లోకాభిరామం : మాటా - మంతీ
On languages and speaking.
మాటా - మంతి
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
మాటా - మంతి
ఆలోచన
తెలివి తెలిసి తెలియక ముందే బడిలో పడేస్తరు. పంతులు చెప్పిందే చదువు అన్న పద్ధతి అక్కడనే మొదలవుతుంది. భాషలు నేర్పుతరు. రాత, చదువు రావాలంటే అదే కదా మరి ఆధారము! లెక్కలు కొంతవరకు నేర్పుతరు. ఇంకా సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలైన పాత సంగతులు చెబుతరు. అన్నింటికి మించి చెప్పింది గుర్తుంచుకోవాలె అన్నది మొదటి పాఠం. వాటిని పరీక్షలో అప్పచెపితే మార్కులు వస్తయి. ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత గొప్ప లెక్క. ఈ గొప్ప వాండ్ల బతుకులు తరువాత ఎంత బాగ సాగుతున్నయి అన్న సంగతి ఎవరికి పట్టదు. మొత్తం మీద ప్రశ్న అడుగగూడదు. లేనివి ఊహించగూడదు. ఆలోచన అసలే కూడదు. ఈ స్వంత ఆలోచన అన్న పద్ధతి ఏ బడిలోనన్న, ఏ కోర్సులోనన్న నేర్పుతున్నరా? అనుమానమే.
యద్భావం తద్భవతి
అని ఒక మాట ఉన్నది. ఏది భావించితే అదే జరుగుతుంది. నీకోసం ఆలోచనే లేకపోతే ఆ సంగతి
మరి వాస్తవము అయ్యే మార్గమేమి?
సాంఘిక శాస్త్రము,
సామాన్య శాస్త్రము అన్ని
తమంతతాము వచ్చి మన ఎదురుగ నిలిచినయా? అన్ని మనిషి అనుభవములో నుంచి వచ్చినవే గదా? వాటికి ఆధారమైన ఆ పద్ధతులు ఎంతమంది వాడుకుంటున్నరు? మొట్టమొదట పరిశీలన. ఎవరంతకు వారు గాక, కొంతమంది మనుషులు ఒకచోట కలిసి ఉంటే, తంటాలు పుడతయి. అందరూ ఒకే రకంగ అర్థం చేసుకోరు.
అందరూ ఒకే రకంగ ఆలోచించరు. కనుక ప్రతి సంగతి గురించి వేరువేరు అభిప్రాయాలు పుడతయి.
వాటిలో అనుకూలమైనవి, అనుసరించదగినవి
ఏవి అనే నిర్ణయము ఆలోచనతో మాత్రమే వీలవుతుంది. ఎక్కువమంది అవునన్నది శాస్త్రము
అవుతుంది. ఆ పద్ధతిని మార్చవలసిన పరిస్థితి వస్తే, మళ్ల ఆలోచన మొదటికి చేరుతుంది. సైన్స్ అయినా, మతం అయినా అంతే!
మనిషి మొదటి నుంచి,
పరిశీలన, ప్రయోగము, చర్చ, నిష్కర్ష, అనే పద్ధతులతో ఎంతో తెలివిని జమ చేసుకున్నడు. రాను
రాను బతుకు మారింది. అనుభవం పెరిగింది. పొద్దు పొడిస్తే వెలుతురవుతుంది. రాత్రి
అయితే చీకటవుతుంది. ఈ సంగతిని మొదట్లో గమనించిన మనుషుల భావములను గురించి
ఆలోచించండి. నిన్న మొన్నటి వరకు సూర్యోదయము, అస్తమానము గురించి అందరికీ ఒకే ఆలోచన. ఈమధ్య పిల్లలకు
సూర్యోదయము అబద్ధము. మనమే భూమితో పాటు తిరుగుతము. వెలుగులోకి మరొకసారి వస్తము అన్న
సంగతి అర్థమయింది. భూగోళము బొంగరమువలె తన చుట్టూ తాను తిరుగుతున్నది. అంటే,
ఇవాళటికి అందరికీ నమ్మకము
కలుగదు. మరి మనమెందుకు తిరుగుతు లేము? అని అడిగినవారు కొంత తెలివిని వాడినట్టు లెక్క. ప్రశ్నలు మరింత ముందుకు సాగితే
మరెన్నో సంగతులు తెలుస్తయి. అవునా? అవునుగదా? అనిపిస్తుంది.
ఆనందం అది సాటిలేనిది. అనుమానాలు, ప్రయోగాలు, ప్రశ్నలు, పరిశీలనలు, నిర్ణయాలు జరుగుతయి. కొత్త సంగతులు ఎన్నో అర్థమవుతయి.
కొంతమంది, మరింత తెలివిగ ఆలోచించి, మరింత ముందుకు నడిచి, ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తరు. వారికి కలిగే భావనలు,
మొత్తం ప్రపంచాన్ని ముందుకు
నడపగలుగుతయి. ప్రపంచం మారుతుంది. కొత్త అనుభవాలు తోడవుతయి. మళ్ళా ప్రశ్న, ప్రయోగం, ప్రయత్నం కొత్త భావనల వరుస! ఈ రకంగనే కదా! ఇవాళ ప్రపంచం ఈ పరిస్థితికి చేరింది?
ఒక్కసారి వెనుక
తిరిగి చూడగలిగితే కథ మరింత ఆసక్తికరమవుతుంది. నూరేండ్లనాటి, అంతకు ముందునాటి, పోనీ 1900ల సంవత్సరము నాటివరకు పోదాము చాలు! అప్పటి
దినపత్రిక ఒకటి దొరికింది, దొరికించు కుందము. అందులో రేడియో అనే మాట కనబడదు. ఇప్పటి పేపర్లో రేడియో
గురించి ఉండదు. మధ్యలో రేడియో వచ్చింది. అందరికీ సమాచారం, విద్య, అందం పంచింది. దాని రూపు ఇప్పుడు మారిపోయింది. ప్రతి ఫోన్ లో పాటలే, మాటలే, వార్తలే, విశేషాలే.
అలనాటి పత్రికలో
సినిమా, మూవీ అనే మాట కనిపించదు.
రేడియో, సినిమా, టీవీ అన్ని 1920 తరువాత ఎప్పుడోగాని రాలేదు.
వాటిని, వాటి పనితీరును గురించి
ఆలోచన గలవారు ఎంతెంతో భావించినందుకు, వాటి తీరు నమ్మరానంత మారింది. సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఉంటే, ప్రపంచమంత జేబులో
ఇమిడిపోతుంది, ఇవాళ. కొందరు
భావించిన సంగతులు అందరికీ అనుభవంలోకి వచ్చినయి. అనుభవించే వారికంత ఒకనాడయినా,
ఏ రకంగా వీలైంది అని
అనుమానం, ప్రశ్న వచ్చిందా? రాలేదు. మన చదువు తీరు వలన కలిగిన స్తబ్ధత. ఆనాటి
పత్రికలో అప్పుడప్పుడే ఆటోమొబైల్ గురించి ప్రసక్తి వస్తున్నది. ఇవాళ మనిషి వేరు
గ్రహాలకు, సౌర మండలం అవతలకు నౌకలను
పంపగలుగుతున్నడు. అంటే అంతా, ప్రశ్న, ఆలోచన, భావనల వలననే గదా?
అందరికీ, ఆలోచించే మనసు ఉండాలె. ప్రశ్నలు వాడి సంగతులు
అర్థం చేసుకోవాలె. అప్పుడుగాని, ఉన్న అద్భుతాల గురించి అర్థం అవుతుంది. ఓహో! కదా! అనిపిస్తుంది.
1863 లో జూల్స్
వెర్న్ అనే రచయిత ఆలోచించి ఒక నవల రాసినడు. ప్యారిస్ ఇన్ ద ట్వెంటియత్ సెంచురీ,
అన్ననవలలో రానున్న కాలంలో
పారిస్ నగరంలో ఉండగల అద్భుత జీవితాలను గురించి రాసినడు. కానీ ఆ నవల 130 సంవత్సరాలు
మరుగున పడి ఉండిపోయింది. అది 1994లో అచ్చయింది.
రచయిత ఆ నవల రాసిన
కాలంలో రాజులు, రాజ్యాలు
ఏలుతుండేవారు. రైతులు శ్రమపడి తిండి పండించే వారు. అటు యూఎస్ లోలోపల యుద్ధాలు
జరుగుతున్నయి. రచయిత మాత్రం 1960లో పారిస్ నగరంలో ఆకాశాన్ని తాకే, అందాల, అద్దాల భవనాలు ఉన్నట్టు ఊహించుకున్నడు. ఎయిర్ కండిషనింగ్, టెలివిజన్, లిఫ్ట్ లు, రయిళ్లు, పెట్రోల్ వాహనాలు,
ఇంచుమించు ఇంటర్నెట్ లాంటి
వ్యవస్థ అన్నింటినీ ఊహించినడు. అతని భావనలన్నీ, పూర్తిగా నిజమయినయి. అంతా అతను అనుకున్నట్టే, పుస్తకం ప్రచురించిన నాటికి ప్రపంచం సాగుతున్నది.
అదేదో అనుకోకుండా జరిగిన సంగతి కాదు. వెర్న్ తన నవల ఆలోచన కొరకు ఎంతో మందితో
మాట్లాడి, ఎంతో సమాచారం సేకరించి,
ఆ తర్వాత మాత్రమే రాసినడు.
అతను, మానవుడు చంద్రగోళం మీదకు దిగినట్టు మరొక నవల
రాసినడు. ఆ సంగతి నూరేళ్ల తరువాత నిజమయింది. అయితే వెర్న్ తుపాకి మందును ఇంధనంగ
వాడుకునే రాకెట్ గురించి రాసినడు. ద్రవ ఇంధనం రాకెట్ అతనికి తోచలేదు. అది మరో
డెబ్భయి యేళ్లకు నిజమయింది.
మొత్తానికి
కావలసింది ఆలోచన! భావన! కలగంటే అది నిజమవుతుంది!
ద యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ నంబర్స్ అని ఒక పుస్తకం. రచయిత పేరు జార్జెస్ ఇఫ్రా. అందులో గౌతముడు (తరువాత గౌతమ బుద్ధుడు) చూపిన గణిత నైపుణ్యం గురించి ఒక కథ. ఆ కథ ‘లలిత విస్తార సూత్ర’ అనే పుస్తకంలోనుంచి తీసినదట.
గౌతముడు గోప అనే అమ్మాయి కోసం మిగతా యువకులతో పోటీ పడ్డాడని కథలో చెప్పారు. కానీ అది మనకు ఇక్కడ అంత ముఖ్యం కాదు. సిద్ధార్థుడు, అంటే గౌతముడు అర్జునుడు అనే లెక్కల నిపుణునితో పోటీ పడ్డాడు. పోటీలో ఏమి చెయవలె? ‘ఒక పెద్ద అంకెను, ఒక మరీమరీ చిన్న అంకెను గణించి చెప్పవలె!’ ‘ఆ పని అంత కష్టమా’ అని ప్రశ్న. ఒక యోజనాన్ని విభజిస్తూ పోయి చివరకు అణువు పరిమాణం వరకు చెప్పడం కష్టమే!
యోజనం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు కూడా మరో ఇంగ్లీషు పుస్తకంలో జవాబు దొరికింది. పుస్తకంపేరు ‘హియర్ ఈజ్ లుకింగ్ అట్ యూక్లిడ్. రచయిత అలెక్స్ బెలోస్. యోజనమన్నది పాతకాలంలోని నిడివి కొలత అని, అది సుమారు పది కిలోమీటర్లకు సమం అవుతుందని బెలోస్ చెప్పాడు. ఇప్ప్పుడు అసలు ప్రశ్న ‘పది కిలోమీటర్లలో ఎన్ని అణువులను పరచవచ్చు?’
అని వస్తుంది.
ఈ ప్రశ్నకు గౌతముడు ఇచ్చిన జవాబు. (ఇది బహుశః సంస్కృత శ్లోకాలలో ఉండి ఉంటుంది.కానీ ఆంగ్లరూపం మాత్రమే దొరికింది.)
యోజనములో నాలుగు క్రోశములు
క్రోశములో వెయ్యి చాపములు,
చాపములో నాలుగు మూరలు
మూరలో రెండు జానలు
జానలో పన్నెండు కణుపులు
కణుపులో ఏడు గింజలు
గింజలో ఏడు ఆవగింజలు
ఆవగింజలో ఏడు గోధూళి కణాలు
గోధూళి కణంలో ఏడు గొర్రెదుమ్ము కణాలు
గొర్రెదుమ్ము కణంలో ఏడు కుందేటి దుమ్ము కణాలు
కుందేటి దుమ్ము కణంలో ఏడు గాలిలో తేలే దుమ్ము కణాలు
ఆ దుమ్ము కణంలో ఏడు మరింత చిన్న దుమ్ము కణాలు.
అందులో ఏడు మరింత సూక్ష్మమయిన ధూళి కణాలు, అందులో ఏడు అణువులు!
ఈ లెక్కన చూస్తే గౌతముడు అణువు పరిమాణాన్ని చాలా దగ్గరగా అంటే, ప్రస్తుతం మనకు తెలిసిన అణువు పరిమాణానికి దగ్గరగా సూచించాడని రచయితలు అభిప్రాయపడ్డారు. వాళ్లకు లెక్కలోని మొదటి కొలతల కన్నా వేలి కణుపుల తర్వాతి భాగం సులభంగా అర్థమయ్యింది. ‘ఒక వేలు నాలుగు సెంటి మీటర్లు పొడుగు ఉంది అనుకుందాం. ఆ నాలుగు సెంటి మీటర్లను 7తో పదిసార్లు విభజించాలి. అంటే 0.04 మీ I 7 టు ద పవర్ ఆఫ్ మైనస్ 10. ఆ లెక్క తీస్తే ఒక విలువ 0.000 000 000 01416 మీటర్లు. ఇది ఇంచుమించు కార్బన్ అణువు పరిమాణానికి సమానం! ఈ లెక్కను గణిత నిపుణులే తేల్చారు.
గౌతమునికి ఆధ్యాత్మిక దృష్టితో బాటు అంతకన్నా నిశితంగా ప్రపంచ దృష్టి, శాస్త్ర దృష్టి ఉండేదన్నమాట. ఈ కథ, ఈ లెక్క, ఎక్కడయినా మన పుస్తకాల్లో వచ్చిందా,
అన్న అనుమానం మాత్రం ఇంకా మిగిలే ఉంది. పాశ్చాత్యుల దృష్టిలో, ఆనాటి భారతదేశానికి ఈ రకమయిన లెక్కల గురించి ధ్యాసే లేదని కద! భారతీయులంతా అంతర్ముఖులయి,
తత్వం గురించి మాత్రమే పట్టించుకున్నారని ప్రపంచానికి ఒక ధారణ ఉంది. కానీ వారు పదార్థ ప్రపంచ తత్వం గురించి కూడా ఇంతగా ఆలోచించారన్నది, పాశ్చాత్యులకే కాదు మనకూ ఆశ్చర్యం కలగజేస్తుంది.
ఇంత గణితం చెప్పిన సంస్కృతి నుంచి బౌద్ధం వంటి సిద్ధాంతం కూడా రావడం అసలు గుర్తించవలసిన విషయం. ఈ కథలో, లెక్కలో పాశ్చాత్యులను గొప్పగా ఆకర్షించిన విషయం మరొకటి ఉంది. సూక్ష్మాన్ని కేవలం ‘సూక్ష్మం’ అని చెప్పి వదలక, దాన్ని రకరకాల కొలతలలో చెప్పడం నిజంగా మనకూ ఆశ్చర్యం కలిగించే అంశమే. గోధూళి, మేష ధూళి, శశక ధూళి అనే కొలతలు ఎంతమందికి తెలుసు? ఇందులో గణితంతోబాటు ఒక రకమయిన కవితా ధోరణి కనబడుతుంది. ఈ విభజన గణితంలో గొప్ప మిస్టరీ ఉంది. గొప్ప అందం ఉంది.
ఈ నాటి రసాయన శాస్త్రంలో కూడా మరీ చిన్న పరిమాణంగా క్వార్కు గురించి చెపుతుంటారు. ఆ పేరు ‘జేమ్స్ జాయ్స్’ అనే రచయిత నుంచి వచ్చిందని ఎంత మందికి తెలుసు?