Monday, June 15, 2026

పడుచుదనం Japanese Folk tale Retold in Telugu


పడుచుదనం 

Japanese Folk tale Retold in Telugu

అనగనగా ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కొండల మధ్యన ఒక కట్టెలు కొట్టే మనిషి తన భార్యతోపాటు ఉండేవాడు. వాళ్లు నిజానికి చాలా ముసలివాళ్లు. కానీ పిల్లలు మాత్రం లేరు. మొగుడు ప్రతినిత్యం ఒంటరిగా అడవిలోకి వెళతాడు. కట్టెలు కొట్టి తెస్తాడు. పెళ్లాం ఇంటిపట్టునే ఉంటుంది. నేతపని చేస్తుంది.
ఒకరోజున ముసలతను అడవిలో అలవాటు కన్నా ఎక్కువలోతుకు వెళ్లాడు. ఒక ప్రత్యేకమయిన కర్ర కోసం చూస్తూ అతను అలా వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా అనుకోకుండా ఒక చక్కని నీటిబుగ్గ కనిపించింది. దాన్ని అతను అంతకుముందెన్నడూ చూచి ఎరుగడు. బుగ్గలోనుండి చిమ్ముకువస్తున్న నీరు చిత్రంగా చాలా బాగుంది. చల్లగా కూడా ఉంది. అప్పటికే అతనికి బాగా దప్పిగా ఉంది. ఆనాడు ఎండ బాగా కాస్తున్నది. అతను కష్టించి పనిచేశాడు. కనుక వెంటనే ముసలాయన తన గడ్డిటోపీ పక్కన పెట్టాడు. మోకాళ్లమీద కూచుని ముందుకు వంగాడు. కావలసినన్ని నీళ్లు తాగాడు. నీళ్లు చాలా బాగనిపించాయి. అవి మామూలుగా లేవు, అనిపించాయి. నీటిలో ముసలతనికి తన ముఖం కనిపించింది. అతను ఒక్కసారిగా వెనక్కు తగ్గాడు. అది నిజంగా తన ముఖమే. కానీ పాత అద్దంలో ఇంటిదగ్గర ప్రతినిత్యం కనిపించే ముఖం మాత్రం కాదు. అందులో ఒక అందమయిన యువకుడు కనిపిస్తున్నాడు. ముసలాయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
అతను రెండు చేతులను ఎత్తి తలమీద పెట్టుకున్నాడు. ఒక క్షణం కిందవరకు అది బట్టతల. దానిమీద వెంట్రుకలు లేనేలేవు. ఇప్పుడు మాత్రం నల్లని, చిక్కని జుట్టు చేతికి తగిలింది. ముఖం కూడా చిన్నపిల్లవాని ముఖంవలె నునుపుగా తాకింది. ముదుసలి ముడతలన్నీ మాయమయ్యాయి.
అదే సమయంలో అతనికి ఒంట్లో గొప్ప శక్తికూడా వచ్చినట్టు తోచింది. ఆశ్చర్యంగా తన కాళ్లు, చేతులవేపు అతను చూచుకున్నాడు. అంతకుముందు వరకు అవి ముసలితనానికి గుర్తులుగా ఉండేవి. ఇప్పుడు మాత్రం నిండుగా కండరాలు తేలి కనబడుతున్నాయి. అనుకోకుండానే అతను పడుచుదనం బుగ్గ నుండి నీరు తాగాడు. పడుచువాడు అయ్యాడు. నీళ్లు అతనిని మార్చివేశాయి.
విషయం అర్థం అయింది. వెంటనే అతను సంతోషంతో ఒక కేక వేశాడు. గాలిలోకి ఎగిరాడు కూడా. వీలయినంత వేగంగా అంతకుముందు ఎన్నడూ లేనంత వేగంగా ముసలతను ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లోకి కాలుపెడితే ఎదురయిన పెళ్లాం భయంతో వెనుకకు తగ్గింది. ఎవరో కొత్త మనిషి వచ్చాడని ఆమె జడుసుకున్నది. కానీ జరిగిన ఆశ్చర్యాన్ని అతను వివరించాడు. ఆమె నిజానికి నమ్మలేకపోయింది.
కొంతసేపటికిగానీ అతను భార్యను తాను తానే అని నమ్మించలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన మొగుడేనని ఆమె నమ్మిన తరువాత పడుచుదనం నీటిబుగ్గ గురించి కూడా అతను చెప్పాడు. ఆమెను వెళ్లి ఆ నీరు తాగమన్నాడు.
‘‘నీవు పడుచువాడివి అయ్యావు. అందగానివి అయ్యావు. ఇక మరి నా వంటి ముసలి మనిషిని ప్రేమించలేవు. కనుక నేను కూడా ఆ నీటిని వెంటనే తాగక తప్పదు. అయితే ఇల్లు వదిలి ఇద్దరం ఒకేసారి వెళ్లడం అంత మంచిది కాదు. నేను వెళ్లివస్తాను. నీవు ఇక్కడే ఉండు’’ అన్నది ముసలామె. ఆమె పరుగు పెడుతూ అడవిలోకి వెళ్లిపోయింది.
ముసలమ్మకు నీటిబుగ్గ కనిపించింది. ఆమె కూడా దాని పక్కన మోకరిల్లి నీళ్లు తాగసాగింది. ఆహా!, నీళ్లు ఎంత చల్లగా, ఎంత కమ్మగా ఉన్నాయి! ఆమె అదే పనిగా తాగసాగింది. మధ్యలో ఆగి ఊపిరి పీల్చుకున్నది. మళ్లీ నీళ్లు తాగ సాగింది.  
ఇక ఇంట్లో అటు ఆమె భర్త ఓపిక లేకుండా ఎదురు చూస్తున్నాడు. అందంగా పడుచు పిల్లగా మారి తన పెళ్లాం తిరిగి రావాలని చూస్తున్నాడు. ఎంతసేపయినా ఆమె రానేలేదు. అతనికి ఆత్రం పెరిగింది. ఇంటి తలుపు మూశాడు. పెళ్లాన్ని వెతుకుతూ బయలుదేరాడు. పడుచుదనం నీటిబుగ్గ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ ఆడమనిషి జాడ కనిపించలేదు. ఇక నిరాశగా అతను వెనుతిరిగాడు. అప్పుడే అతనికి గడ్డిలోనుండి సన్నని గొంతుక ఏడుస్తున్నట్టు వినిపించింది. అతను వెళ్లి వెతికాడు. అక్కడ తన భార్య దుస్తులయితే ఉన్నాయి గానీ, వాటిలో ఒక చిన్నపాప ఉంది. ఆ పాప నిజంగా చిన్నది. బహుశా ఆరు మాసాల వయసు ఉంటుందేమో!
ముసలమ్మ పడుచుదనం నీటిని మరీ ఎక్కువగా తాగింది. యవ్వనం కంటే ఎక్కువగా వయసు తగ్గేటట్టు తాగేసింది. కనుకనే మాటలు రాని పసిపాపగా మారిపోయింది.
చేసేది లేక పడుచు మనిషి తన పెళ్లాం పాపను చేతిలోకి తీసుకున్నాడు. ఆమె అతనివేపు ఆశ్చర్యంగానూ,
దు:ఖంగానూ చూచింది. ఏదో గొణుగుతూ అతను పాపను ఇంటికి తీసుకువచ్చాడు. హాయిగా పెంచుకున్నాడు.
 

Sunday, June 14, 2026

లోకాభిరామం - బ్యాడల పుళి (On languages and me)


లోకాభిరామం - బ్యాడల పుళి 


బ్యాడల పుళి

నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్‌నగర్ వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె. అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే చోట్ల కన్నడంలో హకారం వస్తుంది.  హాలు అంటే పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె. పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది. శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది. బొమ్మల్లో, విగ్రహాల్లో మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము. ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి పక్కనా? కుడి అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ, కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను. పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది. ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది. ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా, పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’ పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు. సంప్రదాయమంటే, అదేమిటి అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్‌రైస్‌లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె) కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్ హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్‌లో ఉరుదూ ప్రభావం బాగ ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్‌గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమిఅన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు) అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ! ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో, ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది. మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని అనుకుంటున్న. జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్‌కు నా మీద కావలసినంత అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు కన్నడములో, లేదా తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి? అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు.  అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ, మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి విన్నవించుకుంట.


 

Friday, June 12, 2026

Thursday, June 11, 2026

తెలివి ఎవరి సొమ్ము On knowledge and Gender


తెలివి ఎవరి సొమ్ము?

తెలివి ఎవరి సొమ్ము?

నవల్సు రాయడంలోనూ, నాట్యమాడడంలోనూ కావలసినంత మంది అమ్మాయిలున్నారు గానీ, సైంటిస్టులుగా మాత్రం లేడీసు ఎక్కువగా లేకపోవడానికి కారణం ఏమిటని చాలా కాలంగా ప్రశ్న ఉండనే ఉన్నది. ఈ పద్ధతి ఇవాళ కొత్త గాదు. లేచింది మహిళా లోకం!’ అన్న పాట పుట్టక ముందునుంచీ ఇలాగే ఉంది. పురుషాహంకారం అంతగా లేదనుకుంటున్న సమాజాలలోనూ ఇలాగే ఉంది.

ఉండగా, ఉండగా 2005 జనవరిలోని ఒకానొక శుభోదయాన లారెన్స్ సమ్మర్స్ అనే ఒకానొక పరిశోధకుడు పేరుకు తగినట్టుగానే వాతావరణం ఎంచుకుని, ఎండలాగే మండించే సిద్ధాంతాన్ని ఒకదాన్ని ప్రపంచం ముందు పెట్టాడు. అతనేదో లాకాయి లూకాయి అయితే ఎవరూ పట్టించుకునే వారు గాదేమో. తెలివికి రాజధాని లాంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధిపతి అతను.

ఆడా మగా మెదడుల్లోపల, అంతరాంతరాల్లో ఉన్న అంతరం – అదే తేడా, కారణంగానే అమ్మాయిలు అంతగా సైన్సులోకి రావడం లేదని సమ్మర్స్ గారి నమ్మకం. ఆడవాళ్లకు తెలివి కొంచెం తక్కువ అన్న వాదం ఒకప్పుడు  మొదలయి, రకరకాల కారణాలుగా మరుగున పడిపోయింది. సమ్మర్స్ గారి పుణ్యమా అని అదిప్పుడు మళ్లీ రగులుకుంది. ఆడా మగా మెదడు నిర్మాణంలో తేడాలున్నాయని ఎప్పటినుంచో తెలుసు. పనితీరులో కూడా తేడా ఉందని ఆ మధ్యన అన్నారు. కానీ ఆ కారణంగానే, వారికి సైన్సు, లెక్కలు, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగు లాంటి విషయాలు తలకు ఎక్కడంలేదని మాత్రం ఎవరూ తేల్చి చెప్పలేక పోయారు.

తేడాలున్నమాట మాత్రం నిజమేనంటున్నారు అందరూ. ఆ తేడాల వల్ల తెలివి మీద ప్రభావం లేదు, కానీ చిత్రంగా ఒక ఆలోచన బయట పడింది. రకరకాల చికిత్సల విషయంలో అందరికీ ఒకే మందు కాకుండా, తేడాను బట్టి ఆడ మందులు, మగ మందులు వాడితే బాగుంటుందని పరిశోధకులు అంటున్నారు. మానసిక రుగ్మతలయిన డిప్రెషన్, అడిక్షన్, షిజోఫ్రీనియా, స్ట్రెస్ సంబంధ సమస్యల్లో ఈ పద్ధతి మరింత బాగా పని చేసే వీలుందంటున్నారు. ఇక మీద మెదడు, మందుల గురించి వరిశోధన చేసే వారంతా, ఆడా మగ తేడాలను కూడా తమతమ పరిశోధనలకు జత చేసి చూస్తే, మంచి ఫలితాలుంటాయని అంటున్నారు.

మెదడు నిర్మాణం, పనితీరుల్లో తేడా ఉందని తెలుసు. ఆ తేడా ప్రభావం లైంగిక విషయాల మీదే ఉంటుందని అనుకున్నారు. చివరకు చుంచులలో కూడా, హైపొతలామస్ అనే భాగం, ఆడా మగా తేడాను బట్టి వేరువేరు ప్రవర్తనలకు కారణమవుతుందని గమనించారు.

హైపొతలామస్ సెక్స్ హార్మోన్ల విడుదలకు కేంద్రం. అందుకే న్యూరో సైంటిస్టులంతా, తేడా సెక్స్ వరకే పరిమితం అన్న అభిప్రాయానికి చేరుకున్నారు. ఈ భావాలకు ఈ మధ్య గట్టి కుదుపులు తగులుతున్నాయి. లింగభేదం ప్రభావం కేవలం లైంగికత మీద మాత్రమే గాక, జ్ఞాపక శక్తి, భావాలు, దృష్టి, వినికిడి, ఒత్తిడిని తట్టుకునే తీరు మొదలయిన వాటి మీద కూడా ఉంటుందని పరిశీలకులు సూచించారు. మెదడులోకి తొంగి చూడడానికి పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లాంటి పద్ధతులు రావడంతో, గత అయిదు పదేళ్లలో ఈ రకం పరిశోధనలు ఎక్కువయ్యాయి. ఫలితాలు ఆశ్చర్యకరంగా వస్తున్నాయి. నిక్షేపంగా బతికి ఆలోచిస్తున్న వారి మెదళ్ల మీదకూడా పరీక్షలు చేయగల అవకాశం ఉండడం గమనించదగిన సంగతి.

మెదడు నిర్మాణంలో, స్త్రీ పురుషుల మధ్య తేడాలు చాలా భాగాల్లో ఉన్నట్లు గమనించారు. పై స్థాయికి కేంద్రమయిన ఫ్రాంటల్ కార్టెక్స్ ఇందులో ఒకటి. నుదురు ఎంత విశాలంగా ఉంటే తెలివి అంత ఎక్కువగా ఉంటుందని, అనుభవం మీద మనవాళ్లు చెప్పడం తెలిసిందే. నుదురులో ఉండే ఈ ఫ్రాంటల్ కార్టెక్స్ తెలివికి కేంద్రం అన్నమాట పరిశోధకులు అంగీకరించిందే. అయితే పోల్చి చూస్తే ఈ భాగం మగవారికన్నా ఆడవారిలో ఎక్కువగా ఉంటుందని మాత్రం ఈ మధ్యన అర్థమయింది. భావాలను అదుపు చేసే లింబిక్ కార్టెక్స్ కూడా స్త్రీలలోనే ఎక్కువగా ఉందంటున్నారు.

తేడాలో పెద్దది, చిన్నది అంటే, దేనికంటే అన్న ప్రశ్న పుడుతుంది. మొత్తం మెదడుతో పోలిస్తే, అందులో ఒక భాగం ఎంత ఉందన్న నిష్పత్తి ప్రకారం ఈ కొలతలను తీస్తారు.

భాషను అర్థం చేసుకోవడం, మొత్తం మీద అవగాహన లాంటి లక్షణాలకు కేంద్రమయిన భాగాలలో, చివరకు కణాల స్థాయిలో కూడా తేడా ఉందని తెలిసింది. కడుపులో శిశువు ఆడా మగా తేడా, ఊపిరికన్నా ముందే మొదలవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

సమ్మర్స్ గారి వాదం సంగతి తర్వాత తేలుతుంది గానీ, మొత్తానికి మెదడు స్థాయిలో ఆడా మగా మధ్య తేడా ఉందని తేలిపోయింది. అన్నట్లు రాజకీయాలలో రాణించే రాణులు తక్కువ. ఉన్నవాళ్లలో చాలా మంది ఇల్లుగలాయన తరఫున వచ్చినవారు. ఈ సంగతి ఆలోచించాలి!


 





 

Tuesday, June 9, 2026

అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ


అక్షయ పాత్ర : భూటాన్ జానపద కథ


అక్షయ పాత్ర

డాంగ్ భూ థిక్ నాకి వెండా, డింగ్ బూ కిమథిక్ నాకి వెండా, అంటే అనగనగా ఒకప్పుడు అని అర్థం. అటువంటి ఒకప్పుడు ఒక లోయ ఉండేది. అందులో విశాలమైన ఒక నది ఉండేది. నది పక్కన మంచి పొలాలు ఉండేవి. అక్కడ కోయడానికి సిద్ధంగా పంటలు కనిపించేవి. కొండ చరియలమీద సాగుచేసి పంట నాటడానికి సిద్ధంచేసి ఉంటుంది. త్వరలోనే రైతులు వచ్చి నాట్లు మొదలు పెడతారు. కానీ వీధి చివరన పూరిగుడిసెలో ఉండే చిన్నపిల్లవాడికి మాత్రం అవకాశం లేదు. అతను విత్తనాలుగా నాటడానికి ధాన్యం మిగిలించుకోలేక పోయాడు. ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం తినేసాడు. దీనంగా ఉన్న అతని పరిస్థితి చూసి చుట్టుపక్కలవారు అతనికి ఒక పిడికెడు విత్తనాలు జమచేసి ఇచ్చారు. వాళ్లకు ధన్యవాదాలు చెపుతూ కొంచెం విత్తులను అతను తనకు ఉన్న కొద్దిపాటి నేలలో నాటుకున్నాడు. అతని పొలం పైన్ అడవుల పక్కన ఉంటుంది.
విత్తనాలు నాటిన కొద్దికాలానికే పిచ్చుకల గుంపు ఒకటి, పెద్దది వచ్చేసింది. కిచకిచలాడుతూ ఎగర సాగింది. చూస్తుండగానే నాటిన విత్తనాలు అన్నింటిని పొడిచి పొడిచి అవి తినేశాయి. బీద బాలుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతను బిత్తరపోయి ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. పిచ్చుకలను తరమ సాగాడు. పిచ్చుకల గూళ్ళు, ముళ్ళు నిండిన పొదలలో ఉన్నాయి. అక్కడ, ఆరు ఎగరడం చేతకాని చిన్న పక్షులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతున్న అబ్బాయి గూళ్ళను తగలబెట్టడానికి పూనుకున్నాడు. ఒక్కసారిగా పిచ్చుకలు అన్ని అతని ముందుకు వచ్చి తమను తమ పిల్లలను ప్రాణాలతో వదిలేయమని ప్రాధేయపడ్డాయి. నా గింజలు మీరు తినేశారు. నేను ఏం తిని బతకాలి? మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు, అన్నాడు అబ్బాయి. తండ్రి పిచ్చుక ముందుకు వచ్చింది. ఒక అక్షయపాత్ర గిన్నెను తెచ్చి అబ్బాయికి ఇచ్చింది. గిన్నె నీతో ఉంటే ఇక నీవు ఎన్నడు పని చేయవలసిన అవసరం ఉండదు. నీవు ఏమి అడిగితే వాటిని గిన్నె నీకు ఇచ్చేస్తుంది. ఇక మిమ్మల్ని వదిలిపెట్టు, అన్నది.
కుర్రవాడు గిన్నె తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నిజంగానే గిన్నె మహిమ గలది. అది ప్రతినిత్యం అబ్బాయికి అన్నిరకాల తిండి పదార్ధాలను అందజేస్తున్నది. పంచభక్ష్య పరమాన్నాలు పెడుతున్నది. అడగడమే ఆలస్యం. బాబు మునుపటివలె ధనికుల ఇళ్లకు బిచ్చం ఎత్తడానికి వెళ్లడంలేదు. అట్లాంటి ఒక కలవారి ఇల్లు బాబు ఇంటి పక్కనే ఉన్నది. ఇంటి యజమానురాలికి అనుమానం మొదలయింది. దొంగచాటుగా వెళ్లి ఆమె రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేసింది. చూస్తుండగానే అబ్బాయి పాత గిన్నెను నడుముకు కట్టుకున్న గుడ్డలో నుంచి బయటకు తీసి ముందు పెట్టుకున్నాడు. ఇవాళ నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం, మంచి మాంసం కూర కావాలి. ఎర్ర బియ్యం అన్నం కావాలి. సింగ్ చాంగ్ కూడా కావాలి, అన్నాడు.
కళ్ళు మూసి తెరిచేలోగా అడిగినవన్నీ అబ్బాయి ముందు ఉన్నాయి. బాంగ్ చుంగ్  నిండా వేడివేడి ఎర్ర అన్నం ఉంది. అన్నం మెతుకులు మిలమిలలాడుతున్నాయి. ఆమె అటువంటి అన్నం అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇక డాపా కంచంలో రకరకాల మాంసం కూరలున్నాయి. పచ్చని, ఎర్రని మిరపకాయలు కూడా ఉన్నాయి. సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు కూడా ఉన్నాయి. మొత్తం వంట ఆవిర్లు కక్కుతున్నది. అంటే అప్పుడే వండినట్టు ఉన్నది. అబ్బాయి మాత్రం ఆశ్చర్యం కనపరచకుండా తిండి తింటున్నాడు. లొట్టలు వేస్తూ రుచిని అనుభవిస్తూ పట్టినంత తినేశాడు. అందమైన బామై రూచుంగ్ పాత్రలో సింగ్ చాంగ్ పోసుకున్నాడు. హాయిగా దాన్ని తాగేశాడు. పక్క ఇంటి యజమానురాలికి పట్టరాని అసూయ కలిగింది. ఎలాగైనా గిన్నెను తాను కాజేయాలని ఆమె పథకం వేసింది. బీద పిల్లవాడిని పిలిచి ఏదో పని చెప్పి పక్క ఊరికి పంపించింది. ఊరు పక్కలోయలో ఉంది. బాబుతో బాటు ఆమె తన కొడుకును కూడా పంపించింది. పక్క లోయకు వెళ్లాలంటే వాళ్లు ఎన్నో వాగులు, వంకలు దాటాలి. అలా ప్రయాణం కొన్ని రోజులపాటు సాగుతుంది. అంత కాలం పాటు అతని గిన్నెను తాను దాచి ఉంచుతానని ఆమె బాబుకు చెప్పింది. అతను అమాయకంగా నమ్మి గిన్నెను ఇచ్చాడు.
కొన్నిరోజుల తరువాత అబ్బాయిలు ఇద్దరు తిరిగివచ్చారు. యజమానురాలు ఒక గిన్నెను బాబుకు తిరిగి ఇచ్చింది. నిజంగా జరిగింది ఏమంటే, అక్షయపాత్రను ఆమె దాచుకుని అటువంటిదే మరొక గిన్నెను బాబుకు ఇచ్చింది. బీద అబ్బాయి తన ఇంటికి వెళ్ళాడు. తిండికోసం గిన్నెను అడిగాడు. ఒక్కసారి కాదు, పదేపదే అడిగాడు. గిన్నె తిండి పెట్టలేదు. బాబుకు కోపం వచ్చింది. గిన్నె తీసుకుని పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. గిన్నె పనిచేయడం లేదని కోపంగా చెప్పాడు. ఈసారి పిచ్చుకల తండ్రి, బాబుకు ఒక మేకపిల్లను ఇచ్చాడు. మేకపిల్లకు స్నానం పోసి తడితే చాలు, అది నీకు కావలసినంత డబ్బు ఇస్తుంది. దానితో నీవు తిండి కొనవచ్చు, అని చెప్పాడు.
కుర్రవాడు ఇంటికి వెళ్లగానే మేకపిల్లకు స్నానం పోసి తట్టాడు. దాని ఒంటినుండి బంగారం, వెండి నాణేలు రాలాయి. హాయిగా బతక సాగాడు. పక్కింటి యజమానురాలికి మళ్ళీ అనుమానం పుట్టింది. ఆమె మేకపిల్ల సంగతి గమనించింది. అది తనకు కావాలి, అనుకున్నది. పన్నాగం చేసి ఒక మామూలు మేకపిల్లను అంటగట్టింది. మేకపిల్ల డబ్బులు ఇవ్వడంలేదని గమనించిన బాబు, మళ్లీ పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. నేను ఇచ్చిన రెండు బహుమానాలను నీవు జాగ్రత్తగా ఉంచుకోలేక పోయావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకా ఏమీలేదు. ఒక దుడ్డుకర్ర మాత్రం ఉన్నది. అది కూడా, ఏదో రకంగా పనికి వస్తుంది. తీసుకువెళ్ళు. మళ్లీ మాత్రం నా వద్దకు రావద్దు. ఇప్పటికే నీకు చాలా ఇచ్చాను, అన్నది తండ్రి పిచ్చుక.
అబ్బాయి నిరాశలో మునిగి, ఇంతకూ కర్ర ఏం చేస్తుంది అని అడిగాడు. ఎవరినైనా కొట్టమంటే కొడుతుంది, అన్నాడు పిచ్చుకల తండ్రి.
దానికి నిత్యం పూజ చెయ్యి. మూడుసార్లు దండం పెట్టు. ఎవరిని కొట్టాలో చెప్పు. అప్పుడది వాళ్లను కొడుతుంది, పిచ్చుక మాటలు అవి.
బీద కుర్రవాడు ఇంటికి వచ్చాడు. ఈసారి ఏమి తెచ్చాడని చూడడానికి పక్కింటావిడ కూడా వచ్చింది. అప్పటికే కుర్రవానికి తన గిన్నె, మేక ఏమైంది అన్న సంగతి అర్థమయింది. కొంచెం ఆగితే అది ఏం చేస్తుందో చూపిస్తాను అని, దుడ్డు కర్రను చూపించాడు.
ముసలావిడకు మహా ఆత్రంగా ఉంది. ఈలోగా అబ్బాయి దుడ్డుకర్రకు పూజ చేశాడు. దానికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగా కర్ర ముసలామె వైపు వచ్చి అదేపనిగా కొట్టసాగింది. ఆమె తన ఇంట్లోకి పరుగు పెట్టింది. అయినా కర్ర వెంటబడి కొడుతూనే ఉన్నది. ఆవిడ పడుతూ లేస్తూ బాబోయ్, తప్పు తెలిసింది. నీ వస్తువులు నీకు ఇచ్చేస్తాను. కర్రను వెనుకకు పిలువు, అంటూ మొర పెట్టుకున్నది.
బాబు కర్రను వెనుకకు పిలిచాడు.
పక్కింటి యజమానురాలు దొంగిలించిన గిన్నెను, మేక పిల్లను తెచ్చింది. బాబుకు ఇచ్చింది. చేతులు జోడించి మళ్లీ దుడ్డుకర్రను మాత్రం నా మీదికి పంపకు అన్నది.
పిచ్చుకలు ఇచ్చిన మూడు బహుమానాలు మళ్ళీ పిల్లవాడికి దొరికాయి. తరువాత అతను హాయిగా బతికాడు.