Wednesday, September 10, 2025

Lokabhiramam 8 - లోకాభిరామం - 8 ప్రపంచ మహాసభలు

లోకాభిరామం - 8 


ప్ర'పంచ' తెలుగు మహాసభలు

"వ్రైదికం ప్రిల్లీ! వ్రత్తులు పలకాలమ్మా! అంటే అది మ్రియ్యావ్‌! అన్నదట!"

వైష్ణవ సంప్రదాయం వారికి మరింత కష్టం. వత్తులు పలికితే చాలదు. తమిళం ప్రభావం భరించాలి. తిరు అన్న మాటను ‘శ్రీ’ స్థానంలో వాడతారు. మనుషులకే కాదు, వస్తువులకు కూడా వాడతారు. తులసిని తిరుత్తుళాయి అనాలి. గౌరవమైన ఇంటిని తిరువీడు, తిరుమాళిగ అనాలి. నాలాంటి ఒక ఆతతాయి, అదే ఆకతాయి ‘తిరు వంటశాలలో తిరుక్కుక్క ప్రవేశించింది, తిరుక్కర్రతో తిరుక్కొడితే, తిరుక్కుయ్యో, అన్నది అన్నాడట! పోలె, హోళిగ, పోళీ, బొబ్బట్టు అనే భక్ష్యాన్ని తిరుప్పణియారం అంటాము. పవిత్రమైన తిండి విశేషము అని అర్థము అంతే! పాయసం పేరు, తిరుక్కణ్ణన్‌ అముదు. శ్రీకృష్ణ అమృతం అని అర్థం. కవినోట పుట్టి, మరో నోట చచ్చె అన్నట్టు, మా వంటి చరితాత్పూర్వ తమిళుల నోట అది తిర్కణ్ణమోదు అయింది. రసం అనే చారు సంగతి మరింత అన్యాయం. శాట్రు అముదు లేదా శార్తముదు అని దాని మాట. నాతోబాటు పంక్తిలో ఉన్న నారాయణన్‌ను వడ్డించే ఆమె ‘చార్ఛమోదు’ కావాలెనా అని అడిగితే అతను బిత్తరపోయాడు.

పంచె తెలుగు: మొదటి సారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు, అవి నిజంగా పంచె మహాసభలు. ముఖ్యమంత్రి వెంగళరావు గారు పంచె, విద్యా మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారు పంచె! సమాపన కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఉప రాష్ట్రపతి బస్సప్ప దానప్ప జెట్టిగారు కూడా పంచెకట్టులోనే వచ్చారు. పంచెలు పోయినయి తెలుగుదనము, తెలుగు ధనము పోయిందేమో! మొన్నొకాయన, ఉద్యోగం బరువుతో బలవంతంగా పంచె కట్టుకుని పడుతున్న తిప్పలు టీవీలో వీక్షించి, (చూచి కాదని మనవి! అందరూ చూసి అంటారు. నేనింకా ఛాదస్తంగా చూచి అంటున్నాను!) హాసించడం, అసభ్యత గనుక, ఉపేక్షించితిమి. అనగా మిన్నకుంటిమి అనగా ఊరికే ఉంటిమి. ఊరుకుంటిమి. సందర్భం వచ్చింది గనుక మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో చీరల పాత్ర గురించి చెప్పక తప్పినది కాదు (!) (ఎందుకొచ్చిన భాష!) సభలు ఫతేమైదాన్‌లో జరిగినయి. అంటే లాల్‌బహాదూర్‌ స్టేడియంలోనన్నమాట. (ఈ సభలు జరుగుతుండగానే లాల్‌బహాదూర్‌ పోయారు. ఒకనాటి కార్యక్రమాలు ముల్తవీ (పోస్ట్‌పోన్‌) అయి ముందుకు జరిగినయి. శాఖాచంక్రమణమన నిదియే గాబోలు! స్టేడియంలో స్టాండ్స్‌ మీద, రాష్ట్ర చేనేత సంస్థ (హైక్రో ఫ్యాబ్రిక్స్‌, తర్వాత ఆప్కో) వారి సౌజన్యంతో రంగురంగుల చీరలతో, తోరణాలుగా కట్టి అలంకరించారు. అంచెలంచెలుగా ఆ చీరలు కన్నుల పండుగగా కనిపించాయి. తూర్పు భాగంలో ఒక లైటు బల్బు పేలింది. కొన్ని చీరలు పాడయినయి. ప్రమాదమేమీ జరగలేదు.

మొదటి సభలు: తెలుగు మహాసభలు పెట్టాలన్న ఆలోచనే గొప్పది. నేనప్పుడు జంతుశాస్త్రంలో ఎం.ఎస్సీ చదువుతున్నాను. అదీ వరంగల్‌లో. రెండు సంవత్సరాలలోనూ క్లాసులు ఎగబెట్టిన సందర్భాలు ఒక చేతి వేళ్లను కూడా మించవు. ఏకంగా రెండు మూడు రోజులు, నేను కనిపించకపోతే, ప్రొఫెసర్‌ రామచంద్రరావుగారు క్లాసులోనే అడిగారట. సంగతి చెపితే, ‘కదూ! అతనంతే!’ అన్నారట. రోజంతా స్టేడియంలోనే. ఎన్ని సదస్సులో, ఎన్ని కార్యక్రమాలో! అందరూ రావచ్చునన్నారు. ఎందరో వచ్చారు. సాయంత్రం అయింతరువాత గొప్ప సాంస్కృతిక ప్రదర్శనలు.. వాటికి వ్యాఖ్యానం సినారె అనే సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు. అప్పటికింకా ఆయన ఎంపీ, వైస్‌ ఛాన్సలర్‌ లాంటి బరువులేవీ మోయలేదు గనుక, ఉత్సాహంగా, తనదయిన మాటకారితనంతో చేసిన ప్రకటనలు, వ్యాఖ్యానాలు అందరినీ ఆకర్షించాయి. ‘పప్పరస సుబ్బారావుగారి నాటకం’ ‘అల్లీముఠా’ అని ఆయన చేసిన అనౌన్స్‌మెంటు నాకింకా చెవుల్లో సుడులు తిరుగుతూనే ఉంటుంది.

ఆస్థానం: స్టేడియం లోపల గాక వెనక వేపు వేసిన తంబూ అంటే గుడారం, అంటే పందిరి, అంటే టెంటులో కవిసమ్మేళనం జరిగింది. అందరూ అప్రయత్నంగానే పంచెల్లో కనిపించినట్టు గుర్తు. విశ్వనాథ సత్యనారాయణ గారు అధ్యక్షులు. వారి కొక్కరికే కుర్చీ. మిగతా వారంతా కింద కూచున్నారు (ము). చదివిన ప్రతి కవికీ అక్కడికక్కడే ఆస్థానం పద్ధతిలో పారితోషికం ఇస్తున్నారు. కరూర్‌ వైశ్యా బ్యాంకే ననుకుంటాను, ముఖ్‌మల్‌ అంటే వెల్‌వెట్‌ గుడ్డ సంచీలో నూట పదహారు రూపాయి నాణాలు మూటగట్టి పళ్లెంలో పెట్టి పట్టుకొస్తాఠు! విశ్వనాథ వారు దాన్ని ప్రభువు పద్ధతిలో కవికి బహూకరిస్తారు. సురగాలి తిమోతి జ్ఞానానంద కవిగారి వంతు వచ్చింది. భారీ విగ్రహం, అంత దూరానికి కనిపించే గుబురు మీసాలు, పైన శాలువా, ఆయన మంచి శరీరం, శారీరం గల వ్యక్తి. కమ్మని సీస పద్యాలు రాసి, రాగయుక్తంగా వాటిని గొంతెత్తి పాడడం ఆయన పద్ధతి. ఆ పద్ధతి బాగా సాగుతున్నది. విశ్వనాథ వారి సంగతి తెలియనిదేముంది? ‘ఇదుగో, ఇచ్చిన టైం ఎప్పుడో మించిపోయింది. ఇంకా ఆపకుంటే, ఈ డబ్బుల మూట నీకివ్వను! జాగ్రత్త!’ అన్నారు. నవ్వడానికి ఎవరికి ధైర్యముంటుంది? వీరిలాగే మరొకాయన పేరు చివరన కూడా కవి అన్న మాట ఉండేది. రాజన్న కవిగారిని నేను అమాయకంగా, ‘అది పెద్ద వారు పెట్టిన పేరా, లేక మీరు పెట్టుకున్నారా?’ అని అడిగాను. ఆయన గవర్నమెంటు ఆఫీసరు సమాధానం ఇవ్వలేదని గుర్తు!

స్మారక సంచిక: ఈ సభల సందర్భంగా ఒక మంచి సూవెనీర్‌ వేశారు. (సావెనీర్‌ అనగూడదటండీ!) అందులో మంచి మంచి వ్యాసాలున్నాయి. అలాంటి వ్యాసాలున్న ప్రత్యేక సంచికలు తరువాత కూడా చాలా వచ్చాయి. కానీ, ఆ సంచికలో మన చిత్రకారుల కుంచెల నుంచి పుట్టిన కళాఖండాలను, మంచి కాయితం మీద రంగులలో అచ్చొత్తించి మధ్యమధ్యన ఉంచి అందించారు. పదో పన్నెండు రూపాయలో ధర. అప్పట్లో నాకది అందుబాటులో లేని మొత్తమే! అయినా కొన్నాను. ఆ తరువాత ఒక బ్రహ్మాండమయిన ఆలోచన వచ్చింది. పెయింటర్లను పట్టుకోవడం కుదరదు. కనుక కవి పండితుల చేత ఒక్కో బొమ్మ కింద ఆటోగ్రాఫు అదే సంతకం చేయించుకునే ఉద్యమంలోకి నడుం కట్టి ఉరికాను. (అదేం లేదు! ప్రయత్నం చేశాను అంతే!) బాలమురళి, రజనీకాంత రావు, పుట్టపర్తి మొదలు చాలా మంది సంతకాలే సేకరించాను. ఆ సందర్భంలోనే ముగ్గుబుట్ట లాంటి తలతో పండులాగ కనిపిస్తున్న దేవులపల్లి కృష్ణశాస్త్రిగారిని చూచాను. వారికప్పటికే మాట సౌకర్యం పోయింది. సంతకం చేయమని పీ టీ రెడ్డిగారి (దేనా?) పెయింటింగున్న పేజీ విప్పి ముందు పెట్టాను. అది అధివాస్తవిక చిత్రం. దాని కింద వారు ‘అమ్మయ్యో’ అని రాసి సంతకించారు. మిమ్మల్ని చూసినప్పుడు నాకూ అటువంటి భావమే కలిగిందండీ, అన్నాను. నిశ్శబ్దంగా నవ్వారాయన. బ్లాగులని ఒక పద్ధతి వస్తుందనీ, ఈ బొమ్మలను స్కాన్‌ చేసి నా బ్లాగ్‌లో అందరి ముందు ఉంచగలుగుతానని, నేనాడు అనుకున్నానా? నా బహుభాషా బ్లాగు లోకాభిరామంలో ఈ సంతకం పెయింటింగులు చాలానే ఉన్నాయి. అవి నా లోకాభిరామం బ్లాగులో ఫెయింటింగ్స్‌ లింక్‌ నొక్కి బాగా వెనక్కు వెళితే కనిపిస్తాయి.

తరువాత: తెలుగు సభలు ఈ మధ్య వరకు జరుగుతునే ఉన్నాయి. కానీ, ఈ సభలు మాత్రం న భూతో న భవిష్యతి అనవచ్చు. సమాపన సమావేశానికి ఉపరాష్ట్రపతి వచ్చారు. స్టేడియంలో నేను కొంత ఎత్తులో మెట్ల మీద ఉన్నాను. గ్రౌండంతా తొడతొక్కిడి అంటారే, ఆ పద్ధతిలో మనుషులున్నారు. స్టేడియం, తలమంతా తలలతో నిండి నల్లగా కనిపించింది. నిజం చెప్పొద్దూ! నాకు ఒక్క క్షణం భయమయింది! ఏమయినా జరిగితే? కానీ అంతా మంచి మాత్రమే జరిగింది. కార్యక్రమం తర్వాత బయటకు రావడానికి అరగంటపైన పట్టింది. తోసుకుంటున్నందుకు, మధ్యలో ఒక అమ్మగారి తిట్లు కూడా ప్రాప్తించినట్టు గుర్తుంది.

అప్పట్లో ఒక ప్రత్యేక తపాలాబిళ్ల విడుదల చేశారు. అది సూవెనీర్‌లో ఉంది!


No comments: