Tuesday, February 17, 2026

లోకాభిరామం - కష్ట షకారం మరెన్నో సంగతులు...


లోకాభిరామం - కష్ట షకారం

 మరెన్నో సంగతులు...


కష్ట షకారం

హొటేల్‌లో (హోటల్‌ అంటే తప్పు తెలుసా?) దోసె తినడానికి పోయిన ఒకతను ‘బాగ పల్చగ వేయాలె. అంచులు కూడ బాగ కాలాలె. పచ్చిమిర్చి తక్కువగ ఉండాలె’ అని తన మనసును బయటపెట్టుకున్నాడు. సర్వర్మహాశయుడు మాత్రం లోపలికి పోయి ‘ఒక సాదా!’ అని ఆర్డరు ఇచ్చాడు. అదీ మన ఒకతనికి వినిపించే పద్ధతిలో!

ఇంగ్లీషులో దోసె పేరు దోస అని రాస్తరు. డొస్సా అని పలికిన వారిని నేను చూచి పుణ్యం కట్టుకున్నాను. దోస అన్నది కూరగాయలలో ఒకటి. వాటిలో ముల్లుదోస, ఏటిగడ్డ దోస, కీరా దోస అని రకాలుంటాయి. ఏటిగడ్డ దోస అన్నది కర్బూజలంత తీపిగా పండడం, కర్బూజకన్నా మెత్తగా వెన్నలాగ లోని గువ్వము (గుజ్జు) ఉండడము గుర్తుంది. మాకు చిన్నప్పుడు బుడుమ కాయలు తినడం అలవాటు. అవి దోసకాయలకన్నా చిన్నవి. గుండ్రంగా ఉండేవి. వీటిలో కొంత పులుపు ఎక్కువ. గింజలలో పులుపు మరీ ఎక్కువ. గింజలలో అనేకన్నా, వాటి చుట్టు ఉండే పదార్థంలో ఈ పులుపు ఉంటుంది కనుక, గింజల చుట్టు పులుపు అనాలి. పప్పులోనయితే గింజలతోబాటు ముక్కలు వేస్తే, ఇక పులుపే పులుపు.

ఈ బుడుమ కాయలలో కొన్ని చేదుండేవి. అమ్మ వాటిని చిన్న ముక్కలుగా తరిగి, కొంత చింతకాయ తొక్కు వేరే తీసి, అందులో కలిపి పెట్టేది. నాలుగయిదు దినాలయితే ఆ ముక్కలు చేదు పోయి, ఉప్పు, పులుపు కలిసిన గొప్ప రుచిలోకి మారేవి!

ఇనుప బొచ్చెల కాలం: మా ఊళ్లో చాలా మంది అన్నం, పప్పు, కూరలు అన్నీ మట్టిపాత్రలలోనే వండుకునేవారు. మా ఇంట్లో మాత్రం నాగరికత పేరున, అన్నం కంచు, ఇత్తడి గుండీల్లో వండేవారు. చారు, పప్పు మాత్రం మట్టికుండలోనే. కొంతకాలానికి జనం సత్తు అనే అల్యూమినం వాడడం నేర్చుకున్నారు. దాన్ని జర్మన్‌ సిల్వర్‌ అనేవారు. మా ఇంట్లో ‘చాయ’కు మాత్రం సత్తుగిన్నె వాడడం గుర్తుంది. మట్టికుండలో వండిన పప్పు, చారు రుచి మరో రకంగా ఉండేవి.

పాడి కూడా మొత్తమంతా మట్టి కుండలలోనే! నేలలో ఒక గుంత ఉంటుంది. దాని పేరు దాలిగుంత. అందులో పిడకలు వేసి, మీద ఒకటి రెండు నిప్పు కణికలు వేసి, రాజుకున్న తరువాత పాల కుండ పెడతారు. మీద ఒక పీట పెడతరు. పాలు దినమంత అందులో సన్నని సెగ మీద కాగి, కాగి చిక్కబడతయి. వాటి రంగు తెలుపు నుంచి మారిపోతుంది. పిడకల పొగ కారణంగా వాటికొక చిత్రమయిన వాసన వస్తుంది. కిటుకు తెలిసినవారు అమర్చిన పిడకల వల్ల రాత్రి వరకు వేడి పోతుంది. ఆ గుంటలోనే కుండలో తోడు పెడితే, తెల్లవారేసరికి చిక్కని కమ్మని పెరుగు సిద్ధం. నిజానికి ఆ పాత్రను కుండ అనకూడదు. దుత్త, అటికె లాంటి పేర్లుంటాయి వాటికి. వెడల్పు మూతి, ఎత్తు తక్కువ కలిగిన గిన్నెలాంటివవి! పెరుగును రాచ్చిప్ప (రాతి చిప్ప) లోకి మార్చిన తర్వాత, అడుగున పాత్రను కౌచిప్ప (ఆల్చిప్ప)తో గోకాలి. మాడీ మాడని గోకు వస్తుంది. అమ్మ ఎప్పుడు ‘గోకు’ పెడుతుందోనని ఎదురుచూడడం గుర్తుంది.

ఇనుప బొచ్చెల కాలం వచ్చింది. తిండిలో రుచి పోయింది. పొయ్యి తీరు మారింది. తిండి తిండి గాకుండ పోయింది!

గొట్టికాయలు: పల్లెలో ఆవులు, బర్రెలకన్న మేకలు ఎక్కువగ ఉండేవి. మేకలను పెంచడములోని ఇకనామిక్స్‌ నాకు తరువాత గాని అర్థం కాలేదు. (ఎకనామిక్స్‌, ఎలెక్ట్రాన్‌, ఎలెక్ట్రిసిటీ లాంటి మాటలు ఇ అనే అక్షరంతో మొదలు కావాలట తెలుసా!) మేక పాలు కొంత వాసన! కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. మా ఎదురింటి రాములు వాండ్లకు బోలెడన్ని మేకలు. వారి దగ్గర జీతము చేసే ఒక పిల్లవాడు, పాలను సూటిగ నోటిలోకి పిండుకుని తాగుతుంటే చూడడము మాకొక సరదా! గొర్లు (గొర్రెలు) మేకలను గుంపులుగ తెచ్చి పంట పొలాలలో రాత్రి ‘మందలాపుతరు’. మందలుగా ఆపుతరని భావము. వాటి చుట్టు వల దడి. కుక్క కావలి కూడ. మేకలు, గొర్లు రాత్రి మొత్తము అక్కడే నెమరు వేసి, మలమూత్రములను వదులతయి. అది పొలానికి బలము. ఎరువు! ఎంత సులభమయిన, చక్కని పద్ధతి! ఇప్పుడంతా కృత్రిమమే!

మేకలు, గొర్లు సాధారణముగ అడవిలోకి పోయి అక్కడ కనిపించిన చెట్లన్నిటినీ కరకర నమిలి తింటాయి. ‘మేక మేయని ఆకు’ అని ఒక చెట్టు, దాని ఆకులు ఉంటాయంటే చిత్రంగదూ! మిగతా మొక్కలు, చెట్ల ఆకులు, కాయలు, కొమ్మలన్నింటినీ అవి హాయిగా తినేస్తాయి. అయితే, కొన్ని కాయలలోని గింజలను, అవి అరిగించుకోలేవు. కాయ లేదా పండులోని గువ్వము (కండ) శుభ్రంగా అరుగుతుంది. గింజ అంత శుభ్రంగానూ మిగిలిపోతుంది. ఈ గింజలు, పెంటికలతో బాటు బయటకు వస్తయి. వాటినే గొట్టికాయలు అనేవారు. చెట్టునుబట్టి అందులో రకాలు. నూనె గొట్టికాయలు, నున్న గొట్టికాయలు గుర్తున్నయి. మిగతా వాటి రుచి మాత్రం గుర్తుంది. అంటే ఆ గింజలను పగలగొట్టి లోపలి పలుకులను తిన్నామనే గద అర్థం! చాలా రోజులపాటు పల్లెలో మేకలున్న ఇంటి పిల్లలకు, వారి దోస్తులకు ఇదొక కార్యక్రమం. లేచిన వెంటనే చెరువుకు పోవాలె. అక్కడ ఒకటి, రెండు, పండ్లు తోముట ముగుస్తయి. తరువాత మేకల దొడ్డిలో గొట్టికాయల వేట! నిజం చెప్పాలి. ఆ గింజల రుచి నాకు ఇవాళటికీ గుర్తుంది!

ఇసుర్రాయి: ఇసిరే రాయి అని విగ్రహము. ఇసరడము అంటే విసరడము కాదు. రాయిని దూరానికి విసిరేస్తాము. కానీ రెండు గుండ్రని రాతి పలకల నడుమ ధాన్యమును విసురుతాము. కింది రాతిలో నడుమ ఇనుప బొడ్డు, పై రాతిలో మధ్యమధ్యన గింజలు నింపేందుకు రంధ్రాలు. ఒక చేతితో రాతిని తిప్పుతూనే మరొక చేతితో గింజలు వేయడము ఒక నైపుణ్యత. పసుపు, చక్కెర కూడ ఈ పద్ధతిన ఇసరడము గుర్తున్నది. రొట్టెలు ఎక్కువగ తినే వాండ్ల ఇండ్లలో ఇసుర్రాయిని నేలలో ఒకచోట పాతి ఉంచడము గుర్తున్నది. కింది రాయి కదులుతుందన్న బాధ లేదన్నమాట. కరెంటు లేని కాలంలో ఇంటింటా ఈ ఇసిరే చప్పుడు గంటల పాటు వినిపించేవి. దారితోబాటే కిష్టమ్మ పాడిన ‘వొస్తుంటి శెల్లెల! వోగడ్డమాయె!’ అన్న జానపదం పాట గుర్తున్నది. ఇసరడము లాగనే పాట కూడ మహ సాగదీసి నడిచేది! పాలమూర్లో యాపశెట్ల కాడ గిర్నీలు వచ్చినయి. అంటే  వేపచెట్ల ప్రాంతంలో పిండిమరలు వెలిసినయని గ్రహించవలసినది.  వేపచెట్లు అన్నవి ఒక ప్రాంతమని అర్థమయ్యే ఉంటుంది. జొన్నల వంటి గింజలు సంచులలో పోసుకుని పోయి, పిండి పట్టించుకుని తేవడము కొందరికి అలవాటయింది. ఈ పేరున పాలమూరికి పోవచ్చు. నేను గూడ పోవాలని నాకు! అమ్మ నవ్వేది. ఎందుకయ్యా నీకా నడక, మోత కష్టం? అనేది. అయినా ఒక శేరు జొన్నలు, దానికి గిర్నీ కూలి అణాపైసలు సాధించి, మిగతా పిల్లలతో యాత్ర. అప్పట్లో అది సింద్‌బాద్‌కు మించిన సాహసయాత్ర!

కష్ట షకారం: ‘నాతో మాట్లాడడమే ఎడుకేషన్‌’ అంటాడు గిరీశం (కన్యాశుల్కంలో). కొందరితో మాట్లాడితే నిజంగానే బోలెడు కొత్త సంగతులు తెలుస్తాయి. పాషాణభేది గోపాలకృష్ణ గారు అట్లాంటి మనుషుల్లో ఒకరని నిస్సందేహంగా చెప్పగలను. ‘ఎల్లమ్మకు ఎల్లయ్యకు పెండ్లంట. ఎవరింట్లో వాండ్లకు విందంట!’ అని ఒక కవిత లాంటి మాట చెప్పా రాయన. దీనికి మూలం తమిళంలో ఎక్కడో ఉన్న ట్టుంది. గోపాలకృష్ణగారు సిపి బ్రౌన్‌ గురించి పరిశోధించి పుస్తకం రాశారు. స, , షలను గుర్తుంచు కునేందుకు బ్రౌన్‌ చెప్పిన సూత్రం ఒకటి ఆయనవల్లే నాకు తెలిసింది. సులభ సకారం, శాంతి శకారం, కష్ట షకారం అని ఆ సూత్రం. మా అమ్మ పేరు శేషమ్మగారు. పల్లెలో అందరూ ఆమెను సేసమ్మ అని మాత్రమే అనేవారు.

కన్యాశుల్కం చదువుతుంటే షకారం గురించి ఇంకో సంగతి కనబడుతుంది. ఏమిటిష? అంటే ఏమిటట? ఏమిటిషలో షకారం ట అన్న అక్షరానికి బదులుగా వచ్చిందని అర్థం. బాగా మాట్లాడుతున్నా మనుకుని విజయనగరం ప్రాంతంలోని అలనాటి బ్రాహ్మలు అనవసరంగా షకారం వాడుకున్నారన్న మాట.

మన వాళ్లకు చాలా మందికి స శ ష తేడా తెలియదు. పలకదు. మధ్య భారతం వారు ఈ విషయంలో మనకన్నా అన్యాయం. వాళ్లకు ష పలకదు. లేక పలకరు. అన్నింటికీ మామూలు స వచ్చేస్తుంది. అచ్చమయిన ఇంగ్లీషు స్టేషన్‌ను స్టేసన్‌ అంటారు. ఆ సంగతి వాళ్లకు తెలియదనుకోండి.  మన నాయకులలో ఒకాయన బాగా మాట్లాడుతున్నా ననుకుని అన్నీ షకారాలే పలుకుతుంటాడు. ఆయన బహుశా విజయనగరం వాళ్లను విన్నారని మీకనిపిస్తే నేనేమీ చేయలేను. అచ్చంగా వాళ్లలాగానే ఈయన కూడా కేవలం బాగా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అంతే. పలకవలసిన చోట ష పలకదు. అనవసరమయిన చోట మాత్రం అది వచ్చేస్తుంది.  ‘కష్టం’ కదూ!


 

Saturday, February 14, 2026

Friday, February 13, 2026

గాలి గురించి - కొన్ని విశేషాలు - About the air around us!


గాలి గురించి - కొన్ని విశేషాలు


ప్రతి కుటుంబంలోను ఆ ఇంటివాళ్లకు మాత్రమే అర్థమయ్యే మాటలు, జోకులు కొన్ని ఉంటయి. మా ఇంట్లో కూడా మామూలుగానే మాటలు, జోకులు కొన్ని ఉన్నాయి. కొత్తగా తెలియని తిండి పదార్థం ఏదో ఒకటి ఒకనాడు బల్లమీదికి వచ్చినట్టుంది. మా అమ్మాయి ‘దీన్ని ఏమంటరు?’ అని అడిగింది. మామూలుగనే సరదాగ మాట్లాడే మా అబ్బాయి చటుక్కున ‘ఏమీ అనరు! తింటరు!’ అన్నడు. ఆ తరువాత మేము చాల సందర్భాలలో ప్రశ్న అడగకుండ తింటరు అంటూ తింటుంటము.

ఏదో కొత్త వస్తువు ఎదురుగ వస్తుంది. ఒకప్పుడయితే, దీన్ని దేనితో చేసినరు అని అడగడం అలవాటు. చాలకాలం వరకు మనిషి చేసిన వస్తువులన్నీ లోహం, కర్ర లేదంటే రాయిలాంటి వాటితో తయారయ్యేవి. మధ్యలో పింగాణి వచ్చింది. ఆ తరువాత చూస్తుండగానే ఫైబర్‌ గ్లాస్‌ వచ్చింది. బేకలైట్‌ వంటి రకరకాల కాంపోజిట్‌ బోర్డులు వచ్చినయి. ఇక వచ్చిన వేలాది ప్లాస్టిక్‌ల గురించి వేరుగ చెప్పుకోవలసి ఉంటుంది. మొత్తానికి ఎదురుగ వచ్చిన వస్తువు ఏ రకమయినది అని అర్థం చేసుకోవడానికి అందరూ తికమక పడిపోతున్నరు. చేతికందిన సీసా లేక గ్లాసు ఎలాంటిది తెలుసుకోవాలంటే ఒకతను సూది కాల్చి గుచ్చి చూడమన్నడు. ప్లాస్టిక్‌ అయితే కాలి రంధ్రం పడుతుంది మరి. ఎవరు మాత్రం కావాలని తన వస్తువులో రంధ్రాలు పొడుచుకుంటరు? కనుక పాత్ర సంగతి అర్థంకాకుండనే ఉండిపోతుంది. కొత్తగ కొన్న గుడ్డ కృత్రిమంగ తయారయిందా లేక సహజంగా పండిన పత్తినుంచి వచ్చిందా తెలుసుకోవాలంటే దానిలోని ఒక చివరన నిప్పు పెట్టిచూడాలె. ప్రపంచం ఇట్లాగయ్యింది.

చేతికి ఏదో అంటుకుంటుంది. మరోవేలితో ముట్టుకుని చూస్తే అది జిగురుగ ఉంటుంది. ‘శాణకు మూడుచోట్లు’ అని  మాకొక మాట ఉంది. అంటిందేదో మొదటిచోటు. కంటిముందు పెట్టుకుంటే రెండవచోటు. దాని వాసన కూడా చూస్తే మూడవచోటు. ఇక చివరికి ఆ అంటిన వస్తువు అసహ్యమయినదని తెలిస్తే అప్పుడు అసలు బాధ మొదలవుతుంది. దాన్ని వదిలించుకోవాలె. అందుకోసం సబ్బు వాడాలె. అన్నట్టు ఏం చేసి సబ్బు ఒంటికి అంటిన మకిలిని వదిలిస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు అడగకుండనే అందరూ సబ్బును వాడుకుంటున్నరు. కొందరు సబ్బు కూడ వాడకుండా అదేపనిగ కేవలం నీళ్లతోనే ముఖాన్ని రుద్దేసుకుంటరు. నిజానికి సబ్బు అణువుకు రెండు కొండ్లు అంటే కొక్కాలు ఉంటయి. వాటిలో ఒకటి నీటి అణువును పట్టుకుంటుంది. మరొకటి చమురు అణువును పట్టుకుంటుంది. ఈ రకంగా సబ్బు అణువు చమురును పట్టుకుని, నీటితో తేలుతూ చేతినుంచి లేదా గుడ్డనుంచి దూరం పోతుంది. అంటినది చమురు కాకుంటే సబ్బుతో కూడ వదలదని అర్థం.

ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న పదార్థాలలో గాలి విచిత్రమయినది. పుట్టిన మరుక్షణం నుంచి చచ్చేవరకు మనం గాలి పీలుస్తనే ఉంటము. గ్రహం చుట్ట గాలిలేకపోతే మనం ఇట్లాగ ఉండగలిగే వాళ్లం కాదు. వాతావరణం అంటే చుట్టుకున్న గాలి అని అర్థం. ఇంత ముఖ్యమయినది అయినా గాలి గురించి ‘ఇది దేనితో తయారయింది?’ అని మాత్రం అడగకుండనే మనమంతా దాన్ని పీల్చేసి బతుకుతున్నము.

మనం ఒక్కసారి గాలి పీలిస్తే, అందులో అప్పటివరకు బతికిన మనుషులందర ఒక్కొక్కరు వదిలిన ఒక్క అణువయినా ఉంటుందట. మరింత గట్టిగ లెక్కచెప్పాలంటే ఇప్పటికి పుట్టి గిట్టిన వాళ్లందరు, ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లలో కనీసం ఆరేళ్ల వయసు గలవాళ్లందరు ప్రపంచం మొత్తంమీదట పీల్చి వదిలిన గాలిని మనం ప్రతి శ్వాసలోను పంచుకుంటమట. ఒకరు వదిలిన గాలి మొత్తం భూమి వాతావరణంలో వ్యాపించి కలవడానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. కనుకనే ఈ లెక్కలో ఆరేళ్ల కన్న చిన్న పిల్లలను చేర్చలేదని అర్థం చేసుకోవాలె. మనకు ఆరేళ్లు నిండిన నాటినుంచి మనం వదిలిన గాలిలోని ఒక్కొక్క అణువును ఈ ప్రపంచంలోని వారంత అణుక్షణం పీలుస్తున్నరని వేరుగ చెప్పనవసరం లేదు. గాలి గురించి ఒక్కసంగతి చెపితేనే బుర్రతిరిగి పోయే తీరుగ ఉంది. ఇంకా లోతుకు వెళితే ఎన్నెన్ని ఆశ్చర్యాలు ఎదురవుతయో తెలియదు.

పరిణామం జరుగుతుంటే ఒకప్పుడు కొన్ని జంతువులు మొప్పల పద్ధతిని పక్కనబెట్టి ఊపిరి తిత్తులతో నేరుగ గాలి పీల్చడం మొదలయింది. అప్పటి నుంచి ఈ గాలి పంపకం జరుగుతునే ఉన్నది. ఇప్పటి మనలాగే అప్పటినుంచి ఎవరూ గాలి గురించి పట్టించుకోలేదు. సుమారు ఓ వందేళ్ల క్రితం మాత్రం ఇద్దరు పరిశోధకులు ఈ విషయంగా బుర్రలు చించుకున్నరు. కనిపించని గాలి గురించి కనిపించని అంశాలను తెలుసుకోవాలని ప్రయత్నించినరు. అయినాసరే వాళ్లు కనుగొన్న సంగతులు ఎవరికీ పట్టకుండనే ఉండిపోయినయి. వాతావరణం గురించి మనం పట్టించుకోము. ఈ వాతావరణం లేకుంటే మనం బతకలేము. కానీ జీవం పుట్టిననాటి నుంచి వాతావరణం ఒకేరకంగ కాకున్నా ఉండను మాత్రం ఉంటున్నది. మన ప్రాణాలను  ప్రశ్నలడగకుండ అది నిలబెడుతనే ఉన్నది. అయితే మామూలుగ జరిగే ఏ విషయాన్ని మనిషి ప్రశ్నించడు. సూర్యుడు రోజూ కనిపిస్తడు. కనుక అందులో ఆశ్చర్యం లేదు. అనుక్షణం గాలి పీలుస్తము. కనుక అందులో ఆశ్చర్యం లేదు. సూర్యుడు కనిపించని రోజున కనీసం వెలుగు కనిపిస్తుంది. గాలి మామూలుగా లేనిచోట్ల కూడా ఏదో గాలి ఉండనే ఉంటుది. కనుక మనకు వాటి సంగతి పట్టదు.

ఇప్పుడు గాలి గురించి మరొక విచిత్రమయిన సంగతి చెపితే ముక్కున వేలు వేసుకుంటరో, పక్కకు తిరిగి కనుబొమ్మలు ఎగరేస్తరో మీ ఇష్టం. పుట్టిన నాటినుంచి ఊపిరి ఆగేవరకు అంటే ప్రాణం పోయేవరకు మనం పీల్చేగాలిలో మనకు ఏ రకంగాను పనికిరాని నైట్రోజన్‌ అనే నత్రజని ఎక్కువగ ఉంటుంది. చుట్టూ ఉన్న గాలిలో మరి ఆ వాయువు 78 శాతం ఉంటుంది. అంత నత్రజనిని ఊపిరితిత్తులలోకి పీల్చినా మనకు అపాయం మాత్రం జరగదు. దానివల్ల సాయం జరగకపోతే అది వేరే సంగతి. దూరం నుంచి వినిపించే పాటలాగ అది చికాకు కాదు, పనికి వచ్చేది అంతకన్నా కాదు.

గాలిలో ఇంచుమించు అయిదో భాగం వరకు ప్రాణవాయువు అనే ఆక్సిజన్‌ ఉంటుంది. ఈ పేరు వినిపించగానే మన ప్రాణాలకు అదే ఆధారం అని అందరూ భుజాలు ఎగరేస్తరు. మూలకాలలో అన్నిటికన్నా ఎక్కువ ప్రచారం ఉన్నది ప్రాణవాయువేనేమో. ఈ మధ్యన ఆక్సిజన్‌ను అంగళ్లలో అమ్ముతున్నరట కూడా. కాలుష్యం కారణంగ సాయంత్రం కల్ల అలసటకు గురయిన వారు ఆక్సిజన్‌ బార్‌లకు చేరి అక్కడ కాసేపు శుభ్రమయిన వాయువును పీల్చి తేరుకుంటున్నరు. ఈ విశ్వంలో అన్నిటికన్న ఎక్కువగ ఉండే మూలకాలను లెక్కబెడితే ఆక్సిజన్‌ మూడవ స్థానంలో వస్తుంది. అది మన భూగ్రహం మీద మరింత ఎక్కువగ ఉంటుంది. మరింత చిక్కగనూ ఉంటుంది. ప్రాణవాయువు ప్రతి మూలన ఉంటుంది. చివరికి మరే వాయువుకు వీలులేని చోట కూడా ప్రాణవాయువు దూరి చేరుకుంటుంది. ప్రతి ఇసుక కణానికి ప్రాణవాయువు చుట్టుకుని ఉంటుంది. ప్రాణవాయువు కారణంగనే మన శరీరాల వయసు పెరుగుతున్నది అంటే నమ్మగలరా.

ఈ విశ్వంలో ఇంతగా ప్రాణవాయువు నిండుకున్న వాతావరణంగల నిర్మాణం భూమికాక మరొకటి లేదు. విశ్వంలోని మరే గోళంమీద చెట్లు లేవు. చెట్లు ప్రాణవాయువును వదులుతయని మీకు తెలిస్తే సంతోషం. తెలియకుంటే తెలుసుకోవాలె. చెట్లున్నయి కనుకనే భూవాతావరణంలో చిక్కగ ప్రాణవాయువు నిండి ఉంది. దూరంనుంచి చూస్తే ప్రాణవాయువు నుంచి ఒక రకమయిన ఆకుపచ్చని వెలుగు విరజిమ్ముతుంది. విశ్వంలోని అణువులకన్న చిన్న కణాల తాకిడి కారణంగా వాయువు ఈ రకంగ వెలుగుతుంది. ఈ రకమయిన ఆకుపచ్చ వెలుగు విశ్వంలో మరెక్కడయినా కనిపిస్తే అక్కడ కూడా భూమి మీదలాంటి జీవం ఉండవచ్చునని సులభంగా ఊహించవచ్చు. విశ్వంలో చెట్లు ఎక్కడ ఉన్నా ఈ రకమయిన వెలుగుతో తమ ఉనికిని ప్రకటించుకుంటాయని చెప్పవచ్చు. 



 

Thursday, February 12, 2026

ప్రభుత్వం గుమాస్తా మరణం - ఆంటన్‌ చెఖో(హో)వ్‌ కథ


ప్రభుత్వం గుమాస్తా మరణం

ఆంటన్‌ చెఖో(హో)వ్‌ కథ

అనువాదం - భవదీయుడు గోపాలం

అది ఒక అందమయిన రాత్రి. ద్మిత్రిష్‌  కూడా అందమయిన మనిషే. అతను ఓపెరా గ్లాస్‌ల సాయంతో నాటకం చూస్తూ స్టాల్స్‌లోని రెండవ వరసలో హాయిగా కూచుని ఉన్నాడు. రంగస్థలం వేపు అదే పనిగా చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో తన కన్నా ఆనందంగల మనిషి లేడనుకుంటున్నాడు. అంతలో ఉన్నట్టుండి ..... (సాధారణంగా కథల్లో మనకు ఈ ఉన్నట్టుండి అన్నమాట తరుచూ ఎదురవుతూ ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. మరి రచయితలు బతుకులో అనుకోకుండా ఉన్నట్టుండి జరిగే విషయాలను గురించి కూడా పట్టించుకోవాలి కదా!) ఒక్కసారిగా, అప్పుడు అతని ముఖం బిగుసుకుపోయింది.  కళ్లు గుండ్రంగా తిరిగాయి. ఊపిరి ఒక్కక్షణం ఆగిపోయింది. ఓపెరా అద్దాలు ముక్కుమీద నుంచి పడిపోయాయి. అతను తన సీట్లో చతికిల పడిపోయాడు. ఇక... ఆచ్ఛూ! అంటూ పాఠక మహాశయులు గమనించినట్టే, అతను ఒక తుమ్ము తుమ్మాడు.

నిజం చెప్పాలంటే తుమ్ముకు వ్యతిరేకంగా ఎటువంటి నిబంధనలు, చట్టాలను విధించి ఉండలేదు. అందరూ తుమ్ముతారు. అటు రైతులు మొదలు పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌లు, చివరికి రాజకీయ ప్రతినిధులు కూడా తుమ్ముతారు. అందరూ తుమ్మే వారే. కనుకనే చెర్వియకోవ్‌ కూడా ఏమంత పట్టించుకోలేదు. జేబురుమాలు తీసుకుని నెమ్మదిగా ముక్కు తుడుచుకున్నాడు. ఇక మంచి నడవడి గల మనిషిగా అతను తన వల్ల ఎవరికయినా అసౌకర్యం కలిగిందేమో చూడాలన్నట్టు చుట్టూ కలియజూచాడు. అతనికి కొంత అసంతృప్తి ఎదురయింది. ముందు వరసలో సరిగ్గా తన ముందు కూచుని ఉన్న ఒక పెద్ద మనిషి తన బట్టతలను, మెడను గ్లవ్స్‌ సాయంతో తుడుచుకుంటున్నాడు. తనలో తానే ఏదో గొణుగుతున్నాడు. ఆ పెద్ద మనిషిని చెర్వియకోవ్‌ గుర్తించాడు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో చాలా ఉన్నతాధికారి అయిన బ్రిజలోవ్‌గారు అతనేనని అర్థమయింది.

నేను ఆయన మీద తుమ్మాను!’ అనుకున్నాడు చెర్వియకోవ్‌. ‘ఆయన నా ప్రత్యక్ష అధికారి కాకపోవచ్చు. అయితేనేమట. ఎంత అసహ్యంగా ప్రవర్తించాను. నేను క్షమాపణలు చెప్పక తప్పదు’ అనుకున్నాడతను.

చెర్వియకోవ్‌ కొంచెం దగ్గాడు. ముందుకు వంగాడు. జనరల్‌గారి చెవులలో మాత్రమే వినిపించేట్టు ‘మహాప్రభూ! నేను తుమ్మాను. అది అనుకోకుండా జరిగిందని నా భయం... ’ అంటున్నాడు.

ఏం పట్టించుకోకు’

నన్ను క్షమించండి. దేవుని పేరున క్షమించండి. నిజానికి నాకేమాత్రం ఉద్దేశ్యం...’

మాట్లాడకుండ కూచో! నన్ను నాటకం విననీ!’

చెర్వియకోవ్‌ గతుక్కుమన్నాడు. అర్థం లేకుండా ఒక నవ్వు నవ్వాడు. తన దృష్టిని కూడా రంగస్థలం మీద నిలపడానికి ప్రయత్నం సాగించాడు. అక్కడ నటులను చూస్తుంటే మాత్రం, అతనికి ఇప్పుడు, మానవులలో కెల్లా తానే అందరికన్నా సంతోషంగా ఉన్నవాడన్న భావం కలగడం లేదు. అతనికి లోలోపల గొప్ప ఆత్రం మొదలయింది. నాటకంలో ఇంటర్వెల్‌ వచ్చింది. ఆ సమయంలో మనవాడు బ్రిజలోవ్‌ను వెతికి పట్టుకున్నాడు. కాసేపు అతని చుట్టూ తచ్చాడాడు. చివరికి ధైర్యం కూడగట్టుకుని ముందుకు వెళ్లి ‘ప్రభూ, నేను మీమీద తుమ్మాను. నన్ను క్షమించండి. నేను అనుకోకుండా ....’

ఓహో! ఏమిటిదంతా?’ జనరల్‌ విరుచుకుపడ్డాడు. ‘నేను ఆ వ్యవహారం ఎప్పుడో మరిచిపోయాను’ అన్నాడాయన కింద పెదవిని ఓపికలేనట్టు కదలిస్తూ.

అతను వ్యవహారం గురించి మరిచినట్టున్నాడు. అయినా ఆ కళ్లలో మాత్రం ఏదో భావం కనిపించింది’ అనుకున్నాడు చెర్వియకోవ్‌. జనరల్‌ వేపు చాలా అనుమానంగా చూచాడు కూడా. ‘అతను నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నేను ఏ మాత్రం దురుద్దేశ్యం లేనివాడినని వివరించవలసిన బాధ్యత ఇంకా మిగిలే ఉంది. తప్పెవరిదీ లేదు. అంతా ప్రకృతి సిద్ధం. అయినా అతను, నేను అతని మీదకు కావాలని తుంపర పంపించానని అనుకునే అవకాశం ఉంది. అది ఇప్పుడు జరగకవపోవచ్చు. ఆయనకు గుర్తుకువచ్చినప్పుడు అంటే తరువాత ఎప్పుడో అది జరగకమానదు’

అతను ఇల్లు చేరుకున్నాడు. వచ్చీ రాగానే జరిగిన వ్యవహారం గురించి భార్యకు చెప్పాడు. కానీ ఆమె దాన్ని అంతగా పట్టించుకోలేదని అతడికి తోచింది. నిజానికి మధ్యలో ఒకసారి ఆమె ముఖంలో భయం కనిపించింది. అయినా బ్రిజలోవ్‌ మరొక శాఖలోని అధికారి అని అర్థం చేసుకున్న తరువాత ఆమె ముఖంలో మళ్లీ ప్రశాంతత కనిపించింది.

అయినా సరే, నీవు వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేకుంటే నీకు పదిమందిలో ప్రవర్తించవలసిన తీరు గురించి తెలియదని ఆయన అనుకుంటాడు’ అన్నది ఆమె.

నా బాధ అదే. నేను ఇప్పటికే క్షమాపణ చెప్పాను. అయినా ఆయన చిత్రంగా ప్రవర్తించాడు. ఆయన మాటలకు అర్థం తెలియలేదు. అసలు నాకు వివరించడానికి సమయమే ఇవ్వలేదు....’

మరుసటి రోజు చెర్వియకోవ్‌ తన కొత్త ఫ్రాక్‌ కోట్‌ను తొడుక్కున్నాడు. అప్పటికే అతను, జుట్టు చక్కగా కత్తిరించుకుని వచ్చాడు. ఇక బ్రిజలోవ్‌కు క్షమాపణలు చెప్పడానికని అతను బయలుదేరాడు. జనరల్‌గారి ముందు గదిలో పిటిషన్‌లతో వచ్చిన వారు చాలామంది ఉన్నారు. జనరల్‌ అక్కడే నిలబడి వారి ఫిర్యాదులను వింటున్నాడు. చాలామంది మాటలనే విన్నాడు అంతలో కళ్లెత్తి చెర్వియకోవ్‌ను చూచాడు. గుర్తించాడు కూడా.

మహాప్రభో, తమరికి గుర్తుంటే నిన్న.... ఆర్కేడియా థియేటర్‌లో .... నేను తుమ్మాను. అయ్యా, అనుకోకుండా వచ్చిన ఆ తుమ్ముతో మీ మీద కొంత తుంపర పడినట్టుంది...’

అర్థంలేని మాటలు. ఇక తరువాత ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు. ఇంతకూ నన్నేం చేయమంటావు?’ ఒక్కసారిగా జనరల్‌ ఎదురు తిరిగాడు. ఆ తరువాత పట్టించుకోకుండా మరో మనిషితో మాటలలోకి దిగాడు.

ఈయన నాతో మాట్లాడే పద్ధతిగా లేదు. నా మీద బాగా కోపంగా ఉన్నాడు. నేను వ్యవహారాన్ని ఇలా వదిలేస్తే బాగుండదు. ఆయనకు నేను సంజాయిషీ చెప్పుకోవాలి’ మొఖం వెలవెలబోతుండగా, చెర్వియకోవ్‌ ఆలోచించసాగాడు.

జనరల్‌ తనను చూడవచ్చిన పిటిషనర్‌లు అందరితోనూ మాట్లాడాడు. ఇక తన గదిలోకి వెళ్లిపోవడానికని సిద్ధపడుతున్నాడు. అప్పుడిక చెర్వియకోవ్‌ ఆయన ముందుకు వేగంగా వెళ్లి గొణగనారంభించాడు. ‘మహాప్రభూ, తమరిని ఒక్క క్షణంపాటు చికాకు పెట్టక తప్పదు. నా మనసులో తమరి ముందు పూర్తి విధేయత, అంతకుమించిన అపరాధ భావం పొంగి పొరలుతున్నాయి.... అంతా అనుకోకుండా జరిగింది.... అందుకు నన్ను క్షమించాలి....’

జనరల్‌ కళ్లనీళ్ల పర్యంతం అయ్యే పరిస్థితి కనిపించింది. చేతితో సైగ చేసి ఇతగాడిని వెళ్లిపొమ్మన్నాడు.

మీరు నన్ను అపహాస్యం చేస్తున్నారండీ!’ అన్నాడు. కానీ, జనరల్‌ వెంటనే తన గదిలోకి వెళ్లి ధడాలున తలుపు వేసుకున్నాడు.

అయితే నేను ఆటపట్టిస్తున్నానన్నమాట. నిజంగానా? ఇందులో నవ్వడానికి ఏముంది? ఆయనగారు ఒక జనరల్‌. అంతకుమించి ఏమీ తెలియదు. ఇక నేను ఆ ముసలి భడవ ముందు ప్రాధేయపడే ప్రయత్నం మానుకుంటాను. దెయ్యాలు వాడిని తీసుకుపోను! ఒక ఉత్తరం రాస్తాను. ఆ తరువాత మళ్లీ ఆయన ముఖం చూడను. దేవుని పేరున మళ్లీ ఏ రకంగానూ విసిగించను’ చెర్వియకోవ్‌ ఆలోచనలు సాగుతున్నాయి.

ఇంటిదారి పొడువునా చెర్వియకోవ్‌ అట్లా ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ అతను జనరల్‌కు లేఖ రాయలేదు. అతను ఆలోచించాడు. మరింత ఆలోచించాడు. కానీ ఉత్తరంలో రాయవలసిన మాటలు మాత్రం తోచనే లేదు. మరుసటి నాడు అతను క్షమాపణలు చెప్పడం కోసం, మళ్లీ జనరల్‌ ముందుకు వెళ్లాడు.

నిన్నటి రోజున నేను ప్రభువులను కష్టపెట్టడానికి ప్రయత్నించాను’ తన వేపు ప్రశార్థకంగా చూస్తున్న జనరల్‌ ముందు అతను ఏదో గొణిగాడు. ‘మహాప్రభూ! తమరిని ఆటపట్టించాలన్న ఉద్దేశ్యం నాకు ఎంతమాత్రం లేదని నమ్మకంగా చెపుతున్నాను. తుమ్మినందుకు, మీమీద తుంపర పడినందుకు క్షమాపణ చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. ప్రభువుల గురించి సరదా చేయడం అన్న ఆలోచన నా మనసులో అసలే లేదు. నాకు అంతటి ధైర్యం లేదు. అది ఏనాటికీ ఉండదు. మనం ఒకరి గురించి ఆకతాయిగా మాట్లాడితే ఇక వ్యక్తుల గౌరవం ఏమయిపోతుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను’ ఏవేవో అన్నాడతను.

గెట్‌ అవుట్‌ ఆఫ్‌ హియర్‌’ గర్జించాడు జనరల్‌. ఆయన కోపంతో ఊగిపోతున్నాడు.

అయ్యా ఏమన్నారు?’ చెర్వియకోవ్‌ గొణిగాడు.

గెట్‌ అవుట్‌!’ జనరల్‌ మళ్లీ అదే మాట అన్నాడు. కాలితో నేలమీద గట్టిగా కొట్టాడు.

సజీవంగా ఉన్న చెర్వియకోవ్‌ శరీరంలో ఎక్కడో ఏదో తెగింది. తలుపువేపుగా దారిపట్టిన అతనికి ఏమీ వినిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అతను వీధిలోకి వచ్చేశాడు. నెమ్మదిగా తమాయించుకుంటూ నడుస్తున్నాడు. అనుకోకుండా ఒక కాలిముందు మరొక కాలు పడుతున్నది. అలా అతను ఇల్లు చేరుకున్నాడు. ఫ్రాక్‌కోట్‌ విప్పకుండానే అతను దివాను మీద పడిపోయాడు. అలాగే చనిపోయాడు.

` జులై 1883 (చెర్‌వ్యాక్‌ అంటే ఒక నులిపురుగు అని అర్థం)







 

Wednesday, February 11, 2026

లోకాభిరామం - సత్యం - అసత్యం

 


https://youtu.be/2eIzFBKAJ0E

Link for the video

సత్యం - అసత్యం

ఒకసారి సంక్రాంతి పండుగకు నల్లగొండలో ఉన్నాను. అప్పటికి నేను రేడియోలో పనిచేస్తున్నాను. ఆ సంవత్సరం పండగ ఏనాడు జరుపుకోవాలి అన్న అనుమానం చాలా మందికి వచ్చింది. ప్రభుత్వం వారు ఒక సంగతి నిర్ణయించారు. కానీ సాంప్రదాయ పరులు మాత్రం మరొక మాటగా నిర్ణయించుకున్నారు. రేడియో అన్నది ప్రభుత్వం వారి బాకా కనుక నేను వారు చేసిన నిర్ణయం ప్రకారం పండుగ పలానా నాడు అని వివరాలను ప్రకటించాను. వ్యక్తిగతంగా మాత్రం పాత పద్ధతులను పాటిస్తున్నాను కనుక పండుగ నేను ప్రభుత్వం చెప్పిననాడు చేసుకోవడం లేదు. పక్కింట్లో ఒక అక్కయ్య ఉండేది. ఆమె ఆదరాబాదరాగా వచ్చింది. మా ఆవిడను నిలదీసి పండుగ ఇవ్వాలంట కదా, రేడియోలో చెబుతున్నారు, అని అడుగుతున్నది. నేను ఆమెను పిలిచాను. అమ్మా, ఎవరు చెబుతున్నారు అని అడిగాను. ఒక క్షణం ఆలోచించి ఆమె, అయ్యో అది మీ గొంతు, అన్నది. తరువాత వాళ్ళు పండుగ ఏనాడు చేసుకున్నారో నాకు తెలియదు. ఈ ప్రపంచంలో సత్యాలు అలా ఉంటాయి. రచయితగా కొనసాగుతున్నాను. కథలు కాక సత్యాలు రాస్తున్నాను అనుకుంటున్నాను. కనుక ఏ రెండు అక్షరం ముక్కలు కాగితం మీద పెట్టినా వాటిలోని సత్యాసత్యాలను గురించి గట్టిగా ఆలోచించాలి అన్న ఒక పద్ధతి మెదడులో గట్టిగా పాతుకుపోయింది. ఏదో రాస్తాము. సందర్భానికి తగినట్టుగా బహుశా రాసి ఉంటాము. కొంతకాలం తరువాత ఆ పరిస్థితులు మారుతాయి. అప్పుడు మనం రాసిన సంగతులు సత్యం కాకుండా పోతాయి. ఎవరో వచ్చి అప్పటి రాతల గురించి అడుగుతారు. చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది.

సత్యాలు లక్షల కొద్దీ ఒకచోట చేర్చినా వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు అని ఎక్కడో రాసి ఉండటం చదివాను. ఇంగ్లీషులో ట్రీవియా అని ఒక మాట ఉంది. అవి సత్యాలే. కానీ ఎవరికి పనికి వస్తాయో తెలియదు. వాటిని తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఉందా లేదా కూడా తెలియదు. అయినా అవి సత్యాలు. బహుశా సరదాగా ఉంటాయి. కానీ ప్రపంచం మొత్తం దీనికి విపరీతమైన పద్ధతిలో జరుగుతున్నది.

పొద్దున్నే వార్తాపత్రిక వస్తుంది. అందులో రకరకాల సంగతులు రాసి ఉంటాయి. ఆ వార్తా పత్రిక కలకాలం ఉండిపోతుంది. కానీ అందులో రాసిన సంగతులు కొన్ని సత్యాలు కావు అని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఒక ప్రమాదం జరుగుతుంది. అందులో హతులైన వారి సంఖ్యను ఏ రెండు పత్రికలు సమానంగా చూపించవు. ఆ తేడా ఎందుకు వస్తుంది నాకు అర్ధం కాలేదు. ఎవరికి అనుకూలంగా ఉండే విషయం, అందుబాటులో ఉండే విషయాన్ని వారు చెబుతారు అని నా అనుమానం. రోడ్డు మీద ఒక సంఘటన జరుగుతుంది. దాన్ని అందరూ చూస్తారు. మరునాడు దాన్ని గురించి పేపర్లో వస్తుంది. అక్కడ జరిగింది ఒకటయితే, దాన్ని గురించి రాసిన తీరు మరొకటిగా ఉంటుంది. పరిస్థితి అలాగ ఉందని ముందుకు వచ్చి ప్రశ్నించే వారు ఉండరు.

నేను ఒక బిల్లింగ్‌ లో,నా ఇంట్లోనే ఉన్నాను. ఆ బిల్డింగ్‌ లో కింద ఖాళీగా ఉండవలసిన ప్రాంతాన్ని యజమాని తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు. మునిసిపాలిటీ వాళ్ళు వచ్చారు. గోడలో 4 ఇటుకలు పడగొట్టారు. ఆలోగా యజమాని వచ్చి వారి పద్ధతిని మార్చే ప్రయత్నం ఏదో చేసినట్టు ఉన్నాడు. గోడ సలక్షణంగా అలాగే ఉండిపోయింది. మరు రోజు పత్రికలో కింద సెల్లార్‌ పూర్తిగా పడగొట్టినట్టు వార్త వచ్చింది. గోడలు పడగొట్టే బాధ్యతగల మున్సిపాలిటీ వారు అటువంటి వార్తలు పత్రికకు అందజేశారు. వారు సత్యాసత్యాలను తెలుసుకోకుండా ప్రచురించారు. నేను ప్రయత్నించి ఆ పత్రికకు ఫోన్‌ చేశాను. అక్కడి వారు నన్ను దుర్భాషలాడారు కానీ, అసలు విషయం వినడానికి కూడా ప్రయత్నించలేదు. పత్రిక శాశ్వతంగా నిలబడిపోతుంది. అందులోని అబద్ధం శాశ్వతంగా నిలబడిపోతుంది. కూలినట్టు రాసిన ఆ గోడ కూడా శాశ్వతంగా నిలబడి ఉంది. ఇది ఈనాటి సత్యం.

సత్యం వెనుక ఒక తత్వం ఉంటుంది. పత్రికలో వచ్చింది తెలుసా? అనే మాట నేను చాలా సార్లు విన్నాను. అంటే పత్రికల్లో వచ్చేవి అన్ని సత్యాలు కావు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని కదా అర్థం! ఇక విషయానికి వస్తే, అవి పత్రికల కన్నా వేరుగా ఉంటాయి అని నేను అనుకోను. చాలా విషయాలు ఇట్లాగే అరకొరగా పుస్తకాలలోకి చేరుకుంటాయి. అవి శాశ్వతంగా నిలబడతాయి. తర్వాతి ప్రపంచాన్ని మోసపుచ్చుతాయి. జరిగిన విషయాలను జరగనట్టు, జరగని విషయాలను జరిగినట్టు చరిత్ర చెబుతూ ఉంటుంది. కనుక చరిత్రను నమ్మడానికి లేదు. చరిత్ర అన్నది నిజంగా సత్యం అయితే ప్రపంచం ఇలాగే ఉండేది కాదు. చరిత్ర ఎవరు చెప్పారు? ఏ ప్రయోజనం కొరకు చెప్పారు అన్న దాన్ని బట్టి అందులోని సత్యాసత్యాల నిగ్గు తేలవలసి ఉంటుంది. బ్రిటిష్‌ వారు భారతదేశపు చరిత్రను తమకు అనుకూలంగా రాసుకున్నారు అన్న వాదం బలంగా ఉంది. అసలు చరిత్రను గురించి చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉన్నట్టు కనిపించదు. కనుక ఎవరు చెప్పినది అయినా మొత్తానికి ఒక చరిత్ర చలామణి అవుతూ ఉంటుంది.

పాశ్చాత్య దేశాలలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల వారు భారతదేశపు చరిత్రను విస్తృతంగా రాయించి పుస్తకాలుగా వేశారు.

వాటన్నిటినీ కాకున్నా కొన్నిటిని చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిలో అక్కడక్కడ తేడాలు కనిపిస్తాయి. ఆ తేడాలను గురించి ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి, అర్ధం కాదు. చరిత్రలో మధ్యన ఖాళీలు కనిపిస్తాయి. వాటికి కారణం మాత్రం ఎవరు చెప్పరు. వెండీ డోనిగర్‌ అనే ఆవిడ భారతదేశపు గతం గురించి ఒక పుస్తకం రాసింది. అది నాకు చాలా పక్షపాత దృష్టితో రాసినట్టు కనిపించింది. అట్లా రాయవలసిన అవసరం ఏమిటో తెలియదు. అలాగే ఇర్ఫాన్‌ హబీబ్‌, రొమిల్లా థాపర్‌, మరొక ప్రసిద్ధ బెంగాలీ చరిత్రకారుడు మొదలైన వారి పుస్తకాలన్నీ అవి ఇంకొక ధోరణిలో ఉంటాయి. అన్ని చదువుతూ ఉంటే అసలు సంగతి ఏమిటి అన్న అనుమానం మొదలవుతుంది. కొన్ని సత్యాలు, అసత్యాలుగా రుజువయ్యే వరకు మాత్రమే నిలబడి ఉంటాయి అన్న పద్ధతి ఒకటి ఉంది. సైన్స్‌ లో ముఖ్యంగా శాశ్వత సత్యాలు ఉండవు అంటారు. సైన్స్‌ అంటే సత్యాల పరంపర అని కూడా వాళ్లే అంటారు. సూచించిన పరిస్థితులలో మాత్రమే, ఈ విషయాలు సత్యాలు అన్న ఒక రైడర్‌ ప్రతి సత్యం మీద ఉంటుంది. నీరు నూరు డిగ్రీల వద్ద మరుగుతుంది, అన్నది ఒక సత్యం. కానీ

ఆ స్థలంలో వాతావరణ ఒత్తిడి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఈ సత్యం మారుతూ ఉంటుంది. అంటే అది శాశ్వత సత్యం కాదు. మరొక విధంగా రుజువయ్యే వరకు మాత్రమే సత్యాలు అనేవి మరికొన్ని ఉన్నాయి. ఐన్‌స్టెన్‌ ఒక సిద్ధాంతం చేశాడు. అందరూ అవును అంటూ ఆశ్చర్యపోయారు. కొంతకాలానికి మరొక పరిశోధకుడు వచ్చి, ఆయన చెప్పింది నిజం కాదు తెలుసా అంటాడు. అప్పుడు అందరూ అంగీకరిస్తారు. చరిత్ర విషయంలో కూడా ఇటువంటి పద్ధతిని పాటించవచ్చు అంటే కొంచెం చిక్కులు వస్తాయి కొంచెం చిక్కులు.

కొన్ని సంగతులు అందరికీ తెలిసి ఉంటాయి. కానీ ఎవరూ ముందుకు వచ్చి ఇది అసలు నిజం అని చెప్పడానికి సిద్ధం కారు. అందుకు సామాజిక కారణాలు, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఆ విషయం గురించి సత్యాన్ని నిరూపించవలసిన అవసరం కూడా అందరికీ ఒకే రకంగా ఉండదు. అందరికీ తెలిసిన ఆ సత్యం అలాగే బయటపడకుండా నిలబడిపోతుంది.

వ్యక్తిగతమైన అంశాలలో ఇటువంటి పరిస్థితి మరీ ఎక్కువగా వస్తుంది. నా విషయంలోనే నాకు కొన్ని సంగతులు తెలుసు. నేను వాటిని ఎవరికీ చెప్ప వలసిన అవసరం లేదు. చెప్పనందుకు ఎవరికీ అపకారం కూడా జరగదు. కనుక నేను వాటిని బయటకు చెప్పను. ఒకవేళ చెపితే అది కొంతమందికి ఆసక్తికరంగా ఉండవచ్చు. మరికొంతమందికి ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయినా నేను కొన్ని సంగతులు బయట పెట్టను. ఆ సత్యం నాలోనే మిగిలిపోతుంది. నాకు చాలా రోజులుగా కథలు నవలలలో ఎదురైన కొన్ని సంగతులను గురించి మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేదిలో దయానిధికి, కోమలికి మధ్యన శరీరపరంగా ఎటువంటి సంబంధం లేదు. మానసికంగా ఏమి ఉందో ఎవరికి అర్థం కాదు. అమృతంతో ఏం జరిగింది అన్నది బయటపడదు. ఇదే రకంగా ప్రపంచ విఖ్యాత రచయిత ఆల్బర్ట్‌ కామూ నవలలో కూడా చిత్రమైన పరిస్థితులు పాఠకుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. నాయకుడు అమాయకుడు అని పాఠకునికి తెలుసు. కథలోని వారికి మాత్రం తెలియదు. కనుక కథ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. అందరూ అతడిని అసహ్యించుకుంటారు. మనకు అసలు సత్యం తెలుసు గనుక, ఆ అసహ్యించుకునే వారి మీద కోపం పుడుతుంది. రచనకు రూపం పోయడంలో ఇంత కన్నా గొప్ప పద్ధతి మరొకటి ఉండదు అనిపిస్తుంది. ఇటువంటి ఉదాహరణలు చాలా చెప్పగలను. కనుకనే నాకు సత్యం గురించి గట్టి ఆలోచనలు పుడుతుంటాయి.

తెలుగు సినిమాలలో, బహుశా ఇతర భాషలలో కూడా, ఒక వ్యక్తి ఒక సత్యం చెప్పనందుకు మొత్తం సినిమా నడుస్తుంది. అవి నేను బనారస్‌ లో చదువుకుంటున్న రోజులు, అంటూ ముఖం మీద రింగులు చూపించి అసలు సత్యం బయట పెడతారు. అప్పుడు కథ ముగుస్తుంది. సత్యాలు నిజంగా ఉంటాయా అన్న అనుమానం నాకు కలుగుతుంది. పదుగురాడుమాట పాటియై ధర చెల్లు అని ఒక మాట ఉంది. అందరూ కలిసి అదేపనిగా ఒక సత్యాన్ని లేదా అసత్యాన్ని బలంగా నమ్మి ప్రచారం చేయడం మొదలుపెడతారు. అప్పుడు సత్యంగా మిగిలిపోతుంది. కలియుగమున శక్తి మొత్తం సంఘము లోనే ఉన్నది అని అర్ధం వచ్చే ఆర్యోక్తి ఒకటి మనకు ఉండనే ఉంది. అంటే ఈ సంఘం అనే విషయాన్ని సత్యం గా ముందుకు తీసుకుపో దలుస్తుందో దాన్ని మాత్రమే సత్యంగా గ్రహించ వలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు ఉన్నాడు అనఉన్నాకా ఇటువంటి సత్యానికి మొదటి ఉదాహరణ అని నా అభిప్రాయం. దేవుడు అంటే దేవులాట అనే పనిచేయడం. అంటే వెతకడం. దేవుడు అంటే వెతకడం అని అర్థం. ఇక్కడ మార్గమే గమ్యం. ఆ దేవులాట ముగిసి దేవుడు దొరికితే ఆ తర్వాత ఏం చేయాలి? అది సమస్య! కనుక కలకాలం దేవులాట సాగాలి.

ఒకరికి సత్యంగా తోచింది మరొకరికి అసత్యంగా తో చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరు వాదించుకుంటున్నారు. మూడవ మనిషి వచ్చాడు. మీ మధ్యన మూడు సత్యాలు ఉన్నాయి. మీరిద్దరూ ఎవరికి వారు నమ్ముతున్నవి రెండు అయితే మీరు కలిసి చేరవలసిన అసలు సత్యం మూడవది అన్నాడు ఆ మూడో మనిషి. అతనికి కూడా 3 సత్యాలలో ఏదీ తెలియదు. వీళ్లు తమ తమ రెండు సత్యాలను చెప్పినప్పటికీ అతని బుద్ధి ప్రకారం వాటిలో ఒకదానిని ఎంచుకో గలదేమో కానీ, అసలైన మూడవ సత్యం ఉంది అని అన్నప్పటికీ దాన్ని అతను చూడగలుగుతాడా? అన్నది అసలు ప్రశ్న. అన్ని విషయాలు, అన్ని సత్యాలు నూటికి నూరుపాళ్లు సత్యం కావడానికి వీలు లేదు. కొన్ని మాత్రమే పూర్తి సత్యాలు కలుగుతాయి. మరికొన్ని పాక్షిక సత్యాలు గా ఉంటాయి. కల్తీ కలిసినప్పుడు ఒక సత్యం, సత్యం గా నిలబడడం కష్టమవుతుంది.

అందరికీ అనుకూలంగా వినిపించని ఒక విషయం చెబుతాను. ఈ మధ్యన యూరోపు దేశాల నుంచి వచ్చిన ఒక అపరాధ పరిశోధక నవల చదివాను. మొదటినుంచి నాకు మెదడు లో ఈ విషయం గురించి ఆలోచన ఉన్న దాన్ని మరీ ముందుకు తీసుకు పోలేదు. విషయం చెప్పిన తరువాత మీకే అర్ధం అవుతుంది. ఒక వ్యక్తికి తల్లి ఎవరు. అన్న సంగతి నూటికి నూరు శాతం నిజంగా తెలిసి ఉంటుంది. అందులో ఏమాత్రం తేడా రావడానికి అవకాశం లేదు. కానీ ఆ వ్యక్తికి తండ్రి ఎవరు అన్న విషయం మాత్రం సాంఘిక మర్యాద ప్రకారం అంగీకరించవలసినదే కానీ ఆ తల్లి నోరు విప్పి చెప్పే దాకా అసలు విషయం బయటకు రాదు. ఈ ప్రపంచంలో ఆడవాళ్ల అందరిని నేను అనుమానించడం లేదు. కానీ చాలా మంది ఈ రకమైన పరిస్థితులకు గురి అయినట్లు నాకు గట్టి అనుమానం. వ్యవస్థలో ఎంతటి గట్టిదనం ఉన్నప్పటికీ మనుషుల మెదడులో మాత్రం అది ప్రతిబింబించదు. ఆడ మగ ఆనాటి నుండి ఈనాటి వరకు తమ ఇష్ట ప్రకారం లైంగిక జీవితాలు గడుపుతున్నారు. సమాజంలోని సమస్యలకు సగం వరకు లైంగిక సంబంధాలే కారణం అని మానసిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. పురాణకాలం నుంచి మొదలు ఇవాళ టి వరకు ఇటువంటి పరిస్థితులను గురించి మనకు కావలసిన అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. సినిమాల గురించి నేను చేసిన ప్రసక్తి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక భాగంగా నిలబడుతుంది. సత్యం అన్నది సంపూర్ణ సత్యమా, సాపేక్ష సత్యమా, అన్న ప్రశ్న వచ్చిన తరువాత అది సత్యమే కాదు.

Tuesday, February 10, 2026

భాషలు - భవిష్యత్తు : A comment in Telugu


భాషలు - భవిష్యత్తు 

నాలుగవ తరగతి పాఠ్యపుస్తకాల్లో వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, జీవన విధానాల గురించి పాఠాలున్నాయి. వారివారి పండుగల గురించి ప్రత్యేకతల గురించి కూడా, వివరంగా కాకున్నా, చూచాయగా కొంత చెప్పారక్కడ. అందులో మన రాష్ట్రం గురించిన పాఠం చదువుకుని బయట రోడ్డు మీదకు వస్తే, పాపం పిల్లలకు ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి.

ఒకప్పుడు మనిషి వేషం, భాష, తీరు, తెన్ను చూచి ఏ ప్రాంతం వారో చెప్పడం వీలయేది. సినారె గారు చెప్పినట్లు, నాగరికత, మన గోచీలు పీకించి ఇరుకు పాంట్లు తొడిగించింది. ఇటీవల ఆడపిల్లలంతా పంజాబీ పద్ధతిలోకి మారిపోయారు. దేశం ఈ చివరనుంచి ఆ చివర వరకు ఏ ప్రాంతం వారయినా ఒక్కలాగే కనబడుతున్నారు. ఇంకొంచెం నాగరికత ముదిరితే, ఇక్కడవారు కారేమో అన్న అనుమానాలకు కారణమవుతున్నారు. నోరు తెరిచి మాటాడడం మొదలు పెడితే, అందరి నోటా ఒకేలాంటి మాట. మాతృభాషలో సంభాషణ అనాగరికతకు గుర్తు.

టెక్నాలజీ అందరినీ ఒకే గాట కట్టేస్తుందని అర్థం వచ్చే సూత్రం ఒకటి ఉంది. టెలిఫోను, ఒక కాలంలో, కలిగిన వాళ్ల ఇళ్లలోనే ఉండేది. ఇప్పుడది పల్లెటూర్లో, గల్లీలో వాళ్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. రూపాయి జేబులో ఉన్నవారెవరయినా టెలిఫోను వాడుకోవచ్చు. అదొక పద్ధతి. టెక్నాలజీ మనకు అందించిన మరొక అద్భుతం టెలివిజన్. అందులో రకరకాల ఛానల్స్, రకరకాల ప్రోగ్రాములు. ఏ కార్యక్రమం ఏ భాషలో తయారయిందో అర్థం కాదు. అసలా మనుషులు మనవాళ్లేనా అని అనుమాన  పడుతుంటే, అచ్చమయిన తెలుగులో మాటలు వినపడడం మొదలవుతుంది. చాణక్యుడు ఒకనాడు హిందీలో మాట్లాడతాడు. మరోరోజు తెలుగులో మాట్లాడతాడు. మరీ కొన్ని ఛానల్స్ లోనయితే అందరూ కలిసి, ఎవరికీ అర్థం కాని భాషలో, కేకలు వేస్తుంటారు. అది సంగీతమని అనుకొమ్మంటారు. ఒక కార్యక్రమాన్ని అరడజను భాషల్లోకి డబ్ చేస్తే గిట్టుబాటు. అందులోని విషయానికీ, కట్టు బొట్టు వగైరా వివరాలకూ, వినబడే భాషకూ పొంతన ఉంటుందా, అన్న ప్రశ్న ఎవరికీ పట్టదు. ఏతావాతా, అందరమూ మనమన భాషలను మరిచిపోతున్నాం. ఇంకా మరిచిపోకుంటే ఇంకొన్ని రోజుల్లో తప్పనిసరిగా మరిచిపోతాం.

కంప్యూటర్ రంగంలో భారతీయులు ఎటుచూచినా జెండా ఎగరేసి, జై అంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇందుకు మనవారికి గల భాషాపాండిత్యం కారణమని గమనించాలా? మనం సులభంగా ఇంగ్లీషు నేర్చుకుని నాలుగు బొట్లేరు ముక్కల నుండి నవల్సు దాకా అప్పజెప్పగలుగుతాం. సల్మాన్ రుష్దీ, విక్రం చంద్రా, చిత్రా దివాకరుని వగైరాల్లాంటి ఆంగ్ల రచయితలను కోకొల్లలుగా ప్రపంచానికి పంచుతాం. మనకు అంటే చదువుకున్న భారతీయులకు, ఇంగ్లీషు చేతగావడం, కంప్యూటరు రంగంలో ఒక పెద్ద అనుకూలమయిన అంశం అయి కూచుంది. చైనా, జపాను వారికి చదువు రాదని కాదు. ఇంగ్లీషు మాత్రం మనకు వచ్చినంత బాగా రాదుగాక రాదు. అదీ సంగతి!

కొత్తశకాలు, సహస్రాబ్దాలు వస్తే రానివ్వండి. కొత్తదనాన్ని తెస్తే తేనివ్వండి. కానీ గుర్తించవలసిన సంగతులను మాత్రం కొన్నింటిని గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉంది. వెనకటి సంగతేమో గానీ, ప్రస్తుతం ప్రపంచంలో ఆరువేల భాషలు వాడుకలో ఉన్నాయి. అంటే, ఇంకా ఎవరి భాష వారికి, ఉందనే అనుకోవచ్చు. ప్రగతి గతి ఇలాగే సాగితే, 2100 నాటికి, మిగిలే భాషలు మూడువేలకు తక్కువేనని అంచనా. పండుగలకు ప్రతి దానికీ ప్రత్యేకతలు ఉండేవి. ఫలానా పండుగని ప్రత్యేకంగా పట్టింపులుండేవి. యూరోపు వాడి యంత్రాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అన్ని పండుగలకూ సేమ్యాలు మిగిలి పోయాయి. అవి కూడా మన పాత పద్ధతి సేమ్యాలు కానేకావు. అచ్చంగా అలాగే, ప్రపంచమంతటా ఇంటర్నేషనల్ భాష, అయిన ఇంగ్లీషు ఒక్కటే, మిగిలినా ఆశ్చర్యపడనసరం లేదు!

 

ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అన్ననాడు వారి ఉద్దేశ్యం ఒకటయితే, ఇవాళ నిజంగా ప్రపంచమంతా ఒకటే కుటుంబమయింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో, అయిదవ వంతు మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారట. అందరినీ ఒకేగాట కట్టే సంస్కృతీ విశేషానికి ఉదాహరణగా ముందు ఇంగ్లీషు భాషను చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కొంత భాగంలో కొంతకాలం పాటు, సడకులుండేవి. సడకేమిటి? అసహ్యంగా!’ అన్నవాళ్లున్నారు. దాన్ని రోడ్డు అనాలి అని నచ్చజెప్పారు. ఇప్పుడా సడకులన్నీ ఇంచుమించు రోడ్డులయినయి. అదలా ఉంచితే మనం మాత్రం ఇంగిలీషు, కొంచెం తెలుగు శైలిగల టింగిలీషు భాష వంటబట్టించుకున్నాం. వాట్ యార్?’ అన్న మాటలో, యార్ (నేస్తం) అనేది ఉరుదూ మాటని మనకు తోచనే తోచదు. ఇది మన రాష్ట్రానికి, మన దేశానికి పరిమితమయిన పద్ధతి కానే కాదు. ప్రపంచమంతటా ఎవరికి వారు తమదయిన ఇంగ్లీషు మాటకారితనాన్ని తయారు చేసుకుంటున్నారు.

ఇంటర్నెట్, ఇతర మల్టిమీడియా మాధ్యమాలను గురించి తలుచుకుంటే, ఇంగ్లీషు తప్ప మరో భాష మిగిలేనా అన్న అనుమానం రాకమానదు. అందరికీ, కనీసం కొందరికయినా అర్థమయే ఇంగ్లీషు ఒకరకమయితే, స్థానిక భాషల పదజాలాన్ని ఇంగ్లీషుతో కలిపి, తయారు చేసే భాషలు మరింత విచిత్రం. ఉత్తర భారతంలో హింగ్లిష్, దక్షిణంలో టింగ్లిష్ అని మనం సరదాగా అనుకుంటాం. కానీ అవసరం వచ్చినప్పుడు, ఇంగ్లీషు వాడికి అర్థమయ్యేలా విషయం చెప్పగలం కూడా! సింగపూర్ లో సింగ్లీష్ ఉంది. అందులో మలయ్, చైనీస్ భాషలు ఇష్టంగా కలిసి ఉంటాయి. అది అక్కడివాళ్లకు తప్పతే మరొకరికి అర్థం కాదట!

గోపాలం కె.బి.

17 ఫిబ్రవరి 2001



 

Monday, February 9, 2026

కిచిడీ జాగీర్ : సురవరం ప్రతాప రెడ్డి గారు చెప్పిన కథ


కిచిడీ జాగీర్

సురవరం ప్రతాప రెడ్డి గారు చెప్పిన కథ