Showing posts with label vyasam. Show all posts
Showing posts with label vyasam. Show all posts

Saturday, August 1, 2026

లోకాభిరామం - వానొచ్చె వరదొచ్చె : On rain and then Sambaru


వానొచ్చె వరదొచ్చె

పొటుకు - పొట్కు- టపక్‌

ఇల్లంత టపక్‌ పెడ్తున్నాది. పెద్దా పుస్కం తడ్సీ పోతుంది’ అని ఎర్రని గుడ్డలో చుట్టిన ఒక లావుపాటి పుస్తకాన్ని తెచ్చింది బువ్వమ్మ. ఆ పెద్ద పుస్కం పవిత్ర గ్రంథం ఖురాన్‌. తెచ్చిందేమో నిప్పులు కడిగే ఆచార్లవారి ఇంటికి. వాన కాలమంతా ఆ పుస్తకం ఆచార్లవారి ఇంట్లో గూట్లో సురక్షితంగా ఉంటుంది. అక్కడి మిగతా పుస్తకాలు అన్నింటితోబాటు! బువ్వమ్మ ఇల్లు పూరి గుడిసె అనుకుంటాను. ఆచార్ల వారిది మట్టిమిద్దె. అప్పటికి రాతిగోడలు వచ్చినయి కానీ, సిమెంటు కప్పులు రాలేదు.

మట్టిమిద్దె అంటే గోడలు కూడా మట్టివయి, ఆ మీద కప్పు ఉంటుంది. రాతిగోడల మీద కూడా మట్టిమిద్దె ఉంటుంది. దూలాలు లావుగ ఉంటయి. వాటిమీదనుంచి గోడల మీదకు కొంచెం సన్నటి వాట్లు ఉంటయి. (ఈ మాటంటే వేట్లు? అని అడిగాడు నా కొడుకు! మీకు అర్ధమయితే సరే, కాకుంటే వదిలేయండి.) ఆ వాట్లమీద చిలుక చెక్క పరిచి ఉంటుంది. కలిగిన వారయితే పలకలుగా తీర్చిన చిలుకు చెక్కలను, మధ్య ఖాళీలు లేకుండా పరిపిస్తరు. లేదంటే పొయ్యిలోకి కొట్టిన కట్టెలను పేర్చి, మీద గడ్డి పరిచి, ఆ మీద మట్టి వరస వేస్తరు. మట్టిమిద్దెలో ఎండలకు పగుళ్లు వస్తయి. గడ్డి, చిన్న మొక్కలు పెరుగుతయి. చుట్టు గోడలను మిద్దెకన్న కొంచెం ఎక్కువ ఎత్తు వరకు కడతరు. వాటిని కుంబిగోడలు అంటరు. వాటిమీద కూడా పగుళ్లు, గడ్డి మొక్కలు ఉంటయి. వానలు రాబోతున్నయంటే, మొక్క లన్నింటినీ పీకి, చవిటి మన్ను తెప్పించి మిద్దె నిండ పరిపించాలె. మొదటి వానలకే మట్టి తడిసి పరుచుకుంటుంది. దిమ్మిస పీటతో కొట్టి దాన్నంత చదును చేయాలె. వాలు సరిగ్గ వుండేట్లు సరిచేయాలె. ఇదంతా సక్రమంగ జరిగితే పడిన వాననీరు గూనలలోంచి కిందకు పడుతుంది. ఈ పనులు వీలవుతయి, కావు. కుదురుతయి, కుదరవు! ఇంక వాన వచ్చిందంటే చాలు పొటుకు మొదలవుతుంది.

వాతావరణం మారిపోతున్నదని చెప్పడానికి పరిశోధకుల దాక పోనవసరం లేదు. గతంలో వాన కాలమంటే  ప్రతినిత్యం ఉదయం, అస్తమానం వాన కురవవలసిందే. ముసుర్లు పట్టుకుంటే అయిదారు రోజులు ఏకాకారంగా వాన కొనసాగేది. గోనెసంచీ, గొంగడీ కప్పుకుని, అంత దూరం బడికిపోతే ‘సెలవు! వెళ్లిపొండి!’ అనేవారు. ఇంటి కంటే బడి మరింత అధ్వాన్నం. అందునా, మా బడి పక్కనే పెద్ద చెరువు కూడ ఉంది. నీళ్లు గదుల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అంతటి వానలో ఇల్లు, పూరి గుడిసె అయినా, మట్టిమిద్దె అయినా పొటుకు తప్పదు. పగుళ్లు, మొక్కల వేళ్లుంటే, ఎక్కువగ, లేదంటే, అక్కడా ఇక్కడా మిద్దెలోంచి నీరు ఇంకి చుక్కచుక్కగ పడుతుంది. అదే పొటుకు. మా ఇల్లు నిజంగ తాతల కాలం నాటిది. రకరకాల పాత్రలను ఆ పొటుకు పడుతున్న చోట పెట్టి, నేలన్న తడి కాకుండ జాగ్రత్తపడి, మిగిలిన చోట పండుకోవాలె. పొటుకు మరీ ఎక్కువగా ఉంటె, వానలోనే జాగ్రత్తగ మిద్దె ఎక్కి ఆ భాగంలో తొక్కాలె. చవిటి మన్ను జారుడుగ ఉంటుంది. కాలు జారితే ప్రమాదం! మట్టిమిద్దెలు పోయినయి! పొటుకు మాత్రం మిగిలింది. ఎవరన్నా ఒకేపని గురించి, సంగతి గురించి, తెరిపిలేకుండ అడుగుతూ (నస!) కష్టపెడుతున్నరనుకోండి. దాన్ని పొట్కు-పొటుకు పెడుతున్న రని వర్ణించేవారు. ఆర్‌సీసీ మిద్దెల్లో కూడా లీకులున్నయి. పొటుకుల ఉండే ఉంటయి. ఎండను తట్టుకోవాలని వేసే కూల్‌హోమ్‌ కారణంగ పగుళ్లు వస్తయని చెప్పినరు ఒకరు. మరేమి, అట్లాంటివి జరిగితే పొటుకు తప్పదు!

బల్లి సాంబారు: ఉల్లి సాంబారు అని వేరుగ ఏదయినా ఉంటుందా? సాంబారు వెంగాయం అని చిన్న చిన్న ఉల్లిపాయలుంటాయని తెలుసు. వాటిని అట్లాగే వేసి సాంబారు వండుతారనుకుంటాను. ‘బిసి బేళె హుళి అన్న’ అంటే వేడి పప్పుపులుసు అన్నం అని అర్ధం. అందులో వెంగాయం అంటే ఉల్లి పాయలు పెద్ద ముక్కలు వేయడం చూచాను. (నిజమే, నాకు తిండి గురించిన చింత ఎక్కువ. ఎర్రోనికి ఏమి చింత? అంటే ఎప్పటికి తిండిమీదనే చింత’ అని ఒక మాట ఉంది. ఈ ఏర్రోడు వెర్రివాడా లేక ఎర్రని వాడా? శివరాజు సుబ్బారావు అనే బుచ్చిబాబుగారు, వరంగల్‌ నవీన్‌గారి పద్ధతిలో పోతున్నది రాత. నా పేరులోనూ ‘బుచ్చి’ ఉంది. వరంగల్లు మీద కావలసినంత ప్రేమ ఉన్నది! అక్కడికే పోవాలె మనం ఇప్పుడు. వరంగల్‌లో ఎమ్‌ఎస్‌సి చదువుతున్నము. మధ్యాహ్నం పూట మొదటి పంక్తి భోజనాలు అయిపోయినవి. అమ్మాయిల హాస్టలు చిన్నది. అక్కడికి కూడా తిండి ఈ హాస్టల్‌నుంచే పోతుంది. అక్కడ కూడ అందరూ తిన్నరు. ఆలస్యమయి రెండవ పంక్తికి వచ్చిన వారు తింటుంటే సాంబారులో బల్లి పడిందని తెలిసింది! అసహ్యం అన్న మాట పక్కనపెడితే తెలియకుండ తిన్నవారికి, రెండవ పంక్తిలోని వారికీ, ఎవరికీ ఏమి కాలేదు! అంతా ఆరోగ్యంగ ఉన్నరు. సంగతి తెలిసిన తరువాత ‘కడుపులో తిరుగుతున్నది!’ అని కొందరు హెల్త్‌ సెంటర్‌కు పరిగెత్తినరు. పరిగెత్తినరంటే ఆరోగ్యంగ ఉన్నరనే గదా అర్థం. డాక్టర్‌ రెడ్డిగారు వాండ్లను పరీక్షించి డైజీన్‌ లాంటి మాత్ర ఏదో ఇచ్చి పంపించినరు. బల్లిని ఉడికించి తింటేనే ఏం కాలేదు. అది మీద పడితే ఏమవుతుంది! ఆ బల్లి అనారోగ్యంగ ఉండి, దాన్ని ద్వారా క్రిములేమైన సోకితే ఏమన్న అవుతుందేమో?ఏమో?

ఉల్లి సాంబారు: మేము (ఇంట్లో) ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనపకాయ లాంటివి తినము. ఛాదస్తమే! అయినా తినము. ఎక్కడన్న ఉల్లిపాయల వంట తిన్నమంటే, తరువాత వాసన తెలుస్తుంది. మాకుండే ఛాదస్తం వెనక కొన్ని పద్ధతులున్నయని చెప్పంగ విన్న. కొన్ని పదార్థాలు చూడడానికి బాగుండవు. కొన్నింటి వాసన బాగుండదు. కొన్ని అర్ధం లేని చాదస్తం! క్యాబేజ్‌ కొత్తగ వచ్చినపుడు నాన్న అడ్వెంచరస్‌ గనుక కొని తెచ్చినడు. అది భయంకరమయిన వాసన.అప్పటి క్యాబేజీతో పోలిస్తే ఇప్పటిది ఎంత మేలో చెప్పలేము. అప్పట్లో పురుగుమందులు ఇంతగ లేవు కనుక ఆకుల మధ్యన పురుగులు కూడ ఉండేవి! ‘కన్న మన్ను తెచ్చి వండమంటరు!’ అని అమ్మ గులుగుడు (గొణుగుడు) నాకు గుర్తుంది. ‘మెప్పులకై కన్నతావు అప్పు వడక’ అన్నారు త్యాగయ్యవారు. కన్న అంటే కనిన అంటే చూచిన అని అర్ధం. అంతేగానీ ప్రసవంతో సంబంధం లేదు. బిడ్డను చూస్తము గనుక అది కానుపు! ‘నిను కన్నది కానుపు’ అని రామదాసుల వారంటే అది చూడడం గురించే, ప్రసవం గురించి కానే కాదు! అందుకే కన్న మన్ను అంటే కనపించిన మన్ను అని.

మళ్లీ, మేము ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి, గోంగూర, ఆనిగెంకాయె తినము (ఈసారి అసలు సంగతే చెప్త!) మా బిల్డింగులో ఒక్కోసారి సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తరు. ఒక్కో ఇంటివారు ఒక వంటకం చేసి తెచ్చి, అందరూ ఒక చోట తినడం అదొక సరదా! మా ఇల్లుగలావిడ, మా యజమాని, మా ప్రొఫెసరు గారు (మాయావిడ, నా భార్య) సాంబారు వండమంటే సరేనని వండింది. అందులో ఆన్యన్‌ అనే ఉల్లిపాయల్లేవు. అయినా చాలా రుచిగ ఉందన్నరు అందరు! ఆనియన్‌ అదే ఆన్యాన్‌ లేకుండా సాంబారు ఎట్లా చేస్తరని అందరూ హాచ్చెర్య పడిపోయేశినరు. తరువాత ఒకటి రెండుసార్లు కూడా సాంబారు తయారీ బాధ్యత మా ఇంటికే వచ్చినట్టు గుర్తు! అన్య అంటే ఇతరము. తమిళంలో అన్యన్‌, అన్నియన్‌ అవుతుంది. అపరిచితుడు ఎందుకు మనకు మన సినిమాలో?

మూడు పైసల నాటకం: అంకుశ్‌ బోర్‌హాడే అనే పేరు మీరు విని ఉండరు. అతను మరాఠీ అయి వుంటడని కొందరికి తోచి ఉండవచ్చు. బెర్ట్‌హోల్ట్‌ బ్రెష్‌ట్‌, జెర్మనీలో ప్రసిద్ధ నాటక రచయిత. అతని పేరును బ్రెఖ్‌ట్‌, బ్రెహ్ట్‌ అని కూడ పలుకుతరు. అతని సాంఘిక నాటకాలు సంచలనం కలిగించినయి. అందులో ఒకదాని అనువాదం ‘ద త్రీ పెన్నీ ఆపెరా’ పోనీ ఓపెరా అనండి! నాకు అభ్యంతరం లేదు. జబ్బార్‌ పటేల్‌ అనే మరాఠీ నాటక కారుడు దానికి అనువాదం కాదు గానీ అనుసరణ చేశినడు. ‘తీన్‌ పైసాచా తమాషా’ అని దాని పేరు. తమాషా అనేది మరాఠీ జానపద నాటక పద్ధతులలో ఒకటి. అక్కడ మొదలయి, ఈ నాటకం సాగుతుంది. అందులో నాయకుని పేరు అంకుశ్‌ బోర్‌హాడే. అతను నాటకం మొదలయిన తరువాత చాలాసేపటి వరకు రంగం మీదకి రాడు. అతనొక రౌడీ, దాదా! పాత్ర వచ్చే ముందు ఆ పేరును ప్రతిధ్వనులతోపాటు హాలంతా కదిలిపోయిందేమో అనిపించే పద్ధతిలో వినిపింపచేసిన తీరు నాకు ఇంకా గుర్తుంది. మనసులో మనం ఒక ఎస్వీ రంగారావును ఊహించుకుంటే, అక్కడ అందమైన యువకుడు ఎదురయ్యినడు. నాటకం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో, అంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది. పుణె (పూనా లేక పునహా) బాల గంధర్వ రంగమంచ్‌లో చూచిన నేను. అంకుశ్‌ పెళ్లవుతుంది. హాలంతా రంగు దీపాలు వెలిగినయి. ప్రేక్షకులందరు పెళ్లి వారయ్యినరు! ము! బావుంటుంది, మరాఠీ వారి నాటక విద్య! ఆ హాల్లో నిత్యమూ నాటకం ఉంటుంది. మిగతా చోట్ల సినిమా చూచినట్టే జనం టిక్కెట్లు కొని నాటకాలు చూస్తరు. ఈ అలవాటు మహారాష్ట్రలో ఇంకా కొనసాగు తున్నది. మన దగ్గర హైదరాబాదులో ప్రయత్నం జరిగింది కానీ, కొనసాగలేదు మరి.


 

Tuesday, February 17, 2026

లోకాభిరామం - కష్ట షకారం మరెన్నో సంగతులు...


లోకాభిరామం - కష్ట షకారం

 మరెన్నో సంగతులు...


కష్ట షకారం

హొటేల్‌లో (హోటల్‌ అంటే తప్పు తెలుసా?) దోసె తినడానికి పోయిన ఒకతను ‘బాగ పల్చగ వేయాలె. అంచులు కూడ బాగ కాలాలె. పచ్చిమిర్చి తక్కువగ ఉండాలె’ అని తన మనసును బయటపెట్టుకున్నాడు. సర్వర్మహాశయుడు మాత్రం లోపలికి పోయి ‘ఒక సాదా!’ అని ఆర్డరు ఇచ్చాడు. అదీ మన ఒకతనికి వినిపించే పద్ధతిలో!

ఇంగ్లీషులో దోసె పేరు దోస అని రాస్తరు. డొస్సా అని పలికిన వారిని నేను చూచి పుణ్యం కట్టుకున్నాను. దోస అన్నది కూరగాయలలో ఒకటి. వాటిలో ముల్లుదోస, ఏటిగడ్డ దోస, కీరా దోస అని రకాలుంటాయి. ఏటిగడ్డ దోస అన్నది కర్బూజలంత తీపిగా పండడం, కర్బూజకన్నా మెత్తగా వెన్నలాగ లోని గువ్వము (గుజ్జు) ఉండడము గుర్తుంది. మాకు చిన్నప్పుడు బుడుమ కాయలు తినడం అలవాటు. అవి దోసకాయలకన్నా చిన్నవి. గుండ్రంగా ఉండేవి. వీటిలో కొంత పులుపు ఎక్కువ. గింజలలో పులుపు మరీ ఎక్కువ. గింజలలో అనేకన్నా, వాటి చుట్టు ఉండే పదార్థంలో ఈ పులుపు ఉంటుంది కనుక, గింజల చుట్టు పులుపు అనాలి. పప్పులోనయితే గింజలతోబాటు ముక్కలు వేస్తే, ఇక పులుపే పులుపు.

ఈ బుడుమ కాయలలో కొన్ని చేదుండేవి. అమ్మ వాటిని చిన్న ముక్కలుగా తరిగి, కొంత చింతకాయ తొక్కు వేరే తీసి, అందులో కలిపి పెట్టేది. నాలుగయిదు దినాలయితే ఆ ముక్కలు చేదు పోయి, ఉప్పు, పులుపు కలిసిన గొప్ప రుచిలోకి మారేవి!

ఇనుప బొచ్చెల కాలం: మా ఊళ్లో చాలా మంది అన్నం, పప్పు, కూరలు అన్నీ మట్టిపాత్రలలోనే వండుకునేవారు. మా ఇంట్లో మాత్రం నాగరికత పేరున, అన్నం కంచు, ఇత్తడి గుండీల్లో వండేవారు. చారు, పప్పు మాత్రం మట్టికుండలోనే. కొంతకాలానికి జనం సత్తు అనే అల్యూమినం వాడడం నేర్చుకున్నారు. దాన్ని జర్మన్‌ సిల్వర్‌ అనేవారు. మా ఇంట్లో ‘చాయ’కు మాత్రం సత్తుగిన్నె వాడడం గుర్తుంది. మట్టికుండలో వండిన పప్పు, చారు రుచి మరో రకంగా ఉండేవి.

పాడి కూడా మొత్తమంతా మట్టి కుండలలోనే! నేలలో ఒక గుంత ఉంటుంది. దాని పేరు దాలిగుంత. అందులో పిడకలు వేసి, మీద ఒకటి రెండు నిప్పు కణికలు వేసి, రాజుకున్న తరువాత పాల కుండ పెడతారు. మీద ఒక పీట పెడతరు. పాలు దినమంత అందులో సన్నని సెగ మీద కాగి, కాగి చిక్కబడతయి. వాటి రంగు తెలుపు నుంచి మారిపోతుంది. పిడకల పొగ కారణంగా వాటికొక చిత్రమయిన వాసన వస్తుంది. కిటుకు తెలిసినవారు అమర్చిన పిడకల వల్ల రాత్రి వరకు వేడి పోతుంది. ఆ గుంటలోనే కుండలో తోడు పెడితే, తెల్లవారేసరికి చిక్కని కమ్మని పెరుగు సిద్ధం. నిజానికి ఆ పాత్రను కుండ అనకూడదు. దుత్త, అటికె లాంటి పేర్లుంటాయి వాటికి. వెడల్పు మూతి, ఎత్తు తక్కువ కలిగిన గిన్నెలాంటివవి! పెరుగును రాచ్చిప్ప (రాతి చిప్ప) లోకి మార్చిన తర్వాత, అడుగున పాత్రను కౌచిప్ప (ఆల్చిప్ప)తో గోకాలి. మాడీ మాడని గోకు వస్తుంది. అమ్మ ఎప్పుడు ‘గోకు’ పెడుతుందోనని ఎదురుచూడడం గుర్తుంది.

ఇనుప బొచ్చెల కాలం వచ్చింది. తిండిలో రుచి పోయింది. పొయ్యి తీరు మారింది. తిండి తిండి గాకుండ పోయింది!

గొట్టికాయలు: పల్లెలో ఆవులు, బర్రెలకన్న మేకలు ఎక్కువగ ఉండేవి. మేకలను పెంచడములోని ఇకనామిక్స్‌ నాకు తరువాత గాని అర్థం కాలేదు. (ఎకనామిక్స్‌, ఎలెక్ట్రాన్‌, ఎలెక్ట్రిసిటీ లాంటి మాటలు ఇ అనే అక్షరంతో మొదలు కావాలట తెలుసా!) మేక పాలు కొంత వాసన! కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మా ఎదురింటి రాములు వాండ్లకు బోలెడన్ని మేకలు. వారి దగ్గర జీతము చేసే ఒక పిల్లవాడు, పాలను సూటిగ నోటిలోకి పిండుకుని తాగుతుంటే చూడడము మాకొక సరదా! గొర్లు (గొర్రెలు) మేకలను గుంపులుగ తెచ్చి పంట పొలాలలో రాత్రి ‘మందలాపుతరు’. మందలుగా ఆపుతరని భావము. వాటి చుట్టు వల దడి. కుక్క కావలి కూడ. మేకలు, గొర్లు రాత్రి మొత్తము అక్కడే నెమరు వేసి, మలమూత్రములను వదులతయి. అది పొలానికి బలము. ఎరువు! ఎంత సులభమయిన, చక్కని పద్ధతి! ఇప్పుడంతా కృత్రిమమే!

మేకలు, గొర్లు సాధారణముగ అడవిలోకి పోయి అక్కడ కనిపించిన చెట్లన్నిటినీ కరకర నమిలి తింటాయి. ‘మేక మేయని ఆకు’ అని ఒక చెట్టు, దాని ఆకులు ఉంటాయంటే చిత్రంగదూ! మిగతా మొక్కలు, చెట్ల ఆకులు, కాయలు, కొమ్మలన్నింటినీ అవి హాయిగా తినేస్తాయి. అయితే, కొన్ని కాయలలోని గింజలను, అవి అరిగించుకోలేవు. కాయ లేదా పండులోని గువ్వము (కండ) శుభ్రంగా అరుగుతుంది. గింజ అంత శుభ్రంగానూ మిగిలిపోతుంది. ఈ గింజలు, పెంటికలతో బాటు బయటకు వస్తయి. వాటినే గొట్టికాయలు అనేవారు. చెట్టునుబట్టి అందులో రకాలు. నూనె గొట్టికాయలు, నున్న గొట్టికాయలు గుర్తున్నయి. మిగతా వాటి రుచి మాత్రం గుర్తుంది. అంటే ఆ గింజలను పగలగొట్టి లోపలి పలుకులను తిన్నామనే గద అర్థం! చాలా రోజులపాటు పల్లెలో మేకలున్న ఇంటి పిల్లలకు, వారి దోస్తులకు ఇదొక కార్యక్రమం. లేచిన వెంటనే చెరువుకు పోవాలె. అక్కడ ఒకటి, రెండు, పండ్లు తోముట ముగుస్తయి. తరువాత మేకల దొడ్డిలో గొట్టికాయల వేట! నిజం చెప్పాలి. ఆ గింజల రుచి నాకు ఇవాళటికీ గుర్తుంది!

ఇసుర్రాయి: ఇసిరే రాయి అని విగ్రహము. ఇసరడము అంటే విసరడము కాదు. రాయిని దూరానికి విసిరేస్తాము. కానీ రెండు గుండ్రని రాతి పలకల నడుమ ధాన్యమును విసురుతాము. కింది రాతిలో నడుమ ఇనుప బొడ్డు, పై రాతిలో మధ్యమధ్యన గింజలు నింపేందుకు రంధ్రాలు. ఒక చేతితో రాతిని తిప్పుతూనే మరొక చేతితో గింజలు వేయడము ఒక నైపుణ్యత. పసుపు, చక్కెర కూడ ఈ పద్ధతిన ఇసరడము గుర్తున్నది. రొట్టెలు ఎక్కువగ తినే వాండ్ల ఇండ్లలో ఇసుర్రాయిని నేలలో ఒకచోట పాతి ఉంచడము గుర్తున్నది. కింది రాయి కదులుతుందన్న బాధ లేదన్నమాట. కరెంటు లేని కాలంలో ఇంటింటా ఈ ఇసిరే చప్పుడు గంటల పాటు వినిపించేవి. దారితోబాటే కిష్టమ్మ పాడిన ‘వొస్తుంటి శెల్లెల! వోగడ్డమాయె!’ అన్న జానపదం పాట గుర్తున్నది. ఇసరడము లాగనే పాట కూడ మహ సాగదీసి నడిచేది! పాలమూర్లో యాపశెట్ల కాడ గిర్నీలు వచ్చినయి. అంటే  వేపచెట్ల ప్రాంతంలో పిండిమరలు వెలిసినయని గ్రహించవలసినది.  వేపచెట్లు అన్నవి ఒక ప్రాంతమని అర్థమయ్యే ఉంటుంది. జొన్నల వంటి గింజలు సంచులలో పోసుకుని పోయి, పిండి పట్టించుకుని తేవడము కొందరికి అలవాటయింది. ఈ పేరున పాలమూరికి పోవచ్చు. నేను గూడ పోవాలని నాకు! అమ్మ నవ్వేది. ఎందుకయ్యా నీకా నడక, మోత కష్టం? అనేది. అయినా ఒక శేరు జొన్నలు, దానికి గిర్నీ కూలి అణాపైసలు సాధించి, మిగతా పిల్లలతో యాత్ర. అప్పట్లో అది సింద్‌బాద్‌కు మించిన సాహసయాత్ర!

కష్ట షకారం: ‘నాతో మాట్లాడడమే ఎడుకేషన్‌’ అంటాడు గిరీశం (కన్యాశుల్కంలో). కొందరితో మాట్లాడితే నిజంగానే బోలెడు కొత్త సంగతులు తెలుస్తాయి. పాషాణభేది గోపాలకృష్ణ గారు అట్లాంటి మనుషుల్లో ఒకరని నిస్సందేహంగా చెప్పగలను. ‘ఎల్లమ్మకు ఎల్లయ్యకు పెండ్లంట. ఎవరింట్లో వాండ్లకు విందంట!’ అని ఒక కవిత లాంటి మాట చెప్పా రాయన. దీనికి మూలం తమిళంలో ఎక్కడో ఉన్న ట్టుంది. గోపాలకృష్ణగారు సిపి బ్రౌన్‌ గురించి పరిశోధించి పుస్తకం రాశారు. స, , షలను గుర్తుంచు కునేందుకు బ్రౌన్‌ చెప్పిన సూత్రం ఒకటి ఆయనవల్లే నాకు తెలిసింది. సులభ సకారం, శాంతి శకారం, కష్ట షకారం అని ఆ సూత్రం. మా అమ్మ పేరు శేషమ్మగారు. పల్లెలో అందరూ ఆమెను సేసమ్మ అని మాత్రమే అనేవారు.

కన్యాశుల్కం చదువుతుంటే షకారం గురించి ఇంకో సంగతి కనబడుతుంది. ఏమిటిష? అంటే ఏమిటట? ఏమిటిషలో షకారం ట అన్న అక్షరానికి బదులుగా వచ్చిందని అర్థం. బాగా మాట్లాడుతున్నా మనుకుని విజయనగరం ప్రాంతంలోని అలనాటి బ్రాహ్మలు అనవసరంగా షకారం వాడుకున్నారన్న మాట.

మన వాళ్లకు చాలా మందికి స శ ష తేడా తెలియదు. పలకదు. మధ్య భారతం వారు ఈ విషయంలో మనకన్నా అన్యాయం. వాళ్లకు ష పలకదు. లేక పలకరు. అన్నింటికీ మామూలు స వచ్చేస్తుంది. అచ్చమయిన ఇంగ్లీషు స్టేషన్‌ను స్టేసన్‌ అంటారు. ఆ సంగతి వాళ్లకు తెలియదనుకోండి.  మన నాయకులలో ఒకాయన బాగా మాట్లాడుతున్నా ననుకుని అన్నీ షకారాలే పలుకుతుంటాడు. ఆయన బహుశా విజయనగరం వాళ్లను విన్నారని మీకనిపిస్తే నేనేమీ చేయలేను. అచ్చంగా వాళ్లలాగానే ఈయన కూడా కేవలం బాగా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అంతే. పలకవలసిన చోట ష పలకదు. అనవసరమయిన చోట మాత్రం అది వచ్చేస్తుంది.  ‘కష్టం’ కదూ!


 

Wednesday, December 17, 2025

సలహాలు - సంప్రదింపులు : On Suggestions and discussions

సలహాలు - సంప్రదింపులు

Some thoughts

సలహాలు - సంప్రదింపులు

పని బాగా జరుగుతున్నంత కాలం పక్కవారి గురించి ఆలోచన కూడా రాదు. సమస్య ఎదురయితే మాత్రం, బాసునో, మరొకరినో సాయం అడగాలనిపిస్తుంది. సమస్యను మరొకరి ముందు పెట్టడం వరకే మన పని అనుకుంటే, అక్కడితో మన పెరుగుదల ఆగిపోతుంది. పై అధికారులు మనకు సహాయం చేయడానికే ఉన్నారు. మరి మన దగ్గరకు ఎవరైనా సమస్యతో వస్తే ఏం చెప్తాము? తెలుసుననుకుని సులభంగా ఒక సమాధానం చెప్పి పంపిస్తామా? మన సమస్యలన్నింటికీ బాసులు సమాధానం చెప్పి పంపుతున్నారా? నిజంగా అట్లా జరుగుతున్నదంటే, ఎక్కడో లోపం ఉందని అర్థం! బాసుకు ఏదో అనుమానం వస్తుంది. అప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు సమాధానం చెపుతారు?
సమస్యను తెచ్చి మన ముందు పడేస్తే, ఆ పడేసిన వారి బాధ్యత ముగిసినట్లు కాదు. మనమయినా సమస్యను మరొకరి ముందుకు నెట్టి, చేతులు దులుపుకోలేము. మనమయినా మరొకరయినా, సమస్యతో బాటు సలహాలను జోడించాలి. ‘మీరు చెప్పండి. మేము మీరు చెప్పినట్టు చేస్తాం!’ అంటారు చాలామంది. మరి చెప్పవలసిన వారికి సమస్య ఎదురయితే ఎవరు చెప్పాలి. ఏదో ఒకనాడు మనమూ ఆఫీసర్లవుతాము. బాసులవుతాము. ఇంట్లో పెద్దవాళ్లమవుతాము. బాధ్యత అంతా మన తలకెక్కినప్పుడు బరువు తెలుస్తుంది. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? నా స్థానంలో మీరుంటే ‘ఈ విషయంలో ఏం చేయాలనుకుంటారు? మీరే ఏదో ఒకటి చెప్పండి!’ అనే బాసు మీద కోపగించుకునేవారు చాలామంది ఉంటారు.

నిర్ణయాలు వేరు, సలహాలు వేరు. ఏం చేయాలో చెపితే, అది నిర్ణయమవుతుంది. ఇలా చేయవచ్చునేమో, అని చెపితే అది సలహా. సమస్యను ఎస్కలేట్ చేసిన వారు, అంటే పైవారి ముందు పెట్టిన వారు నిర్ణయం చేయలేకనే ఆపని చేస్తారు. నిర్ణయం సరయిందన్న నమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు. అప్పుడు చెప్పే తీరులో ఈ సంగతి చక్కగా కనిపించాలి. ఇది సమస్య, ఇది నా నిర్ణయం అని చెప్పడం బాగుండదు. ఈ నిర్ణయం బాగుంటుందని అనుకుంటున్నాను, అంటే, అది సలహాగా మారుతుంది. సంప్రదింపుల ద్వారా, సమస్యకు గల సమాధానాలను వీలయినన్ని ముందు ఉంచుకుని, వాటిని చర్చించి, ఒకటి, రెండింటిని ఎంచుకోవచ్చు. అమలు చేసి చూడవచ్చు. సమస్యను ముందుంచిన వారే, నిర్ణయాన్ని సూచించడం అంతగా అలవాటు లేదు. ఎందుకొచ్చిన బెడద అనుకుంటారు చాలామంది. బాసులకు కూడా సరైన అవగాహన లేకుంటే ‘ఇక నేనెందుకు?’ అంటారు. ఇవి రెండూ తప్పు పద్ధతులే. సలహాలు, సంప్రదింపులు మాత్రమే సరయిన పద్ధతి. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇంట్లో, మిత్రుల మధ్య కూడా ఈ పద్ధతిని పాటిస్తే, అందరికీ సంతృప్తిగా ఉంటుంది. ‘ఇడ్లీ తిందాం పదండి’ కన్నా ‘ఏం తిందాం?’ అన్నమాట బాగుంటుంది. అందరికీ తమ అభిప్రాయం చెప్పే వీలు కలుగుతుంది. చివరికి ఎవరిమాట నెగ్గినా, సలహా ఇచ్చినా సంతృప్తి మిగులుతుంది. ఈ సంతృప్తి, మరింత ఆలోచించడానికి, బాధ్యతతో ప్రవర్తించడానికీ, అవసరమయిన బలాన్ని ఇస్తుంది. దీన్నే ఎంపవర్‌మెంట్ అంటారు.

నిర్ణయాలు చేసే శక్తి కాకున్నా, నిర్ణయాల వరకు చేరుకునే కార్యక్రమంలో భాగం ఉంటే ఆ వ్యక్తులకు మానసిక బలం పెరుగుతుంది. అదే ఎంపవర్‌మెంట్. కూరలు కొనడం తనకు తెలియదు అనుకుంటే జీవితమంతా తెలియకుండానే పోతుంది. కూరలు కొనడంలోని మెళకువలు అర్థం అయే పరిస్థితిని కలిగిస్తే రేపు కూరలు కొనే బాధ్యతను పంచుకోవడానికి మనకే సాయం దొరుకుతుంది. ఎందుకు తెలియదు? ఏం తెలియదు? ఏ రకం కూరల గురించి తెలియదు? లాంటి ప్రశ్నలడిగితే, మరో వ్యక్తికి ఎంపవర్‌మెంట్ జరుగుతుంది. అలాగని ఎడ్డెం తెడ్డెం ప్రశ్నలడిగితే పని జరగదు. పైగా, ఆ మనుషులు మరింత కుంగిపోతారు. కొత్తగా ఆలోచించడానికి దారితీసే ప్రశ్నలుండాలి. విషయం గురించి ఎదుటివారి ఆలోచనలు మరింత పెరిగే రకంగా ప్రశ్నలు అడగాలి. ఇలాగే అడుగుతారు కూడా. మనకు ఆ సంగతి అర్థం కాకుంటే, ఆ ప్రశ్నలు ‘చొప్పదంటు ప్రశ్నలు’గా చికాకు ప్రశ్నలుగా కనిపించి, వినిపించి చికాకు కలుగుతుంది. అందుకే ఎవరైనా ప్రశ్నలు అడిగినా, మనం అడగవలసి వచ్చినా ఒక్క క్షణం ఆలోచించడం మంచిది. అప్పుడు విషయం మరింత సులువుగా అర్థమవుతుంది. రెండువేపుల నుంచి చక్కని సలహాలు వస్తాయి. సమస్యకు సమాధానం దొరుకుతుంది.

జాగ్రత్తగా గమనిస్తే, ఈ సందర్భంలోని ప్రశ్నలకు ఒక పద్ధతి ఉంటుంది. వాటికి సూటిగా ఒక జవాబు ఉండదు. ‘ఎందుకు?’ ఎట్లా?’ ‘ఏమయి ఉండవచ్చు?’ లాటి ప్రశ్నలకు జవాబులు కేవలం అభిప్రాయాలు. అవి రకరకాలుగా ఉంటాయి. ఉండాలి కూడా! సమస్య తెచ్చిన వారికి ఈ ప్రశ్నల కారణంగా, మరింత అవగాహన వీలవుతుంది. మరిన్ని జవాబులు మెదడులో మెరుస్తాయి. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుంది. జవాబు నేనే యిచ్చానన్న ధీమా కలుగుతుంది. అసలిది సమస్యగా ఎందుకు కనిపించింది? అన్న అనుమానం కూడా రావచ్చు. కావలసింది కూడా అదే! ఈ ప్రపంచంలో ఏ సమస్యకూ, ఎవరివద్దా రెడీమేడ్ జవాబులు ఉండవు. ఉంటే, అసలివి సమస్యలు కావు! సరైన సమయంలో సరయిన ప్రశ్నలు అడిగితే, సమస్య మబ్బులాగా విడిపోతుంది. అందరికీ నచ్చే సమాధానాలు కనబడతాయి. అందరికీ నమ్మకం కలుగుతుంది. అది సలహా, సంప్రదింపులోని బలం!

బాసు మనలను అభిప్రాయం అడిగారంటే, మన తెలివిని, ఆలోచన శక్తిని వారు నమ్ముతున్నారని, గౌరవిస్తున్నారని అర్థం! అదే పద్ధతిని మనం కూడా మనవారిమీద, చివరకు పిల్లలమీద కూడా ప్రయోగించవచ్చు. అటువంటి ప్రశ్న ఎదురయిన మరుక్షణం మన బాధ్యత పెరుగుతుంది. కనుక మరింత జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం మొదలవుతుంది. సమస్యకు సమాధానం మననుంచి వస్తే అది అప్పటికప్పుడు కనిపించే విలువ, లాభం. ఇక ముందు ఈ రకం సందర్భాలలో కూడా ముందే ఆలోచించి, సలహాలతో కూడా ముందుకు సాగే నమ్మకం కలుగుతుంది. అది ఎప్పటికైనా పనికివచ్చే మానసిక బలం. అది మరింత గొప్పలాభం!

అంతా నాకే తెలుసు, నీకేం అధికారం, అని మనం అనవచ్చు. మనమీదివారు మనల్ని అనవచ్చు! మనిషిని మానసికంగా కుంగదీయడానికి అంతకన్నా కావలసింది లేదు! ఎవరికీ ఎవరికన్నా ఎక్కువ తెలియదు. నాలుగు తలలు ఒక చోట చేరితే సలహాలు, సంప్రదింపులు సాగుతాయి. అది తెలివి!