Monday, July 6, 2026

సిమెంట్ సంతతి : నగ్నముని విలోమ కథలు నుంచి.


సిమెంట్ సంతతి

నగ్నముని విలోమ కథలు నుంచి.

లోకంలో వయసు వచ్చిన అందరు ఆడపిల్లలకు మల్లెనే ఆ పిల్ల కూడా మొదట్లో మంచుతో నేసిన జలతారు ముసుగు, మొహం మీదకు లాక్కుని, రేకు విడవడానికి కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా ఉండేది. కాళ్లలో లేళ్లు గంతులేసేవి. కనురెప్పల్ని కలలు కమ్ముకునేవి. కాళ్లూ, చేతులూ, ప్రతి అవయవం యవ్వన పరిమళపు సెలయేళ్లుగా తుళ్లి పడేవి. పెదవుల మీద వెన్నెల ఒలికి, పలువరసను పలకరించి, ఒంటిలో ఇంకిపోయేది.

నడిస్తే, నడుస్తున్న హారతిలా ఉండేది.

ఆ పిల్ల తండ్రి కాళ్లూ, చేతులూ మెదడూ ఎప్పుడూ ఎక్కడో పన్జేస్తుండేవి. అర్ధ రాత్తుళ్లు బగ్గుమని చివరి మంట మండే లాంతర్లాంటి కళ్ళతో యింటికి చేరేవాడు. కుష్టువ్యాధి వ్యాపించిన వాడిలాగా దరిద్రంతో తీసుకుంటుండేవాడు. దరిద్రం క్రమంగా అతని అన్ని అవయవాల్ని తినేస్తోంది. నెమ్మదిగా నెమ్మదిగా ఇంటి గోడలకి, యింట్లోనే యితర వస్తువులకి, మనుషులకి వ్యాపిస్తోంది ఆ వ్యాధి.

తల్లి వంటింటి అలుగ్గుడ్డ. ఎడతెరిపి లేని దగ్గుగా మారి, చింకి చాప మీద ముణగదీసుకునుండేది. అర్ధరాత్రి మసిబారిన లాంతరు కళ్ళతో, సగం సగం అవయవాల్తో యింటికొచ్చే కట్టెతో కాపరం చేసేది.

వీధిలోని పెంటకుప్పకీ, యింటికీ పెద్ద తేడా లేదు. పెంటకుప్ప మీద గులాబీ మొక్కలాగా ఆ పిల్ల తనని తాను చూసుకునే లోపల ఎదిగిపోయింది.

అవయవాలన్నీ అందమైన పువ్వుల్లోకి మారిపోయినై. కుండీలో పెడతానని, మేకలు తినెయ్యకుండా కాపలా కాస్తానని, అంటుకట్టి మరిన్ని అందమైన రంగురంగుల పూలు పూయిస్తానని, పుస్తకాల్లోంచి, పక్క వీధిలోంచి ఎగిరేచ్చాడో కుర్రవాడు.

వాడి మాటల్లో మత్తు పానీయాలున్నాయ్.

వాడి కళ్ళలో గురితప్పని పూల బాణాలున్నాయ్.

వాడి నిట్టూర్పుల్లో మధురంగా బంధించే లతలున్నాయ్.

వాడి చొక్కాకి గలగలలాడే జేబుంది.

వాడి ఒంట్లో సలసల కాగే రక్త సరసుంది.

వాడి చేతిలో గుండెల్ని సుతిమెత్తగా తెరిచే రహస్య తాళం చెవి వుంది.

అనుమతివ్వాలో లేదో తేల్చుకోకముందే ఆమె గుండెను తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నాడు వాడు. రోజులు అగరొత్తులుగా వెలిగినయ్.

వాగ్దానాల ఊసులు దవనపు వాసనలైనై.

సెలవులయి పోయినయ్.

వొచ్చినంత వేగంతో తిరిగి దూరపు కాలేజీ పుస్తకాల్లోకి పారిపోయాడు వాడు.

వెళిపోయేప్పుడు కిటికీలు ముయ్యలేదు. తలుపు దగ్గరికయినా వెయ్యలేదు. కలలు కళ్ళని కమ్మేస్తే గుండెని బార్లా తెరిచి, గాయం చేసి వెళ్ళిపోయాడు.

గుమ్మం దగ్గరే మొక్కగా వుండగానే మానైపోయి వాడి కోసం రెప్పలు పీకేసిన కళ్ళతో వెతికింది ఆ పిల్ల.

ఆ తరువాత ఆ గుమ్మం దగ్గరకి రకరకాల తాళాల వ్యాపారులొచ్చారు. వాళ్లంతా తాళాల దొంగలే తప్ప గుండె చప్పుడు వినగలిగిన వాళ్ళు కాదు. కొందరు పాత తాళాలకి కొత్త తాళాలు అమ్మేవాళ్ళయితే మరికొందరు కొత్త తాళాల్ని త్వరితంగా తుప్పుతాళాలుగా మార్చేసేవాళ్లే. ఆ యినప వ్యాపారులందరికీ ఇనప బీరువాలు తెరవగలిగిన తాళాలు కావాలి. అంతే.

వాళ్లంతా అనేక జంతువులని వెంట తీసుకొచ్చేవారు. అవి మానవ భాషలో తెగ అరిచేవీ, కరిచేవీ. తండ్రీ కొడుకులూ, అన్నదమ్ములూ, మామ అల్లుళ్లు, బావ, బావమరుదులు, రకరకాలైన జంతువులొచ్చేవి. ఒకడు బొజ్జతో ఖద్దరు వాసన కొడతాడు. మరొకడు కాంట్రాక్టుల వాసన వేస్తాడు. ఒకడు కాసేపు దేహంలోకి వుమ్మూసి బస్సెక్కో, రిక్షా ఎక్కో పాపం చేసినవాళ్ళా పారిపోతాడు. మరొకడు రాత్రంతా కాండ్రించి వూసి తెలతెలవాడుతుండగా మళ్లీ మామూలు ముఖం తగిలించుకుని జారుకుంటాడు. అందరి చర్మపుభాషా ఒకటే. ఒక్కడూ గుండె చప్పుడు వినడు.

ఉమ్ముల దారిలో చర్మం బీటలు వారుతోంది. శరీర వృక్షం బెరడు, పెళ్లులుగా రాలుతోంది. అయినా ఆశ చావదు. వాడెప్పుడో యీ దారంట వస్తాడు. పశ్చాత్తాప్పడతాడు. మనసులో తిరిగి మరులు పూయిస్తాడు. ఇల్లూ, పిల్లలూ చల్లని సంసారంతో సన్నజాజి పందిరి వేస్తాడు. వాడి కోసం రోడ్డుమీద మొహాలు చూడ్డం, వీలున్నప్పుడల్లా వీధులంట తిరగడం, పార్కులో మూల కూర్చుని రావడం మానలేదు ఆమె.

ఒక రోజున పార్కులోనే చాలా రాత్రి అయిపోయింది. రెండ్రోజుల్నుంచీ తిండి లేదు. నీర్సంగా ఉంది. ఇంటికి పోదామని లేచేసరికి వర్షం మొదలయింది. పరుగెత్తుకెళ్ళి పార్కులోనే మూల షెడ్డు లాంటిదుంటే అందులోకి జేరింది. అప్పటికే ఒంటిమీద బట్ట లాంటిది తడిసింది. మెరుపుల్తో వాన పెరుగుతోంది. కింద నాపరాయి, పైన రేకులు, జల్లు మీదకి చిందడం లేదు, కాస్త పర్వాలేదని ముణగదీసుకుని మూలకు జేరబడింది. ఎవరూ దరిదాపులో లేరు. దూరపు గుడ్డి లైట్ వెల్తురు. వర్షం. తన పక్కనే మెరుపుల్లో చూస్తే ఎవడో ఒకడు పడుకున్నట్లు కనబడింది. పరకాయించి చూసింది. మళ్లీ మెరుపులో చూసినప్పుడు అంత విషాదంలోనూ నవ్వొచ్చింది.

అది ఆ వూరుని ఒకప్పుడు ఏకఛ్చత్రాధిపత్యంగా ఏలిన ఒక గొప్ప రాజకీయ నాయకుడి విగ్రహం. బతికుండగా ఆయన అనేక పదవులు అలంకరించాడు. చేతికి ఎముకల్లేవన్నారు. శ్రీమహావిష్ణువే సాక్షాత్తు యీయన రూపంలో ప్రజాసేవ నిమిత్తం అవతరించా డన్నారు. పేదల పాలిటి పెన్నిధి అన్నారు. సంఘసంస్కర్త అన్నారు.ఒకప్పుడు పార్కు మధ్యన తిన్నె మీద రాజసంగా నుంచుని నీరాజనాలు అందుకున్నదా విగ్రహం. ఇప్పుడు ప్రత్యర్థులు పదవిలో కొచ్చాక షెడ్డులో పడుంది.

ఆ సిమెంట్ విగ్రహాన్ని ఆనుకుని గోడకి చేరగిలబడిందామె. ఎప్పుడు పట్టిందో నిద్ర. వర్షం పడుతూనే వుంది. శరీరం నేల మీద మూలకి ముణగదీసుకుని తుఫానులో చెట్టులాగా వాలిపోయింది. కమ్మటి నిద్ర పట్టేసింది. పాత కల.

నిద్రలోనే వాడితో గడిపిననాటి కల దుప్పటిగా కప్పుకుంది.

అమాయకపు జంతువు మొహంతో వాడు వచ్చాడు. తలుపు తట్టాడు.

పశ్చాత్తాప్పడ్డాడు. క్షమించమన్నాడు.

తిరిగి గుండె తాళం తెరిచాడు. బలంగా, బరువుగా మాటల మత్తు వాసనల్తో యింటి నిండా వసంతం నింపాడు. వాడి కౌగిట్లో కళ్ళు మూసింది. ఆవేశంలో కొట్టుకుపోయింది. అలిసిపోయి ఒడ్డుకుజేరి పడిపోయింది.

వర్షం పెద్దదైంది. గులకరాళ్ళతో బాధడం మొదలెట్టిందల్లా క్రమంగా ఆకాశంలోని బండరాళ్లని దొర్లిస్తున్నట్లు మారిపోయింది. కసిగా నీటి ఖడ్గం గాలిని కోస్తోంది. భూమిని తరుముతోంది. ఎక్కడో పిడుగు పడింది. ఆ పిడుగు ఆమె మూసిన కనురెప్పల మీద పడింది. ఆమె గుండెల్లో పడింది. ఆమె కల మీద పడింది. ఆమెకి చప్పున మెలకువొచ్చింది. వెల్లకిలా పడుకున్నదల్లా వెంటనే లేవాలని ప్రయత్నించింది. లేవలేకపోయింది. ఒంట్లో సత్తువనంతా కూడా తీసుకుని లేవాలని ప్రయత్నించింది. కానీ, లేవలేకపోయింది. తన మీద ఏదో బరువుగా పడుకునుంది. దుంగలా పడుంది. రాతిబండలా కదలనివ్వకుండా మెదలనివ్వకుండా పడివుంది. భూమిలోకి అదుముతున్నట్లనిపిస్తున్నది. ఒక్కసారి ఖణేల్మన్న మెరుపులో ఆమెకి తానెక్కడవుందో, తనమీద ఏమి పడివుందో కనబడింది. తన శరీరంలోని అణువుల శక్తినంతటినీ కూడదీసి బలంగా తనపైనున్న ఆ సిమెంటు శరీరాన్ని పక్కకు తోసేసి నిలబడింది. మరో మెరుపులో కిందకిచూసింది. సిమెంటు విగ్రహం. తనవంకే నవ్వుతూ చూస్తున్న రాజకీయ నాయకుడి విగ్రహం. తిరిగి సిమెంటు చేతులతో దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె వూడిపోయిన తన చీర ముక్కని ఒంటి చుట్టూ చుట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. తను కలలో జేరింది ఆ విగ్రహం కౌగిట్లోకా! విగ్రహం చేతులు వెకిలిగా నవ్వుతూ ఆమెను తిరిగి పొదుపుకోవడానికి ముందుకొస్తున్నయ్. ఆమెకి మతిబోయి, పరుగెత్తుకుంటూ వర్షంలోనే బయటికి వచ్చి పడింది! కంగారులో దారి తప్పింది. ఎప్పటికో యింటికి జేరింది.

నెల తప్పింది.

కడుపులో సిమెంట్ బలంతో మరో మొక్క దేహం రాళ్ల మధ్య వేళ్లూనింది. మొక్కని పీకెయ్యలేకపోయింది.

ఆకాశం పొట్టచిరిగి పేగులుబయట పడ్డట్లు మెరుపులు.

దేహంపై నిరంతరం కురిసే మురికి వాన. లోకపు స్మశానం నిండా కంకాళాల్లా పెరిగిపోతున్న తాళపు చెవులు. ముఖాల్లో అడవి జంతువుల హాహాకారాలు. అయినా, ఆమెలో ఆశ చావలేదు. వాడెప్పుడో వస్తాడు. గాయాలు కడుగుతాడు. గుండెదగ్గర తిరిగి ప్రేమ పిల్లనగ్రోవి నూగుతాడు.

మరో గులాబీ మొక్క పెంట పోగులు ఎదుగుతోంది. వెయ్యి రేకల్తో వికసించబోతోంది. సిమెంటు చేతుల్లోకి, కాళ్ళ కిందకి, ప్రతి మురికి అవయం కిందకీ జేరి అణిగిపోబోతోంది.

రాజకీయ నాయక జంతువులు బతికి వున్నప్పుడే గాక, చచ్చి విగ్రహాలుగా మారి కూడా ప్రజల భవిష్యత్తుని విషయిస్తూనే వుంటారు. తమ సంతతిని పెంచుకుంటూనే వుంటారు.

సృష్టికి సిగ్గు లేదు.

 

 


 

Wednesday, July 1, 2026

సూర్యుని తరుముతూ పరుగు


సూర్యుని తరుముతూ పరుగు

ఛేజింగ్ ద సన్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని చూసినప్పుడల్లా ఒక అనుమానం ఎదురవుతుంది. డు ము వు లు ప్రథమ అనే సూత్రం ప్రకారం సూర్యుడు అంటే ఒక మగ మనిషి. రామః రాముడు అవుతాడు. కృష్ణః కృష్ణుడు అవుతాడు. అదే పద్ధతిలో సూర్యః పోయి సూర్యుడు అవుతాడు. వీళ్లంతా దేవుళ్ళు. మగవాళ్లు. అయినా రాముడు. కృష్ణులకు మీసాలు ఉండవు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి ఒక ఊరు. అక్కడ సూర్యుని గుడి ఉంటుంది. అందులోని దేవునికి మీసాలు ఉంటాయి. ఆ గుడిని చాలా కష్టపడి కట్టారు. సంవత్సరంలో ఒకనాడు ఆకాశంలోని సూర్యుని కిరణాలు (ఈ సూర్యుని గురించి రాయవలసిన చోట సూర్య గోళం అని రాయడం అలవాటయింది.) గుడిలోని సూర్యుని మీద నేరుగా పడే విధంగా దాన్ని కట్టారు. గాలిగోపురంలో అందుకు అనువుగా కిటికీల్లాంటివి ఉన్నాయి మరి. గుడిలో దేవుడు మగ దేవుడు. చిత్రంగా ఆడదేవతలు ఉంటారు. ఆలుమగలు ఉంటారు. ఆ సంగతులు ఇక్కడ అవసరంలేవు.. మరి దేవుడు అంటే సూర్యుడు మగవాడా అవునంటున్నారు మరి పెద్దలు. ఆయనకు రథం ఉంటుంది. దానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే తొడలు లేని సారథి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి సంగతులు మాకు చెప్పి చెప్పి తలకెక్కించారు. ఆకాశంలోని సూర్యుడు మండే వాయువుల ముద్ద అని కూడా చెప్పారు. బడిలో ఎక్కడ అటువంటి పాఠం చదివిన గుర్తు లేదు.. ఆ సంగతులు మరేదో మార్గంలో తెలిశాయి. ఆలోచన గల ఎవరికయినా తికమక మొదలవుతుంది. ఆకాశంలోని సూర్యునికి రథం ఉంటే కనిపించాలి కదా! అది ఎన్నడూ కనిపించలేదు మరి!

మండే వాయువుల ముద్దకు రథం ఎందుకు గుర్రాలు ఎందుకు

సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో 90 శాతం, ఇంకా ఎక్కువ మంది అవును అంటారు. ఈ మధ్యన కొంత మంది, పిల్లలు మాత్రమే ధైర్యంగా కాదు అనగలుగుతున్నారు. సూర్యుడు ఒకచోట ఉంటాడు. కదిలిన మనకు తెలిసే విధంగా కదలడు, అన్నారు ఆ పిల్లలు. భూమి సూర్య గోళ్లను చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంతో పాటు అది బొంగరం లాగా తన చుట్టూ తాను తిరుగుతుంది. కనుక మనకు సూర్యుడు ఉదయించిన భావం కలుగుతుంది, అని పిల్లలకు అర్థమైంది అన్నమాట.

సన్ (ఎస్ యు ఎన్) అంటే సూర్యుడు. సన్ (ఎస్ ఓ ఎన్) అంటే కొడుకు. ఎంత బాగుందీ పద్ధతి నా కొడుకు నాకు ఆకాశంలో సూర్యుని వలె వెలుగుతూ కనబడతాడు. అందరు పిల్లలు అలాగే కనబడతారు. సూర్యుడు, చంద్రుడు విరాట్ పురుషునికి రెండు కళ్ళు అన్నారు, వెనకటివారు. ఆరింటికి పోలికే లేదు. అని ఎంతమందికి అర్థమయింది

మనిషి దేవుళ్లను సృష్టించాడు. వారికి తనలాగే రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్టు ఊహించాడు. అంతకన్నా మరొకరకంగా ఊహించడం అమాయకం మనిషికి చేతకాలేదు. విరాట్ పురుషునికి 1000 కళ్ళు, 1000 కాళ్లు ఉన్నాయి అన్నారు. అది ఎట్లా వీలవుతుంది అని ఆలోచన కలిగినట్లు లేదు. ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు గనుక వదిలేద్దాం.

విజ్ఞాన సర్వస్వంలో చూస్తే ఆకాశంలో సూర్యుడు ఎల్లో డ్వార్ఫ్ రకం నక్షత్రం అని రాసి ఉంది. దాని ద్రవ్యరాశి 1,909 X 10 10 (అంటే ఒకటి పక్కన పది సున్నలు పెట్టాలన్నమాట) కిలో గ్రాములు. డయామీటర్ అంటే చుట్టుకొలత 1,392,000 కిలోమీటర్లు అని కూడా ఉంది అక్కడ. అది భూమి నుంచి తొమ్మిది కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. మరీ సరిగా చెబితే.92,955,887.6 మైళ్ళ దూరంలో ఉంది. అంత దూరాన్ని కుదించి 9 కోట్ల 30000 అంటే కొంపేమీ మునగదు. సూర్యుడు అంటే నక్షత్రం. అది చిన్న నక్షత్రం. అది పుట్టినప్పుడు కొంత పదార్థం దూరంగా చిమ్మింది. ఆ పదార్థం ముద్దలు కట్టి గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. భూమి పదార్థంలో కొంత భాగం దూరం పోయి చంద్రగోళం తయారయింది. అది భూమి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు, చంద్రుడు మధ్య పోలిక లేదని తెలిసిపోయింది. సూర్య గోళం మండుతుంది కనుక వెలుగునిస్తుంది. చంద్ర గోళానికి స్వంత కాంతి లేదు. ఈ అక్షరాలను మీరు పగలు చదువుతున్నారంటే, అందుకు అవసరమైన వెలుగు సూర్య గోళం మంట నుంచి వస్తున్నది.

ఆదిత్యాయ, సోమాయ అంటూ మనవాళ్లు గ్రహాలకు దండం పెడతారు. బడిలో మాత్రం సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతుంటాయి, అని చెప్పారు. ఇప్పుడు పాత లెక్క తప్పు, లుతో గ్రహం కాదు. ఉన్న గ్రహాలు ఎనిమిది మాత్రమే అంటున్నారు. మన సంప్రదాయంలో రాహుకేతువులను గ్రహాలు అన్నారు. వాళ్ళిద్దరూ సూర్యుని, చంద్రుని మింగితే గ్రహణం వస్తుంది అని మాకు చిన్నప్పుడు చెప్పారు. ఇప్పటి పిల్లలకు గ్రహణం గురించి బాగా తెలుసు.

ఒక విషయం గురించి రకరకాలుగా చెబితే ఎవరికైనా తికమక, అనుమానం తప్పదు. చంద్రుడు మగ (మనిషి కాదు సుమా!), నక్షత్రాలు ఆయన భార్యలు అన్నారు. సూర్యుడు, (సూర్య గోళం) ఒక నక్షత్రం. దాని చుట్టూ తిరిగే భూమి నక్షత్రం కాదు. సూర్యుని కన్నా చాలా చిన్నది అది. ఆ భూగోళం చుట్టూ తిరిగే బుజ్జి గోళం చంద్రుడు. లేదా చంద్రగోళం. ఆయనకు నక్షత్రాలు భార్యలు అంటే అది పొసగని సంగతి.

సంప్రదాయంలో చెప్పే సంగతులు వేరు. ప్రత్యక్షంగా మనం చూసేది వేరు అని ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. తికమక అవసరం లేదు. ఎవరినీ తప్పు అనడం అంతకన్నా అవసరం లేదు. పడమటి దేశాల వారు చంద్రుడిని స్త్రీగా భావిస్తారని ఎవరికైనా తెలుసునా కానీ అది నిజం.

ఋగ్వేదంలో ఒక మాట ఉంది. కాంతిగల, కాంతి కలిగించే కాంతి వెలిగితేనే, మొత్తం విశ్వమంతా వెలుగుతుంది, అని అక్కడ చెప్పారు. పాశ్చాత్య నాగరికతలో సూర్యునికి అపోలో అని పేరు. అపోలో అంతరిక్ష నౌకలు సూర్యుని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అవి చంద్రగోళ మీద దిగాయి కూడా.

అన్నింటికీ మించి గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. సూర్య గోళం నుంచి భూగోళం వరకు గల దూరం ఎంతో విచిత్రమయినది. అంతకన్నా దగ్గరగా, లేక దూరంగా ఉన్న గ్రహాల మీద జీవం లేదు. ఇన్నర్ ప్లానెట్స్ అనే దగ్గర గ్రహాలు మండిపోతుంటాయి. దూరం గ్రహాలు చెప్పరానంత చల్లగా ఉంటాయి. భూగోళం మీద మాత్రమే నీరు ఉంది. అది ఆవిరి, నీరు, మంచు అనే మూడు స్థితులలో ఉండగలుగుతుంది. కనుకనే ఇక్కడ జీవం ఉంది. నీటిని, సూర్యుని వెలుగును వాడి జీవం పిండి పదార్థం అనే తిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నది. జీవుల మనుగడకు సూర్యుడే ఆధారం. వానలు కురిసి అంతా బురద అయిన తర్వాత మళ్లీ ఎండకాస్తే, పరిస్థితి మామూలు అవుతుంది. భూమి మనకు తగిన విధంగా పొడిబారుతుంది. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదు. పగలు, రాత్రులు లేవు. రుతువులుండవు. వర్షాలు కురవవు!

ఇంతకూ సూర్యుడు అనాలా సూర్య గోళం అనాలా ఎవరైనా చెపితే బాగుంటుంది!


 

Monday, June 29, 2026

పెరుగు - సైన్స్ : Science in curds.


పెరుగు - సైన్స్


పెరుగు - సైన్స్‌

ఈ మధ్యన నాలుగైదు రోజులుగా పెరుగు సరిగా తోడు కోవడం లేదు. అవును మరి! నాలుగైదు రోజులుగా వాతావరణం మళ్ళీ కొంచెం చల్లబడింది. చలికాలం అంటూ లేకుండానే ఎండకాలం మారుతున్న తరుణంలో మళ్ళీ కొంచెం చలి మొదలయింది. చలి దుస్తులు తెచ్చుకున్న వాళ్లకు సంతోషం కలిగింది. వాటిని ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

ఉన్నట్టుండి మళ్లీ చలి మొదలు కావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాతావరణ శాస్త్రం అని చెబుతారు. సముద్రంలో మార్పులు, అక్కడి నుండి వచ్చే గాలిలో మార్పులు, ఆ గాలికి కొండలు అడ్డు రావడం, ఈలోగా మబ్బులు తయారుకావడం, మొత్తానికి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, ఇవన్నీ కలిస్తే వాతావరణ శాస్త్రం అవుతాయి. తత్వం చెప్పినట్టు ఇక పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొందము గాక అని మొదలు పెడితే, చాలామంది చెవులు మూసుకుంటారు. వాతావరణ శాస్త్రం చెబుతాను అని మొదలు పెడితే ఎవరు వినరు. ఎవరూ చదవరు.

ఎక్కడ మొదలు పెట్టాము? పెరుగు దగ్గర మొదలు పెట్టాము! మొదటి మాటల్లోనే వాతావరణ శాస్త్రంలోకి వెళ్ళిపోయాము. అందులో బోలెడంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం కలగలిసి ఉంటాయని చెబితే, ఆశ్చర్య పడని వాళ్ళు, ఇంకేం చెప్పినా ఆశ్చర్యపడరు. మళ్లీ పెరుగు దగ్గరికి వెళ్లి పోతాము. పాలలో, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేస్తే మరునాటికి అది పెరుగుగా మారుతుంది. ఏం పెరిగిందని, పాలు, పెరుగుగా మారినవి? జవాబు వినడానికి కొంతమందికి ధైర్యం అవసరం. పెరుగు లేదా మజ్జిగలో లాక్టోబాసిల్లస్‌ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగానే పెరుగు పెరుగు అవుతుంది. కొంచెం పెరుగును పాలలో వేస్తే, అక్కడ సూక్ష్మజీవులు పెరుగుతాయి. సంఖ్యలో విపరీతంగా పెరుగుతాయి. కనుక దాని పేరు పెరుగు అవుతుంది. పప్పు తినేవాళ్ళకు తాము సూక్ష్మజీవులను మహా ఇష్టంగా తింటున్నాము అని తెలిస్తే బహుశా కడుపులో తిప్పవచ్చు. అందుకని పాలు పెరుగు లేని, వేగన్ తిండి అని ఒకటి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనకు అవసరం లేదు. మొత్తానికి పెరుగు తయారీలో జీవశాస్త్రం, అందులో సూక్ష్మజీవశాస్త్రం ప్రత్యక్షంగా మన ముందు పని చేస్తున్నదని అర్థం చేసుకోవాలి. అందుబాటులో సూక్ష్మదర్శిని అనే మైక్రోస్కోప్‌ ఉన్నవాళ్లు ఒక పెరుగు చుక్కను స్లైడ్‌ మీద వేసి దాని కింద పెట్టి చూడాలి. లుకలుకలాడుతూ కావలసినన్ని సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పప్పు తినే వాళ్ళు ఇక ఆ తరువాత పెరుగు తినడానికి అనుమానం రావచ్చు. ఇది కూడా ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు.

పెరుగులో, కనీసం పెరుగు తయారీలో, కావలసినంత రసాయన శాస్త్రం, మరింత భౌతిక శాస్త్రం కూడా ఉన్నాయి. పాలలో ఉండే ప్రోటీనులు, వాటిని కలిపి ఉంచే నీళ్లు, మిగతా అంశాలు ఒక రకంగా ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చి పెరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడాలు వస్తాయి. ఆమ్లాలు పుడతాయి. కనుక పాలలోని తీపి పోయి, పెరుగులోని పులుపు మొదలవుతుంది.

ఇక భౌతిక శాస్త్రం సంగతి! సూక్ష్మజీవులు పెరగడానికి, ఒక రకమైన ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే అవి నిజంగా పెరుగుతాయి. అప్పుడు పాలు పెరుగుగా మారతాయి. చలికాలం వస్తే, అవసరమైన వేడిమి ఉండదు. కనుక పాలు తోడుకోవు. ఉత్తర భారతదేశంలో తోడు పెట్టిన పాల గిన్నెకు, స్వెటర్లు, దుప్పటి ముక్కలు చుట్టి ఇంటి బయట పెట్టడం చాలామందికి అలవాటు. కొంచెం వెచ్చదనం కలిగి పెరుగు తొందరగా తయారవుతుందని వారి ప్రయత్నం. మన దగ్గర ఉండే ఈ కొంచెం చలికి మాత్రమే, పాలు తోడుకోవడం కష్టం అయితే, ఉత్తర భారతదేశంలోని వణికించే చలిలో, సూక్ష్మజీవులు పెరగడం, పాలు పెరుగుగా మారడం, ఇంచుమించు అసాధ్యం అవుతుంది. అలవాటుగా తరతరాలుగా, లేదంటే యుగాలుగా జరుగుతున్న ఈ పెరుగు కార్యక్రమంలో పెరుగుతున్నవి సూక్ష్మజీవులు అని తెలిస్తే, అద్భుతం అనిపించడం లేదా? అది సైన్స్‌ లోని ఆనందం! అడుగడుగున, చూడగల ప్రతి అంశంలోనూ, సైన్స్‌ దాగి ఉంటుంది. అది అర్థం అయినప్పుడు సైన్స్‌ రుచి మొదలవుతుంది. అందులో ఒక ఆనందం కలుగుతుంది. మనవాళ్లు పాత కాలంలోనే, విజ్ఞానం కన్నా అది అర్థం అయినప్పుడు కలిగే ఆనందము అసలైన పరబ్రహ్మము అని చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన పద్ధతి మరొక రకంగా ఉండి మనకు అర్థం కాలేదు.

సైన్స్‌ రుచి తెలిసిన వాళ్ళు, చిన్న పెద్ద, ప్రతి అంశం వెనుక ఉన్న సైన్స్‌ గురించి వెతుకుతారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు రుచి మరింత పెరుగుతుంది. ప్రపంచం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రకృతి చేస్తున్న మహిమలు తెలుస్తాయి. బ్రతుకు మరింత ఆశాజనకంగా కనబడుతుంది. బ్రతుకు అర్థం తెలిస్తే, పెరుగు తయారయ్యే పద్ధతి తెలిస్తే గొప్పగా ఉంటుంది అన్న విషయంలో అనుమానం లేనేలేదు!


 

Sunday, June 28, 2026

చెవిటి మనిషి : పొరుగు మనిషి Katha


చెవిటి మనిషి : పొరుగు మనిషి

రూమీ చెప్పిన కథలు

చెవిటి మనిషి - పొరుగు మనిషి

ఒక మనిషికి రాను రాను చెవులు వినిపించడం తగ్గిపోతున్నది. కానీ అతనికి తన లోపం గురించి అందరి ముందు అంగీకరించడానికి మనస్కరించడం లేదు. అతను మరి గర్విష్టి. ఏమీ జరగనట్టే నటిస్తూ బతుకుతున్నాడు. ఒకనాడు అనుకోకుండా, ఒక నేస్తం కలిశాడు. ఆ పక్కనే ఉన్న ఇంటిలో ముసలాయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అతని వద్దకు వెళ్లి పరామర్శిస్తే బాగుంటుంది కదా, అని అతను అన్నాడు. పక్కింటి పెద్ద మనిషిని పలకరించడానికి బంధువులు కూడా ఎవరూ లేరు, అంటూ పలకరించమని ప్రోత్సహించాడు. ఈ చెవిటి మనిషి, ఏదో రకంగా అతని మాటలు అర్థం చేసుకున్నాడు. పొరుగంటి మనిషిని తప్పకుండా వెళ్లి పలకరిస్తానని, నిజానికి ఆ రోజునే వెళతానని మాట ఇచ్చాడు కూడా.

ఇంతకు ఆ పొరుగింటి మనిషి దగ్గరకు వెళ్లడం ఎట్లాగా? అతను నిజంగా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే, మాట బలహీనం అయిపోయి ఉంటుంది. అతను చెప్పేదేదో తనకు వినిపించదు. అయినా వెళ్ళక తప్పేటట్టు లేదు. కనుక తప్పకుండా వెళ్లాలి. ఆరోగ్యం గురించి ఏదో అడగాలి. తప్పదు అని నిర్ణయించుకున్నాడు. ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు, అతని పెదవుల కదలికను బట్టి, ఏం మాట్లాడుతున్నది అర్థం చేసుకోవచ్చు కదా, అనుకున్నాడు. అయినా ఏదో జాగ్రత్తగా ఉండాలి కనుక, ఏం ప్రశ్నలు అడగాలి, వాటికి ఏమీ జవాబులు వస్తాయి, తర్వాత మరి ఏమి అడగాలి, అన్న విషయాలను అతను ముందే మనసులో మననం చేసుకున్నాడు.

తాను వెళతాడు. 'ఒంట్లో ఎలా ఉంది?' అని అడుగుతాడు. అనారోగ్యంగా ఉన్న మనిషి 'ఏదో దేవుడి దయవల్ల, లాగతీసుకు వస్తున్నాను,' అంటాడని ఊహించాడు. జవాబుగా 'చాలా గొప్ప విషయం,' అని తాను అంటాడు. వెంటనే తాను, 'ఈ పూట మరి ఏమి తిన్నావు' అని అడుగుతాడు. అతను ఏదో తిన్నాడని జవాబు చెబుతాడు. 'భలే భలే, బాగుంది మరి,' అని తాను అంటాడు. అప్పుడిక మూడవ ప్రశ్నగా, 'మందులు ఎవరి దగ్గర తీసుకుంటున్నావు?' అని అడగాలి. అతను ఊర్లో ఏదో ఒక వైద్యుడి పేరు చెబుతాడు. మళ్ళీ తను 'భలే భలే' అంటాడు. 'అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అని కూడా అంటాడు.

ఈ రకంగా ముందే పథకం వేసుకొని, చెవుడు పెరుగుతున్న ఆ మనిషి వెంటనే పక్క ఇంటికి వెళ్ళాడు. ముసలతని పక్కనే కూర్చున్నాడు. నిజానికి అక్కడ మంచం లేదు. ముసలతను నేల మీదనే ఏదో గుడ్డలు పరుచుకుని పడుకున్నాడు. వెళ్లిన ఈ మనిషి, 'పెద్దాయనా! ఎలా ఉన్నావు?' అని అడిగాడు.

'చస్తున్నాను!' అన్నాడు ఆ ముసలి మనిషి. ముందు అనుకున్నట్టే చెవిటి మనిషి 'చాలా గొప్ప విషయం,' అనేశాడు. పథకం ప్రకారం, 'ఇంతకు ఏం తిన్నావు' అని అడిగాడు. ఆరోగ్యం సరిగా లేని మనిషి విసిగిపోయి ఉన్నాడు. 'విషం,' అన్నాడు. 'భలే భలే, బాగుంది మరి,' అన్నాడు మన చెవిటి మనిషి. మరి పథకం అదే కదా.

ముసలి మనిషికి చికాకు తలకెక్కింది. కానీ తమాయించుకుని పెదవి కొరుక్కున్నాడు. వచ్చిన మనిషిని తిడితే గౌరవంగా ఉండదు అనుకున్నాడు. ఇక పథకం కొనసాగింది. 'ఏ వైద్యుడి దగ్గర మందులు తీసుకుంటున్నావు?' అన్న ప్రశ్న వచ్చేసింది.

చికాకుగా ఉన్న ముసలి మనిషి, 'మృత్యుదేవత దగ్గర!' అన్నాడు. మరి మన చెవిటి పెద్దమనిషి 'భలే భలే! అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అనేశాడు. 'అతని దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ ఇకపైన కష్టాలు అంటూ ఉండవు' అని కూడా చేర్చాడు.

అన్న మాటల ప్రభావం గురించి పట్టించుకోకుండా అతను పెద్దాయన చేయి పట్టుకుని, సెలవు అన్నట్టు ఒకసారి ఊపి, గట్టిగా నొక్కి, వచ్చేశాడు. తాను వచ్చి ముసలి ఆయనకు ఎంతో మంచి చేశాను అని మాత్రమే అతను మనసులో అనుకుంటున్నాడు. జరిగిన విషయం గురించి అతనికి ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత ఏమైంది మనకు తెలియదు.