Monday, August 3, 2026

తిండి పిండి ఎన్నో సంగతులు 2 On Food and Starch


తిండి - పిండి

అందరమూ మూడు పూటల బుద్ధిగా కూర్చుని తింటాము.  మరి ఆ తిండి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అదేమన్నమాట? కష్టపడి సంపాదించుకుంటున్నాము. తింటున్నాము అనుకోవచ్చు. ఆలోచన మరింత ముందుకు పోతే తినడానికి పంటలు, జంతువులు ఉన్నాయి కదా అనుకోవచ్చు! పంటలు, జంతువులు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎందుకు అంతగా దొరుకుతున్నాయి? ఎట్లా ఆ విధంగా అవి పెరుగుతున్నాయి? అన్నవి ఆ తరువాత రావాల్సిన ప్రశ్నలు!

ఈ భూమిమీదికి మనకన్నా ముందు మొక్కలు వచ్చాయి. అవి పెరిగి చెట్లు అయ్యాయి. ఒక చెట్టును గమనిస్తే దాని నిండా రక రకాల ఆకులు ఉంటాయి. అరటి చెట్టు ఆకులు వెడల్పుగా ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవైనా చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం కలిసి ఒక పెద్ద విస్తీర్ణాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి. ఈ ఆకులు మనకు తిండి పెట్టే కర్మాగారాలు అన్న సంగతి చాలామందికి అర్థం అయి ఉండదు. అందుకే మనం సైన్స్‌ గురించి తెలుసుకోవాలి. తినే తిండి గురించి తెలియని వాళ్లకు ఇంకా మిగతా విషయాలు ఏం తెలిసినట్టు లెక్క?

ఆకులలో ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా పిండి పదార్థం తయారవుతుంది. ఇది అటువంటి ఇటువంటి అద్భుతం కాదు! అద్భుతాల కే అద్భుతం! ఆ పిండి కారణంగానే మొక్కలు, పొదలు, చెట్లు, మహా వ ృక్షాలు అన్ని అంతలేసి గా పెరుగుతాయి. ఆ మొక్కలను తిని కొన్ని రకాల జంతువులు పెరుగుతాయి. ఆ జంతువులను మరి కొన్ని జంతువులు తింటాయి. కొన్ని జంతువులు మొక్కలను, జంతువులను అన్నింటినీ తింటాయి. ఇక మనిషి అనే మన జాతి మాత్రం దొరికిన ప్రతి చెత్తా తినే రకం. చాలా రకాల జంతువులు కూడా తినని కొన్ని పదార్థాలను మనం తింటాము. ఈ మాట అంటున్నప్పుడు అసలు సిసలైన సర్వ మానవ సౌభ్రాత ృత్వం కనబడుతున్నది. మనుషులలో కూడా కొంతమంది శాకాహారులు ఉంటారు. శాకము అంటే కూర. ఈ సంగతి వ్యాసం టైప్‌ చేస్తున్న కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ కూడా తెలిసినట్టు లేదు. అది నన్ను కష్టపెట్టి ఏవేవో మాటలు చూపిస్తున్నది. వాళ్ళు కూర సంగతి మరిచిపోయి, కొమ్మలు తింటున్నాము అనుకుని శాఖాహారము అని రాసుకుంటారు. అది తప్పు.

 

మొత్తానికి ప్రపంచంలోని మొక్కల నుండి మహావ ృక్షాలు వరకు, చీమల నుండి మహా మ ృగాల వరకు అన్నింటికీ తిండి పెట్టేది ఆకులు అన్న సంగతి మనం మొట్టమొదట గుర్తించాలి. ప్రాణదాతలు గా గుర్తించి అన్ని రకాల చెట్లకు వినయ విధేయతలను ప్రదర్శించాలి.

ఆకులలో పచ్చని రంగు ఉండడం మరొక అద్భుతం. ఆ పచ్చని రంగును ఆకుపచ్చ రంగు అనే వరకు అది వ్యాపించింది. ఆ రంగు కారణంగానే మనకు పిండి పదార్థం, అంటి తిండి పదార్థం దొరుకుతున్నది అన్నది మరొక అద్భుతం. ఇది కూడా మామూలు అద్భుతం కాదు. మొత్తం జీవ ప్రపంచానికి ఆధారం గా నిలిచిన అద్భుతం. ఆకుపచ్చ రంగుకు కారణం క్లోరోఫిల్‌ అనే పదార్థం. మొదట ఆకులు సూర్యుని వెలుతురును గ్రహిస్తాయి. ఈ విషయాన్ని మనం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నీడలో వేసిన మొక్కలు చక్కగా పెరగవు. గోడ పక్కన వేసిన మొక్కలు ఎండ ఎటువైపు ఉంటే అటు పెరుగుతాయి. గోడ వైపు కొమ్మలు కూడా ఎండ వైపు తిరుగుతాయి. ఈ సంగతి ఇంతకుముందు గమనించకుంటే ఇక మీద అయినా గమనించి చూడండి. ఈ ప్రపంచమంతా, కనీసం ఆకు పచ్చని చెట్ల ప్రపంచమంతా సూర్యుని వైపు చూచి పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఎండ మరీ వేడిగా ఉంటుంది. అది నేలను చేరే వరకు కొంత చల్లబడుతుంది. అట్లా చల్లబడిన ఎండ ఆకులకు ఉపకరిస్తుంది. అక్కడ జరిగే కార్యక్రమం వివరాలు ఈరోజు వరకు కూడా పూర్తిగా అర్థం కాలేదు.

1866లో ఆస్ట్రియా దేశంలో ఒక పరిశోధకుడు మొక్కలకు వేడికి గల సంబంధాన్ని మొట్టమొదటిసారి గుర్తించాడు. ఎండా, వేడి ఉంటే కానీ, మొక్కలు పెరగవు అని చెప్పాడు. సముద్రంలో పరచుకొని ఉన్నడెస్మిడ్స్‌, డయటమ్స్‌ వంటి  కొన్ని రకాల చిన్న మొక్కలు మొదలు, మహావ ృక్షాలు దాకా ఈ ఆకు పచ్చని ఆకులు, వెలుగు సహాయంతో పనిచేసే రసాయన కర్మాగారాలు, అంటే కొత్త పదార్థం తయారయ్యే చోట్లు, అని అతను తేల్చి చెప్పాడు. అందరికీ అది వింతగా వినిపించింది. ముందు ఎవరికీ నమ్మకం కలగలేదు.

ఇంటి మీద ఫోటో వోల్టాయిక్‌ సెల్స్‌ పెట్టి సోలార్‌ ఎనర్జీని  గ్రహించి కరెంట్‌ గా వాడుకోవడం కొంతమంది చూసి ఉంటారు. ఇందుకు అసలుసిసలైన నమూనా ఆకులు. వాటిలో కరెంటు పుట్టదు. పిండి పదార్థం పుడుతుంది. ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు కూడా ఆశ్చర్య పడని వారికి ఈ ప్రపంచంలో మరే విషయము ఆశ్చర్యకరంగా కనిపించదు. వారి బతుకులు చాలా పొడిపొడిగా నడుస్తాయి. సైన్స్‌ రుచి తెలియని చీకటి బతుకులను గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే! చీకట్లో కూడా కనిపిస్తున్న భావంతో మనకు తిండి గురించి తెలుసు అనుకుని తింటున్నాము. కానీ పత్రహరితం అనే క్లోరోఫిల్‌ గురించి తెలుసుకుని, ఆకులలో జరుగుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకుని అప్పుడు తిన్నది అన్నం అయినా, లేక మరొకటి అయినా అందులో కొత్త రుచి కనబడుతుంది. దాని పేరే సైన్స్‌ రుచి!

వృక్ష శాస్త్రం అని ఒక ప్రత్యేక విజ్ఞాన శాఖ ఉంది. అది నిన్నమొన్న పుట్టలేదు. కలకాలం గా ఉంది. కానీ అందులోని వారికి చాలా రోజుల వరకు మొక్కలు పెరగడానికి వెలుగు అవసరం, అన్న విషయం అర్థం కాలేదు. ఇంతకన్నా విచిత్రమైన విషయం ఇంకొకటి ఉండదు. సైన్స్‌ తీరు అలాగే ఉంటుంది. ఒక విషయాన్ని ముందుగా ఊహించి, ఆ తరువాత అందుకు సంబంధించిన వివరాలను సేకరించి, ఆ వివరాలలోని సంబంధాలను, వాటికి గల పూర్వాపరాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. ఆహా! అనిపిస్తుంది. ఒక కొత్త సూత్రం పుడుతుంది. ఒక కొత్త అవగాహన కలుగుతుంది. అది సైన్స్‌ రుచి!


 

Saturday, August 1, 2026

లోకాభిరామం - వానొచ్చె వరదొచ్చె : On rain and then Sambaru


వానొచ్చె వరదొచ్చె

పొటుకు - పొట్కు- టపక్‌

ఇల్లంత టపక్‌ పెడ్తున్నాది. పెద్దా పుస్కం తడ్సీ పోతుంది’ అని ఎర్రని గుడ్డలో చుట్టిన ఒక లావుపాటి పుస్తకాన్ని తెచ్చింది బువ్వమ్మ. ఆ పెద్ద పుస్కం పవిత్ర గ్రంథం ఖురాన్‌. తెచ్చిందేమో నిప్పులు కడిగే ఆచార్లవారి ఇంటికి. వాన కాలమంతా ఆ పుస్తకం ఆచార్లవారి ఇంట్లో గూట్లో సురక్షితంగా ఉంటుంది. అక్కడి మిగతా పుస్తకాలు అన్నింటితోబాటు! బువ్వమ్మ ఇల్లు పూరి గుడిసె అనుకుంటాను. ఆచార్ల వారిది మట్టిమిద్దె. అప్పటికి రాతిగోడలు వచ్చినయి కానీ, సిమెంటు కప్పులు రాలేదు.

మట్టిమిద్దె అంటే గోడలు కూడా మట్టివయి, ఆ మీద కప్పు ఉంటుంది. రాతిగోడల మీద కూడా మట్టిమిద్దె ఉంటుంది. దూలాలు లావుగ ఉంటయి. వాటిమీదనుంచి గోడల మీదకు కొంచెం సన్నటి వాట్లు ఉంటయి. (ఈ మాటంటే వేట్లు? అని అడిగాడు నా కొడుకు! మీకు అర్ధమయితే సరే, కాకుంటే వదిలేయండి.) ఆ వాట్లమీద చిలుక చెక్క పరిచి ఉంటుంది. కలిగిన వారయితే పలకలుగా తీర్చిన చిలుకు చెక్కలను, మధ్య ఖాళీలు లేకుండా పరిపిస్తరు. లేదంటే పొయ్యిలోకి కొట్టిన కట్టెలను పేర్చి, మీద గడ్డి పరిచి, ఆ మీద మట్టి వరస వేస్తరు. మట్టిమిద్దెలో ఎండలకు పగుళ్లు వస్తయి. గడ్డి, చిన్న మొక్కలు పెరుగుతయి. చుట్టు గోడలను మిద్దెకన్న కొంచెం ఎక్కువ ఎత్తు వరకు కడతరు. వాటిని కుంబిగోడలు అంటరు. వాటిమీద కూడా పగుళ్లు, గడ్డి మొక్కలు ఉంటయి. వానలు రాబోతున్నయంటే, మొక్క లన్నింటినీ పీకి, చవిటి మన్ను తెప్పించి మిద్దె నిండ పరిపించాలె. మొదటి వానలకే మట్టి తడిసి పరుచుకుంటుంది. దిమ్మిస పీటతో కొట్టి దాన్నంత చదును చేయాలె. వాలు సరిగ్గ వుండేట్లు సరిచేయాలె. ఇదంతా సక్రమంగ జరిగితే పడిన వాననీరు గూనలలోంచి కిందకు పడుతుంది. ఈ పనులు వీలవుతయి, కావు. కుదురుతయి, కుదరవు! ఇంక వాన వచ్చిందంటే చాలు పొటుకు మొదలవుతుంది.

వాతావరణం మారిపోతున్నదని చెప్పడానికి పరిశోధకుల దాక పోనవసరం లేదు. గతంలో వాన కాలమంటే  ప్రతినిత్యం ఉదయం, అస్తమానం వాన కురవవలసిందే. ముసుర్లు పట్టుకుంటే అయిదారు రోజులు ఏకాకారంగా వాన కొనసాగేది. గోనెసంచీ, గొంగడీ కప్పుకుని, అంత దూరం బడికిపోతే ‘సెలవు! వెళ్లిపొండి!’ అనేవారు. ఇంటి కంటే బడి మరింత అధ్వాన్నం. అందునా, మా బడి పక్కనే పెద్ద చెరువు కూడ ఉంది. నీళ్లు గదుల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతటి వానలో ఇల్లు, పూరి గుడిసె అయినా, మట్టిమిద్దె అయినా పొటుకు తప్పదు. పగుళ్లు, మొక్కల వేళ్లుంటే, ఎక్కువగ, లేదంటే, అక్కడా ఇక్కడా మిద్దెలోంచి నీరు ఇంకి చుక్కచుక్కగ పడుతుంది. అదే పొటుకు. మా ఇల్లు నిజంగ తాతల కాలం నాటిది. రకరకాల పాత్రలను ఆ పొటుకు పడుతున్న చోట పెట్టి, నేలన్న తడి కాకుండ జాగ్రత్తపడి, మిగిలిన చోట పండుకోవాలె. పొటుకు మరీ ఎక్కువగా ఉంటె, వానలోనే జాగ్రత్తగ మిద్దె ఎక్కి ఆ భాగంలో తొక్కాలె. చవిటి మన్ను జారుడుగ ఉంటుంది. కాలు జారితే ప్రమాదం! మట్టిమిద్దెలు పోయినయి! పొటుకు మాత్రం మిగిలింది. ఎవరన్నా ఒకేపని గురించి, సంగతి గురించి, తెరిపిలేకుండ అడుగుతూ (నస!) కష్టపెడుతున్నరనుకోండి. దాన్ని పొట్కు-పొటుకు పెడుతున్న రని వర్ణించేవారు. ఆర్‌సీసీ మిద్దెల్లో కూడా లీకులున్నయి. పొటుకుల ఉండే ఉంటయి. ఎండను తట్టుకోవాలని వేసే కూల్‌హోమ్‌ కారణంగ పగుళ్లు వస్తయని చెప్పినరు ఒకరు. మరేమి, అట్లాంటివి జరిగితే పొటుకు తప్పదు!

బల్లి సాంబారు: ఉల్లి సాంబారు అని వేరుగ ఏదయినా ఉంటుందా? సాంబారు వెంగాయం అని చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయని తెలుసు. వాటిని అట్లాగే వేసి సాంబారు వండుతారనుకుంటాను. ‘బిసి బేళె హుళి అన్న’ అంటే వేడి పప్పుపులుసు అన్నం అని అర్ధం. అందులో వెంగాయం అంటే ఉల్లి పాయలు పెద్ద ముక్కలు వేయడం చూచాను. (నిజమే, నాకు తిండి గురించిన చింత ఎక్కువ. ఎర్రోనికి ఏమి చింత? అంటే ఎప్పటికి తిండిమీదనే చింత’ అని ఒక మాట ఉంది. ఈ ఏర్రోడు వెర్రివాడా లేక ఎర్రని వాడా? శివరాజు సుబ్బారావు అనే బుచ్చిబాబుగారు, వరంగల్‌ నవీన్‌గారి పద్ధతిలో పోతున్నది రాత. నా పేరులోనూ ‘బుచ్చి’ ఉంది. వరంగల్లు మీద కావలసినంత ప్రేమ ఉన్నది! అక్కడికే పోవాలె మనం ఇప్పుడు. వరంగల్‌లో ఎమ్‌ఎస్‌సి చదువుతున్నము. మధ్యాహ్నం పూట మొదటి పంక్తి భోజనాలు అయిపోయినవి. అమ్మాయిల హాస్టలు చిన్నది. అక్కడికి కూడా తిండి ఈ హాస్టల్‌నుంచే పోతుంది. అక్కడ కూడ అందరూ తిన్నరు. ఆలస్యమయి రెండవ పంక్తికి వచ్చిన వారు తింటుంటే సాంబారులో బల్లి పడిందని తెలిసింది! అసహ్యం అన్న మాట పక్కనపెడితే తెలియకుండ తిన్నవారికి, రెండవ పంక్తిలోని వారికీ, ఎవరికీ ఏమి కాలేదు! అంతా ఆరోగ్యంగ ఉన్నరు. సంగతి తెలిసిన తరువాత ‘కడుపులో తిరుగుతున్నది!’ అని కొందరు హెల్త్‌ సెంటర్‌కు పరిగెత్తినరు. పరిగెత్తినరంటే ఆరోగ్యంగ ఉన్నరనే గదా అర్థం. డాక్టర్‌ రెడ్డిగారు వాండ్లను పరీక్షించి డైజీన్‌ లాంటి మాత్ర ఏదో ఇచ్చి పంపించినరు. బల్లిని ఉడికించి తింటేనే ఏం కాలేదు. అది మీద పడితే ఏమవుతుంది! ఆ బల్లి అనారోగ్యంగ ఉండి, దాన్ని ద్వారా క్రిములేమైన సోకితే ఏమన్న అవుతుందేమో?ఏమో?

ఉల్లి సాంబారు: మేము (ఇంట్లో) ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనపకాయ లాంటివి తినము. ఛాదస్తమే! అయినా తినము. ఎక్కడన్న ఉల్లిపాయల వంట తిన్నమంటే, తరువాత వాసన తెలుస్తుంది. మాకుండే ఛాదస్తం వెనక కొన్ని పద్ధతులున్నయని చెప్పంగ విన్న. కొన్ని పదార్థాలు చూడడానికి బాగుండవు. కొన్నింటి వాసన బాగుండదు. కొన్ని అర్ధం లేని చాదస్తం! క్యాబేజ్‌ కొత్తగ వచ్చినపుడు నాన్న అడ్వెంచరస్‌ గనుక కొని తెచ్చినడు. అది భయంకరమయిన వాసన.అప్పటి క్యాబేజీతో పోలిస్తే ఇప్పటిది ఎంత మేలో చెప్పలేము. అప్పట్లో పురుగుమందులు ఇంతగ లేవు కనుక ఆకుల మధ్యన పురుగులు కూడ ఉండేవి! ‘కన్న మన్ను తెచ్చి వండమంటరు!’ అని అమ్మ గులుగుడు (గొణుగుడు) నాకు గుర్తుంది. ‘మెప్పులకై కన్నతావు అప్పు వడక’ అన్నారు త్యాగయ్యవారు. కన్న అంటే కనిన అంటే చూచిన అని అర్ధం. అంతేగానీ ప్రసవంతో సంబంధం లేదు. బిడ్డను చూస్తము గనుక అది కానుపు! ‘నిను కన్నది కానుపు’ అని రామదాసుల వారంటే అది చూడడం గురించే, ప్రసవం గురించి కానే కాదు! అందుకే కన్న మన్ను అంటే కనపించిన మన్ను అని.

మళ్లీ, మేము ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనిగెంకాయె తినము (ఈసారి అసలు సంగతే చెప్త!) మా బిల్డింగులో ఒక్కోసారి సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తరు. ఒక్కో ఇంటివారు ఒక వంటకం చేసి తెచ్చి, అందరూ ఒక చోట తినడం అదొక సరదా! మా ఇల్లుగలావిడ, మా యజమాని, మా ప్రొఫెసరు గారు (మాయావిడ, నా భార్య) సాంబారు వండమంటే సరేనని వండింది. అందులో ఆన్యన్‌ అనే ఉల్లిపాయల్లేవు. అయినా చాలా రుచిగ ఉందన్నరు అందరు! ఆనియన్‌ అదే ఆన్యాన్‌ లేకుండా సాంబారు ఎట్లా చేస్తరని అందరూ హాచ్చెర్య పడిపోయేశినరు. తరువాత ఒకటి రెండుసార్లు కూడా సాంబారు తయారీ బాధ్యత మా ఇంటికే వచ్చినట్టు గుర్తు! అన్య అంటే ఇతరము. తమిళంలో అన్యన్‌, అన్నియన్‌ అవుతుంది. అపరిచితుడు ఎందుకు మనకు మన సినిమాలో?

మూడు పైసల నాటకం: అంకుశ్‌ బోర్‌హాడే అనే పేరు మీరు విని ఉండరు. అతను మరాఠీ అయి వుంటడని కొందరికి తోచి ఉండవచ్చు. బెర్ట్‌హోల్ట్‌ బ్రెష్‌ట్‌, జెర్మనీలో ప్రసిద్ధ నాటక రచయిత. అతని పేరును బ్రెఖ్‌ట్‌, బ్రెహ్ట్‌ అని కూడ పలుకుతరు. అతని సాంఘిక నాటకాలు సంచలనం కలిగించినయి. అందులో ఒకదాని అనువాదం ‘ద త్రీ పెన్నీ ఆపెరా’ పోనీ ఓపెరా అనండి! నాకు అభ్యంతరం లేదు. జబ్బార్‌ పటేల్‌ అనే మరాఠీ నాటక కారుడు దానికి అనువాదం కాదు గానీ అనుసరణ చేశినడు. ‘తీన్‌ పైసాచా తమాషా’ అని దాని పేరు. తమాషా అనేది మరాఠీ జానపద నాటక పద్ధతులలో ఒకటి. అక్కడ మొదలయి, ఈ నాటకం సాగుతుంది. అందులో నాయకుని పేరు అంకుశ్‌ బోర్‌హాడే. అతను నాటకం మొదలయిన తరువాత చాలాసేపటి వరకు రంగం మీదకి రాడు. అతనొక రౌడీ, దాదా! పాత్ర వచ్చే ముందు ఆ పేరును ప్రతిధ్వనులతోపాటు హాలంతా కదిలిపోయిందేమో అనిపించే పద్ధతిలో వినిపింపచేసిన తీరు నాకు ఇంకా గుర్తుంది. మనసులో మనం ఒక ఎస్వీ రంగారావును ఊహించుకుంటే, అక్కడ అందమైన యువకుడు ఎదురయ్యినడు. నాటకం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో, అంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. పుణె (పూనా లేక పునహా) బాల గంధర్వ రంగమంచ్‌లో చూచిన నేను. అంకుశ్‌ పెళ్లవుతుంది. హాలంతా రంగు దీపాలు వెలిగినయి. ప్రేక్షకులందరు పెళ్లి వారయ్యినరు! ము! బావుంటుంది, మరాఠీ వారి నాటక విద్య! ఆ హాల్లో నిత్యమూ నాటకం ఉంటుంది. మిగతా చోట్ల సినిమా చూచినట్టే జనం టిక్కెట్లు కొని నాటకాలు చూస్తరు. ఈ అలవాటు మహారాష్ట్రలో ఇంకా కొనసాగు తున్నది. మన దగ్గర హైదరాబాదులో ప్రయత్నం జరిగింది కానీ, కొనసాగలేదు మరి.


 

Saturday, July 25, 2026

లోకాభిరామం : నను పాలింప On Classical music


నను పాలింప

మా ఇంట్లో ఒక లామినేట్ చేసిన చిత్రపటం ఉంది. అందులో త్యాగరాజస్వామి భువనేశ్వరం ముందు కూచుని బహుశ: పాడుతూ ఉంటడు. (మా సంప్రదాయంలో దేవుని విగ్రహాలు ఉండే మంటపాన్ని భువనేశ్వరం అంటరు). అందమయిన ఆంజనేయస్వామి, మోకాళ్లమీద కూచుని పబ్బతి బట్టి (అంటే చేతులు జోడించుకుని) ఆనందంగ చూస్తుంటడు. త్యాగయ్య గారి భార్యామణి వంటింటి తలుపులో నిలబడి ఉంటుంది. అన్నిటికన్న ముఖ్యమైన విషయం రాముడు, సీత, తమ్ములతో అభయహస్తం పట్టి నిలబడి ఉంటడు. ఇది బొమ్మ తీరు. ఈ మధ్యన ఇదే బొమ్మ నాకు ఇంకొక చోట పుస్తకం కవరుపేజీగ కనిపించింది. ఫోటోషాప్ అని ఒకటి వచ్చింది గద! దాని సాయంతో రామయ్య చేతినుంచి వెలుగుపుట్టి త్యాగయ్య మీద ప్రసరిస్తున్నట్టు అక్కడ మార్చి పెట్టినరు. బొమ్మ బాగనే ఉన్నది. కానీ, నా బుర్రలో అనుమానాలు మొదలయినయి. రాముడంతటి వాడు, దార సోదరాదులతో దయచేసి వస్తే త్యాగయ్య లేచి నిలబడి ఉండాలె గద. వాళ్లావిడ కూడ పక్కనే ఉండాలె గద! ఆ నమస్సులు, ఆశీస్సులు అన్నీ అయినయి అనుకుందము. రామయ్య తాపీగ,  ఏమయ్యా! ఒక పాట పాడవచ్చు గదాఅన్నడే అనుకుందము. ఆయనను చాపవేసి కూచోబెట్టి, కమ్మగ కచేరీ చేయవచ్చు గద? నిలవెట్టి ఎందుకు ఆ పాట? అదీ నా అనుమానం.

ఇటువంటి మాటలు అంటుంటే వీనికి మరీ భయం, భక్తిలేకుండ పొయినయి అనే వాళ్లు చాలామంది ఉంటరు. నాకు తెలుసు! కానీ సందేహం రావడం మంచిదని మాకు ఒక పద్ధతి ఉంది. చొప్పదంటు ప్రశ్నలకే సమాధానాలు ఉండంగ లేనిది, నా ప్రశ్నకు ఎవరో జవాబు చెప్పకపోతరా? అని అడగడం. ‘సందేహమును తీర్చవయ్యా?’ అంటూ త్యాగయ్య నేరుగా రాముడిని ప్రశ్నలు అడిగినడు. త్యాగయ్య కీర్తనలలో చాలామటుకు ప్రశ్నలే పల్లవిగ ఉంటయి. ఆ ప్రశ్నలలో రకాలు, ప్రశ్న ముగిసిన చోటున వేరువేరు స్వరస్థానాలు ఉండడం గురించి పెద్దలు చర్చించడం విన్న. ‘ఎవరిచ్చిరిరా శర చాపములు?’ అని త్యాగయ్య తెగేసి అడగడం కూడా అందరూ ఎరిగినదే! అట్లా ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగినడు.

మళ్ల లామినేటెడ్ బొమ్మలోకి వద్దము. ఇక్కడ ఆయన ‘నను పాలింప నడచి వచ్చితివో’ అని పాడుతున్నడని నాకు అనిపించింది. ఈ పాట గురించి నిజానికి వేరే కథ ఉంది.త్యాగరాజస్వామి కూతురి పెళ్లి సందర్భంగ అనుకుంట, వాలాజపేట వేంకటరమణయ్య లేదా మరొక శిష్యుడు, రామ పట్టాభిషేకం చిత్తరువును బహుమతిగ (పోటీలో బహుమతి కాదులెండి!) తెచ్చిస్తే, చూచి త్యాగయ్య భక్తితో పాట పాడినట్టు చెపుతరు. ఉరమున ముత్యపు సరుల చయముతో అంటూ మొదలయి ఆ పాటలో రాముని వర్ణన మాత్రమే ఉంటుంది.

నా కోతి బుర్రకు ఇక్కడ మరొక సంగతి గుర్తుకు వస్తున్నది. ‘నిన్ను కోరి’ అనే మాటతో మొదలయే మోహనరాగ వర్ణం కర్ణాటక సంగీతంలో మంచి పాపులర్‌గ ఉంది. మన తెలుగు సినిమాలో ఒకచోట  ‘నిన్ను కోరీ వర్ణం’ అంటూ ఒక హిట్టు పాట పెట్టేశినరు. ఆ పాట వినేందుకు బాగుంటుంది. కానీ సంగీతంలోని వర్ణానికి, దానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అట్లాగే బుద్ధిమంతుడు అని ఏఎన్ఆర్ హిట్ సినిమా ఒకటి ఉంది. అందులో ‘నను పాలింపగ నడచీ వచ్చితివో’ అని ఒక పాట ఉంది. దానికీ, అసలు మోహనరాగ కృతికీ సంబంధమే లేదు. ఈ పాట పల్లవి, కర్ణాటక సంగీత ప్రపంచం నుంచి వచ్చిందని తెలియని ప్రేక్షకులు, శ్రోతలు చాలమంది ఉంటరు. శంకరాభరణం సినిమాలోని సామజ వరగమన సంగతి కూడా ఈ రకంగనే ఉంటుంది. సంస్కృతినీ, సంప్రదాయాన్నీ ఇష్టం వచ్చినట్టు వాడడం మనకు బాగ చేతనవుతుందని అనుమానం!

నాకు భయం, భక్తి లేవుగాక లేవు. కానీ, ఒంటి నిండ కుతూహలం ఉంది. సైన్సు చదివిన, చదువుతున్న. అర్థమయిన సంగతులను పదుగురితో పంచుకుంటున్న. అదే పద్ధతిలో వైష్ణవం గురించి బోలెడంత చదివినట్టున్న. దాని గురించి, రాసింది తక్కువ. కానీ మాట్లాడిన. తిరుపతి బ్రహ్మోత్సవాలు (తిరుమల అనాలి) ఏనాటికానాడు టీవీలో చూపించడంలో కీలకపాత్ర వహించిన. అదే పద్ధతిలో ఈ సంవత్సరం త్యాగరాజ ఆరాధనోత్సవాలకు తిరువయ్యారు పొయ్యిన. నాకు కర్ణాటక సంగీతం (హిందుస్తానీ కూడ) ఎందుకంత పట్టిందో అర్థం కాదు. ఉత్తర భారతదేశంలో సవాయి గంధర్వ ఉత్సవాలు, సంత్ రాయ్‌దాస్ ఉత్సవాలు జరుగుతయి. కానీ, త్యాగరాజ ఆరాధన లెవెల్లో జరగవని నా అనుమానం. కనుకనే సంగతి చూడాలని వెళ్లిన. నిజం చెపుతున్న. అక్కడ ఎవరిలోను భయం, భక్తి కనిపించలేదు.

తిరువయ్యారులో కనిపించిన ప్రత్యేకత అక్కడి క్రమశిక్షణ. పుస్తకంలో అచ్చువేసిన క్రమం ప్రకారం ఒకరి తరువాత ఒకరు వచ్చి పాడుతున్నరు. లేక వాయిద్యం వాయిస్తున్నరు. సన్మానాలు, పొగడ్తలు లేవు. పని ముగిసిన తరువాత ఎవరి దారిన వారు పోతున్నరు. పోయే ముందు త్యాగయ్య సమాధి ముందుకు వెళ్లి ఒక నమస్కారం చేస్తున్నరా? అంటే అనుమానమే. ఇంక జనం సంగతి. అంత పెద్ద పందిరిలో నిండా కిక్కిరిసి ఉన్నరు. వాళ్లలో ఎంత మందికి సంగీతం తెలుసంటే మళ్లీ అనుమానమే. అంతమంది ఉన్నాసరే తొక్కిసలాట, తోసుకోవడం లేవు. పోలీసులు చూస్తూ నిలవడి ఉన్నరంతే. అంతా జాతర లేదా తిరునాళ్ల వాతావరణం. సందుల నిండ అంగళ్లు. అన్నిరకాల వస్తువులు అమ్ముతు న్నరు. కొనేవాళ్లు కొంటున్నరు. సంగీత ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంత ఎత్తున నివాళి సమర్పించడం ప్రపంచంలో మరెక్కడ లేదు. కానీ అందులో త్యాగయ్య ప్రత్యక్షంగ కనిపించడం లేదు.

పంచమి రోజున ఉదయం తొమ్మిదినుంచి ఘనరాగ పంచరత్నాలు అందరూ కలిసి పాడతరు. అందులో పాల్గొనే కళాకారులకు విద్వాన్ పాస్ ఇస్తరు. నేను గాయకుడిని కాను. ఒక విఐపి పాస్ సంపాదించినరు నా కొరకు. నేను, నా తోటివారు ఉదయం ఆరున్నరకే పందిరి చేరుకున్నము. అప్పటికే సీనియర్ ఆర్టిస్టులు కూడ వచ్చి కూర్చున్నరంటే ఆశ్చర్యం! ఎంతమంది జనం వచ్చినరో? చాలామంది వీఐపీలు కూడ వచ్చినరు. వచ్చినది ఎవరయినా కానీ, ఆ ఇసుకలో చతికిల పడవలసిందే! కుర్చీ, స్టూలు ఒక్కటంటే ఒక్కటి లేదు. నేను వెతికి వెతికి ఒక టీవీ కెమెరా పక్కన కూచున్న. అట్లాగుంటే ఎవరికీ టీవీలో కనిపించే ప్రమాదం ఉండదు. వచ్చేవారిలో మళ్లీ భయం, భక్తి మచ్చుకు కనిపించలేదు. టిఫిన్లు తింటూ, కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తున్నరు. నాదస్వరాల బృందాలవారు ఒకరి తరువాత ఒకరు వాయిస్తు న్నరు. మిగతా వాద్యాలవారు, గాయకులు వచ్చి చేరుకుంటున్నరు. చిత్రంగా బాగా పేరున్న గాయకులు, వాద్యకారులు కనిపించింది తక్కువ. ముందు రాత్రి పాడినవారు కూడా వెళ్లిపొయినరు.

ఉత్సవాన్ని నిర్వహించే వాళ్ల బలం బాగ కనిపించింది. గుడికి వచ్చేవాళ్లను రమ్మనేవారు ఎవరు ఉండరు. నిజమే కానీ అక్కడ కూడ, ఓహో! వచ్చినరా! అనేవారు ఉంటరు. ఇక్కడ కొందరు అవసరంగ, అనవసరంగ మధ్యన తిరుగు తున్నరు. మమ్మల్ని చూడండి అన్నట్టుంది తీరు. వాళ్లు బహుశ: కొంత మందిని పట్టించుకోరు. కనుకనే అందరూ ఆ సందర్భానికి అక్కడికి రారు. వచ్చిన వారు కూడా ఎవరినీ పట్టించుకోకుండనే పని ముగించుకుని వెళ్లిపోతున్నరు. క్రమశిక్షణ మాత్రం పాటిస్తున్నరు.

ఝలక్: నేను మొదటిరోజు సాయంత్రం (గోష్టి గానానికి ముందు రోజు) స్టేజి వెనకకు వెళ్లి తెలిసిన వారిని పలకరించిన . చాలాసేపు అక్కడే ఉన్న. కొంతసేపటికి ఎందుకో బయటకి వచ్చిన. మళ్లీ లోపలికి పోతుంటే పోలీసు అడ్డుకున్నడు. అదేమిటి అక్కడనుంచే వచ్చిన గద అంటే, అదంతే అన్నడు.


 

Monday, July 20, 2026

పువ్వులకు రంగులు ఎందుకు?


వువ్వులకు రంగులు ఎందుకు?

ఒక్క గులాబీలే లెక్కలేనన్ని రంగుల్లో ఉండడం చాలామందికి తెలియకపోవచ్చు. నల్లని గులాబీలు కూడా ఉన్నాయి. నెదర్లాండ్స్‌ వంటి యూరప్‌ దేశాలలో పనిగట్టుకుని ట్యూలిప్‌ పువ్వులను రకరకాల రంగులలో పోటీపడి తయారు చేస్తుంటారు. కొత్త రంగులు తయారు చేయడానికి సంకరకరణం అనే పద్ధతిని వాడుకుంటారు.

ఈ ప్రపంచంలో ఎన్ని రకాల, ఎన్ని రంగుల పువ్వులు ఉన్నాయన్నది ఊహకందని ప్రశ్న. ఆ రంగుల అవసరం మాత్రం ఒకే ఒక్కటి. అది పునరుత్పత్తి. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ తమ జాతి కొనసాగవలెనన్నది ఏకైక కార్యక్రమం. మొక్కలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. మొక్కలు కదలజాలవు. తమ పువ్వులలోని పరాగం మరొక పువ్వులోకి చేరాలి. అప్పుడే పళ్లు వస్తాయి. విత్తనాలు మరిన్ని పద్ధతులతో విస్తరిస్తాయి. మొత్తానికి కొత్తమొక్కలు పుడతాయి. తాము కదిలి వెళ్లడానికి వీలులేని మొక్కలు తమ పరాగం మరొకచోటికి చేరాలంటే కీటకాలు, పక్షుల మీద ఆధారపడాలి. కనుకనే వాటిని ఆకర్షించడానికి పువ్వులకు అన్ని రకాల రంగులు ఉంటాయి.

పువ్వులు ఎరుపు, పసుపు రంగుల్లో ఎక్కువగా ఉండడం సులభంగానే గమనించవచ్చు. నీలం రంగులు పువ్వులు మాత్రం చాలా అరుదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పువ్వులలో నీలంరంగు రావాలంటే వాటికి అందే రసాయనాలు ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం వస్తుంది. గులాబీలలో కూడా ఇప్పటివరకు నీలం రకం రాలేదనే చెప్పాలి. పువ్వులకు నీలంరంగు రావాలంటే రకరకాల పరిస్థితులు ఏర్పడాలి. అవన్నీ కలిసి పనిచేయాలి. వాటిలోని ఆమ్లత, క్షారత అనే లక్షణాలు సరిగా ఉంటే గానీ నీలం పువ్వులు రావు. రంగులకు అవసరం అయ్యే పిగ్మెంట్స్‌ అనే రసాయనాలు కొన్ని ప్రత్యేకమయిన లోహాలను కలిగి ఉండాలి.

హైడ్రాంజియాస్‌ అనే మొక్కలు పెరుగుతున్న నేలలో తగిన మోతాదులో అల్యూమినం ఉంటేగానీ నీలం పువ్వులు పెరగవు. పువ్వులలో నీలం రకాలు ఎక్కువగా లేకపోవడానికి పరిణామపరమయిన కారణాలు కూడా ఉన్నాయంటారు పరిశోధకులు. పక్షులు సులభంగా ఎర్రని పువ్వుల మీదకు వెళ్లిపోతాయి. కొన్నిరకాల కీటకాలు లేతరంగులను చూడ గలుగుతాయి. తేనెటీగ జాతులకు ఎరుపురంగు కనిపించదు. అవి తెలుపు, పసుపు రంగులున్న పువ్వుల మీదకు ఎక్కువగా వెళతాయి. చెట్ల ఆకులు నీలంగా ఉంటాయన్నది తెలుసు. ఆ ఆకుల మధ్యన తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగుల పువ్వులుంటే అవి బాగా కనపడతాయి. ఆకుపచ్చని ఆకుల మధ్యన నీలం పువ్వులు కనిపించకపోవచ్చు. కనుకనే పువ్వులు సులభంగా కనిపించే రంగులలో ఎక్కువగా ఉంటాయి.

జంతువులయినా, మొక్కలయినా మనుగడ కొరకు తమ శరీరాలలో, బతుకుతీరులో రకరకాల పద్ధతులను ఏర్పాటు చేసుకుంటాయి. మొక్కలకు పువ్వులు ఉండడం, కొత్తతరం పుట్టడానికి జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే. వాటి రంగులు కూడా ఆ కార్యక్రమం కోసమే. చివరికి పండ్లు కూడా పునరుత్పత్తి కొరకే. మనం రకరకాల పువ్వులను, రకరకాల జీవులను చూచి ఆనందిస్తాము. మొక్కలను, జంతువులను ఆహారంగా వాడుకుంటాము. అంటే వాటి పునరుత్పత్తికి స్వార్ధంకొద్దీ మనం అన్యాయం చేస్తున్నామని అర్థం.

 

 

మరిన్ని విశేషాలు

హార్స్‌ చెస్ట్‌నట్‌ అనే పువ్వులలో  పుప్పొడి అవసరం ఇక లేదనుకుంటే పువ్వుల మీద మరకలు మొదలవుతాయి. అంటే ఇక పురుగులను, పక్షులను ఆకర్షించవలసిన అవసరం లేదన్నమాట. అవసరం ఉన్నంతకాలం మంచి రంగును కనబరిచిన పూలు ఆ అవసరం తీరిన తరువాత మారిపోవడం కూడా కొన్ని రకాలలో కనిపిస్తుంది.

 

మరిన్ని విశేషాలు

పెద్ద మొక్కలు పరాగవ్యాప్తి కొరకు పురుగులు, వక్షుల మీద ఆధారపడతాయి. అయితే కొన్ని మొక్కలకు ఈ అవసరం లేదు. గడ్డిజాతి మొక్కలకు వరపరాగ నంపర్కం గాలి ఆధారంగానే జరుగుతుంది. అందుకే రకం మొక్కలలో వువ్వులు

ఉన్నప్పటికీ వాటికి ఆకర్షణీయమయిన రంగులు ఉండవు. నేలబారున పెరుగుతున్న చిన్న మొక్కల పూలన్నీ తెలుపుగానే ఉంటాయి. కొంచెం ఎదిగిన మొక్కలన్నింటి పూలు రకరకాల రంగుల్లో ఉంటాయి.