Friday, August 14, 2026

అర్థం తెలుసా? దేశభక్తి, వందేమాతరం మరిన్ని విషయాల గురించి... On patrotism, and such matters


 

విషయానికి రాగలగడం చాలా గొప్ప విషయం — మెక్‌ లియోడ్‌ జి ప్రెస్టన్‌ (ఈయనగారెవరో తెలియదు. కానీ చాలా గొప్ప

మాట అన్నారు.)

అర్థం తెలుసా?

ఒక అనర్ధం జరుగుతుంది. దేశం మొత్తం ఒక్కటి అవుతుంది. ఆ భావన కొంత కాలం నిలుస్తుంది. ముందే ఎన్నికల

కాలం. పులి మీద పుట్ర లాగా పుల్వామా అనర్ధం ముంచుకు వచ్చింది. అది నిజంగా అనర్ధం. యుద్ధాలు, సేనలు అంటే

ఒకరి మీద ఒకరు పడి కొట్టుకు చావడానికే కదా? యుద్ధం అన్న పద్ధతిని మొదలు పెట్టిన వారు ఎవరో తెలియదు.

అంతకన్నా అర్ధంలేని పద్ధతి మరొకటి లేదు. తెలివి గల మనిషి ఆ తెలివిని ఉపయోగించుకుని సమస్యలకు

సమాధానాలు వెతకవచ్చు. అంతేకాని పాశవికంగా, రాక్షసంగా ఎదురుపడి చంపుకుని అందులో బలాబలాలు

తేల్చుకుంటాం అంటే అంతకన్నా అమానుషం మరొకటి లేదు. అయినా చరిత్ర అంటేనే యుద్ధాల వరుస. ప్రస్తుతం

యుద్ధం జరగడం లేదు. కానీ ఇరు దేశాల మధ్యన పొంతన లేదన్న సంగతి కూడా మరవడానికి లేదు.

హ్యాపీమోన్‌ జేకబ్‌ అనే జె ఎన్‌ యు ప్రొఫెసర్‌ ఒకాయన ఈ మధ్యన ఒక పుస్తకాన్ని వెలువరించాడు. దానిపేరు లైన్‌

ఆఫ్‌ కంట్రోల్‌. జేకబ్‌ అసలే మంచి పేరు లేని ఆ విశ్వవిద్యాలయంలో, రాజకీయాలు బోధిస్తూ ఉంటాడు. మౌలికాంశాలను

బోధిస్తూ ఉంటే చిక్కు లేదు. ఈ పెద్దమనిషి భారత - పాకిస్తాన్‌ సంబంధాల మీద నిపుణుడు. ఈ విషయం గురించి రెండు

దేశాలలోనూ చర్చలు సమావేశాలు జరుగుతుంటాయి, అంటే మనలాంటి వాళ్లకు కొంచెం విచిత్రంగానే తోస్తుంది. సైన్యం

దారి సైన్యం చూస్తుంటే, విద్యావంతులు, పరిశోధకులు మరో పక్కన మాటలు, మంతనాలు సాగిస్తున్నారు, అన్నమాట.

తన రంగం గురించి బాగా తెలుసుకోవాలి కనుక ఈ ప్రొఫెసర్‌ గారు భారతదేశంలోని సైనిక అధికారులను చాలామందిని

కలిసి విషయ సేకరణ చేస్తుంటాడు. పదవిలో ఉన్నవారు అంత సులభంగా మాట్లాడారని, రిటైర్‌ అయినవారు

సులభంగానే ఎన్నో విషయాలు చెబుతారని ఈ పరిశోధకుడు తన పుస్తకంలో వెల్లడిస్తాడు. నేను ఆ పుస్తకాన్ని

కొన్నాను. రెండు మూడు పత్రికలలో సమీక్ష చదివిన తరువాత ఆ పుస్తకం చదవాలి అనిపించింది. కనుక కొన్నాను.

చదివాను కూడా!

పరిశోధకుడు దేశంలో సైన్యాధికారులను మెప్పించి, ఒప్పించి లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంట కొంతకాలం

గడిపి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. ఈలోగా అటువేపు వారిని కూడా రకరకాలుగా బుజ్జగించి,

పాకిస్తాన్‌ వెళ్లడానికి పర్మిషన్‌ తెచ్చుకున్నాడు. అంతేకాదు, సరిహద్దు వెంట అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి

వారితో కలిసి మంతనాలు చేయడానికి కూడా కావలసిన అనుమతులను సంపాదించాడు.

మనదేశంలో లాగే అటు పాకిస్తాన్‌ లో కూడా ప్రజలకు పక్క దేశం ప్రజల మీద నిజంగా ఏవగింపు లాంటివి లేవు.

అయితే రాజకీయంగా అవసరం గనుక, మీడియా వారు అంతకన్నా చేయగలిగింది లేదు గనుక, రకరకాల మార్గాల

ద్వారా అవతలి దేశం మీద అందరికీ గుండెలనిండా అసహ్యం కలిగే పరిస్థితులను, కావాలని తయారు చేస్తున్నారంటే

ఆశ్చర్యం కాదు. ప్రజలకు ప్రజలకు మధ్యన వైరుధ్యం ఉండవలసిన అవసరం లేదు. నేను ఈ రకం మాటలు చెబితే

నన్ను కూడా దేశభక్తి లేనివాడు అని తన్ని తగలేస్తారు. ఇక్కడ దేశభక్తి గురించిన ప్రసక్తి లేనే లేదు. అవతలి దేశంలో

ఉంటున్నవాళ్ళు కూడా మనుషులే. కానీ దేశాన్ని నడిపిస్తున్న వారు మాత్రం బహుశా మనుషులు కారు. ఇది రెండు

వైపులా సత్యమే. వీళ్లకు తగినట్టే మిలిటరీ ఉంటుంది. నిష్కారణంగా లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంట ఇరువైపుల నుంచి

కాల్పులు జరుగుతుంటాయని, అమాయకుల ప్రాణాలను బలికొంటారని అర్ధం కానివ్వరు. హ్యాపీమోన్‌ జేకబ్‌ పుస్తకం

మొత్తం చదివితే విషయం అర్థమవుతుంది.

నిజానికి ఈ వ్యాసంలో నేను చెప్పదలచుకున్నది పాకిస్తాన్‌, భారత దేశాల మధ్యన ఉన్న సంబంధాలను గురించి

కానేకాదు. అందుకే విషయానికి రావడం కష్టం, అన్న ఒక మంచి మాటను ముందే ఉటంకించాను. దేశంలో అందరికీ ఈ

మధ్యన కొంచెం మరుపు పాలయిన దేశభక్తి ఒక్కసారిగా ఉప్పొంగింది. పంద్రాగస్టు, ఛబ్బీస్‌ జనవరి వచ్చాయంటే

పాటలు పాడుతూ, వీధుల వెంట ఊరేగింపులు చేసిన చిన్నతనపు అనుభవాలు గుర్తుకువస్తాయి. తలుచుకుంటే ఒళ్లు

గగుర్పొడుస్తుంది. తరువాత జరిగిన చైనా, పాకిస్తాన్‌ యుద్ధాల సందర్భంగా, దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన దేశభక్తి,

మరొకసారి కళ్లముందు మెదులుతుంది. అప్పటికి నేను అవగాహన లేని కుర్రవాడిని. అయినా దసరా, దీపావళి లాగే

స్వాతంత్రదినం కూడా ఇవ్వాళటికి నాకు పండుగలాగా కనిపిస్తుంది. దసరా, దీపావళి గురించి తెలియని నేటి

యువతరానికి ఇక దేశభక్తి గురించి ఎవరు చెప్పాలి?

మొత్తానికి అందరికీ ఈ గడ్డు సమయంలో, సైనికుల పట్ల తమకు గల భావాలను వ్యక్తం చేయ వలసిన అవసరం ఉందని

అర్ధమయింది. మా వీధి చివరన కూడలిలో బహుశా ఆటోవాళ్లు, మరికొంత మంది కలిసి ఒక జెండా ఎగురవేసి, అక్కడ

దేశభక్తి పాటలు వినిపించారు. కానీ సందర్భానికి తగినట్లు కాకుండా వాళ్లంతా హాయిగా జోకులు వేసుకుని

నవ్వుకుంటున్నారు. అసలు విషయం చెప్పడానికి వాళ్లకు తగిన నాయకత్వం లేదు. నాలాంటివాడు ఎవడైనా

ముందుకు వెళ్లి చెబుతానంటే, బహుశా వాళ్ళు వినే లక్షణం కనిపించదు. వాళ్లను వదిలి పెట్టవలసిందే. ఒక సాయంత్రం

మా కాలనీలోని ఆడవాళ్లు కొంతమంది చేరి, కొవ్వొత్తులు వెలిగించి, వీధుల వెంట నినాదాలు చేస్తూ తిరిగారు.

( నేను వాడిన ఆడవాళ్లు అన్నమాట నాకే బాగుండ లేదు.) స్త్రీ జనం అనడం కన్నా ఇదే కొంత మేలు అనుకున్నాను. వీళ్ళ భావన చాలా బాగుంది. కానీ వీరిలో కూడా సందర్భానికి అవసరమైన సమాచారదృష్టి మాత్రం లేదు. మరేమీ తోచ లేదు

కనుక అదేపనిగా భారత్‌ మాతాకీ జై అంటూ ఉన్నారు వాళ్ళు. అప్పుడప్పుడు ఎవరో కలుగజేసుకుని వి వాంట్‌ జస్టిస్‌ అని

కూడా నినాదాన్ని ఇస్తున్నారు. వాళ్లకు ఏమి న్యాయం కావాలి అన్నది వాళ్లకే తెలియదు. మృతవీరులకు నివాళులు

అర్పిస్తున్నారు కనుక, వారి గురించి నినాదాలు ఉండాలి. చిత్రంగా మన దగ్గర ఏ నినాదం కావలసి వచ్చినా, అది మరొక

భాషలో ఉండాలి. కార్మికుల ఐక్యత వర్థిల్లాలి అనడానికి మజ్దూర్‌ యూనియన్‌ జిందాబాద్‌ అంటారు. ముర్దాబాద్‌ అనే

మాట మరొక చోట వాడుకుంటారు. లేదంటే ఇంగ్లీషులో నినాదాలు చేస్తారు. మన భాష మీద మనకు పట్టు లేదు.

కనుకనే పెద్దపెద్ద మాటలు సంస్కృతం నుంచి అరువు తెచ్చుకుని వాడుకునే పద్ధతి చాలాకాలంగా కొనసాగుతున్నది.

ఇక నినాదాల విషయానికి వస్తే సంస్కృతంలో నినాదాలు ఇచ్చేవారు ఎవరూ, బహుశా అందుబాటులో లేరు. వీర జవాన్‌

అమర్‌ రహే అంటే సరిపోయేది. ఆ రెండు ముక్కలు కూడా వీరికి దొరకలేదు. భారత్‌ మాతాకి జై అన్నారు. ఎవరు ఈ

బారత్‌ మాత? ఇది నా ఇవాళటి విషయం.

విషయానికి చేరుకునే సరికే నాకు అందుబాటులో ఉన్న ఈ పేజీ అడుగుకు చేరుకున్నాను. అయినా మునిగింది లేదు.

భారతమాత అన్నమాట ఒక భావన మాత్రమే. తెలుగులో కొంతమంది భరతమాత అని కూడా రాస్తారు. సంస్కృతం,

వ్యాకరణం తెలిసినవారికి ఇక్కడ ఒక చిక్కు ఎదురవుతుంది. భరతుని మాత భారతమాత. అంటే శకుంతల. ఆమెను

కాదు మనం ప్రార్థిస్తున్నది. భారతదేశం అనే మాతను ఊహించుకుని పూజించుకుంటున్నాము. మాతృదేశం అన్న

భావన మనలో గట్టిగా ఉంటుంది. దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అన్నారు గురజాడ! మరి

ఇప్పుడు ఎవరు ఈ భారతమాత?

భక్తి కావాలంటే అందుకు ఒక ఆలంబన కావాలి. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, అజాయమానుడు అని

ఆయన గురించి ఒక పక్కన చెప్పుకుంటూనే ఆయనకు వేలాది ఆకారాలను ఆపాదించుకుని, అర్చావతారములు

అంటూ పూజలు చేస్తున్నాము. అందులో ఒక దేవుడు సరిపోక లెక్కలేనన్ని దేవుళ్లను తయారు చేసుకున్నాము.

కనుక గజిబిజి పుట్టింది. తెలియజెప్పే వారు లేక కొంతమందికి విషయం అర్థం కావడం లేదు.

అచ్చంగా ఇదే పద్ధతిలో దేశం మీద అభిమానం ఉండాలంటే, ఆ దేశాన్ని ఒక మనిషిగా చూడగలగాలి. దేవుడిని కూడా

మనిషిగా చూసిన మనం, దేశాన్ని, ఒక తల్లిగా చూచి పూజించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అభ్యంతరం అంతకన్నా

ఉండకూడదు.

ఇంకొక తికమక గురించి ఇక్కడే చెప్పుకుంటే పోతుంది. వందేమాతరం అంటూ బంకించంద్రుడు తన నవలలో

వాడుకున్న ఒక పాటను జాతీయగీతం, నేషనల్‌ సాంగ్ గా వాడుకుంటున్నాము. ఏవో కొన్ని విశేషణాలు ఉన్న మొదటి

భాగాన్ని మాత్రమే అవసరం వచ్చినప్పుడు పాడుకుంటున్నాము. సప్త కోటి కంఠ కలకల నినాద అంటూ తరువాత సాగే

చరణాలు ఉన్నాయి, అని కూడా చాలా మందికి తెలియదు. ఇక అసలైన జాతీయగీతానికి వస్తే జనగణమన అధినాయక

అంటూ ఒక పురుషుడిని ప్రార్థిస్తున్నాము. రవీంద్రుని దృష్టిలో ఈ పురుషుడు జార్జి చక్రవర్తి అని నేను ఇవాళ అంటే

అందరూ నన్ను తన్ని తగలేస్తారు. ఎవరు ఈ అధినాయకుడు? భారత మాత అనే భావన ఒక పక్కన ఉండగా ఎందుకు

ఒక పురుషుడిని ప్రార్థించడం? ఆ పురుషుడు ఒక దేవుడు అనుకుందామా? అప్పుడు అంతకన్నా పెద్ద చిక్కు

మొదలవుతుంది? ఆ దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు? రవీంద్రుడు ఏ మతానికీ చెందని ఒక దేవుని గురించి

పాడుకున్నాడు. ఆంత భావనాబలం మనకు ఉన్నదా చెప్పండి! ఈ విషయం గురించి ఇక్కడ నేను ఇంతకన్నా ఎక్కువ

ప్రస్తావించ దలుచుకోలేదు.

అందరూ నాకంటే ఎక్కువ తెలిసిన వారే! ఆలోచించండి! ఆలోచన లేని వారికి కనీసం మీరైనా చెప్పండి! తికమకలో

పడి తెలియకుండా ముందుకు సాగేకన్నా, ఉన్నచోట నిలబడి ఆలోచించడం మేలు కదా!

Saturday, August 8, 2026

మంచు కురిసింది - ఐజక్ బషేవిష్ సింగర్


మంచు కురిసింది

 

ఐజక్ బషేవిష్ సింగర్

 

            ఛెల్మ్ అన్నది వెర్రివాళ్ల ఊరు. అక్కడ పెద్దా చిన్నా అంతా గొప్పవాళ్లే. ఒక రాత్రి అక్కడ ఎవరికో నీళ్ల తొట్టిలో చంద్ర బింబం కనిపించింది. చంద్రుడు ఆ తొట్టిలో పడిపోయాడని చూచినవాళ్లు అనుకున్నారు. తొట్టిమీద గట్టిమూత పెట్టి, మరు రోజు సంగతి చూడాలి అనుకున్నారు. పొద్దున్న మూత తీసి చూస్తే, చంద్రుడు లేడు! ఎవరో దొంగిలించి ఉంటారని తేల్చుకున్నారు. పోలీసులను పిలిచారు. కానీ దొంగ దొరకలేదు. ఛెల్మ్‌వాళ్లంతా చాలా బాధపడ్డారు.

         ఒకసారి, పండగరోజుల్లో సాయంత్రం మంచు కురిసింది. ఊరు ఊరంతా వెండిగుడ్డ కప్పినట్టు అయ్యింది. చంద్రుడు వచ్చాడు. నక్షత్రాలు మిలమిలమన్నాయి. కురిసిన మంచు ముత్యాలు, రత్నాలలాగ మెరిసిపోయింది.

         ఛెల్మ్‌లో అక్కడి పెద్దమనుషుల సంఘం అందరికన్నా తెలివి గలవాళ్లు. వాళ్లు ఊళ్లో అందరికన్నా ఎక్కువ వయసు గలవారు. వాళ్లదే అక్కడ అధికారం. పెద్దలకంతా పెద్ద గడ్డాలు ఉంటాయి. మరీ ఆలోచిస్తారు గనుక నుదుళ్లు కూడా వెడల్పుగా ఉంటాయి.  ఆ సాయంత్రం ఏడుగురు పెద్దలు ఒకచోట చేరి ముఖం మీద ముడతలు పడేటట్లు ఆలోచన మొదలు పెట్టారు. ఛెల్మ్‌కు నిధులు కావాలి. ఎట్లా సంపాయించాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా గ్రోనామ్ ఆక్స్ గట్టిగా అరిచాడు. అందరూ ఆశ్చర్యపడేట్లు అతను ‘మంచు అంతా వెండి!’ అంటూ అరిచాడు.

         'నాకు మంచులో ముత్యాలు కనపడుతున్నాయి!’ అన్నాడు ఇంకొకాయన.

         'నాకు ఏకంగా రత్నాలే కనపడుతున్నాయి!’ మూడవ పెద్దాయన అరిచాడు.

         మొత్తానికి ఛెల్మ్ పెద్దలకు తమ ఊళ్లో నిధి వర్షంగా కురిసిందని తెలిసిపోయింది. అంతలోనే వాళ్లకు చింత కూడా మొదలయింది. ఛెల్మ్‌లో అందరూ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. నిధిని వాళ్లు కాళ్లతో కసపిసా తొక్కుతారు. మరి ఏం చెయ్యాలి? ఒక పెద్దమనిషికి ఆలోచన రానే వచ్చింది.

         'అన్ని ఇళ్లకు వార్త పంపిద్దాము. ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని చెబుతాము. వెండి, ముత్యాలు, రత్నాలను ఏరిన తరువాతే రావాలని ప్రకటిస్తే సరి’.

         పెద్దలకంతా మాట బాగా నచ్చింది. అందుకే అరచేతులు రుద్దేసి ఆ సంగతి తెలియజేశారు. అప్పుడు మత్తు లెకిష్  మరో మాట అన్నాడు. ‘వార్త అందించే మనిషి మరి నిధిని తొక్కుతాడు కదా' అన్నాడు.

         లెకిష్ మాట సత్యమని పెద్దలకు అర్థమయింది. మళ్లీ నుదుట ముడతలు పడేట్టు ఆలోచనలు మొదలయ్యాయి. 

         'తోచింది!’ అన్నాడు గ్రోనామ్ ఎద్దు. ‘చెప్పు మరి’ అడిగారు అందరు.

         'వార్త మనిషి నడుస్తూ వెళ్లకూడదు. అతగాడిని ఒక బల్లమీద పెట్టి పంపితే, అతను మంచును తొక్కడు!’

         గ్రోనామ్ చాలా తెలివిగలవాడు. ఆ తెలివికి సంతోషించి పెద్దలందరూ ఈసారి చప్పట్లు చరిచారు.

         వెంటనే గింపెల్ కోసం వంటశాలకు పంపించారు. కుర్రవాడు వచ్చాడు. వాడిని ఒక బల్లమీద ఎక్కించారు. మరి ఆ బల్ల ఎట్లా కదులుతుంది? వంటశాలలో వంటాయన ట్రైటెల్, దుంపచెక్కులు తీసే బెరెల్, సలాడ్ కలిపే యూకేల్, యోంటెల్ అక్కడే ఉన్నారు. వాళ్లంతా మేకలకు మేత వేస్తున్నారు. ఆ నలుగురూ కలిసి గింపెల్ ఎక్కిన బల్లను ఎత్తుకుపోవాలని నిర్ణయించారు. వాళ్లు బల్లకాళ్లు తలొకరూ పట్టుకున్నారు. గింపెల్ చేతిలో కర్రసుత్తి పట్టుకుని నిలబడ్డాడు. దానితో అతను ఇళ్ల కిటికీల మీద కొడతాడు. ఇక అందరూ బయలుదేరారు.

         ప్రతి ఇంటి కిటికీ మీద సుత్తెతో కొట్టి గింపెల్  ‘ఈ రాత్రి ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రాకూడదు. బయట నిధి కురిసింది. దాన్ని తొక్కకూడదు’ అని చెప్పసాగాడు.

         ఛెల్మ్‌లో వాళ్లకు పెద్దలమీద గౌరవం ఎక్కువ. అందుకే ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఇక అక్కడ పెద్దలు మాత్రం నిధిని సేకరించడం గురించి, దాన్ని వాడడం గురించి ఆలోచనలో ఉన్నారు. నిధిని అమ్మి, బంగారు గుడ్లు పెట్టే బాతును కొంటే బాగుంటుందని ఒక పెద్దాయన చెప్పాడు. ఇక ఒకరోజు కాదు, నిత్యమూ నిధి దొరుకుతుంది.

         మత్తు లెకిష్‌కు మరో ఆలోచన వచ్చింది. ఛెల్మ్‌లో వాళ్లకంతా కళ్లజోళ్లు కొని ఇవ్వాలి. ఇక ఇళ్లు, వీధులు, దుకాణాలు అన్నీ పెద్దవిగా కనిపిస్తాయి! ఛెల్మ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తే మరి పెద్దదే అవుతుంది. అది పల్లె పోయి పట్నం అవుతుంది.

         ఇంకా మంచి మంచి ఆలోచనలు వచ్చాయి. అవి కొనసాగుతుండగానే ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చాడు. పెద్దలంతా కిటికీలోనుంచి బయటకు చూచారు. ఆశ్చర్యం. కురిసిన మంచును ఎవరో కసకసా తొక్కనే తొక్కారు.  ఎవరని చూస్తే, బల్ల మోసిన నలుగురి కాళ్లు అని తెలిసింది.

         ఛెల్మ్ పెద్దలు తమ తెల్లగడ్డాలు పట్టుకుని పీక్కుంటూ, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ నలుగురినీ నడిపించకుండా వాళ్లను ఎత్తుకుని పొమ్మని మరో నలుగురికి చెబితే బాగుండునేమో అనుకున్నారు!

         మళ్లీ పండుగకు మళ్లీ నిధి కురిస్తే అప్పుడయినా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటినుంచే నిశ్చయించుకున్నారు.

         ఛెల్మ్‌లో వాళ్లకు నిధి మిగలలేదు. కానీ, మళ్లీ సంవత్సరం అది కురుస్తుందని ఆశ మాత్రం మిగిలింది. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ తప్పు పోదుకదా!


 

Monday, August 3, 2026

తిండి పిండి ఎన్నో సంగతులు 2 On Food and Starch


తిండి - పిండి

అందరమూ మూడు పూటల బుద్ధిగా కూర్చుని తింటాము.  మరి ఆ తిండి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అదేమన్నమాట? కష్టపడి సంపాదించుకుంటున్నాము. తింటున్నాము అనుకోవచ్చు. ఆలోచన మరింత ముందుకు పోతే తినడానికి పంటలు, జంతువులు ఉన్నాయి కదా అనుకోవచ్చు! పంటలు, జంతువులు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఎందుకు అంతగా దొరుకుతున్నాయి? ఎట్లా ఆ విధంగా అవి పెరుగుతున్నాయి? అన్నవి ఆ తరువాత రావాల్సిన ప్రశ్నలు!

ఈ భూమిమీదికి మనకన్నా ముందు మొక్కలు వచ్చాయి. అవి పెరిగి చెట్లు అయ్యాయి. ఒక చెట్టును గమనిస్తే దాని నిండా రక రకాల ఆకులు ఉంటాయి. అరటి చెట్టు ఆకులు వెడల్పుగా ఉంటాయి. చింత చెట్టు ఆకులు చిన్నవైనా చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం కలిసి ఒక పెద్ద విస్తీర్ణాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి. ఈ ఆకులు మనకు తిండి పెట్టే కర్మాగారాలు అన్న సంగతి చాలామందికి అర్థం అయి ఉండదు. అందుకే మనం సైన్స్‌ గురించి తెలుసుకోవాలి. తినే తిండి గురించి తెలియని వాళ్లకు ఇంకా మిగతా విషయాలు ఏం తెలిసినట్టు లెక్క?

ఆకులలో ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా పిండి పదార్థం తయారవుతుంది. ఇది అటువంటి ఇటువంటి అద్భుతం కాదు! అద్భుతాల కే అద్భుతం! ఆ పిండి కారణంగానే మొక్కలు, పొదలు, చెట్లు, మహా వ ృక్షాలు అన్ని అంతలేసి గా పెరుగుతాయి. ఆ మొక్కలను తిని కొన్ని రకాల జంతువులు పెరుగుతాయి. ఆ జంతువులను మరి కొన్ని జంతువులు తింటాయి. కొన్ని జంతువులు మొక్కలను, జంతువులను అన్నింటినీ తింటాయి. ఇక మనిషి అనే మన జాతి మాత్రం దొరికిన ప్రతి చెత్తా తినే రకం. చాలా రకాల జంతువులు కూడా తినని కొన్ని పదార్థాలను మనం తింటాము. ఈ మాట అంటున్నప్పుడు అసలు సిసలైన సర్వ మానవ సౌభ్రాత ృత్వం కనబడుతున్నది. మనుషులలో కూడా కొంతమంది శాకాహారులు ఉంటారు. శాకము అంటే కూర. ఈ సంగతి వ్యాసం టైప్‌ చేస్తున్న కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ కూడా తెలిసినట్టు లేదు. అది నన్ను కష్టపెట్టి ఏవేవో మాటలు చూపిస్తున్నది. వాళ్ళు కూర సంగతి మరిచిపోయి, కొమ్మలు తింటున్నాము అనుకుని శాఖాహారము అని రాసుకుంటారు. అది తప్పు.

 

మొత్తానికి ప్రపంచంలోని మొక్కల నుండి మహావ ృక్షాలు వరకు, చీమల నుండి మహా మ ృగాల వరకు అన్నింటికీ తిండి పెట్టేది ఆకులు అన్న సంగతి మనం మొట్టమొదట గుర్తించాలి. ప్రాణదాతలు గా గుర్తించి అన్ని రకాల చెట్లకు వినయ విధేయతలను ప్రదర్శించాలి.

ఆకులలో పచ్చని రంగు ఉండడం మరొక అద్భుతం. ఆ పచ్చని రంగును ఆకుపచ్చ రంగు అనే వరకు అది వ్యాపించింది. ఆ రంగు కారణంగానే మనకు పిండి పదార్థం, అంటి తిండి పదార్థం దొరుకుతున్నది అన్నది మరొక అద్భుతం. ఇది కూడా మామూలు అద్భుతం కాదు. మొత్తం జీవ ప్రపంచానికి ఆధారం గా నిలిచిన అద్భుతం. ఆకుపచ్చ రంగుకు కారణం క్లోరోఫిల్‌ అనే పదార్థం. మొదట ఆకులు సూర్యుని వెలుతురును గ్రహిస్తాయి. ఈ విషయాన్ని మనం పట్టించుకున్నట్లు కనిపించలేదు. నీడలో వేసిన మొక్కలు చక్కగా పెరగవు. గోడ పక్కన వేసిన మొక్కలు ఎండ ఎటువైపు ఉంటే అటు పెరుగుతాయి. గోడ వైపు కొమ్మలు కూడా ఎండ వైపు తిరుగుతాయి. ఈ సంగతి ఇంతకుముందు గమనించకుంటే ఇక మీద అయినా గమనించి చూడండి. ఈ ప్రపంచమంతా, కనీసం ఆకు పచ్చని చెట్ల ప్రపంచమంతా సూర్యుని వైపు చూచి పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఎండ మరీ వేడిగా ఉంటుంది. అది నేలను చేరే వరకు కొంత చల్లబడుతుంది. అట్లా చల్లబడిన ఎండ ఆకులకు ఉపకరిస్తుంది. అక్కడ జరిగే కార్యక్రమం వివరాలు ఈరోజు వరకు కూడా పూర్తిగా అర్థం కాలేదు.

1866లో ఆస్ట్రియా దేశంలో ఒక పరిశోధకుడు మొక్కలకు వేడికి గల సంబంధాన్ని మొట్టమొదటిసారి గుర్తించాడు. ఎండా, వేడి ఉంటే కానీ, మొక్కలు పెరగవు అని చెప్పాడు. సముద్రంలో పరచుకొని ఉన్నడెస్మిడ్స్‌, డయటమ్స్‌ వంటి  కొన్ని రకాల చిన్న మొక్కలు మొదలు, మహావ ృక్షాలు దాకా ఈ ఆకు పచ్చని ఆకులు, వెలుగు సహాయంతో పనిచేసే రసాయన కర్మాగారాలు, అంటే కొత్త పదార్థం తయారయ్యే చోట్లు, అని అతను తేల్చి చెప్పాడు. అందరికీ అది వింతగా వినిపించింది. ముందు ఎవరికీ నమ్మకం కలగలేదు.

ఇంటి మీద ఫోటో వోల్టాయిక్‌ సెల్స్‌ పెట్టి సోలార్‌ ఎనర్జీని  గ్రహించి కరెంట్‌ గా వాడుకోవడం కొంతమంది చూసి ఉంటారు. ఇందుకు అసలుసిసలైన నమూనా ఆకులు. వాటిలో కరెంటు పుట్టదు. పిండి పదార్థం పుడుతుంది. ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు కూడా ఆశ్చర్య పడని వారికి ఈ ప్రపంచంలో మరే విషయము ఆశ్చర్యకరంగా కనిపించదు. వారి బతుకులు చాలా పొడిపొడిగా నడుస్తాయి. సైన్స్‌ రుచి తెలియని చీకటి బతుకులను గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే! చీకట్లో కూడా కనిపిస్తున్న భావంతో మనకు తిండి గురించి తెలుసు అనుకుని తింటున్నాము. కానీ పత్రహరితం అనే క్లోరోఫిల్‌ గురించి తెలుసుకుని, ఆకులలో జరుగుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకుని అప్పుడు తిన్నది అన్నం అయినా, లేక మరొకటి అయినా అందులో కొత్త రుచి కనబడుతుంది. దాని పేరే సైన్స్‌ రుచి!

వృక్ష శాస్త్రం అని ఒక ప్రత్యేక విజ్ఞాన శాఖ ఉంది. అది నిన్నమొన్న పుట్టలేదు. కలకాలం గా ఉంది. కానీ అందులోని వారికి చాలా రోజుల వరకు మొక్కలు పెరగడానికి వెలుగు అవసరం, అన్న విషయం అర్థం కాలేదు. ఇంతకన్నా విచిత్రమైన విషయం ఇంకొకటి ఉండదు. సైన్స్‌ తీరు అలాగే ఉంటుంది. ఒక విషయాన్ని ముందుగా ఊహించి, ఆ తరువాత అందుకు సంబంధించిన వివరాలను సేకరించి, ఆ వివరాలలోని సంబంధాలను, వాటికి గల పూర్వాపరాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. ఆహా! అనిపిస్తుంది. ఒక కొత్త సూత్రం పుడుతుంది. ఒక కొత్త అవగాహన కలుగుతుంది. అది సైన్స్‌ రుచి!


 

Saturday, August 1, 2026

లోకాభిరామం - వానొచ్చె వరదొచ్చె : On rain and then Sambaru


వానొచ్చె వరదొచ్చె

పొటుకు - పొట్కు- టపక్‌

ఇల్లంత టపక్‌ పెడ్తున్నాది. పెద్దా పుస్కం తడ్సీ పోతుంది’ అని ఎర్రని గుడ్డలో చుట్టిన ఒక లావుపాటి పుస్తకాన్ని తెచ్చింది బువ్వమ్మ. ఆ పెద్ద పుస్కం పవిత్ర గ్రంథం ఖురాన్‌. తెచ్చిందేమో నిప్పులు కడిగే ఆచార్లవారి ఇంటికి. వాన కాలమంతా ఆ పుస్తకం ఆచార్లవారి ఇంట్లో గూట్లో సురక్షితంగా ఉంటుంది. అక్కడి మిగతా పుస్తకాలు అన్నింటితోబాటు! బువ్వమ్మ ఇల్లు పూరి గుడిసె అనుకుంటాను. ఆచార్ల వారిది మట్టిమిద్దె. అప్పటికి రాతిగోడలు వచ్చినయి కానీ, సిమెంటు కప్పులు రాలేదు.

మట్టిమిద్దె అంటే గోడలు కూడా మట్టివయి, ఆ మీద కప్పు ఉంటుంది. రాతిగోడల మీద కూడా మట్టిమిద్దె ఉంటుంది. దూలాలు లావుగ ఉంటయి. వాటిమీదనుంచి గోడల మీదకు కొంచెం సన్నటి వాట్లు ఉంటయి. (ఈ మాటంటే వేట్లు? అని అడిగాడు నా కొడుకు! మీకు అర్ధమయితే సరే, కాకుంటే వదిలేయండి.) ఆ వాట్లమీద చిలుక చెక్క పరిచి ఉంటుంది. కలిగిన వారయితే పలకలుగా తీర్చిన చిలుకు చెక్కలను, మధ్య ఖాళీలు లేకుండా పరిపిస్తరు. లేదంటే పొయ్యిలోకి కొట్టిన కట్టెలను పేర్చి, మీద గడ్డి పరిచి, ఆ మీద మట్టి వరస వేస్తరు. మట్టిమిద్దెలో ఎండలకు పగుళ్లు వస్తయి. గడ్డి, చిన్న మొక్కలు పెరుగుతయి. చుట్టు గోడలను మిద్దెకన్న కొంచెం ఎక్కువ ఎత్తు వరకు కడతరు. వాటిని కుంబిగోడలు అంటరు. వాటిమీద కూడా పగుళ్లు, గడ్డి మొక్కలు ఉంటయి. వానలు రాబోతున్నయంటే, మొక్క లన్నింటినీ పీకి, చవిటి మన్ను తెప్పించి మిద్దె నిండ పరిపించాలె. మొదటి వానలకే మట్టి తడిసి పరుచుకుంటుంది. దిమ్మిస పీటతో కొట్టి దాన్నంత చదును చేయాలె. వాలు సరిగ్గ వుండేట్లు సరిచేయాలె. ఇదంతా సక్రమంగ జరిగితే పడిన వాననీరు గూనలలోంచి కిందకు పడుతుంది. ఈ పనులు వీలవుతయి, కావు. కుదురుతయి, కుదరవు! ఇంక వాన వచ్చిందంటే చాలు పొటుకు మొదలవుతుంది.

వాతావరణం మారిపోతున్నదని చెప్పడానికి పరిశోధకుల దాక పోనవసరం లేదు. గతంలో వాన కాలమంటే  ప్రతినిత్యం ఉదయం, అస్తమానం వాన కురవవలసిందే. ముసుర్లు పట్టుకుంటే అయిదారు రోజులు ఏకాకారంగా వాన కొనసాగేది. గోనెసంచీ, గొంగడీ కప్పుకుని, అంత దూరం బడికిపోతే ‘సెలవు! వెళ్లిపొండి!’ అనేవారు. ఇంటి కంటే బడి మరింత అధ్వాన్నం. అందునా, మా బడి పక్కనే పెద్ద చెరువు కూడ ఉంది. నీళ్లు గదుల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతటి వానలో ఇల్లు, పూరి గుడిసె అయినా, మట్టిమిద్దె అయినా పొటుకు తప్పదు. పగుళ్లు, మొక్కల వేళ్లుంటే, ఎక్కువగ, లేదంటే, అక్కడా ఇక్కడా మిద్దెలోంచి నీరు ఇంకి చుక్కచుక్కగ పడుతుంది. అదే పొటుకు. మా ఇల్లు నిజంగ తాతల కాలం నాటిది. రకరకాల పాత్రలను ఆ పొటుకు పడుతున్న చోట పెట్టి, నేలన్న తడి కాకుండ జాగ్రత్తపడి, మిగిలిన చోట పండుకోవాలె. పొటుకు మరీ ఎక్కువగా ఉంటె, వానలోనే జాగ్రత్తగ మిద్దె ఎక్కి ఆ భాగంలో తొక్కాలె. చవిటి మన్ను జారుడుగ ఉంటుంది. కాలు జారితే ప్రమాదం! మట్టిమిద్దెలు పోయినయి! పొటుకు మాత్రం మిగిలింది. ఎవరన్నా ఒకేపని గురించి, సంగతి గురించి, తెరిపిలేకుండ అడుగుతూ (నస!) కష్టపెడుతున్నరనుకోండి. దాన్ని పొట్కు-పొటుకు పెడుతున్న రని వర్ణించేవారు. ఆర్‌సీసీ మిద్దెల్లో కూడా లీకులున్నయి. పొటుకుల ఉండే ఉంటయి. ఎండను తట్టుకోవాలని వేసే కూల్‌హోమ్‌ కారణంగ పగుళ్లు వస్తయని చెప్పినరు ఒకరు. మరేమి, అట్లాంటివి జరిగితే పొటుకు తప్పదు!

బల్లి సాంబారు: ఉల్లి సాంబారు అని వేరుగ ఏదయినా ఉంటుందా? సాంబారు వెంగాయం అని చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయని తెలుసు. వాటిని అట్లాగే వేసి సాంబారు వండుతారనుకుంటాను. ‘బిసి బేళె హుళి అన్న’ అంటే వేడి పప్పుపులుసు అన్నం అని అర్ధం. అందులో వెంగాయం అంటే ఉల్లి పాయలు పెద్ద ముక్కలు వేయడం చూచాను. (నిజమే, నాకు తిండి గురించిన చింత ఎక్కువ. ఎర్రోనికి ఏమి చింత? అంటే ఎప్పటికి తిండిమీదనే చింత’ అని ఒక మాట ఉంది. ఈ ఏర్రోడు వెర్రివాడా లేక ఎర్రని వాడా? శివరాజు సుబ్బారావు అనే బుచ్చిబాబుగారు, వరంగల్‌ నవీన్‌గారి పద్ధతిలో పోతున్నది రాత. నా పేరులోనూ ‘బుచ్చి’ ఉంది. వరంగల్లు మీద కావలసినంత ప్రేమ ఉన్నది! అక్కడికే పోవాలె మనం ఇప్పుడు. వరంగల్‌లో ఎమ్‌ఎస్‌సి చదువుతున్నము. మధ్యాహ్నం పూట మొదటి పంక్తి భోజనాలు అయిపోయినవి. అమ్మాయిల హాస్టలు చిన్నది. అక్కడికి కూడా తిండి ఈ హాస్టల్‌నుంచే పోతుంది. అక్కడ కూడ అందరూ తిన్నరు. ఆలస్యమయి రెండవ పంక్తికి వచ్చిన వారు తింటుంటే సాంబారులో బల్లి పడిందని తెలిసింది! అసహ్యం అన్న మాట పక్కనపెడితే తెలియకుండ తిన్నవారికి, రెండవ పంక్తిలోని వారికీ, ఎవరికీ ఏమి కాలేదు! అంతా ఆరోగ్యంగ ఉన్నరు. సంగతి తెలిసిన తరువాత ‘కడుపులో తిరుగుతున్నది!’ అని కొందరు హెల్త్‌ సెంటర్‌కు పరిగెత్తినరు. పరిగెత్తినరంటే ఆరోగ్యంగ ఉన్నరనే గదా అర్థం. డాక్టర్‌ రెడ్డిగారు వాండ్లను పరీక్షించి డైజీన్‌ లాంటి మాత్ర ఏదో ఇచ్చి పంపించినరు. బల్లిని ఉడికించి తింటేనే ఏం కాలేదు. అది మీద పడితే ఏమవుతుంది! ఆ బల్లి అనారోగ్యంగ ఉండి, దాన్ని ద్వారా క్రిములేమైన సోకితే ఏమన్న అవుతుందేమో?ఏమో?

ఉల్లి సాంబారు: మేము (ఇంట్లో) ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనపకాయ లాంటివి తినము. ఛాదస్తమే! అయినా తినము. ఎక్కడన్న ఉల్లిపాయల వంట తిన్నమంటే, తరువాత వాసన తెలుస్తుంది. మాకుండే ఛాదస్తం వెనక కొన్ని పద్ధతులున్నయని చెప్పంగ విన్న. కొన్ని పదార్థాలు చూడడానికి బాగుండవు. కొన్నింటి వాసన బాగుండదు. కొన్ని అర్ధం లేని చాదస్తం! క్యాబేజ్‌ కొత్తగ వచ్చినపుడు నాన్న అడ్వెంచరస్‌ గనుక కొని తెచ్చినడు. అది భయంకరమయిన వాసన.అప్పటి క్యాబేజీతో పోలిస్తే ఇప్పటిది ఎంత మేలో చెప్పలేము. అప్పట్లో పురుగుమందులు ఇంతగ లేవు కనుక ఆకుల మధ్యన పురుగులు కూడ ఉండేవి! ‘కన్న మన్ను తెచ్చి వండమంటరు!’ అని అమ్మ గులుగుడు (గొణుగుడు) నాకు గుర్తుంది. ‘మెప్పులకై కన్నతావు అప్పు వడక’ అన్నారు త్యాగయ్యవారు. కన్న అంటే కనిన అంటే చూచిన అని అర్ధం. అంతేగానీ ప్రసవంతో సంబంధం లేదు. బిడ్డను చూస్తము గనుక అది కానుపు! ‘నిను కన్నది కానుపు’ అని రామదాసుల వారంటే అది చూడడం గురించే, ప్రసవం గురించి కానే కాదు! అందుకే కన్న మన్ను అంటే కనపించిన మన్ను అని.

మళ్లీ, మేము ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనిగెంకాయె తినము (ఈసారి అసలు సంగతే చెప్త!) మా బిల్డింగులో ఒక్కోసారి సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తరు. ఒక్కో ఇంటివారు ఒక వంటకం చేసి తెచ్చి, అందరూ ఒక చోట తినడం అదొక సరదా! మా ఇల్లుగలావిడ, మా యజమాని, మా ప్రొఫెసరు గారు (మాయావిడ, నా భార్య) సాంబారు వండమంటే సరేనని వండింది. అందులో ఆన్యన్‌ అనే ఉల్లిపాయల్లేవు. అయినా చాలా రుచిగ ఉందన్నరు అందరు! ఆనియన్‌ అదే ఆన్యాన్‌ లేకుండా సాంబారు ఎట్లా చేస్తరని అందరూ హాచ్చెర్య పడిపోయేశినరు. తరువాత ఒకటి రెండుసార్లు కూడా సాంబారు తయారీ బాధ్యత మా ఇంటికే వచ్చినట్టు గుర్తు! అన్య అంటే ఇతరము. తమిళంలో అన్యన్‌, అన్నియన్‌ అవుతుంది. అపరిచితుడు ఎందుకు మనకు మన సినిమాలో?

మూడు పైసల నాటకం: అంకుశ్‌ బోర్‌హాడే అనే పేరు మీరు విని ఉండరు. అతను మరాఠీ అయి వుంటడని కొందరికి తోచి ఉండవచ్చు. బెర్ట్‌హోల్ట్‌ బ్రెష్‌ట్‌, జెర్మనీలో ప్రసిద్ధ నాటక రచయిత. అతని పేరును బ్రెఖ్‌ట్‌, బ్రెహ్ట్‌ అని కూడ పలుకుతరు. అతని సాంఘిక నాటకాలు సంచలనం కలిగించినయి. అందులో ఒకదాని అనువాదం ‘ద త్రీ పెన్నీ ఆపెరా’ పోనీ ఓపెరా అనండి! నాకు అభ్యంతరం లేదు. జబ్బార్‌ పటేల్‌ అనే మరాఠీ నాటక కారుడు దానికి అనువాదం కాదు గానీ అనుసరణ చేశినడు. ‘తీన్‌ పైసాచా తమాషా’ అని దాని పేరు. తమాషా అనేది మరాఠీ జానపద నాటక పద్ధతులలో ఒకటి. అక్కడ మొదలయి, ఈ నాటకం సాగుతుంది. అందులో నాయకుని పేరు అంకుశ్‌ బోర్‌హాడే. అతను నాటకం మొదలయిన తరువాత చాలాసేపటి వరకు రంగం మీదకి రాడు. అతనొక రౌడీ, దాదా! పాత్ర వచ్చే ముందు ఆ పేరును ప్రతిధ్వనులతోపాటు హాలంతా కదిలిపోయిందేమో అనిపించే పద్ధతిలో వినిపింపచేసిన తీరు నాకు ఇంకా గుర్తుంది. మనసులో మనం ఒక ఎస్వీ రంగారావును ఊహించుకుంటే, అక్కడ అందమైన యువకుడు ఎదురయ్యినడు. నాటకం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో, అంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. పుణె (పూనా లేక పునహా) బాల గంధర్వ రంగమంచ్‌లో చూచిన నేను. అంకుశ్‌ పెళ్లవుతుంది. హాలంతా రంగు దీపాలు వెలిగినయి. ప్రేక్షకులందరు పెళ్లి వారయ్యినరు! ము! బావుంటుంది, మరాఠీ వారి నాటక విద్య! ఆ హాల్లో నిత్యమూ నాటకం ఉంటుంది. మిగతా చోట్ల సినిమా చూచినట్టే జనం టిక్కెట్లు కొని నాటకాలు చూస్తరు. ఈ అలవాటు మహారాష్ట్రలో ఇంకా కొనసాగు తున్నది. మన దగ్గర హైదరాబాదులో ప్రయత్నం జరిగింది కానీ, కొనసాగలేదు మరి.