Lokabhiramam
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Tuesday, June 23, 2026
Monday, June 22, 2026
లోకాభిరామం : తరం - ఉత్తరం : యాది సదాశివ సారు
లోకాభిరామం : తరం - ఉత్తరం - ఉత్తరం
రంగువేసిన
కవితా?
‘ప్రపంచంలోని కవితలన్నీ కృష్ణశాస్త్రికి
వచ్చు, అయినా చూడలేను ఆయన రంగు వేసిన బొచ్చు!’
అవును, ఈ కవిత అచ్చంగా దేవులపల్లి
కృష్ణశాస్త్రిగారి గురించి రాసిందే. అయితే ఆ రాసిన మనిషి సాహితీవేత్త మాత్రం కాదు.
నిజానికి తెలుగు చదవనూ, రాయనూ రాని మనిషి. కృష్ణశాస్త్రిగారి తల
ముగ్గుబుట్టలాగ పండిపోయింది. ఆయన దానికి రంగు వేసేవారు. అయితే బద్ధకించి మధ్యలో
తెలుపు కనిపిస్తున్నా అలాగే వదిలేసేవారు. రామాయణంలో కాకపక్షం అని వర్ణించినట్టు
రెండు వేపులా పెరిగిన జుట్టు, నడిమి పాపిట్లో నుంచి మాత్రం కొంతదూరం
తెల్లని తెలుపు. అది చూడలేక ఆలిండియా రేడియోలోనే పనిచేస్తున్న వేణు విద్వాంసులు, తరువాత
నాకు ప్రాణమిత్రులయిన ఎన్ ఎస్ శ్రీనివాసన్ ఈ కవిత చెప్పారు. ఆగ్డెన్ నాష్ లిమరిక్కుల
ప్రభావంతో, సరదాగా చెప్పిన కవిత అది.
కృష్ణశాస్త్రికి మాత్రం తాను ప్రపంచ కవితలను కాపీగొట్టి తెలుగులో రాస్తున్నాడని
ఎత్తిపొడిచిన భావం కలిగిందట ఈ కవిత విని. కాటూరి వెంకటేశ్వరరావు గారితో ఆ మాట
అన్నారట కూడా. తెలుగే తెలియని కుర్రవాడు సరదాగా మాత్రమే చెప్పాడు, అని
సర్ది చెపితే కోపం తగ్గించుకున్నాడట ఆయన.
రూమీ-సదాశివ:
నేను ఈ కాలమ్లోనే పారసీక కవి, తాత్వికుడు రూమీ గురించి రాశిన. నా
మూర్ఖత్వాన్ని బయట పెడుతూ, రూమీకి తెలుగు అనువాదాలు వచ్చినయా అని
ఏదో రాసినట్టున్న. మిత్రులు, పెద్దలు స్వర్గీయ సామల సదాశివ, కుమారులు
శ్రీవర్ధన్, రాజవర్ధన్ ఇద్దరు అదే రోజు ఫోన్లో
ఆదిలాబాద్నుంచి నాతో మాట్లాడినరు. సదాశివగారు రూమీ మస్నవీని తెలుగు చేసినరని
చెప్పినరు. ఈ సంగతి నాకు సూచనగా తెలుసు. ఎందుకు మరిచిననో తెలియదు. సదాశివ సారు, రూమీ
మస్నవీని పద్యాలలోకి రాసినరు. ఆ పద్యాలు ఆణిముత్యాలు. రాజవర్ధన్ ఈమధ్యన ఆ పద్యాల
పుస్తకం ఫోటో కాపీ చేయించి నాకు పంపించినడు. దానితోబాటు సారు గురించి వేసిన జయంతి
ప్రత్యేక సంచిక, సదాశివ స్మృతి అనే పుస్తకాలు కూడ పంపినడు.
రాజవర్ధన్కు నేను ధన్యవాదాలు చెపితే రుణం తీరదు. వాండ్ల నాయన గారికి నామీద ఉండిన అభిమానం తనకు
తెలుసు!
చిత్రం:
రాజవర్ధన్ తన పరిశోధనలో మధురాంతకం రాజారాంగారి కథల గురించి కృషి చేసినడు.
నాయనగారి సలహా మేరకు, రాజారాం గారి వద్దకు స్వయంగ పోయి, చర్చించి, వాళ్లింట్లో
ఒకడయిపోయి, అప్పుడు సిద్ధాంత వ్యాసం రాసినడు. కానీ, ఒక
సంగతి రాజవర్ధన్కు తెలిసి ఉండక పోవచ్చునని నా అనుమానం. సదాశివ సారుకు
చాలామంది తోటి ఉత్తరాల ద్వారా మైత్రి సాగేది. వారిలో కొందరిని ఆయన కలవనే లేదు. అందులో
మధురాంతకం రాజారాం గారు, వాకాటి పాండురంగారావుగారు కూడ ఉన్నరు.
హైదరాబాద్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, వివేక్నగర్లో
ఒక కథకుల సమ్మేళనం జరిగింది. అప్పుడప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
అందుకున్న రాజారాం గారు అక్కడికి వచ్చినరు. ఇంకా ఎంతోమంది కూడా వచ్చినరు.
కార్యక్రమం బాగ జరిగింది. అసలింతకు ఆ ప్రసక్తి ఎందుకో చెప్పాలెగద. కార్యక్రమం ఇంకా
మొదలు గాలేదు. నేను అందరినీ పలుకరించుకుంటు తిరుగుతున్న. సదాశివ సారువచ్చి వెనుక
వరసలో కూచున్నరు. నేను ఆదిలాబాదులో ఉద్యోగం చేసినందుకు మిగతా ఏమి ఒరిగిందో తెలియదు
గాని, రెండు ఉపకారాలు జరిగినయి. మొదటిది, నాకు
నౌకరీ మీద సంపూర్ణమయిన ఏవగింపు కలిగింది. రెండవది నాకు సదాశివగారి పరిచయము, మైత్రి
ప్రాప్తించినయి. ఆ బలంతో నేను పరుగున పోయి, ‘ఇక్కడుంటే ఎట్ల? మీరు
ముందరికి రావాలె’ అన్నట్లున్న. ‘నన్నెవరు గుర్తుపట్టరు గద. ముందరికొచ్చి ఏంజేస్త?’ అని
అడిగినరాయన.
‘అట్లగాదు, రాండి’
అని చెయ్యి పట్టుకుని తీసుకుపోయి వాకాటికి, రాజారాంగారికి, ఆయన
పేరు చెప్పిన అంతే. వారికి పరిచయం చేసిన, అని గనుక నేను అంటే, అంతకంటే
పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండదు. వాండ్ల ముఖాలలో కనిపించిన ఆనందం నేను మరువలేను.
అందరము, కిందకు వచ్చి, ముందున్న
లాన్లో కూచుని ముచ్చట్లు పెట్టినము. ఆ కాలంలో ఈ సెల్ఫోన్లు లేవు, వాటిలోగానీ, నేరుగా
గానీ, మా దగ్గర కెమెరాలు లేవు. ఫోటోగ్రాఫరు
వచ్చేలోపల రాజారాం గారికి పిలుపు వచ్చి హాలులోకి వెళ్లినరు. మేమంత ఫోటో
తీయించుకున్నము. చిత్రం గదా!
తెలుగు
పత్రికల్లో హిందూస్తానీ సంగీతం: వాకాటికి, సదాశివగారి పట్ల గొప్ప గౌరవం. అందులో
విచిత్రం లేదు. కానీ, ఆయన ఒక పత్రిక సంపాదకుడు. తలుచుకుంటే
తలుచుకున్న సంగతి గురించి, తలుచుకున్న వారి చేత రాయించి
ప్రచురించగలరు. అదే జరిగింది. హిందూస్తానీ సంగీతం గురించి, తెలుగు
పాఠకులు చదువుతరా? అని అనుమానం మొదట్లో వచ్చిందేమో? కానీ
సదాశివసారు రాసిన సంగతులను అందరూ తలకెత్తుకున్నరు. ఆయనను, సంగీతం
గురించి రాయమని ఒత్తిడి చేసిన వాండ్లలో నేను మొదటి వాణ్ని అని నేను చెప్పుకోవలసి
రావడం, నా దురదృష్టం. ఆదిలాబాద్లో ఉన్నప్పుడు
మేము సంగీతం గురించి, సాహిత్యం గురించి ఎన్ని గంటలు
మాట్లాడుకున్నమో, రాజవర్ధన్ వంటి వారికి గుర్తుండే
ఉంటుంది. ‘సాయంత్రం రాండి, ఒక కొత్త చీజ్ వినిపిస్త’ అని చిన్న
చీటీ వచ్చేది నాకు. నేను రెక్కలు కట్టుకుని వాలేవాణ్ని. ఇక్కడి ఈ చీజ్ ఇంగ్లీషులో
తినేది కాదు. ఉరుదూలో వినేది. సదాశివగారికి హిందుస్తానీ మీద గురి ఎక్కువ. నాకు
కర్నాటకంతో ఉన్న పరిచయం హిందుస్తానీతో లేదు. ఇప్పటికీ లేదు. కానీ వినడం మాత్రం
హిందూస్తానీయే సుఖంగా జరుగుతుంది. ఈ సంగతి గురించి ఎంతో చర్చ జరిగింది. అక్కడ
వచ్చిన సంగతులు, ఆయన లోనే మిగలకూడదు. అందరూ వినాలని నా
వాదం. చివరికది గెలిచింది.
నేనున్నాను:
సదాశివ సారు తమ పుస్తకాల్లో నా పేరు కూడ ఒకటి రెండు చోట్ల రాసినరు. అది నాకు
గొప్ప. అంతకంటే గొప్ప ఇంకొకటి ఉన్నది. చెప్పాల్నో, చెప్పగూడదో
తెలియదు. సదాశివ సారు, నేను ఉత్తరాలు చాలానే రాసుకున్నము. కానీ
ఆయనకు రాను రాను రాత వీలుగాకుండ అయింది. ఫోన్ చేస్తే కూడ ఎక్కువసేపు
మాట్లాడలేకపోవడం గమనించిన.
పేపర్లో
‘సదాశివకు అవార్డు’ అన్న వార్త చూచిన. పెద్దాయనను ఇంత పొద్దున్నె చికాకు
పెట్టేదేమి అని వెంటనే ఫోన్ చేయలేదు. అంతలో ఫోన్ మోగింది. ‘ఇంత అన్యాయముంటదా? ముబారక్
చెప్పరా!’ ఇవి ఆయన అక్షరాలా అన్న మాటలు. ఏవో మాటలు నడిచినయి. అయినా మీరు లేకుంటే, ఆ
పుస్తకాలు ఎక్కడినుంచి వస్తుండే, గానీ’ అన్నారాయన. నా కళ్లలో నీళ్లు
సుడులు తిరిగినయి. ఇంతటి మంచితనమా? నా గొంతు వణికింది. ‘ఇంక టిఫిన్ దింట.
పెట్టేస్తున్న’ అన్నది ఆయన నోట నేను విన్న చివరి మాట. ఆదిలాబాదుకు పొయ్యి సారును
చూడాలెనని మనసు పీకుతునే ఉన్నది. ఇద్దరు దోస్తులతోటి ఈ సంగతి మీద మాటలు కూడ
నడిచినయి. మనువడు కార్తీక్ పెండ్లికి, సారు, హైదరాబాద్
వస్తరనుకుంటే రాలేక పోయిరి. ‘నేను రాకుంటెనేమి. మీరు పెండ్లికి పోవాలె’ అని
ఫోన్లోనే చెప్పినరు. పెండ్లికి పోయినప్పుడు రాజ వర్ధన్తో ‘ఆదిలాబాద్కు వస్తము’
అని కూడ చెప్పినట్లున్న.
నేను
ఉద్యోగం ఏనాడో వదిలిన. సారు లోకాన్ని వదిలినరు. ఆదిలాబాద్లో ‘యాది’ మిగిలింది.
ఆదిలాబాద్ యాదిలో మిగిలింది. సారు కొడుకులు తేనెతుట్టె రేపినరు. ఆలోచనలు
ముసురుకుంటున్నయి.
ఉత్తరం:
యాది సదాశివసారు ఉత్తరం రాస్తే, అదొక వ్యాసం. అందులో ఒకటి రెండు తప్ప
వ్యక్తిగతం మాటలుండవు. ఆయన ప్రభావం మనసులో ఉందనుకుంట. ఆశారాజు కవితా సంకలనం ‘పాగల్
షాయర్’ వచ్చిన తరువాత నేనొక ఉత్తరం రాసి బ్లాగులో పెట్టిన (2010లో). మీరూ చదవవచ్చు దాన్ని. ‘రాజూ! కలంతోని గాక, మనసుతో, మాటలను
మాలగట్టిన వాండ్లంత పాగల్ గాక మరేమవుతరు? నీ ఒక్క పహిల్వాన్ పోయెం జాలు. ఓ
గ్యానపీఠం ఇయ్యవచ్చు దానికి. ‘ఇప్పుడు శత్రువుక్కూడా మిత్రుడిని.’ ఎంత మాటన్నవు
అన్నా! నిన్ను భుజంమీద ఎక్కించుకుని గల్లీ గల్లీ జులూస్ చేయాలనిపించింది.
రాజూగైడ్, ఒగరు, పాగల్
షాయర్లలో నీ ఎక్స్ప్రెషన్ ఒక ఉన్నత శిఖరానికి చేరింది. కిందికి దిగకు.’ అంటూ
సాగుతుంది ఆ ఉత్తరం. నిజానికి నేను రాసిన ఉత్తరం పోస్టు చేయలేదు. ఆ సంగతి నాకు
తరువాత తెలిసింది. కానీ ఆశారాజు నా ఉత్తరాన్ని చదివినడు. ఇప్పటికీ
కనిపించినప్పుడంత ఇద్దరమూ మాటలు పంచుకుంటము. అభిమానాన్ని అంతకంటే ఎక్కువగ
పంచుకుంటము.
Thursday, June 18, 2026
ఆనందం : నా కవిత Anandam - My poem in Telugu
ఆనందం : నా కవిత
Anandam - My poem in Telugu
ఆనందం
ఎంత కాలంగానో
ఒంటరితనం అలవాటయింది.
అందులో కూడా ఆనందం
పరుచుకున్న తీరును వెతకడం,
అందు గురించి
ఆలోచించడం అలవాటయింది.
ఆనందం అమాంతంగా రాదు.
అది ఎవరో తెచ్చి
ఇచ్చే వీలు లేదు.
చూస్తుండగా ఒక మొక్క
పెరిగినట్టు
అది కంటికి కనబడకుండా
జరుగుతుంది.
మొక్క పెరగడం ఎవరికీ
కనిపించదు
అయినా అందులోపల ఒక
వరుస కణాలు
కొత్తగా
తయారవుతుంటాయి
వేళ్ళు భూమిలోకి
చొచ్చుకుని పోవడం
ఆ అంధకారంలోనే
జరుగుతుంది
బిగ్ బ్యాంగ్ అనే
పేలుడును
ఎవరూ వినలేదు కదా
వేరు జరుపుతున్న
ప్రళయాన్ని కూడా
ఎవరూ వినజాలరు.
అంతా లోలోపలే
జరుగుతుంది
అంతు పట్టకుండా
జరుగుతుంది
మొక్క మాత్రం
నానాటికి పెరుగుతుంది
ఆకులు, పువ్వులు ఆగకుండా వచ్చేస్తాయి
అందంగా మెరుస్తాయి
గంటలు గంటలు
ప్రశాంతంగా కూర్చుని ఉంటే
ఆనందం కూడా
అందులోనించే ముందుకు వస్తుంది
ఒంటరితనంలో నుంచి
వేడి లేని మంటల లాగా
వెలుగుతూ ఆనందం
వస్తుంది
గురగురలాడుతున్న
రిఫ్రిజిరేటర్
గరగర లాడుతున్న గరుకు
నేల
ఆ ఒంటరి ఇంట్లో
కంటికి కనబడకుండా
ఏదో చేస్తుంటాయి
గాలికి పరదాలు
కదులుతుంటాయి
గదిలో వస్తువులు
ఎగురుతుంటాయి
అలమరలో పుస్తకాలు, గూగుల్ హోమ్ లో పాటలు
బల్లమీద చిందరవందరగా
వస్తువులు
రంగు వెలసిన గోడలు
ఇవి చాలాబాగా మనకు
తోడుగా ఉండడానికి
వాటి మధ్యన కూచుని నా
పని నేను చేస్తూనే ఉన్నానుగా
పెరిగే మొక్కలాగా
లోని సంగీతాన్ని
పంచుకుంటూనే
ఉన్నానుగా
ప్రశాంతంగా ఉండడం
కంటే కావలసిన ఆనందం వేరే ఏముంది
కదలకుండా అక్కడే పడి
ఉన్న సోఫా పాతదయింది నిజమే
మూలన కూర్చున్న
చీపురు కూడా చిన్నదయింది
కానీ పట్టుదలగా
నాకోసమేనేమో అన్నట్టు
అవి అక్కడే ఉన్నాయి
ఎంతకాలమయింది
గమనించనే లేదు
గాలి మాత్రం
కదులుతూనే ఉంది
గదిలో కాక మదిలో కూడా
కదలికలు సాగుతూనే ఉన్నాయి
కలలు పరుచుకుంటూనే
ఉన్నాయి
ఆకులు పువ్వులు
మెరుస్తూనే ఉన్నాయి
కనీసం గుర్తుకు
వచ్చినప్పుడు వాటికి నీళ్లు పోయాలి
అవి తలెత్తి
పలకరించిన భావం కలుగుతుంది
అంతకన్నా ఆనందం మరి
ఏం కావాలి
నా ఆలోచనలను మరెవరు
విన గలుగుతారు
నా ఆనందాన్ని మరెవరు
అనుభవించ గలుగుతారు
లోనికి మరలి
బతుకుతున్న నేను మరెవరికి అర్థమవుతాను
గాలి చాలదా
పలకరించడానికి
కిటికీలోంచి కనిపించే
పాత దృశ్యాలలోనే
కొత్తదనాన్ని
వెతుక్కోవాలి
ఆనందం వెతికితే
దొరకదు
నీ తీరును బట్టి అదే
వద్దన్నా వస్తుంది
Monday, June 15, 2026
పడుచుదనం Japanese Folk tale Retold in Telugu
పడుచుదనం
అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కొండల మధ్యన ఒక
కట్టెలు కొట్టే మనిషి తన భార్యతోపాటు ఉండేవాడు. వాళ్లు నిజానికి చాలా ముసలివాళ్లు.
కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళతాడు. కట్టెలు
కొట్టి తెస్తాడు. పెళ్లాం ఇంటిపట్టునే ఉంటుంది. నేతపని చేస్తుంది.
ఒకరోజున ముసలతను అడవిలో అలవాటు కన్నా
ఎక్కువలోతుకు వెళ్లాడు. ఒక ప్రత్యేకమయిన కర్ర కోసం చూస్తూ అతను అలా వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా
అనుకోకుండా ఒక చక్కని నీటిబుగ్గ కనిపించింది. దాన్ని అతను అంతకుముందెన్నడూ చూచి
ఎరుగడు. బుగ్గలోనుండి చిమ్ముకువస్తున్న నీరు చిత్రంగా చాలా బాగుంది. చల్లగా కూడా ఉంది. అప్పటికే అతనికి బాగా దప్పిగా
ఉంది. ఆనాడు ఎండ బాగా కాస్తున్నది. అతను కష్టించి పనిచేశాడు.
కనుక వెంటనే ముసలాయన తన గడ్డిటోపీ పక్కన పెట్టాడు. మోకాళ్లమీద కూచుని ముందుకు
వంగాడు. కావలసినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు చాలా బాగనిపించాయి. అవి మామూలుగా లేవు,
అనిపించాయి. నీటిలో ముసలతనికి తన ముఖం కనిపించింది. అతను
ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. అది నిజంగా తన ముఖమే. కానీ పాత అద్దంలో ఇంటిదగ్గర
ప్రతినిత్యం కనిపించే ముఖం మాత్రం కాదు. అందులో ఒక అందమయిన యువకుడు
కనిపిస్తున్నాడు. ముసలాయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
అతను రెండు చేతులను ఎత్తి తలమీద
పెట్టుకున్నాడు. ఒక క్షణం కిందవరకు అది బట్టతల. దానిమీద వెంట్రుకలు లేనేలేవు.
ఇప్పుడు మాత్రం నల్లని, చిక్కని జుట్టు చేతికి తగిలింది. ముఖం కూడా
చిన్నపిల్లవాని ముఖంవలె నునుపుగా తాకింది. ముదుసలి ముడతలన్నీ మాయమయ్యాయి.
అదే సమయంలో అతనికి ఒంట్లో గొప్ప శక్తికూడా
వచ్చినట్టు తోచింది. ఆశ్చర్యంగా తన కాళ్లు, చేతులవేపు అతను చూచుకున్నాడు. అంతకుముందు వరకు అవి ముసలితనానికి గుర్తులుగా
ఉండేవి. ఇప్పుడు మాత్రం నిండుగా కండరాలు తేలి కనబడుతున్నాయి. అనుకోకుండానే అతను
పడుచుదనం బుగ్గ నుండి నీరు తాగాడు. పడుచువాడు అయ్యాడు. నీళ్లు అతనిని
మార్చివేశాయి.
విషయం అర్థం అయింది. వెంటనే అతను సంతోషంతో ఒక
కేక వేశాడు. గాలిలోకి ఎగిరాడు కూడా. వీలయినంత వేగంగా అంతకుముందు ఎన్నడూ లేనంత
వేగంగా ముసలతను ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లోకి కాలుపెడితే ఎదురయిన పెళ్లాం భయంతో
వెనుకకు తగ్గింది. ఎవరో కొత్త మనిషి వచ్చాడని ఆమె జడుసుకున్నది. కానీ జరిగిన
ఆశ్చర్యాన్ని అతను వివరించాడు. ఆమె నిజానికి నమ్మలేకపోయింది.
కొంతసేపటికిగానీ అతను భార్యను తాను తానే అని
నమ్మించలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన మొగుడేనని ఆమె నమ్మిన తరువాత పడుచుదనం
నీటిబుగ్గ గురించి కూడా అతను చెప్పాడు. ఆమెను వెళ్లి ఆ నీరు తాగమన్నాడు.
‘‘నీవు పడుచువాడివి అయ్యావు. అందగానివి అయ్యావు.
ఇక మరి నా వంటి ముసలి మనిషిని ప్రేమించలేవు. కనుక నేను కూడా ఆ నీటిని వెంటనే తాగక
తప్పదు. అయితే ఇల్లు వదిలి ఇద్దరం ఒకేసారి వెళ్లడం అంత మంచిది కాదు. నేను
వెళ్లివస్తాను. నీవు ఇక్కడే ఉండు’’ అన్నది ముసలామె. ఆమె పరుగు పెడుతూ అడవిలోకి
వెళ్లిపోయింది.
ముసలమ్మకు నీటిబుగ్గ కనిపించింది. ఆమె కూడా
దాని పక్కన మోకరిల్లి నీళ్లు తాగసాగింది. ఆహా!, నీళ్లు ఎంత చల్లగా, ఎంత కమ్మగా ఉన్నాయి! ఆమె అదే పనిగా తాగసాగింది.
మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకున్నది. మళ్లీ నీళ్లు తాగ సాగింది.
ఇక ఇంట్లో అటు ఆమె భర్త ఓపిక లేకుండా ఎదురు
చూస్తున్నాడు. అందంగా పడుచు పిల్లగా మారి తన పెళ్లాం తిరిగి రావాలని చూస్తున్నాడు.
ఎంతసేపయినా ఆమె రానేలేదు. అతనికి ఆత్రం పెరిగింది. ఇంటి తలుపు మూశాడు. పెళ్లాన్ని
వెతుకుతూ బయలుదేరాడు. పడుచుదనం నీటిబుగ్గ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఆడమనిషి జాడ
కనిపించలేదు. ఇక నిరాశగా అతను వెనుతిరిగాడు. అప్పుడే అతనికి గడ్డిలోనుండి సన్నని
గొంతుక ఏడుస్తున్నట్టు వినిపించింది. అతను వెళ్లి వెతికాడు. అక్కడ తన భార్య
దుస్తులయితే ఉన్నాయి గానీ, వాటిలో ఒక చిన్నపాప
ఉంది. ఆ పాప నిజంగా చిన్నది. బహుశా ఆరు మాసాల వయసు ఉంటుందేమో!
ముసలమ్మ పడుచుదనం నీటిని మరీ ఎక్కువగా తాగింది.
యవ్వనం కంటే ఎక్కువగా వయసు తగ్గేటట్టు తాగేసింది. కనుకనే మాటలు రాని పసిపాపగా
మారిపోయింది.
చేసేది లేక పడుచు మనిషి తన పెళ్లాం పాపను
చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతనివేపు ఆశ్చర్యంగానూ, దు:ఖంగానూ చూచింది. ఏదో గొణుగుతూ అతను పాపను ఇంటికి తీసుకువచ్చాడు. హాయిగా
పెంచుకున్నాడు.
Sunday, June 14, 2026
లోకాభిరామం - బ్యాడల పుళి (On languages and me)
లోకాభిరామం - బ్యాడల పుళి
బ్యాడల పుళి
నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్నగర్
వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు
చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు
అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె.
అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి
తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే
చోట్ల కన్నడంలో హకారం వస్తుంది. హాలు అంటే
పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి
అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా
వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు
తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో
పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె.
పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి
చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది.
శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది.
బొమ్మల్లో, విగ్రహాల్లో
మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము.
ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం
కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు
బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ
అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి
అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి
పక్కనా? కుడి
అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ,
కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు
కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను.
పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది.
ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది.
ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం
నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో
పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా,
పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’
పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న
మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని
పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు.
సంప్రదాయమంటే, అదేమిటి
అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్రైస్లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా
మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి
లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు
లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ
మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె)
కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా
అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది
అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా
అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్
హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ
సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్లో ఉరుదూ ప్రభావం బాగ
ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమి’ అన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు)
అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో
తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ!
ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము
మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో,
ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి
ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు
అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ
ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ
స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు
కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము
అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన
గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా
సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల
పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా
మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు
అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది.
మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో
కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల
శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ
ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ
రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని
అనుకుంటున్న. జెనెటిక్స్లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో
పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను
కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్కు నా మీద కావలసినంత
అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో
ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే
వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో
మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు
కన్నడములో, లేదా
తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి?
అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు
తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు
చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము
మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు. అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న
సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి
తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ
ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము
మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ,
మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ
భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ
చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష
మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి
విన్నవించుకుంట.
Friday, June 12, 2026
ఆరుద్ర శుద్ధ మధ్యాక్కరలు Arudra's Poem
Thursday, June 11, 2026
తెలివి ఎవరి సొమ్ము On knowledge and Gender
తెలివి ఎవరి సొమ్ము?
తెలివి ఎవరి సొమ్ము?
నవల్సు రాయడంలోనూ, నాట్యమాడడంలోనూ
కావలసినంత మంది అమ్మాయిలున్నారు గానీ, సైంటిస్టులుగా
మాత్రం లేడీసు ఎక్కువగా లేకపోవడానికి కారణం ఏమిటని చాలా కాలంగా ప్రశ్న ఉండనే
ఉన్నది. ఈ పద్ధతి ఇవాళ కొత్త గాదు. లేచింది మహిళా లోకం! అన్న పాట పుట్టక
ముందునుంచీ ఇలాగే ఉంది. పురుషాహంకారం అంతగా లేదనుకుంటున్న సమాజాలలోనూ ఇలాగే ఉంది.
ఉండగా, ఉండగా 2005
జనవరిలోని ఒకానొక శుభోదయాన లారెన్స్ సమ్మర్స్ అనే ఒకానొక పరిశోధకుడు పేరుకు
తగినట్టుగానే వాతావరణం ఎంచుకుని, ఎండలాగే మండించే
సిద్ధాంతాన్ని ఒకదాన్ని ప్రపంచం ముందు పెట్టాడు. అతనేదో లాకాయి లూకాయి అయితే ఎవరూ
పట్టించుకునే వారు గాదేమో. తెలివికి రాజధాని లాంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం
అధిపతి అతను.
ఆడా మగా మెదడుల్లోపల, అంతరాంతరాల్లో
ఉన్న అంతరం – అదే తేడా, కారణంగానే
అమ్మాయిలు అంతగా సైన్సులోకి రావడం లేదని సమ్మర్స్ గారి నమ్మకం. ఆడవాళ్లకు తెలివి
కొంచెం తక్కువ అన్న వాదం ఒకప్పుడు మొదలయి, రకరకాల కారణాలుగా మరుగున పడిపోయింది. సమ్మర్స్ గారి
పుణ్యమా అని అదిప్పుడు మళ్లీ రగులుకుంది. ఆడా మగా మెదడు నిర్మాణంలో తేడాలున్నాయని
ఎప్పటినుంచో తెలుసు. పనితీరులో కూడా తేడా ఉందని ఆ మధ్యన అన్నారు. కానీ ఆ కారణంగానే, వారికి సైన్సు, లెక్కలు, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగు
లాంటి విషయాలు తలకు ఎక్కడంలేదని మాత్రం ఎవరూ తేల్చి చెప్పలేక పోయారు.
తేడాలున్నమాట మాత్రం నిజమేనంటున్నారు అందరూ. ఆ తేడాల వల్ల తెలివి మీద ప్రభావం
లేదు, కానీ చిత్రంగా
ఒక ఆలోచన బయట పడింది. రకరకాల చికిత్సల విషయంలో అందరికీ ఒకే మందు కాకుండా, తేడాను బట్టి ఆడ మందులు, మగ మందులు వాడితే బాగుంటుందని పరిశోధకులు అంటున్నారు. మానసిక రుగ్మతలయిన
డిప్రెషన్, అడిక్షన్, షిజోఫ్రీనియా, స్ట్రెస్ సంబంధ
సమస్యల్లో ఈ పద్ధతి మరింత బాగా పని చేసే వీలుందంటున్నారు. ఇక మీద మెదడు, మందుల గురించి వరిశోధన చేసే వారంతా, ఆడా మగ తేడాలను కూడా తమతమ పరిశోధనలకు జత చేసి చూస్తే, మంచి ఫలితాలుంటాయని అంటున్నారు.
మెదడు నిర్మాణం, పనితీరుల్లో
తేడా ఉందని తెలుసు. ఆ తేడా ప్రభావం లైంగిక విషయాల మీదే ఉంటుందని అనుకున్నారు.
చివరకు చుంచులలో కూడా, హైపొతలామస్ అనే
భాగం, ఆడా మగా తేడాను
బట్టి వేరువేరు ప్రవర్తనలకు కారణమవుతుందని గమనించారు.
హైపొతలామస్ సెక్స్ హార్మోన్ల విడుదలకు కేంద్రం. అందుకే న్యూరో సైంటిస్టులంతా, తేడా సెక్స్ వరకే పరిమితం అన్న అభిప్రాయానికి
చేరుకున్నారు. ఈ భావాలకు ఈ మధ్య గట్టి కుదుపులు తగులుతున్నాయి. లింగభేదం ప్రభావం
కేవలం లైంగికత మీద మాత్రమే గాక, జ్ఞాపక శక్తి, భావాలు, దృష్టి, వినికిడి, ఒత్తిడిని
తట్టుకునే తీరు మొదలయిన వాటి మీద కూడా ఉంటుందని పరిశీలకులు సూచించారు. మెదడులోకి
తొంగి చూడడానికి పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లాంటి పద్ధతులు రావడంతో, గత అయిదు పదేళ్లలో ఈ రకం పరిశోధనలు ఎక్కువయ్యాయి.
ఫలితాలు ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. నిక్షేపంగా బతికి ఆలోచిస్తున్న వారి మెదళ్ల
మీదకూడా పరీక్షలు చేయగల అవకాశం ఉండడం గమనించదగిన సంగతి.
మెదడు నిర్మాణంలో, స్త్రీ పురుషుల
మధ్య తేడాలు చాలా భాగాల్లో ఉన్నట్లు గమనించారు. పై స్థాయికి కేంద్రమయిన ఫ్రాంటల్
కార్టెక్స్ ఇందులో ఒకటి. నుదురు ఎంత విశాలంగా ఉంటే తెలివి అంత ఎక్కువగా ఉంటుందని, అనుభవం మీద మనవాళ్లు చెప్పడం తెలిసిందే. నుదురులో ఉండే
ఈ ఫ్రాంటల్ కార్టెక్స్ తెలివికి కేంద్రం అన్నమాట పరిశోధకులు అంగీకరించిందే. అయితే
పోల్చి చూస్తే ఈ భాగం మగవారికన్నా ఆడవారిలో ఎక్కువగా ఉంటుందని మాత్రం ఈ మధ్యన
అర్థమయింది. భావాలను అదుపు చేసే లింబిక్ కార్టెక్స్ కూడా స్త్రీలలోనే ఎక్కువగా
ఉందంటున్నారు.
తేడాలో పెద్దది, చిన్నది అంటే, దేనికంటే అన్న ప్రశ్న పుడుతుంది. మొత్తం మెదడుతో
పోలిస్తే, అందులో ఒక భాగం
ఎంత ఉందన్న నిష్పత్తి ప్రకారం ఈ కొలతలను తీస్తారు.
భాషను అర్థం చేసుకోవడం, మొత్తం మీద
అవగాహన లాంటి లక్షణాలకు కేంద్రమయిన భాగాలలో, చివరకు కణాల
స్థాయిలో కూడా తేడా ఉందని తెలిసింది. కడుపులో శిశువు ఆడా మగా తేడా, ఊపిరికన్నా ముందే మొదలవుతుందని పరిశోధనలు
సూచిస్తున్నాయి.
సమ్మర్స్ గారి వాదం సంగతి తర్వాత తేలుతుంది గానీ, మొత్తానికి మెదడు స్థాయిలో ఆడా మగా మధ్య తేడా ఉందని
తేలిపోయింది. అన్నట్లు రాజకీయాలలో రాణించే రాణులు తక్కువ. ఉన్నవాళ్లలో చాలా మంది
ఇల్లుగలాయన తరఫున వచ్చినవారు. ఈ సంగతి ఆలోచించాలి!





