Saturday, March 14, 2026

ఈ గాలి ఈ నేల : వాతావరణం - మేఘాలు మరెన్నో సంగతులు


ఈ గాలి - ఈ నేల 

వాతావరణం - మేఘాలు మరెన్నో సంగతులు


మనమంతా గాలి మనుషులం. నేల మీద ఉంటున్నాం! నిజమే. నీటిని వాడుకుంటున్నాం. అంతకన్నా నిజమే. కానీ, గాలి మీద ఆధారపడినంతగా మన బతుకులు ఈ రెంటి మీదగానీ, వెలుగు మీదగానీ ఆధారపడ లేదనిపిస్తుంది. ఎక్కడ ఉన్నాసరే, గాలి మనలను అంటిపెట్టుకుని ఉంటుంది. మనం వాతావరణంలో, అంటే గాలిలో మునిగి ఉంటాము. బతుకు కొనసాగడ మంటే, అనుక్షణం ఊపిరి కొనసాగడమే. గాలి చేసే గమ్మత్తుల ప్రభావం అనుక్షణం మనమీద ఉంటూనే ఉంది. అయినా, గాలి గురించి, వాతావరణం గురించి మనకు అర్థమయింది మాత్రం చాలా తక్కువే. గాలిలో వింతలెన్నో దాగి ఉన్నాయి. అందులో వెలుగులున్నాయి. నీరుంది. అల్లంత ఎత్తున మబ్బుల్లో కూడా జీవం ఉంది. ఆ జీవం ప్రభావం మన మీద కూడా ఉంటుంది.
మబ్బుల్లో మంచు ముక్కలు, నీటి చుక్కలు ఉన్నాయి. వాటికి ఒక రూపం ఏర్పడి మేఘం పుట్టాలంటే, సీడ్స్‌ అనే ఆధారాలు కావాలి. ఖనిజ లవణాలు గానీ, సూక్ష్మజీవులు గానీ ఈ ‘విత్తనాలు’గా అందుతుంటాయి. మేఘాలు ఏర్పడడంలో కాస్మిక్‌ కిరణాలకు కూడా పాత్ర ఉందని పరిశోధకులు అంటున్నారు. అంతరిక్షంలో నిండి ఉండే ఈ కిరణాలు, ఎంత ఎక్కువగా భూమి వాతావరణంలోకి వచ్చి తాకితే, అంతగా మబ్బులు తయారవుతాయంటున్నారు. మేఘాలు ఏర్పడడానికి అవసరమయిన ఆ మరీ సన్నటి దుమ్ము కణాలు అక్కడ పుట్టడానికి కారణం ఈ కిరణాలేనని గత సంవత్సరంలోనే వీరు గమనించారు. అంత సన్నటి దుమ్ముతో మబ్బులు పుడుతున్నాయా అని అనుమానం తెలియజేసిన వారు కూడా ఉన్నారు.
మొత్తానికి మబ్బుల ఉనికి, కదలికలకు గాలి కారణమవుతుంది. విమానాలు ఎగురుతూ వాటిలోనుంచి దూసుకు పోయి నందుకు మబ్బులలో యాభయి కిలోమీటర్ల వెడల్పు రంధ్రాలు పడుతున్నాయట. దీనికి కూడా గాలే కారణం! కానీ, విమానం మబ్బులోనుంచి ఉరికిన తాకిడితో మరిన్ని మంచుకణాలు తయారవుతాయట. విమానం వెచ్చదనం కారణంగా, మేఘంలో, గారెలో లాంటి చిల్లు పడినందుకు, బహుశః లాభమేగానీ, నష్టం లేదని చెపుతున్నారు.
తీర ప్రాంతాలలో అప్పుడప్పుడు, తేనెపట్టులాంటి మేఘాలు కనబడుతుంటాయి. వీటిని ‘ఓపెన్‌ సెల్‌ మబ్బులు’ అంటారు. వాన తాకిడి కారణంగా, ఎత్తున ఉండే గాలి, సముద్రం మీదకు నెట్టుకు వస్తుంది. దానివల్ల ఈ రకం మబ్బులు పుడతాయి. గాలి ఒక జెట్‌లాగ వస్తుంది. ఈ ధారలు విస్తరించి పక్కధార వరకూ వ్యాపిస్తాయి. తాకిడితో ఆ గాలి ధారలు తిరిగి చివ్వున పైకి ఎగసిపోతాయి. మొత్తం మీద అక్కడ ఒక వింత నిర్మాణంగల మబ్బులు పుడతాయి.
గాలి, అందులోని మబ్బుల విషయంగా మరెంతో పరిశోధన జరుగుతున్నది. వాతావరణంలోని మధ్య భాగాన్ని మిసోస్ఫియర్‌ అంటారు. సుమారు ఎనభయ కిలోమీటర్ల ఎత్తున ఉండే ఈ మధ్యావరణంలో, ఒక ప్రత్యేక రకమయిన మబ్బులు ఉంటాయి. అవి మనకు మామూలుగానే తెలిసిన మబ్బుల కన్నా, చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఈ రకం పలచగా విస్తరించిన మబ్బులలో సన్నని మంచు శకలాలు పరుచుకుని ఉంటాయి. కనుకనే ఇవి ఉదయం సూర్యుని వెలుగులో, తిరిగి అస్తమాన సమయంలో, ఆ వాలు కారణంగా వెలుగుతూ కనబడతాయి. ఈ రకం కిరణాలు భూమధ్య రేఖ ప్రాంతంలో కూడా కనబడుతున్నాయని ఈ మధ్య గమనించారు.
భూమికి దగ్గరగా ఉండే వాతావరణం ఈ మధ్యన మార్పులకు గురవుతున్నది. ఈ కారణంగా, ఆ పైన ఉండే మధ్యావరణం చల్లబడుతున్నది. కనుక, అక్కడ మంచు మరింత సులభంగా తయారవుతుంది. భూమి మీద నుండే పశువులు, పరిశ్రమల కార ణంగా మీతేన్‌ వాయువు పుడుతున్నదని అందరికీ తెలుసు. తేలికయిన ఈ వాయువు, మధ్యావరణంలోకి చేరి మంచు తయారీకి మరింత సాయపడుతున్నదని కూడా పరిశోధకుల అభిప్రాయం. సూర్యుని కాంతిలో తేడా కూడా, ఇక్కడ ప్రభావం చూపుతున్నాయేమో! కానీ, ఈ చివరి మాట కేవలం అభిప్రాయం మాత్రమే. ఈ అంశం గురించి పరిశోధనలు అంతగా జరగలేదు.
గాలిలో తేలుతూ సూక్ష్మజీవులు, ఎన్నడూ లేనంత ఎత్తులకు చేరుతున్నాయని గమనించారు. సూక్ష్మజీవులు, బూజు అంటే ఫంజీ జాతి జీవులు ఇలా ఎత్తులకు వెళుతున్నాయి. వీటిలో కొన్ని, అదే పనిగా ఎప్పుడూ గాలి వెంటబడి ప్రపంచమంతా తిరుగుతాయి. మిగతావి మబ్బులలోని రసాయనాలను మింగవచ్చునన్న ఆశతో పోతాయి. అసలు జీవం పుట్టిందే, వాతావరణంలోని పై పొరల్లో అన్న సిద్ధాంతం కూడా ఉంది. అక్కడి నుంచి జీవం, వర్షం ద్వారా సముద్రంలోకి చేరిందని అంటారు.
గాలిలో సూక్ష్మజీవులు ఉంటాయని తెలుసు. అయితే, అవి అనుకోకుండా ఆ ఎత్తులకు చేరాయని, అక్కడ అవి చేయగలిగింది ఏమీ ఉండదని అభిప్రాయం ఉండేది. కానీ గతంలో మూడు వేల అడుగుల ఎత్తునుంచి సేకరించిన గాలి నమూనాలో, సూక్ష్మజీవులు చలాకీగా బతుకు సాగిస్తుండడం కనిపించింది. సూక్ష్మజీవులు అక్కడ దొరికిన ఆ కొద్ది నీటిలోనే, సంఖ్యలో పెరిగి బతుకుతున్నట్లు గమనించారు. వాటికి ఆహారంగా ఉపకరించే ఆర్గానిక్‌ ఆమ్లాలు, ఆల్కహాల్‌ రకం రసాయనాలను కూడా గుర్తించారు. ఆ ఎత్తులలో ఉండే సూక్ష్మజీవులు ప్రతి సంవత్సరం ఒకటి నుంచి పది మిలియన్‌ టన్నుల కార్బన్‌ను వాడుకుంటున్నాయని అంచనా వేశారు.
సూక్ష్మజీవులు ఆకాశంలో ఉంటే మనకేమీ ఫరవాలేదు. కానీ, అవి భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మేఘాలు ఏర్పడడానికి విత్తనాలుగా, మంచుకణాలకన్నా ఈ ప్రపంచమంతటా విస్తరించాయని గమనించారు. ఎండకూ, నీటి ఎద్దడికీ బాగాతట్టుకునే శక్తిగల ఈ జీవులు, భూమి, గాలి, మధ్య ప్రయాణాలు సాగిస్తున్నాయి. వీటి వల్ల కొన్ని రకాల వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయని సైన్స్‌ పత్రికలో ఈ మధ్య ప్రకటించారు.
ఆకాశంలో, అక్కడి గాలిలో ఎన్ని రకాల జీవులున్నాయని ఇంకా ఎవరూ లెక్క వేసింది లేదు. అవి ఎంత ఎత్తు వరకు ఉన్నాయన్నది కూడా తెలియదు. ఇలాంటి అంశాలతో జీవం, గాలిలో పుట్టి నేలకు చేరిందన్న వాదానికి బలం సమకూరుతున్నది



Friday, March 13, 2026

గ్లాస్‌ - యసునారి కవాబాటా జపనీస్ కథకు నా తెలుగు అనువాదం


గ్లాస్‌ - యసునారి కవాబాటా 

జపనీస్ కథకు 

నా తెలుగు అనువాదం


I

అతని పదిహేనేళ్ల భార్య యోకో బుగ్గలు పాలిపోయి ఇంటికి వచ్చింది. తల నొప్పిగా ఉంది, ఒక ఘోరం చూచాను’ అన్నది.

సాకే సీసాలు తయారుచేసే గ్లాస్‌ ఫ్యాక్టరీలో ఒక వర్కర్‌ రక్తం కక్కుకున్నాడు. ఒళ్లు కాల్చుకున్నాడు. ఆమె అదంతా జరుగు తుండగా చూచింది.

వాళ్లాయనకు గ్లాస్‌ ఫ్యాక్టరీ గురించి తెలుసు. అక్కడంతా వేడితో పని. సంవత్సరమంతా కిటికీలు తీసే ఉంటాయి. కిటికీ దగ్గర ఇద్దరు ముగ్గురు బయటవాళ్లు నిలబడి చూస్తూ ఉంటారు. ఆ పక్కన ఉండే కాలువలో ప్రవాహముండదు. దానిమీద నూనె మెరుస్తూ ఉంటుంది. అది మురుగుకాలువ లాంటిది.

ఫ్యాక్టరీలో తేమగా ఉంటుంది. లోపలికి ఎండ తగలదు. పనివాళ్లు పొడుగాటి పోల్స్‌ చివరన అగ్గి బంతులతో ఆడుతుంటారు. వాళ్ల చొక్కాలనుంచి, ముఖాలనుంచి మాదిరే, చెమట ఓడుతూ ఉంటుంది. వాళ్ల చొక్కాలు కూడా ముఖాలలాగే మకిలిగా ఉంటాయి. పోల్‌ చివరన ఉన్న అగ్గి ముద్ద, చూస్తుండగానే సీసా ఆకారానికి మారుతుంది. వాళ్లు దాన్ని నీళ్లలో పెడతారు. కాసేపు తరువాత బయటకు తీస్తారు. ఒక్క ఊపుతో విరిచి పక్కన పెడతారు. గూనిగా ఉన్న ఒక కుర్రవెధవ పటకారుతో వాటిని పట్టుకుంటాడు. ఫినిషింగ్‌ ఫర్నేస్‌కు చేరుస్తాడు. పది నిమిషాలలోగా కిటికీ పక్కన నిలబడి చూచే వాళ్లకు తల బరువెక్కు తుంది. గాజు ముక్కమాదిరే గట్టి పడుతుంది.

యోకో చూస్తూ ఉండగానే సీసాలు మోస్తున్న కుర్రవాడు రక్తం కక్కి అలసటతో పడిపోయాడు. అప్పుడే ఎగురుతున్న ఒక

అగ్గిముద్ద వాడి భుజానికి తగిలింది. రక్తం కారుతున్న నోటిని తెరిచి వాడు అరిచాడు. ఎగిరి లేచి చుట్టూ పరిగెత్తి మళ్లీ పడి పోయాడు.

జాగ్రత్త, మొద్దు భడవా!’

వాడి భుజంమీద కొంచెం నీళ్లు పోశారు. కుర్రవాడు మూర్ఛపోయాడు.

 

II

ఆసుపత్రికి వెళ్లడానికి వాడి దగ్గర డబ్బుల్లేవు. నేను వెళ్లి చూస్తాను’ అన్నది భార్య.

తప్పకుండా వెళ్లాలి, కానీ అలాంటి వాళ్లు ఎంతమందో’

బాగానే ఉంది, అయినా నాకు సంతోషమే.’

ఇరవయి రోజులు గడిచాయి. కుర్రపనివాడు ఆమెకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడు. ‘చిన్న అమ్మాయిగారి’తో మాట్లాడాల న్నాడు. యోకో బయటకు వచ్చింది. కుర్రవాడు తోటలో నిలబడి ఉన్నాడు. ఆమె కనిపించగానే, ద్వారం పట్టుకుని తలవంచి నమస్కరించాడు.

ఇప్పుడు కాస్త బాగుందా?’

ఏమిటి?’ కుర్రవాడు ఉలిక్కిపడ్డాడు. యోకో ఏడుస్తుందేమో అనిపించింది.

నీ గాయాలు నయమయ్యాయా?’

అవును’ కుర్రవాడు చొక్కా గుండీలు తీయడం మొదలుపెట్టాడు.

అదేమీ అవసరం లేదు...’

యోకో లోపలికి పరుగుగా వచ్చింది. భర్తతో ఏదో అనబోయింది. ఆయన కొంత డబ్బు ఇచ్చాడు. ‘ఇది వాడికివ్వు’ అన్నాడు.

నేను వెళ్లను, పనమ్మాయిని పంపించండి’

 

III

పది సంవత్సరాల తరువాత ...

అతను ఒక సాహిత్య పత్రికలో ‘గ్లాస్‌’ అనే కథ చదివాడు. అందులో తమ పరిసరాల వర్ణన ఉంది. ప్రవహించని ఒక నది ఉంది. దానిమీద మెరిసే నూనె ఉంది. ఇక అగ్గిగోళాలు ఎగిరే నరకం ఉంది. కక్కిన రక్తం ఉంది, కాలడం ఉంది. మధ్యతరగతి అమ్మాయి మన్నన కూడా ఉంది.

హే, యోకో, యోకో!’

ఏమిటది’

గ్లాస్‌ ఫ్యాక్టరీలో ఒక కుర్రవాడు మూర్ఛపోవడం చూచావ్‌. వాడికి డబ్బులిచ్చావు, కదూ? అది చాలాకాలం నాటి మాట’

అవునవును, అదే జరిగింది’

ఆ అబ్బాయి రచయిత అయ్యాడు. సంఘటన గురించి రాశాడు’

ఏమిటి? నన్ను చూడనీ. ’

యోకో పత్రికను లాక్కున్నది. కానీ అతను కూడా పైనుంచి చదువుతూ, కథను ఆమెకు చూపించడం తప్పుగా భావించసాగాడు.

అందులో ఆ అబ్బాయి ఆ తరువాత ఒక ఫ్లవర్‌ వేజ్‌ ఫ్యాక్టరీకి మారినట్టు రాసి ఉంది. అక్కడ అతను రకరకాల రంగులు, నమూనాలలో డిజైన్‌లు తయారు చేసి గొప్ప పనితనం చూపించాడు. అతని శరీరానికి, అంతకు ముందులాగ కష్టాలు లేవు. తాను తయారు చేసిన అన్నిటికన్నా అందమయిన వేజ్‌ను ఆ అమ్మాయికి పంపించానని కూడా అక్కడ ఉంది.

లేదు, నాలుగయిదు సంవత్సరాల పాటు ఆగకుండా నేను వేజ్‌లు తయారు చేశాను. దానికంతా ఆ అమ్మాయే ప్రేరణ’ ` అక్కడ రాసిన సంగతుల సారాంశం ఇది ` ‘నాలో సామాజిక వర్గాల గురించిన జాగరూకత కలగడానికి కూలీగా నా అనుభవం కారణమా లేక మధ్యతరగతి అమ్మాయి పట్ల ప్రేమ కారణమా? రక్తం కక్కుకోవడం అప్పట్లో చాలా సాధారణం ` మొత్తం రక్తంకక్కి చచ్చినా సాధారణమే. అది తరుముతున్న ఒక శత్రువు దీవెన. ఒక అవమానం. చాలాకాలం క్రితం ఒక యోధుని కూతురు, పోయిన అతని కోటను, శత్రువు దయతో సంపాదించింది. అయితే చివరికి ఆ కూతురు తన తండ్రిని చంపిన మనిషికి ఉంపుడుగత్తెగా మారవలసి వచ్చింది. ఆమె నా బతుకును కాపాడడం ఆ అమ్మాయి అందించిన మొదటి దీవెన. కొత్త ఉద్యోగం వెతకడానికి అవకాశం కల్పించడం రెండవ దీవెన. కానీ నా కొత్త ఉద్యోగం గురించి ఆలోచించండి ` నేను ఏ వర్గం కొరకు వేజ్‌లు తయారు చేస్తున్నానో, నేను నా శత్రువుకు ఉంపుడుగత్తెనయ్యాను. ఆమె అంత అందంగా ఎందుకుందో తెలిసింది. నాకు దీవెనలు ఎందుకు తెలిసింది. ఒకమనిషి సింహంలాగ నాలుగు కాళ్లమీద నడవలేనట్టే, నేను కూడా ఆ అమ్మాయి గురించిన కలను కడిగివేయలేను. ఆ అమ్మాయి అందం నాశనమయినట్టు భావించాను. వర్గపోరాటంలో ముందు నిలిచినా, నేను ఒక గాజు పలకను మాత్రమే. ఒకేఒక్క గాజు ముద్దను. అయినా ఈ కొత్తకాలంలో గాజును మోయనివారెవరు? ముందు మన శత్రువులు ఆ బరువును మోసేలా చూడాలి’ అలా సాగుతుంది కథ.

కథ చదివిన తరువాత యోకో ఏదో ఆలోచిస్తూ దూరాలకు చూడసాగింది. ‘వేజ్‌ ఏమయిందో’ అన్నది.

భార్య ముఖంలో అటువంటి భావన అతను ఎప్పుడూ చూడలేదు. ‘అయినా అప్పటికి నేను చిన్నపాపను’

అతని రంగు మారింది. ‘నిజమే, నీవు మరొక వర్గంతో పోరాడుతున్నా, లేదా ఆ మరొక వర్గం స్థానంలోకి మారి నీతో నీవు పోరాడుతున్నా, అన్నిటికన్నా ముందు, ఒక వ్యక్తిగా త్వరలోనే నీవు నాశనం చేయబడతావని గుర్తించి తీరాలి.’

అది సాధారణం. కథలోని అమ్మాయిలో అతనికి కనిపించిన అందం, తాజాతనం ఇన్ని సంవత్సరాలలో ఒకసారి కూడా అతనికి తోచలేదు. మరి ఆ గూని, పాలిపోయిన ఆరోగ్యంలేని కుర్రవాడికి ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చింది?




 

Thursday, March 12, 2026

అడివి బాపిరాజు నవల నారాయణరావు నుంచి....


అడివి బాపిరాజు నవల నారాయణరావు నుంచి....


ఆ సాయంకాలం సభలో పరమేశ్వరుడు మాట్లాడినాడు. నారాయణరావు కంఠముకన్న బరమేశ్వరుని కంఠము ఉపన్యాసములిచ్చుటలో నెక్కువ గంభీరత దాల్చును. అతడు వేలకొలది జనమును దన వాగ్ధారలో ముంచి మెత్తుకొని పోగలడు. నారాయణరావు గొంతుక యుపన్యాసములో మధురముగా నుండును. ధారాశుద్ధిగలది. ప్రతివిషయమును గూర్చిలెక్కలు మున్సగు వివరములు చెప్పుచు శ్రోతల హృదయమును చూరగొనును. బరమేశ్వరుడు లేచి “మానవుని హృదయం విశాలం అవ్వాలంటే దేశాలు తిరగడం ఒక మార్గం. (ప్రతివిద్యార్థినీ, ప్రతిరైతుకుర్ర వాణ్ణి చివరకు ఆంధ్రదేశమైనా పూర్తిగా తిరిగి రమ్మనాలి, ఆంధ్రదేశం మాత్రం తక్కువ ఉందా! బుషి కుల్యానదికడనుండి కంచివరకు, సముద్రం, ఇటు, అటు ముచికుందనది, భీమనది మొదలైనవి ఎల్లలు. మన దేశం ఏలినవాళ్ళు ఆంధ్రులు. మొదట్ల తనకు చరిత్రలో తెలిసివున్నంత మట్టుకు ఆంధ్రులు ఆఖరి కాణ్వాయణచక్రవర్తిని చంపి తాము చక్రవర్తులై రాజ్యం చేశారు. ఆరువందల సంవత్సరాలు. తర్వాత ఇక్ష్యాకులు, సాలంకాయనులు, బృహత్పాలాయనులు, పల్లవులు రాజ్యం చేశారు. విజయవాడలో, వేంగిలో, కాంచిలోను, తర్వాత గాంగులు, చాళుక్యులు,  కాకతీయులు, రెడ్డులు, వెలమలు, క్షత్రియులు, తెలగాలు, కమ్మవారు, గొల్లలు, కోమట్లు, బ్రాహ్మణులు రాజ్యాలు చేశారు. ఆంధ్రమహారాజ్యము యొక్క చిహ్నాలలో అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, ఘంటశాల, నాగార్జునమెట్ట ముఖ్యమైనవి. ఆంధ్రశిల్ప మత్యంత ప్రాభవము పొందినది. అంత ఉత్తమ శిల్పము నాటికి నేటికి లేదని వక్కాణింపవచ్చును. అంతయు పాలరాతిలో చెక్కారు.

ఆంధ్రశిల్పం యొక్క గొప్పంతా చెన్నపురి, లండను, బెర్లిను వస్తు ప్రదర్శనశాలలో ఉన్నది. పల్లవులున్నూ తమయొక్క చివ్నోలు కాంచీపురంలో, మహాబలిపురంలో అక్కడక్కడా నిలిపారు. విజయవాడలో వారు నిర్మించినట్టి దేవాలయం కృష్ణ ఒడ్డునే కొండమీద ఉన్నది.”

అతని ఉపన్యాసం వరదలనాటి గోదావరి నదివలె ప్రవహించుచున్నది.

మహాబలిపుర శిల్పంలోని గంభీరత అతి విచిత్రమైనది. అర్జునుని తపస్సు, కోతులగుంపు, యేనుగుల శిల్పవిన్యాసం మాధుర్యం వెదజల్లుచుండును. అచ్చట రాతిరథములు, ఒకేరాతిలో దొలిచినవి. ఆ గుడులు పరమాద్భుతములు. పంచపాండవుల రథములు, (ద్రౌపదిరథము నున్నవి. ఆ పట్టణమంతయు సముద్రమున మునిగిపోవుచున్నది.చాళుక్యుల శిల్పము దేశమంతయు వెదజల్లబడియున్నది. బాదామిలో, కళ్యాణిలో, (ధ్రాక్షారామములో, రాణ్మహేంద్రవరములో, సింహాచలములో ఇంకా అనేక దేవాలయములలో విగ్రహములలో చాళుక్యుల శిల్పచమతృతి కనబడుతుంది. చాళుక్యదేవాలయములు దాక్షిణాత్య దేవాలయములంత పెద్దవికావు.

కాకతీయ శిల్పకళాప్రాభవము ఓరుగల్లులో, పాలంపేటలో, అమ్మకొండలో దర్శనమిస్తుంది. కాకతీయులు శ్రీనటేశ్వరుని నాట్యామహదానందము చూపించుకొన్నారు. వారి శిల్పములో, విజయనగర సామ్రాజ్యము, హంపీ, తాడిపత్రి, పెనుగొండ, గుత్తి, మాచెర్ల, లేపాక్షులలో జూడగలము. హంపీ దృశ్యములు జూచిన యే మానవుని గుండెలు   తరుగుకొని పోవు?

మనహృదయములు విశాలత నొంది సర్వమానవ (పేమవిలాసితాలు కావలెనంటే కళాపూజకన్న ఇంకోటిలేదు. ఇంతమందిలో భద్రాచలము ఎంత మంది వెళ్ళారు? భద్రాచలము వెళ్ళుటే ఒకచక్కనియాత్ర. గోదావరిలో పడవలలో ఒక వారమురో జులు ప్రయాణము. ముందు ముందు మోటారు లాంచీలు వస్తాయి అనుకోండి. ఆ పాపికొండల్లో

పడవ మీద ప్రయాణంచేస్తూ తిప్పలమీద పండుకుంటూ, వెన్నెల్లో తిప్పలమీద పరవశిస్తూ కొండలు, అడవులు, గోదావరీ నీలపు లోతులు తన జీవితములోనికి ఆకర్షిస్తూ ప్రయాణము చెయ్యడము ఎంత ఆనందమో ఆలోచించండి.

అజంతా లోయలో జలజల ప్రవహించే భోగీరానది ఒడ్డున నిలుచుండి, ఆ జలప్రవాహము పాడు పాటలు వింటూ గోడల్లా పైకెగసి ఉన్న ఆ కొండలమధ్య కనబడే ఆకాశంచూస్తూ అర్థచంద్రాకృతిగా ఉన్న ఆ  విచిత్ర కందరముల గమనిస్తూ, సంధ్యారుణకాంతులు ఆకాశాన (ప్రసరిస్తూ కొండ శిఖరాన్ని ఎరుపు చేస్తూంటే, ఆ దివ్యప్రపంచంలో పూరాతన శిల్పి చెక్కిన విగ్రహాలకుమల్లే అలా నిలుచుండిపోయాము.

వాతాపినగరములో పశ్చిమచాళుక్యుల శిల్పచమత్ఫతి ఉన్నది. 50 గుహలు గ్రీకుల లేబ్రినులవలె ఉంటవి. కార్లేగుహలు అతిపురాతనమగు ఆంధ్ర బౌద్ధగుహలు. రెండువేల రెండువందల సంవత్సరాల క్రితమా గుహలలో నిర్మించిన దారుఫలకములు నేటికినీ చెక్కు చెదరకుండా ఉన్నవి.

నాసికలోని గుహలలో ఆంధ్రరాజుల శాసనములు చెక్కించినారు. బెరంగాబాదు గుహలలో గూడ మంచి విగ్రహములు, చిత్రలేఖనములున్నవి. నానా ఘట్టములలో ఆంధ్రశాతవాహన (ప్రభువుల శిల్పాలున్నవి. నొకటి. “బీజపురములో గోలు గుంబాజ్‌ అనేది ప్రపంచమేలో నున్న పెద్ద గుమ్మటములలో నొకటి. ఆ గుమ్మటములో పెకెక్కి గుమ్మటమున కావల నీవల నిద్ధరు మనుష్యులుండి ఎంత కేక వేసినా వినబడదు. గుమ్మటము గోడపై పెదవి యొకరూ, చెవి యొకరూ ఆన్చి రహస్యములు, గుసగుసలు సల్పినచో గూడ స్పష్టముగ  వినబడును.

దౌలతాబాదు కోట అజేయము. తినుబండారములు చేరనీయక మాడ్చవలసినదేగాని మానవమాత్రుడా దుర్గమును శౌర్యముచే చేరలేడు. ధాన్యపురాశివలె అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న కొండను, వరికుప్పవలె చెక్కినారు. కొండచుట్టూ సమతలానికి నూరడుగుల లతు కందకం నూరడుగుల వెడల్పు ఉంటుంది. సమతలానికి పైన గోడలా చెక్కిన కొండభాగం ఎత్తు నూ ఏభయి అడుగులు. కొండంతా కోటగోడలు, కొండశిఖరంపై చిన్నకోట, కోటమధ్య రాజభవనం, భవనం శిఖరం మీద ఫిరంగి.

త్ర్యంబకంలో గోదావరి పుట్టింది. కోట్లకొలది సంవత్సరాల యీడున్న ఆ కొండ నాలుగువేలు, అయిదువేలు అడుగుల ఎత్తు. సగంఎత్తువరకూ కంకరా, అడవులూ ఆవరించి ఉంటాయి. తక్కినభాగం అంతా నల్లటిరాయి. అట్లాంటి ఒక కొండ వెయ్యి, పదిహేనువందల అడుగుల ఎత్తు ఎక్కాము. ఆపైన ఒక చిన్న గుహ, కోనేరున్ను కోనేటిప్రక్కను ఒక గోముఖ విగ్రహం ఉన్నది. ఆ గోముఖంలోంచి చుక్కచుక్కలా గోదావరినది పడుతోంది.  అసలు అక్కడ అన్నీ కొండలలోంచి ప్రవహించే జలప్రవాహాలే. అవి అన్నీ గోదావరి అన్న పేరుతో ఉన్న చిన్నయేటితో కలుస్తాయి. అక్కడి నుంచి ఇరువది ఐదు మైళ్ళు దూరంలో ఉన్న నాసిక వచ్చేటప్పటికి గోదావరి రెండువందల అడుగుల వెడల్పున గొప్ప నదియైనది. ప్రతిష్టానంలో నాలుగువందల అడుగుల వెడల్పు, నిజామాబాదులో ఆరువందల అడుగుల వెడల్పు,  భద్రాచలము దగ్గర మైలు, రాజమహేంద్రవరముకడ రెండు మైళ్ళు, ధవళేశ్వరముకడ నాలుగు మైళ్ళు, డెల్హా ముఖమున ముప్పది మైళ్ళు వెడల్పున్నది.”

పిమ్మట పండరీపురము, హైదరాబాదు, గోలుకొండ, ఒరంగల్లు మొదలగు (ప్రదేశముల వింతలన్నియు కనులకు గట్టునట్లు పరమేశ్వరమూర్తి వర్ణించి చెప్పెను.


 

Tuesday, March 10, 2026

నగరం మండుతున్నది - హాల్ మార్ షోడెర్ బెర్గ్ (స్వీడన్) కథ


నగరం మండుతున్నది

హాల్ మార్ షోడెర్ బెర్గ్ (స్వీడన్) కథ


కథ 

రెండు కిటికీలున్నాయి. వాటిలో చిత్ర విచిత్రమైన డిజైన్లు మలచిన రాతి తెరలున్నాయి. ఆ చలికాలం ఉదయాన చల్లని సూర్యకాంతి ఏటవాలుగా, చతురస్రాలుగా మెత్తని ఆకుపచ్చ కార్పెట్ మీద పడుతున్నది. ఆ ఎండ వెలుగులో ఒక చిన్న బాబు హాయిగా ఆడుతున్నాడు. వాడికి ఇంకా ఈ ప్రపంచం గురించి తెలియదు. తాను చిన్నవాడినని తెలుసు. పెరిగి పెద్దవాడిని అవుతానని తెలుసు. అయితే తాను పుట్టానని, ఒకనాటికి మరణిస్తానని మాత్రం తెలియదు. తనకు నాలుగు సంవత్సరాలు వయసని తెలుసు. త్వరలోనే ఐదు అవుతుందని తెలుసు. అయితే సంవత్సరం అంటే ఏమిటో మాత్రం తెలియదు. వాడికి కాలం అంటే నిన్న, ఇవాళ, రేపు వరకే తెలుసు.
పాపా! వాడు ఒక్కసారి ఆశ్చర్యంగా తండ్రిని పిలిచాడు. ఆ తండ్రి అప్పుడే బ్రేక్ ఫాస్ట్ ముగించి, ఆనాటికి మొదటి చుట్ట ముట్టించుకున్నాడు. అతనికి కాలం లెక్క చుట్టలమీద ఆధారపడి సాగుతుంది మరి! నాన్నా! రాత్రి నాకు కలలో చాలాసంగతులు కనిపించాయి! మొత్తం గది కనిపించింది! కుర్చీలు, పచ్చతివాచీ, అద్దం, గడియారం, స్టవ్, అల్మరాలు అన్నీ కనిపించాయి,’ అన్నాడు వాడు.
మాట్లాడుతూనే వాడు స్టవ్ వద్దకు వెళ్లాడు. ఆ పొయ్యి చిటపటలాడుతూ మండుతున్నది. వాడు పొయ్యిని, దాని స్థలాన్ని గమనించ సాగాడు. వాడి దృష్టిలో మొత్తం గదిలో అవి అన్నింటికన్నా గౌరవకరమయిన ప్రదేశాలు.
నాన్న పేపర్ చదువుతూ దాని అంచు మీదుగా బాబును చూచి నవ్వుతున్నాడు. బాబు కూడా జవాబుగా నవ్వాడు. పట్టరాకుండా నవ్వుతున్నాడు. వాడి వయసులో నవ్వు అంటే సంతోషాన్ని తెలియజేసే పద్ధతి. అర్థం లేని సంగతులను చూచి చేసే చప్పుడు కాదు. కొన్ని రోజులక్రితం బాబు కిటికీ దగ్గర నిలుచున్నాడు. చంద్రుడిని చూచి నవ్వాడు. అంటే చంద్రుడు అతనికి నవ్వులాటగా కనిపించిందని కాదు. గుండ్రంగా, అందంగా వెలుగుతున్న చంద్రుని చూసిన బాబుకు ఆనందం కలిగింది. అంతే!
వాడి నవ్వు అయిపోయింది. కష్టపడి కుర్చీ మీదకు ఎక్కాడు. గోడ మీది ఒక చిత్రాన్ని చూపించాడు.
అన్నిటికీ మించి కలలో ఈ బొమ్మ కనిపించింది,’ అన్నాడు.
అది, ఏ బర్నింగ్ సిటీ అనే పాత డచ్ పెయింటింగ్ యొక్క ఫోటోగ్రాఫ్.
అవునా! కలలో ఏం కనిపించింది అందులో?’ నాన్న అడిగాడు.
నాకు తెలియదు.
గుర్తు తెచ్చుకో!
ఆ! అంతా మండుతున్నది. నేనేమో కుక్కను నిమిరాను.
కానీ మామూలుగా నీకు కుక్కలు అంటే భయం కదా?’
అవును. కానీ బొమ్మలో కుక్కను ముట్టుకుంటాను.
వాడు మళ్ళీ నవ్వసాగాడు. హాయిగా ఆడడం సాగించాడు.
చివరకు బాబు నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్నా, నాన్నా! ఆ బొమ్మని కిందకు తీయవా? నాన్న నాకు నిన్నటి లాగే ఆ బొమ్మను చూపిస్తాడోచ్! అన్నాడు.
ఆ బొమ్మ గదిలోకి కొత్తగా వచ్చింది. సరిగ్గా మొన్ననే వచ్చింది. మిగతా గోడలమీద ఉన్న చిత్తరువులన్నీ బాబుకు బాగా తెలుసు. అంకుల్ స్ట్రిండ్ బెర్గ్, అంకుల్ షోపార్ (షోపెనవర్), అంకుల్ నెపోలియన్, ముసలి గ్యోఠే, నానమ్మ చిన్ననాటి ఫోటో. అయితే ఈ మండుతున్న నగరం కొత్తది. అంతేగాక అది మిగతా వాటికన్నా ఎంతో ఆసక్తికరంగా ఉంది. తండ్రి తన బాబు మాట విన్నాడు. చిత్తరువును గోడ మీదనుంచి తీశాడు. ఇద్దరూ ఆనందంగా దాన్ని చూడసాగారు. ఒక పెద్ద నీటిమడుగు ఉంది. అది వంపు తిరిగి సముద్రంలో కలుస్తున్నది. నీటిలో తెప్పలు, బోట్ లు ఉన్నాయి. వంకర వంతెనల కిందుగా అవి పోతున్నాయి. ఆ పక్కన పెద్ద టవర్ ఉంది. ఎడమతీరం మీద మండుతున్న నగరం ఉంది. పైన నిటారు గోపురాలుగల వరుస యిండ్లు, వాటి పైకప్పులు, చర్చ్ లు, మరిన్ని టవర్లు. బోలెడంత మంది అటుయిటు పరుగెత్తుతున్నారు. సముద్రంలాగే మంటలు వ్యాపిస్తున్నాయి. పొగ మేఘాలుగా లేస్తున్నది. గోడలకు నిచ్చెనలు వేసి ఉన్నాయి. గుర్రాలు బండ్లను లాగుతూ పరిగెడుతున్నాయి. రేవుల్లో బ్యారెల్స్, సంచులు చెత్తచెత్తగా పడి ఉన్నాయి. నదిమీద ఒక తెడ్లనావలో బోలెడంత మంది జనం. అదేమో తలకిందులు అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వంతెన మీద జనం ప్రాణభీతితో పరిగెడుతున్నారు. బొమ్మలో ముందువైపు మాత్రం, రెండు కుక్కలు ఒకదాన్ని మరొకటి వాసన చూస్తున్నాయి. బొమ్మలో మరీ వెనుక నీళ్లు, సముద్రంలో కలిసిన చోట చంద్రుడున్నాడు. చాలా చాలా చిన్నగా ఉన్నాడు. చుట్టూ మబ్బులు పాలిపోయినట్లున్నాయి. అవి కింద బీభత్సాన్ని నిస్సహాయంగా చూస్తున్నట్టున్నాయి.
నాన్నా! నగరం ఎందుకు మండుతున్నది?’ బాబు అడిగాడు.
ఎవరో మంట విషయంగా నిర్లక్ష్యం చేసి ఉంటారు!
నిర్లక్ష్యం చేసింది ఎవరు?’
ఇంత జరిగిన తర్వాత చెప్పడం కష్టం
ఎంత జరిగిన తర్వాత?’
ఈ నగరం తగలబడి వంద సంవత్సరాలయింది,’ నాన్న చెప్పాడు.
అదే బాబుకు అర్థం కాని సంగతి. ఆ సంగతి నాన్నకు తెలుసు. అయినా ఏదో చెబుతాడు. బాబు ఆలోచిస్తూ కొంతసేపు ఉండిపోయాడు. అతనికి మెదడులో విషయాలను గురించి కొత్త ఆలోచనలు, భావనలూ పుడుతున్నాయి. అవి పాతవాటితో కలుస్తున్నాయి. చిన్న వేలుతో పఠం వైపు చూపిస్తూ, అవును, కానీ నిన్న కూడా అది తగలబడుతూ ఉంది. ఇక ఇవాళ ఇప్పుడు కూడా తగలబడుతున్నది. వాస్తవానికి, చిత్రాలకూ మధ్య తేడాను వివరించాలని తండ్రి ప్రయత్నం మొదలుపెట్టాడు. అది నిజమైన నగరం కాదు, అన్నాడు. అది కేవలం బొమ్మ, అసలు నగరం ఏనాడో తగలబడిపోయింది, అది యిప్పుడు లేదు. బొమ్మలో అటుయిటు పరిగెత్తుతున్నవాళ్లంతా చనిపోయారు. వాళ్ళిప్పుడు లేరు. ఇళ్లన్నీ కాలిపోయాయి. టవర్స్ పడిపోయాయి. వంతెన కూడా కూలింది.
టవర్స్ కాలి, కూలిపోయినయా?’ బాబు అడిగాడు.
అవును. కాలినయి, కూలినయి.
బోట్లు కూడా చచ్చినయా?’
బోట్లు కూడా ఎప్పుడో పోయాయి. అయితే నీవు అనుకుంటున్నట్టు అవి స్టీమ్ బోట్స్ కావు. మామూలు తెరచాప రకం. ఆ కాలంలో స్టీమ్ బోట్స్ లేవు.
బాబు కింద పెదవి ముందుకు చాచాడు. అర్థం కాలేదు అన్న భావం వెలిబుచ్చాడు.
నాకేమో అవి స్టీమ్ బోట్స్ లాగా కనబడుతున్నాయి. ఆ స్టీమ్ బోట్ పేరేమిటి నాన్నా?’
వాడి మెదడు వాడికి ఉంది. బాబు మెదడు. తండ్రి విసిగిపోయాడు. కానీ ప్రశాంతంగా ఉన్నాడు. బాబు వేలితో డచ్ వ్యాపార నౌకలను చూపించాడు. ఆ స్టీమర్ పేరు బ్రేగ్. ఆ పక్కది హిల్లర్ సీ. ఇక మరొకటి ప్రిన్సెస్ ఇంగెబోర్గ్. తనకు తానే అనుకుంటున్నాడు.
నాన్నా! చంద్రుడు కూడా కూలిపోయాడా?’ వాడు ఒక్కసారిగా అడిగాడు.
లేదు. చంద్రుడు ఇంకా ఉన్నాడు. బొమ్మలోని అన్నింటిలోనూ మిగిలింది చంద్రుడే. ఆ చంద్రుడినే కిటికీలోనుంచి చూచి నీవు నవ్వింది.
మళ్లీ కుర్రవాడు ఆలోచనలో పడిపోయాడు. మళ్ళీ ఒక ప్రశ్న పుట్టింది.
నాన్నా! ఈ నగరం కాలిపోయి చాలాకాలం అయిందా? మనం ప్రిన్సెస్ మీదకు వెళ్ళామే. అంతకంటే చాలా ముందా?’
ఇంకా చాలా చాలా ముందు. ఆ నగరం తగలబడినప్పుడు, నీవు లేవు. నేను, అమ్మా, లేము. నాయనమ్మ కూడా లేదు! తండ్రి వివరించాడు.
ఒక్కసారిగా బాబు ముఖం గంభీరంగా మారింది. అతడు చిక్కులో పడినట్టు తెలుస్తుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అయినా ఏమీ తోచినట్టు లేదు.
ఒకటి చెప్పు నాన్నా! నగరం మండినప్పుడు నేను ఎక్కడున్నాను? నేను అమ్మతో ఊరికి వెళ్ళినప్పుడా అది మండిపోయింది?’’
కాదు, ముసలాయనా! నగరం మండినప్పుడు నీవింకా లేనేలేవు! జవాబిచ్చాడు.
చిన్నబాబు కింద పెదవి మళ్లీ ముందుకు వచ్చింది. నీవు చెప్పేది నేను అవుననడానికి లేదు, అని చెబుతు న్నట్టు ఉంది తీరు. ఈసారి రెట్టించి అడిగాడు.
సరే, అయితే మరి నేను అప్పుడెక్కడున్నాను?’
నీవు లేనే లేవు,’ తండ్రి జవాబు యిచ్చాడు.
బాబు కళ్ళు పెద్దవి చేసి తండ్రి వైపు చూచాడు. ఒక్కసారిగా చిన్నారి ముఖంలో వెలుగు కనిపించింది. తండ్రి నుంచి అతను దూరంగా జరిగాడు. మళ్లీ ఆటలో పడిపోయాడు. పచ్చని తివాచీ మీద పడిన ఎండల్లో తిరుగుతున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు.
అవును. అదే మరి. నేను ఎక్కడో ఉన్నాను. ఎక్కడో ఉన్నాను.
తండ్రి తనతో తమాషా చేస్తున్నాడని బాబు అభిప్రాయం. అర్థంలేని ఆలోచన. పని అమ్మాయిలు అప్పుడప్పుడు తనతో సరదాగా అర్థంలేని మాటలు అంటారు. తండ్రి కూడా అదే చేస్తున్నాడని బాబు భావన.
అందుకే హాయిగా ఎండమరకల్లో ఎగురుతూ ఆడుతున్నాడు.