Monday, August 17, 2026

తుపాకుల ప్రపంచం : Guns in my world


తుపాకుల ప్రపంచం

పొద్దున్నే ప్రపంచం సంగతులన్నీ తలుపు కింది నుంచి ఇంట్లోకి దూరి వచ్చేస్తాయి. విప్పి చూస్తే బాంబుల వర్షం, తుపాకుల మోత, భయం. విలయం ఇల్లంతా పరుచుకుంటాయి. నాకు తుపాకులను గురించిన కొన్ని జ్ఞాపకాలున్నాయి

          మాఊళ్ళో బడి ముందర పెద్ద మర్రిచెట్టు ఉండేది. అది ఈనాటికీ ఉంది. అప్పట్లో ఆ మర్రిచెట్టు కిందనే ప్రార్థన జరిగేది. చెట్టు మీద గుడ్లగూబ ఉందని ఎవరో చూశారు. అంత పెద్ద చెట్టు మీద ఒక అమాయకపు పక్షి ఉందని అంత గత్తర ఎందుకయిందో నాకు ఇవాళటికీ అర్ధం కాదు. ఒక పంతులుగారు మిలిటరీ మనిషిలా ఉండేవారు. ఆయన నిజంగా మిలిటరీలో పని చేసిందీ, లేనిదీ నాకు తెలియదు. ఆయన దగ్గర తుపాకీ ఉంది. దాన్ని మోసుకు వచ్చి ఆయన  గుడ్లగూబను `ఉడాయించే' ప్రయత్నం మొదలుపెట్టారు. అందరూ గుంపుగా చేరారు. తుపాకీ పాతకాలం పద్ధతి. తూటాలు లేవు. తుపాకీ మందు, పొడుగాటి చువ్వ సాయంతో నింపాలి. తరువాత `ఛర్రాలు' అంటే బాల్బేరింగ్లోంచి ఊడిపోయిన ఇనుప గుండ్లు నింపాలి. అవి గట్టిగా ఉండడానికి పేడ పొడి దట్టించాలి. ఒక పేలుడు తర్వాత మళ్ళీ తుపాకీ తయారు కావడానికి బోలెడు టైమ్పడుతుంది. మూడు, నాలుగు సార్లు కష్టపడి నింపి తుపాకీ పేల్చారు. గుడ్లగూబ చావలేదని, ఎగరి ఎటో పోయిందని నా నమ్మకం. చస్తే కింద పడాలి? పడలేదు. ఎందుకో గుర్తులేదు కానీ అంతటితో ఆనాటి కార్యక్రమం ముగిసింది. గుడ్లగూబ కనిపించలేదు.

          తుపాకీ కనిపించాలంటే దసరా పండుగ రావాలి. ఏ వారం నాడు విజయదశమి వచ్చిందంటే దాన్ని బట్టి ఒకానొక దిక్కున పొలంలో జమ్మికొమ్మ నాటేవారు. ఊరి నడిమి నుంచి అందరూ బయలు దేరి భజన చేస్తూ ఆ కొమ్మదాకా వెళతారు. అక్కడ పూజ జరుగుతుంది. జమ్మికింద రాతలుంటాయి. అంతా అయింతర్వాత మళ్ళీ భజనతో ఊళ్ళోకి గుడిదాకా రావాలి. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాకర్షణ `తుపాకి'. ఉత్సవం మొదలయినప్పటి నుంచి ఒకాయన అదే పనిలో ఉండేవాడు. అయితే ఊళ్ళో తుపాకీ గల మనిషి ఆయనొక్కడే. అందుకే నాకాయన హీరోలా కనపడేవారు. తుపాకి చూడాలని చాలా సరదాగా ఉండేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. మొట్టమొదటి తుపాకీ మోతకే గుడి  దగ్గరకు పోవాలని ఉండేది. కానీ కుదిరేది కాదు. భజనకంటే ముందు `బొడ్రాయి' దగ్గర మేకపోతును మెడ నరికి బలి ఇచ్చే వారు. తుపాకీ మోత అక్కడ మొదలవుతుంది. తుపాకీ ఇష్టమే కానీ బలి చూడాలంటే భయం. అందుకే ఓపిక పట్టి భజన మొదలయింతర్వాతే వెళ్ళడం. ఆ తర్వాత జట్టు తిరిగి వచ్చే దాకా తుపాకీని గమనిస్తూ ఉండడమే కార్యక్రమం!

          తుపాకీ గలాయన మా కుటుంబానికి ఒక గొప్ప ఉపకారం చేశాడని నా నమ్మకం. అదింకా కరెంటు దీపాలు లేని కాలం. ఇళ్లు పాతకాలం నాటివి. పై కప్పులో దూలాల మీద అడ్డంగా `వాట్లు' వాటి మీద అడ్డదిడ్డంగా `చిలుకు చెక్క'.  కలవారయితే ఆ చిలుకు చెక్కను చదునుగా చెక్కించి సందు లేకుండా పరిపించేవారు. మా పెద్దలంత స్థితిపరులు కారు. అందుకే చేతి కందిన కర్రనంతా పరిచేశారు. అందరమూ వరుసగా కూర్చోని అన్నాలు తినడం అలవాటు. పిల్లలందరూ ముగించినట్లే గుర్తు. నాయనగారు చెంబుతో ఎత్తి మంచినీళ్లు తాగాలి కనుక తలపైకెత్తారు. నీళ్లు తాగి నెమ్మదిగా మమ్మల్ని అందరినీ చప్పుడు చేయకుండా బయట హాల్లోకి పొమ్మన్నారు. మిద్దెలో పెద్ద పామున్నది. అది వాట్లు, చిలుకు చెక్కలో ఇరుక్కున్నది. కదలడానికి కష్టపడుతున్నది. నాగుపామట. లాగి కిందకు పడేస్తే ఏం చేస్తుందో మరి! నాయన గారు తుపాకీ గలాయనను పిలిపించారు. అతను వచ్చి ఒక మోతతో పామును పరలోకానికి పంపిచారు. చెట్లు నుంచి ఆకులు తెంపే `కమ్మల కత్తి'తో దాన్ని కిందకు లాగారు. మా కుటుంబానికి కలకాలంగా తరతరాలుగా పాములతో సంబంధం ఉందని కథలున్నాయి. అది మరో చరిత్ర అవుతుంది. మొత్తానికి ఆచారం, సెంటిమెంటూ అన్నీ కలగలిపి ఆ పాముకు మా గడ్డి దొడ్లోనే అంత్యక్రియలు జరిగాయి. అదుగో! అప్పుడు చూడగలిగాము పామును! చాలా పొడుగుంది. అందుకే చిలుకు చెక్కలో ఇరికింది. తుపాకీ లేకుంటే ఏమయ్యేదో!

          చదువని కొంతకాలం, తరువాత బతుకుదెరువని కొంతకాలం పల్లె నుంచి దూరమయినది నేనొక్కడినే కాదు.  అంతా దారి వెదుక్కుంటూ అప్పుడప్పుడు పల్లెకు చేరేవారమే! ఒకసారి వెళ్ళినప్పుడు తుపాకీ గలాయన గురించి అడిగాను. జైల్లో ఉన్నాడన్నారు. దాయాదులతో పొలం పంపకాల సంగతిగా తగువులు వచ్చినాయట. గోడవారన మూత్రం చేస్తూ కూచున్న దాయాదినొకడిని ఇతను తుపాకీతో పేల్చి చంపాడట! మాట వింటేనే వెన్ను జలదరించింది. నేను చిన్నప్పటి నుంచి అభిమానించిన తుపాకీ ఎంత పని చేసింది?

          ప్రపంచమే మారిపోయింది. ఎవడి మీదా ఎవడికీ నమ్మకంలేదు. మంత్రి గారుగానీ మరొక పెద్ద మనిషిగానీ బజార్లోకి బయలుదేరితే ఆయనకి ఇరుపక్కల తుపాకులుంటాయి. పిల్లల ఆటకు మొదటి బొమ్మలు తుపాకులు. అన్నల ఆయుధాలు తుపాకులు, అక్కడ ఆత్మరక్షణ కోసం తుపాకులు. ఇన్ని రకాలుగా మరెన్నో రకాలుగా ఎక్కడబడితే అక్కడ తుపాకులు దొరుకుతుంటే  హత్యకూ తుపాకులే, ఆత్మహత్యకూ తుపాకులే! తుపాకీ మీద ప్రేమతో ఉగ్రవాదుల్లో చేరిన యువకుడి పాత్ర ఒకటి సినిమాలో వచ్చిందట. అందుకే పత్రిక వచ్చిందంటే విప్పడానికి మనసు పుట్టదు. అందులోంచి తుపాకీ వాసన వస్తుంది. తుపాకులు లేని ప్రపంచం బాగుంటుందేమో? గోపాలం.కె.బి తేది: 29 అక్టోబర్‌ 2001


 

Friday, August 14, 2026

అర్థం తెలుసా? దేశభక్తి, వందేమాతరం మరిన్ని విషయాల గురించి... On patrotism, and such matters


 

విషయానికి రాగలగడం చాలా గొప్ప విషయం — మెక్‌ లియోడ్‌ జి ప్రెస్టన్‌ (ఈయనగారెవరో తెలియదు. కానీ చాలా గొప్ప

మాట అన్నారు.)

అర్థం తెలుసా?

ఒక అనర్ధం జరుగుతుంది. దేశం మొత్తం ఒక్కటి అవుతుంది. ఆ భావన కొంత కాలం నిలుస్తుంది. ముందే ఎన్నికల

కాలం. పులి మీద పుట్ర లాగా పుల్వామా అనర్ధం ముంచుకు వచ్చింది. అది నిజంగా అనర్ధం. యుద్ధాలు, సేనలు అంటే

ఒకరి మీద ఒకరు పడి కొట్టుకు చావడానికే కదా? యుద్ధం అన్న పద్ధతిని మొదలు పెట్టిన వారు ఎవరో తెలియదు.

అంతకన్నా అర్ధంలేని పద్ధతి మరొకటి లేదు. తెలివి గల మనిషి ఆ తెలివిని ఉపయోగించుకుని సమస్యలకు

సమాధానాలు వెతకవచ్చు. అంతేకాని పాశవికంగా, రాక్షసంగా ఎదురుపడి చంపుకుని అందులో బలాబలాలు

తేల్చుకుంటాం అంటే అంతకన్నా అమానుషం మరొకటి లేదు. అయినా చరిత్ర అంటేనే యుద్ధాల వరుస. ప్రస్తుతం

యుద్ధం జరగడం లేదు. కానీ ఇరు దేశాల మధ్యన పొంతన లేదన్న సంగతి కూడా మరవడానికి లేదు.

హ్యాపీమోన్‌ జేకబ్‌ అనే జె ఎన్‌ యు ప్రొఫెసర్‌ ఒకాయన ఈ మధ్యన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. దానిపేరు లైన్‌

ఆఫ్‌ కంట్రోల్‌. జేకబ్‌ అసలే మంచి పేరు లేని ఆ విశ్వవిద్యాలయంలో, రాజకీయాలు బోధిస్తూ ఉంటాడు. మౌలికాంశాలను

బోధిస్తూ ఉంటే చిక్కు లేదు. ఈ పెద్దమనిషి భారత - పాకిస్తాన్‌ సంబంధాల మీద నిపుణుడు. ఈ విషయం గురించి రెండు

దేశాలలోనూ చర్చలు సమావేశాలు జరుగుతుంటాయి, అంటే మనలాంటి వాళ్లకు కొంచెం విచిత్రంగానే తోస్తుంది. సైన్యం

దారి సైన్యం చూస్తుంటే, విద్యావంతులు, పరిశోధకులు మరో పక్కన మాటలు, మంతనాలు సాగిస్తున్నారు, అన్నమాట.

తన రంగం గురించి బాగా తెలుసుకోవాలి కనుక ఈ ప్రొఫెసర్‌ గారు భారతదేశంలోని సైనిక అధికారులను చాలామందిని

కలిసి విషయ సేకరణ చేస్తుంటాడు. పదవిలో ఉన్నవారు అంత సులభంగా మాట్లాడారని, రిటైర్‌ అయినవారు

సులభంగానే ఎన్నో విషయాలు చెబుతారని ఈ పరిశోధకుడు తన పుస్తకంలో వెల్లడిస్తాడు. నేను ఆ పుస్తకాన్ని

కొన్నాను. రెండు మూడు పత్రికలలో సమీక్ష చదివిన తరువాత ఆ పుస్తకం చదవాలి అనిపించింది. కనుక కొన్నాను.

చదివాను కూడా!

పరిశోధకుడు దేశంలో సైన్యాధికారులను మెప్పించి, ఒప్పించి లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంట కొంతకాలం

గడిపి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. ఈలోగా అటువేపు వారిని కూడా రకరకాలుగా బుజ్జగించి,

పాకిస్తాన్‌ వెళ్లడానికి పర్మిషన్‌ తెచ్చుకున్నాడు. అంతేకాదు, సరిహద్దు వెంట అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి

వారితో కలిసి మంతనాలు చేయడానికి కూడా కావలసిన అనుమతులను సంపాదించాడు.

మనదేశంలో లాగే అటు పాకిస్తాన్‌ లో కూడా ప్రజలకు పక్క దేశం ప్రజల మీద నిజంగా ఏవగింపు లాంటివి లేవు.

అయితే రాజకీయంగా అవసరం గనుక, మీడియా వారు అంతకన్నా చేయగలిగింది లేదు గనుక, రకరకాల మార్గాల

ద్వారా అవతలి దేశం మీద అందరికీ గుండెలనిండా అసహ్యం కలిగే పరిస్థితులను, కావాలని తయారు చేస్తున్నారంటే

ఆశ్చర్యం కాదు. ప్రజలకు ప్రజలకు మధ్యన వైరుధ్యం ఉండవలసిన అవసరం లేదు. నేను ఈ రకం మాటలు చెబితే

నన్ను కూడా దేశభక్తి లేనివాడు అని తన్ని తగలేస్తారు. ఇక్కడ దేశభక్తి గురించిన ప్రసక్తి లేనే లేదు. అవతలి దేశంలో

ఉంటున్నవాళ్ళు కూడా మనుషులే. కానీ దేశాన్ని నడిపిస్తున్న వారు మాత్రం బహుశా మనుషులు కారు. ఇది రెండు

వైపులా సత్యమే. వీళ్లకు తగినట్టే మిలిటరీ ఉంటుంది. నిష్కారణంగా లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంట ఇరువైపుల నుంచి

కాల్పులు జరుగుతుంటాయని, అమాయకుల ప్రాణాలను బలికొంటారని అర్ధం కానివ్వరు. హ్యాపీమోన్‌ జేకబ్‌ పుస్తకం

మొత్తం చదివితే విషయం అర్థమవుతుంది.

నిజానికి ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్నది పాకిస్తాన్‌, భారత దేశాల మధ్యన ఉన్న సంబంధాలను గురించి

కానేకాదు. అందుకే విషయానికి రావడం కష్టం, అన్న ఒక మంచి మాటను ముందే ఉటంకించాను. దేశంలో అందరికీ ఈ

మధ్యన కొంచెం మరుపు పాలయిన దేశభక్తి ఒక్కసారిగా ఉప్పొంగింది. పంద్రాగస్టు, ఛబ్బీస్‌ జనవరి వచ్చాయంటే

పాటలు పాడుతూ, వీధుల వెంట ఊరేగింపులు చేసిన చిన్నతనపు అనుభవాలు గుర్తుకువస్తాయి. తలుచుకుంటే ఒళ్లు

గగుర్పొడుస్తుంది. తరువాత జరిగిన చైనా, పాకిస్తాన్‌ యుద్ధాల సందర్భంగా, దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన దేశభక్తి,

మరొకసారి కళ్లముందు మెదులుతుంది. అప్పటికి నేను అవగాహన లేని కుర్రవాడిని. అయినా దసరా, దీపావళి లాగే

స్వాతంత్రదినం కూడా ఇవ్వాళటికి నాకు పండుగలాగా కనిపిస్తుంది. దసరా, దీపావళి గురించి తెలియని నేటి

యువతరానికి ఇక దేశభక్తి గురించి ఎవరు చెప్పాలి?

మొత్తానికి అందరికీ ఈ గడ్డు సమయంలో, సైనికుల పట్ల తమకు గల భావాలను వ్యక్తం చేయ వలసిన అవసరం ఉందని

అర్ధమయింది. మా వీధి చివరన కూడలిలో బహుశా ఆటోవాళ్లు, మరికొంత మంది కలిసి ఒక జెండా ఎగురవేసి, అక్కడ

దేశభక్తి పాటలు వినిపించారు. కానీ సందర్భానికి తగినట్లు కాకుండా వాళ్లంతా హాయిగా జోకులు వేసుకుని

నవ్వుకుంటున్నారు. అసలు విషయం చెప్పడానికి వాళ్లకు తగిన నాయకత్వం లేదు. నాలాంటివాడు ఎవడైనా

ముందుకు వెళ్లి చెబుతానంటే, బహుశా వాళ్ళు వినే లక్షణం కనిపించదు. వాళ్లను వదిలి పెట్టవలసిందే. ఒక సాయంత్రం

మా కాలనీలోని ఆడవాళ్లు కొంతమంది చేరి, కొవ్వొత్తులు వెలిగించి, వీధుల వెంట నినాదాలు చేస్తూ తిరిగారు.

( నేను వాడిన ఆడవాళ్లు అన్నమాట నాకే బాగుండ లేదు.) స్త్రీ జనం అనడం కన్నా ఇదే కొంత మేలు అనుకున్నాను. వీళ్ళ భావన చాలా బాగుంది. కానీ వీరిలో కూడా సందర్భానికి అవసరమైన సమాచారదృష్టి మాత్రం లేదు. మరేమీ తోచ లేదు

కనుక అదేపనిగా భారత్‌ మాతాకీ జై అంటూ ఉన్నారు వాళ్ళు. అప్పుడప్పుడు ఎవరో కలుగజేసుకుని వి వాంట్‌ జస్టిస్‌ అని

కూడా నినాదాన్ని ఇస్తున్నారు. వాళ్లకు ఏమి న్యాయం కావాలి అన్నది వాళ్లకే తెలియదు. మృతవీరులకు నివాళులు

అర్పిస్తున్నారు కనుక, వారి గురించి నినాదాలు ఉండాలి. చిత్రంగా మన దగ్గర ఏ నినాదం కావలసి వచ్చినా, అది మరొక

భాషలో ఉండాలి. కార్మికుల ఐక్యత వర్థిల్లాలి అనడానికి మజ్దూర్‌ యూనియన్‌ జిందాబాద్‌ అంటారు. ముర్దాబాద్‌ అనే

మాట మరొక చోట వాడుకుంటారు. లేదంటే ఇంగ్లీషులో నినాదాలు చేస్తారు. మన భాష మీద మనకు పట్టు లేదు.

కనుకనే పెద్దపెద్ద మాటలు సంస్కృతం నుంచి అరువు తెచ్చుకుని వాడుకునే పద్ధతి చాలాకాలంగా కొనసాగుతున్నది.

ఇక నినాదాల విషయానికి వస్తే సంస్కృతంలో నినాదాలు ఇచ్చేవారు ఎవరూ, బహుశా అందుబాటులో లేరు. వీర జవాన్‌

అమర్‌ రహే అంటే సరిపోయేది. ఆ రెండు ముక్కలు కూడా వీరికి దొరకలేదు. భారత్‌ మాతాకి జై అన్నారు. ఎవరు ఈ

బారత్‌ మాత? ఇది నా ఇవాళటి విషయం.

విషయానికి చేరుకునే సరికే నాకు అందుబాటులో ఉన్న ఈ పేజీ అడుగుకు చేరుకున్నాను. అయినా మునిగింది లేదు.

భారతమాత అన్నమాట ఒక భావన మాత్రమే. తెలుగులో కొంతమంది భరతమాత అని కూడా రాస్తారు. సంస్కృతం,

వ్యాకరణం తెలిసినవారికి ఇక్కడ ఒక చిక్కు ఎదురవుతుంది. భరతుని మాత భారతమాత. అంటే శకుంతల. ఆమెను

కాదు మనం ప్రార్థిస్తున్నది. భారతదేశం అనే మాతను ఊహించుకుని పూజించుకుంటున్నాము. మాతృదేశం అన్న

భావన మనలో గట్టిగా ఉంటుంది. దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అన్నారు గురజాడ! మరి

ఇప్పుడు ఎవరు ఈ భారతమాత?

భక్తి కావాలంటే అందుకు ఒక ఆలంబన కావాలి. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, అజాయమానుడు అని

ఆయన గురించి ఒక పక్కన చెప్పుకుంటూనే ఆయనకు వేలాది ఆకారాలను ఆపాదించుకుని, అర్చావతారములు

అంటూ పూజలు చేస్తున్నాము. అందులో ఒక దేవుడు సరిపోక లెక్కలేనన్ని దేవుళ్లను తయారు చేసుకున్నాము.

కనుక గజిబిజి పుట్టింది. తెలియజెప్పే వారు లేక కొంతమందికి విషయం అర్థం కావడం లేదు.

అచ్చంగా ఇదే పద్ధతిలో దేశం మీద అభిమానం ఉండాలంటే, ఆ దేశాన్ని ఒక మనిషిగా చూడగలగాలి. దేవుడిని కూడా

మనిషిగా చూసిన మనం, దేశాన్ని, ఒక తల్లిగా చూచి పూజించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అభ్యంతరం అంతకన్నా

ఉండకూడదు.

ఇంకొక తికమక గురించి ఇక్కడే చెప్పుకుంటే పోతుంది. వందేమాతరం అంటూ బంకించంద్రుడు తన నవలలో

వాడుకున్న ఒక పాటను జాతీయగీతం, నేషనల్‌ సాంగ్ గా వాడుకుంటున్నాము. ఏవో కొన్ని విశేషణాలు ఉన్న మొదటి

భాగాన్ని మాత్రమే అవసరం వచ్చినప్పుడు పాడుకుంటున్నాము. సప్త కోటి కంఠ కలకల నినాద అంటూ తరువాత సాగే

చరణాలు ఉన్నాయి, అని కూడా చాలా మందికి తెలియదు. ఇక అసలైన జాతీయగీతానికి వస్తే జనగణమన అధినాయక

అంటూ ఒక పురుషుడిని ప్రార్థిస్తున్నాము. రవీంద్రుని దృష్టిలో ఈ పురుషుడు జార్జి చక్రవర్తి అని నేను ఇవాళ అంటే

అందరూ నన్ను తన్ని తగలేస్తారు. ఎవరు ఈ అధినాయకుడు? భారత మాత అనే భావన ఒక పక్కన ఉండగా ఎందుకు

ఒక పురుషుడిని ప్రార్థించడం? ఆ పురుషుడు ఒక దేవుడు అనుకుందామా? అప్పుడు అంతకన్నా పెద్ద చిక్కు

మొదలవుతుంది? ఆ దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు? రవీంద్రుడు ఏ మతానికీ చెందని ఒక దేవుని గురించి

పాడుకున్నాడు. ఆంత భావనాబలం మనకు ఉన్నదా చెప్పండి! ఈ విషయం గురించి ఇక్కడ నేను ఇంతకన్నా ఎక్కువ

ప్రస్తావించ దలుచుకోలేదు.

అందరూ నాకంటే ఎక్కువ తెలిసిన వారే! ఆలోచించండి! ఆలోచన లేని వారికి కనీసం మీరైనా చెప్పండి! తికమకలో

పడి తెలియకుండా ముందుకు సాగేకన్నా, ఉన్నచోట నిలబడి ఆలోచించడం మేలు కదా!

Saturday, August 8, 2026

మంచు కురిసింది - ఐజక్ బషేవిష్ సింగర్


మంచు కురిసింది

 

ఐజక్ బషేవిష్ సింగర్

 

            ఛెల్మ్ అన్నది వెర్రివాళ్ల ఊరు. అక్కడ పెద్దా చిన్నా అంతా గొప్పవాళ్లే. ఒక రాత్రి అక్కడ ఎవరికో నీళ్ల తొట్టిలో చంద్ర బింబం కనిపించింది. చంద్రుడు ఆ తొట్టిలో పడిపోయాడని చూచినవాళ్లు అనుకున్నారు. తొట్టిమీద గట్టిమూత పెట్టి, మరు రోజు సంగతి చూడాలి అనుకున్నారు. పొద్దున్న మూత తీసి చూస్తే, చంద్రుడు లేడు! ఎవరో దొంగిలించి ఉంటారని తేల్చుకున్నారు. పోలీసులను పిలిచారు. కానీ దొంగ దొరకలేదు. ఛెల్మ్‌వాళ్లంతా చాలా బాధపడ్డారు.

         ఒకసారి, పండగరోజుల్లో సాయంత్రం మంచు కురిసింది. ఊరు ఊరంతా వెండిగుడ్డ కప్పినట్టు అయ్యింది. చంద్రుడు వచ్చాడు. నక్షత్రాలు మిలమిలమన్నాయి. కురిసిన మంచు ముత్యాలు, రత్నాలలాగ మెరిసిపోయింది.

         ఛెల్మ్‌లో అక్కడి పెద్దమనుషుల సంఘం అందరికన్నా తెలివి గలవాళ్లు. వాళ్లు ఊళ్లో అందరికన్నా ఎక్కువ వయసు గలవారు. వాళ్లదే అక్కడ అధికారం. పెద్దలకంతా పెద్ద గడ్డాలు ఉంటాయి. మరీ ఆలోచిస్తారు గనుక నుదుళ్లు కూడా వెడల్పుగా ఉంటాయి.  ఆ సాయంత్రం ఏడుగురు పెద్దలు ఒకచోట చేరి ముఖం మీద ముడతలు పడేటట్లు ఆలోచన మొదలు పెట్టారు. ఛెల్మ్‌కు నిధులు కావాలి. ఎట్లా సంపాయించాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా గ్రోనామ్ ఆక్స్ గట్టిగా అరిచాడు. అందరూ ఆశ్చర్యపడేట్లు అతను ‘మంచు అంతా వెండి!’ అంటూ అరిచాడు.

         'నాకు మంచులో ముత్యాలు కనపడుతున్నాయి!’ అన్నాడు ఇంకొకాయన.

         'నాకు ఏకంగా రత్నాలే కనపడుతున్నాయి!’ మూడవ పెద్దాయన అరిచాడు.

         మొత్తానికి ఛెల్మ్ పెద్దలకు తమ ఊళ్లో నిధి వర్షంగా కురిసిందని తెలిసిపోయింది. అంతలోనే వాళ్లకు చింత కూడా మొదలయింది. ఛెల్మ్‌లో అందరూ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. నిధిని వాళ్లు కాళ్లతో కసపిసా తొక్కుతారు. మరి ఏం చెయ్యాలి? ఒక పెద్దమనిషికి ఆలోచన రానే వచ్చింది.

         'అన్ని ఇళ్లకు వార్త పంపిద్దాము. ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతాము. వెండి, ముత్యాలు, రత్నాలను ఏరిన తరువాతే రావాలని ప్రకటిస్తే సరి’.

         పెద్దలకంతా మాట బాగా నచ్చింది. అందుకే అరచేతులు రుద్దేసి ఆ సంగతి తెలియజేశారు. అప్పుడు మత్తు లెకిష్  మరో మాట అన్నాడు. ‘వార్త అందించే మనిషి మరి నిధిని తొక్కుతాడు కదా' అన్నాడు.

         లెకిష్ మాట సత్యమని పెద్దలకు అర్థమయింది. మళ్లీ నుదుట ముడతలు పడేట్టు ఆలోచనలు మొదలయ్యాయి. 

         'తోచింది!’ అన్నాడు గ్రోనామ్ ఎద్దు. ‘చెప్పు మరి’ అడిగారు అందరు.

         'వార్త మనిషి నడుస్తూ వెళ్లకూడదు. అతగాడిని ఒక బల్లమీద పెట్టి పంపితే, అతను మంచును తొక్కడు!’

         గ్రోనామ్ చాలా తెలివిగలవాడు. ఆ తెలివికి సంతోషించి పెద్దలందరూ ఈసారి చప్పట్లు చరిచారు.

         వెంటనే గింపెల్ కోసం వంటశాలకు పంపించారు. కుర్రవాడు వచ్చాడు. వాడిని ఒక బల్లమీద ఎక్కించారు. మరి ఆ బల్ల ఎట్లా కదులుతుంది? వంటశాలలో వంటాయన ట్రైటెల్, దుంపచెక్కులు తీసే బెరెల్, సలాడ్ కలిపే యూకేల్, యోంటెల్ అక్కడే ఉన్నారు. వాళ్లంతా మేకలకు మేత వేస్తున్నారు. ఆ నలుగురూ కలిసి గింపెల్ ఎక్కిన బల్లను ఎత్తుకుపోవాలని నిర్ణయించారు. వాళ్లు బల్లకాళ్లు తలొకరూ పట్టుకున్నారు. గింపెల్ చేతిలో కర్రసుత్తి పట్టుకుని నిలబడ్డాడు. దానితో అతను ఇళ్ల కిటికీల మీద కొడతాడు. ఇక అందరూ బయలుదేరారు.

         ప్రతి ఇంటి కిటికీ మీద సుత్తెతో కొట్టి గింపెల్  ‘ఈ రాత్రి ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రాకూడదు. బయట నిధి కురిసింది. దాన్ని తొక్కకూడదు’ అని చెప్పసాగాడు.

         ఛెల్మ్‌లో వాళ్లకు పెద్దలమీద గౌరవం ఎక్కువ. అందుకే ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఇక అక్కడ పెద్దలు మాత్రం నిధిని సేకరించడం గురించి, దాన్ని వాడడం గురించి ఆలోచనలో ఉన్నారు. నిధిని అమ్మి, బంగారు గుడ్లు పెట్టే బాతును కొంటే బాగుంటుందని ఒక పెద్దాయన చెప్పాడు. ఇక ఒకరోజు కాదు, నిత్యమూ నిధి దొరుకుతుంది.

         మత్తు లెకిష్‌కు మరో ఆలోచన వచ్చింది. ఛెల్మ్‌లో వాళ్లకంతా కళ్లజోళ్లు కొని ఇవ్వాలి. ఇక ఇళ్లు, వీధులు, దుకాణాలు అన్నీ పెద్దవిగా కనిపిస్తాయి! ఛెల్మ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తే మరి పెద్దదే అవుతుంది. అది పల్లె పోయి పట్నం అవుతుంది.

         ఇంకా మంచి మంచి ఆలోచనలు వచ్చాయి. అవి కొనసాగుతుండగానే ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చాడు. పెద్దలంతా కిటికీలోనుంచి బయటకు చూచారు. ఆశ్చర్యం. కురిసిన మంచును ఎవరో కసకసా తొక్కనే తొక్కారు.  ఎవరని చూస్తే, బల్ల మోసిన నలుగురి కాళ్లు అని తెలిసింది.

         ఛెల్మ్ పెద్దలు తమ తెల్లగడ్డాలు పట్టుకుని పీక్కుంటూ, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ నలుగురినీ నడిపించకుండా వాళ్లను ఎత్తుకుని పొమ్మని మరో నలుగురికి చెబితే బాగుండునేమో అనుకున్నారు!

         మళ్లీ పండుగకు మళ్లీ నిధి కురిస్తే అప్పుడయినా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటినుంచే నిశ్చయించుకున్నారు.

         ఛెల్మ్‌లో వాళ్లకు నిధి మిగలలేదు. కానీ, మళ్లీ సంవత్సరం అది కురుస్తుందని ఆశ మాత్రం మిగిలింది. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ తప్పు పోదుకదా!