Showing posts with label Experience. Show all posts
Showing posts with label Experience. Show all posts

Sunday, June 14, 2026

లోకాభిరామం - బ్యాడల పుళి (On languages and me)


లోకాభిరామం - బ్యాడల పుళి 


బ్యాడల పుళి

నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్‌నగర్ వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె. అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే చోట్ల కన్నడంలో హకారం వస్తుంది.  హాలు అంటే పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె. పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది. శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది. బొమ్మల్లో, విగ్రహాల్లో మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము. ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి పక్కనా? కుడి అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ, కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను. పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది. ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది. ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా, పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’ పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు. సంప్రదాయమంటే, అదేమిటి అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్‌రైస్‌లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె) కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్ హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్‌లో ఉరుదూ ప్రభావం బాగ ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్‌గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమిఅన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు) అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ! ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో, ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది. మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని అనుకుంటున్న. జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్‌కు నా మీద కావలసినంత అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు కన్నడములో, లేదా తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి? అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు.  అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ, మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి విన్నవించుకుంట.


 

Friday, May 29, 2026

నక్షత్రాలు ఏమయినయి ?


నక్షత్రాలు ఏమయినయి?


చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడ పల్లెకు పోయి ఆరుబయట పండుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేటివి. పట్నం జేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువయిపోయింది. అందుకు కారణం కాంతి కాలుష్యం అని సులభంగనే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడ వెదజల్లబడి అక్కడ చుక్కలు మనకు కనిపించకుండ చేస్తున్నయి. ఈ వెలుగుల కారణంగ ఆకాశం వెలుగుతున్నది అని అర్థం.
నక్షత్రాలను, అంతరిక్షంలోని ఇతర అంశాలను పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు, ఇదంతా పెద్ద సమస్యగ చాల కాలంగనే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూచినరు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూచినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాలకంటే వేరుగ ఉంటయి. మనిషి వెలుగులు మరి ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు అంటే ప్రయోగాలు మొదలయ్యనయి.
జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగ పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నరు. అటువంటి ఒక పట్టణంలో ఆకాశం బాగ వెలుగుతుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తయి. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగ మనిషి కండ్లు గూడ చూడగలుగుతయి అంటున్నరు. కనుక మనుషులు ఆకాశంలోకి తొంగి చూచి ఈ పటాలలో కనిపించే తీరు వారికి కనిపిస్తున్నదా లేదా అన్న అంశాన్ని బేరీజు వేసుకుంటరు.
2011 సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నరు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశినరు. ప్రాంతానికి ప్రాంతానికి మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చినరు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10% కంటే ఎక్కువగ ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడ చాల ఎక్కువ గద. మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నరు.
మామూలుగ ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగ పెరిగిపోతుంది. అదేదో చక్రవడ్డీ పెరిగినట్టు పెరుగుతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట.
కైబా గారు అనుచరులతో కలిసి ఈ మధ్యనే సైన్స్ అనే పత్రికలో ఒక పరిశోధన పత్రాన్ని ప్రకటించినరు. ఒకరికి ఎవరికో మొదటి రోజుల్లో 250 నక్షత్రాలు కనిపిస్తే ఆ వ్యక్తికి 18 సంవత్సరాలు వయసు వచ్చే లోపల కేవలం 100 నక్షత్రాలే కనిపిస్తయి అని లెక్క తేల్చినరు. ఆ సమయంలో ఆకాశంలో వెలుగు నాలుగంతలు పెరిగిపోయిందని అర్థం.
అటు అంతరిక్ష నౌకలో వారు మాత్రం, ఏటేటా రెండు శాతం పెరుగుదలను మాత్రమే గమనించినట్లు చెప్పినరు. అది అసలు నిజం పరిస్థితి కానే కాదు. ఉపగ్రహాలు తమ లెక్కలలో చాలా తక్కువ మార్పులు మాత్రమే చూపిస్తున్నయి, అని కైబా బృందం వారు నిస్సందేహంగ తేల్చివేశినరు. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించని కనిపించవేమో అంటున్నరు.
టెక్నాలజీ లో వస్తున్న మార్పుల కారణంగ ఈ కాలుష్యం బాగ పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చినరు. ఒకప్పుడు వీధి దీపాలలోని ఎర్రని వెలుగు ఒక రకంగ ఉండేది. ఇప్పుడు ఎల్ఈడి బల్బులను వాడుతున్నరు. అందులో నుంచి వచ్చే కాంతి కొంత నీలంగ ఉంటుంది. నీలం వెలుగు సులభంగ పరుచుకుంటుంది. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మాత్రం ఈ రకం వెలుగును అంతగా చూడలేవు. పైగా అవి నగరాలలోని వెలుగును మాత్రమే బాగా చూడగలుగుతయి. ఇళ్లలో నుంచి కిటికీలోనుంచి బయటకు వచ్చి అదే తలంలో పరుచుకునే వెలుగును మనుషులు బాగా చూడగలుగుతరు. దాని ప్రభావానికి సులభంగా గురవుతరు.
ఇటువంటి వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగ ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతయి. చివరకు మిణుగురు పురుగులు కూడ ఈ వెలుగుకు తికమక పడతయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగ ఉంటుంది.
వాతావరణం వేడెక్కుతున్నది అని ఒక పక్కన గోల చేస్తున్నరు. ఈ వెలుగు కాలుష్యం కూడా అదే పద్ధతిలో ప్రపంచమంతటా పరుచుకుని ఉంటుంది. ఎవరికి వారు దీని నుంచి బయటపడే మార్గం లేనేలేదు. వాతావరణం వేడెక్కడం కూడ ఇదే పద్ధతిలో ఏటా పది శాతం ప్రకారం పెరిగి ఉంటే తప్పకుండ దానిమీద తీవ్రమైన ప్రయత్నాలు జరిగి కొంతవరకు అదుపు కూడా వీలయి ఉండేది. ఈ కాంతి కాలుష్యాన్ని ఎవర పట్టించుకోవడం లేదు.
నిజానికి రాత్రిపూట ఎక్కువ వెలుగు ఉంటే భద్రతగ ఉంటుంది అని చాలామంది భ్రమ పడుతున్నరు. వెలుగు బాగ ఉన్నందుకు రాత్రిపూట దారుల మీద ప్రమాదాలు తక్కువ కావచ్చు, నిజమే. అయితే ఆ రకమైన రక్షణ అనుకున్నట్టు జరగడం లేదు అని పరిశోధకులు అభిప్రాయం. పుడుతున్న ఈ వెలుగులు నిటారుగ ఆకాశంలోకి వెదజల్లబడతయి కానీ, మామూలుగ కిందికి సాగవు.
ఆకాశం మళ్ళ మొదటిలాగ కనిపించాలంటే ఏం జేయాలె అన్నది ఒక ప్రశ్న.
అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం అనేది ఒకటి తయారయి ఉందని, అది తీవ్రంగ పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగ వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నరు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు కిందకు మాత్రమే రావాలె అని వారు సలహా ఇస్తున్నరు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడ చెబుతున్నరు.
వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాల అవసరం. ఇంటి బయట రాత్రంత అనవసరంగ వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగ చర్చించి అక్కడి పరిస్థితులకు అనుకూలంగ ఏర్పాటు చేసుకోవాలె. అందర చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు.
కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగ అంచనా వేసేందుకు లేదు. ప్రకృతి అందం పాడుగాకుండ ఈ వెలుగులను వాడాలె. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్న అందమైన దృశ్యం. దాన్ని చేతనయినంతవరకు కాపాడుకోవాలె. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగ గుర్తించి పరిశీలించాలె. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతయినా చెప్పగలుగుతరు. రాత్రి ఆకాశం నిజంగా అందమయినది.
కాంతి అన్నది పరిశోధకులకు మాత్రమే సమస్య కాదు. పట్టణాలలో బతికే వారికి ఈ సమస్య గురించి అసలు తెలియనే తెలియదు. ఆకాశంలో నక్షత్రాలు ఉంటయి అన్న సంగతి వాళ్ళు మరిచిపోయినరు. రాత్రి చీకటి ఆకాశము మనకెంతో అవసరం. పొద్దు మూకితే చాలు ఆ అందాలు కనిపించే ఏర్పాట్లను మనం జాగ్రత్తగ చేసుకోవాలె. వీలయినప్పుడంత నగరాల వారు కూడ దూరంగా వెళ్లి నక్షత్రాలను చూచి ఆనందించడం నేర్చుకోవాలె.



 

Monday, May 11, 2026

లోకాభిరామం : అసలు - నకలు : On Imitation

 


లోకాభిరామం : అసలు - నకలు


అసలు - నకలు

Published Saturday, 23 February 2019
 
పాట విని చాలా బాగుంది అంటుంటారు. బాగా పాడారు అంటే ఏమిటి అర్థం? పాట అంతకుముందే మరెవరో పాడి ఉంటారు. దాన్ని మరొకరికి నేర్పించి ఉంటారు. లేదా పాడినవారు పాటవిని మాత్రమే పాడి ఉంటారు. అటువంటి పాట బాగుంది అంటే అందులో అర్థం, అంతరార్థం ఏమిటి? నన్ను అందరూ కోడిగుడ్డు మీద అదేదో చేస్తున్నాడు అని తప్పు పట్టకండి గాని, కొంచెం నామీద సానుభూతి చూపి ప్రశ్న గురించి ఆలోచించండి. పాడిన వ్యక్తి అంతకుముందు పాటను పాడిన వ్యక్తిని చాలా బాగా అనుకరించారు అనే కదా! ఇమిటేషన్ అన్నది గొప్ప విద్య. అది మక్కికిమక్కీగా విరామాలతో సహా అసలు పాటలాగే పాడాలి. ఇక కొత్త గాయకుని సొంతతెలివి అంతవరకే పరిమితం అయ్యింది అని నేను అంటే మీరు నన్ను తప్పు పడతారు.
శాస్ర్తియ సంగీతంలో మనోధర్మం అని ఒకటి ఉంది అని చెబుతుంటారు. ఇక హిందుస్తానీ సంగీతం ఇంచుమించు మనోధర్మం మీదనే ఆధారపడి అదొక పద్ధతిలో సాగుతుంది. అయితే చాలామటుకు పాటలలో, ముఖ్యంగా కర్ణాటక సంగీతంలో అనుకరణ, నకిలీ చేయడం ఒక్కటే గొప్పతనం కింద లెక్క. స్వరప్రస్తారం కూడా, లేక నెరవల్ వంటివి కూడా అంతకుముందు మరెవరో చేసిన పద్ధతిలోనే చేసి తీరాలి. ఆలాపన విషయంలో అయినా ఇంచుమించు అంతే. ఎందుకంటే ఇక్కడ మనోధర్మానికి, ఒక నిర్మాణం, ఒక చట్రం, ఒక పరిధి ఉన్నాయి మరి! మాటలు చదివిన చాలామందికి కోపం రావచ్చు! కనీసం అసంతృప్తి కలగవచ్చు! అది జరగాలని, రకంగా కొంతమంది ఆలోచించాలని నా ఉద్దేశం అంటే నమ్మండి!
ప్రపంచంలో కొత్తదనానికి అర్రులు చాచేవారు కొంతమంది మాత్రమే. పడమటివాడు థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటాడు. మరొకడు కొత్తదారులు తొక్కమంటాడు. కలలు కనండి అంటాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా అందులో ఎక్కడో ఒకచోట నకలు అన్న పద్ధతి ఉండనే ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. ప్రపంచం తీరే అంత. గతానుగతికో లోకః అన్న మాట ఉండనే ఉంది. కొత్తదారి తొక్కిన వారికి ముళ్ల సమస్య ఉంటుంది కనుక ముందు కనిపించిన దారిలోనే అందరూ పోతారు. కనుకనే అది ఒక దారిగా ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ ఒక కొత్త దిశగా నడిస్తే, అప్పుడు దారులు కనిపించవు. అడుగుజాడలు అంతకన్నా కనిపించవు. ఎక్కువమంది ఒకే మార్గంలో నడుస్తారు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే కొత్తదారులు చూపిస్తారు.
మనిషికి మాటలు ఎట్ల వస్తయి? మిగతా వాళ్ల మాటలు వింటున్నందుకే కదా? అందరూ బాబును లేదా పాపను ఒక పేరు పెట్టి పిలుస్తరు. అప్పుడు కొంతకాలానికి అది తనపేరు అని అర్థమవుతుంది. ఇందులో అనుకరణ కాకుండా అనుసరణ ఉందేమో? తరువాత అమ్మ, అత్త, లాల, బువ్వ అంటూ ఒక్కొక్కటిగా మాటలు ఎదుటి వారిని చూసి నేర్చుకోవడం తప్ప మరొక మార్గం లేదు. అదే సంగతి పాట విషయంలో జరిగితే ఇక్కడ మరొక రకంగ ఎందుకు ఆలోచనలు సాగుతయి? అది నాకు మెదడులో కలకాలంగా ఉన్న ప్రశ్న! ఇక మీద కూడ ఉండి తీరుతుంది. నడక అయినా, తిండి అయినా మరొకటి అయినా పనులు మరొకరిని చూసి నకలు చేసి నేర్చుకోవలసిందే! ఇక కొంతకాలం తరువాత చదువు అని ఒక యజ్ఞం మొదలవుతుంది. అక్కడ కూడా ఉన్నది నకలు చేయడం మాత్రమే! తెలిసిన తరువాత కూడా అవగాహనను పెంచే రకం చదువులు అంతంత మాత్రంగానే ఉంటాయి. బడిలో పంతులు తెలివిగలవారిని, అంతంత మాత్రం వారిని, తెలివిలేని వారిని కూడా ఒకేచోట కూర్చోబెట్టి, ఒక సగటు పద్ధతిలో పాఠం చెబుతరు. అందులోనుంచి ఎవరికి చేతనైనంత, వారు అందుకోవాలి. తెలివిగల పిల్లలు సంగతి అందరికీ అర్థమయ్యేటట్లు ఒక ప్రశ్న అడిగితే, కొంచెం ఆగమని, వారిని పక్కకు తీసుకువెళ్లి నీవు ప్రశ్నలు అడగకుండా ఉంటే బాగుంటుంది అని నచ్చచెబుతారు. సంగతి నాకు చిన్నప్పుడు బడిలోనుంచి మొదలు మొన్నమొన్నటి దాకా అనుభవంలో ఉన్న విషయం. ఇక నాకు, ఆలోచించకూడదు, అనవసరంగా ప్రశ్నలు అడగకూడదు, అన్న భావం బలంగా నాటుకుని పోక మరేమవుతుంది?
పెద్దచదువుల పేరున కొన్ని విషయాలు నేర్పిస్తారు. నేను జంతుశాస్త్రంలో ఎమ్మెస్సీ చదువుకున్నాను. జీవుల గురించిన ప్రాథమిక విషయాలైన శరీరనిర్మాణం, వాటి పనిపద్ధతి ఇలాంటి మూల విషయాలు చెప్పారు తప్ప, నాకు అక్కడ చుట్టుపక్కల ఉండే జంతువుల గురించికానీ, ప్రపంచంలో జంతువుల వ్యాప్తి గురించి గానీ, మనిషికి జంతువులు చేసిన సాయం గురించి గానీ, ఇప్పుడు చేయగల పనులను గురించి గానీ ముక్క కూడా చెప్పలేదు. కొంత పర్యావరణం గురించి చెప్పినట్లు జ్ఞాపకం. గుర్రం, ఏనుగు, ఒంటె లాంటివి పరిణామం చెంది ఇప్పటి పరిస్థితికి వచ్చిన వివరాలు కూడా కొంత చెప్పినట్టు గుర్తు. ఇవన్నీ చదువుకుని జంతువుల మధ్యకు వెళ్లి నేను ఏం అర్థం చేసుకోగలను? మాకు చదువు చెప్పిన ఒక పెద్దమనిషి, ఒక పక్షిని గురించి చెబుతూ నూనెకాకి అన్నాడు. కానీ దాన్ని మామూలు ప్రపంచంలో చమురు కాకి అంటారని నాకు తెలుసు. సంగతి నేను చెబితే ప్రొఫెసర్గారు వింటారా? నాది అతితెలివి అని కోపగించుకుంటారు బహుశా!
అది భౌతికశాస్త్రంగానీ, రసాయనశాస్త్రం గానీ, ఇటు జనజీవితానికి సంబంధించిన సాంఘికశాస్త్రాలు గానీ, మౌలిక అంశాలు చెప్పి వదులుతున్నారు కానీ, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, తన చదువును దానితో జతచేసి అవగాహన కలిగించుకోవడం వీలయ్యే చదువులు లేవు. కనుక ఎందుకు పనికిరాని చదువంతా నకలు పద్ధతిగా మిగిలిపోయింది. అందులో ఒకే ఒక విషయం గొప్పగా ఉంది. తెలివి గురించి ప్రశ్న లేదు. విషయాలను గుర్తుంచుకునే శక్తి, వాటిని యథాతథంగా పరీక్షలో వెళ్లగక్కే వెసులుబాటు ఎవరికి ఎంత ఎక్కువ ఉంటే వారు అంత గొప్పవారు. అంటే అవగాహన సంగతి పక్కనబెట్టి, కేవలం నకలు చేయడం నేర్చుకోండి అని చెబుతున్నారు. అదే మరి పరీక్షల్లో కూడా చూచి రాస్తాం అంటే మాత్రం ససేమిరా ఒప్పుకోరు! ఇది ఎంత విచిత్రం? గుర్తున్నది రాయడం సులభం! నకలు చేయడం చాలా కష్టం! మేము బిఎస్సీ పరీక్షలు రాసినప్పుడు మూకుమ్మడిగా అందరూ నకలు చేస్తున్నారు. నేను మాత్రం సొంతంగా రాస్తున్నాను. భాగ్యలక్ష్మి మేడంగారు వచ్చి, నాయనా నువ్వు కూడా చూచి రాయవచ్చు కదా? అని అడిగారు. చేతనైనంత రాస్తాను. మార్కులు వేసేవారికి సంగతి అర్థం కాకపోదు, అని జవాబు ఇచ్చినట్టు గుర్తు. అన్నీ పక్కనపెట్టి, మహా ఘనత వహించిన విశ్వవిద్యాలయం వారి నిర్ణయం ప్రకారం, మా కాలేజీలో ఎవరికీ ఫస్ట్క్లాస్ మార్కులు రానేలేదు. బతుకంతా బాగా చదువుకున్న నేను, బిఎస్సిలో మాత్రం సెకండ్ క్లాస్ మార్కులతో మాత్రమే పాస్ అయ్యాను. ఎందుకని? నేను నకలు చేయలేదు కనుకనా? లేక అందరూ చేశారు కనుకనా? జవాబు నాకు తెలుసు! కానీ చెప్పను!
ఫ్యాషన్లు వస్తాయి పోతాయి. ఒక ఫ్యాషన్ వచ్చిందంటే అందరూ మూకుమ్మడిగా, వేలంవెర్రిగా వెంటపడి అనుకరిస్తారు. అనుసరిస్తారు. అంటే కూడా మరెవరి పద్ధతినయినా సరే అనుసరించి బతకడమే బాగుంటుంది, అని ప్రపంచం అవగాహన అన్నమాట. ఆయనెవరో ఫ్యాంట్ వేసుకుని, పైన లాల్చీ వేసుకుని వచ్చాడు. పని నేను చేస్తే అందరూ నవ్వి ఉండేవారు. చేసింది ఒక మహానటుడు, అది కూడా ఒక సినిమాలో చేశాడు. దానికి డైరెక్టర్ ఒప్పుకున్నాడు. కనుక తరువాత మేమంతా రకంగా బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాము. గురు షర్ట్ అనే పద్ధతి ప్రస్తుతం చాలా మామూలు అయింది. రకం లాల్చీలను మోకాళ్లు దాటిన దాకా వేసుకునే పద్ధతి మధ్యలో వచ్చింది. నేను అటువంటి కుర్తా వేసుకుని వెళ్లాను. సరిగ్గా అదేనాడు మా దగ్గర ఒక క్లాస్ ఫోర్ కూడా అట్లాంటిదే చొక్కా వేసుకుని వచ్చాడు. ఇదండీ నకిలీ పద్ధతి! అది జరగకూడని సంగతి కానే కాదు. నకలు చేయడంలో కూడా తెలివి ఉండాలి! ఎవరు దేన్ని నకలు చేయవచ్చు, దేన్ని చేయకూడదు అన్న ఒక వివేకం కూడా ఉండాలేమో! మెచ్చుకోవడానికి పతాకస్థాయి అనుకరణ, అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఒకటి ఉన్నది. కనిపించిన ఒక విషయం మరీ ఎక్కువగా నచ్చితే, మనం కూడా అటువంటి విషయాన్ని సొంతం చేసుకోవాలి అన్నమాట. నేను ఇటువంటి మాటలు చెప్పడం ఎవరిని చూచి నేర్చుకున్నాను?
ఇవాళ మోకాళ్ల వరకు మాత్రమే ఉండే ఒక లాగు వేసుకొని బజార్లో తిరిగి వచ్చాను. కొంతమంది నా వైపు చూసినట్లు అనుమానం కూడా వచ్చింది. కానీ ప్రపంచమంతటా చాలామంది ఇలాగ షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారని చూశాను. కనుక నేను కూడా అదే పని చేశాను! తప్పేముంది?
అనుకరణ కారణంగా ప్రపంచమంతా ఒక కలగలుపు ఫ్రూట్జామ్ పద్ధతికి మారిపోయింది. ప్రపంచంలో మూలను చూసినా తేడా తెలియకుండా ఉంది. సంస్కృతి అంటే మాట, పాట, కట్టు, బొట్టు, వంట వంటివి అని అనుకునే వాళ్లం. కానీ వాళ్ల ప్రపంచమంతటా ప్యాంట్లు వేసుకుంటున్నారు. భారతదేశమంతటా పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నారు. ఒకప్పుడు మా ఊరిలో పంజాబీ డ్రెస్ను కేవలం పాకీవాళ్లు మాత్రమే వేసుకునేవారు అని నేను చెబితే ఇవాళ చాలామందికి నచ్చకుండా ఉంటుంది. ఎంతో అనుకూలంగా ఉండే దుస్తులు ఇవాళ భారతీయతకు గుర్తింపుగా మారిపోయాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ వారి విమానంలో విమాన కన్యక అసలు సిసలైన పంజాబీ దుస్తులలో కనిపించింది అంటే అదే మరి! అనుకరణ తప్పు కానే కాదు. అది నేర్చుకునే పద్ధతి అని నేను కూడా తెలుసుకున్నాను. అయితే పేరుతో అన్ని పాత పద్ధతులను అనుసరిస్తుంటే, ఇక మరి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించవలసిన ప్రశ్న. అడగవలసిన ప్రశ్న!
లోకాభిరామం వ్యాసాలు రాయడంలో నేను ఒకరిద్దరిని ఆదర్శంగా పెట్టుకున్నాను. అంతేకానీ అనుకరణ మాత్రం చేయడం లేదు. అది నిజానికి నావల్ల కాదు. అంటే చేతకాదని అర్థం కాదు. నేను అనుకరించదలచిన ఒకరిద్దరు తమకంటూ చక్కటి గుర్తింపు గలవారు. కనుక నేను వారి పద్ధతిలో రాసిన మాటలు వెంటనే బయటపడి పోతాయి. కనుక నా దారిలో నేను రాయడానికి ప్రయత్నం చేయాలి. చేస్తున్నాను కూడా!