Showing posts with label humor. Show all posts
Showing posts with label humor. Show all posts

Friday, February 20, 2026

అగ్గి మనిషి - A story in Telugu about human nature


అగ్గి మనిషి

A story in Telugu about human nature


అగ్గి మనిషి

 

అనగనగనగా ఒకప్పుడు ఒకానొక మనిషి ఉండేవాడు. ఆయనకు నిప్పు తయారు చేయడం తెలిసి ఉండేది. అతనికి గల ఆ అద్భుతమైన శక్తిని చూచి ఆయన ఊరులోని వాళ్ళందరూ ఎంతో అబ్బుర పడేవాళ్లు. అతను మొట్టమొదటిసారిగా నిప్పు తయారు చేశాడు. వాళ్లందరికీ దాని గురించి ఏమనాలో తెలియలేదు. దాంతో ఏం చేసుకోవాలో అంతకన్నా తెలియలేదు. నిజానికి ఉన్న మాట చెప్పాలంటే, వాళ్లందరూ కొంచెం భయపడిపోయారు కూడా.
కానీ, ఈ నిప్పు తయారు చేసే మనిషిని ఏమందాం
అగ్గిమనిషి అందామా, అగ్గిమనిషి తాను తయారు చేసిన నిప్పుతో చలి పుడుతున్నప్పుడు వెచ్చగా ఉండవచ్చునని, చీకటి చుట్టూ అలుముకున్నప్పుడు వెలుగు కోసం దాన్ని వాడవచ్చునని, అట్లాగా మరెన్నో చెప్పాడు. తిండి వండుకోవడానికి మంట పనికి వస్తుంది అని కూడా వాళ్లకు చేసి చూపించాడు. మట్టితో కుండలు తయారు చేసుకోవాలని కూడా చేసి చూపించాడు. ఆ కుండలలో వాళ్ళు తిండి వండుకొని తినవచ్చునని కూడా చూపించాడు. ఆ అడవిలో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, దారి తప్పిపోయాం అనుకున్నప్పుడు, ఈ కొత్త బహుమానాన్ని పెద్ద మంటగా మారిస్తే, దూరంగా ఉండే వాళ్లకు కూడా అది కనబడుతుంది, వీళ్ళు ఎక్కడున్నది అందరికీ తెలుస్తుంది అని, అప్పుడు కాపాడడానికి ఎవరైనా రావడానికి వీలు ఉంటుందని కూడా చెప్పాడు.
అయితే నిప్పుతో కొంచెం తంటాలు కూడా ఉన్నాయి. అజాగ్రత్తగా ఉంటే అది నాశనానికి దారి తీసింది కూడా. కనుక అగ్గిమనిషి అగ్గి అనే అగ్నిని గౌరవంగా, జాగ్రత్తగా వాడుకునే పద్ధతులను కూడా నేర్పించాడు. నిజంగా తెలివిగలిగి వాడుకుంటే, నిప్పు బ్రతుకులను గొప్పగా మారుస్తుంది. ఎవరికి ఎటువంటి హాని ఉండదు. దానివల్ల ప్రపంచంలో దేనికి కూడాను హాని ఉండనవసరం లేదు, అన్నాడు అగ్గిమనిషి.
మొత్తానికి ఈ అగ్గి, నిప్పు, మంటలు గురించి తొందరలోనే చుట్టుపక్కల ఊళ్లవాళ్ళకు అందరికి కూడా వార్త పొక్కిపోయింది. ఆ ప్రాంతంలో అందరికీ సంగతి తెలిసిపోయింది. ఇక అగ్గిమనిషికి కావలసినంత గిరాకీ మొదలయింది. అందరూ అతని దగ్గరికి రాసాగారు. అగ్గిమనిషి అన్ని ఊళ్లకు తిరిగాడు. అవసరమని ముందుకు వచ్చిన వాళ్ళందరికీ తన విద్యను పంచాడు, పెంచాడు. అందరూ నిజంగా ఆశగా నేర్చుకున్నారు. అగ్గిమనిషిని ఎంతో గౌరవంగా చూడసాగారు అందరూ. ఈ మనిషి నిజంగా మామూలు వాడు కాదు. దేవతలు కూడా ఇతన్ని చూచి ఇష్టపడతారు అనుకున్నారు కూడా.
త్వరలోనే సంగతి గురించి ప్రాంతం పెద్దలకు, అధికారులకు తెలిసిపోయింది. ప్రాంతం ప్రభువుకు కూడా తెలిసిపోయింది. అయితే అన్యాయంగా వాళ్ళందరూ వింటున్న విషయాన్ని విచిత్రంగా కాక, వినోదంగా అంతకన్నా కాక, వినాశనం కింద చూడ సాగారు. అగ్గి మనిషేమో అందరికీ, వారు కోరుకున్న మీదనే, తన విద్యను పంచి పెడుతున్నాడు. దాంతో ప్రజలు సుఖంగా, సంతోషంగా, సౌకర్యంగా బతుకుతున్నారు. ప్రజలంతా ప్రభువులను, పెద్దలను కూడా కాదని, అగ్గిమనిషినే అనుసరించ సాగారు. ఇక అనుకున్నట్టే ఆ ప్రాంతంలో అందరికన్నా అతనే గొప్పవాడు అయ్యాడు. అధికారుల పట్టు సడలిపోయింది.
ఇంకేముందీ, వాళ్లంతా ఒక్కచోట చేరి, ఆ మనిషి ఆగడాలను ఆపకుంటే, అంతా మునుగుతుంది, అన్నారు. అయితే అతడిని ఆపడానికి ఎవరికీ తరం కాలేదు. కనుక అంతకన్నా అన్యాయమైన మార్గం ఏదో వాడితే తప్ప పని జరగదని వాళ్లకు అనిపించింది. అగ్గిమనిషి అంతం కావాల్సిందే, అనుకున్నారు వాళ్ళు. నిర్ణయం అయిపోయింది. ప్రభువులు తలిస్తే పని జరగకుండా ఉంటుందా...
ఒక చీకటి రాత్రి ఎక్కడో మారుమూలన వాళ్ళు అగ్గిమనిషిని చుట్టుముట్టి గుట్టుగా మట్టుపెట్టేశారు. అంటే చంపారు. ఇక తరువాత ఎవరైనా నిప్పు తయారు చేసే పని అయితే అది నేరం కింద నమోదు అవుతుందని అంతటా ప్రకటనలు వినిపించారు.
ప్రజలంతా గగ్గోలు పడిపోయారు. ఎవరు ధైర్యం చేసి అధికారులను ఎదిరించడానికి వీలు లేకపోయింది. అగ్గిమనిషి లేకపోవడం గురించి అందరూ ఆలోచించారు. చర్చించారు. మనసులోనే కుమిలిపోతున్నారు. అయితే ఈ లోపల అతను నేర్పిన విద్య గురించి మాత్రం అందరికీ మరుపు వచ్చేసింది. ఏ పనైనా చేస్తుంటే గాని, అలవాటవుతుంది. అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, నిజంగానే మరపు వచ్చేస్తుంది. అందరూ అగ్గి తయారు చేయడం మర్చిపోయారు, కానీ అగ్గిమనిషిని మాత్రం మరువలేదు.
ప్రభువులు, పెద్దమనుషులు అందరూ ఒకచోట చేరి, ప్రజల గురించి ఏం చేయాలని మంతనాలు చేశారు. అపాయానికి కారణమయ్యే ఒక మనిషిని గురించి, అంతగా దిగులు పడిపోతున్న ప్రజలను, మరో మార్గంలోకి నడిపించేందుకు, పథకాలు వేశారు. తగిన గౌరవం జరగాలంటే అగ్గిమనిషికి అంతటా గుడులు కట్టించాలి, అని ప్రజలకు సలహాలు ఇచ్చారు. కనుక ఊరూరా అగ్గిమనిషి గుడి వచ్చేసింది. ప్రజలంతా ఆ గుడులను అన్ని రకాల అలంకరించి పువ్వులు, పూజలతో, రంగురంగుల చిత్రాలతో, విగ్రహాలతో నింపేశారు. వీలున్నప్పుడంతా, అక్కడ చేరి అగ్గిమనిషిని గురించి భజనలలాగ పాడసాగారు. నిప్పు గురించి అతను ఒకప్పుడు చెప్పిన సంగతులన్నింటినీ పుస్తకాలలో రాసుకున్నారు. సమూహంగా చేరినప్పుడంతా ఆ పుస్తకాలను పారాయణం చేయసాగారు. మొత్తానికి అధికారులు మాత్రం చింత లేకుండా ఉంటున్నారు. అగ్నిని వాళ్ళు అదుపు చేసినట్టు భావించసాగారు.
పాపం ప్రజలు మాత్రం రాత్రులలో చలి బాధకు గురవుతున్నారు. చల్లని తిండి తింటున్నారు. హాయిగా మంట చుట్టూ నాట్యం చేస్తూ ఆడే వీలు లేకుండా, అదోరకంగా బతుకుతున్నారు.
అగ్గిమనిషి పట్ల వారిలోని విధేయత మాత్రం అణువంత కూడా తగ్గలేదు. ఆ రకంగా ఎంతోకాలం గడిచింది. ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతున్నాయి. కానీ, ఎక్కడా అగ్గి, నిప్పు, మంట మాత్రం అడుక్కున్నా కనిపించడం లేదు.




 

Monday, January 26, 2026

లోకాభిరామం - బయటి తిండి


లోకాభిరామం

బయటి తిండి 


బయట తిండి

అవుట్‌ సైడ్‌ పుడ్‌ అవాయిడ్‌ చేయడానికి ట్రై చేస్తాను అంటుంది మా యజమానురాలు. అక్కడికి ఆవిడ అదేపనిగా బయట తిండి తిన్నట్టు మాట్లాడిన భావం మీకు కలిగితే బాధ్యత నాది కాదు. అవుట్‌ సైడ్‌ లో ఏం దొరుకుతుందో కూడా ఆమెకు తెలియదు.

సాంబశివయ్య గారు బడిలో పిల్లలకు బజారు తిండి తినకూడదు అని భారీ ఎత్తున ఉపన్యాసం చెప్పి అదే సాయంత్రం బండి పక్కన నిలబడి రెణ్ణాల బజ్జీలు ఇయ్యవయ్యా, అన్నాడని మా విజయ చెప్పి తెగ నవ్వేది. అంటే రెండు అణాల అని అర్థం. బండి మనిషికి సంగతి అర్ధం అయిందో లేదో అప్రస్తుతం. మనం ఇప్పుడు తిండి గురించి మాట్లాడుకుంటాం.

పల్లెకే పరిమితం అయినప్పుడు ఐస్క్రోట్‌ అనే ఐస్‌ ఫ్రూట్‌ తినడం వరకు అనుమతి ఉంది. అప్పుడో ఇప్పుడో బొంబాయి మిఠాయి

అనే పీచు మిఠాయి అనే షుగర్‌ క్యాండీ అరుదుగా అమ్మడానికి వస్తే దాన్ని కొని తిన్నాము. అదే మరి జిగురుగా ఉండే మరో చక్కెర

మిఠాయి తినడానికి అనుమతి లేదు. దాన్ని నాకవలసి ఉంటుంది. చెరువులో దొరికే దుంపలను ఉడకబెట్టి అమ్మేవారు. పచ్చి దుంపలను తెచ్చి ఉడక పెట్టాలి అంతేగాని ఉడకపెట్టిన దుంపలు తినడానికి అనుమతి లేదు.

పాలమూరు చేరిన తరువాత పరిస్థితి కొంచెం మారింది. అక్కడ మిరపకాయ బజ్జి రుచి తెలిసింది. పాలమూరులో విషయంలో ఒక ప్రత్యేకత కూడా తెలిసింది. కట్‌ మిర్చి అని ఒక విశేషమైన పదార్థం దొరికేది. మామూలు మిరపకాయ బజ్జీలను ముక్కలుగా కోసి మళ్లీ నూనెలో వేపి వాటిమీద మసాలా వేసి మరీ అమ్మేవారు. రుచిగా ఉండడమే కాక అవి బహుశా కడుపుకు కూడా అంత హాని కలుగ చేసేవి కావు. నాకు వాటి మీద ఇష్టం కలిగింది. జేబులో చిల్లుకానీ ఉండేది కాదు గాని ఇటువంటి కోరికలు ఎలాగో తీరేవి.

కొంతకాలానికి గంజి అంటే గంజు అంటే ధాన్యం బజారు అనే ప్రాంతంలో ఒక ఉత్తర భారత బ్రాహ్మణుడు నడిపించే చాట్‌ బండి గురించి తెలిసింది. గప్‌ చుప్‌ లేదా పానీ పూరి అనే ఒక కొత్త విశేషం అర్థం అయింది. దానికి మా వాళ్ళందరూ అభిమానులుగా మారారు. అంటే మిత్రబృందం అన్నమాట. కాలంలో నాలుగు అణాలకు కట్లెట్‌, మరో నాలుగు అణాలకు గప్ ప్ లు వచ్చేవి. నలుగురం కలిసి వెళ్లి తిన్నా రెండు రూపాయలు మాత్రమే. రెండు రూపాయలు నా దగ్గర ఉన్నాయని మాత్రం కాదు. బండి బ్రాహ్మణుడు సాయంత్రం పూట మాత్రమే వ్యాపారం కోసం బయటకు వచ్చేవాడు. మిగతా సమయంలో ఇంట్లోనే ఉండేవాడు. మా వాళ్లు ఇంటిని కనుగొన్నారు. మనసుకు వచ్చినప్పుడు అతను ఇంటికి వెళ్లడం మొదలైంది. అతను వంట చేస్తున్న ఛాయలకు కూడా రానిచ్చేవాడు కాదు. ఒక బెంచి మీద దూరంగా కూర్చోమనే వాడు. మడి అన్న పద్ధతితో అడిగిన పదార్థాలను దొన్నెలలో తెచ్చి పైనుంచి చేతిలో పడేసేవాడు. మిగతావాళ్ల సంగతి తెలియదుగాని పద్ధతులు నాకు అలవాటు కనుక ఇంట్లోలాగే అనిపించేది. ఇంటికి దగ్గరలోనే ఉండే డీఈఓ ఆఫీస్‌ ముందు చెట్టుకింద తడికలతో ఏర్పాటుచేసిన ఖాన్‌ సాహెబ్‌ చాయ్‌ హోటేల్‌ ఉండేది. అతని దగ్గర టీ చాలా బాగుంటుంది అని అందరూ అనేవారు. ఆఫీసులోని పెద్ద వాళ్లతో మొదలు అలగాజనం దాకా అందరూ అక్కడే టీ తాగేవారు. నాకు నిజానికి టి అలవాటు లేదు. కానీ బంధువులైన ఒకరిద్దరు అన్నలతో ఒకసారి నేను అంగడిలోకి వెళ్లాను. మిరపకాయ బజ్జీలు కూడా తిన్నాము. టీ తాగడం సరేసరి. అయితే సంగతి ఇంట్లో వాళ్లకు ఎవరికో తెలిసింది. ఇక సాయంత్రం మామీద కోర్టు మార్షల్‌ లాంటి పెద్ద తతంగం నడిచింది. మేము కట్‌ మిర్చి, కట్‌ లెట్‌ కూడా తింటున్నామని తెలిస్తే బహుశా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే వాళ్లేమో!

నాకు పాలమూరులోనే ఉల్లిపాయ పకోడీల రుచి తెలిసింది. మొట్టమొదటి సారి ఎక్కడ తిన్నాను గుర్తులేదు కానీ కమల్‌ హోటేల్‌ అని ఒక చిన్న అంగడి దొరికింది. ఉత్తర భారతానికి చెందిన ఇద్దరు దంపతులు దాన్ని నడిపిస్తూ ఉండేవారు. వాళ్లు చాలా శుభ్రంగా చూడడానికి కూడా చక్కగా ఉండేవారు. అంగడి మొదట్లో కొంతకాలం అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండేది. అప్పుడు అక్కడికి వెళ్లడం పెద్ద సమస్య కాదు. బడి కూడా పక్కనే ఉంటుంది. కనుక మిత్రులము అంతా చేరి అక్కడికి వెళ్ళేవాళ్ళం. పాలమూరులో మామూలుగా దొరకని కూల్‌ డ్రింక్స్‌ కూడా వాళ్ళు ఎవరో అమ్మవారు. రాస్ప్‌ బెర్రీ అనే రుచి అక్కడే పరిచయం అయింది. వాళ్లు అంగడి న్యూటౌన్‌ కు మార్చారు. అయినా సరే మేము వెళ్లడం ఆగలేదు. నిజానికి మా సాయంత్రాలు అక్కడే అంటే ప్రాంతంలోనే ఎక్కువగా గడిచేవి మరి.

పట్నం చేరిన తరువాత పరిస్థితి చాలా మారిపోయింది. హాస్టల్లో చేరాము అంటే మొత్తం తిండి మనవాళ్లు వండింది కానేకాదు. ఇక ఎక్కడపడితే అక్కడ తినడానికి సందేహం లేనేలేదు. పెద్దవాళ్లు ఊరిలో లేరు. ఎక్కడో దూరంగా ఉన్నారు. చాట్‌ రుచి పిలుస్తూనే ఉన్నది. కోఠీలో గోకుల్‌ చాట్‌ ఇప్పుడు అందరికీ మిరపకాయ బజ్జీలకన్నా బాంబుల కారణంగా ఎక్కువగా తెలుసు. మాకు మాత్రం ఇది కేవలం ఒకే ఒక్క మడిగె ఉన్ననాటి నుంచి తెలుసు. ప్రస్తుతం వ్యాపారాన్ని నడిపిస్తున్న అన్నదమ్ముల తండ్రి అద్భుతమైన మిరపకాయ బజ్జీలు వేసేవాడు. లోపల రెండు బెంచీలు ఉండేవి. వెళ్లి కూర్చుంటే వేడివేడిగా రకరకాల పదార్థాలు దొరికేవి. బాంబులు పేలిన తరువాత కూడా అంగడిలో మనుషులు నిలబడి తిండి తింటున్నారు అంటే నాకు గుండె కరిగి కాలువై ప్రవహిస్తుంది. ఘాతుకం తరువాత నాకు ప్రాంతంలో నడవాలంటేనే చిత్రమైన భావాలు కలుగుతుంటాయి. మరే దేశంలో అయినా అక్కడ ఒక స్మారక మందిరం కట్టి ప్రతినిత్యం పువ్వులు పెట్టే వారేమో. మనవాళ్లు చీమ కూడా కొట్టినట్టు ఇంకా మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటున్నారు.

గోకుల్‌ గురించి ఆలోచిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. అంగడికి ఎదురుగా అంటే అమ్మాయిల కాలేజీ గోడ పక్కన చాలా ప్రసిద్ధి చెందిన చాట్‌ బండి ఒకటి ఉండేది. అది కూడా అసలు సిసలైన బాపన వ్యవహారం. పెద్దాయనకు బహుశా చొక్కా ఉండేది కాదేమో అని అనుమానం. బండిని తాకనిచ్చేవాడు కాదు. దూరంగా నిల్చోవాలి. తిండి వస్తువులను ఎత్తి చేతిలో పడేసేవాడు. అక్కడ రోకలికి మువ్వలు కట్టి మసాలా దంచుతూ ఉంటే వచ్చే లయబద్ధమైన చప్పుడు బండికి ప్రచారంగా పనికి వచ్చేది. చాలా రుచికరమైన చాట్‌ పదార్థాలు అతని దగ్గర తిన్నట్టు గుర్తున్నది. చిత్రంగా ఒక అప్రస్తుతమైన అంశం చెప్పాలా లేదా తెలియడంలేదు. బండి పెద్దమనిషికి ఒక అందమైన కొడుకు ఉండేవాడు. బొద్దుగా ఉన్న కుర్రవాడు తండ్రికి పనిలో సహాయపడుతూ వుండేవాడు. యుక్తవయసు వచ్చేసరికి అతను అబ్బాయి కాదు అమ్మాయి అని బయటపడింది. వ్యవహారం

ప్రపంచానికి తెలియదు. అప్పటికి నేను పరిశోధనలోకి వచ్చాను కనుక తోటి పరిశోధకుని వలన విషయం తెలిసింది. అది పక్కనపెడితే, తరువాత తండ్రి గాని కొడుకు గాని మళ్లీ కనిపించలేదు.

ఇక తరువాత పరిస్థితులు మారాయి. నేను ఒకరిద్దరు మిత్రులతో కలిసి హైదరాబాదులోని స్టీట్‌ పుడ్‌ మీద ఇంచుమించు పరిశోధన చేసినంత పని చేశాను. నాకు తెలియని బండిగాని కార్నర్‌ అంగడిగాని లేదు అంటే ఒకప్పటికి ఆశ్చర్యం కాదు. కేవలం నూనెలో వేపిన వేరుశెనగ పప్పు మిరపకాయ బజ్జీల మంటకు విరుగుడుగా ఇస్తారు కనుక పారడైస్‌ బస్టాండ్‌ పక్కన ఉండే కోమటి సోదరుల మిరపకాయ బజ్జీల బండి వద్దకు ప్రయత్నంగా ఎన్నిసార్లు వెళ్ళాము గుర్తులేదు. ఆలు టోస్ట్‌ , శాండ్విచ్‌ కోసం రాణీగంజి దాకా వెళ్ళేవాళ్ళం అంటే ఆశ్చర్యం లేదు.

దేశమంతా తిరిగాను. ఎక్కడా నాకు మిరపకాయ బజ్జీల వెర్రి కనిపించలేదుఏళ్ల క్రితం కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ చిత్రంగా వంకాయ బజ్జీలు అమ్మడం కనిపించింది. దాన్ని వాళ్లు బేగుని అన్నారు. బైంగన్‌ ను మరి వాళ్లు బేగున్ అంటారేమో! మద్రాసు అనే చెన్నపురిలో భేల్‌ పూరి లో మామిడికాయ ముక్కలు వేస్తే ఆశ్చర్యపోయాను. పాండీబజార్లో ఒకచోట తారుడబ్బాతో పొయ్యి తయారుచేసి వాటిమీద రకరకాల టిఫిన్లు వండిపెట్టిన అంగడిని చూసి ఆశ్చర్యపోయాను. రెండు పొయ్యిలమీద ఒక దానిమీద బాణలి మరొక దానిమీద పెనం ఉన్నాయి. బాణలిలో పూరీలు, బజ్జీలు తయారవుతుంటే, పెనం మీద చపాతీలు, దోసెలు తయారవుతున్నాయి. ఇద్దరు ముగ్గురు కన్నా పనివాళ్ళు ఎక్కువగా లేరు. తిన్నవాళ్లు తినగా చివరకు ఏం తిన్నావు అని అతను అడుగుతున్నాడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే అందరూ అతని అభిమానులు, శ్రేయోభిలాషులు అని అర్థం. నేను రెండవ ఐటమ్‌ కొరకు అడిగే సందర్భంలో డబ్బుల ప్రసక్తి చేశాను. ముందు మీరు తినండి అన్నాడు అతను.

దశాబ్దాల క్రితం మద్రాస్‌లోని మరొక ఒక విచిత్రం చూచాను. ఒక యువకుడు మొత్తం బస్సును హొటేల్‌గా మార్చి ఉదయం సాయంత్రాలలో రద్దీగల ప్రాంతానికి తీసుకువచ్చి వ్యాపారం నడిపిస్తున్నాడు. ఆఫీసులకు వెళ్లే వాళ్లు కూడా అక్కడ ఉపాహారం ముగించుకుని మధ్యాహ్నానికి కావాల్సింది కూడా డబ్బాలో వేసుకుని వెళ్లడం నేను గమనించాను. అప్పట్లో ఆశ్చర్యం కలిగింది. ఆ పక్కనే ఒక చెత్తకుండీ పెట్టాడు. అరటి ఆకులు కాగితాలను అందులో వేయండి అంటున్నాడు. బస్సు బయలుదేరి వెళ్ళే సమయానికి చెత్తను కూడా తనతో పాటే తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇటువంటి మొబైల్‌ పుడ్‌ యూనిట్లు ప్రపంచంలో అన్నిచోట్లా కనబడుతున్నాయి. కానీ నేను 40 ఏళ్ల క్రిందటి సంగతి చెబుతున్నాను.

దిల్లీలో దారి పక్కన తిండి గురించి నిజంగా చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయాలి. చాందినిచౌక్‌ లోని వేడివేడి జిలేబి, గలీ పరాఠేవాలీలోని పరాఠాలు, శివాజీ స్టేడియం బస్‌స్టాప్‌ లోని ఆలుచాట్‌, మండీ హౌస్‌ పక్కన ఉండే గుండ్రని మార్కెట్లోని మిఠాయి అంగళ్ళు, అన్ని దేనికదే ప్రత్యేక ఆకర్షణగా నిలబడగలవి. నగరంలో చలి, ఎండ రెండు విపరీతంగా ఉంటాయి. కనుక వేసవికాలంలో చల్లని రసగుల్లాలు, చలికాలంలో వేడివేడి గులాబ్‌ జామున్‌లు తినడం అక్కడే బాగా అలవాటు అయింది. చాందిని చౌక్‌ జలేబిలను వెతుకుతూ ప్రపంచం నలుమూలల నుండి మధురప్రియులు వస్తారు అని అర్థం అయింది. నిజంగానే అక్కడ ఏదో ప్రత్యేకత ఉన్నట్టు తోచింది. ఇక రాజధాని నగరంలో తిండి పరిస్థితి గురించి పరిశీలిస్తే కొన్ని విచిత్రాలు కనిపిస్తాయి. మన దగ్గర ఉన్నట్లు తక్కువ ధరలో ఉపాహారం తీసుకుని కాలం కాపాడుకోవడానికి తగిన తిండి ఏర్పాట్లు అక్కడ ఉండవు. మంచి వెలగల పుడ్‌ జాయింట్స్‌ ఉంటాయి. లేదంటే దారి పక్కన తినవచ్చు. నేను ఉద్యోగ పరంగా కూడా అక్కడ ఉండి విచిత్రాలన్నీ తెలుసుకున్నాను. పెద్దపెద్ద ఆఫీసర్లు కూడా రోడ్డు పక్కన నిలబడి బండిమీద తిండి తినడానికి మాత్రం అనుమానం లేకుండా వచ్చేస్తారు. తిండి పరిశుభ్రంగానే ఉంటుంది.

దిల్లీలోని పాలు, లస్సీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాలను అన్ని రకాలుగా తాగ వచ్చునని మొదటిసారిగా తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. పాడిని అనుభవించడం అంటే పంజాబ్‌ వాళ్ల దగ్గరే నేర్చుకోవాలి. ఇటుకలు లాగ పనీర్‌ ను అంగళ్ళ ముందు పెట్టి అమ్మడం చూచినప్పుడు ఆశ్చర్యం కూడా కాని భావం ఏదో కలిగింది. దిల్లీలో ఎక్కడికక్కడ ప్రత్యేకమైన వీధి తిండి దొరుకుతుంది. వెతుకుతూ తిరగడానికి ఓపిక ఉండాలే కానీ, ఆసక్తిగల వారికి అది మంచి కాలక్షేపం.

తిండి గురించి మాత్రమే రాసే బ్లాగర్లు ఉన్నారట. నా బ్లాగులో నేను తిండి గురించి మాత్రం రాసినట్లు లేదు. తలుచుకుంటే దేశం మొత్తంలోనూ వెళ్లిన ప్రతిచోట తిన్న తిండి గురించి బ్లాగు కర్మ ఏమిటి ఏకంగా ఒక టీవీ సీరియల్‌ తీయవచ్చు. అటువంటి సీరియల్స్‌ చూచి సంతోషపడుతున్నాను. తిండి తినడం పోయి చూచి సంతోషపడే కాలం వచ్చింది. దాన్ని గురించి రాసి సంతోషపడే కాలం వచ్చింది. ఏదైనా బాగానే ఉంది.