Lokabhiramam
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Thursday, June 4, 2026
Wednesday, June 3, 2026
Tuesday, June 2, 2026
గలోష్ - మిఖయిల్ మిఖయిలోవిచ్ జోషెంకో కథ (రష్యా)
గలోష్
గలోష్
మిఖయిల్ మిఖయిలోవిచ్ జోషెంకో
(గలోష్ అంటే చలి
దేశాలలో బూట్లమీదుగా వేసుకునే ఒక ప్లాస్టిక్ తొడుగు)
అది నిజంగానే
సులభం, ట్రామ్లో ఒక గలోష్ను
పోగొట్టుకోవడం గురించి చెపుతున్నాను.
ముఖ్యంగా
నీవొకవేపును పిండేస్తూ ఉంటే ఇక మరొక దుర్మార్గుడు వెనకనుంచి నీ కాలును తొక్కేస్తూ
ఉంటే మరీను. ఒక్కసారిగా ` గలోష్ మాయం.
గలోష్ను
పోగొట్టుకోవడం అంటే కేవలం చాలా సింపుల్.
నా గలోష్ ఊరికే
ఊడి వచ్చింది. రెప్పపాటు, అంటే కంటిరెప్పపాటులోగా అని, మీరు అనవచ్చు.
నేను ట్రామ్లోకి
ఎక్కానా ` రెండు గలోష్లు ఉన్నాయి.
వాటిని ఇంకా నేను చూడగలను. ఎక్కుతూ ` స్థిరం చేసుకోవడానికి అన్నట్టు నేను వాటిని ముట్టుకున్నాను కూడా.
అయినాసరే, నేను దిగే సమయానికి ` ఒకే గలోష్, కనబడుతూనే ఉంది, ఒక కాలిమీద ఉంది,
కానీ మిగతా గలోష్ పోయంది.
నా బూటు అక్కడే ఉంది. ఇక సాక్ను కూడా చూడగలుగుతున్నాను. ఇక నా లాగూ కూడా తన
చోట్లోనే ఉంది. కానీ గలోష్ లేదు.
ఇక ట్రామ్వెంట
పరుగెత్తడం, వీలుకాదుగా.
మిగిలిన గలోష్ను
తీసేశాను, దాన్ని న్యూస్పేపర్లో
చుట్టాను ` ఇక నా దారిన
వెళ్లిపోయాను. ‘పని ముగిసిన తరువాత కొంచెం పట్టించుకుంటాను’ అనుకున్నాను. ‘దాన్ని
అంత సులభంగా వదిలివేయజాలను. అది ఎక్కడున్నా సరే, వెదికి పట్టుకోవాల్సిందే’.
పని ముగిసిన
వెంటనే, ప్రారంభించాను. నాకు
తెలిసిన ఒకానొక ట్రామ్ డ్రైవర్తో మొట్టమొదట మాట్లాడాను.
అతను నా
నమ్మకాన్ని మరింత గట్టి చేశాడు.
నిన్ను నీవు
అదృష్టవంతుడిగా లెక్కపెట్టుకో. నీవు దాన్ని ట్రామ్లో పోగొట్టుకున్నావ్. మరేదయినా
చోటనయితే ఇంత గట్టిగా చెప్పగలిగేవాడిని కాదు. కానీ, ట్రామ్లో మాత్రం నీ గలోష్ ఇప్పటికే దొరికినట్టు లెక్క!
మాకు పోగొట్టుకుపోయిన వస్తువుల గురించి ఒక ప్రత్యేకమయిన ఆఫీసు ఉంది, తెలుసా కేవలం అక్కడికి వెళ్లు, తెచ్చేసుకో. అది దొరికినట్టే’ అతను అన్నాడు.
సరే, థాంక్యూ, నా మెదడులోనుంచి బరువు దిగిపోయింది. గలోష్ నిజానికి కొత్తది తెలుసా. దాన్ని ఓ
రెండు సంవత్సరాలుగా మాత్రమే వేసుకుంటున్నాను’ నేనన్నాను.
మరుసటి నాడు నేను
ఆ ఆఫీసుకు వెళ్లాను. ‘అన్నలారా, నా గలోష్ నాకు తిరిగి దొరికే అవకాశం ఏమయినా ఉందా? అది ట్రామ్లో నానుంచి దూరమయింది’ అడిగాను.
తప్పకుండా,
ఏ రకం గలోష్ అది? వాళ్లు అడిగారు.
ఒక మామÖలురకం గలోష్. సైజు పన్నెండు’ నేను చెప్పాను.
మా దగ్గర
పన్నెండువేలు, పన్నెండు సైజువి
ఉన్నాయని మా వాళ్లన్నారు. గుర్తించడానికి వీలుగా ఏదయినా చెప్ప్పు.’
దాన్ని
గుర్తించడానికి లక్షణాలు చాలా మామÖలు రకం. మడమ దగ్గర కొంచెం మురికి పట్టింది. ఇక లోపల లైనింగ్ లేదు. లైనింగ్
అరిగిపోయింది.
మా దగ్గర, అటువంటి గలోష్లు వెయ్యి ఉన్నాయని, మా వాళ్లంటున్నారు. గుర్తించడానికి ప్రత్యేకంగా
ఏమయినా సమాచారం ఉందా?
ఉన్నాయి, ప్రత్యేకమయిన లక్షణాలు. వేళ్ల దగ్గర ఇంచుమించు
చిరిగి ఉంది ` అది
వేలాడుతున్నట్టు ఉంది. ఇక మడమ ఉండీలేనట్టు ఉంది. అడి బాగా అరిగిపోయింది. కానీ
సైడ్స్ మాత్రం మరీ అంత పాడవలేదు. అవి ఇంకా ఒక్క ముక్కగానే ఉన్నాయి’ నేనన్నాను.
కాసేపు కూచో,
వెంటనే వెళ్లి చూస్తాం’
వాళ్లన్నారు.
కొంచెంసేపయినా
కాకముందే వారు నా గలోష్తో వెనక్కు వచ్చేశారు. నాకు పట్టరాని సంతోషం అయ్యింది. మరీ
కదిలిపోయాను. ‘అవును, వీళ్ల పద్ధతులు
చాలా బాగా పని చేస్తున్నాయి. ఎంత మర్యాదగల మనుషులు వీళ్లు’ అనుకున్నాను. ‘ఒక్క
గలోష్ కొరకు ఇంత కష్టపడుతున్నారు’ అనుకున్నాను.
అంతులేని థాంక్స్,
నేను బతికి ఉన్నంతకాలం’
నేనన్నాను. ‘దయచేసి నాకిచ్చేసేయండి, వెంటనే కాలికి వేసుకుంటాను. నిజంగా ధన్యవాదాలు’
లేదు, డియర్ కామ్రేడ్, వాళ్లన్నారు. ‘అంత సులభంగా కుదరదు. మాకు ఎలా తెలియాలి’
వాళ్లన్నారు కదా. ‘ఇది నీవు పోగొట్టుకున్నదే అని’
అది తప్పకుండా
నాదే. నా గౌరవం సాక్షిగా మాట ఇస్తున్నాను’
నేను అన్నాను.
మేం నిన్ను
నమ్ముతాము. ఇక మీ పట్ల మా సానుభూతి కూడా ఉంది. కానీ బహుశా నీవు పోగొట్టుకున్నది
ఇదే గలోష్ కావచ్చు. కానీ, మేం దాన్ని అలాగ ఇవ్వడానికి లేదు. నీవు నిజంగా గలోష్ పోగొట్టుకున్నట్టు
సర్టిఫికెట్ మాకు అవసరం. ఈ సత్యాన్ని నీవు మీ హౌస్ మేనేజ్మెంట్ ఆఫీసు నుంచి
ధృవీకరించుకురావాలి. అప్ప్పుడు ఇక ఏ ఆలస్యమÖ లేకుండా, నీవు న్యాయంగా పోగొట్టుకున్న వస్తువును నీకు తిరిగి ఇస్తాము.’
కానీ అన్నలారా,
ప్రియమయిన నా కామ్రేడ్లారా,
ఈ వాస్తవం గురించి ఆఫీసులో
ఎవరికీ తెలియదు. వాళ్లు సర్టిఫికేషన్ ఇవ్వకపోవచ్చు’ నేను చెప్పాను.
అవును, ఇస్తారు, అదే వాళ్లపని. మరి ఇక వాళ్లు ఉన్నది దేనికి? వాళ్లన్నారు.
నేను గలోష్ వేపు
మరోసారి చూచి వచ్చేశాను.
మరుసటినాడు నేను
మా ఆఫీసు పెద్ద దగ్గరికి వెళ్లాను.
నాకు ఒక
డాక్యుమెంట్ ఇవ్వండి, లేదంటే నా గలోష్
పోయినట్టే’ అన్నాను.
ఆహా, నీవు నిజంగా దాన్ని పోగొట్టుకున్నావా లేక తమాషా
చేస్తున్నావా? ఊరికే ఒక ముక్కను
సంపాదించుకోవాలని పథకం వేస్తున్నావేమో? ఆయన అన్నాడు.
దేవుని మీద ఒట్టు,
దాన్ని నేను
పోగొట్టుకున్నట్టు’ నేను చెప్పాను.
కేవలం నీ మాట
ఆధారంగా, నేను ఇవ్వలేనన్నది, చెప్పనవసరం లేని సంగతి’ ఆయన అన్నాడు. ‘ఇక
ఇప్ప్పుడు నీవు ట్రామ్ డిపోనుంచి గలోష్ పోగొట్టుకున్నట్టు ఒక సర్టిఫికేషన్
తీసుకువస్తే, నీకు నేను ఒక
డాక్యుమెంట్ ఇవ్వగలుగుతాను. లేకుంటే, నా వల్ల కాదు.’
కానీ వాళ్లే నన్ను
మీ దగ్గరికి ఊరికే పంపించారు.’
మరయితే, ఒక స్టేట్మెంట్ రాయి’ అన్నాడాయన.
ఏమని రాసేది?
ఫలానా ఫలానా రోజున
ఒక గలోష్ పోయింది అని రాయి, ఇక విషయం తేలేవరకు నేను పైన ఇచ్చిన చిరునామాలోనే ఉంటానని మాట ఇస్తున్నాను అని
కూడా రాయి’ చెప్పాడాయన.
నేను స్టేట్మెంట్
రాశాను. మరుసటి నాడు నాకు అఫీషియల్గా సర్టిఫికేషన్ అందింది.
దానితో నేను
ఆఫీసుకు వెళ్లాను, ఇక అక్కడ, మీరు ఊహిస్తారో లేదో, ఏ మాత్రం నస లేదా ఆలస్యం లేకుండా, వాళ్లు నా గలోష్ను నాకు ఇచ్చివేశారు.
కానీ ఇక నా గలోష్
నా కాలిమీదికి వచ్చిన తరువాత నేను మరీ పొంగిపోయాను. అవును, వీళ్ల పద్ధతి బాగా ఇంకా నిజంగా పని చేస్తుంది! అనుకున్నాను.
ఒక వెనకబడిన దేశంలో నా గలోష్ గురించి వీళ్లు ఇంతకాలం, కష్టం ఖర్చు చేయడం గురించి మీరు ఊహించగలరా? లేదు, వాళ్లు దాన్ని ట్రామ్లోనుంచి బయటకు విసిరి ఉండవచ్చు ` అంత సులభంగాను. కానీ ఇక్కడ మాత్రం, ఒక వారంలోపల అది నాకు తిరిగి చేరింది. ఎంత మంచి వ్యవస్థ!
కానీ కష్టం
ఏమిటంటే, వారం రోజుల పాటు ఈ రావడం,
పోవడాలతో, నేను మొదటి గలోష్ను పోగొట్టుకున్నాను.
న్యూస్పేపర్లో
చుట్టి దాన్ని చంకలో పెట్టుకుని మోస్తూనే ఉన్నాను. ఇక దాన్ని ఎక్కడ వదిలానన్నది
మాత్రం గుర్తులేదు. ట్రామ్లో మాత్రం కాదు ` అదే పెద్ద సమస్య. దాన్ని నేను ట్రామ్లో పోగొట్టుకోలేదన్నది
నిజంగా సిగ్గుచేటు ` ఇక ఇప్ప్పుడు నేను
దాన్ని ఎక్కడ వెతకాలి?
కానీ మిగతా గలోష్
నాకు చిక్కింది. దాన్ని నేను అల్మారామీద పెట్టాను.
కాస్త మనసు బాగా
లేనప్ప్పుడు, నేను గలోష్ వేపు
చూస్తాను. ఇక నా మనసు తేలికవుతుంది. వ్యవస్థ చాలా గొప్పదని నాకు నేనే
చెప్ప్పుకుంటాను.
(1927లో ప్రచురించిన
కథ)
Monday, June 1, 2026
లోకాభిరామం : సైన్స్ కూడా నమ్మకమే
సైన్స్ కూడా నమ్మకమే
సైన్సు- గండుచీమ : నాకు సంగీతం చీమ కుట్టిందని, ఒకానొక సారి అన్నట్టు గుర్తు. నాకు సాహిత్యం చీమ కూడా కుట్టింది. వీటన్నింటికీ మించి సైన్సు అనే గండుచీమ రక్తం వచ్చేదాకా కుట్టింది. ‘మీరు కొందరిని మతోన్మాదులు అంటున్నారు. వారు మనలను సైన్సు ఉన్మాదులు అంటారేమో చూడండి’ అని అడిగేంత ఘాటుగా కుట్టింది ఆ చీమ. ఈ మధ్యన ఏదో రాతకు తయారవుతున్న ప్రయత్నంలో భాగంగా, మనం మేలుకుని ఉన్నా, నిద్ర పోయినా, అంతా బయోకెమిస్ట్రీ, అని వాక్యం రాసుకున్నాను. నాకు ఈ ప్రపంచమంతా సైన్సుగానే కనపడుతుంది. మిగతావారికి అట్లాగ ఎందుకు కనిపించడం లేదని, అనుమానం కూడా వస్తుంది.
మనం ఉందనుకుంటున్న ఈ విశ్వం,
అందులో సౌరమండలం, అందులో భూమి, అందులో జీవం,
అందులో మనం మొదలైనవన్నీ మన,
(మనలాంటి వారే అయిన తరతరాల మనుషుల) మెదడుల్లో నుంచి
పుట్టిన అవగాహనలు. ఆలోచనలు పుడతాయి. వాటి గురించి ప్రయోగాలు జరుగుతాయి. కొన్ని
విషయాలకు రుజువులు దొరుకుతాయి. అవన్నీ కలిపి సైన్సుగా నిలుస్తాయి. భౌతిక ప్రపంచంలో
కూడా పదార్ధంగా, యదార్ధంగా ఉన్నవాటిని
గురించిన సైన్సు ఒక భాగం. కేవలం అనుభవంలో మాత్రమే ఉండే ఆలోచనలు,
సిద్ధాంతాలు కూడా ఒక భాగం! ఇది కూడా సైన్సే!
వీటన్నింటికీ, ప్రపంచమంతటా ఆయా
పరిస్థితుల్లో ఒకేరకమైన అనుభవాలు, ఆధారాలు దొరుకుతాయి.
కనుక అది ఒక సైన్సు!
ఈ మన మెదడు (మెదడుల)లోనే మరికొన్ని
ఆలోచనలు మొదలవుతాయి. అవి అందరికీ ఒకే రకంగా అనుభవంలోకి రాక పోవచ్చు. వాటికి
ఆధారాలు అందరికీ ఒకే రకంగా అందవు కూడా! ఆలోచన ధోరణి, మెదడు మొదలైన సైకాలజీ దీనికి మొదటి ఉదాహరణేమో?
విశ్వం ఉందని అందరూ అంటున్నారు గనుక
మనమూ ఉందంటున్నాం. అది నిజంగా ఉందని ఎవరూ చూడలేదు. ఉందన డానికి చెపుతున్న లెక్కలు,
ఆధారాలు మొదలైనవి అందరికీ ఒకేలాగ అర్థం కావడంలేదు.
సైన్సు చదువుకున్న వారికి కూడా సైన్సు అర్థం కాలేదు. సైంటిస్టులం అంటున్నవారు కూడా
సైన్సు వేరు, బతుకు వేరు
అనుకుంటున్నారు. నమ్మకాలు మెదడు లోనే పుడతాయి. అనుభవాలూ మెదడులోనే పుడతాయి. వాటిలో
ఒకదానికి ఒకటి జోడించి చూడడం చేతగాదు. అంతా గజి బిజి గందర గోళం అవుతుంది. ఏది ఉంది,
ఏది లేదు తేల్చుకోలేము. బతుకంటే భౌతిక శాస్త్రం,
కెమిస్ట్రీ అంటే నవ్వుతారు మరి. నవ్వేవారి తప్పు
లేనేలేదు. వారలకు అంతగా చీమ కుట్టలేదు మరి. సైన్సయినా,
మరోటయినా ఉందనుకుంటే ఉంది. లేదను కుంటే లేదు.
ఒక మిత్రుడెవరో చాలాకాలం తరువాత
కనబడతారు. ఎవరెవరి గురించో అడుగుతాము. ఫలానా వాడు ఎక్కడా?
అంటే ‘అయ్యో! తెలియదా?
వాడుపోయి నాలుగేళ్లయింది!’ అంటాడా మిత్రుడు. మనమేమో
ఆ ‘ఫలానా’ ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనుకుంటున్నాము. ఆయన పోయి నాలుగేళ్లయినా,
మనకు మాత్రం ఆ క్షణాన్నే పోయాడు. అసలా సంగతి
గురించి ఇంకా నమ్మకం కుదరదు. భౌతికమైన మనిషి సంగతే ఇట్లాగయితే,
ఉన్నామో లేదో, ఎవరికీ తెలియని
అనుభవైక వేద్యాల సంగతేమిటి?
తరం-తరం: మా తాతయ్య పుస్తక
ప్రియులు. ఆయన వదిలి వెళ్లిన పుస్తకాలే అందుకు నిదర్శనాలు. ఎనిమిది రకాల
రామాయణాలున్నాయి ఆయన లైబ్రరీలో. తాతయ్య పుస్తకాలలో టూరిజం,
సైన్సు(!) రకం పుస్తకాలున్నాయని గమనించాను. ఆ
కాలంలోనే ఆధునిక వైద్యం, ఆరోగ్యం లాంటి విషయాల
మీద పుస్తకాలు వచ్చాయని, వాటిని తాతయ్య తెచ్చి
చదువుకున్నాడని తెలిస్తే ఈ ‘తిక్కదనం’ నాటి నుంచీ ఉందని అర్ధమైంది. మ్యాజిక్,
గుర్రాల పెంపకం, ఆయుర్వేదం, చిట్కా వైద్యం లాంటి విషయాల గురించి కూడా తాతయ్య
పుస్తకాలు సేకరించి పెట్టుకున్నాడు. నాకు చేతనయినంత కాలం ఆయన పుస్తకాలను నేను కాపాడుకున్నాను.
చదువు పేరిట ఇల్లు వదిలి, తిరిగి వచ్చేసరికి,
ఇంట్లో పుస్తకాలు మిగలలేదు. మిగిలినవి పుస్తకాల లాగ
లేవు. అది గమనించి నేను పడ్డ బాధ వర్ణనాతీతం.
నాన్న సంప్రదాయ విద్య బాగా
చదువుకున్న వ్యక్తి. కాని ఎందుకో ఆయన లైట్ రీడింగ్ మీద మాత్రమే మనసు పెట్టినట్టు
గమనించాను. ఆయన కొన్న పుస్తకాలన్నీ ఇంచుమించు అదే రకం. అవి కూడా మిగలలేదు.
సంవత్సరాల తరబడి సేకరించిన చందమామలు, నవలలు మాయమయినవి.
నాన్న, నేనూ ఆ విషయంగా పెద్ద
బాధపడినట్టు లేదు.
నాన్న సాంప్రదాయం మనిషే. అయినా
పిసరంత కూడా ఛాదస్తం లేదు. ఎమ్మెస్సీలో క్లాస్మేట్స్ (గరల్స్) ప్రోద్బలంతో నేను
మీసాలు పెంచుకున్నాను. ఇంటికి వెడితే అది చూచి తంతారేమోనని భయం. తలవంచుకుని
ఇంట్లోకి వెళుతున్నాను. అరుగు మీద కూచున్న నాన్న నా ముఖంలోకి చూసి ‘భేష్ బాగుందిరా
నాన్నా!’ అని నిజంగా మెచ్చుకున్నారు. మూన్ ఫేస్ అంటారే! ఇంచుమించు అమ్మాయి ముఖం
నాది. పైగా రంగు. మీసాలతో మగతనం కనిపించిందని వ్యాఖ్య! అదీ నాన్న పద్ధతి.
చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతుంటే నేను ఎడతెరిపి లేకుండా
‘అదేమి? ఇదేమి’ అని ప్రశ్నలడగాలి. ఆయన సమాధానాలు చెబుతారు. కొన్ని
ప్రశ్న తరువాత ‘చల్ బే (పోరా!)’ అంటారు. అది మాకు ఒక ఆట! నాకు బాగా గుర్తుంది! ఆ
రకంగా ఆయన వెంట తిరుగుతూ ఎన్ని సంగతులు తెలుసుకున్నానో మరి! డిటెక్టివ్ నవలలు
చదివితే పరిశీలన, విశ్లేషణ
అలవాటవుతాయని నాన్న చెప్పాడు. పైగా నాన్న చర్చకు, ప్రశ్నలకు అవకాశం కల్పించాడు. నాకు మరీ ధైర్యం ఎక్కువైంది
కూడా. కొన్ని సందర్భాల్లో ‘నాకు తెలిసింది ఇంత. మా పెద్దలు చెప్పింది, వారికి తెలిసింది ఇంతే!’ అని
ఓటమిని కూడా అంగీకరించే వాడు నాన్న! నాన్నకు నేనివాళ కృతజ్ఞత చెప్పగలనా?
నాకు ఎమ్మెస్సీలో గోల్డ్మెడల్
వచ్చిందని అమ్మ ఒక పండుగ పథకం వేసింది. బంధువులు మిత్రులు అందరూ వచ్చారు. పూజ
(సత్యనారాయణ వ్రతమా?) ఏర్పాట్లు అయినయి.
‘రా! కూచో!’ అన్నది అమ్మ! ‘అమ్మా, నాకు మనస్థిమితం
కుదరదు. పిచ్చి ఆలోచనలు వస్తాయి. అట్లా చేయడం తప్పుగాదా?
అని అడిగాను. అందరూ నచ్చచెప్పే ప్రయత్నాలు
చేస్తున్నారు. నాన్న మాత్రం ‘వాణ్ని వదిలిపెట్టండి’ అని అమ్మతో తాను పూజకు
కూర్చున్నాడు. ‘మా వెనక కూచుని చూడు!’ అన్నారు అంతే! నాన్న ఒకనాడు కూడా ‘ఈ విషయం
మీరు చేసి తీరాల్సిందే’ అని చెప్పిన గుర్తులేదు మాకెవరికీ!
తరం మారింది: సైన్సు ప్రకారం
బతకడమని ఒకటుందని చాలామంది సైంటిస్టులకే తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణం గురించి
పరిశోధించడానికి వెళ్లిన ఒకాయన బురద నీళ్లలో స్నానం చేశాడని యూనివర్సిటీ రోజుల్లో
చెప్పుకున్నారు. అట్లాగని, మతాన్ని,
నమ్మకాలను కాదనడం సైన్సనుకుంటున్నారేమో?
మతం వ్యక్తిగతం, సైన్సు సార్వజనీనం! పరిశీలన, ప్రయోగం లాంటి అంచెలతో సాగుతుంది సైన్సు పద్ధతి! అది
వంటబట్టడానికి సైన్సు చదవనవసరం లేదు.
నాకొడుకు మరీ చిన్నవాడుగా
వున్నప్పుడు, వాడూ, నేనూ మాత్రమే మహబూబ్నగరం దాకా బస్సులో ప్రయాణం చేయవలసి
వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది గానీ, పిల్లలిద్దరూ చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారితో నేను తెగ గోల
చేసేవాడిని. బస్సులో గోల చేయలేదు గానీ! నేనూ నా కొడుకు మాట్లాడుతునే ఉన్నామని
తర్వాత అర్థమైంది. వాడికి బయట తిరగడం అదే కొత్త! కనిపించిన ప్రతి సంగతి గురించీ
ప్రశ్నలడుగుతాడు. నాకు తెలిసింది నేను చెబుతాను. పాలమూరు అనే మహబూబ్నగర్ దగ్గరయింది.
పక్కనకూచున్న పెద్దాయన, ఊరి మొదట్లోనే
దిగడానికి సిద్ధమయ్యాడు. దిగబోతూ నావేపు చూచి ‘ఒక మాట చెప్పనా’
అన్నాడు. ‘చెప్పండి’ అన్నాను. ‘మీ కొడుకుకు చాలా
తెలివి ఉంది. మీకు అంతకన్నా ఎక్కువ ఓపిక ఉంది’ అన్నాడాయన! నేనీ సంగతి గురించి
వ్యాఖ్యానించను.
కవిసమ్మేళనం-కొబ్బరి పచ్చడి: పుస్తక
మేళాలో ఈ సంవత్సరం స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది మిత్రులు కనిపించారు
కూడా. అక్కడ కవిసమ్మేళనం జరుగుతుందని మైకులో చెపుతున్నారు. పాల్గొంటున్న కవులందరూ
మిత్రులు, కనీసం పరిచితులు. ఈ
సంగతే నాతో ఉన్న మా అమ్మాయితో చెప్పాను కూడా. వేదిక ముందుకు వెళ్లేసరికి కవులంతా
వేదికను అలంకరించారు. అంటే వేదికను ఎక్కారని అర్థం. కొంచెంసేపు ఉండి
వెళ్లిపోదాములే! అంటున్నాను అమ్మాయితో. ఇంతలో ఫోను మోగింది. దూరం వచ్చి వింటే
‘ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయమంటారా సార్’ అని ప్రశ్న. వంటాయన! రామాయణంలో పిడకల
వేటలాంటి టైటిల్ గుర్తువచ్చింది. సైన్సుకూ, ఈ ముక్కకూ సంబంధం
లేదని మనవి!
Friday, May 29, 2026
నక్షత్రాలు ఏమయినయి ?
నక్షత్రాలు ఏమయినయి?
చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడ పల్లెకు పోయి ఆరుబయట పండుకుంటే
ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేటివి. పట్నం జేరిన తరువాత
నక్షత్రాలు కనిపించడం కరువయిపోయింది. అందుకు కారణం కాంతి కాలుష్యం అని సులభంగనే
చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడ వెదజల్లబడి అక్కడ
చుక్కలు మనకు కనిపించకుండ చేస్తున్నయి. ఈ వెలుగుల కారణంగ ఆకాశం వెలుగుతున్నది అని
అర్థం.
నక్షత్రాలను,
అంతరిక్షంలోని ఇతర అంశాలను పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు, ఇదంతా పెద్ద సమస్యగ
చాల కాలంగనే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూచినరు.
అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూచినట్టు చూడలేవు. కనుక
వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాలకంటే వేరుగ ఉంటయి. మనిషి వెలుగులు మరి
ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు అంటే
ప్రయోగాలు మొదలయ్యనయి.
జర్మనీ
దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగ
పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నరు. అటువంటి ఒక పట్టణంలో ఆకాశం
బాగ వెలుగుతుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తయి. ఆ తరువాత అంతగా వెలుగులేని
నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగ మనిషి కండ్లు గూడ
చూడగలుగుతయి అంటున్నరు. కనుక మనుషులు ఆకాశంలోకి తొంగి చూచి ఈ పటాలలో కనిపించే తీరు
వారికి కనిపిస్తున్నదా లేదా అన్న అంశాన్ని బేరీజు వేసుకుంటరు.
2011 సంవత్సరంలో
మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నరు. ఎక్కడికక్కడ ఆకాశంలో
వెలుగులను నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశినరు. ప్రాంతానికి ప్రాంతానికి మధ్య
తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా
ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చినరు. అటు ఉత్తర అమెరికాలో ఈ
కాలుష్యం 10% కంటే ఎక్కువగ ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడ చాల ఎక్కువ గద. మొత్తానికి మొత్తం
ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు
కనుగొన్నరు.
మామూలుగ
ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం
అంచెలంచెలుగ పెరిగిపోతుంది. అదేదో చక్రవడ్డీ పెరిగినట్టు పెరుగుతుంది. ఏటా పది
శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం
సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట.
కైబా
గారు అనుచరులతో కలిసి ఈ మధ్యనే సైన్స్ అనే పత్రికలో ఒక పరిశోధన పత్రాన్ని ప్రకటించినరు.
ఒకరికి ఎవరికో మొదటి రోజుల్లో 250 నక్షత్రాలు కనిపిస్తే ఆ
వ్యక్తికి 18 సంవత్సరాలు వయసు వచ్చే లోపల
కేవలం 100 నక్షత్రాలే కనిపిస్తయి అని
లెక్క తేల్చినరు. ఆ సమయంలో ఆకాశంలో వెలుగు నాలుగంతలు పెరిగిపోయిందని అర్థం.
అటు
అంతరిక్ష నౌకలో వారు మాత్రం, ఏటేటా రెండు శాతం పెరుగుదలను మాత్రమే గమనించినట్లు
చెప్పినరు. అది అసలు నిజం పరిస్థితి కానే కాదు. ఉపగ్రహాలు తమ లెక్కలలో చాలా తక్కువ
మార్పులు మాత్రమే చూపిస్తున్నయి, అని కైబా బృందం వారు నిస్సందేహంగ తేల్చివేశినరు.
అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించని కనిపించవేమో అంటున్నరు.
టెక్నాలజీ
లో వస్తున్న మార్పుల కారణంగ ఈ కాలుష్యం బాగ పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చినరు.
ఒకప్పుడు వీధి దీపాలలోని ఎర్రని వెలుగు ఒక రకంగ ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి బల్బులను
వాడుతున్నరు. అందులో నుంచి వచ్చే కాంతి కొంత నీలంగ ఉంటుంది. నీలం వెలుగు సులభంగ
పరుచుకుంటుంది. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మాత్రం ఈ రకం వెలుగును అంతగా
చూడలేవు. పైగా అవి నగరాలలోని వెలుగును మాత్రమే బాగా చూడగలుగుతయి. ఇళ్లలో నుంచి
కిటికీలోనుంచి బయటకు వచ్చి అదే తలంలో పరుచుకునే వెలుగును మనుషులు బాగా
చూడగలుగుతరు. దాని ప్రభావానికి సులభంగా గురవుతరు.
ఇటువంటి
వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు మొక్కల మీద
కూడా ఈ వెలుగు ప్రభావం బాగ ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస
మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతయి. చివరకు మిణుగురు పురుగులు కూడ ఈ వెలుగుకు
తికమక పడతయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగ
ఉంటుంది.
వాతావరణం
వేడెక్కుతున్నది అని ఒక పక్కన గోల చేస్తున్నరు. ఈ వెలుగు కాలుష్యం కూడా అదే
పద్ధతిలో ప్రపంచమంతటా పరుచుకుని ఉంటుంది. ఎవరికి వారు దీని నుంచి బయటపడే మార్గం
లేనేలేదు. వాతావరణం వేడెక్కడం కూడ ఇదే పద్ధతిలో ఏటా పది శాతం ప్రకారం పెరిగి ఉంటే
తప్పకుండ దానిమీద తీవ్రమైన ప్రయత్నాలు జరిగి కొంతవరకు అదుపు కూడా వీలయి ఉండేది. ఈ
కాంతి కాలుష్యాన్ని ఎవర పట్టించుకోవడం లేదు.
నిజానికి
రాత్రిపూట ఎక్కువ వెలుగు ఉంటే భద్రతగ ఉంటుంది అని చాలామంది భ్రమ పడుతున్నరు.
వెలుగు బాగ ఉన్నందుకు రాత్రిపూట దారుల మీద ప్రమాదాలు తక్కువ కావచ్చు, నిజమే. అయితే ఆ రకమైన రక్షణ అనుకున్నట్టు జరగడం లేదు అని
పరిశోధకులు అభిప్రాయం. పుడుతున్న ఈ వెలుగులు నిటారుగ ఆకాశంలోకి వెదజల్లబడతయి కానీ, మామూలుగ కిందికి సాగవు.
ఆకాశం
మళ్ళ మొదటిలాగ కనిపించాలంటే ఏం జేయాలె అన్నది ఒక ప్రశ్న.
అంతర్జాతీయ
చీకటి ఆకాశం సంఘం అనేది ఒకటి తయారయి ఉందని, అది తీవ్రంగ పనిచేస్తున్నదని మామూలు
మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగ వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ
ప్రచారం చేస్తున్నరు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు కిందకు మాత్రమే రావాలె అని
వారు సలహా ఇస్తున్నరు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడ చెబుతున్నరు.
వెలుగు
కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాల అవసరం. ఇంటి బయట రాత్రంత అనవసరంగ
వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ
స్థానికంగ చర్చించి అక్కడి పరిస్థితులకు అనుకూలంగ ఏర్పాటు చేసుకోవాలె. అందర
చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు.
కాంతి
కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగ అంచనా వేసేందుకు లేదు. ప్రకృతి అందం పాడుగాకుండ
ఈ వెలుగులను వాడాలె. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్న అందమైన దృశ్యం. దాన్ని చేతనయినంతవరకు
కాపాడుకోవాలె. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగ గుర్తించి
పరిశీలించాలె. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతయినా
చెప్పగలుగుతరు. రాత్రి ఆకాశం నిజంగా అందమయినది.
కాంతి
అన్నది పరిశోధకులకు మాత్రమే సమస్య కాదు. పట్టణాలలో బతికే వారికి ఈ సమస్య గురించి
అసలు తెలియనే తెలియదు. ఆకాశంలో నక్షత్రాలు ఉంటయి అన్న సంగతి వాళ్ళు మరిచిపోయినరు.
రాత్రి చీకటి ఆకాశము మనకెంతో అవసరం. పొద్దు మూకితే చాలు ఆ అందాలు కనిపించే
ఏర్పాట్లను మనం జాగ్రత్తగ చేసుకోవాలె. వీలయినప్పుడంత నగరాల వారు కూడ దూరంగా వెళ్లి
నక్షత్రాలను చూచి ఆనందించడం నేర్చుకోవాలె.
Thursday, May 28, 2026
Tuesday, May 26, 2026
లోకాభిరామం : అహమదాబాద్ లో On my Ahmedabad visit
లోకాభిరామం : అహమదాబాద్ లో
పార్లమెంట్ ఎన్నికలకన్నా చాలా ముందు
అంటే మార్చి నెల చివర్లో నేను ఒక వారంపాటు ఉత్తర భారతదేశంలో తిరిగాను. అది
నిజానికి విహారయాత్రగా పథకం ప్రకారం చేసిన ప్రయాణం కాదు. మరొక అవసరం మీద ఒక
పెద్దమనిషి బయలుదేరితే అతనితోపాటు నేను కూడా వెళ్లి తిరిగాను. మొదట అహమదాబాదు
వెళ్లాము. అక్కడి నుంచి రిషికేశ్, కురుక్షేత్ర, షిమ్లా, ఆ తర్వాత దిల్లీ. అంటే ప్రయాణం కనీసం ఐదారు రాష్ట్రాలలో
సాగింది అని అర్థం. వెళ్లిన ప్రతిచోట అనుభవాలు గొప్పగానే ఉన్నాయి. వాటన్నిటిని
గురించి చెప్పుకోవాలంటే సరైన సందర్భం, సమయం
ఉండాలి. ఎంతదూరం తిరిగినా నాకు ఎక్కడా ఎన్నికల సూచనలు కనిపించలేదు. అహమదాబాదులో
అంతకన్నా ఆశ్చర్యాలు ఎదురయ్యాయి. నేను నిజానికి ఆ నగరాన్ని చూసి చాలా కాలమైంది.
అప్పట్లో నాకు అది ఒక పాత నగరంగా కనిపించింది. ఇప్పటి నగరాన్ని నేను గుర్తించలేక
పోయాను. స్థానిక మిత్రుడు ఒకాయన మమ్మల్ని పాత కొత్త నగరాలతోపాటు పక్కనే కట్టిన
గాంధీనగర్కు కూడా తీసుకువెళ్లాడు. మొట్టమొదట ఆ నగరంలోని రోడ్ల గురించి
చెప్పుకోవాలి. నగరం మధ్యలో నడుస్తున్న దారులు ఆరు లేన్లు కలిగి ఉన్నాయి అంటే
ఆశ్చర్యం. వాటిలో ఒక లేన్ కేవలం ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకించబడింది. ఆ
బస్సులకు ఇంచుమించు రైల్ స్టేషన్ లాగా అందమైన స్టాప్లు ఉన్నాయి. బస్సులో ఎక్కే
అవకాశం నాకు దొరకలేదు. మన దగ్గర రోడ్లలో ఆర్టీసీ బస్సులు చేసే విన్యాసాలు గుర్తుకు
వచ్చిన తరువాత మనవాళ్లకు ఈ తరహా ఆలోచనలు ఎందుకు రాలేదు, అన్న ప్రశ్న మెదడులో
గట్టిగా కదిలింది. ఇక అక్కడ కడుతున్న భవనాలను చూస్తే అయిన ఆశ్చర్యం అంతా ఇంతా
కాదు. చిన్నది అనుకున్న భవనంలో పన్నెండు అంతస్తులు కనిపించాయి. ఇరవై ఐదు అంతస్తుల
భవనాలు కూడా ఉన్నాయి. అవి లెక్కలేనన్ని ఉన్నాయి. అన్నిటిలోనూ నిర్మాణం చురుకుగా సాగుతున్నది.
కొన్నింటిలో జనం కాపురాలు ఉంటున్నారు. దారి వెంట వెళుతున్న నాకు కొన్ని హోటేళ్ల
పేర్లు ఆకర్షణగా కనిపించాయి. అవన్నీ అసలు సిసలైన దక్షిణ భారతం పద్ధతిలో ఉన్నాయి.
పట్టలేక ఏమిటి పరిస్థితి? అని అడిగాను. ఆ ఊళ్లో ఉద్యోగాల పేరుమీద
వచ్చిన దాక్షిణాత్యులు లెక్కలేనంత మంది ఉన్నారట.
ఆరోగ్యం కారణంగానో, మరే
రకంగానో పని మానుకున్న వారికి తప్ప అక్కడ పనికి కొదవలేదు. తిండికి అంతకన్నా కొదువ
లేదు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అందుకనే మిగతా ప్రాంతాల వాళ్లు
అంతా అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారట. ఈ సంగతి చెప్పిన యువకుడు నాకు ఇంకా
ఎన్నో విషయాలు చెప్పాడు. అతని పేరు రరుూస్. అంటే ధనవంతుడు అని అర్థం. ధనవంతుడు
అవునో కాదో తెలియదు గానీ అతను గుణవంతుడు. టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు.
మంచి మాటకారి. అతని కారులో ముందు పక్కన కమలం గుర్తు గల పవిత్ర వస్త్రం
కనిపించింది. మొహమాటం లేకుండా అదేమిటి? అని
అడిగాను. ఇక కమలం పార్టీ గురించి గొప్పగా పొగడుతూ చెప్పిన సంగతులు నాకు ఇంకా
గుర్తున్నాయి. సరిగ్గా మాటకు మాట జ్ఞాపకం లేదు కానీ, మంచి
జరుగుతుంటే దాన్ని చేస్తున్నది ఎవరు? అన్న
ప్రశ్న రాకూడదు. 2002 సంవత్సరం
తరువాత మా దగ్గర హిందూ ముస్లిం భేదభావాలు అందరూ మరిచిపోయారు.
ఎన్నికలు వస్తే కళ్లు మూసుకుని అందరూ కమలం గుర్తుకే ఓటు వేస్తారు అని అతను తెగేసి
చెప్పాడు.
అహమదాబాదులో అసలు సిసలైన గుజరాతి భోజనం అంటూ ఒకచోటికి
తీసుకువెళ్లారు. ఢోక్లా, సమోసాలతో మొదలైన ఆ భోజనం
అడిగినప్పుడల్లా అందిస్తున్న మామిడి పళ్లరసంతో ముగిసింది. నిజానికి ఆ మామిడి పళ్లు
కూడా మనకు తెలిసిన రకం కానే కాదు. అటువంటి భోజనం రాజస్థాన్లో కూడా ఉంటుంది. వాళ్ల
హోటేళ్లు హైదరాబాదులో ఉన్నాయి కనుక ఇక్కడ కూడా ఆ రకం భోజనం దొరుకుతుంది. ఇక నాకు
ఎప్పటినుండో ఉన్న కోరిక ప్రకారం ఫాలూదా కావాలి అన్నాను. స్థానిక మిత్రుడు జోషీ, మమ్మల్ని ఊరంతా తిప్పి ఒకచోటికి తీసుకువెళ్లాడు. అక్కడ అనుకున్న ప్రకారం
ఆశ్చర్యకరమైన ఫాలూదా దొరికింది. మరునాటి సాయంత్రం మరొక ఆశ్చర్యం ఎదురయింది. తీన్
దర్వాజా అన్న ప్రాంతం గురించి నాకు ముందు కూడా తెలుసు. అక్కడికి దగ్గరలోనే మనీష్
చౌక్ అనే ప్రాంతం ఒకటి ఉంది. అక్కడ అన్నీ నగల దుకాణాలు ఉంటాయి. కానీ రాత్రి
పడిందంటే ఆ అంగళ్లనీ మూసేస్తారు. దారులన్నీ ఒక ఈట్ స్ట్రీట్గా మారుతాయి. జిలేబీ
నుంచి మొదలు దోసెల దాకా అక్కడ దొరికే తిండి రకాలను గురించి చెప్పడానికి వీలు
ఉండదు. దారి నిండా బల్లలు పరిచి కుర్చీలు వేసి ఉంచారు. మధ్యలో, పక్కలకు బళ్ల మీద వంటలు జరుగుతూంటాయి. తిండి సంత ఆ రకంగా రాత్రి రెండు, మూడు గంటల దాకా సాగుతుందట. జోషి ధైర్యంగా ఆ ప్రాంతంలోకి కారు పోనిచ్చాడు.
పార్కింగ్ చేయడానికి స్థలం సంపాదించాడు. ఇక తిండి మీద పడ్డాము. నాకు రాత్రి పూట
తిండి తినడం అంతగా అలవాటు లేదు. జున్ను తురుము వేసిన సాండ్విచ్ తిన్నాను. ఆ తరువాత
అక్కడి స్పెషల్ అంటూ నన్ను మళ్లీ ఒక ఫాలూదా అంగడికి తీసుకువెళ్లారు. స్వంతదారు
అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడు. తన అంగడికి ప్రపంచమంతటా పేరు ఉంది
అన్నాడు. యూ ట్యూబ్లో తమ అంగడి వీడియో చూడమన్నాడు. నిజంగానే సరుకు కూడా చాలా
బాగుంది. అక్కడ తినడం అది నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం.
మరుసటి నాడు మేము సర్దార్ సరోవర్ దగ్గర
ప్రపంచ రికార్డ్ గల వల్లభభాయి పటేల్ విగ్రహాన్ని చూడడానికి బయలుదేరాము. అది
అహమదాబాద్ నుండి చాలా దూరంలోనే ఉంది. హైవే మాత్రం అద్దంలాగా ఉంది. గోల్డెన్
ట్రయాంగిల్ లాంటి పేరు ఏదో చెప్పారు. మధ్యలో అందరికీ అమూల్ పేరు మీద తెలిసిన ఆనంద్
అనే నగరం వస్తుంది. అది నిజానికి రోడ్డు పక్కన ఉండదు. ఎడమకు తిరిగి బాగా లోపలికి
వెళ్లాలి. వెళ్లినా అంత సులభంగా అక్కడి కర్మాగారాలను చూడనివ్వరు. అందుకు ముందే
అనుమతి తీసుకోవాలి. కనుక మేము అమూల్ పాల ఉత్పత్తుల కేంద్రాలను చూడలేక పోయాము.
దేశమంతా పేరున్న అమూల్ తిండి పదార్థాల తీరు అక్కడ అంటే అహమదాబాదులో మరో రకంగా
ఉంది. మేమున్న హోటేల్కు దగ్గరలోనే ఉన్న ఒకానొక అమూల్ కాంటీన్కు వెళ్లాము. అక్కడ
ఐస్ క్రీమ్, పాల ఉత్పత్తులు మాత్రమే గాక రకరకాల తిండి పదార్థాలు
అమ్ముతున్నారు. అన్నింటిలోనూ అమూల్ ఉత్పత్తుల ప్రమేయం ఉంది. గుజరాత్ వాళ్లు
సైన్యంలో తప్ప మిగతా ఏ రంగంలోనయినా బాగా పని చేస్తారు అనిపించింది. గిరీష్ కర్నాడ్
తీసిన సినిమా మంథన్ గుర్తుకు వచ్చింది. అది అమూల్ వెనుకనున్న వేలాది మంది రైతుల
కథ. వర్గీస్ కురియన్ అనే మలయాళీ వ్యక్తి వాళ్లకు నాయకుడుగా నిలిచి చరిత్ర
సృష్టించాడు.
చివరకు సర్దార్ సరోవర్ చేరుకున్నాము. అందులో నీళ్లు
లేవు. డామ్ మీది నుంచి చుక్క కూడా కిందకు రావటం లేదు. ఇటుపక్కకు మళ్లితే మాత్రం, నిజంగానే లోహపురుషుడిగా నిలబడిన సర్దార్ పటేల్ విగ్రహం అద్భుతంగా కనిపించింది.
అందరూ గొప్పగా చెప్పుకునే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 93 మీటర్ల ఎత్తు మాత్రమే. అంతకన్నా ఎత్తయిన విగ్రహాలు చైనాలో ఒకటి, జపాన్లో ఒకటి ఉన్నాయి. అవి రెండు బుద్ధ విగ్రహాలు. చైనా విగ్రహం ఎత్తు 153 మీటర్లు. అయితే సర్దార్ సరోవర్లోని సర్దార్ పటేల్ విగ్రహం ఏకంగా 82 మీటర్ల ఎత్తు. ప్రత్యేకంగా టికెట్ తీసుకుంటే విగ్రహం కాళ్ల దగ్గరికి లిఫ్ట్లో
వెళ్లవచ్చు. అక్కడినుండి దృశ్యాన్ని అన్ని వేపులా చూడవచ్చు. అంతకన్నా ఎత్తుకు
వెళ్లడానికి అవకాశం లేదు. ఆయన కాళ్లకు మామూలు చెప్పులు ఉన్నాయి. మామూలు
చెప్పులలాగే వాటిని కుట్టిన దారాలు కూడా ఉన్నాయి. చెప్పుల అడుగులు, నిలబడ్డ నాకు తలకన్నా ఎత్తులో ఉన్నాయి. ఆ ధారాలు మోకుతాళ్లకన్నా లావుగా ఉన్నాయి. అక్కడ నిలబడి తల
పైకి ఎత్తినా విగ్రహం పై భాగం కనిపించదు. కిందకు దిగి రావాలి. కొంత దూరం పోవాలి.
అక్కడి నుండి చూడాలి. అప్పుడు గానీ విగ్రహం పూర్తిగా కనిపిస్తుంది. విగ్రహం ముందు
నిలబడి ఫొటో తీసుకోవాలనుకుంటే మనం కనిపిస్తే విగ్రహం కనిపిచదు. కాళ్లు మాత్రమే
కనిపిస్తాయి. మొత్తం విగ్రహం కనిపించేటట్టు ఫ్రేమ్ చేస్తే మనం కనిపించము. మరీ
చిన్న రూపాలము అవుతాము. స్వాతంత్య్రం తరువాత దేశంలోని సంస్థానాలను విలీనం చేయించి
ఐక్యత సాధించిన మహానుభావుడు సర్దార్ పటేల్. అందుకే ఆ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. హైదరాబాద్ వారికి
ఆయన చేయించిన పోలీస్ యాక్షన్ ఒకటే జ్ఞాపకం ఉంటుంది. నిజానికి దేశంలో ఇటువంటి
విగ్రహం ఒకటి ఉందని మనవాళ్లకు చాలామందికి తెలియకపోవచ్చు. దాన్ని గురించి మన
ప్రాంతాలలో పెద్దగా ప్రచారం కూడా జరగలేదు. మొత్తానికి అది చూడవలసిన చోటు.
-కె.బి. గోపాలం







