తిండి - పిండి
అందరమూ
మూడు పూటల బుద్ధిగా కూర్చుని తింటాము. మరి
ఆ తిండి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అదేమన్నమాట? కష్టపడి సంపాదించుకుంటున్నాము. తింటున్నాము అనుకోవచ్చు. ఆలోచన మరింత ముందుకు
పోతే తినడానికి పంటలు, జంతువులు ఉన్నాయి కదా అనుకోవచ్చు! పంటలు, జంతువులు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎందుకు
అంతగా దొరుకుతున్నాయి? ఎట్లా ఆ విధంగా అవి పెరుగుతున్నాయి? అన్నవి ఆ తరువాత రావాల్సిన ప్రశ్నలు!
ఈ
భూమిమీదికి మనకన్నా ముందు మొక్కలు వచ్చాయి. అవి పెరిగి చెట్లు అయ్యాయి. ఒక
చెట్టును గమనిస్తే దాని నిండా రక రకాల ఆకులు ఉంటాయి. అరటి చెట్టు ఆకులు వెడల్పుగా
ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవైనా చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం కలిసి ఒక పెద్ద
విస్తీర్ణాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి. ఈ ఆకులు మనకు తిండి పెట్టే కర్మాగారాలు
అన్న సంగతి చాలామందికి అర్థం అయి ఉండదు. అందుకే మనం సైన్స్ గురించి తెలుసుకోవాలి.
తినే తిండి గురించి తెలియని వాళ్లకు ఇంకా మిగతా విషయాలు ఏం తెలిసినట్టు లెక్క?
ఆకులలో
ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా పిండి పదార్థం తయారవుతుంది. ఇది అటువంటి ఇటువంటి
అద్భుతం కాదు! అద్భుతాల కే అద్భుతం! ఆ పిండి కారణంగానే మొక్కలు, పొదలు, చెట్లు, మహా
వ ృక్షాలు అన్ని అంతలేసి గా పెరుగుతాయి. ఆ మొక్కలను తిని కొన్ని రకాల జంతువులు
పెరుగుతాయి. ఆ జంతువులను మరి కొన్ని జంతువులు తింటాయి. కొన్ని జంతువులు మొక్కలను, జంతువులను అన్నింటినీ తింటాయి. ఇక మనిషి అనే మన జాతి మాత్రం దొరికిన ప్రతి
చెత్తా తినే రకం. చాలా రకాల జంతువులు కూడా తినని కొన్ని పదార్థాలను మనం తింటాము. ఈ
మాట అంటున్నప్పుడు అసలు సిసలైన సర్వ మానవ సౌభ్రాత ృత్వం కనబడుతున్నది. మనుషులలో
కూడా కొంతమంది శాకాహారులు ఉంటారు. శాకము అంటే కూర. ఈ సంగతి వ్యాసం టైప్
చేస్తున్న కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా తెలిసినట్టు లేదు. అది నన్ను కష్టపెట్టి
ఏవేవో మాటలు చూపిస్తున్నది. వాళ్ళు కూర సంగతి మరిచిపోయి, కొమ్మలు తింటున్నాము అనుకుని శాఖాహారము అని రాసుకుంటారు. అది తప్పు.
మొత్తానికి
ప్రపంచంలోని మొక్కల నుండి మహావ ృక్షాలు వరకు, చీమల
నుండి మహా మ ృగాల వరకు అన్నింటికీ తిండి పెట్టేది ఆకులు అన్న సంగతి మనం మొట్టమొదట
గుర్తించాలి. ప్రాణదాతలు గా గుర్తించి అన్ని రకాల చెట్లకు వినయ విధేయతలను
ప్రదర్శించాలి.
ఆకులలో
పచ్చని రంగు ఉండడం మరొక అద్భుతం. ఆ పచ్చని రంగును ఆకుపచ్చ రంగు అనే వరకు అది
వ్యాపించింది. ఆ రంగు కారణంగానే మనకు పిండి పదార్థం, అంటి
తిండి పదార్థం దొరుకుతున్నది అన్నది మరొక అద్భుతం. ఇది కూడా మామూలు అద్భుతం కాదు.
మొత్తం జీవ ప్రపంచానికి ఆధారం గా నిలిచిన అద్భుతం. ఆకుపచ్చ రంగుకు కారణం
క్లోరోఫిల్ అనే పదార్థం. మొదట ఆకులు సూర్యుని వెలుతురును గ్రహిస్తాయి. ఈ
విషయాన్ని మనం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నీడలో వేసిన మొక్కలు చక్కగా పెరగవు.
గోడ పక్కన వేసిన మొక్కలు ఎండ ఎటువైపు ఉంటే అటు పెరుగుతాయి. గోడ వైపు కొమ్మలు కూడా
ఎండ వైపు తిరుగుతాయి. ఈ సంగతి ఇంతకుముందు గమనించకుంటే ఇక మీద అయినా గమనించి
చూడండి. ఈ ప్రపంచమంతా, కనీసం ఆకు పచ్చని చెట్ల ప్రపంచమంతా
సూర్యుని వైపు చూచి పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఎండ మరీ వేడిగా ఉంటుంది. అది
నేలను చేరే వరకు కొంత చల్లబడుతుంది. అట్లా చల్లబడిన ఎండ ఆకులకు ఉపకరిస్తుంది.
అక్కడ జరిగే కార్యక్రమం వివరాలు ఈరోజు వరకు కూడా పూర్తిగా అర్థం కాలేదు.
1866లో ఆస్ట్రియా దేశంలో ఒక పరిశోధకుడు
మొక్కలకు వేడికి గల సంబంధాన్ని మొట్టమొదటిసారి గుర్తించాడు. ఎండా, వేడి ఉంటే కానీ, మొక్కలు పెరగవు అని చెప్పాడు. సముద్రంలో
పరచుకొని ఉన్నడెస్మిడ్స్, డయటమ్స్ వంటి కొన్ని రకాల చిన్న మొక్కలు మొదలు, మహావ ృక్షాలు దాకా ఈ ఆకు పచ్చని ఆకులు, వెలుగు
సహాయంతో పనిచేసే రసాయన కర్మాగారాలు, అంటే కొత్త పదార్థం తయారయ్యే చోట్లు, అని అతను తేల్చి చెప్పాడు. అందరికీ అది వింతగా వినిపించింది. ముందు ఎవరికీ
నమ్మకం కలగలేదు.
ఇంటి
మీద ఫోటో వోల్టాయిక్ సెల్స్ పెట్టి సోలార్ ఎనర్జీని గ్రహించి కరెంట్ గా వాడుకోవడం కొంతమంది చూసి
ఉంటారు. ఇందుకు అసలుసిసలైన నమూనా ఆకులు. వాటిలో కరెంటు పుట్టదు. పిండి పదార్థం
పుడుతుంది. ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు కూడా ఆశ్చర్య పడని వారికి ఈ ప్రపంచంలో
మరే విషయము ఆశ్చర్యకరంగా కనిపించదు. వారి బతుకులు చాలా పొడిపొడిగా నడుస్తాయి.
సైన్స్ రుచి తెలియని చీకటి బతుకులను గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే!
చీకట్లో కూడా కనిపిస్తున్న భావంతో మనకు తిండి గురించి తెలుసు అనుకుని తింటున్నాము.
కానీ పత్రహరితం అనే క్లోరోఫిల్ గురించి తెలుసుకుని, ఆకులలో
జరుగుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకుని అప్పుడు తిన్నది అన్నం అయినా, లేక మరొకటి అయినా అందులో కొత్త రుచి కనబడుతుంది. దాని పేరే సైన్స్ రుచి!
వృక్ష
శాస్త్రం అని ఒక ప్రత్యేక విజ్ఞాన శాఖ ఉంది. అది నిన్నమొన్న పుట్టలేదు. కలకాలం గా
ఉంది. కానీ అందులోని వారికి చాలా రోజుల వరకు మొక్కలు పెరగడానికి వెలుగు అవసరం, అన్న విషయం అర్థం కాలేదు. ఇంతకన్నా విచిత్రమైన విషయం ఇంకొకటి ఉండదు. సైన్స్
తీరు అలాగే ఉంటుంది. ఒక విషయాన్ని ముందుగా ఊహించి, ఆ
తరువాత అందుకు సంబంధించిన వివరాలను సేకరించి, ఆ
వివరాలలోని సంబంధాలను, వాటికి గల పూర్వాపరాలను అర్థం
చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. ఆహా! అనిపిస్తుంది. ఒక కొత్త
సూత్రం పుడుతుంది. ఒక కొత్త అవగాహన కలుగుతుంది. అది సైన్స్ రుచి!