Wednesday, July 1, 2026

సూర్యుని తరుముతూ పరుగు


సూర్యుని తరుముతూ పరుగు

ఛేజింగ్ సన్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని చూసినప్పుడల్లా ఒక అనుమానం ఎదురవుతుంది. డు ము వు లు ప్రథమ అనే సూత్రం ప్రకారం సూర్యుడు అంటే ఒక మగ మనిషి. రామః రాముడు అవుతాడు. కృష్ణః కృష్ణుడు అవుతాడు. అదే పద్ధతిలో సూర్యః పోయి సూర్యుడు అవుతాడు. వీళ్లంతా దేవుళ్ళు. మగవాళ్లు. అయినా రాముడు. కృష్ణులకు మీసాలు ఉండవు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి ఒక ఊరు. అక్కడ సూర్యుని గుడి ఉంటుంది. అందులోని దేవునికి మీసాలు ఉంటాయి. ఆ గుడిని చాలా కష్టపడి కట్టారు. సంవత్సరంలో ఒకనాడు ఆకాశంలోని సూర్యుని కిరణాలు (ఈ సూర్యుని గురించి రాయవలసిన చోట సూర్య గోళం అని రాయడం అలవాటయింది.) గుడిలోని సూర్యుని మీద నేరుగా పడే విధంగా దాన్ని కట్టారు. గాలిగోపురంలో అందుకు అనువుగా కిటికీల్లాంటివి ఉన్నాయి మరి. గుడిలో దేవుడు మగ దేవుడు. చిత్రంగా ఆడదేవతలు ఉంటారు. ఆలుమగలు ఉంటారు. ఆ సంగతులు ఇక్కడ అవసరంలేవు.. మరి దేవుడు అంటే సూర్యుడు మగవాడా అవునంటున్నారు మరి పెద్దలు. ఆయనకు రథం ఉంటుంది. దానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే తొడలు లేని సారథి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి సంగతులు మాకు చెప్పి చెప్పి తలకెక్కించారు. ఆకాశంలోని సూర్యుడు మండే వాయువుల ముద్ద అని కూడా చెప్పారు. బడిలో ఎక్కడ అటువంటి పాఠం చదివిన గుర్తు లేదు.. ఆ సంగతులు మరేదో మార్గంలో తెలిశాయి. ఆలోచన గల ఎవరికయినా తికమక మొదలవుతుంది. ఆకాశంలోని సూర్యునికి రథం ఉంటే కనిపించాలి కదా! అది ఎన్నడూ కనిపించలేదు మరి!

మండే వాయువుల ముద్దకు రథం ఎందుకు గుర్రాలు ఎందుకు

సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో 90 శాతం, ఇంకా ఎక్కువ మంది అవును అంటారు. ఈ మధ్యన కొంత మంది, పిల్లలు మాత్రమే ధైర్యంగా కాదు అనగలుగుతున్నారు. సూర్యుడు ఒకచోట ఉంటాడు. కదిలిన మనకు తెలిసే విధంగా కదలడు, అన్నారు ఆ పిల్లలు. భూమి సూర్య గోళ్లను చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంతో పాటు అది బొంగరం లాగా తన చుట్టూ తాను తిరుగుతుంది. కనుక మనకు సూర్యుడు ఉదయించిన భావం కలుగుతుంది, అని పిల్లలకు అర్థమైంది అన్నమాట.

సన్ (ఎస్ యు ఎన్) అంటే సూర్యుడు. సన్ (ఎస్ ఓ ఎన్) అంటే కొడుకు. ఎంత బాగుందీ పద్ధతి నా కొడుకు నాకు ఆకాశంలో సూర్యుని వలె వెలుగుతూ కనబడతాడు. అందరు పిల్లలు అలాగే కనబడతారు. సూర్యుడు, చంద్రుడు విరాట్ పురుషునికి రెండు కళ్ళు అన్నారు, వెనకటివారు. ఆరింటికి పోలికే లేదు. అని ఎంతమందికి అర్థమయింది

మనిషి దేవుళ్లను సృష్టించాడు. వారికి తనలాగే రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్టు ఊహించాడు. అంతకన్నా మరొకరకంగా ఊహించడం అమాయకం మనిషికి చేతకాలేదు. విరాట్ పురుషునికి 1000 కళ్ళు, 1000 కాళ్లు ఉన్నాయి అన్నారు. అది ఎట్లా వీలవుతుంది అని ఆలోచన కలిగినట్లు లేదు. ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు గనుక వదిలేద్దాం.

విజ్ఞాన సర్వస్వంలో చూస్తే ఆకాశంలో సూర్యుడు ఎల్లో డ్వార్ఫ్ రకం నక్షత్రం అని రాసి ఉంది. దాని ద్రవ్యరాశి 1,909 X 10 10 (అంటే ఒకటి పక్కన పది సున్నలు పెట్టాలన్నమాట) కిలో గ్రాములు. డయామీటర్ అంటే చుట్టుకొలత 1,392,000 కిలోమీటర్లు అని కూడా ఉంది అక్కడ. అది భూమి నుంచి తొమ్మిది కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. మరీ సరిగా చెబితే.92,955,887.6 మైళ్ళ దూరంలో ఉంది. అంత దూరాన్ని కుదించి 9 కోట్ల 30000 అంటే కొంపేమీ మునగదు. సూర్యుడు అంటే నక్షత్రం. అది చిన్న నక్షత్రం. అది పుట్టినప్పుడు కొంత పదార్థం దూరంగా చిమ్మింది. ఆ పదార్థం ముద్దలు కట్టి గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. భూమి పదార్థంలో కొంత భాగం దూరం పోయి చంద్రగోళం తయారయింది. అది భూమి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు, చంద్రుడు మధ్య పోలిక లేదని తెలిసిపోయింది. సూర్య గోళం మండుతుంది కనుక వెలుగునిస్తుంది. చంద్ర గోళానికి స్వంత కాంతి లేదు. ఈ అక్షరాలను మీరు పగలు చదువుతున్నారంటే, అందుకు అవసరమైన వెలుగు సూర్య గోళం మంట నుంచి వస్తున్నది.

ఆదిత్యాయ, సోమాయ అంటూ మనవాళ్లు గ్రహాలకు దండం పెడతారు. బడిలో మాత్రం సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతుంటాయి, అని చెప్పారు. ఇప్పుడు పాత లెక్క తప్పు, లుతో గ్రహం కాదు. ఉన్న గ్రహాలు ఎనిమిది మాత్రమే అంటున్నారు. మన సంప్రదాయంలో రాహుకేతువులను గ్రహాలు అన్నారు. వాళ్ళిద్దరూ సూర్యుని, చంద్రుని మింగితే గ్రహణం వస్తుంది అని మాకు చిన్నప్పుడు చెప్పారు. ఇప్పటి పిల్లలకు గ్రహణం గురించి బాగా తెలుసు.

ఒక విషయం గురించి రకరకాలుగా చెబితే ఎవరికైనా తికమక, అనుమానం తప్పదు. చంద్రుడు మగ (మనిషి కాదు సుమా!), నక్షత్రాలు ఆయన భార్యలు అన్నారు. సూర్యుడు, (సూర్య గోళం) ఒక నక్షత్రం. దాని చుట్టూ తిరిగే భూమి నక్షత్రం కాదు. సూర్యుని కన్నా చాలా చిన్నది అది. ఆ భూగోళం చుట్టూ తిరిగే బుజ్జి గోళం చంద్రుడు. లేదా చంద్రగోళం. ఆయనకు నక్షత్రాలు భార్యలు అంటే అది పొసగని సంగతి.

సంప్రదాయంలో చెప్పే సంగతులు వేరు. ప్రత్యక్షంగా మనం చూసేది వేరు అని ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. తికమక అవసరం లేదు. ఎవరినీ తప్పు అనడం అంతకన్నా అవసరం లేదు. పడమటి దేశాల వారు చంద్రుడిని స్త్రీగా భావిస్తారని ఎవరికైనా తెలుసునా కానీ అది నిజం.

ఋగ్వేదంలో ఒక మాట ఉంది. కాంతిగల, కాంతి కలిగించే కాంతి వెలిగితేనే, మొత్తం విశ్వమంతా వెలుగుతుంది, అని అక్కడ చెప్పారు. పాశ్చాత్య నాగరికతలో సూర్యునికి అపోలో అని పేరు. అపోలో అంతరిక్ష నౌకలు సూర్యుని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అవి చంద్రగోళ మీద దిగాయి కూడా.

అన్నింటికీ మించి గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. సూర్య గోళం నుంచి భూగోళం వరకు గల దూరం ఎంతో విచిత్రమయినది. అంతకన్నా దగ్గరగా, లేక దూరంగా ఉన్న గ్రహాల మీద జీవం లేదు. ఇన్నర్ ప్లానెట్స్ అనే దగ్గర గ్రహాలు మండిపోతుంటాయి. దూరం గ్రహాలు చెప్పరానంత చల్లగా ఉంటాయి. భూగోళం మీద మాత్రమే నీరు ఉంది. అది ఆవిరి, నీరు, మంచు అనే మూడు స్థితులలో ఉండగలుగుతుంది. కనుకనే ఇక్కడ జీవం ఉంది. నీటిని, సూర్యుని వెలుగును వాడి జీవం పిండి పదార్థం అనే తిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నది. జీవుల మనుగడకు సూర్యుడే ఆధారం. వానలు కురిసి అంతా బురద అయిన తర్వాత మళ్లీ ఎండకాస్తే, పరిస్థితి మామూలు అవుతుంది. భూమి మనకు తగిన విధంగా పొడిబారుతుంది. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదు. పగలు, రాత్రులు లేవు. రుతువులుండవు. వర్షాలు కురవవు!

ఇంతకూ సూర్యుడు అనాలా సూర్య గోళం అనాలా ఎవరైనా చెపితే బాగుంటుంది!


 

Monday, June 29, 2026

పెరుగు - సైన్స్ : Science in curds.


పెరుగు - సైన్స్


పెరుగు - సైన్స్‌

ఈ మధ్యన నాలుగైదు రోజులుగా పెరుగు సరిగా తోడు కోవడం లేదు. అవును మరి! నాలుగైదు రోజులుగా వాతావరణం మళ్ళీ కొంచెం చల్లబడింది. చలికాలం అంటూ లేకుండానే ఎండకాలం మారుతున్న తరుణంలో మళ్ళీ కొంచెం చలి మొదలయింది. చలి దుస్తులు తెచ్చుకున్న వాళ్లకు సంతోషం కలిగింది. వాటిని ప్రదర్శించడానికి అవకాశం దొరికింది.

ఉన్నట్టుండి మళ్లీ చలి మొదలు కావడం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని పట్టించుకుంటే వాతావరణ శాస్త్రం అని చెబుతారు. సముద్రంలో మార్పులు, అక్కడి నుండి వచ్చే గాలిలో మార్పులు, ఆ గాలికి కొండలు అడ్డు రావడం, ఈలోగా మబ్బులు తయారుకావడం, మొత్తానికి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, ఇవన్నీ కలిస్తే వాతావరణ శాస్త్రం అవుతాయి. తత్వం చెప్పినట్టు ఇక పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొందము గాక అని మొదలు పెడితే, చాలామంది చెవులు మూసుకుంటారు. వాతావరణ శాస్త్రం చెబుతాను అని మొదలు పెడితే ఎవరు వినరు. ఎవరూ చదవరు.

ఎక్కడ మొదలు పెట్టాము? పెరుగు దగ్గర మొదలు పెట్టాము! మొదటి మాటల్లోనే వాతావరణ శాస్త్రంలోకి వెళ్ళిపోయాము. అందులో బోలెడంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం కలగలిసి ఉంటాయని చెబితే, ఆశ్చర్య పడని వాళ్ళు, ఇంకేం చెప్పినా ఆశ్చర్యపడరు. మళ్లీ పెరుగు దగ్గరికి వెళ్లి పోతాము. పాలలో, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేస్తే మరునాటికి అది పెరుగుగా మారుతుంది. ఏం పెరిగిందని, పాలు, పెరుగుగా మారినవి? జవాబు వినడానికి కొంతమందికి ధైర్యం అవసరం. పెరుగు లేదా మజ్జిగలో లాక్టోబాసిల్లస్‌ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగానే పెరుగు పెరుగు అవుతుంది. కొంచెం పెరుగును పాలలో వేస్తే, అక్కడ సూక్ష్మజీవులు పెరుగుతాయి. సంఖ్యలో విపరీతంగా పెరుగుతాయి. కనుక దాని పేరు పెరుగు అవుతుంది. పప్పు తినేవాళ్ళకు తాము సూక్ష్మజీవులను మహా ఇష్టంగా తింటున్నాము అని తెలిస్తే బహుశా కడుపులో తిప్పవచ్చు. అందుకని పాలు పెరుగు లేని, వేగన్ తిండి అని ఒకటి వచ్చింది. దీని గురించి ప్రస్తుతం మనకు అవసరం లేదు. మొత్తానికి పెరుగు తయారీలో జీవశాస్త్రం, అందులో సూక్ష్మజీవశాస్త్రం ప్రత్యక్షంగా మన ముందు పని చేస్తున్నదని అర్థం చేసుకోవాలి. అందుబాటులో సూక్ష్మదర్శిని అనే మైక్రోస్కోప్‌ ఉన్నవాళ్లు ఒక పెరుగు చుక్కను స్లైడ్‌ మీద వేసి దాని కింద పెట్టి చూడాలి. లుకలుకలాడుతూ కావలసినన్ని సూక్ష్మజీవులు కనిపిస్తాయి. పప్పు తినే వాళ్ళు ఇక ఆ తరువాత పెరుగు తినడానికి అనుమానం రావచ్చు. ఇది కూడా ప్రస్తుతం మన చర్చనీయాంశం కాదు.

పెరుగులో, కనీసం పెరుగు తయారీలో, కావలసినంత రసాయన శాస్త్రం, మరింత భౌతిక శాస్త్రం కూడా ఉన్నాయి. పాలలో ఉండే ప్రోటీనులు, వాటిని కలిపి ఉంచే నీళ్లు, మిగతా అంశాలు ఒక రకంగా ఉంటాయి. సూక్ష్మజీవులు వచ్చి పెరుగుతున్నప్పుడు అక్కడి వాతావరణంలో తేడాలు వస్తాయి. ఆమ్లాలు పుడతాయి. కనుక పాలలోని తీపి పోయి, పెరుగులోని పులుపు మొదలవుతుంది.

ఇక భౌతిక శాస్త్రం సంగతి! సూక్ష్మజీవులు పెరగడానికి, ఒక రకమైన ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. ఉంటేనే అవి నిజంగా పెరుగుతాయి. అప్పుడు పాలు పెరుగుగా మారతాయి. చలికాలం వస్తే, అవసరమైన వేడిమి ఉండదు. కనుక పాలు తోడుకోవు. ఉత్తర భారతదేశంలో తోడు పెట్టిన పాల గిన్నెకు, స్వెటర్లు, దుప్పటి ముక్కలు చుట్టి ఇంటి బయట పెట్టడం చాలామందికి అలవాటు. కొంచెం వెచ్చదనం కలిగి పెరుగు తొందరగా తయారవుతుందని వారి ప్రయత్నం. మన దగ్గర ఉండే ఈ కొంచెం చలికి మాత్రమే, పాలు తోడుకోవడం కష్టం అయితే, ఉత్తర భారతదేశంలోని వణికించే చలిలో, సూక్ష్మజీవులు పెరగడం, పాలు పెరుగుగా మారడం, ఇంచుమించు అసాధ్యం అవుతుంది. అలవాటుగా తరతరాలుగా, లేదంటే యుగాలుగా జరుగుతున్న ఈ పెరుగు కార్యక్రమంలో పెరుగుతున్నవి సూక్ష్మజీవులు అని తెలిస్తే, అద్భుతం అనిపించడం లేదా? అది సైన్స్‌ లోని ఆనందం! అడుగడుగున, చూడగల ప్రతి అంశంలోనూ, సైన్స్‌ దాగి ఉంటుంది. అది అర్థం అయినప్పుడు సైన్స్‌ రుచి మొదలవుతుంది. అందులో ఒక ఆనందం కలుగుతుంది. మనవాళ్లు పాత కాలంలోనే, విజ్ఞానం కన్నా అది అర్థం అయినప్పుడు కలిగే ఆనందము అసలైన పరబ్రహ్మము అని చెప్పారు. అయితే వాళ్లు చెప్పిన పద్ధతి మరొక రకంగా ఉండి మనకు అర్థం కాలేదు.

సైన్స్‌ రుచి తెలిసిన వాళ్ళు, చిన్న పెద్ద, ప్రతి అంశం వెనుక ఉన్న సైన్స్‌ గురించి వెతుకుతారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారుతుంది. అప్పుడు రుచి మరింత పెరుగుతుంది. ప్రపంచం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రకృతి చేస్తున్న మహిమలు తెలుస్తాయి. బ్రతుకు మరింత ఆశాజనకంగా కనబడుతుంది. బ్రతుకు అర్థం తెలిస్తే, పెరుగు తయారయ్యే పద్ధతి తెలిస్తే గొప్పగా ఉంటుంది అన్న విషయంలో అనుమానం లేనేలేదు!


 

Sunday, June 28, 2026

చెవిటి మనిషి : పొరుగు మనిషి Katha


చెవిటి మనిషి : పొరుగు మనిషి

రూమీ చెప్పిన కథలు

చెవిటి మనిషి - పొరుగు మనిషి

ఒక మనిషికి రాను రాను చెవులు వినిపించడం తగ్గిపోతున్నది. కానీ అతనికి తన లోపం గురించి అందరి ముందు అంగీకరించడానికి మనస్కరించడం లేదు. అతను మరి గర్విష్టి. ఏమీ జరగనట్టే నటిస్తూ బతుకుతున్నాడు. ఒకనాడు అనుకోకుండా, ఒక నేస్తం కలిశాడు. ఆ పక్కనే ఉన్న ఇంటిలో ముసలాయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అతని వద్దకు వెళ్లి పరామర్శిస్తే బాగుంటుంది కదా, అని అతను అన్నాడు. పక్కింటి పెద్ద మనిషిని పలకరించడానికి బంధువులు కూడా ఎవరూ లేరు, అంటూ పలకరించమని ప్రోత్సహించాడు. ఈ చెవిటి మనిషి, ఏదో రకంగా అతని మాటలు అర్థం చేసుకున్నాడు. పొరుగంటి మనిషిని తప్పకుండా వెళ్లి పలకరిస్తానని, నిజానికి ఆ రోజునే వెళతానని మాట ఇచ్చాడు కూడా.

ఇంతకు ఆ పొరుగింటి మనిషి దగ్గరకు వెళ్లడం ఎట్లాగా? అతను నిజంగా అనారోగ్యంతో తీసుకుంటూ ఉంటే, మాట బలహీనం అయిపోయి ఉంటుంది. అతను చెప్పేదేదో తనకు వినిపించదు. అయినా వెళ్ళక తప్పేటట్టు లేదు. కనుక తప్పకుండా వెళ్లాలి. ఆరోగ్యం గురించి ఏదో అడగాలి. తప్పదు అని నిర్ణయించుకున్నాడు. ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు, అతని పెదవుల కదలికను బట్టి, ఏం మాట్లాడుతున్నది అర్థం చేసుకోవచ్చు కదా, అనుకున్నాడు. అయినా ఏదో జాగ్రత్తగా ఉండాలి కనుక, ఏం ప్రశ్నలు అడగాలి, వాటికి ఏమీ జవాబులు వస్తాయి, తర్వాత మరి ఏమి అడగాలి, అన్న విషయాలను అతను ముందే మనసులో మననం చేసుకున్నాడు.

తాను వెళతాడు. 'ఒంట్లో ఎలా ఉంది?' అని అడుగుతాడు. అనారోగ్యంగా ఉన్న మనిషి 'ఏదో దేవుడి దయవల్ల, లాగతీసుకు వస్తున్నాను,' అంటాడని ఊహించాడు. జవాబుగా 'చాలా గొప్ప విషయం,' అని తాను అంటాడు. వెంటనే తాను, 'ఈ పూట మరి ఏమి తిన్నావు' అని అడుగుతాడు. అతను ఏదో తిన్నాడని జవాబు చెబుతాడు. 'భలే భలే, బాగుంది మరి,' అని తాను అంటాడు. అప్పుడిక మూడవ ప్రశ్నగా, 'మందులు ఎవరి దగ్గర తీసుకుంటున్నావు?' అని అడగాలి. అతను ఊర్లో ఏదో ఒక వైద్యుడి పేరు చెబుతాడు. మళ్ళీ తను 'భలే భలే' అంటాడు. 'అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అని కూడా అంటాడు.

ఈ రకంగా ముందే పథకం వేసుకొని, చెవుడు పెరుగుతున్న ఆ మనిషి వెంటనే పక్క ఇంటికి వెళ్ళాడు. ముసలతని పక్కనే కూర్చున్నాడు. నిజానికి అక్కడ మంచం లేదు. ముసలతను నేల మీదనే ఏదో గుడ్డలు పరుచుకుని పడుకున్నాడు. వెళ్లిన ఈ మనిషి, 'పెద్దాయనా! ఎలా ఉన్నావు?' అని అడిగాడు.

'చస్తున్నాను!' అన్నాడు ఆ ముసలి మనిషి. ముందు అనుకున్నట్టే చెవిటి మనిషి 'చాలా గొప్ప విషయం,' అనేశాడు. పథకం ప్రకారం, 'ఇంతకు ఏం తిన్నావు' అని అడిగాడు. ఆరోగ్యం సరిగా లేని మనిషి విసిగిపోయి ఉన్నాడు. 'విషం,' అన్నాడు. 'భలే భలే, బాగుంది మరి,' అన్నాడు మన చెవిటి మనిషి. మరి పథకం అదే కదా.

ముసలి మనిషికి చికాకు తలకెక్కింది. కానీ తమాయించుకుని పెదవి కొరుక్కున్నాడు. వచ్చిన మనిషిని తిడితే గౌరవంగా ఉండదు అనుకున్నాడు. ఇక పథకం కొనసాగింది. 'ఏ వైద్యుడి దగ్గర మందులు తీసుకుంటున్నావు?' అన్న ప్రశ్న వచ్చేసింది.

చికాకుగా ఉన్న ముసలి మనిషి, 'మృత్యుదేవత దగ్గర!' అన్నాడు. మరి మన చెవిటి పెద్దమనిషి 'భలే భలే! అతను చాలా గొప్పవాడు, నాకు తెలుసు,' అనేశాడు. 'అతని దగ్గరికి వెళ్లిన వాళ్లందరికీ ఇకపైన కష్టాలు అంటూ ఉండవు' అని కూడా చేర్చాడు.

అన్న మాటల ప్రభావం గురించి పట్టించుకోకుండా అతను పెద్దాయన చేయి పట్టుకుని, సెలవు అన్నట్టు ఒకసారి ఊపి, గట్టిగా నొక్కి, వచ్చేశాడు. తాను వచ్చి ముసలి ఆయనకు ఎంతో మంచి చేశాను అని మాత్రమే అతను మనసులో అనుకుంటున్నాడు. జరిగిన విషయం గురించి అతనికి ఏ మాత్రం అనుమానం లేదు. తర్వాత ఏమైంది మనకు తెలియదు.



 

Saturday, June 27, 2026

లోకాభిరామం : మాటాట On Words play



మాటాట

సంత్ తుక్కారామ్‌జీ మహరాజ్ అంటే ఎవరో తెలుసునా? మన ‘ఘనా ఘన సుందరా’ బ్రాండు భక్త తుకారామ్ ఆయనే. తుకారామ్ గొప్ప తాత్వికుడు. ఆ సంగతి మనకు అందలేదు. మనకు సినిమాలో చూచిన భారతము, రాహీ మాసూమ్ రజా గారి పుణ్యమా అని మరింత వివరంగా అందింది. అది ఎట్లనో గుర్తుకు వచ్చిందా? దూద అను దూరదర్శన్‌లో మహా భారత్ సీరియల్ కారణంగా. అంతేగానీ వ్యాసుని భారతములో, జైమిని భారతములోనున్న నూటొక్క సంగతులు మనకు అందలేదు. పుస్తకానికీ, పత్రికకు, కవర్‌పేజీ ఉన్నట్టే, ప్రతి విషయానికి ఒక ముఖం ఉంటుంది. మనకు ముఖ పరిచయ ము అని ఒక పద్ధతి ఉన్నది. ఈ వ్యాసమున్న పేజీలో నా బొమ్మ వేస్తరు. అది చూచినవారు, నేను బజారులో ఎదురుపడినా గుర్తించలేరు. ఎవరన్న గుర్తు పట్టినరే అనుకుందము. నేను లోకాభిరామము రాసే గోపాలమును అని తెలుస్తుంది తప్ప, నా గురించి మిగత సంగతులు తెలియవు. అట్లనే తుకారాం అనంగనే మనకు ముందు అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వస్తరు. సినిమా చూచి ఉంటే, ఆ భక్తుడు గుర్తుకు వస్తడు. ఆ సినిమాలో తుకారాముని కొండ, అద్దమందు పద్ధతిలో చూపి వదిలిపెట్టినరని నా నమ్మకము. నేనా బొమ్మ (అంటే సినిమా, అంటే ఫిలిం) చూడనేలేదు. అయినా ఆయన మహిమలు, మొదలైనవి అంత చూపి ఉంటరని నాకు తోస్తుంది. ఎట్ల తోస్తుంది, అంటే అటువంటి సినిమాలు, అనగా చలన చిత్రములు శాన చూచిన గద, అందుకు తోస్తుంది. ఆ తుకోబా ఇంకా ఏమి చెప్పెను, ఏమి పాడెను, ఎట్ల బతికెను అని మనము తెలుసుకునేందుకు అవసరము ఉండాలె. అవకాశము ఉండాలె. సినిమాలు అంటే, కదిలే బొమ్మలు, చూచి మరిచిపోవుట మంచిది గానీ, మరీ వాటిని గురించి తల పగులగొట్టుకొనడము అనవసరమని గద!

సోది, గదూ! ఇంతకు తుకారామ్‌జీ గురించి ఎందుకు ప్రస్తావించిన? నాకు గుర్తు ఉన్నది, కాని ఈలోపల మనసు పరిపరి విధములుగా పోయి ఎన్నో చెప్పవలెనని అనిపించినది. తుకారామ్ అన్ని పాటలు ‘పాండురంగ’ గురించి రాయలేదు. ఎన్నో ఆలోచింప దగిన లోతయిన చేదు నిజములను ఆయన తన అభంగములనే పాటలలో రాసినడు. రాయలేదు, చెప్పినడు. లేక పాడినడు. అందుట్లో ఒక దాంట్లో, మాటలే నాకు ఆభరణములు, మాటలే నాకు వస్త్రములు, అంటూ చెప్పి, ఈ మాటలనే నీకు పూజగా అందింతును అంటడు. ఈ మాటలను మొదట్లో చదివినపుడు, కొన్ని నాళ్లు ఆ పెద్ద మనిషి తలనిండ నిండి, పరుచుకుని మరొక ఆలోచన రాకుండ చేసినడు. వ్యవసాయ విశ్వవిద్యాలయము వారు నన్ను ఒక ఉపన్యాసం చేయమని పిలిచినరు. నేను ఆ ఉపన్యాసాన్ని ఈ కవితతో ప్రారంభించిన. నాకు వచ్చినది మాటలు ఒకటే, ఆ మాటలనే మీకు అందిస్త అనే భావము కలిగింది. మొదటి నిముషములోనే హాలు చప్పట్లతో మారుమోగింది. ఆ చప్పట్లు నాకు కాదుగద! అవి టోకున తుకోజీ మహరాజ్ గారికే.

ఇంతకు, ఇయాల, అంటే, ఈ పొద్దు, అంటే ఈ దినము, ఈనాడు (పాపము శమించుగాక) నేను చెప్పదలచిన విషయంబెట్టిదనిన, మాట లేకుంటే ఈ పొరుపంచికము, అనగా దునియా, అనగా లోకము, అనగా ప్రపంచము ఎట్లుండును? అని మా వన్ సెవెన్ నైన్ అనే పీఎస్‌జీ అన్నగారు ఉద్యోగములో ఉండంగ, తమ బల్లమీది అద్దము కింద, ఒక కాగితము, కాగితము, కాయిదము, లేకా కాకితము ముక్క, తుంపు, బిట్టు, మీద ‘మౌనేన కలహం నాస్తి’ అని రాసి పెట్టుకుని యుండిరి. మాట్లాడకుండ ఉంటే కొట్లాటలు రావని ముందు అనిపిస్తుంది, నా వంటి, లాంటి, మాదిరి, పోలిన, తుంటరికి. ఉంటే ఎందుకు మాట్లాడవు? అని పేచీ కొట్లాటకు దిగవచ్చును గద!

మాటలు లేకుండ ఈ ప్రపంచము నడుచునా? అయ్యా! అమ్మ! ఇది నాకున్న కొద్దిపాటి, బుర్ర, మెదడును తొలచుచున్న,  తొలుచుచున్న, కలచుచున్న, మలచుచున్న, కలియబెట్టుచునున్న ప్రశ్న! క్రోశ్న, క్రొశ్చన్, క్వశ్చన్, యశ్చన్, యథా, తథా’ ఈ చివరి నాలుగు మాట రాజములు, తోచినవి, గనుక రాసితిని. నిజముగా రాయవలెనని గాదు. రీజనింగ్ పరీక్ష గురించి తెలిసిన వారు ఎవరయినను తరువాత రాదగు మాట ప్రశ్చన్ అని గుర్తించి ఉందురు గాక.

నేను ఎక్కువ మాట్లాడుతనని నాకు తెలుసు. ‘నీవు చాలమటుకు మాట్లాడకుండ ఉంటవు కనుక అవకాశము వచ్చినపుడు, గలగలమని మాట్లాడుతవు’ అని ఒక మిత్రుడు, నేస్తము, చెలికాడు, ఉద్దిగాడు చెప్పెను, వాక్రుచ్చెను నిజంగనే! అంతేకాదు అవకాశము వస్తే చాలు చెట్టుతో, పుట్టతో, గుట్టతో నేను మాట్లాడే ప్రయత్నము చేస్త! మాటలు నన్ను చాలామందికి మిత్రునిగా మార్చినయి. ఒకనాడు నేను బస్సు కొరకు అందరి మాదిరి, లాగనే, వోలెనే, వలెనే, పోలికగనే, దారి, రోడ్ పక్కనే నిలబడి ఉన్న, ఉంటిని. పక్కన ఒకాయన నిలబడి ఉన్నడు. శానమంది ఉండి ఉంటరు. ఈయన చేతిలో ఒక పుస్తకము ఉన్నది. అది అరుదయిన రకము. నాకు నచ్చిన రకము. పట్టలేక ‘ఏమండీ మీ గురించి తెలుసుకోవచ్చునా?’ అని అడిగిన. నాలుగయిదు మాటల తరువాత మాకు పరోక్షముగ పరిచయము ఉన్నదని తేలిపోయినది. ఇంక మాట్లాడుకుంటూ ఎక్కవలసిన బస్ వచ్చినా, అక్కడ కొంతకాలము గడిపినట్టు నాకు గుర్తుంది. అది మాట బలము.

రామాయణములో రాముని మంచితనము గురించి చాలా చాల రాసుకున్నరు. కానీ ఒక మాట నాకు బాగా గుర్తుంటుంది. రాముడు ‘పూర్వభాషి’ యట. అంటే మనము పలకరిస్తమని ఎదురు చూడకుండ, తానే ముందు పలకరిస్తడట. దాన్ని ఈనాటి మేనేజ్‌మెంట్ పరిభాషలో ‘ప్రోయాక్టివ్’ అంటరు. మీరు పలకరిస్తారేమో అని నేను ఎదురు చూస్తున్న. ఈ ఊరికి, ఆ ఊరికి దూరాల లెక్కలో మీరు గూడ అట్లనే ఎదురు చూస్తుండవచ్చు గద! ఎవరూ ముందు మాట్లాడరు. ఈ లోపల పుణ్య కాలము మించిపోవును. లఖ్‌నవీ నవాబులు మీరు ముందు, మీరు ముందు అంటూ మర్యాద చేస్తుంటే బండి ఎళ్లిపోయినట్టు, ఇక్కడ కాలమనే బండి ఎళ్లిపోవును. తస్మాత్ స్పీక్ ఫస్ట్!

మాయావిడ కారు నడుపుతరు. నాకు ఆ పని చేతరాదు, చేతగాదు. ఆమె పక్కన కూచుని హాయిగ దేశమంత తిరుగుత. నేను కారులో ఎక్కినప్పుడు చాలామాట్లు, మేము మా ఇంటికి దగ్గరగ వున్న పెట్రోలు బంకులో ఆగుతము. పెట్రోలు పోయించు కుంటము. ‘మీకు ఇక్కడి వాండ్లు దోస్తులు కాలేదా?’ అని నేను మా శ్రీమతిని అడిగిన. ‘ఆ పిల్లగాండ్లతోటి నాకేమి దోస్తీ’ అన్నట్టు ఆమె నా దిక్కు ఒక చూపు చూచింది. ముందున్న కారు ఓనరునకు అక్కడి అబ్బాయి, బాబు, పిలగాడు ఒక పత్రికను ఉచితంగా ఇవ్వడము గమనించిన. తరువాత మా కారులో సహస్రం, అనగా వెయ్యి రూపాయల రాతినూనె వేయించుకున్నము. పోయించుకున్నము. ఆ యువకుడు పైసలు తీసుకుని ఊరుకున్నడు. ‘ఏం తమీ! నాకు పత్రిక ఇయ్యవా?’ అని అడిగిన. ‘ఎందుకియ్యను సార్!’ అని నవ్వుతూ అతను నాకు గూడ పత్రిక ఇచ్చినడు. ‘ఈసారి గనుక నేను ఆ బాబుకు కనిపిస్తినా, తప్పక చిరునవ్వు నవ్వుతడు’ అని తర్వాత మాయావిడ, మాయామె గారితో అన్న, అన్నాను. (అన్నగాదు భర్త) ఆమె మాత్రము నవ్వి ఊరుకోలేదు. ‘మీలాగ మాట్లాడడము నాకు రాదు’ అన్నది. ఎందుకురాదు? మాటలు రావా? మొగమాటమా? అడిగితే పత్రిక దొరికింది. కాదంటే, అది ఎటువంటి వారికి దొరుకుతుందన్న కిటుకు తెలుస్తుంది. మాట్లాడకుండ ఉంటే పోట్లాట రాదు నిజమే ఉచిత పత్రిక కూడ రాదు, అడగనిదే అమ్మకూడ అన్నము పెట్టదు, అని మాట ఉన్నది.

మనసు నిండ అనుమానాలు ఉంటే ఇట్లనే అయితది, అవుతది, అవుతుంది (మరోటి) ఔతుంది కరెక్టా, అవుతుంది కరెక్టా? మిగతా రెండు మాటలు తప్పా! వివరాలు మునుముందు వీలు వెంట చర్చించెదము గాక. నేను, ఇవాళ మాటలకు అర్థములు మారుట, కొత్త అర్థములు పుట్టుట గురించి రాయాలని అనుకున్నాను. మామూలుగా చేసే పద్ధతిలో గాక, రాసి చూతము అని మొదలుపెట్టితిని. ఇన్ని మాటలు వచ్చినవి. ఇవన్నీ గూడ ఎన్నడో ఒకనాడు చెప్పవలెననుకున్న మాటలే. మిగిలిన మాటలు చెప్పే టందుకు మరింత అవకాశము దొరకనే దొరకదా?

ఝలక్: టప్పాభై సత్తార్ మియా అనగానెవరో మీకు తెలుసునా? మనకు పట్టాభి సీతారామయ్య గారి గురించి గుర్తు ఉండి ఉంటే మంచిదే. ఆయన గొప్ప నాయకుడు. విజనరీ. ఆయన పేరును ఉరుదూలో రాసినరు. తెలుగులో అటువంటి పేరు ఉంటుందని తెలియని ఒక మనిషి చదవను ప్రయత్నిస్తే అది నేను రాసిన విధముగ పలికినదట. ఉరుదూలో అక్షరాలను కలుపుతరు. తెలుగు ఇంగ్లీషు లాగ విడివిడిగ రాయరు. అది చిక్కు. నా ఆలోచనలు కూడ అట్లనే సాగినట్లున్నయి. అయినా తప్పు జరగలేదనే అనుకుంటున్న!