Showing posts with label philosophy. Show all posts
Showing posts with label philosophy. Show all posts

Friday, July 17, 2026

లోకాభిరామం : ఏకాంతమూ - ప్రశాంతమూ


ఏకాంతమూ... ప్రశాంతమూ...

ఈ ప్రశాంత ఏకాంత సాయంత్రంలో నిదురించు జహాపనా అంటాడు కవి. సాయంత్రం బాగుందట. అంత చక్కటి సాయంత్రంలో ఏకాంతం కూడా దొరికిందట. అయితే మరి అప్పుడు పడుకోవడంలో అర్ధం ఏమిటి? నాకు అర్ధం కాలేదు. ఏకాంతంలో మన వ్యక్తిత్వం నిస్సందేహంగా బయట పడుతుంది అంటాడు తాత్వికుడు. గాలిబ్‌ తన కవితలో ఒక చోట, దిక్కు తెలియని ఏదో ఒక చోటి నుంచి కొత్త ఆలోచన వచ్చేస్తుంది, గాలిబ్‌ కేవలం ఆ భావనలను కాగితం మీద పెడతాడు, అంటాడు. అంటే ఆలోచనలు తమవి కావు అంటున్నాడు అతను. ఏకాంతంలో ఉంటే మనిషి మనసు రెండు అంతస్తుల్లో పనిచేస్తుంది. ఒకటి మనకు తెలియకుండానే కొత్త ఎత్తులకు ఎదుగుతుంది. నాకు ప్రతినిత్యం రాత్రి పడుకుంటే వెంటనే నిద్ర రాదు. ఏదో ఒక  అంశాన్నితీసుకుని ఆలోచన మొదలవుతుంది. చాలా సందర్భాలలో అది ఉపన్యాసంగా మారుతుంది. నాకు నేనే ఉపన్యాసం చేసుకుంటాను. అందులో అనుకోకుండా కొన్ని కొత్త ఆలోచనలు కనబడతాయి. చటుక్కున లేచి, లైట్‌ వేసి, మాటలు కాగితం మీద రాసి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గాలిబ్‌ అనుభవమే ఇక్కడ నాకు కూడా కలుగుతున్నట్టు అర్ధం కదా. తన కవితలకు కావలసిన భావనలు ఒంటరితనంలో వచ్చాయని ఆయన భావించాడు. అంతుపట్టని సృజనాత్మకతలోనుంచి, ఆలోచనలోనుంచి, అవి కొత్తగా తలెత్తాయి. రచయితలకు చాలామందికి రాతకు కూర్చునే ముందు కొన్ని పరిస్థితులు అవసరం అనుకుంటారు. నాకు కూడా కొంతవరకు అవసరాలు ఉన్నాయి. అన్నింటికీ మించి ఏకాంతం కావాలి. కనీసం నిశ్శబ్దం కావాలి.

చిన్నప్పటి నుంచి నేను రాస్తుంటే, మా ఇంట్లో వాళ్ళు గోల చేయకుండా ఉండడం నాకు మొదటి నుంచి అలవాటు. పిల్లలకు కూడా నా సంగతి అర్థమయింది. ఏకాంతం కావాలి నిజమే. కానీ అది అనుకుంటే దొరికేది కాదు. దొరికినప్పుడు దాన్ని అనుభవించడం కూడా వీలు కాదు. మనిషి సంఘజీవి అని చాలా సులభంగా చెప్పేస్తారు. కానీ ఈ సంఘం మనిషిని తన మానాన తాను ఉండనివ్వదు. అందరూ కలిసి అర్ధం లేని కొన్ని ఆచారాలను తయారుచేసి అందరి తలకు చుట్టూ చుడతారు. కనుకనే అంత గోలలోనూ కవి, రచయిత ఏకాంతాన్ని కోరుకుంటాడు. గాలిబ్‌ కు ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయి? అందరికీ అది వీలవుతుందా?

నేను రేడియోలో ఉద్యోగం చేశాను. అక్కడ సమయాన్ని బట్టి తప్పకుండా రాయవలిసిందే. కార్యక్రమాలు చేయవలసిందే. నాకు మూడ్‌ లేదు, ఏకాంతం అంతకంటే లేదు, కనుక నేను రాయలేను, అని కూర్చుంటే ఉద్యోగం ఉట్టికి ఎక్కుతుంది. కనుక అవసరం కొద్దీ రాయడం అలవాటయింది. అయితే ఆ రాత వ్యక్తిగతంగా ఉండదు. అంత గొప్పగా కూడా ఉండనే ఉండదు. అక్కడి పరిస్థితులకు అది సరిపోతుంది. అంతేగాని నిజమైన భావుకతలో నుంచి, నిజమైన సృజనాత్మకత లోనించి, నిజమైన మార్మికత లోనుంచి మాటలు పలకాలంటే ఏకాంతం చాలా అవసరం.

ఒంటరితనాన్ని ఎవరికి వాళ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇరువురము కలిసి ఒంటరిగా నడుచుచు సాగితిమి అన్న పద్ధతిలో అందరి మధ్యలోను ఏకాంతాన్ని అనుభవించగలగాలి. అప్పుడు గాలిబ్‌ తీరుగానే కలం పట్టుకున్న ఎవరికైనా కాస్తంత తెలివి సులభంగా ముందుకు సాగుతుంది. కనుకనే ఏకాంతం రచయితలకు అసలైన అవసరం అంటాడు ఒక మహానుభావుడు. ఆయన అనుభవం కొద్ది ఆ మాట చెప్పినట్టు ఉన్నాడు చాలామందికి ఒంటరితనం నచ్చదు. నాకు ఒంటరితనం నచ్చుతుంది కానీ మరీ ఒంటరిగా ఉంటే అదేదో ఒక రకమయిన ఒంటరితనం మొదలవుతుంది. మనుషులు ఉండాలి. నా దగ్గర ఉండకూడదు. మనుషులు ఉండాలి, వాళ్లు మాట్లాడకూడదు. మనుషులు నన్ను పలకరించ కూడదు. నేను కూడా వాళ్ళను పలకరించను. మనుషులు ఉండాలి. తలుపులు అన్నీ మూసుకున్నా సరే ఏదో ఒక కిటికీ తెరిచి ఉంచు. ప్రపంచాన్ని నీ దగ్గరకు వస్తానంటే ఆపకు. అంటూ ఎప్పుడో ఒకసారి కవిత రాసుకున్నాను. బతుకంతా ఒంటరిగా ఉండనవసరం లేదు. దినంలో కనీసం కొన్ని గంటలు ఏకాకిగా ఉండగలగాలి. నాకు ఉద్యోగం చేసుకున్నంత కాలం ఈ అవకాశం కలగలేదు. కావాలనే ఉద్యోగం మానుకున్నాను. ఆ తరువాత ఒంటరితనమే ఒంటరితనం. ఇంట్లో వాళ్ళంతా పొద్దున్నే ఎవరి దారిన వాళ్లు పోతారు. పనిలేని వాడిని కనుక నేను ఇంట్లో మిగులుతాను. బూజులు చూస్తూ, పగుళ్లు లెక్కిస్తూ, ఆవులింతలు తీస్తూ రోజులు గడపవలసిన అవసరం లేదు. అందరూ వెళ్ళిపోయిన మరుక్షణం నా ప్రపంచం పరుచుకుంటుంది. నా పుస్తకాలు బయటికి వస్తాయి. నా కాగితం, కలాలు నాట్యం చేస్తాయి. నా చేత పిల్లి మొగ్గలు వేస్తాయి. రకరకాల రచనలు బయట పడతాయి. కనుకనే చూస్తుండగానే నేను రాసిన పుస్తకాలు తామరతంపరగా సెరిగి మూడంకెలకు చేరుకునే పరిస్థితి వచ్చింది.

అందరికీ ఏకాంతం ఇంత సులభంగా దొరకదు. చాలామందికి ప్రయత్నించినా సరే ఒంటరితనం దొరకదు. ఈ సంగతి నాకు తెలుసు. ఇంటికి తాళం వేయాలని నాకు కోపంగా వుండేది. తిరిగి వచ్చిన తర్వాత తాళం తీయాలని పిచ్చి కోపం వచ్చేది. కానీ సంవత్సరం దాకా ఇంటికి తాళం వేయవలసిన అవసరం లేకుండా పోయినప్పుడు నాకు తాళం గురించి, ఒంటరి తనం గురించి, అందులోని సౌకర్యం గురించి అర్ధం అయింది. అయితే అందరూ నాలాగే ఏకాంతం కోరుకునే వారు కారని కూడా నాకు అర్ధం అయింది. ఏకాంతం మనిషిని మార్చేస్తుంది. మనిషికి కొత్త దారులు చూపిస్తుంది. నేను టైనింగ్‌ క్లాసులో ఒక కథ చెబుతూ ఉండేవాడిని.

ఇద్దరు మిత్రులు ఒంటరితనం గురించి పందెం వేసుకున్నారు. వారిలో ఒకతను ధనికుడు. రెండో మనిషి మామూలు వాడు. మామూలు మనిషి, నేను ఎంతకాలమైనా ప్రపంచంతో పనిలేకుండా ఫోన్‌ లు టీవీలు లేకుండా, పత్రికలు కూడా లేకుండా గడపగలను, తిండి ఉంటే చాలు, అన్నాడు. ధనికుడు ఊరి బయట నాకు ఒక ఇల్లు ఉంది. అందులో నీకు వసతి ఏర్పాటు చేస్తాను. కిటికీలో నుంచి ఎప్పటికప్పుడు నీకు తిండి నీళ్ళు అందుతాయి. అంతేతప్ప మనుషుల అలికిడి కూడా వినిపించదు. ఆరు నెలలు నీవు కనుక ఆ పద్ధతిలో మా ఇంట్లో ఒంటరిగా ఉన్నావంటే నా ఆస్తి సగం నీకు ఇచ్చేస్తాను అన్నాడు. బీద మనిషి సరే అన్నాడు. ముహూర్తం నిశ్చయమైంది. అతడిని ఇంట్లో పెట్టి తాళం వేశారు. తిండి అందుతున్నది కాలం సాగుతున్నది. ఎక్కడ ఏ తేడా రాలేదు. ఐదున్నర నెలలు గడిచాయి. ధనవంతునికి వణుకు మొదలైంది. సగం ఆస్తికి కాలం చెల్లింది అనుకున్నాడు. ఐదు రోజులు మిగిలాయి. అతను కావలసిన కాగితాలు తయారు చేయించాడు. మిత్రుడు ఇంతకాలంగా గడిపిన ఇంటి దగ్గరికి వెళ్లి దూరం నుంచి చూచి వచ్చాడు. ఎక్కడ ఏ తేడా లేదు. బయట ఒక వాచ్‌ మన్‌ ఉంటాడు. లోపలి మనిషి వచ్చి పిలిస్తే గనుక తలుపు తీయాలి అని అతనికి ఆదేశాలున్నాయి. బయటి వారి పేరున మాత్రం తాళాలు తీయకూడదు. చివరి రోజు వచ్చింది.

మరుసటి నాటి ఉదయం వెళ్లి చూస్తే తాళాలు వేసినవి వేసినట్టు కనుక ఉంటే, ఆ మనిషి లోపలే ఉంటే అస్తి సగం అతనికి అందించాలి. కాగితాలతో సహా పంతం వేసిన మిత్రుడు ఉదయం అక్కడికి చేరాడు. ఆశ్చర్యంగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే మిత్రుడు లేడు. వాచ్‌మన్ తో వాకబు చేస్తే అయ్యా, ఆయన తెల్లవారుజామున తలుపు తీయమన్నాడు. నేను తలుపు తీశాను. ఆయన ముఖంలో గొప్ప వెలుగు కనిపించింది. గడ్డం కూడా పెరిగి ఉంది. జుట్టంతా పెరిగి ఉంది. ఆయన మారు మాట్లాడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను తప్పు చేయలేదు కదా అన్నాడు అతను. లోపలికి వెళ్ళి వెతికారు. పందెం వేసిన మిత్రుడు ఉన్న గదిలో ఒక కాగితం దొరికింది.

ఇన్నాళ్లు ఏకాంతంగా ఉండి నాకు ప్రపంచం గురించి ఆలోచించే అవకాశం అందించావు. భవిష్యత్తు గురించి నాకు గొప్ప ప్రణాళికలు దొరికాయి. నీ డబ్బుతో నాకు పనిలేదు.నా మార్గాన వెళ్ళిపోతున్నాను. మిత్రమా, నీకు ధన్యవాదాలు, అని రాసి ఉంది. మనిషి మీద ఒంటరితనం ప్రభావం అలాగుంటుంది.

ఈ పెద్ద మనిషికి ఏకాంతంలో తన గురించి తనకు తెలిసిపోయింది. నిజానికి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త మాట పుట్టాలంటే మనసులో కావలసినంత ఏకాంతం ఉండాలి. మన మెదడులో కోట్ల సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి. అవి అనుక్షణం మిగతావాటితో ముచ్చట పెట్టుకుంటూ ఉంటాయి. కనుక మెదడులో పెద్ద గోల ఉంటుంది. ఆ గోలలో ఒక కొత్త ఆలోచన వచ్చినా సరే కలగలిసి పోతుంది. జాతరలోని గందరగోళంలో కూడా ఎవరో మన పేరు పిలిస్తే వినిపించి నట్టు, మెదడులోని గందర గోళంలో కొత్త ఆలోచన బయటకు రావడానికి కొంత దారిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఏకాంతం. ఇది సూర్యకాంతం, అయస్కాంతం కాదు. అసలు సిసలైన ఒంటరితనం. అందరి మధ్యనా కూడా అలవాటు చేసుకోవలసిన ఒంటరితనం. నాకు కుదిరింది అని అనిపిస్తున్నది. ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? లేకుంటే చించి చూడండి!


 

Sunday, July 12, 2026

Poem of Ghalib in Urdu English and Telugu


Poem of Ghalib

in Urdu Fnglish and Telugu ( One about a place where he wanted to live and die)










 

Wednesday, July 1, 2026

సూర్యుని తరుముతూ పరుగు


సూర్యుని తరుముతూ పరుగు

ఛేజింగ్ ద సన్ అని ఒక పుస్తకం ఉంది. దాన్ని చూసినప్పుడల్లా ఒక అనుమానం ఎదురవుతుంది. డు ము వు లు ప్రథమ అనే సూత్రం ప్రకారం సూర్యుడు అంటే ఒక మగ మనిషి. రామః రాముడు అవుతాడు. కృష్ణః కృష్ణుడు అవుతాడు. అదే పద్ధతిలో సూర్యః పోయి సూర్యుడు అవుతాడు. వీళ్లంతా దేవుళ్ళు. మగవాళ్లు. అయినా రాముడు. కృష్ణులకు మీసాలు ఉండవు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి ఒక ఊరు. అక్కడ సూర్యుని గుడి ఉంటుంది. అందులోని దేవునికి మీసాలు ఉంటాయి. ఆ గుడిని చాలా కష్టపడి కట్టారు. సంవత్సరంలో ఒకనాడు ఆకాశంలోని సూర్యుని కిరణాలు (ఈ సూర్యుని గురించి రాయవలసిన చోట సూర్య గోళం అని రాయడం అలవాటయింది.) గుడిలోని సూర్యుని మీద నేరుగా పడే విధంగా దాన్ని కట్టారు. గాలిగోపురంలో అందుకు అనువుగా కిటికీల్లాంటివి ఉన్నాయి మరి. గుడిలో దేవుడు మగ దేవుడు. చిత్రంగా ఆడదేవతలు ఉంటారు. ఆలుమగలు ఉంటారు. ఆ సంగతులు ఇక్కడ అవసరంలేవు.. మరి దేవుడు అంటే సూర్యుడు మగవాడా అవునంటున్నారు మరి పెద్దలు. ఆయనకు రథం ఉంటుంది. దానికి ఏడు గుర్రాలు ఉంటాయి. అనూరుడు అనే తొడలు లేని సారథి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి సంగతులు మాకు చెప్పి చెప్పి తలకెక్కించారు. ఆకాశంలోని సూర్యుడు మండే వాయువుల ముద్ద అని కూడా చెప్పారు. బడిలో ఎక్కడ అటువంటి పాఠం చదివిన గుర్తు లేదు.. ఆ సంగతులు మరేదో మార్గంలో తెలిశాయి. ఆలోచన గల ఎవరికయినా తికమక మొదలవుతుంది. ఆకాశంలోని సూర్యునికి రథం ఉంటే కనిపించాలి కదా! అది ఎన్నడూ కనిపించలేదు మరి!

మండే వాయువుల ముద్దకు రథం ఎందుకు గుర్రాలు ఎందుకు

సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో 90 శాతం, ఇంకా ఎక్కువ మంది అవును అంటారు. ఈ మధ్యన కొంత మంది, పిల్లలు మాత్రమే ధైర్యంగా కాదు అనగలుగుతున్నారు. సూర్యుడు ఒకచోట ఉంటాడు. కదిలిన మనకు తెలిసే విధంగా కదలడు, అన్నారు ఆ పిల్లలు. భూమి సూర్య గోళ్లను చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంతో పాటు అది బొంగరం లాగా తన చుట్టూ తాను తిరుగుతుంది. కనుక మనకు సూర్యుడు ఉదయించిన భావం కలుగుతుంది, అని పిల్లలకు అర్థమైంది అన్నమాట.

సన్ (ఎస్ యు ఎన్) అంటే సూర్యుడు. సన్ (ఎస్ ఓ ఎన్) అంటే కొడుకు. ఎంత బాగుందీ పద్ధతి నా కొడుకు నాకు ఆకాశంలో సూర్యుని వలె వెలుగుతూ కనబడతాడు. అందరు పిల్లలు అలాగే కనబడతారు. సూర్యుడు, చంద్రుడు విరాట్ పురుషునికి రెండు కళ్ళు అన్నారు, వెనకటివారు. ఆరింటికి పోలికే లేదు. అని ఎంతమందికి అర్థమయింది

మనిషి దేవుళ్లను సృష్టించాడు. వారికి తనలాగే రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్నట్టు ఊహించాడు. అంతకన్నా మరొకరకంగా ఊహించడం అమాయకం మనిషికి చేతకాలేదు. విరాట్ పురుషునికి 1000 కళ్ళు, 1000 కాళ్లు ఉన్నాయి అన్నారు. అది ఎట్లా వీలవుతుంది అని ఆలోచన కలిగినట్లు లేదు. ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు గనుక వదిలేద్దాం.

విజ్ఞాన సర్వస్వంలో చూస్తే ఆకాశంలో సూర్యుడు ఎల్లో డ్వార్ఫ్ రకం నక్షత్రం అని రాసి ఉంది. దాని ద్రవ్యరాశి 1,909 X 10 10 (అంటే ఒకటి పక్కన పది సున్నలు పెట్టాలన్నమాట) కిలో గ్రాములు. డయామీటర్ అంటే చుట్టుకొలత 1,392,000 కిలోమీటర్లు అని కూడా ఉంది అక్కడ. అది భూమి నుంచి తొమ్మిది కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉంది. మరీ సరిగా చెబితే.92,955,887.6 మైళ్ళ దూరంలో ఉంది. అంత దూరాన్ని కుదించి 9 కోట్ల 30000 అంటే కొంపేమీ మునగదు. సూర్యుడు అంటే నక్షత్రం. అది చిన్న నక్షత్రం. అది పుట్టినప్పుడు కొంత పదార్థం దూరంగా చిమ్మింది. ఆ పదార్థం ముద్దలు కట్టి గ్రహాలు పుట్టాయి. వాటిలో భూమి ఒకటి. భూమి పదార్థంలో కొంత భాగం దూరం పోయి చంద్రగోళం తయారయింది. అది భూమి చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు, చంద్రుడు మధ్య పోలిక లేదని తెలిసిపోయింది. సూర్య గోళం మండుతుంది కనుక వెలుగునిస్తుంది. చంద్ర గోళానికి స్వంత కాంతి లేదు. ఈ అక్షరాలను మీరు పగలు చదువుతున్నారంటే, అందుకు అవసరమైన వెలుగు సూర్య గోళం మంట నుంచి వస్తున్నది.

ఆదిత్యాయ, సోమాయ అంటూ మనవాళ్లు గ్రహాలకు దండం పెడతారు. బడిలో మాత్రం సూర్యుని చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతుంటాయి, అని చెప్పారు. ఇప్పుడు పాత లెక్క తప్పు, లుతో గ్రహం కాదు. ఉన్న గ్రహాలు ఎనిమిది మాత్రమే అంటున్నారు. మన సంప్రదాయంలో రాహుకేతువులను గ్రహాలు అన్నారు. వాళ్ళిద్దరూ సూర్యుని, చంద్రుని మింగితే గ్రహణం వస్తుంది అని మాకు చిన్నప్పుడు చెప్పారు. ఇప్పటి పిల్లలకు గ్రహణం గురించి బాగా తెలుసు.

ఒక విషయం గురించి రకరకాలుగా చెబితే ఎవరికైనా తికమక, అనుమానం తప్పదు. చంద్రుడు మగ (మనిషి కాదు సుమా!), నక్షత్రాలు ఆయన భార్యలు అన్నారు. సూర్యుడు, (సూర్య గోళం) ఒక నక్షత్రం. దాని చుట్టూ తిరిగే భూమి నక్షత్రం కాదు. సూర్యుని కన్నా చాలా చిన్నది అది. ఆ భూగోళం చుట్టూ తిరిగే బుజ్జి గోళం చంద్రుడు. లేదా చంద్రగోళం. ఆయనకు నక్షత్రాలు భార్యలు అంటే అది పొసగని సంగతి.

సంప్రదాయంలో చెప్పే సంగతులు వేరు. ప్రత్యక్షంగా మనం చూసేది వేరు అని ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. తికమక అవసరం లేదు. ఎవరినీ తప్పు అనడం అంతకన్నా అవసరం లేదు. పడమటి దేశాల వారు చంద్రుడిని స్త్రీగా భావిస్తారని ఎవరికైనా తెలుసునా కానీ అది నిజం.

ఋగ్వేదంలో ఒక మాట ఉంది. కాంతిగల, కాంతి కలిగించే కాంతి వెలిగితేనే, మొత్తం విశ్వమంతా వెలుగుతుంది, అని అక్కడ చెప్పారు. పాశ్చాత్య నాగరికతలో సూర్యునికి అపోలో అని పేరు. అపోలో అంతరిక్ష నౌకలు సూర్యుని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అవి చంద్రగోళ మీద దిగాయి కూడా.

అన్నింటికీ మించి గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. సూర్య గోళం నుంచి భూగోళం వరకు గల దూరం ఎంతో విచిత్రమయినది. అంతకన్నా దగ్గరగా, లేక దూరంగా ఉన్న గ్రహాల మీద జీవం లేదు. ఇన్నర్ ప్లానెట్స్ అనే దగ్గర గ్రహాలు మండిపోతుంటాయి. దూరం గ్రహాలు చెప్పరానంత చల్లగా ఉంటాయి. భూగోళం మీద మాత్రమే నీరు ఉంది. అది ఆవిరి, నీరు, మంచు అనే మూడు స్థితులలో ఉండగలుగుతుంది. కనుకనే ఇక్కడ జీవం ఉంది. నీటిని, సూర్యుని వెలుగును వాడి జీవం పిండి పదార్థం అనే తిండి పదార్థాన్ని తయారు చేసుకుంటున్నది. జీవుల మనుగడకు సూర్యుడే ఆధారం. వానలు కురిసి అంతా బురద అయిన తర్వాత మళ్లీ ఎండకాస్తే, పరిస్థితి మామూలు అవుతుంది. భూమి మనకు తగిన విధంగా పొడిబారుతుంది. సూర్యుడు లేకుంటే ఆరోగ్యం లేదు. పగలు, రాత్రులు లేవు. రుతువులుండవు. వర్షాలు కురవవు!

ఇంతకూ సూర్యుడు అనాలా సూర్య గోళం అనాలా ఎవరైనా చెపితే బాగుంటుంది!


 

Thursday, June 25, 2026

ఖలిల్ జిబ్రాన్ రచన ఇసుక - నురుగ

 


 ఇసుక - నురుగ 

Long did I lie in the dust of Egypt, silent and unaware of the seasons.

Then the sun gave birth to me, and I rose and walked upon the banks of the Nile,

Singing with the days and dreaming with the nights.

And now the sun threads upon me with a thousand feet that I may lie again in the dust of Egypt.

But behold a marvel and a riddle!

The very sun that gathered me cannot scatter me.

Still erect am I, and sure of foot do I walk upon the banks of the Nile.

నేనెంతో కాలం ఈజిప్ట్ దుమ్ములో పడి ఉన్నాను, నిళ్ళబ్దంగా, కాలం గతి తెలియకుండా.
అప్పుడు సూర్యుడు నాకు బతుకునిచ్చాడు, ఇక నేను లేచి నైలు గట్లమీద నడిచాను,పగలు పాడుతూ, రాత్రులు కలలుగంటూ.
నేను మళ్లీ ఈజిప్టు దుమ్ములో పడి ఉండాలని, సూర్యుడు నన్ను చుట్టుకుంటాడు.
కానీ  వింతనూ చిక్కుప్రశ్ననూ చూడండి
నన్ను ఒకటి చేసిన సూర్యుడు నన్ను చెదరగొట్టలేడు.
నేనింకా నిటారుగా నిలుచున్నాను, నైలు గట్లమీద నమ్మకంగా నడయాడుతున్నాను.


 

 

Remembrance is a form of meeting.

Forgetfulness is a form of freedom.

గుర్తుండడమంటే కలయికలకు మరో రూపం.
గుర్తుండకపోవడం స్వతంత్రానికి మరో రూపం.



We measure time according to the movement of countless suns; and they measure time by little machines in their little pockets.

Now tell me, how could we ever meet at the same place and the same time?

మనం కాలాన్ని అంతులేని సూర్యుల కదలికలను బట్టి లెక్కవేస్తాం. వాళ్లుమాత్రం కాలాన్ని వాళ్ల చిన్ని జేబుల్లో ఉన్న ఒక చిన్ని యంత్రంతో కొలుస్తారు.

ఇప్పుడు చెప్పండిక మనం ఒకేచోట, ఒకే సమయాన కలవడం ఎలా వీలవుతుంది


Space is not space between the earth and the sun to one who looks down from the windows of the Milky Way.

పాలపుంత కిటికీలోంచి కిందకు చూచే వాళ్లకు, అంతరిక్షం అంటే భూమికి సూర్యునికీ మధ్యనుండే శూన్యం కానేకాదు.

Humanity is a river of light running from the ex-eternity to eternity.

మానవత అంటే మాజీ అనంతంనుంచి అనంతానికి ప్రవహించే ఒక నది.


Do not the spirits who dwell in the ether envy man his pain?

అనంతవాయువుల్లో నివసించే భూతాలు మనిషి బాధను చూచి భాధ పడతాయిగదూ

On my way to the Holy City I met another pilgrim and I asked him, "Is this indeed the way to the Holy City?"

And he said, "Follow me, and you will reach the Holy City in a day and a night."

And I followed him. And we walked many days and many nights, yet we did not reach the Holy City.

And what was to my surprise he became angry with me because he had misled me.

 

పవిత్ర నగరానికి దారిలో మరో ప్రయాణికుణ్ని కలిసి నేనడిగానూ, పవిత్ర నగరానికి దారి ఇదేనా అని నావెంటే నడువు, ఒక పగలు ఒక రాత్రిలో, పవిత్రనగరం చేరుకుంటావు అన్నాడతను.

ఇక నేను అతనివెంటే నడిచాను. మేం ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్లు నడిచాము, కానీ పవిత్రనగరం చేరనే లేదు.

ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించిందేమిటంటే, నన్ను దారి తప్పించినందుకు అతనికి నా మీద కోపం వచ్చింది.




 

 

3

Make me, oh God, the prey of the lion, ere You make the rabbit my prey.
ఓ దేవుడా నన్ను సింహానికి ఎరగా చెయ్యి. ఇక కుందేటిని నాకు ఎరగా చెయ్యి.

One may not reach the dawn save by the path of the night.

రాత్రి బాటన నడిచి తప్ప ఉషస్సును చేరడానికి వీలులేదు.


My house says to me, "Do not leave me, for here dwells your past."

And the road says to me, "Come and follow me, for I am your future."

And I say to both my house and the road, "I have no past, nor have I future. If I stay here, there is a going in my staying; and if I go there is a staying in my going. Only love and death will change all things."

నన్ను వదలకు, నీ గతమంతా ఇక్కడే ఉంది, అంటుంది నా ఇల్లు నాతో.నా వెంటరా, నీ భవిత నేనే, అంటుంది రహదారి నాతో.

ఇక నేను మాత్రం ఇంటికీ రహదారికీ ఒకే మాట చెపుతాను. నాకు గతం లేదు, భవిత అంతకూ లేదు. నేనిక్కడే ఉండిపోతే నా నిలకడలో ఒక పోవడముంది. ఇక నేను బయలుదేరితే నా నడకలో ఒక నిలకడ ఉంది. కేవలం ప్రేమ మరణాలు మాత్రమే అన్నింటినీ మార్చగలుగుతాయీ అని.

***********

 

How can I lose faith in the justice of life, when the dreams of those who sleep upon feathers are not more beautiful than the dreams of those who sleep upon the earth? Strange, the desire for certain pleasures is a part of my pain.
హంసతూలికల మీద నిదురించిన వారి కలలు నేల మీద పడుకున్నవారి కలలకన్నా అందమయినవి కానప్పుడు, నేను జీవన న్యాయం మీద నమ్మకాన్ని ఎలా వదులుకుంటాను. విచిత్రం, అదేదో ఆనందం కొరకు నా తపన, నా దుఖంలో భాగమయింది.

 

 

Seven times have I despised my soul:

నేను నా ఆత్మను ఏడుమార్లు మోసగించాను.
The first time when I saw her being meek that she might attain height.

మొదటిసారి, అది ఉన్నతమవుతుందనుకుని మెత్తపడుతుండగా.
The second time when I saw her limping before the crippled.

రెండవసారి, అది వికలాంగుల ముందు కుంటుతుండగా.
The third time when she was given to choose between the hard and the easy, and she chose the easy.

మూడవసారి, అది కష్ట సుఖాల ఎంపికలో సులభం వేపు మొగ్గినందుకు.
The fourth time when she committed a wrong, and comforted herself that others also commit wrong.

నాలుగవసారి, అది తప్పుచేసి, అందరూ తప్పుచేసే వారేనని, సరిపుచ్చుకున్నందుకు.
The fifth time when she forbore for weakness, and attributed her patience to strength.

అయిదవసారి, అది బలహీనతకు తలవంచి, తన ఓపిక బలం వల్ల వచ్చిందన్నందుకు.
The sixth time when she despised the ugliness of a face, and knew not that it was one of her own masks.

ఆరవసారి, అది తన ముఖమేనని తెలియక ఒక వికార రూపాన్ని అసహ్యించుకున్నందుకు.
And the seventh time when she sang a song of praise, and deemed it a virtue.

ఇక ఏడవసారి, అది శ్లాఘనగీతం పాడి అదొక సద్గుణమని అనుకున్నందుకు.


I AM IGNORANT of absolute truth. But I am humble before my ignorance and therein lies my honor and my reward.
నాకు శాశ్వత సత్యం తెలియదు. కానీ నేను నా అజ్ఞానం ముందు తల వంచుతాను. అందులోనే నా గౌరవమూ లా బహుమానమూ ఉన్నాయి.
There is a space between man's imagination and man's attainment that may only be traversed by his longing.

మనిషి అనుకున్నదానికీ అందుకున్నదానికీ మధ్య ఖాళీ ఉంది. ఆ ఖాళీని దాటడం కేవలం కోరికతోనే వీలవుతుంది.

Paradise is there, behind that door, in the next room; but I have lost the key.

స్వర్గం, పక్కగదిలో, ఆ తలుపు ఆవల ఉంది. కానీ నేను తాళంచెవులు పడేసుకున్నాను.
Perhaps I have only mislaid it.

బహుశ పొరపాటున ఎక్కడో పెట్టినట్టున్నాను.

You are blind and I am deaf and dumb, so let us touch hands and understand.

నీవు గుడ్డి. మరి నేనేమో చెవిటి, మూగ. అందుకే మనం చేతులు కలిపి ఒకరినొకరు అర్థం చేసుకుందాం.

The significance of man is not in what he attains, but rather in what he longs to attain.

మనిషి ఏం సాధించాడన్నది ముఖ్యంకాదు. ఏం సాధించాలనుకున్నాడన్నది ముఖ్యం.

Some of us are like ink and some like paper.

మనలో కొందరం సిరాలాంటి వాళ్లం. కొందరం కాగితంలాంటి వాళ్లం.

 

And if it were not for the blackness of some of us, some of us would be dumb;

మనలో కొందరి ఆ నలుపే లేకుంటే కొందరు మూగవాళ్లుగా మిగిలేవారు.
And if it were not for the whiteness of some of us, some of us would be blind.

మనలో కొందరి తెల్లదనమే లేకుంటే కొందరు గుడ్డివాళ్లుగా మిగిలేవారు.




Monday, June 1, 2026

లోకాభిరామం : సైన్స్ కూడా నమ్మకమే


సైన్స్ కూడా నమ్మకమే

సైన్సు- గండుచీమనాకు సంగీతం చీమ కుట్టిందని, ఒకానొక సారి అన్నట్టు గుర్తు. నాకు సాహిత్యం చీమ కూడా కుట్టింది. వీటన్నింటికీ మించి సైన్సు అనే గండుచీమ రక్తం వచ్చేదాకా కుట్టింది. ‘మీరు కొందరిని మతోన్మాదులు అంటున్నారు. వారు మనలను సైన్సు ఉన్మాదులు అంటారేమో చూడండి’ అని అడిగేంత ఘాటుగా కుట్టింది ఆ చీమ. ఈ మధ్యన ఏదో రాతకు తయారవుతున్న ప్రయత్నంలో భాగంగా, మనం మేలుకుని ఉన్నా, నిద్ర పోయినా, అంతా బయోకెమిస్ట్రీ, అని వాక్యం రాసుకున్నాను. నాకు ఈ ప్రపంచమంతా సైన్సుగానే కనపడుతుంది. మిగతావారికి అట్లాగ ఎందుకు కనిపించడం లేదని, అనుమానం కూడా వస్తుంది.

మనం ఉందనుకుంటున్న ఈ విశ్వం, అందులో సౌరమండలం, అందులో భూమి, అందులో జీవం, అందులో మనం మొదలైనవన్నీ మన, (మనలాంటి వారే అయిన తరతరాల మనుషుల) మెదడుల్లో నుంచి పుట్టిన అవగాహనలు. ఆలోచనలు పుడతాయి. వాటి గురించి ప్రయోగాలు జరుగుతాయి. కొన్ని విషయాలకు రుజువులు దొరుకుతాయి. అవన్నీ కలిపి సైన్సుగా నిలుస్తాయి. భౌతిక ప్రపంచంలో కూడా పదార్ధంగా, యదార్ధంగా ఉన్నవాటిని గురించిన సైన్సు ఒక భాగం. కేవలం అనుభవంలో మాత్రమే ఉండే ఆలోచనలు, సిద్ధాంతాలు కూడా ఒక భాగం! ఇది కూడా సైన్సే! వీటన్నింటికీ, ప్రపంచమంతటా ఆయా పరిస్థితుల్లో ఒకేరకమైన అనుభవాలు, ఆధారాలు దొరుకుతాయి. కనుక అది ఒక సైన్సు!

ఈ మన మెదడు (మెదడుల)లోనే మరికొన్ని ఆలోచనలు మొదలవుతాయి. అవి అందరికీ ఒకే రకంగా అనుభవంలోకి రాక పోవచ్చు. వాటికి ఆధారాలు అందరికీ ఒకే రకంగా అందవు కూడా! ఆలోచన ధోరణి, మెదడు మొదలైన సైకాలజీ దీనికి మొదటి ఉదాహరణేమో?

విశ్వం ఉందని అందరూ అంటున్నారు గనుక మనమూ ఉందంటున్నాం. అది నిజంగా ఉందని ఎవరూ చూడలేదు. ఉందన డానికి చెపుతున్న లెక్కలు, ఆధారాలు మొదలైనవి అందరికీ ఒకేలాగ అర్థం కావడంలేదు. సైన్సు చదువుకున్న వారికి కూడా సైన్సు అర్థం కాలేదు. సైంటిస్టులం అంటున్నవారు కూడా సైన్సు వేరు, బతుకు వేరు అనుకుంటున్నారు. నమ్మకాలు మెదడు లోనే పుడతాయి. అనుభవాలూ మెదడులోనే పుడతాయి. వాటిలో ఒకదానికి ఒకటి జోడించి చూడడం చేతగాదు. అంతా గజి బిజి గందర గోళం అవుతుంది. ఏది ఉంది, ఏది లేదు తేల్చుకోలేము. బతుకంటే భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటే నవ్వుతారు మరి. నవ్వేవారి తప్పు లేనేలేదు. వారలకు అంతగా చీమ కుట్టలేదు మరి. సైన్సయినా, మరోటయినా ఉందనుకుంటే ఉంది. లేదను కుంటే లేదు.

ఒక మిత్రుడెవరో చాలాకాలం తరువాత కనబడతారు. ఎవరెవరి గురించో అడుగుతాము. ఫలానా వాడు ఎక్కడా? అంటే ‘అయ్యో! తెలియదా? వాడుపోయి నాలుగేళ్లయింది!’ అంటాడా మిత్రుడు. మనమేమో ఆ ‘ఫలానా’ ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనుకుంటున్నాము. ఆయన పోయి నాలుగేళ్లయినా, మనకు మాత్రం ఆ క్షణాన్నే పోయాడు. అసలా సంగతి గురించి ఇంకా నమ్మకం కుదరదు. భౌతికమైన మనిషి సంగతే ఇట్లాగయితే, ఉన్నామో లేదో, ఎవరికీ తెలియని అనుభవైక వేద్యాల సంగతేమిటి?

తరం-తరం: మా తాతయ్య పుస్తక ప్రియులు. ఆయన వదిలి వెళ్లిన పుస్తకాలే అందుకు నిదర్శనాలు. ఎనిమిది రకాల రామాయణాలున్నాయి ఆయన లైబ్రరీలో. తాతయ్య పుస్తకాలలో టూరిజం, సైన్సు(!) రకం పుస్తకాలున్నాయని గమనించాను. ఆ కాలంలోనే ఆధునిక వైద్యం, ఆరోగ్యం లాంటి విషయాల మీద పుస్తకాలు వచ్చాయని, వాటిని తాతయ్య తెచ్చి చదువుకున్నాడని తెలిస్తే ఈ ‘తిక్కదనం’ నాటి నుంచీ ఉందని అర్ధమైంది. మ్యాజిక్, గుర్రాల పెంపకం, ఆయుర్వేదం,  చిట్కా వైద్యం లాంటి విషయాల గురించి కూడా తాతయ్య పుస్తకాలు సేకరించి పెట్టుకున్నాడు. నాకు చేతనయినంత కాలం ఆయన పుస్తకాలను నేను కాపాడుకున్నాను. చదువు పేరిట ఇల్లు వదిలి, తిరిగి వచ్చేసరికి, ఇంట్లో పుస్తకాలు మిగలలేదు. మిగిలినవి పుస్తకాల లాగ లేవు. అది గమనించి నేను పడ్డ బాధ వర్ణనాతీతం.

నాన్న సంప్రదాయ విద్య బాగా చదువుకున్న వ్యక్తి. కాని ఎందుకో ఆయన లైట్ రీడింగ్ మీద మాత్రమే మనసు పెట్టినట్టు గమనించాను. ఆయన కొన్న పుస్తకాలన్నీ ఇంచుమించు అదే రకం. అవి కూడా మిగలలేదు. సంవత్సరాల తరబడి సేకరించిన చందమామలు, నవలలు మాయమయినవి. నాన్న, నేనూ ఆ విషయంగా పెద్ద బాధపడినట్టు లేదు.

నాన్న సాంప్రదాయం మనిషే. అయినా పిసరంత కూడా ఛాదస్తం లేదు. ఎమ్మెస్సీలో క్లాస్‌మేట్స్ (గరల్స్) ప్రోద్బలంతో నేను మీసాలు పెంచుకున్నాను. ఇంటికి వెడితే అది చూచి తంతారేమోనని భయం. తలవంచుకుని ఇంట్లోకి వెళుతున్నాను. అరుగు మీద కూచున్న నాన్న నా ముఖంలోకి చూసి ‘భేష్ బాగుందిరా నాన్నా!’ అని నిజంగా మెచ్చుకున్నారు. మూన్ ఫేస్ అంటారే! ఇంచుమించు అమ్మాయి ముఖం నాది. పైగా రంగు. మీసాలతో మగతనం కనిపించిందని వ్యాఖ్య! అదీ నాన్న పద్ధతి. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతుంటే నేను ఎడతెరిపి లేకుండా ‘అదేమి?  ఇదేమి’ అని ప్రశ్నలడగాలి. ఆయన సమాధానాలు చెబుతారు. కొన్ని ప్రశ్న తరువాత ‘చల్ బే (పోరా!)’ అంటారు. అది మాకు ఒక ఆట! నాకు బాగా గుర్తుంది! ఆ రకంగా ఆయన వెంట తిరుగుతూ ఎన్ని సంగతులు తెలుసుకున్నానో మరి! డిటెక్టివ్ నవలలు చదివితే పరిశీలన, విశ్లేషణ అలవాటవుతాయని నాన్న చెప్పాడు. పైగా నాన్న చర్చకు, ప్రశ్నలకు అవకాశం కల్పించాడు. నాకు మరీ ధైర్యం ఎక్కువైంది కూడా. కొన్ని సందర్భాల్లో ‘నాకు తెలిసింది ఇంత. మా పెద్దలు చెప్పింది, వారికి తెలిసింది ఇంతే!’ అని ఓటమిని కూడా అంగీకరించే వాడు నాన్న! నాన్నకు నేనివాళ కృతజ్ఞత చెప్పగలనా?

నాకు ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్ వచ్చిందని అమ్మ ఒక పండుగ పథకం వేసింది. బంధువులు మిత్రులు అందరూ వచ్చారు. పూజ (సత్యనారాయణ వ్రతమా?) ఏర్పాట్లు అయినయి. ‘రా! కూచో!’ అన్నది అమ్మ! ‘అమ్మా, నాకు మనస్థిమితం కుదరదు. పిచ్చి ఆలోచనలు వస్తాయి. అట్లా చేయడం తప్పుగాదా? అని అడిగాను. అందరూ నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. నాన్న మాత్రం ‘వాణ్ని వదిలిపెట్టండి’ అని అమ్మతో తాను పూజకు కూర్చున్నాడు. ‘మా వెనక కూచుని చూడు!’ అన్నారు అంతే! నాన్న ఒకనాడు కూడా ‘ఈ విషయం మీరు చేసి తీరాల్సిందే’ అని చెప్పిన గుర్తులేదు మాకెవరికీ!

తరం మారింది: సైన్సు ప్రకారం బతకడమని ఒకటుందని చాలామంది సైంటిస్టులకే తెలియదు. సంపూర్ణ సూర్యగ్రహణం గురించి పరిశోధించడానికి వెళ్లిన ఒకాయన బురద నీళ్లలో స్నానం చేశాడని యూనివర్సిటీ రోజుల్లో చెప్పుకున్నారు. అట్లాగని, మతాన్ని, నమ్మకాలను కాదనడం సైన్సనుకుంటున్నారేమో? మతం వ్యక్తిగతం, సైన్సు సార్వజనీనం! పరిశీలన, ప్రయోగం లాంటి అంచెలతో సాగుతుంది సైన్సు పద్ధతి! అది వంటబట్టడానికి సైన్సు చదవనవసరం లేదు.

నాకొడుకు మరీ చిన్నవాడుగా వున్నప్పుడు, వాడూ, నేనూ మాత్రమే మహబూబ్‌నగరం దాకా బస్సులో ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది గానీ, పిల్లలిద్దరూ చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారితో నేను తెగ గోల చేసేవాడిని. బస్సులో గోల చేయలేదు గానీ! నేనూ నా కొడుకు మాట్లాడుతునే ఉన్నామని తర్వాత అర్థమైంది. వాడికి బయట తిరగడం అదే కొత్త! కనిపించిన ప్రతి సంగతి గురించీ ప్రశ్నలడుగుతాడు. నాకు తెలిసింది నేను చెబుతాను. పాలమూరు అనే మహబూబ్‌నగర్ దగ్గరయింది. పక్కనకూచున్న పెద్దాయన, ఊరి మొదట్లోనే దిగడానికి సిద్ధమయ్యాడు. దిగబోతూ నావేపు చూచి ‘ఒక మాట చెప్పనాఅన్నాడు. ‘చెప్పండి’ అన్నాను. ‘మీ కొడుకుకు చాలా తెలివి ఉంది. మీకు అంతకన్నా ఎక్కువ ఓపిక ఉంది’ అన్నాడాయన! నేనీ సంగతి గురించి వ్యాఖ్యానించను.

కవిసమ్మేళనం-కొబ్బరి పచ్చడి: పుస్తక మేళాలో ఈ సంవత్సరం స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది మిత్రులు కనిపించారు కూడా. అక్కడ కవిసమ్మేళనం జరుగుతుందని మైకులో చెపుతున్నారు. పాల్గొంటున్న కవులందరూ మిత్రులు, కనీసం పరిచితులు. ఈ సంగతే నాతో ఉన్న మా అమ్మాయితో చెప్పాను కూడా. వేదిక ముందుకు వెళ్లేసరికి కవులంతా వేదికను అలంకరించారు. అంటే వేదికను ఎక్కారని అర్థం. కొంచెంసేపు ఉండి వెళ్లిపోదాములే! అంటున్నాను అమ్మాయితో. ఇంతలో ఫోను మోగింది. దూరం వచ్చి వింటే ‘ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయమంటారా సార్’ అని ప్రశ్న. వంటాయన! రామాయణంలో పిడకల వేటలాంటి టైటిల్ గుర్తువచ్చింది. సైన్సుకూ, ఈ ముక్కకూ సంబంధం లేదని మనవి!