో అసలు కనిపించవు. అట్లా కనిపించాలని మనం ఎప్పుడూ అనుకోము. అటువంటి మనకు, ఇప్పుడే కాదు, అన్న ఈ సినిమా చూస్తే, అది విచిత్రంగా కనిపిస్తుంది అనడంలో సందేహం మాత్రం లేదు. ఈ సినిమా యూట్యూబ్‌లో దొరుకుతున్నది. నిజంగా ఆసక్తి గలవారు దాన్ని చూడడానికి ప్రయత్నించండి. కొంచెం ఓపికగా చూడండి. నాకు సినిమాల గురించి రాసినప్పుడు మ్యూజిక్‌తో మూడు గంటలు పద్ధతిలో మొత్తం కథ చెప్పడం అలవాటు లేదు. ఇక్కడ కూడా కథ చెప్పను. చివరకు ఏమవుతుంది అన్న సంగతి అసలే చెప్పను. అప్పుడుగాని ఆరుగురు అయినా సినిమాను చూస్తారు ఏమో అని నా అనుమానం. అకిరా కురొసావా గొప్ప దర్శకుడు. నేను చెప్పవలసిన అవసరం లేదు. మీరు కూడా నాలాగా ఆ విషయాన్ని మీ అనుభవం ప్రకారం తెలుసుకుంటారేమో అని నా ఆశ.