Lokabhiramam
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Thursday, May 28, 2026
Tuesday, May 26, 2026
లోకాభిరామం : అహమదాబాద్ లో On my Ahmedabad visit
లోకాభిరామం : అహమదాబాద్ లో
పార్లమెంట్ ఎన్నికలకన్నా చాలా ముందు
అంటే మార్చి నెల చివర్లో నేను ఒక వారంపాటు ఉత్తర భారతదేశంలో తిరిగాను. అది
నిజానికి విహారయాత్రగా పథకం ప్రకారం చేసిన ప్రయాణం కాదు. మరొక అవసరం మీద ఒక
పెద్దమనిషి బయలుదేరితే అతనితోపాటు నేను కూడా వెళ్లి తిరిగాను. మొదట అహమదాబాదు
వెళ్లాము. అక్కడి నుంచి రిషికేశ్, కురుక్షేత్ర, షిమ్లా, ఆ తర్వాత దిల్లీ. అంటే ప్రయాణం కనీసం ఐదారు రాష్ట్రాలలో
సాగింది అని అర్థం. వెళ్లిన ప్రతిచోట అనుభవాలు గొప్పగానే ఉన్నాయి. వాటన్నిటిని
గురించి చెప్పుకోవాలంటే సరైన సందర్భం, సమయం
ఉండాలి. ఎంతదూరం తిరిగినా నాకు ఎక్కడా ఎన్నికల సూచనలు కనిపించలేదు. అహమదాబాదులో
అంతకన్నా ఆశ్చర్యాలు ఎదురయ్యాయి. నేను నిజానికి ఆ నగరాన్ని చూసి చాలా కాలమైంది.
అప్పట్లో నాకు అది ఒక పాత నగరంగా కనిపించింది. ఇప్పటి నగరాన్ని నేను గుర్తించలేక
పోయాను. స్థానిక మిత్రుడు ఒకాయన మమ్మల్ని పాత కొత్త నగరాలతోపాటు పక్కనే కట్టిన
గాంధీనగర్కు కూడా తీసుకువెళ్లాడు. మొట్టమొదట ఆ నగరంలోని రోడ్ల గురించి
చెప్పుకోవాలి. నగరం మధ్యలో నడుస్తున్న దారులు ఆరు లేన్లు కలిగి ఉన్నాయి అంటే
ఆశ్చర్యం. వాటిలో ఒక లేన్ కేవలం ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకించబడింది. ఆ
బస్సులకు ఇంచుమించు రైల్ స్టేషన్ లాగా అందమైన స్టాప్లు ఉన్నాయి. బస్సులో ఎక్కే
అవకాశం నాకు దొరకలేదు. మన దగ్గర రోడ్లలో ఆర్టీసీ బస్సులు చేసే విన్యాసాలు గుర్తుకు
వచ్చిన తరువాత మనవాళ్లకు ఈ తరహా ఆలోచనలు ఎందుకు రాలేదు, అన్న ప్రశ్న మెదడులో
గట్టిగా కదిలింది. ఇక అక్కడ కడుతున్న భవనాలను చూస్తే అయిన ఆశ్చర్యం అంతా ఇంతా
కాదు. చిన్నది అనుకున్న భవనంలో పన్నెండు అంతస్తులు కనిపించాయి. ఇరవై ఐదు అంతస్తుల
భవనాలు కూడా ఉన్నాయి. అవి లెక్కలేనన్ని ఉన్నాయి. అన్నిటిలోనూ నిర్మాణం చురుకుగా సాగుతున్నది.
కొన్నింటిలో జనం కాపురాలు ఉంటున్నారు. దారి వెంట వెళుతున్న నాకు కొన్ని హోటేళ్ల
పేర్లు ఆకర్షణగా కనిపించాయి. అవన్నీ అసలు సిసలైన దక్షిణ భారతం పద్ధతిలో ఉన్నాయి.
పట్టలేక ఏమిటి పరిస్థితి? అని అడిగాను. ఆ ఊళ్లో ఉద్యోగాల పేరుమీద
వచ్చిన దాక్షిణాత్యులు లెక్కలేనంత మంది ఉన్నారట.
ఆరోగ్యం కారణంగానో, మరే
రకంగానో పని మానుకున్న వారికి తప్ప అక్కడ పనికి కొదవలేదు. తిండికి అంతకన్నా కొదువ
లేదు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకనే మిగతా ప్రాంతాల వాళ్లు
అంతా అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారట. ఈ సంగతి చెప్పిన యువకుడు నాకు ఇంకా
ఎన్నో విషయాలు చెప్పాడు. అతని పేరు రరుూస్. అంటే ధనవంతుడు అని అర్థం. ధనవంతుడు
అవునో కాదో తెలియదు గానీ అతను గుణవంతుడు. టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
మంచి మాటకారి. అతని కారులో ముందు పక్కన కమలం గుర్తు గల పవిత్ర వస్త్రం
కనిపించింది. మొహమాటం లేకుండా అదేమిటి? అని
అడిగాను. ఇక కమలం పార్టీ గురించి గొప్పగా పొగడుతూ చెప్పిన సంగతులు నాకు ఇంకా
గుర్తున్నాయి. సరిగ్గా మాటకు మాట జ్ఞాపకం లేదు కానీ, మంచి
జరుగుతుంటే దాన్ని చేస్తున్నది ఎవరు? అన్న
ప్రశ్న రాకూడదు. 2002 సంవత్సరం
తరువాత మా దగ్గర హిందూ ముస్లిం భేదభావాలు అందరూ మరిచిపోయారు.
ఎన్నికలు వస్తే కళ్లు మూసుకుని అందరూ కమలం గుర్తుకే ఓటు వేస్తారు అని అతను తెగేసి
చెప్పాడు.
అహమదాబాదులో అసలు సిసలైన గుజరాతి భోజనం అంటూ ఒకచోటికి
తీసుకువెళ్లారు. ఢోక్లా, సమోసాలతో మొదలైన ఆ భోజనం
అడిగినప్పుడల్లా అందిస్తున్న మామిడి పళ్లరసంతో ముగిసింది. నిజానికి ఆ మామిడి పళ్లు
కూడా మనకు తెలిసిన రకం కానే కాదు. అటువంటి భోజనం రాజస్థాన్లో కూడా ఉంటుంది. వాళ్ల
హోటేళ్లు హైదరాబాదులో ఉన్నాయి కనుక ఇక్కడ కూడా ఆ రకం భోజనం దొరుకుతుంది. ఇక నాకు
ఎప్పటినుండో ఉన్న కోరిక ప్రకారం ఫాలూదా కావాలి అన్నాను. స్థానిక మిత్రుడు జోషీ, మమ్మల్ని ఊరంతా తిప్పి ఒకచోటికి తీసుకువెళ్లాడు. అక్కడ అనుకున్న ప్రకారం
ఆశ్చర్యకరమైన ఫాలూదా దొరికింది. మరునాటి సాయంత్రం మరొక ఆశ్చర్యం ఎదురయింది. తీన్
దర్వాజా అన్న ప్రాంతం గురించి నాకు ముందు కూడా తెలుసు. అక్కడికి దగ్గరలోనే మనీష్
చౌక్ అనే ప్రాంతం ఒకటి ఉంది. అక్కడ అన్నీ నగల దుకాణాలు ఉంటాయి. కానీ రాత్రి
పడిందంటే ఆ అంగళ్లనీ మూసేస్తారు. దారులన్నీ ఒక ఈట్ స్ట్రీట్గా మారుతాయి. జిలేబీ
నుంచి మొదలు దోసెల దాకా అక్కడ దొరికే తిండి రకాలను గురించి చెప్పడానికి వీలు
ఉండదు. దారి నిండా బల్లలు పరిచి కుర్చీలు వేసి ఉంచారు. మధ్యలో, పక్కలకు బళ్ల మీద వంటలు జరుగుతూంటాయి. తిండి సంత ఆ రకంగా రాత్రి రెండు, మూడు గంటల దాకా సాగుతుందట. జోషి ధైర్యంగా ఆ ప్రాంతంలోకి కారు పోనిచ్చాడు.
పార్కింగ్ చేయడానికి స్థలం సంపాదించాడు. ఇక తిండి మీద పడ్డాము. నాకు రాత్రి పూట
తిండి తినడం అంతగా అలవాటు లేదు. జున్ను తురుము వేసిన సాండ్విచ్ తిన్నాను. ఆ తరువాత
అక్కడి స్పెషల్ అంటూ నన్ను మళ్లీ ఒక ఫాలూదా అంగడికి తీసుకువెళ్లారు. స్వంతదారు
అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు. తన అంగడికి ప్రపంచమంతటా పేరు ఉంది
అన్నాడు. యూ ట్యూబ్లో తమ అంగడి వీడియో చూడమన్నాడు. నిజంగానే సరుకు కూడా చాలా
బాగుంది. అక్కడ తినడం అది నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం.
మరుసటి నాడు మేము సర్దార్ సరోవర్ దగ్గర
ప్రపంచ రికార్డ్ గల వల్లభభాయి పటేల్ విగ్రహాన్ని చూడడానికి బయలుదేరాము. అది
అహమదాబాద్ నుండి చాలా దూరంలోనే ఉంది. హైవే మాత్రం అద్దంలాగా ఉంది. గోల్డెన్
ట్రయాంగిల్ లాంటి పేరు ఏదో చెప్పారు. మధ్యలో అందరికీ అమూల్ పేరు మీద తెలిసిన ఆనంద్
అనే నగరం వస్తుంది. అది నిజానికి రోడ్డు పక్కన ఉండదు. ఎడమకు తిరిగి బాగా లోపలికి
వెళ్లాలి. వెళ్లినా అంత సులభంగా అక్కడి కర్మాగారాలను చూడనివ్వరు. అందుకు ముందే
అనుమతి తీసుకోవాలి. కనుక మేము అమూల్ పాల ఉత్పత్తుల కేంద్రాలను చూడలేక పోయాము.
దేశమంతా పేరున్న అమూల్ తిండి పదార్థాల తీరు అక్కడ అంటే అహమదాబాదులో మరో రకంగా
ఉంది. మేమున్న హోటేల్కు దగ్గరలోనే ఉన్న ఒకానొక అమూల్ కాంటీన్కు వెళ్లాము. అక్కడ
ఐస్ క్రీమ్, పాల ఉత్పత్తులు మాత్రమే గాక రకరకాల తిండి పదార్థాలు
అమ్ముతున్నారు. అన్నింటిలోనూ అమూల్ ఉత్పత్తుల ప్రమేయం ఉంది. గుజరాత్ వాళ్లు
సైన్యంలో తప్ప మిగతా ఏ రంగంలోనయినా బాగా పని చేస్తారు అనిపించింది. గిరీష్ కర్నాడ్
తీసిన సినిమా మంథన్ గుర్తుకు వచ్చింది. అది అమూల్ వెనుకనున్న వేలాది మంది రైతుల
కథ. వర్గీస్ కురియన్ అనే మలయాళీ వ్యక్తి వాళ్లకు నాయకుడుగా నిలిచి చరిత్ర
సృష్టించాడు.
చివరకు సర్దార్ సరోవర్ చేరుకున్నాము. అందులో నీళ్లు
లేవు. డామ్ మీది నుంచి చుక్క కూడా కిందకు రావటం లేదు. ఇటుపక్కకు మళ్లితే మాత్రం, నిజంగానే లోహపురుషుడిగా నిలబడిన సర్దార్ పటేల్ విగ్రహం అద్భుతంగా కనిపించింది.
అందరూ గొప్పగా చెప్పుకునే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 93 మీటర్ల ఎత్తు మాత్రమే. అంతకన్నా ఎత్తయిన విగ్రహాలు చైనాలో ఒకటి, జపాన్లో ఒకటి ఉన్నాయి. అవి రెండు బుద్ధ విగ్రహాలు. చైనా విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అయితే సర్దార్ సరోవర్లోని సర్దార్ పటేల్ విగ్రహం ఏకంగా 82 మీటర్ల ఎత్తు. ప్రత్యేకంగా టికెట్ తీసుకుంటే విగ్రహం కాళ్ల దగ్గరికి లిఫ్ట్లో
వెళ్లవచ్చు. అక్కడినుండి దృశ్యాన్ని అన్ని వేపులా చూడవచ్చు. అంతకన్నా ఎత్తుకు
వెళ్లడానికి అవకాశం లేదు. ఆయన కాళ్లకు మామూలు చెప్పులు ఉన్నాయి. మామూలు
చెప్పులలాగే వాటిని కుట్టిన దారాలు కూడా ఉన్నాయి. చెప్పుల అడుగులు, నిలబడ్డ నాకు తలకన్నా ఎత్తులో ఉన్నాయి. ఆ ధారాలు మోకుతాళ్లకన్నా లావుగా ఉన్నాయి. అక్కడ నిలబడి తల
పైకి ఎత్తినా విగ్రహం పై భాగం కనిపించదు. కిందకు దిగి రావాలి. కొంత దూరం పోవాలి.
అక్కడి నుండి చూడాలి. అప్పుడు గానీ విగ్రహం పూర్తిగా కనిపిస్తుంది. విగ్రహం ముందు
నిలబడి ఫొటో తీసుకోవాలనుకుంటే మనం కనిపిస్తే విగ్రహం కనిపిచదు. కాళ్లు మాత్రమే
కనిపిస్తాయి. మొత్తం విగ్రహం కనిపించేటట్టు ఫ్రేమ్ చేస్తే మనం కనిపించము. మరీ
చిన్న రూపాలము అవుతాము. స్వాతంత్య్రం తరువాత దేశంలోని సంస్థానాలను విలీనం చేయించి
ఐక్యత సాధించిన మహానుభావుడు సర్దార్ పటేల్. అందుకే ఆ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. హైదరాబాద్ వారికి
ఆయన చేయించిన పోలీస్ యాక్షన్ ఒకటే జ్ఞాపకం ఉంటుంది. నిజానికి దేశంలో ఇటువంటి
విగ్రహం ఒకటి ఉందని మనవాళ్లకు చాలామందికి తెలియకపోవచ్చు. దాన్ని గురించి మన
ప్రాంతాలలో పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. మొత్తానికి అది చూడవలసిన చోటు.
-కె.బి. గోపాలం
Saturday, May 23, 2026
Thursday, May 21, 2026
పెద్దమనుషులు : పోలాండ్ పిల్లల కథ
రచయిత ఐజక్ బషేవిష్ సింగర్, నొబేల్ బహుమతి గ్రహీత
పిల్లల కథలు రాసినడు. ఎంత బాగుంటయో... విని చూడండి....
పెద్దమనుషులు : పోలాండ్ పిల్లల కథ
ద్దమనుషులు
రచయిత ఐజక్ బషేవిష్ సింగర్
ఊరి పేరు ఛెల్మ్. అక్కడ పెత్తనం చేయడానికి ఒక కమ్యూనిటీ
కౌన్సిల్ ఉందని, దానికొక
పెద్ద ఉన్నాడని, వాళ్లందరూ
పిచ్చివాళ్లేనని తెలుసు. అందరికన్నా పెద్ద అధికారి పేరు ఎద్దు (గ్రొనామ్ ఆక్స్).
ఇక కౌన్సిల్లో సభ్యులు మత్తు (డోపీ లెకిష్), దద్దమ్మ (జైన్వెల్ నిన్నీ), పిచ్చయ్య (ట్రైటెల్
ఫూల్), గాడిద
(సెండర్ డాంకీ), ఓటి
బుర్ర (ష్మెండ్రిక్ నమ్స్కల్). ఇంకా ముద్దపప్పు (ఫైవెల్ థిక్విట్), ఎన్నికయిన పెద్ద, ఎద్దు వయసులోనూ
పెద్దవాడు. ఆయనకు పొడుగాటి తెల్లని బవిరి గడ్డం ఉంటుంది. నుదురు ఎత్తుగా ఉంటుంది.
ఈ గ్రోనామ్ ఎద్దుకు పెద్ద ఇల్లు ఉంది. కనుక మీటింగ్లన్నీ
అక్కడే జరుగుతుంటాయి. ఆయన పెద్ద భార్య పేరు గెనెండెల్. అప్పుడప్పుడు ఆమె మీటింగ్లో
వాళ్లందరికీ కేక్లు, టీ, జామ్ ఇస్తూ ఉంటుంది.
ఎద్దు నిజానికి సంతోషంగా ఉండవలసిన వాడే. ఒకటే చిక్కు.
మీటింగ్ ముగిసి అందరూ వెళ్లిపోయిన తరువాత ప్రతిసారీ గెనెండెల్ వచ్చి పిచ్చిమాటలు మాట్లాడావంటూ మొగుణ్ణి తిడుతుంది.
ఆమెకు మొగుడు అంటే గొప్ప గౌరవమే. కానీ, అతను మరీ అమాయకుడు అన్న అభిప్రాయం నిండుగా ఉంది.
ఓసారి ఇలాగే ఇద్దరూ కీచులాడుకున్నారు. గ్రోనామ్ భార్యతో
అన్నాడు గదా, ‘పెద్ద వాళ్లందరూ
వెళ్లిపోయిన తరువాత నాతో యుద్ధం మొదలుపెట్టి
ఏం లాభం? ఇకమీదట
నేను వాళ్లమధ్య ఏదయినా అర్థంలేని మాట అంటున్నట్టు తోస్తే, నేరుగా అక్కడికి
వచ్చేయి. సంగతి నాకు చెప్పు. నేను విషయం మార్చుకుంటాను’ అని.
‘అంతమంది పెద్దవాళ్ల ముందర నేను వచ్చి, నీవు అర్థంలేని మాటలు
అంటున్నావని ఎట్లా చెప్పడం? నీవు పిచ్చివాడవన్న సంగతి వాళ్లకు అర్థమయిందంటే, నీ పెద్దరికానికి
ముప్పు వస్తుంది. కౌన్సిల్ పెద్దగా మరెవరినో ఎన్నుకుంటారు.’
‘నీవు మహా తెలివిగలదానివి గదా! దారి వెతుకు’ అన్నాడు
గ్రోనామ్ ఎద్దు.
గెనెండెల్ కొంచెం ఆలోచించి ‘తోచింది’ అని గట్టిగా
అరిచింది.
‘ఏమిటది?’
‘నువ్వేదో పిచ్చిమాట అనగానే నేను అక్కడికి వచ్చి మన
ఇనప్పెట్టె తాళం చెవి నీకు ఇస్తాను. నీవు పిచ్చిమాటలు మాట్లాడుతున్నానని అర్థం
చేసుకోవాలి.’
ఎద్దుకు మహా సంతోషమయింది. పెళ్లం తెలివిని మెచ్చుకుంటూ
చప్పట్లు చరిచాడు. ‘ఓహో! ఏం తెలివి? తెలివికన్నా తెలివి!’ అన్నాడు.
కొన్నాళ్ల తరువాత గ్రోనామ్ ఎద్దు ఇంట్లో మరో సమావేశం
జరిగింది. రానున్న పెంతెకోస్ట్ పండుగ
గురించి చర్చ మొదలయింది. ఆ పండుగ సందర్భంగా అందరూ ప్రత్యేకమయిన రొట్టెతోబాటు
పులిసిన మీగడ తింటారు. ఈసారి వానలు బాగా కురవలేదు. గడ్డి పెరగలేదు. ఆవులు అంతగా
పాలు ఇవ్వలేదు.
ఊరి పెద్దలు అందరూ గడ్డాలు పీక్కున్నారు. నుదురులు
రాసుకున్నారు. అంటే, వాళ్ల మెదళ్లు గట్టిగా పనిచేస్తున్నాయని అర్థం. అయినాసరే, కావలసినంత మీగడ సంపాదించడం ఎట్లాగో ఎవరికీ తోచలేదు.
ఒక్కసారిగా గ్రోనామ్ పిడికిలితో బల్లమీద గుద్ది, ‘తోచింది’ అన్నాడు.
‘ఏమిటది?’
‘ఇకమీదట నీళ్లను మీగడ అనాలని, మీగడను నీళ్లు అనాలని ఒక చట్టం చేసేద్దాం. మన ఊళ్లో
బావుల్లో ఇంకా నీళున్నాయి. ఆ రకంగా ప్రతి ఇల్లాలు బానలనిండా మీగడ తెచ్చుకుంటుంది.’
‘బ్రహ్మాండమయిన ఆలోచన’ అన్నాడు గాడిద.
‘తెలివంటే అది’ అన్నాడు దద్దమ్మ.
‘మన ఎద్దుగారు మాత్రమే ఇంతగొప్ప ఆలోచనలను చేయగలరు’
తేల్చేశాడు మత్తు.
మిగతావాళ్లందరు కూడా తలలు ఊపారు. ముద్దపప్పు ఒకడికే రాత
తెలుసు. అతనే సంఘానికి రాయసకాడు! కలము, తోలు తెచ్చాడు. కొత్త చట్టాన్ని రాసిపెట్టాడు. ఇక ఆ రోజు
నుంచి ఊళ్లో అందరూ నీటిని మీగడ అనాలి. మీగడను నీళ్లు అనాలి.
మామూలుగానే కమ్యూనిటీ వ్యవహారం ముగిసింది. పెద్దలందరూ మరేవో
సంగతులు చెప్పుకోసాగారు. అంతలో గ్రోనామ్ ‘రాత్రి నాకు కంటి మీద కునుకు లేదు.
వేసవిలోనే ఇంత వేడిగా ఎందుకు ఉంటుందని ఆలోచించాను. మొత్తానికి జవాబు తోచింది.’
అంటూ చెప్పసాగాడు.
‘ఏం తోచింది?’ అందరూ ఒక గొంతుగా అడిగారు.
‘చలికాలమంతా ఇళ్లలో నెగళ్లు వెలిగిస్తాం గదా. ఆ వేడి ఛెల్మ్లో
మిగిలిపోయి వేసవిలో వేడి పుడుతుంది.’
పెద్దలందరూ ఔనన్నట్టు తలలాడించారు. మత్తు లెకిష్ మాత్రం, ‘మరి చలికాలంలో చలిగా
ఎందుకుంటుందో?’ అంటూ ఓ ప్రశ్న అడిగాడు.
‘అది తెలిసిందే. వేసవిలో నెగళ్లు ఉండవు. కనుక వేడి మిగిలే
ప్రశ్న లేదు’ జవాబు ఇచ్చాడు గ్రోనామ్.
గ్రోనామ్ తెలివి గురించి అందరూ ఆశ్చర్యంగా అనుకుంటున్నారు.
ఇంతగా కష్టపడి ఆలోచించారు గనుక, అందరి చూపు వంటింటివేపు మళ్లింది. గెనెండెల్ టీ, కేకులు, జామ్తో వస్తుందని
వాళ్ల ఆశ.
గెనెండెల్ రానే వచ్చింది. కానీ ట్రే తేలేదు. చేతిలో ఒక
తాళం చెవి పట్టుకువచ్చి ‘గ్రోనామ్, ఇదుగో ఇనప్పెట్టె తాళం చెవి’ అంటూ మొగుడి చేతిలో పెట్టింది.
గ్రోనామ్ ఎద్దు మాత్రం ఇవాళ తాను తెలివిగల మాటలే అన్నానని గొప్ప నమ్మకంగా
ఉన్నాడు. కానీ గెనెండెల్ తాళం చెవితో వచ్చి నిలబడింది. అంటే, తానేదో పిచ్చిమాటలు
అన్నాడనే అర్థం. ఆయనకు బాగా కోపం వచ్చింది. అందరివేపు తిరిగి, ‘చెప్పండి. నేనేం
పిచ్చిమాటలు అన్నాను గనుక మాయావిడ తాళం చెవి తెచ్చి ఇచ్చింది?’ అంటూ ప్రశ్న వేశాడు.
ఆ మాటలతో పెద్దలంతా తికమక పడ్డారు. ఎద్దు భార్యతో తాను
చేసుకున్న ఒప్పందాన్ని వివరించి చెప్పాడు. తాను వెర్రి మాటలు అన్న వెంటనే ఆమె తాళం
తెచ్చి ఇస్తుందని వివరించాడు. ‘ఇవాళ మాత్రం నేను మాట్లాడనవన్నీ నిజంగా తెలివిగల
మాటలు గదా? మీరే
చెప్పండి’ అన్నాడు కూడా.
పెద్దలందరికీ గెనెండెల్ మీద కోపం వచ్చింది. ‘ఛెల్మ్ అనే ఈ
ఊరికే మేం పెద్దలం. మాకు అన్నీ అర్థమవుతాయి. తెలివి, తెలివిలేనితనం గురించి ఒక ఆడమనిషి మాకు చెప్పే పనిలేదు’
అన్నాడు ముద్దపప్పు.
విషయం గురించి కొంత చర్చ జరిగింది. వాళ్లు ఒక కొత్త చట్టం
తెచ్చారు. గ్రోనామ్ ఎద్దు అర్థంలేని మాటలు అంటున్నాడని పెళ్లానికి తోస్తే, ఆవిడ వచ్చి తాళం చెవిని పెద్దలకు ఇవ్వాలి. వాళ్లంతా
ఒప్పుకుంటేనే విషయం మార్చవలసిందిగా తమ పెద్దకు చెపుతారు. ఇక పెద్దలు గెనెండెల్
అభిప్రాయాన్ని అంగీకరించకుంటే, ఆనాడు ఇచ్చే టీ, కేక్లు, జామ్ రెండింతలు ఎక్కువగా ఉండాలి. ప్రత్యేకమయిన రొట్టె కూడా
ఇవ్వాలి. అది చట్టం.
ముద్దపప్పు వెంటనే కొత్త చట్టాన్ని కూడా తోలు పొర మీద
రాశాడు. ఛెల్మ్ గ్రామపు ముద్రను దాని మీద వేశాడు. ఆ ముద్రలో ఆరు కొమ్ములున్న ఒక
ఎద్దు ఉంటుంది.
ఆ రోజు నుంచి సమావేశాల్లో గ్రోనామ్ ఎద్దు మరీ బరితెగించి
మాట్లాడసాగాడు. తన భార్య గెనెండెల్ చాలా పిసినారి మనిషి అని తెలుసు మరి. ఇంట్లోని
పదార్ధాలన్నింటిని పెద్దలమంటూ వాళ్లు మింగేయడం ఆమెకు ఎలాగూ నచ్చదు.
ఆసారి పెంతెకోస్ట్ పండగకు పుల్లని మీగడ కావలసినంత
దొరికినట్టు లెక్క. కానీ, కొంతమంది ఇల్లాళ్లు నీళ్లు సరిపడినన్ని లేవని గునిశారు.
నిజానికి అది ఒక కొత్త సమస్య. కనుక పండుగ తరువాత దాన్ని తేలుస్తారు.
ఒక్క చట్టంతో ` ఛెల్మ్వారికి ఒక నది నిండాను, కొన్ని బావుల నిండాను
మీగడ అందించినవాడుగా గ్రోనామ్
ఎద్దుకు ప్రపంచమంతటా గొప్ప పేరు వచ్చింది.
Tuesday, May 19, 2026
Sunday, May 17, 2026
లోకాభిరామం : కథా కమామిషూ - A Story and other interesting things
లోకాభిరామం : కథా కమామిషూ
కథా కమామిషూ
ఆశ్చర్యపడదలుచుకుంటే
మనలను ఆశ్చర్యపరిచేందుకు ఈ ప్రపంచంలో అడుగడుగున కావలసినన్ని సంగతులు న్నయనేది మా
కుటుంబంలో ఒక తకియా కలామ్. అంటే తరచుగ వినిపించే మాట అని అర్ధం. అటువంటి సంగతు లను
వింటూ, చూస్తూ, చదువుతూ, సేకరిస్తూ మా కాలం గడుస్తుంటుంది.
వాటిని పంచుకోవడంలో, పెంచుకోవడంలో ఉన్న
ఆనందం అంతా ఇంతా కాదు! ‘నీవు చెప్పేది మంచి మాట అయ్యుంటే, దాన్ని ఇదివరకే ఎవరో చెప్పి ఉంటారు’
అనేది నేను స్వయంగా నమ్మి తయారుచేసుకున్న కొటేషన్. మంచి మాటలను, భావాలను బయటపెట్టే పద్ధతి మాత్రం
ఎక్కడికక్కడ ఆశ్చర్యకరంగ ఉంటుంది.
అచ్చరబల్ల-హాస్యకథ: హాస్యకథ అని రాయడంలోని అర్ధమేమి? కథలో నిజంగా హాస్యం పండి ఉంటే
చదవరులకు అర్ధమవుతుంది గదా? ముందే ఇది ‘హాస్యకథ’
జాగ్రత్త! అని చెపితే అందులోని హాస్యమే తప్ప మిగత సంగతులు కనిపించవేమో? నాకే అనుమానం. ఇంతకూ కథ!
ఒకాయన అత్తగారింటికి పోయినడు. అల్లునికి పండుగ జెయ్యాలె
మరి! ఏమున్నది చేసేందుకు? అత్తగారికి మంచి
ఆలోచన వచ్చింది. అల్లునికి తీపి ఇష్టమని ఆమెకు తెలిసినట్లున్నది. ఆమె నెయ్యి, బెల్లము వేసి సంకటి వండి పెట్టింది.
అల్లునికది బాగ నచ్చింది. ‘రుచి బాగున్నది. ఇదేమిడిది’ అని అడిగినడు. ‘తమిదె సంకటి’ అని
వాండ్లు చెప్పినరు. ‘తమిదె సంకటి, తమిదె సంకటి’
అనుకుంటూ తమ ఊరి తోవన వస్తున్నడు. నడుమ ఒక కాలువ వచ్చింది. దాని మీదనుంచి ఎగిరి
దుంకాలె. దుంకేటప్పడు ఊపు కొద్దీ, ‘అచ్చరబల్ల’ అన్నడు.
సంకటి సంగతి మరిచి, ‘అచ్చరబల్ల, అచ్చరబల్ల’ అనుకుంట ఇల్లు జేరినడు.
‘అచ్చరబల్ల’ చేసి పెట్టమని పెండ్లామును అడిగినడు. ‘అటువంటిది నాకు రాదు’ అన్నదామె.
‘మీ అమ్మవాండ్ల ఇంట్లో తిన్న నేను. నీవు కావాలంటని రాదంటున్నవు’ అని కోపం కొద్ది
పెండ్లామును బాగా కొట్టినడు. ఆ పుణ్యాత్మురాలు ‘నిజంగ నాకు దెలువదు’ అని మాత్రము
అన్నది. ఇంకా బాగా కొట్టినడు ఆమెను. ఆమె అంగలార్చింది. ఇరుగింటమ్మ, పొరుగింటమ్మ చేరినరు. పక్కింటి
ముసలామె ‘పిల్లను సంకటి సంకటిగ కొట్టినవు గదయా? ఏమొచ్చింది నీకు?’ అన్నది. ‘అగో! సంకటి! దాని కొరకే!’ అని అప్పుడు యాదికొచ్చి
అన్నడు!
కథ అయిపొయ్యింది. కాని కంచికి మాత్రం పోలేదు. ఇంతకు మీరు
నవ్వుతరా? ఆలోచన చేస్తరా? ఈ కథ మా చిన్నప్పుడు ఇన్నము (అనగా
వినియుంటిమి, వింటిమి, విన్నాము వగైరా వగైరాలన్నమాట!)
తయిదలు, తమిదెలు అన్నా రాగులన్నా ఒకటే! అమ్మ
నెయ్యిపోసి తమిదె సంకటి వండి పెట్టేది. మేము దాన్ని సంకటి అని ఒక్కనాడు గూడ అనలేదు.
దానికి, మాకు తెలిసిన పేరు ‘అచ్చరబల్ల’
మాత్రమే. సంకటి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా అచ్చరబల్ల అని మాత్రమే అన్నము
(అనగా అనియుంటిమి, అంటి, అన్నాము వగైరా వగైరాలన్న మాట).
రాగిముద్ద, అనే ఆహార విశేషం ఒకటి
ఉంది. దాన్ని మేమయితే తయిద (తమిదె, తమిద) సంకటి అంటము. అది అచ్చరబల్ల కాదు. బెల్లము, నెయ్యివేసి వండినది మాత్రమే
అచ్చరబల్ల!
అచ్చరబల్ల వంటి పల్లెటూరి కథలు అరుదయి పోయినయి. తెలిసిన
వాండ్లు చెప్పకపోతే, అందరు మరిచిపోతరు.
మీకు మీ పల్లెలో విన్న కథలు తెలిసి ఉంటయి. వాటిని పంచుకుందము గద!
ఆశ్చర్యం, టావో-టె-చింగ్:
పిల్లలు పుట్టిన వెంటనే చైనావారు ఒక గిన్నె లేదా మరో వస్తువును కింద పడేస్తారని
అది చేసిన చప్పుడును, ఆ శిశువుకు పేరుగా
స్థిరం చేస్తారని ఒకరెవరో చమత్కరించడం ఎరుగుదును. అది కేవలం చమత్కారం మాత్రమే. అది
వేరే విషయం.
తెలివి:
/గతి తెలిసిన పథికుడు తన అడుగు జాడలను వదలడు
/మతి గలిగిన మాటగాడు వేలెత్తే నిందకు తావివ్వడు
/ మితి తెలిసిన గణకుడు లెక్క తప్పనీయడు
/ఇక ఇతనేమో, మేకులు మాకులు లేకనే పెట్టెను మూస్తాడు
/దాన్ని తెరవడం అసాధ్యమవుతుంది
/వేరొకతను ముడులు, వడులు లేకనే కట్లు కడతాడు
/విడదీయను అసాధ్యమవుతుంది
/ఇదే దారిలో జ్ఞాని మనుషులను కాపాడడంలో నిపుణుడు
/ఎవరినీ వదలడు
/వస్తువులనూ కాపాడుతడు
/దేన్నీ వదలడు
/దీన్నే మన పద్ధతుల వెలుగును దాచడం అంటరు
/చెయ్యి తిరిగిన వారినే గురువులు అంటము
/ కళ తెలియని వారు వారిని ఆశ్రయిస్తరు
/ఈ తెలియనివారు గురువులకు గుర్తింపునిస్తరు
/గురువును శిష్యుడు గుర్తించకున్నా
/గురువితడిపట్ల హర్షించకున్నా
/వారిని చూచే
/పరిశీలకుడు, తాను తెలివిగల వాడయినా తప్పుదారి పడతడు/
ఇది రహస్యాలకే రహస్యం/
(చదువరీ ఇది కవిత మాత్రము కాదని సవినయముగ మనవి చేయుదును)
టావో-టే-చింగ్లోని ఒకానొక పేరాగ్రాఫ్కు ఇది నేను చేసిన
భాషాంతరీకరణం మాత్రమే. ఇందులో మీకేమన్న అర్థం తోచిందా? నేనింకా వెతుకుతునే ఉన్న. మరింత
బుర్ర చించుకుంటునే ఉన్న!
మరింత తెలివి: ఒకప్పుడు చైనా రాజధానిని పీకింగ్, లేదా పెకింగ్ అనేవారు. ఆ మధ్యన
బెయిజింగ్ అనాలన్నరు. (పరుషములు సరళములాయెను-ఇతి వ్యాకరణం. అర్ధంకాని వారికి రణం!)
అచ్చం అదే పద్ధతిలో టావ్-టె-చింగ్ను (వ్-వో తేడా లేదను కుందాం) డావ్-డే-జింగ్
అనాలన్నారు. మూడు మాటలనూ కలిపి పలికినా తప్పు లేదట. టావ్ లేక డావ్ అంటే మార్గం. (ఈ
మధ్యన సక్సెస్ సాధించిన కంపెనీలన్నీ ‘మైక్రోసాఫ్ట్ వే’ అనీ మరో కంపెనీ వే, అనీ, ఆయా కంపెనీల పని తీరు గురించి పుస్తకాలు
వేసుకుంటున్నరు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో
కంపెనీగానీ, మనిషిగానీ, ఏదో ఒక మార్గం- వే వల్లనే బాగుపడతరు, పాడవుతరు కూడా. కానీ, బాగుపడిన వారు మాత్రమే ఈ సంగతిని
అవునంటరు.
డావ్ డే జింగ్ను చైనాలో క్రీపూ ఆరవ శతాబ్దిలో లావో త్సు
అనే తాత్వికుడు రాసినడంటరు. (అంటే కొంచెం అనుమానమని అర్ధం!) లావో త్సు అనే మాటకు
ఓల్డ్ మాస్టర్ (వృద్ధ గురువు, పండితుడు) అని
అర్ధమట. పుస్తకం పేరు గురించి మస్తకం-తల పగిలేటంత చర్చ ఉంది. ‘మార్గం, శక్తి గురించిన నిజమయిన ప్రాచీన
గ్రంథం’ అనే అర్ధాన్ని ఇంచు మించు అందరూ అవునంటరు. నాటినుండి నేటి వరకు ఈ పుస్తకం
చైనాలో వెలుపల, అందరికీ దారి చూపుతనే
ఉన్నది.
పైన చదివిన ముక్కను తెలుగులో రాసింది, యువర్స్ ట్రూలీ, అనగా భవదీయుడు అని మనవి. మరో ముక్క
‘ముప్పయి ఆకులను ఒకచోట చేర్చి చక్రం అంటము/
వాటి మధ్యగల ఖాళీ మీద చక్రం ఉపయోగం ఆధారపడి ఉంది/
మట్టిని కుండగ మారుస్తము/
లోపల ఏమీలేని ఖాళీమీద కుండ ఉపయోగం ఆధారపడి ఉంది/
తలుపులు, కిటికీలు గుచ్చి
ఇల్లు అంటము/
లోపల ఏమీలేని ఖాళీ మీద ఇంటి ఉపయోగం ఆధారపడి ఉంది/
అందుకే ఉన్నదాన్ని ఎంతగా ఉపయోగించుకుంటమో/
లేనిదాని ఉపయోగాన్నీ అంతగానూ గుర్తించగలగాలె!’ (చక్రంలోని
నడిమి కుండను, వెలుపలి పూటీలను
కలిపేవి ఆకులు!)
హాశ్చర్యం టు ద పవరాఫ్ మీ ఇష్టం: మిత్రులూ! ఇంతవరకు విన్న, చదివిన
తరువాత మీకు ఆశ్చర్యం కలిగిందా, ఆనందం కలిగిందా, అదేదీ కాక బోర్ కొట్టిందా? మీకు అంతో కొంతో ఆలోచన కలిగియుంటే
మాత్రం నాకు రొంబరొంబ, నిండ సంతోషం గద! వీలు
దొరికింది గదా అని నేను ఊదర గొడుతున్న.. మీరంతా భరిస్తున్నరు. కోపగించుకోకండి కానీ, ఒక పెద్దాయన ఒక మాట చెప్పినడు.
ఆయనంటడూ, ‘మన పరస్పర సంబంధాలలో, అవగాహనలో, అంచనాలలో జరిగే పొరపాట్లకు
కారణాలున్నయి. ఏమిటంటే, మనం చదవవలసిన దాంట్లో
నాలుగింట మూడువంతులు మాత్రమే చదువు తము. సగం వరకు మాత్రమే వింటము (వినవలసిన దాంట్లోనన్నమాట).
అర్థం చేసుకునేది అవకాశంలో పావు వంతు మాత్రమే. ఆలోచన అసలే ఉండదు. మనుషుల మీద మన
పనులు, ప్రతి చర్యలు, ఆలోచనలు, మాటలు చూపగల ప్రభావం గురించి మనకు
పట్టదూ- అని. (ఈ మనంలో భవదీయుడు, అనగా యువర్స్ ట్రూలీ, ముందు వరసలోనే ఉన్నడు మరి!)




