Monday, March 30, 2026

లోకాభిరామం - ఓటి రొండు ఒనరంగ మూడు (On numerals and alphabet)


లోకాభిరామం

ఓటి రొండు ఒనరంగ మూడు


ఒంట్లు - ఓనుమాలు

అసలు ఓనమాలు అంటే ఏమో ఇప్పుడు ఎవరికయిన గుర్తున్నదా? ఒకప్పుడు తెలుగు అక్షరాలు నేర్పించాలంటే, ముందు వాటిని పలకడం నేర్పి తరువాతనే రాత మొదలు పెట్టేవారు. అక్షరమాల పాఠం, ఓం నమశ్శివాయ, సిద్ధం నమ: అన్న ప్రార్థనతో మొదలవుతుంది. కనుక అక్షరాలు నేర్వడమంటే ఓనమాలతోనే మొదలవుతుంది. చదువురాని వారిని పల్లె మనుషులు ‘ఓనుమాలు’ కూడ రానివాడు, అనేవారు. అక్షరాలు దిద్ది నేర్చుకోవాలి. అంటే గురువు రాసిన అక్షరాల్ని అదే దారిలో రాసి, రాసి నేర్చుకోవాలి. ఈ పని ఇసుకలో జరిగేదంటే నమ్మగలరా? కలిగినవారు బియ్యం వాడేవారు. ఇవాళటికీ అక్షరాభ్యాసమన్నా, నామకరణమన్నా బియ్యంలో రాస్తరు. ఎందుకో అడగకుండ, అదే దారిని పోతే, అది సంప్రదాయ మవుతుంది. తరువాత మట్టి పలక వచ్చింది. మార్కాపురం మట్టిరేకు మీద కర్ర ఫ్రేము ఉంటే అది పలక. రాతి పొరలాంటి ఈ పలక పగులుతుంది. మళ్లీ మళ్లీ పలక పగిలితే వీపు పగిలే ప్రమాదం ఉంది. పలక మీద రాయడానికి బలపం కావాలి. అది కూడా పలక లాంటి పదార్థంతో తయారయిందే. చదువు తక్కువ, హంగులు ఎక్కువయితే, ‘చదువు చారెడు, బలపాలు దోశెడు’ అనేవారు మా చిన్నతనంలో. నేనింకా పలక స్థాయిలో ఉండగానే రేకు పలకలు వచ్చినయి. కానీ, వాటి మీద రాత అంత బాగ కుదిరేది కాదు. నాకు పలక మీద దిద్ది అక్షరాలు నేర్చుకున్నట్టు గుర్తులేదు. నేనంతే, నా కొడుకూ అంతే. పుస్తకాల్లో చూచి అక్షరాలు నేర్చుకున్నము. పెద్దయిన తరువాత నేను ఉర్దూ, తమిళం కూడ ఈ పద్ధతిలోనే నేర్చుకున్న. తమిళం అక్షరాలు కనిపిస్తే చాలు చదవాలని కోరిక. మట్ట పొగాకు, (అరటి మట్టలో చుట్టిన వండిన పొగాకు) ప్యాకెట్‌ మీద స్టిక్కరుంది. కూడ బలుక్కుని అందులోని అక్షరాలు ‘పకవకి వికరల్‌’ అనుకున్న. తరువాత అది భగవతీ విలాస్‌ అని అర్థమ యింది. ఉర్దూ పత్రిక షమాలోని ఫొటో కార్టూన్‌ నాకు ‘జోడో కా టౌన్‌’గా కనిపించింది.

బడిలో చేరేనాటికే అఆలు (అనే ఓనమాలు) వచ్చు. బడిలో నాన్ననే సారు. ఏదో పనిలో ఉండి పిల్లలందరినీ పలక నిండ, అఆలు రాయమన్నరు. నాకది నచ్చినట్లు లేదు. రాయమన్నది అ, ఆలు. పలక నిండ రాయాలె. ఒకవేపున అ, రెండో వేపున ఆ మాత్రం, నిజంగ పలక నిండేంత పెద్దవిగ క్షణంలో రాసి చూపించిన. నాన్న మంచి హాస్యప్రియులు. కొడుకు తెలివితనం చూచి ఎంత మురిసిపోయినడో! ఆయన నవ్వు నాకు ఇంకా గుర్తుంది! నాకు అఆలు వచ్చునన్న సంగతి ఆయనకు తెలుసు గద!

తెలుగులో అచ్చులన్నీ ముందు నేర్పి, తరువాత హల్లులకు పోతము. హిందీ అయినా అంతే. పడమటి ఇంగ్లీషులో ఎ, తరువాత బి ఎందుకు వస్తుందో, నాకర్థం కాలేదు. ఆల్ఫా, బీటా అన్న ప్రాచీన భాషలోనే ఆ పద్ధతి ఉంది. ఇంతకూ వాండ్లకు అన్ని అచ్చులు లేనే లేవాయె! ఇంగ్లీషులో అక్షరమాలను ఆల్ఫబెట్‌ అంటరు. మన వాళ్లు తెలియక ఆల్ఫబెట్స్‌ అంటుంటరు. ఇక్కడి మొదటి మాటకే మొత్తం అక్షరాలు అని అర్థం. దానికి ఇంకొక బహువచనం లేదు. చిత్రంగా ఉర్దూలో కూడా అలిఫ్‌ (అకారం) తరువాత బే (బ) వస్తుంది. పడమటి పద్ధతిలో!

ఒంట్లు: ఒంటి అంటే ఒంటరి అంటే ఒకటి అని అర్థం. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్‌, సప్త, అష్ట, నవ, దశ వరకు ఒకటి తప్ప అన్ని రెండక్షరాలకు మించని పేర్లు. మరీ చైనీసులోనయితే, పై, సై, కై అని ఒకే అక్షరం పేర్లుంటయట. అంటే వాటిని పలకడం, గుర్తుంచుకోవడం సులభం. ఇంగ్లీషులో వన్‌, టూ, త్రీ వరకు ఒక అక్షరం, ఫోర్‌, ఫైవ్‌, సిక్స్‌ ఒకటిన్నర అక్షరాలు. ఆ తరువాత క్రమం చెడుతుంది. ఈ రకమయిన అపక్రమం ఉన్నందుకు అంకెలను గుర్తుంచుకునే వీలు తగ్గుతుందట. రెండు సెకండ్లలో పలుకగలిగినన్ని అంకెలు బాగ గుర్తుంటయట. చైనా పిల్లలు, పెద్దలు, పది, పదకొండు అంకెలను రెండు మూడు మార్లు చదివి అప్పజెప్ప గలుగుతరట. తెలుగు, ఇంగ్లీషులో ఎనిమిది అంకెలు దాటితే గుర్తుండవని లెక్క. ఒక్కసారి విని ఫోన్‌ నెంబర్‌ రాసుకోగలిగిన వారు చాలా తెలివిగలవారి కింద లెక్క. మన ఫోన్‌ నంబర్లు ఎనిమిది అంకెలకు మించేవి కావు. సులభంగానే గుర్తుండేవి. మొబైల్‌ విప్లవంతో పల్లె, పట్నం తేడా లేకుండ ప్రతి నంబర్లో పది అంకెలుంటున్నయి. అయితే నంబర్లు గుర్తు పెట్టుకోవలసిన అవసరం కూడా తగ్గుతున్నది!

పది దాటి ముందుకు పోతే, అంకెల తీరు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. పది ఒకండు పదకొండు. పది, రెండు పన్నెండు. పదమూడు, పది నాలుగు వరుస బాగానే కదులుతుంది. అంటే పది స్థానం చెప్పి, తరువాత ఏదో తీరుగ ఒకట్ల స్థానం చెపుతున్నమని గద. ఇరవై, మూడు పదుల ముప్పయి, నలుబయి తరువాత కూడా అదే తీరు సాగుతుంది. కానీ హిందీలో గ్యారహ్, బారా, తేరా అంటూ పూర్తి కొత్త మాటలు వచ్చినయి. వీటిలో ఎక్కడా దస్‌ కనిపించదు. ఇంగ్లీషులో పదకొండు, పన్నెండులకు మాత్రం ఎలెవన్‌ (లెవన్‌ అనగూడదండీ), ట్వల్వ్‌ అని కొత్త రూపాలు వచ్చినయి. ఆ తరువాత టెన్‌ పోయి టీన్‌ అవుతుంది. తర్టీన్‌, ఫోర్‌టీన్‌, ఫిఫ్‌టీన్‌ అట్లా వరుస పోతుంది. ఇక్కడ తీరు తిరగబడి, ఒకట్ల స్థానం ముందు, ఆ తరువాత పది వస్తున్నయి. ఆ తర్వాత కూడా అదే తీరు ఉంటుందా, అంటే, ట్వంటీ వన్‌, సెవెంటీ వన్‌ అని దశమాలు ముందు వస్తయి. జెర్మన్‌లోనయితే, ‘ఒకటి మరియు ముప్పయి’ పద్ధతిలో అయిన్‌ ఉండ్‌ డ్రైషిష్‌ అంటారు. వాళ్లకూ పదకొండు, పన్నెండు నచ్చక కొత్త పేర్లు పెట్టినరు. ఆ తరువాత, డ్రైత్సేన్‌ అంటే డ్రై మూడు, త్సేన్‌  పది. ఇరుపదులు, ఇరువయి. బాగుంది. ట్వెంటీ అంటే గూడా బాగానే ఉంది. త్స్యాన్‌త్సిష్‌ (జెర్మన్‌) ఎట్లుంది. ఆఖ్‌ట్‌ అంటే ఎనిమిది. పదునెనిమిదిని మనమే పదెనిమిది బదులు, వైదికం పిల్లిలాగ వత్తి పలుకుతున్నము.

బ్లింక్‌: మాల్‌కమ్‌ గ్లాడ్‌వెల్‌ అని ఒక పెద్దాయన (వయసుకు చిన్నవాడే!) ఉన్నాడు. బ్లింక్‌ అని ఒక పుస్తకం రాశాడు. ఆ మాటకు కన్నురెప్పపాటు అని అర్థం. మనం ఒక సంగతి గురించి ఎన్నిరోజులు, ఎంతసేపు చర్చించినా, నిర్ణయం మాత్రం ఒక కన్ను రెప్పపాటులోనే చేస్తున్నమంటరాయన. ఆయన బ్లింక్‌లో రాసిన సంగతులు ముందు నాకయితే అర్థంగాలేదు. తరువాత బోలెడంత ఆలోచనలో పడేసినయి. మంచి పుస్తకం చేయవలసింది అదే గద! అందుకే ఈ పుస్తకాన్ని పైరేట్‌ (దొంగ) అచ్చు వేసి మన వాళ్లు ఫుట్‌పాత్‌ల మీద కూడా అమ్ముతున్నరు. మంచి పుస్తకాలు విలువ తగ్గించి కాలిబాట మీదకు చేర్చడం, మనం గౌరవం ఇచ్చే పద్ధతి.

ఈ గ్లాడ్‌వెల్‌ ఈ మధ్యన ఇంకో పుస్తకం రాసినడు. పేరు ఔట్‌లయ్యర్స్‌. అంటే మామూలుగా కాకుండా మరో రకంగా ఉండేవి, ఉండేవారని అర్థం. ఆ పుస్తకంలో తెలివి, చదువులాంటి ఎన్నో సంగతుల గురించి చర్చ ఉంది. అందులో భాగంగ ‘ఆసియా వారు అంకెలకు పేర్లు పెట్టిన పద్ధతి పారదర్శకంగ, అర్థమయే రకంగ ఉంది. పడమటి భాషల్లో అట్లా లేదు!’ అని ఒక పరిశోధకుడు, తరచి, తరచి తెలుసుకున్న సంగతి కూడ రాసినరు. ఆసియా పిల్లలు అందుకని, కూడిక, గుణకారం లాంటి లెక్కలు సులభంగ చేస్తరట. పడమటి పిల్లలకు నాలుగో తరగతి నుంచి లెక్కలంటే ఏవగింపు మొదలవుతుందని కూడా ఒక పరిశోధనా ఫలితం ఇచ్చినరు. మరి నాకు అంకెలు, లెక్కలంటే, అంత ఇష్టం లేదు! ఎందుకనో?

అపశకునం అంకెలు: తెలుగులో ఆరు తరువాత వచ్చే అంకె పేరు ‘ఏడుపు’ అన్నట్లుంది కదూ! అందుకే అది చాలమందికి ఇష్టం లేదు. ధాన్యం కొలిచేప్పుడు, ఆరు తరువాత ‘ఆరున్నొకటి, ఆరొకటి, అప్పుడు ఎనిమిది’ అనడం నేను విన్న. మా ఇంట్లో ఒక దుప్పటి ఉండేది. దానిపేరు పదిగోడు. అదేమిటిదని ఇప్పుడు నాకే అనుమానం వస్తుంది. ఆ దుప్పటి ధర పదిన్నిఏడు రూపాయలు. అమ్మినతను ఆ అంకెను పదిగోడు అని పలికినడు. ఇదీ చాదస్తంలో ఒక భాగమే.

ఏడున్నర అన్న అంకెను కూడా ఇష్టపడని వారు కొందరున్నరు. అందుకు కారణమేమో నాకు అంతు పట్టలేదు. సాఢేసాత్‌ ముహూర్తం అన్నమాట మెదడులో నిలబడి ఉంది. ఈ ముహూర్తం పనికిరానిది అని మాత్రం గుర్తుంది. సాఢేసాత్‌ గురించి కొంచెం బూతుగ ఉండే వివరణను విన్న కానీ, ఇక్కడ చెప్పను.

మన వాళ్లు ఛాదస్తులనుకుంటే, అమెరికాలో హొటేల్‌లో 13వ అంతస్తు ఉండదట. అపోలో 13 అన్యాయంగ ప్రమాదానికి గురయిందట. (మరెన్నో కూడా అదే దారిన పోయినయి) మొత్తానికి వారికి పదమూడు నచ్చదు. హిందీలో పదమూడు అని అర్థం వచ్చే ‘తేరా’ అన్న మాటకు ‘నీది’ అని అర్థం ఉంది. నానక్‌, ధాన్యం కొలిచి పోస్తున్నడు. బారా తరువాత తేరా వచ్చింది. ‘తేరా’ అంటే నీది, అంటే భగవంతుడిదని, మొత్తం ధాన్యం ఆ అంకెతోనే కొలిచినడంటరు! పనికిరాని అంకెలో గురునానక్‌ గురువు కాకముందే భగవంతుడిని చూడగలిగినడని కథగ చెప్పడం విన్న.


 

Tuesday, March 24, 2026

భాషలు - భవిష్యత్తు


భాషలు - భవిష్యత్తు

 

నాలుగవ తరగతి పాఠ్యపుస్తకాల్లో వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, జీవన విధానాల గురించి పాఠాలున్నాయి. వారివారి పండుగల గురించి ప్రత్యేకతల గురించి కూడా, వివరంగా కాకున్నా, చూచాయగా కొంత చెప్పారక్కడ. అందులో మన రాష్ట్రం గురించిన పాఠం చదువుకుని బయట రోడ్డు మీదకు వస్తే, పాపం పిల్లలకు ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి.

 

ఒకప్పుడు మనిషి వేషం, భాష, తీరు, తెన్ను చూచి ఏ ప్రాంతం వారో చెప్పడం వీలయేది. సినారె గారు చెప్పినట్లు, నాగరికత, మన గోచీలు పీకించి ఇరుకు పాంట్లు తొడిగించింది. ఇటీవల ఆడపిల్లలంతా పంజాబీ పద్ధతిలోకి మారిపోయారు. దేశం ఈ చివరనుంచి ఆ చివర వరకు ఏ ప్రాంతం వారయినా ఒక్కలాగే కనబడుతున్నారు. ఇంకొంచెం నాగరికత ముదిరితే, ఇక్కడవారు కారేమో అన్న అనుమానాలకు కారణమవుతున్నారు. నోరు తెరిచి మాటాడడం మొదలు పెడితే, అందరి నోటా ఒకేలాంటి మాట. మాతృభాషలో సంభాషణ అనాగరికతకు గుర్తు.

 

టెక్నాలజీ అందరినీ ఒకే గాట కట్టేస్తుందని అర్థం వచ్చే సూత్రం ఒకటి ఉంది. టెలిఫోను, ఒక కాలంలో, కలిగిన వాళ్ల ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడది పల్లెటూర్లో, గల్లీలో వాళ్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. రూపాయి జేబులో ఉన్నవారెవరయినా టెలిఫోను వాడుకోవచ్చు. అదొక పద్ధతి. టెక్నాలజీ మనకు అందించిన మరొక అద్భుతం టెలివిజన్. అందులో రకరకాల ఛానల్స్, రకరకాల ప్రోగ్రాములు. ఏ కార్యక్రమం ఏ భాషలో తయారయిందో అర్థం కాదు. అసలా మనుషులు మనవాళ్లేనా అని అనుమాన  పడుతుంటే, అచ్చమయిన తెలుగులో మాటలు వినపడడం మొదలవుతుంది. చాణక్యుడు ఒకనాడు హిందీలో మాట్లాడతాడు. మరోరోజు తెలుగులో మాట్లాడతాడు. మరీ కొన్ని ఛానల్స్ లోనయితే అందరూ కలిసి, ఎవరికీ అర్థం కాని భాషలో, కేకలు వేస్తుంటారు. అది సంగీతమని అనుకొమ్మంటారు. ఒక కార్యక్రమాన్ని అరడజను భాషల్లోకి డబ్ చేస్తే గిట్టుబాటు. అందులోని విషయానికీ, కట్టు బొట్టు వగైరా వివరాలకూ, వినబడే భాషకూ పొంతన ఉంటుందా, అన్న ప్రశ్న ఎవరికీ పట్టదు. ఏతావాతా, అందరమూ మనమన భాషలను మరిచిపోతున్నాం. ఇంకా మరిచిపోకుంటే ఇంకొన్ని రోజుల్లో తప్పనిసరిగా మరిచిపోతాం.

కంప్యూటర్ రంగంలో భారతీయులు ఎటుచూచినా జెండా ఎగరేసి, జై అంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇందుకు మనవారికి గల భాషాపాండిత్యం కారణమని గమనించాలా? మనం సులభంగా ఇంగ్లీషు నేర్చుకుని నాలుగు బొట్లేరు ముక్కల నుండి నవల్సు దాకా అప్పజెప్పగలుగుతాం. సల్మాన్ రుష్దీ, విక్రం చంద్రా, చిత్రా దివాకరుని వగైరాల్లాంటి ఆంగ్ల రచయితలను కోకొల్లలుగా ప్రపంచానికి పంచుతాం. మనకు అంటే చదువుకున్న భారతీయులకు, ఇంగ్లీషు చేతగావడం, కంప్యూటరు రంగంలో ఒక పెద్ద అనుకూలమయిన అంశం అయి కూచుంది. చైనా, జపాను వారికి చదువు రాదని కాదు. ఇంగ్లీషు మాత్రం మనకు వచ్చినంత బాగా రాదుగాక రాదు. అదీ సంగతి!

 

కొత్తశకాలు, సహస్రాబ్దాలు వస్తే రానివ్వండి. కొత్తదనాన్ని తెస్తే తేనివ్వండి. కానీ గుర్తించవలసిన సంగతులను మాత్రం కొన్నింటిని గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉంది. వెనకటి సంగతేమో గానీ, ప్రస్తుతం ప్రపంచంలో ఆరువేల భాషలు వాడుకలో ఉన్నాయి. అంటే, ఇంకా ఎవరి భాష వారికి, ఉందనే అనుకోవచ్చు. ప్రగతి గతి ఇలాగే సాగితే, 2100 నాటికి, మిగిలే భాషలు మూడువేలకు తక్కువేనని అంచనా. పండుగలకు ప్రతి దానికీ ప్రత్యేకతలు ఉండేవి. ఫలానా పండుగని ప్రత్యేకంగా పట్టింపులుండేవి. యూరోపు వాడి యంత్రాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అన్ని పండుగలకూ సేమ్యాలు మిగిలి పోయాయి. అవి కూడా మన పాత పద్ధతి సేమ్యాలు కానేకావు. అచ్చంగా అలాగే, ప్రపంచమంతటా ఇంటర్నేషనల్ భాష, అయిన ఇంగ్లీషు ఒక్కటే, మిగిలినా ఆశ్చర్యపడనసరం లేదు!

 

ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అన్ననాడు వారి ఉద్దేశ్యం ఒకటయితే, ఇవాళ నిజంగా ప్రపంచమంతా ఒకటే కుటుంబమయింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో, అయిదవ వంతు మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారట. అందరినీ ఒకేగాట కట్టే సంస్కృతీ విశేషానికి ఉదాహరణగా ముందు ఇంగ్లీషు భాషను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కొంత భాగంలో కొంతకాలం పాటు, సడకులుండేవి. సడకేమిటి? అసహ్యంగా!’ అన్నవాళ్లున్నారు. దాన్ని రోడ్డు అనాలి అని నచ్చజెప్పారు. ఇప్పుడా సడకులన్నీ ఇంచుమించు రోడ్డులయినయి. అదలా ఉంచితే మనం మాత్రం ఇంగిలీషు, కొంచెం తెలుగు శైలిగల టింగిలీషు భాష వంటబట్టించుకున్నాం. వాట్ యార్?’ అన్న మాటలో, యార్ (నేస్తం) అనేది ఉరుదూ మాటని మనకు తోచనే తోచదు. ఇది మన రాష్ట్రానికి, మన దేశానికి పరిమితమయిన పద్ధతి కానే కాదు. ప్రపంచమంతటా ఎవరికి వారు తమదయిన ఇంగ్లీషు మాటకారితనాన్ని తయారు చేసుకుంటున్నారు.

 

ఇంటర్నెట్, ఇతర మల్టిమీడియా మాధ్యమాలను గురించి తలుచుకుంటే, ఇంగ్లీషు తప్ప మరో భాష మిగిలేనా అన్న అనుమానం రాకమానదు. అందరికీ, కనీసం కొందరికయినా అర్థమయే ఇంగ్లీషు ఒకరకమయితే, స్థానిక భాషల పదజాలాన్ని ఇంగ్లీషుతో కలిపి, తయారు చేసే భాషలు మరింత విచిత్రం. ఉత్తర భారతంలో హింగ్లిష్, దక్షిణంలో టింగ్లిష్ అని మనం సరదాగా అనుకుంటాం. కానీ అవసరం వచ్చినప్పుడు, ఇంగ్లీషు వాడికి అర్థమయ్యేలా విషయం చెప్పగలం కూడా! సింగపూర్ లో సింగ్లీష్ ఉంది. అందులో మలయ్, చైనీస్ భాషలు ఇష్టంగా కలిసి ఉంటాయి. అది అక్కడివాళ్లకు తప్పతే మరొకరికి అర్థం కాదట!

 

గోపాలం కె.బి.

17 ఫిబ్రవరి 2001


 

Monday, March 23, 2026

లోకాభిరామం : భాష - బహాసా


లోకాభిరామం : భాష - బహాసా


భాష - బహాసా

అనవసరంగారు :
రేడియోలో ఎవ్-సాయదార్లకు వాతావర్ణ సూచనలుంటయి, ఎప్పుడన్న విన్నరా? మేమయితే ఇదే ప్రశ్నను ఇన్నరా? అని అడిగినా అర్ధం చేసుకుంటము. వ్యవసాయము మా దగ్గర ‘ఎగుసము’ అవుతుంది. వేసవి, వేసంగి, యాసంగి అంటే ఒకటే మాటనా? మాటల మూలాలను వెతుకుతూ పోతే చిత్రమయిన సంగతులు ఎదురవుతయి. ఈ ఎదురయ్యేవి వెదుర్లు, వెదుళ్లు మాత్రం కాదు. వేంకటేశ్వరుని అందరు వెంకటేశ్వరుడు అంటరు. ఆయనకు పట్టింపు లేదు. ఎంకటేశ్వర అన్నా కోపం రాదాయనకు. యంగటేస్పరా అన్నాసరే ఏమీ అనుకోడు. మరాఠీవారి సంగతి మరీ విచిత్రం. వ్యంకట్రావ్, వ్యంకటేశ్ అని రాస్తరు. సంస్కృతంతో సంబంధం లేదని అర్ధం. చాలా గొప్పవారు కూడా సంబంధం అన్నమాటను సమ్మంధం,  సమంధం,  సమ్మందం అని పలకగా విన్నాను. గౌతులచ్చన్నగారని ఒక నాయకుడు, ఇప్పటివారికి తెలియదు. బెమ్మానందంరెడ్డి అనేవారు. అదేమిటని అడిగిన వారిని ‘ఆయనకు లేని అనుమానం నీకెందుకు’ అని కూడా అన్నరు. తిరిగి మరోసారి రేడియోలోకి వస్తే (ప్రసారంలో కాదు గానీ) ఒకాయన ‘అనవసరంగారు వెధవ రిపోర్టు తెమ్మన్నారండీ!’ అన్నరట. విషయమేమిటో ఎవరికయినా తోచినదా? రేడియోలో అనౌన్సరుగారలు ఉందురు. ప్రజలకు వారు మాత్రమే తెలియుదురు. రేడియో స్టేషన్ చూడబోయే వారంత, తమ అభిమాన అనౌన్సర్లని చూడాలని ప్రయత్నింతురు. ఇంతయినా, ఆయన కెవరికో గౌరవంగానే అనౌన్సరుగారు, అనవసరంగా కనిపించారు. వారి పేరు అనవసరం. వారు అవసరమే! ఇంతకూ వెధవ రిపోర్టేమిటి. అది వెదర్ (వాతావరణ) రిపోర్టుకు పట్టిన గతి లెండి!
వెంఢాకాలం: వేంకటేశ్వరులంత వారని పట్టుకుని ఎంగటేసనో, వ్యంకటేశనో అంటే తప్పుగదా! అట్లాంటివారు మరి, అనాడీల కింద లెక్కవుతరు గదా! (అనాడీలనగా ఏమీ తెలియని అమాయకులు అంతే గానీ, నాడిలేని వారు మాత్రం కారు) కనుక ఒక పెద్దాయన ఎస్టర్ (యెస్టర్)డేని మార్చి వెస్టర్‌డే అన్నారు. మరొకాయన ఇస్త్రీని విస్త్రీ అన్నారు. (అవునండీ, ఇంతకు తెలుంగులో ఈ ఇస్త్రీని ఏమంటరు. చలవమడతలని ఒక మాట వినిపించేది. కానీ, ఇది వేడి (ఏడి)కాదు మడత గదా! ఉర్దూలో ఒత్తుల సమస్య చిత్రంగ ఉంటుంది. సికిందర్ అని రాయాలంటే ఆ మాటకు ముందు ఒక ‘అ’కారాన్ని రాస్తరు. ఎందుకు రాసిందీ, తెలియని వారు ఇస్కందర్ అని పలుకుతరు. స్కూల్ అన్న మాటను, స్టేషన్ అన్న పదాన్నీ (అనిన, అన్న) రాసి సకూల్, సటేషన్ అనరు. ఇస్టేషన్, ఇస్కూల్ అంటరు.
బాగా మాట్లాడుతున్నమనుకుని మనవాళ్లు కొందరు శవం అన్న మాటను ‘శ్రవం’ అంటారు. అట్లాగే ఎండకాలం పోయి వెంఢాకాలమవుతుంది.
రెండు, రొండవుతుందని తెలుసా మీకు. కన్యా శుల్కంలో అప్పారావుగారు, ఒక పాత్రచేత ప్రయత్నంగ ‘రొండు’ అని పలికించినరు. ఆ రకంగా వారు పాత్రల మధ్య తేడా చూపించినరు. మనమేమో తేడా తెలియక రెండు, రొండు ఒకటే ననుకుంటున్నాము. ఒకాయన ఏకంగా ‘రొండు చింతలు’ అన్నడు.అది రెంటచింతల అనే ఊరి పేరని నాకు తరువాత అర్థమయింది.
పెద్దగా ఉరిమితే మనవాండ్లు అర్జునుని పేర్లు తలుచుకునేవారు. మా ఊళ్లో, ఊరిలో ఒక ముసలమ్మ ‘అర్జున,  బీమ,  ఆకేశవేని, భూతల్లి, దడదడ, గుడగుడ’ అని ఏదో చదివేది.
పట్టమహిషి: ‘మిరపకాయ కొరికి చూస్తే చుర్రే చుర్రే, దున్నపోతును గన్న తల్లి, బర్రే బర్రే’ అని పల్లెపాట ఒగటి, ఒకటి ఉన్నదట. బర్రె అనే మాట, అందరికీ తెలిసినది కాకుంటే ఆశ్చర్యం లేదు. కొందరు దానిని గేదె అంటరు. మరికొందరు ఎనుము అంటరు. ఈ ఎనుమలలో కొన్ని ఆ నలుపులోనే తెలుపుచాయలో ఉంటయి. వాటి వెంట్రుకలు కూడ తెల్లగ ఉండడం చూచిన గుర్తు నాకుంది. తెల్లని ఆవు, అసలు సిసలు తెలుపు రంగు ఉంటుంది. తెల్లబర్రె మాత్రం ఆ నలుపులోననే ఒక తెలుపు. దాన్ని మా ప్రాంతంలో ‘పల్లబర్రె’ అనేవారు. ఇప్పటికీ అంటనే ఉంటరు. బర్రెలకు, ఆవులకు దూడలు ఉంటయి. ‘దూడమ్మా, దూడా’ అని కూడా జానపద గీతం ఉంది. స్త్రీల పాటలలో ఆవుదూడ, పులి గురించినది చాలా ఆర్తిని కలిగించే పాట. ‘కాటుక కన్నులా గంగ్యావు కోడె, మీయమ్మను మేము పొడగాన లేదు’ అని మావాళ్లు పాడడం నాకింకా గుర్తుంది. తెల్లని ఆవుదూడకు కళ్లు నల్లగ ఉంటే, నిజంగా కాటుక పెట్టినట్టు ఉంటుంది. మా ఇంట్లో పుట్టిన ఇటువంటి దూడ, కోడె దూడయి, ఎద్దయి మా మధ్యన, ఇంట్లో మనిషిగ పెరిగి, పోయింది. దాని పేరు గుమ్మడి. నాన్నగారుంటే, వాని పేరు అని సరిదిద్ది ఉండేవారు! అంత ప్రేమ ఆయనకు గుమ్మడి మీద. గుమ్మడి సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత మేమెవరము కనిపించకపోతే నేరుగ వంటింట్లోదాక వచ్చేది.
విషయం మరెక్కడికో వెళ్లిపోయింది గానీ, దూడను కొంతమంది ‘దుడ్డె’ అని అంటరు. బిడ్డను బిడ్డె అని పలికిన వారిని చూచిన, విన్న. బిడ్డలు అనే మాటను ‘బిడ్లు’ అంటరని పుట్టపర్తివారు వ్యాసంలో రాసినరు.
ఇంతకూ నేను అడగదలచుకున్న ప్రశ్న అట్లనే ఉండిపోయింది. యముని మహిషపు లోహ ఘంటలు అంటరు సిరిసిరి అనగా శ్రీశ్రీగారు. అంత ఎమ్ ధర్మరాజు వారి వాహనం గదా? బంగారపు గంటలెందుకు లేవో? మహిషమనగా బర్రె, గేదె, ఎనుము (తప్పు!) పుంలింగమయితే దున్న, దున్నపోతు గద! మహిషియనగా బర్రె, గేదె, ఎనుము. రాజుగారి భార్యను పట్టమహిషి అంటరెందుకని(?)
ఇంద్రునికి వృషభముతో పోలిక చెప్పిన సందర్భాలున్నయి. వేదంలో కూడా రకమయిన పోలికలు చెప్పినరు. గొప్ప కవులను కవివృషభులు అనడము విన్నము. కనీసం చదివినము. రాజుగారిని సింహంతోనో, ఎద్దుతోనో పోల్చి చూపిస్తరు. అందుకే పట్టమహిషి అనడం వెనక మరేదో సంస్కృతం కిటుకు ఉండి ఉంటుందని నాకు తీవ్రమైన అనుమానం! అంతేగానీ అర్ధంలేని జోక్ వేసి, అనర్థం చేయడం నా ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని మనవి!
సింహము, సింగమవుతుంది. టామిల్ అనగా తమిళంలో చింగం కూడా అవుతుంది. (జానీ లీవర్ అనే హాస్యనటుడు చ్యూయింగ్ గమ్‌ను చింగం అన్నాడు. హాస్యానికని అన్నాసరే, అది అంటుకుంటుంది!) యశోదై యిలైచ్చింగం అని బాలకృష్ణుని వర్ణించింది గోదామాత. సింహి, అనే మాట ఉందా? సింగానికి మాత్రం సింగి ఉంది. సింగమ్మ అన్నది తెలిసిన పేరు. శివంగి అనే మాట ఎట్లా వచ్చింది? మరి శివాంగి అంటే ఎవరు. శివునియందు సగమయిన పార్వతి, శివాంగియయి ఉండవలె. శివాన్విత అన్న పేరు ఒకటి గుర్తుంది.
శివంగి సంగతి మీకంతా తెలుసా? మగసింహం వేటకు పోదు. శివంగి మాత్రమే పోతుంది. ఆయమ్మ కొట్టుక తెచ్చిన తిండిని సింహరాజు తిని పడుకుంటడు. ఆ రాజుకు ఒకే శివంగి కాక కావలసినన్ని శివంగులు ఉంటాయి. అదొక దర్జా. అందులో తిండి వెసులుబాటు కూడా ఉందన్నమాట.
భాష, బాస (బహాసా) విచిత్రమయినది. ఆసక్తి కరమయినది కూడ!
నల్లని దున్నను కారెనుము, కారుదున్న అనడం ఉంది. ఇంకా దూడను వేయని బర్రెను ‘పడ్డ’ అంటము మా ప్రాంతంలో. లేత బర్రెపాలు అంటే ఈని, అనగా దూడను కని ఎక్కువ కాలం కాని బర్రెపాలు. ఆ పాలలో దూడ కొరకు రకరకాల ప్రత్యేక రసాయనాలు ఉంటయి. కనుక అవి కాచితే గడ్డ కడతయి. జున్నుపాలు అను పేరుతో దానిని తింటము. ఆ పాలు తాగినా, తిన్నా వాతం చేస్తుందనే వారు. అంటే ఆ పాలలో మనకు పడని ప్రొటీన్లు ఏవో వుండి, శరీరంలో మార్పులకు కారణ మవుతాయని నాకు అర్ధమయింది. ఈ పరిస్థితి నాలుగు దినాలు సాగుతుంది. ఆ తరువాత పాలు కాచినా గడ్డ కట్టవు. కానీ వాటిలో జిగురు మాత్రం ఎక్కువ ఉంటుంది. వాటి రుచి కూడా వేరుగ ఉంటుంది. రెండు మూడు నెలల తరువాత పాలు మామూలవుతయి.
బర్రె తిన్న తిండి, తాగిన కుడితి కారణంగా పాల రుచి మారుతుందంటే కొంతమందికి అర్ధం కాకపోవచ్చు. కుడితి, తవుడు తిన్న బర్రె పాలు, పెరుగులో కొంత పులుపు ఉంటుంది. పత్తి గింజలు తిన్న బర్రె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డితో కూడ పాలలో తేడా వస్తుంది. ఆ పాలతో చేసిన పెరుగులో కూడా రుచి తేడా తెలుస్తుంది.
ఇదం, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని లేకుండ, రైతుల ఇండ్లలో అందరికీ తెలిసిన విజ్ఞానం. పాలు పాకెట్లనుంచి, మెషీన్‌నుంచి వస్తయనుకునే వారికి ఇవేం అర్ధమవుతయి?

 

Thursday, March 19, 2026

నది నాతో మాట్లాడినది - దాశరథి కవిత 1


నది నాతో మాట్లాడినది

దాశరథి కవిత








 

Wednesday, March 18, 2026

గాలివాన - వ్యాసం : పాలగుమ్మి పద్మరాజు గారి గురించి


గాలివాన - వ్యాసం

పాలగుమ్మి పద్మరాజు గారి గురించి









 

మగునీ ఎద్దుల బండి ఒరియా మూలం - గోదావరీష్ మొహపాత్ర అనువాదం - కె. బి. గోపాలం


మగునీ ఎద్దుల బండి   

ఒరియా మూలం - గోదావరీష్ మొహపాత్ర   

అనువాదం - కె. బి. గోపాలం 

జననాలు, మరణాలు: రెండు లక్షల జనాభా ఉన్న ఖాలీకోట్ లో తప్పనిసరిగా ఈ రెండు ఉండనే ఉన్నాయి. అయితే వాటి సమాచారం మాత్రం కుటుంబాలు, పరిసరాల పరిధిని దాటి ఎన్నడూ ప్రయాణించింది లేదు. కానీ, మగునీ చనిపోయిననాడు మాత్రం వార్త ఊరంతా వ్యాపించింది, మరింత దూరం కూడా పోయింది. విన్న వారంతా, కాసేపు మ్లానంగా ఉండిపోయి, అయితే బీద వెధవ పోయాడన్నమాట! ఎంత అన్యాయం! అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు.

ఇంతకు ఎవరా మగునీ? ఖాలీకోట్ మహారాజా? లేక మరో పక్కరాజ్యం ప్రభువా? పరిపాలన యంత్రాంగంలో ప్రధాన అధికారియా? బాగా పన్నులు కట్టే ధనవంతుడా? లేక అప్పులు ఇచ్చే షావుకారా? స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న సత్యాగ్రహ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడా? వెర్రిగా వచ్చే జనాలను ప్రభావితం చేస్తూ గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చాడా? కాదంటే వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించడానికి అందరికన్నా ముందు ఉండేటట్టు ఎంపికయ్యే ప్రధాన పౌరుడా? ఎవరతను? టౌన్ లోని వాళ్లంతా, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల అడవికి దగ్గరగా ఉండేదూరం పల్లెలవారు కూడా అతగాడిని ఎరిగినవారే!

మగునీ అసలు ముఖ్యమైన మనిషి కానేకాడు. అతను చేసిందల్లా బతుకు గడవడం కోసం ఒక ఎద్దుల బండిని నడిపించడం మాత్రమే. బతుకంతా కష్టపడ్డాడు. అదేదో దేశంకోసం, దేశం జనాలకోసం మాత్రం కాదు. కేవలం తనకోసం తాను కష్టపడ్డాడు. తన బతుకుదెరువు కోసం కష్టపడ్డాడు. అయితే ఉన్న ఆ రెండు ఎద్దులతో అతను ఏర్పరచుకున్న బంధంమాత్రం ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

ప్రతినిత్యం మగునీ తన బండితో రైల్వే స్టేషన్ కు వెళ్లి తీరుతాడు. అదేదో సూర్యుడు ఉదయించి సాయంత్రం టౌన్ కోటమీద అస్తమించినంత క్రమంగా వెళ్లి తీరుతాడు. గడియారంలాగా పని చేస్తాడు అని ప్రజలందరూ అనేవారు. వానకాలం నెలలలో, సూర్యుడు మబ్బుల చాటున దాగి ఉన్నప్పుడు, అతని రావడం పోవడంతో అందరికీ సమయం తెలిసేది. రుతువులు క్రమంగా రాకపోవచ్చు, వర్షాలు ఆలస్యం కావచ్చు, వేసవి మరీ వేడిగా లేకపోవచ్చు, మగునీ బండి గడగడలాడుతూ దారివెంట నడవకుండా ఒక రోజు కూడా గడవలేదు. శీతకాలపు మరీ చల్లని ఉదయాలలో కూడా అందరూ దుప్పట్లు చుట్టుకుని వరండాలలో కూర్చుని ఉంటే, మగునీ తన బండిని మాత్రం కొండల కింద పాములా మెలిదిరిగిన దారి వెంట, పెదాల మీద పాటతో సహా నడిపించడం తప్పదు.

ఖాలీకోట్ ప్రభువుగారి దగ్గర రెండు కార్లు ఉంటే మాత్రమే ఏమిటి? అంటూ, అతను ఒక్కొక్కసారి సరదాగా అనేవాడు. ఆయన దగ్గర తనవంటి డ్రైవర్ ఉన్నాడా? అని అడిగేవాడు. అతని ఎద్దులబండి కారులన్నింటికన్నా గొప్పది. కాలియా, కాసరాలను వాటి వెనుక భాగాన నెమ్మదిగా తట్టి ఇంజన్ ను హుషారు చేస్తే చాలు. బండి సాగుతుంది. దానితోపాటు ముక్కలు ముక్కలుగా పాట సాగుతుంది. అందరికీ తెలిసిన రామకథ అది. రాముడు, లక్ష్మణుడు మాయలేడి వెంటపడి మహ పరుగెత్తారు, అంటూ సాగుతుంది పాట. ఇక ఎద్దులు ఎగురుతున్నట్టే ముందుకు సాగుతాయి. పాట కొండల్లో ప్రతిధ్వనిస్తుంది. పక్షులు జంతువులను మేలుకొలుపుతుంది. అడవి కోళ్ళు అరుస్తాయి. ఊర కుక్కలు మొరుగుతాయి. బండి అలా ముందుకు సాగుతుంది.

టౌన్ లో పైనుంచి కింద దాకా, ఇటుపక్క నుంచి అటుపక్కదాకా, ఇంకా వెలుపలి ప్రాంతాల్లో కూడా, తన నోటి నుండి అంతులేని ప్రవాహంలాగా బతుకు కథలతో మగునీ అందరినీ పట్టి వేస్తాడు. తల్లిదండ్రులు ఎంతో బుజ్జగించి ప్రేమగా పెంచారు. అతని చిన్నతనం హాయిగా సాగింది. పడుకునేందుకు పరుపు, కడుపునిండా తిండి, అసలు ఏ పని చేసే అవసరం లేకపోవడం, అది పద్ధతి. తల్లీ, తండ్రీ పోయిన తర్వాత కూడా అతని బతుకు బాగానే సాగింది. పెరిగి పెద్దవాడయ్యాడు. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మాటలు ఆమె పెదవుల లాగే తీపి. ఆమె ఊపిరి అసలైన సుగంధం. ఆమె నడిచిన చోట పూలు పూసేవి. బ్రతుకు కలలాగా సాగింది. ఆనందం, సంతోషాలు వెల్లి విరిశాయి. అయితే అది చాలాకాలం కొనసాగలేదు. అతని భార్య చిన్న వయసులోనే మరో లోకానికి వెళ్లిపోయింది. తన రోజులు ముగిసిన తరువాత తాను కూడా వెళ్లి ఆమెను కలుస్తాను, అని అతను అనుకునేవాడు.

ఈ విషయాలన్నీ అతను గంభీరంగా పాడుతూ, చెపుతూ ఉంటే అందరి కళ్ళు చెమర్చేవి. అతని కళ్ళు కూడా చెమర్చేవి. ఎవరికంటా పడకుండా కన్నీళ్లు తుడుచుకుని, అతను మాటమార్చి మరో సంగతి ఎత్తుకుంటాడు. ప్రయాణం ముగుస్తుంది. కథలు మాత్రం ముగియవు. ఖాలీకోట్ మహారాజు ఒక్కరు తప్పితే అందరూ మగునీ బండి ఎక్కినవారే. దీవాన్ గారి నుంచి మేనేజర్ దాకా, లాయర్ గారు, మార్వాడీ సేఠ్  నుండి మరి మహాత్మా గాంధీ అనయాయుల దాకా, ఒకసారి కాకపోతే మరోసారి అతని బండి ఎక్కినవారే. ఆ బండి ఎన్నింటినో చూచింది. చిన్న వయసులోనే మొగుణ్ణి పోగొట్టుకున్న ఆడకూతుర్లు అత్తారింటి నుంచి తల్లి గారి ఇంటికి తిరిగి రావడం, సంతోషంగా, చక్కనైన పెళ్ళికూతుళ్లు పుట్టినింటినుంచి మొగుడి ఇంటికి వెళ్లడం, మండల్ గ్రామంలోని గదా రౌల్, పన్నులు కట్టనందుకు బందిఖానాలో పడడం, ప్రపంచంలో అతనికి మిగిలిన వస్తువులన్నీ, చివరికి చీపురుదాకా ఈ బండిలోనే ప్రభువుగారి దర్బారుకు తరలింపబడడం, బెండాలియా వాసి మధూ రథ్ చెరసాలకు పంపబడడం, వాదించిన లాయర్లు, చేతులకు బేడీలు వేసిన పల్లెకారు నాయకులు ముఖాల మీద చిరునవ్వుతో అరెస్టు కావడం. మగునీ బండి ఎన్నెన్నో చూచింది. దుఃఖాన్ని చూచింది, సంతోషాన్ని చూచింది. ధారలుగా కారిన కన్నీళ్లు, గడ్డిమెత్తలను తడిపాయి. ఆనందంగా కొట్టిన కేరింతలు అదే విధంగా, బండి మంచె కట్టిన గడకర్రలను దడదడలాడించాయి. కనుక మగునీ మాట్లాడుతున్నాడు, అంటే అదొక చరిత్ర. అందులో ఆ టౌను కథలన్నీ వినిపిస్తాయి. అతను కథలలో ఎంతో హుషారును కలగలుపుతాడు. చివరకు ఎద్దులు వింటూవింటూ నెమ్మది ఆగిపోతాయి. నా కథలను ఇవి ఎలా వింటున్నాయో చూడండి,  అంటాడతను. హాయిగా నవ్వుతాడు. ఆ ఎద్దుల మీద ఏనాడూ కర్రను ప్రయోగించింది లేదు.

అటుయిటు తిరగడానికి అందరికీ మరొక ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తున్నదని మగునీకి తెలిసేరోజు ఒకటి వచ్చింది. దారి మీదకు సింగ్ కుటుంబం వారు బస్సును ఒకదాన్ని తెస్తున్నారని తెలిసింది. అతను మాత్రం గలగలా నవ్వేశాడు. సుఖంగా తిని పెరుగుతున్న తన ఎద్దుల జంటకు పోటీగా ఒక బస్సు వస్తుందా? ఆ దిక్కుమాలిన బస్సు పేరున అందరూ తన బండిని వదిలిపెడతారా?

అందరూ అతగాడిని చూసి నవ్వారు. అతను మాత్రం అలాగే ఉండిపోయాడు.

నాలుగు నాళ్ళు పోయిన తర్వాత రాక్షసిలాంటి ఒక బస్సు రోడ్డు మీదకు రానే వచ్చింది. మగునీ పని ముగిసింది, అన్నారు ఊరివాళ్లు. వాడి వ్యాపారం మడత పడుతుంది. ఇరవయి మందిని గంటకు నలభయి మైళ్ళ వేగంతో తీసుకువెళ్లే బస్సుతో ఒక ఎద్దులబండి ఎట్లా సమానంగా పోటీ పడుతుంది? అన్నారు.

మగునీ గుండె దిగజారింది. వాడికి భయం పట్టుకుంది. వాడు కిందపడి ఏడవడం మాత్రం  మొదలు పెట్టలేదు, నిజమే.  కానీ కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. కొడోలాలో పెద్ద సభ జరుగుతుండగా తాను పక్కగా వెళ్లడం గుర్తుకు వచ్చింది. మనిషి చేతులకు మరయంత్రాలు సాటిరావని అక్కడ ఒక పెద్దమనిషి గట్టిగా చెబుతున్నాడు. అదే గనుక నిజమైతే, తన ఎద్దుల బండి మోటార్ బస్సు కంటే గొప్పది కాదా? ఆ మీటింగుకు హాజరయి ఆ మాటలు విన్న వాళ్ళ అందరి దగ్గరకు వెళ్లి అభ్యర్థిస్తాను అనుకున్నాడు. వాళ్లంతా తనను పట్టించుకోకుండా ఉంటారా? వాళ్లుగానీ, ఆ పని చేస్తే, తాను నేరుగా వాళ్ళ నాయకుడు మహాత్మా గాంధీ దగ్గరకు వెళ్లాలి అనుకున్నాడు. అతను బీదవారికి, భూమిమీది బడుగువారికి మహా మిత్రుడు అని అందరూ అనగా విన్నాడు. ఆయన కూడా మగునీని పంపించి వేస్తాడా? మగునీ నాశనమైతే, సింగ్ లు బాగుపడితే చూస్తూ ఊరుకుంటాడా?

మగునీ బండి నడిచే దారిమీదనే బస్ కూడా నడవసాగింది. ఒకరోజు తరువాత ఒక రోజు తరువాత ఒకరోజు బస్సు నిండుతున్నది. బండి ఖాళీగా ఉంటున్నది.

మగుని మధ్యరాత్రి లేచి, తన బండిని రైల్వే స్టేషన్ ముందర తెల్లవారక ముందే ఆపి ఉంచడానికి,  బయలుదేరాడు. అయినా ప్యాసింజర్లు అందరూ బస్ కోసం కాచుకుని ఉన్నారు. అది తెల్లారిన తర్వాత ఎప్పుడో గాని రాలేదు.

బండిలోని గడ్డి పరుపులను తీసేసి, మగునీ జనపనార సీట్లను ఏర్పాటు చేశాడు. అయినా ప్రజలు బస్సు వేపే వెళ్లారు.

ఒక్కొక్కరిని చేతులు పట్టుకుని, బండి వద్దకు తెచ్చే ప్రయత్నం చేశాడు. అయినా అందరూ బస్సు వైపు వెళ్లారు.

రోజులు గడిచాయి, మరిన్ని రోజులు గడిచాయి.

మగునీకి సంగతి తెలిసిపోయింది. దినానికి రెండుసార్లు బదులు ఒకేసారి తినడం మొదలుపెట్టాడు.

మరి కొన్ని నాళ్ళు గడిచిన తర్వాత అతను భోజనం నుంచి గంజికి మారాడు.

ఇంకా కొన్ని నాలుగు గడిచాయి, గంజి రోజుకు ఒకసారి నుంచి  రెండు రోజులకు ఒకసారికి మారింది.

మరెన్నో రోజులు గడిచాయి. చాలా రోజులపాటు అతని ఇంట్లో పొయ్యి వెలగలేదు. అసలు వండడానికి ఏమీ లేదు.

ఎద్దులు బక్క చిక్కిపోయాయి. వాటి ఎముకలు పొడుచుకు వచ్చాయి. మగునీ వాటి మెడలు వాటేసుకున్నాడు. ముగ్గురు కలిసి నిశ్శబ్దంగా కన్నీరు పెట్టుకున్నారు.

వాడి పని ముగిసింది, అన్నారు ఊరివారు. ఆకలి, దుఃఖంతో వాడు వెర్రెత్తిపోయాడు, అన్నారు.

మరికొంత కాలం గడిచింది.

ఒకానొక ఉదయాన జనం కలిసి మగునీ ఇంటి తలుపు పగలగొట్టవలసి వచ్చింది. అతని శరీరాన్ని బయటకు తెచ్చారు. చింకిచాపమీద అతని దేహం పడి ఉంది. చేతి కర్ర దానికిందే ఉంది.

అతని కోసం చితి పేర్చారు. నల్లని పొగ దట్టంగా ఆకాశంలోకి ఎగిసింది. ఆత్రంతో రెక్కలు తపతపలాడిస్తూ లెక్కలేనని పక్షులు అందులో ఎగిరాయి. వార్త ఊరంతా పాకింది. అక్కడి రెండులక్షల జనాభా వాపోయారు. పాపం బీద మగునీ పోయాడన్నమాట! ఎంతటి అన్యాయం? అన్నారు.

గోదావరీష్ మహాపాత్ర - ఒరియా(1899 – 1965) పద్నాలుగేళ్ల వయసులో మొదలైన సాహిత్యచరిత్రలో ఇతను 70 పుస్తకాలు వెలువరించాడు. కవిత, చిన్న కథ, నవల, హాస్య రచనలు, నాటికలు, బాల సాహిత్యం ఎన్నో రాశాడు. ము పాత్రికేయ రచనలు కూడా చేశాడు. ఒక సెటైరికల్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. మగునీ ఎద్దుల బండి అనే కథను చలనచిత్రంగా కూడా తీశారు. ఆ చిత్రానికి అవార్డు వచ్చింది.