Lokabhiramam
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Tuesday, May 19, 2026
Sunday, May 17, 2026
లోకాభిరామం : కథా కమామిషూ - A Story and other interesting things
లోకాభిరామం : కథా కమామిషూ
కథా కమామిషూ
ఆశ్చర్యపడదలుచుకుంటే
మనలను ఆశ్చర్యపరిచేందుకు ఈ ప్రపంచంలో అడుగడుగున కావలసినన్ని సంగతులు న్నయనేది మా
కుటుంబంలో ఒక తకియా కలామ్. అంటే తరచుగ వినిపించే మాట అని అర్ధం. అటువంటి సంగతు లను
వింటూ, చూస్తూ, చదువుతూ, సేకరిస్తూ మా కాలం గడుస్తుంటుంది.
వాటిని పంచుకోవడంలో, పెంచుకోవడంలో ఉన్న
ఆనందం అంతా ఇంతా కాదు! ‘నీవు చెప్పేది మంచి మాట అయ్యుంటే, దాన్ని ఇదివరకే ఎవరో చెప్పి ఉంటారు’
అనేది నేను స్వయంగా నమ్మి తయారుచేసుకున్న కొటేషన్. మంచి మాటలను, భావాలను బయటపెట్టే పద్ధతి మాత్రం
ఎక్కడికక్కడ ఆశ్చర్యకరంగ ఉంటుంది.
అచ్చరబల్ల-హాస్యకథ: హాస్యకథ అని రాయడంలోని అర్ధమేమి? కథలో నిజంగా హాస్యం పండి ఉంటే
చదవరులకు అర్ధమవుతుంది గదా? ముందే ఇది ‘హాస్యకథ’
జాగ్రత్త! అని చెపితే అందులోని హాస్యమే తప్ప మిగత సంగతులు కనిపించవేమో? నాకే అనుమానం. ఇంతకూ కథ!
ఒకాయన అత్తగారింటికి పోయినడు. అల్లునికి పండుగ జెయ్యాలె
మరి! ఏమున్నది చేసేందుకు? అత్తగారికి మంచి
ఆలోచన వచ్చింది. అల్లునికి తీపి ఇష్టమని ఆమెకు తెలిసినట్లున్నది. ఆమె నెయ్యి, బెల్లము వేసి సంకటి వండి పెట్టింది.
అల్లునికది బాగ నచ్చింది. ‘రుచి బాగున్నది. ఇదేమిడిది’ అని అడిగినడు. ‘తమిదె సంకటి’ అని
వాండ్లు చెప్పినరు. ‘తమిదె సంకటి, తమిదె సంకటి’
అనుకుంటూ తమ ఊరి తోవన వస్తున్నడు. నడుమ ఒక కాలువ వచ్చింది. దాని మీదనుంచి ఎగిరి
దుంకాలె. దుంకేటప్పడు ఊపు కొద్దీ, ‘అచ్చరబల్ల’ అన్నడు.
సంకటి సంగతి మరిచి, ‘అచ్చరబల్ల, అచ్చరబల్ల’ అనుకుంట ఇల్లు జేరినడు.
‘అచ్చరబల్ల’ చేసి పెట్టమని పెండ్లామును అడిగినడు. ‘అటువంటిది నాకు రాదు’ అన్నదామె.
‘మీ అమ్మవాండ్ల ఇంట్లో తిన్న నేను. నీవు కావాలంటని రాదంటున్నవు’ అని కోపం కొద్ది
పెండ్లామును బాగా కొట్టినడు. ఆ పుణ్యాత్మురాలు ‘నిజంగ నాకు దెలువదు’ అని మాత్రము
అన్నది. ఇంకా బాగా కొట్టినడు ఆమెను. ఆమె అంగలార్చింది. ఇరుగింటమ్మ, పొరుగింటమ్మ చేరినరు. పక్కింటి
ముసలామె ‘పిల్లను సంకటి సంకటిగ కొట్టినవు గదయా? ఏమొచ్చింది నీకు?’ అన్నది. ‘అగో! సంకటి! దాని కొరకే!’ అని అప్పుడు యాదికొచ్చి
అన్నడు!
కథ అయిపొయ్యింది. కాని కంచికి మాత్రం పోలేదు. ఇంతకు మీరు
నవ్వుతరా? ఆలోచన చేస్తరా? ఈ కథ మా చిన్నప్పుడు ఇన్నము (అనగా
వినియుంటిమి, వింటిమి, విన్నాము వగైరా వగైరాలన్నమాట!)
తయిదలు, తమిదెలు అన్నా రాగులన్నా ఒకటే! అమ్మ
నెయ్యిపోసి తమిదె సంకటి వండి పెట్టేది. మేము దాన్ని సంకటి అని ఒక్కనాడు గూడ అనలేదు.
దానికి, మాకు తెలిసిన పేరు ‘అచ్చరబల్ల’
మాత్రమే. సంకటి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా అచ్చరబల్ల అని మాత్రమే అన్నము
(అనగా అనియుంటిమి, అంటి, అన్నాము వగైరా వగైరాలన్న మాట).
రాగిముద్ద, అనే ఆహార విశేషం ఒకటి
ఉంది. దాన్ని మేమయితే తయిద (తమిదె, తమిద) సంకటి అంటము. అది అచ్చరబల్ల కాదు. బెల్లము, నెయ్యివేసి వండినది మాత్రమే
అచ్చరబల్ల!
అచ్చరబల్ల వంటి పల్లెటూరి కథలు అరుదయి పోయినయి. తెలిసిన
వాండ్లు చెప్పకపోతే, అందరు మరిచిపోతరు.
మీకు మీ పల్లెలో విన్న కథలు తెలిసి ఉంటయి. వాటిని పంచుకుందము గద!
ఆశ్చర్యం, టావో-టె-చింగ్:
పిల్లలు పుట్టిన వెంటనే చైనావారు ఒక గిన్నె లేదా మరో వస్తువును కింద పడేస్తారని
అది చేసిన చప్పుడును, ఆ శిశువుకు పేరుగా
స్థిరం చేస్తారని ఒకరెవరో చమత్కరించడం ఎరుగుదును. అది కేవలం చమత్కారం మాత్రమే. అది
వేరే విషయం.
తెలివి:
/గతి తెలిసిన పథికుడు తన అడుగు జాడలను వదలడు
/మతి గలిగిన మాటగాడు వేలెత్తే నిందకు తావివ్వడు
/ మితి తెలిసిన గణకుడు లెక్క తప్పనీయడు
/ఇక ఇతనేమో, మేకులు మాకులు లేకనే పెట్టెను మూస్తాడు
/దాన్ని తెరవడం అసాధ్యమవుతుంది
/వేరొకతను ముడులు, వడులు లేకనే కట్లు కడతాడు
/విడదీయను అసాధ్యమవుతుంది
/ఇదే దారిలో జ్ఞాని మనుషులను కాపాడడంలో నిపుణుడు
/ఎవరినీ వదలడు
/వస్తువులనూ కాపాడుతడు
/దేన్నీ వదలడు
/దీన్నే మన పద్ధతుల వెలుగును దాచడం అంటరు
/చెయ్యి తిరిగిన వారినే గురువులు అంటము
/ కళ తెలియని వారు వారిని ఆశ్రయిస్తరు
/ఈ తెలియనివారు గురువులకు గుర్తింపునిస్తరు
/గురువును శిష్యుడు గుర్తించకున్నా
/గురువితడిపట్ల హర్షించకున్నా
/వారిని చూచే
/పరిశీలకుడు, తాను తెలివిగల వాడయినా తప్పుదారి పడతడు/
ఇది రహస్యాలకే రహస్యం/
(చదువరీ ఇది కవిత మాత్రము కాదని సవినయముగ మనవి చేయుదును)
టావో-టే-చింగ్లోని ఒకానొక పేరాగ్రాఫ్కు ఇది నేను చేసిన
భాషాంతరీకరణం మాత్రమే. ఇందులో మీకేమన్న అర్థం తోచిందా? నేనింకా వెతుకుతునే ఉన్న. మరింత
బుర్ర చించుకుంటునే ఉన్న!
మరింత తెలివి: ఒకప్పుడు చైనా రాజధానిని పీకింగ్, లేదా పెకింగ్ అనేవారు. ఆ మధ్యన
బెయిజింగ్ అనాలన్నరు. (పరుషములు సరళములాయెను-ఇతి వ్యాకరణం. అర్ధంకాని వారికి రణం!)
అచ్చం అదే పద్ధతిలో టావ్-టె-చింగ్ను (వ్-వో తేడా లేదను కుందాం) డావ్-డే-జింగ్
అనాలన్నారు. మూడు మాటలనూ కలిపి పలికినా తప్పు లేదట. టావ్ లేక డావ్ అంటే మార్గం. (ఈ
మధ్యన సక్సెస్ సాధించిన కంపెనీలన్నీ ‘మైక్రోసాఫ్ట్ వే’ అనీ మరో కంపెనీ వే, అనీ, ఆయా కంపెనీల పని తీరు గురించి పుస్తకాలు
వేసుకుంటున్నరు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో
కంపెనీగానీ, మనిషిగానీ, ఏదో ఒక మార్గం- వే వల్లనే బాగుపడతరు, పాడవుతరు కూడా. కానీ, బాగుపడిన వారు మాత్రమే ఈ సంగతిని
అవునంటరు.
డావ్ డే జింగ్ను చైనాలో క్రీపూ ఆరవ శతాబ్దిలో లావో త్సు
అనే తాత్వికుడు రాసినడంటరు. (అంటే కొంచెం అనుమానమని అర్ధం!) లావో త్సు అనే మాటకు
ఓల్డ్ మాస్టర్ (వృద్ధ గురువు, పండితుడు) అని
అర్ధమట. పుస్తకం పేరు గురించి మస్తకం-తల పగిలేటంత చర్చ ఉంది. ‘మార్గం, శక్తి గురించిన నిజమయిన ప్రాచీన
గ్రంథం’ అనే అర్ధాన్ని ఇంచు మించు అందరూ అవునంటరు. నాటినుండి నేటి వరకు ఈ పుస్తకం
చైనాలో వెలుపల, అందరికీ దారి చూపుతనే
ఉన్నది.
పైన చదివిన ముక్కను తెలుగులో రాసింది, యువర్స్ ట్రూలీ, అనగా భవదీయుడు అని మనవి. మరో ముక్క
‘ముప్పయి ఆకులను ఒకచోట చేర్చి చక్రం అంటము/
వాటి మధ్యగల ఖాళీ మీద చక్రం ఉపయోగం ఆధారపడి ఉంది/
మట్టిని కుండగ మారుస్తము/
లోపల ఏమీలేని ఖాళీమీద కుండ ఉపయోగం ఆధారపడి ఉంది/
తలుపులు, కిటికీలు గుచ్చి
ఇల్లు అంటము/
లోపల ఏమీలేని ఖాళీ మీద ఇంటి ఉపయోగం ఆధారపడి ఉంది/
అందుకే ఉన్నదాన్ని ఎంతగా ఉపయోగించుకుంటమో/
లేనిదాని ఉపయోగాన్నీ అంతగానూ గుర్తించగలగాలె!’ (చక్రంలోని
నడిమి కుండను, వెలుపలి పూటీలను
కలిపేవి ఆకులు!)
హాశ్చర్యం టు ద పవరాఫ్ మీ ఇష్టం: మిత్రులూ! ఇంతవరకు విన్న, చదివిన
తరువాత మీకు ఆశ్చర్యం కలిగిందా, ఆనందం కలిగిందా, అదేదీ కాక బోర్ కొట్టిందా? మీకు అంతో కొంతో ఆలోచన కలిగియుంటే
మాత్రం నాకు రొంబరొంబ, నిండ సంతోషం గద! వీలు
దొరికింది గదా అని నేను ఊదర గొడుతున్న.. మీరంతా భరిస్తున్నరు. కోపగించుకోకండి కానీ, ఒక పెద్దాయన ఒక మాట చెప్పినడు.
ఆయనంటడూ, ‘మన పరస్పర సంబంధాలలో, అవగాహనలో, అంచనాలలో జరిగే పొరపాట్లకు
కారణాలున్నయి. ఏమిటంటే, మనం చదవవలసిన దాంట్లో
నాలుగింట మూడువంతులు మాత్రమే చదువు తము. సగం వరకు మాత్రమే వింటము (వినవలసిన దాంట్లోనన్నమాట).
అర్థం చేసుకునేది అవకాశంలో పావు వంతు మాత్రమే. ఆలోచన అసలే ఉండదు. మనుషుల మీద మన
పనులు, ప్రతి చర్యలు, ఆలోచనలు, మాటలు చూపగల ప్రభావం గురించి మనకు
పట్టదూ- అని. (ఈ మనంలో భవదీయుడు, అనగా యువర్స్ ట్రూలీ, ముందు వరసలోనే ఉన్నడు మరి!)
Friday, May 15, 2026
రూమీ ప్రేమ కవితలు : Rumi’s Love Poems
రూమీ ప్రేమ కవితలు : Rumi’s Love Poems
Rumi’s Love Poems
THROUGH LOVE all that is bitter will be sweet
Through Love all that is copper will
be gold.
Through Love all dregs will turn to purest wine
Through Love all pain will turn to medicine.
Through Love the dead will all
become alive.
Through Love the king will turn into
a slave!
ప్రేమతో చేదంతా తీపి అవుతుంది.
ప్రేమతో రాగి బంగారమవుతుంది.
ప్రేమతో మత్తు పదార్థాలన్నీ మంచి
సారాయమవుతాయి.
ప్రేమతే బాధలన్నీ ఔషధాలవుతాయి.
ప్రేమతో మృతులంతా జీవంతులవుతారు.
ప్రేమతో రారాజు బానిసవుతాడు.
Once a beloved asked her lover:
"Friend, you have seen many places in the world!
Now - which of all these cities was
the best?
He said: "The city where my
sweetheart lives!"
మిత్రమా,
నీవు ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలను చూచావు
గదా
ప్రేమి,
ప్రేమికుని ఒక ప్రశ్న అడిగింది.
మరి వాటన్నింటిలో ఏది ఉత్తమంగా ఉందీ అని
అతనన్నాడూ, నా ప్రియురాలున్న నగరమే అని.
FROM MYSELF I am copper,
through You, friend, I am gold.
From myself I'm a stone, but
Through You I am a gem!
నా అంతకు నేనుగా రాగిని మాత్రమే
నీవుంటే మిత్రమా, నేను బంగారాన్ని.
నా అంతకు నేనుగా నేనొక రాతిని, కానీ
నీతో ఉంటే రత్నాన్ని.
O SUN, fill our house once more with light!
Make happy all your friends and blind your foes!
Rise from behind the hill, transform the stones
To rubies and the sour grapes to wine!
O Sun, make our vineyard fresh again,
And fill the steppes with houris and green cloaks!
Physician of the lovers, heaven's lamp!
Rescue the lovers! Help the suffering!
Show but your face - the world is
filled with light!
But if you cover it, it's the darkest night!
సూర్యుడా,
మాయింటిని మరో సారి వెలుగుతో ముంచెత్తు,
మితృలందరికి సంతోషాన్ని పంచు, శతృవుల కళ్లను పోగొట్టు,
కొండ వెనకనుండి ఉదయించు, బండలను మార్చి
మంచి కెంపులుగా, పుల్లని ద్రాక్షలను మంచి మద్యంగా
చెయ్యి.
సూర్యుడా మా ద్రాక్షతోటను మళ్లీ తాజా
చెయ్యి.
మైదానాల మీద మంచి గడ్డిని పరిపించు.
ప్రేమ వైద్యలారా, అదుగో స్వర్గదీపం
ప్రేమికులను కాపాడండి, బాధితులకు బాసటనివ్వండి.
ఒక్కసారి మీ ముఖం చూపిస్తే, ప్రపంచమంతా వెలుగు నిండుతుంది.
ఆ ముఖాన్నే గనుక కప్పుకుంటే, అంతా రాత్రి అవుతుంది.
Life of Rumi
The term Sufi, is known to many but, few know of the
philosophy to its depth. When you read or listen to these poems, you get a
feeling that the poet is infatuated with a dame. Mind you the poems are written
by Maulana Jalaluddin Rumi, the greatest Sufi that ever lived. The love is only
towards the God and not towards any mortal being. Such is devotion in Sufi
style. I remember Sri Balantrapu Rajani Kanta Rao, doyen of literature and
music saying that Meera Bai was the best Sufi from India. Similarly, the love
and love poems of Andal can be classified as belonging to this style of love.
Here are a few words about the life and times of Rumi.
The name Mowlana Jalaluddin Rumi stands for Love and ecstatic flight into the
infinite. Rumi is one of the great spiritual masters and poetical geniuses of
mankind and was the founder of the Mawlawi Sufi order, a leading mystical
brotherhood of Islam.
Rumi was born in Wakhsh (Tajikistan) under the administration of Balkh on 30
September 1207 to a family of learned theologians. Escaping the Mongol invasion
and destruction, Rumi and his family traveled extensively in the Muslim lands,
performed pilgrimage to Mecca and finally settled in Konya, Anatolia, then part
of Seljuk Empire. When his father Bahaduddin Valad passed away, Rumi succeeded
his father in 1231 as professor in religious sciences. Rumi, 24 years old, was
an already accomplished scholar in religious and positive sciences.
He was introduced into the mystical path by a wandering dervish, Shamsuddin of
Tabriz. His love and his bereavement for the death of Shams found their
expression in a surge of music, dance and lyric poems, `Divani Shams Tabrizi'. Rumi is the author of six volume didactic epic work, the `Masnawi', called as the 'Koran in Persian' by Jami, and
discourses, `Fihi ma Fihi', written to introduce his disciples into metaphysics.
If there is any general idea underlying Rumi's poetry, it is the absolute love
of God. His influence on thought, literature and all forms of aesthetic
expression in the world of Islam cannot be overrated.
Mevlana Jalaluddin Rumi died on December 17, 1273. Men of five faiths followed
his bier. That night was named Sebul Arus, the Night of Union. Ever since, the
Mawlawi dervishes have kept that date as a festival.
సూపర్ ఎల్ నీనో వస్తున్నదా? On the impending 'Super El Nino".
సూపర్ ఎల్ నీనో వస్తున్నదా?
సూపర్
ఎల్ నీనో వస్తున్నదా
పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా బహుశా
సూపర్ ఎల్ నీనో అనే వాతావరణ సన్నివేశం బహుశా వస్తున్నది. దాని ప్రభావంగా ఎన్నడూ
లేనంతగా ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
గత కొంతకాలంగా వాతావరణం గురించి
పరిశోధనలు జరుగుతున్న చోట్ల అంతటా చాలా బలమైన ఎల్ నీనో వాతావరణ పరిస్థితి, ఈ
సంవత్సరం రెండవ భాగంలో రావచ్చు, అన్న సూచనలు అందుతున్నాయి. అది మరి ముందు ఎప్పుడూ
లేనంతగా బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు.
ఈ పరిస్థితిని కొందరు గాడ్జిల్లా ఎల్
నీనో అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరువులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవత్సరాన్ని
ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టు వారి అంచనా.
అసాధారణమైన వాతావరణ పరిస్థితులు
రాబోతున్నాయి, అని ఈ విషయం గురించి వ్యాఖ్యానించిన యునైటెడ్ కింగ్డమ్ వారి నేషనల్
వెదర్ సర్వీసెస్ పరిశోధకులు ఆడం స్కైఫే అంటున్నారు.
ఎల్ నీనో అన్నది ప్రపంచ వాతావరణంలో
మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతటా వాతావరణంలో వింత పరిస్థితులు
కనబడతాయి. ఉష్ణ మండల ప్రాంతంలోని శాంతి మహాసముద్రం అంటే పసిఫిక్ మీద తూర్పు నుండి
పడమటి వైపు వీచే వ్యాపార పవనాలు బలహీనమవుతాయి. అందువల్ల సముద్రంలో లోతులలోనున్న
చల్లని నీరు పైకి చిమ్ముకు రావడం బాగా తగ్గుతుంది. కనుక ఉపరితలంలో ఉన్న వేడి నీరు
పసిఫిక్ సముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాలలోకి బలంగా కదులుతుంది.
మొత్తానికి వాతావరణంలో ఎప్పటిలాగే కలిగే చలనం కొంత తూర్పు వైపుకు కదులుతుంది.
శాంతి మహాసముద్రం మధ్యభాగంలో సముద్ర ఉపరితల
ఉష్ణోగ్రత సగటుగా ఉండే స్థాయి నుంచి అర డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది. అప్పుడు
ఎల్ నీనో మొదలవుతుంది. అంటే గాలి కదలికలో తేడాలు వస్తాయి. ఆ మార్పు అలా రెండు
డిగ్రీలు సెంటిగ్రేడ్ చేరితే అది బలమైన ఎల్ నీనో పరిస్థితి కింద లెక్క. దాన్నే
సూపర్ ఎల్ నీనో అంటారు. ఎల్ నీనో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ
ఇప్పుడు వస్తుంది అనుకుంటున్న తీవ్రమైన పరిస్థితి 1982-83, 1997-98 ఆ తరువాత 2015-16లలో వచ్చింది.
సూపర్ ఎల్ నీనో వచ్చే అవకాశం గురించి
చాలా చోట్ల పరిశోధనలు జరుగుతున్నాయి. మార్చి నెలలోనూ ఏప్రిల్ మొదటి భాగంలోనూ పడమటి
దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చని నీరు మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాలకు బలంగా కదులుతున్నది. నిజంగా బలమైన ఎల్ నీనో
రావడానికి ఇది ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ మాసం కల్లా ఉష్ణోగ్రతలో
తేడా రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు గమనించారు.
యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ క్యాస్ట్ వారు బలమైన ఎల్ నీనో వచ్చే
పరిస్థితి 50 శాతం వరకు ఉండవచ్చు అని అనుమాని స్తున్నారు.
ఇక యు ఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వారు ఆ
అవకాశం 25 శాతం మాత్రమే ఉంది అంటున్నారు. యూరోప్ లోని గ్రూపులు మరింత తీవ్రమైన
ఉష్ణోగ్రత మార్పులు వస్తాయని, వేడి మూడు డిగ్రీలు సెంటీగ్రేట్ చేరుతుందని
అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈసారి ఎల్ నీనో తీరు ఎన్నడూ లేనంత బలంగా ఉంటుంది. మే
మాసం గడిచి, జూన్ మాసంలో సగం తరువాత ఈ విషయం గురించి ఖచ్చితంగా
చెప్పే వీలు ఉంటుంది అంటున్నారు.
ఇంతకు దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది
మధ్య, తూర్పు
శాంతి మహాసముద్రం మీద జరుగుతున్న మార్పులు కలుగజేసే ప్రభావం, టెలికనెక్షన్స్ అనే పద్ధతి ద్వారా ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ప్రపంచమంతటా
వాతావరణ పద్ధతి, శీతోష్ణ స్థితులు బాగా మార్పులు
చూపుతాయి. ఫలితంగా పంటలు సరిగా పడకపోవడం, సముద్రతీరాలలోని
పగడపు కొండలు బ్లీచ్ కావడం మొదలు ఆయా ప్రాంతాలలో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు
ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి.
పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది.
మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు. అంటారు పరిశోధకులు టిమ్ స్టాక్ డేల్. పెద్ద
ఎత్తున తుఫానులు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి
పరిస్థితులు అంతకు ముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు, అంటారాయన.
మొత్తానికి ఉత్తర, దక్షిణ అమెరికాలలో, అటు ఆఫ్రికా, చైనాలలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అదే సమయంలో ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలోని మధ్య దక్షిణ ప్రాంతాలు, భారతదేశం, అమెజాన్లలో వర్షాలు మొదలైన చోట్ల పొడి వాతావరణం బాగా పెరిగి
కరువులు, హీట్ వేవ్ లు, అడవులు
తగలబడడం లాంటివెన్నో జరగవచ్చు.
యూకే, యూరోప్
లలో ప్రభావాలు మరింత బలంగా ఉంటాయి. అక్కడ వేసవి వేడి మరింత తీవ్రంగా, చల్లును కూడా మరింత తీవ్రంగా ఉండే వీలుంది. చలికాలంలో తేమ ఎక్కువయ్యి అనుకూలం
కాని పరిస్థితులు ఎదురు కావచ్చు. వాతావరణంలోని మిగతా అంశాల ప్రభావం ఈ పరిస్థితుల
మీద ఉంటుందని అర్థం చేసుకోవాలి.
వాతావరణం మారుతున్నది, ప్రపంచం వేడెక్కుతున్నది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. ఆ పరిస్థితి సముద్రంలో
తీరానికి తోసుకువస్తున్న ఒక అల లాంటిది అయితే, ఈ
ఎల్ నీనో అన్నది ఉవ్వెత్తున వచ్చి ముంచెత్తే చాలా పెద్ద అల అని చెప్ప వచ్చు. కనుక
కలిగే మార్పులు పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రపంచ మొత్తం మీద వేడిమి రెండు డిగ్రీలు
సెంటిగ్రేడ్ పెరిగే వీలు బలంగా ఉంది.
2024 సంవత్సరంలో ఎల్ నీనో వచ్చింది. ఆ
సంవత్సరంలో మునుపెన్నడు లేనంతగా ప్రపంచ వాతావరణ వేడెక్కింది. ఇక అంటున్నట్టు ఈ
సూపర్ ఎల్ నీనో కాని వచ్చిందంటే అది మరొక కొత్త రికార్డ్ అవుతుంది.
ఎల్ నీనో వల్ల వేడి పెరుగుతుంది. దీనికి
వ్యతిరేకంగా లా నీనా అనే పరిస్థితి కూడా ఉంది. ఈ రెండు పరిస్థితులు గత 50 - 60
సంవత్సరాలలో అంతకుముందున్నడు లేనన్ని మార్లు వచ్చాయి. కానీ వాతావరణం గురించి
పరిశోధించిన వివరాలు 150 సంవత్సరాల మేర మాత్రమే ఉన్నాయి. అందులో కూడా మొదట్లో
చేసిన పరిశోధనలు అంత నమ్మదగినవి కావు అన్న అనుమానాలు ఉన్నాయి. అప్పటి గణాంకాలు
సరిగా లేవని అనుమానం. కనుక వాతావరణ మార్పు వల్ల ఈ ఎల్ నీనో, లా నీనాలు, వస్తున్నాయని, వాటి వల్ల వాతావరణం
మారుతున్నదని, గట్టిగా చెప్పడానికి కొంతమంది పరిశోధకులు అభ్యంతరం చెబుతున్నారు.
మొత్తానికి ప్రపంచం వేడెక్కుతున్న తీరు
వల్ల, వస్తున్న ప్రభావాలు బలంగా కనబడు తున్నాయి. ప్రపంచమంతటా
వేడి పెరిగితే నేల నుండి తేమ ఇగిరిపోతుంది. చుట్టూ ఉన్న వాతావరణంలో తేమ
పెరుగుతుంది. ఫలితంగా కరువులు, వరదలు వస్తాయి.
మొత్తానికి ప్రపంచమంతటా జల చక్రంలో బలమైన మార్పులు కనబడుతున్నాయి అంటారు స్టాక్
డేల్. ఎల్ నీనో కారణంగా వర్షాలలో తేడా వస్తుంది. కనుక వాతావరణం, శీతోష్ణస్థితులలో మార్పులు తప్పవు, అని
కూడా అంటారాయన.
Wednesday, May 13, 2026
బదరీ (చిన్న కథ) : లక్ష్మీనాథ్ బెజ్ బారువా (అస్సాం గ్రామీణ జీవిత దృశ్యము)
బదరీ (చిన్న కథ) : లక్ష్మీనాథ్ బెజ్ బారువా
బదరీ
(చిన్న కథ)
లక్ష్మీనాథ్ బెజ్ బారువా (అస్సాం గ్రామీణ జీవిత
దృశ్యము)
శిశురాం అప్పుడే పొలం నుంచి తిరిగి
వచ్చాడు. తొందరగా స్నానం చేసి అంగవస్త్రాన్ని మార్చుకుని, సరాసరి
వంటింటిలోనికి వెళ్ళాడు. అతని భార్య బదరి మధ్యాహ్న భోజనానికి వంట చేస్తున్నది.
అన్నం ఇంకా వండలేదని, కూర ఇంకా తయారు కాలేదని చూసి శిశురాంకు
కోపం వచ్చింది. ఆకుకూర లింకా తరగనే లేదు, అరిటాకు మధ్య కత్తిపీట చచ్చిపడి
ఉన్న నెమలిలా ఉంది. పక్కనే పడుకున్న చేప, వంటి నిండా బూడిద పూసుకుని,
త్రాగడంతో మత్తెక్కిన సన్యాసిలా ఉంది. మరొక పక్క, పొగ
వల్ల కళ్ళు మూతలు పడిపోయిన బదరి, పొయ్యి రాజేస్తున్నది.
భోజనం ఇంకా తయారు కాలేదని శిశురాం
చిందులు తొక్కుతున్నాడు. ఉదయం నుంచి అతని మనసు చికాకుగానే ఉంది. అనేకానేక కారణాల
వల్ల అతని ఆగ్రహం పెరిగిపోయింది. నిన్నటి రోజున కృష్ణ ఏకాదశి కనుక దోషమని నాగలి
పట్టనే లేదు. నేడు గిత్తలు చాలా చికాకు కలిగించాయి. ఉదయాన్నే పొరుగింటి బహువాతో
సరిహద్దురాళ్ల గురించి పేచీ పెట్టుకున్నాడు. తగాదా ముదిరిపోయేదే, కానీ బహువా
రానున్న ప్రమాదం గమనించి, చల్లగా జారుకున్నాడు. కోపమంతా ఇల్లాలి మీద
తీర్చుకోనడమనేది సామెత కాదు, పూర్తిగా సత్యం. ఇదివరకు ఒకసారి బహువా వల్లనే
బుర్ర వేడెక్కిపోయి, గిత్తలకు వేళ్ళకి మేత వేయలేదని కారణం
మీద, శిశురాం తన భార్యను చితక కొట్టడం ద్వారా తన కోపాన్ని తీర్చుకున్నాడు.
బదరీ భూదేవి వంటిది. భర్త ఆగ్రహావేశాలను
పల్లెత్తు మాట అనకుండా సహించింది. నిజానికి - నిద్ర, ఆకలి
ఎలాంటివో వివాహిత స్త్రీకి దెబ్బలు, ఛీత్కారాలు అటువంటివేనని ఆమె
నమ్మకం. కానీ దేనికైనా ఒక పరిమితి ఉన్నది. సహనానికి మారుపేరైన భూదేవి కూడా
ఒక్కొక్కప్పుడు ఆగ్రహిస్తుంది. భూకంపం సంభవిస్తుంది. పరిస్థితులు భరింపరానివిగా
తయారైనప్పుడు బదరీ కూడా ఎదురు తిరిగితే అసహజమవుతుందా?
బదరీ పొగతో వేగిపోయింది. ఆమె వంక కసిగా
చూసి, ఆవేశంతో
అరిచాడు. 'ఇంత
పొద్దెక్కినా వంట ఎందుకు చేయలేదే? ఫలాని వారి కూతురా’ అతని కళ్ళు, ముఖం కోపంతో జేవురించాయి.
పొగలోంచి తల వెనుకకు తిప్పి బదరీ ఇలా
అన్నది, ‘నా
కాళ్లు చేతులు పొయ్యిలో పెట్టి వంట చేయనా? ఇంట్లో ఒక్క ఎండు పుల్ల అయినా
లేదు. తడిపుల్లలు ఊది ఊది ప్రాణం కడగంటుతోంది. ఏమీ చూడకుండా అలా విరుచుకుపడడం
బాగున్నదా?’ ఆమె
కనురెప్పలు చెమటతో బరువెక్కాయి.
‘ఏమిటి అన్నావు, ముండా?’ అని
శిశురాం కంఠం చించుకున్నాడు. ఆవేశంతో బదరీ వంకకు ఒక అడుగు వేసి, కిందనున్న
కత్తిపీట తీసి దానితో ఆమె వీపున ఒక్క వేటు వేశాడు. మరొక దెబ్బ తీసే లోపల బదరీ ఆర్తనాదం
విని శిశురాం తమ్ముడు కినారాం ఒక్క అంగన వచ్చి, అన్నను పట్టుకొని బయటకు లాగి
వేశాడు. పాపం బదరి నెత్తురు మడుగులో స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఆమెను
ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
మూడవ నాడు బదరికి తెలివి వచ్చింది.
కళ్ళు తెరిచి,
ఎవరి
కోసమో అన్నట్టు గది అంతా కలయ చూచింది. చేరువగా వచ్చిన నర్స్ ను చూచి, బదరీ
నీరసంగా ‘ఏరీ ఆయన?’ అని అడిగింది.
‘ఎవరు కావాలెనమ్మా?’
‘మా బాబు తండ్రి.’
‘ఆ దుష్టుడా? జైల్లో
ఉన్నాడు.’
‘వారిని ఇక్కడికి రప్పించరూ? బదరీ
జాలిగా అడిగింది.
‘ఎలా రాగలడూ, అయినా
ఇప్పుడు అతన్ని గురించి ఆలోచించకూడదు నువ్వు. నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది.’
నర్స్ మాటలు వింటూ ఉండగానే బదరీ కళ్ళు
మూతపడ్డాయి. కొద్ది క్షణాలలో ఆమెకు తెలివి తప్పింది. విషయం తెలుసుకున్న డాక్టరు, శిశురాంను
తీసుకురాకపోతే రోగి పరిస్థితి విషమించవచ్చునని గ్రహించాడు. తిరిగి తెలివి
వచ్చేసరికి బదరి తన భర్తను చూడడానికి వీలుగా శిశురాంను రప్పించే ఏర్పాటు చేశాడు.
మరునాటి ఉదయం బదరికి స్పృహ వచ్చేసరికి, శిశురాం
ఆమె తల నిమురుతూ పక్కన కూర్చున్నాడు. భర్తను చూసేసరికి ఆమెకి ఏదో బరువు తీసినట్టు
అయింది- మెల్లగా నవ్వి, ‘ఎలా ఉన్నారు? భోజనం సరిగా చేస్తున్నారా?’ అంది. ‘వంట చేసుకోవడం మీకు కష్టమే. ఇంకెంత, మరో
రెండు రోజులలో నాకు నయం అవుతుంది. నన్ను ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేయండి. మీకు
ఇబ్బంది ఉండదు” అంది. శిశురాం కళ్ళనుండి అశ్రువులు రెండు
ధారలు కట్టాయి.
డాక్టర్ను చూసి బదరీ ఇలా అంది, ‘బాబూ, ఆయన
ఏ పాపం ఎరుగరు. వట్టి అమాయకులు. ఆయన్ను ఏమీ చేయకండి. నేనే కత్తిపీట మీద పడి గాయం
చేసుకున్నాను’, అని వెక్కివెక్కి ఏడ్చింది. అంతా
నిస్తబ్ధులయ్యారు. శిశురామ్ తన దుఃఖాన్ని అణుచుకోలేక పోయాడు. పసివానిలా ఏడ్చాడు.
‘అది నిజం కాదు బాబూ, నేనే
కత్తిపీటతో ఆమెను కొట్టాను. నాకు శిక్ష విధించండి. నేను పాపిష్టి వాడిని బాబూ, కట్టుకున్న
భార్యని కత్తితో పొడిచిన దుష్టుడిని’, అని
తొందర తొందరగా,
జాలిగా
అన్నాడు శిశురాం.
కొద్ది వారాలలో బదరీ గాయం నయమయింది.
ఆమెను ఆసుపత్రి నుంచి పంపించి వేశారు. శిశురాం ఏ పాపం ఎరగడని బదరీ శతవిధాలు
చెప్పడానికి ప్రయత్నించినా, నేరం రుజువై, అతనికి
మూడు నెలల కఠిన శిక్ష విధించారు. శిశురాం తన పాపానికి ప్రాయశ్చిత్తం
అనుభవించేందుకు నవ్వుతూ వెళ్ళాడు జైలుకి.
భర్త జీవితంలో వచ్చిన ఈ మచ్చకు తనే
కారకురాలని నిందించుకున్నది బదరీ. తన్ను తాను నిందించుకున్నట్టుగా మరెవ్వరూ ఆమెను
నిందించలేకపోయారు.
బదరి అన్న ఈ కథ నిజంగా పాతకాలంనాటిది.
రచయిత లక్ష్మీ నాథ్ బెజ్ బారువా ఈ శతాబ్ది మొదటి మూడు దశకాల్లో గొప్ప పేరు
సంపాదించుకున్న అస్సామీ రచయిత. కథలో ఆ కాలపు పల్లె స్త్రీల మానసిక పరిస్థితి
కనబడుతుంది. మొగుడు ఎంత ఘాతుకం చేసిన ఆడవాళ్లు భరించాల్సిందే, అన్న
పద్ధతి ఈ కథలో కనపడుతుంది. నిజానికి ఇప్పటికి కూడా దేశంలోని పల్లెల్లో పరిస్థితి
ఇంచుమించు అట్లాగే ఉందేమో.
