Tuesday, September 15, 2026

లోకాభిరామం : కలకత్తా కాళిక నాలుక On my first visit to Calacutta


కలకత్తా కాళిక నాలుక

గంగలో స్నానానికి వస్తవా, అని కలకత్తాలో ఉండగా ఎవరో అడిగినరు. బాత్‌రూంలో వచ్చేవి కూడా గంగ నీళ్లే కద. ఇక్కడే శుభ్రంగ స్నానం చేస్తనని నేనన్న.

ఒంటరి ప్రయాణం: పి.ఎచ్.డీలో చేరిన తరువాత చాలాకాలం పాటు, అంశాన్ని తేల్చక ప్రొఫెసర్‌గారు కాలయాపన చేయించినరు. మానవ జనాభాలలోని జన్యు వైవిధ్యం అని విషయం నిర్ణయమయింది. కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడానికి కలకత్తా పోయి రావాలె. అంతకు ముందు ఒంటరిగ అంతంత దూరం ప్రయాణం చేసింది లేదు. కనుక ఉత్సాహంగ ఉంది. ఈస్ట్‌కోస్ట్ అనే ఎక్స్‌ప్రెస్‌లో మామూలు క్లాసులోనే ప్రయాణం. నాకు రిజర్వేషన్ ఉంది గనుక, నా సీట్లో నేను కూచున్న. అసలు ఎవరితోనూ మాట్లాడలేదు కూడా. ఎక్కడ ఎక్కినరో గుర్తు రావడం లేదు గాని, ఓ నలుగురు సైన్యం యువకులు ఎక్కినరు. వాళ్ల దగ్గర రిజర్వేషన్ లేదు. ఆ మాట ఎవరో చెప్పబోతే, ‘నీ కోసం మొత్తం రైలంత రీ-జర్వ్ అయిందిలే’ అని వారిలో ఒకడు మొరటుగ జవాబు ఇచ్చినడు. అందరూ వాళ్లను చూచి భయపడినట్లు ఊరకుండి పోయినరు. అట్లాగని నేనేదో పోరాటం జరిపిననుకునేరు! నేనూ ఊరికే ఉండిపోయిన. మధ్యలో ఎక్కడో ఒక కుర్రవాడు మట్టి పాత్రలలో ‘చాయ’ అమ్మడానికని పెట్టెలోకి ఎక్కినడు. చిన్న పిల్లవాడు. బహుశ పక్క స్టేషన్‌లో దిగి, మరో తిరుగు రైల్లో తన ఊరు చేరుకుంటడనుకుంట. ఈ మిలిటరీ రాక్షసులు, పిల్లవాని చాయ్ తాగి, పైసలివ్వక, వాణ్ణి రకరకాల హింసకు గురి చేశినరు. వాడు ఏడుస్తున్నా దిగవలసిన చోట దిగనివ్వలేదు. ఆ సంఘటన ఆధారంగా కథ రాయాలని అప్పుడే అనిపించిందా, తర్వాత అనిపించిందా? గుర్తు లేదు. సాహిత్యావేశమే గానీ, పిల్లవాని తరఫున పోరాడే ఆవేశం మాత్రం కలగలేదు. అది తలుచుకున్నప్పుడల్ల, మనసు వికలమవుతుంది. నేనే కాదు, మరెవ్వరూ వాళ్లను మందలించలేదు. ఎందుకయి ఉంటుంది?

ఆ రాక్షసులలో ఒకడు నాతో మాట కలిపినట్లు, వాడి దగ్గర నుంచి కొంచెం ఖైనీ పొగాకు, నేను రుచి చూచినట్లు గుర్తుంది. తల తిరగడం కూడ గుర్తుంది. మిగత సంగతులు గుర్తులేవు.

నేనసలు దినమంత ఎవరితోనూ మాట్లాడలేదు. రాత్రయింది. నాకు పైన బెర్త్ అలాటయింది. పండుకోవాలని ఎక్కితే అంతా దుమ్ము. ఏం చేయాలని ఆలోచిస్తున్న. నాది సైడ్ బెర్త్. ఎదురుగా ఉండే బెర్త్‌లలో ఒక కుటుంబం వారున్నరు. తెలుగువారు. ఆయనగారు కలకత్తాలోని ఆంధ్రా బ్యాంక్ శాఖ మేనేజరని అర్థమయింది. వాళ్ల అమ్మాయి ఒక గుడ్డతో తన బెర్త్ తుడుస్తున్నది. నేనామెను గౌరవంగా ఆ గుడ్డ అడిగిన. తెలుగులో అడిగిన. ఉదయం బయలు దేరి, రాత్రి వరకు, తెలుగు నేల నుంచి చాలా దూరం వచ్చేశినము. అక్కడ తెలుగు వినిపించేసరికి ఆ అమ్మాయికి సంతోషంగ తోచింది. వెంటనే! ఆయన తెలుగు వారు అని అమ్మానాన్నలకు చెప్పింది. కుటుంబం మొత్తం నాతో మాట కలిపినరు. దూర దేశంలో ‘మనవారు’ భావం రుచి నాకు అర్థమయింది. నాకంతా కొత్త. వెళ్లవలసిన చోటికి ఎట్ల చేరాలెనో తెలియదు. తెలుగు కుటుంబం కొరకు కారు వచ్చింది. వారు నన్ను చౌరంగీ దాక వెంట పెట్టుకు వెళ్లినరు. అక్కడ వారి డ్రైవరు నన్ను ఎక్కవలసిన బస్సులో ఎక్కించి, కండక్టరుకు చెప్పి, మరీ వెళ్లినడు. ‘మనవారు’ భావం పుణ్యమా అని నేను రెండు రూపాయల ఖర్చుతో గమ్యం చేరుకున్న.

పంజాబీ మిత్రులు: ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో నాతోబాటే, పని నేర్చుకునేందుకు పటియాలా నుంచి ఇద్దరు కుర్రవాళ్లు వచ్చినరు. వాళ్లు కూడా హౌరాలోనే రైలు దిగినరు. అక్కడి నుంచి గమ్యం చేరుకోవడానికి 125 రూపాయలు ఖర్చయిందన్నరు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. నాకు సెంట్రల్ యు.జి.సి. ఫెలోషిప్ వచ్చిందని చెపితే, వారిద్దరూ నన్నొక హీరోను చూచినట్లు చూడటం మొదలు పెట్టినరు. మా దగ్గరయితే నీ ఫొటోతోబాటు, వార్త పేపర్లో వచ్చేది తెలుసా? అన్నరు. మూడు వారాలు కలిసి ఉండి ఎంతో నేర్చుకున్నము. గణాంక శాస్త్రం సంస్థలో, ఒక మానవ జన్యుశాస్త్ర విభాగం ఉంటుందనీ, అక్కడ రంగంలోని గొప్ప పరిశోధకులు ఉంటరని ఎవరికీ తోచక పోవచ్చు. వాళ్ల గురించి చాల చెప్పుకోవాలె. ఈ పంజాబీ మిత్రులలో ఒకతనికి జ్వరం వచ్చింది. మెడికల్ సెంటర్ ఉంది. వెళ్లమని హాస్టల్లో వారు చెప్పినరు. ముగ్గురమూ వెళ్లినము. జ్వరం వచ్చిన అబ్బాయి పేరు విజయ్ శర్మ. డాక్టరు అడిగితే అదే చెప్పాడు. డాక్టర్ మాత్రం చీటీ మీద బిజోయ్ శొర్మా అని రాశినడు. వీడు, అనగా విజయ్ అల్లరి రకం. అది నా పేరు కాదన్నడు. మరేమిటి నీ పేరు, డాక్టరు మళ్లీ అడిగినడు. వీడు చెప్పినడు. అదే గదా నేను రాసింది, అంటడు డాక్టరు. కొంత చర్చ, స్పెల్లింగు చర్చ, తర్వాత విషయం అర్థమయి అంత నవ్వుకున్నము.

బస్సులు - ట్రాములు: సాయంత్రం లాబ్ నుంచి వచ్చిన తరువాత చేతులు కట్టుకుని కూచోవడం నావల్ల గాదు. ఊరంత తిరగాలె. బస్సుల్లో రద్దీ అంటే అక్కడనే చూడాలె. అసలు రద్దీ, అంటేనే అక్కడనే చూడాలె. ఏదో బస్ ఎక్కడం, శాంబజార్, ధరమ్‌తల్లా, మరో చోటికి వెళ్లడం, కాసేపు తిరిగి మళ్లీ వెనక్కు రావడం. తిరుగు ప్రయాణంలో దిగవలసిన స్టాప్ పేరు బోన్‌హుగ్లీ. బస్సు డన్లాప్ దాకా వెళుతుంది. మరింత ముందకు పోతే రామకృష్ణ మఠం వస్తుంది. కొథాయ్ జాబేన్, ఎఠా నాంపేన్, కుడీ పోయిషా (ఇరవయి పైసలు) లాంటి బెంగాలీ మాటలు పట్టుకున్న. అందరూ ఏదో పేర్లు అడుగుతున్నరు. అందులో ఒక వింత శబ్దం వినపడుతున్నది. అనొన్నొ లాంటి మాటేదో అంటున్నరు. రెండు దినాల తరువాత, అది నా బోన్‌హుగ్లీ కన్నా ముందే వస్తుందని అర్థమయింది. మరుసటి నాడు జాగ్రత్తగ చూస్తే అక్కడొక సినిమా హాల్ కనపడింది. దాని పేరు అనన్య! ఎంత అందమయిన పేరు! బెంగాలీ మాటల్లో ఒక ఊపు ఉంటుంది. ఏ మాటనయినా వాళ్లు పలికే తీరు ప్రత్యేకంగ ఉంటుంది. అకారం బదులు ఓత్వం. వకు బదులు బ అందరికీ తెలిసిందే. రవీంద్రుడు రొబీంద్రొ అవుతడు.

రోడ్ల మీదే ఏర్పాటు చేసిన పట్టాల మీద, రెండే రెండు పెట్టెల రైలు బండి నడుస్తుంది. దాని పేరు ట్రామ్. ఈ ట్రామ్ దారులు, ఊరంత లేవు. కొంత భాగంలోనే తిరుగుతయవి. కొత్తదనం పేరున వాటిల్లో కాస్త ఎక్కువగనే తిరిగినట్టు గుర్తు. బస్సుల్లో లాగే ట్రాముల్లోనూ విపరీతమైన రద్దీ ఉంటుంది. అమ్మాయిలకు వేరే సీట్లు ఉండవు. లేక ఉన్నా సరే, మిగతా సీట్లలోనూ వాళ్లు వచ్చి కూచుంటరు. అంతకన్నా ఎక్కువ అక్కడి అమ్మాయిలు నేర్చుకున్న పద్ధతి ఒకటి నాకు ఆశ్చర్యం కలిగించింది. సీటు వేపు తిరిగి నిలబడ్డ ఒక అబ్బాయికి సీటుకు మధ్యన వచ్చి చేరుకుంటరు. ఈ అబ్బాయి గౌరవంగా వారికి చోటిస్తడు. ఓ చిరునవ్వు చివరికి బహుమతిగా మిగులుతుంది. పరిష్వంగ సుఖము కూడ (పాపము శమించుగాక!)

కాళిక నాలుక: ఒకనాడెందుకో సెలవిచ్చినరు. సంగతేమో తెలుసుకోకుండ నేను ఒంటరిగ ప్లానేటేరియం, విక్టోరియా మెమోరియల్ చూడడానికి వెళ్లిన. అక్కడ తెలిసింది, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినయి. జ్యోతిబాసు నాయకత్వంలో కమ్యూనిస్టులు మొదటిసారిగ గెలిచినరు. పెరేడ్ మైదాన్‌లో బహిరంగ సభ జరుగుతుంది అని! ఏమవుతుందిలే, అని నేను తిరుగు ప్రయాణానికి బయలుదేరిన. బస్సులు లేవు. ఆ మైదానం విక్టోరియా మెమోరియల్ ముందే ఉంటుంది. ఎక్కడెక్కడి వాళ్లంత అక్కడికే వస్తున్నరు. ‘నేల ఈనింది’ అన్న మాట గుర్తుకు వచ్చింది. ఎక్కడ చూసినా ఎర్రజెండాలతోటి జనం. ఎస్‌ప్లనేడ్ దాటే వరకు సాయంత్రమయింది. హాస్టల్లో నేను లేనని గమనించిన వారంత, ఆదుర్దాగా ఎదురు చూస్తున్నరు. నిజం చెపుతున్న, నాకు భయం మాత్రం కాలేదు. ఏమీ జరగనట్టే హాస్టల్ చేరిన. అందరూ కాసేపు అరిచినట్లు కూడా గుర్తు! నాకది భలే సరదాగా తోచింది. అట్లాగే గుర్తుంది. ఒకచోట మాత్రం రోడ్డు దాటడానికి వీలు కుదరక, వాళ్లలో కలిసి, నినాదాలు చేస్తూ, కొంత నడిచి, అవతలికి జారుకున్నట్లు గుర్తు! తలుచుకుంటే నవ్వొస్తుంది.

సింగాడా, పూడీ! అప్పట్లో కలకత్తాలో, మధ్యరకం హోటేల్స్ కనిపించలేదు. రోడ్డు పక్కన తడికల హోటల్లో తిండి దొరుకు తుంది. చిన్న సమోసాలుంటయి. వాటి పేరు సింగాడా. పూరీలను పుడీలంటారు. బేగునీ అనే వంకాయ బజ్జీలుంటయి. ఇక బెంగాలీ స్వీట్లను గురించి చెప్పనవసరం లేదు. మట్టి ముంతల్లో తియ్యటి పెరుగు దొరుకుతుంది. దాని పేరు మిష్టి ధోయి. పూరీలు, ఆలూ కరీ, చింతపండు పచ్చడి. ఎన్‌ప్లనేడ్‌లో ఒక గలీ హోటేల్‌లో కడుపు నిండ తిన్న. బిల్లు రెండే రూపాయలు!

కలకత్తా మొత్తం గజిబిజిగా, గలీజుగా కనిపించింది. మనుషులు మాత్రం ముత్యాల్లాగ అందంగ ఉన్నారు! ఏమిటి రహస్యం?




 

Wednesday, September 9, 2026

కన్నీళ్ల గురించి ఎన్నెన్నో వివరాలు : On Tears


కన్నీళ్ల గురించి

 

ఉల్లిపాయలను తరుగుతుంటే కళ్ళలోంచి ఉప్పునీరు వస్తుంది. దుఃఖం, సంతోషం అనే భావావేశాలు కలిగినా, అదే ఉప్పునీరు వస్తుంది. భావం కారణంగా కంటనీరు పెట్టడం ఒక్క మనుషులలో మాత్రమే ఉంది. ఇంతకు కంట నీరు పెడితే మనసు కుదుటపడుతుందా?

సైన్సులో ఏ సమస్యలోకి తిరిగి చూడాలన్నా ముందుగా నిర్వచనాలు కావాలి. ఏడుపును గురించి విక్రమ్ పటేల్ అనే పరిశోధకుడు 1993లో పరిశోధనలు నిర్వహించాడు. ఇది ఒక సంక్లిష్టమైన ప్రతిచర్య. ఇందులో మోటార్, మనం అనుకునే కారు వంటి మోటర్ కాదు ఇది, వ్యవస్థ కారణంగా, ఏ రకమైన ఇరిటేషన్ లేదా అసౌకర్యం లేకుండానే, లాక్రిమల్ గ్రంధుల నుండి కన్నీరు స్రవిస్తుంది. ఈ కన్నీళ్లే ఏడుపు వచ్చింది అనడానికి గుర్తు. ముఖంలోని కండరాలలో మార్పు ఏర్పడుతుంది. కొంతమందిలో గొంతు మారుతుంది. ధ్వనులు కూడా మొదలవుతాయి. కడుపు కండరాలు కదిలే రకంగా, శ్వాసలో కూడా తేడా వస్తుంది. ఈ విక్రమ్ ఏడుపును నిర్వచించాడు. మిగతా పరిశోధకులు అంతా ఇదంతా సరదాగా ఉంది, అన్నారు.

పారిశ్రామిక విప్లవం వచ్చే ముందుదాకా పదిమంది ఏడ్చినా తప్పులేదన్న పద్ధతి ఉండేది. గ్రీకులు, రోమనులు అంత్యక్రియల సమయంలో తమ కన్నీటిని ప్రత్యేకంగా సీసాల్లోకి సేకరించేవారట. మనదేశంలో, బాహాటంగా ఏడవడానికి, కూలీకి మనుషులను పెట్టే రుదాలి సంప్రదాయం గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. గ్రీకులు తమ కన్నీటిని గతించిన వ్యక్తితో పాటు సమాధి చేసేవారట కూడా.

మెదడులో కొన్ని హ్యూమర్స్ అనే స్రావాలు చేరి అసౌకర్యం కలిగిస్తాయని, మనస్సు తేలికవుతుందని, హిప్పొక్రేట్స్ భావించాడు. ఏడిస్తే మెదడు శుభ్రం అవుతుందని అరిస్టాటిల్ అన్నాడు. ఇక రోమన్ కవి ఒవిడ్ కన్నీళ్ళతో పాటు, దుఃఖం కూడా, కారి బయటకు పోతుంది, అన్నాడు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి ఏడ్చి ఏడ్చి గుడ్డివాడయ్యాడు.

భావావేశంతో రక్తం కళ్లలోకి చేరుకుంటుంది. ఏడిస్తే అది పోతుంది, అన్నాడు డార్విన్.

ఇంతకు ప్రస్తుత పరిశోధకులు కన్నీటి గురించి ఏమంటున్నారు? కన్నీరు మూడు రకాలు అంటున్నారు. కనీసం ఏడుపు మూడు రకాలుగా ఉండాలి. కన్నీరు కంటిలో వెలుపలి పైమూలలో తయారవుతుంది. అది బయటకు రావడం మాత్రం లోపలి, కింది మూల నుంచి జరుగుతుంది. అంటే కన్నీరు మొత్తం కంటిలో పరుచుకుంటుంది, అని అర్థం. మిల్లిమీటర్లో మూడవ వంతు మందం ఉండే పంక్టా అనే గొట్టాలు కన్నీటిని ముక్కులోకి, నోట్లో, గొంతు మొదట్లోకి కూడా పంపుతాయి. అందుకే ఏడ్చిన తర్వాత నోట్లో కూడా రుచి మారిన భావం కలుగుతుంది. కనుబొమ్మలు కదిలినందుకు నీరు కన్ను అంతటా పరుచుకుంటుంది. కన్ను ఆర్పడానికి 0.3 నుండి 0.5 సెకండ్ల కాలం పడుతుంది. ప్రతి రెండు నుంచి పది సెకండ్లకు ఒకసారి మనం కళ్ళు అర్పుతాము. కొంతమంది ఎక్కువ సార్లు కళ్ళు ఆర్పుతుంటారు. అటువంటి వారు జీవితం మొత్తంలో అదనంగా, అంటే నిద్రపోయిన సమయం కాకుండా, కళ్ళు మూసుకుని ఉంటారు. ఇవన్నీ సైంటిస్టులు లెక్క తేల్చిన వివరాలు.

 

కన్నీటిలో మూడు రకాల ద్రవాలు ఉంటాయి. అవి మూడు వేరువేరు గ్రంధులలో తయారవుతాయి. మొదటిది తెల్ల గుడ్డులో పుట్టే జిగురు రకం. ఆ ద్రవం కనుగుడ్డు మీద అంతటా సమంగా పరుచుకుంటుంది. కనుకనే కళ్ళు ఆర్పడం అంత సులభంగా జరుగుతుంది. రెండవ పొర మరింత నీరుగా ఉంటుంది. ఇది ఇంతకు ముందు చెప్పుకున్న లాక్రిమల్ గ్రందులలో తయారు అవుతుంది.కన్నీటిలో రకాల ప్రోటీన్లు, ఆంటిబయోటిక్స్, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ కంటి నీరు కనుగుడ్లను సూక్ష్మజీవుల నుంచి కాపాడి, వేడిని నియంత్రించి, ఉప్పుదనాన్ని అందించి, రకరకాలుగా సహాయపడుతుంది. ఇక కనుబొమ్మల చివరన ఉండే మైలోమియన్ గ్రంధుల నుంచి కొవ్వుతో కలిసి వచ్చేది మూడవరకం. లేకుంటే కన్నీరు వెంటనే కిందకు జారిపోతుంది. ఆరిపోతుంది కూడా.

 

మూడు రకాల ద్రవాలు ఉన్నట్టే కన్నీళ్లు, ఏడుపులకు, మూడు రకాల కారణాలు ఉంటాయి. దుమ్ము పడితే వచ్చే కన్నీరు ఒకరకం. కాంతి, పొగలాంటి వాటి కారణంగా ఏడుపు మరో రకం. భావోద్వేగంతో నవ్వినా, ఏడ్చినా వచ్చేవి మూడవ రకం. కన్నీళ్ళ వెనుక ఇంత సైన్సు ఉంది అని ఎంతమందికి తెలుసు?

 


 

Saturday, September 5, 2026

లోకాభిరామం : నవలా తరంగం - శిలాహాసం On a Tamil novel by LaSaRa

 


నవలా తరంగం - శిలాహాసం

నాకు పుస్తకాలు కొనే అలవాటు ఉంది. లేదు. నాలుగయిదు భాషలు చదువుతాను. కనుక నేను కొనదలచుకున్న పుస్తకాలకు సరిపడేన్ని పైసలు నా దగ్గర లేవు. కొన్న పుస్తకాలకు తగిన స్థలం ఇంట్లో లేదు. అయినా, ఫుట్‌పాత్‌ మీద మొదలు, పెద్ద అంగళ్లలో వరకు పుస్తకాలను చూస్తూ తిరగడం మాత్రం మానలేదు. అట్లనే వాల్డెన్‌ అనే ఒక అంగట్లోకి పోతిని (ఈ వాల్డెన్‌ అనే మాటకు అడవులు అని అర్థం ఉందని నా అనుమానం! జెర్మన్‌!) అక్కడ బెస్ట్‌ సెల్లర్స్‌ ఉండనే ఉంటయి. వాటి గురించి ఫ్లిప్‌కార్ట్‌, క్రాస్‌వర్డ్‌ వంటి వారంత ఊదరగొడుతునే ఉంటరు. వాల్డెన్‌లో ఒకచోట కొన్ని పుస్తకాల ధరలు తగ్గించి అమ్ముతున్నట్లు కనిపించింది. అనుకోకుండా అందులో ‘కథ’ అనే సంస్థ వారు వేసిన మంచి పుస్తకాలు కనిపించినయి. ఒకటి అనుకున్నవాణ్ని, అయిదు పుస్తకాలు తెచ్చి కూచుని చదివిన. అవన్నీ తమిళ రచనలకు ఇంగ్లీషు అనువాదాలు. వాటిల్లో ఒకటి రెండు చిరు నవలల జమిలి పుస్తకం.

రచయిత పేరు ‘లాసరా’ అని ఉంది. లోపల వివరంగా చూస్తే ఆ పెద్దాయన పేరు లాల్‌గుడి సప్తర్షి రామామృతం అని అర్థమయింది. (ఈ తమిళుల తస్సదియ్య సంస్కృతాన్ని కొమ్ములు విరిచి, చెవులు నులిమి ఎంత చెయ్యాలెనో అంత చేస్తరు. పేరును ‘లాల్‌గుడి సప్తరిషి రామామిర్తం’ అని రాసుకున్నారు. ఈ పుస్తకంలో లాసరా రాసిన రెండు చిరు నవలలున్నాయి. ఒకటి కల్‌ సిరిక్కిరదు, అంటే రాయి నవ్వింది, రెండవది ప్రాయశ్చిత్తం. ఈ రెండూ కలిసి నిజానికి ఒకటే నవల. మొదటి నవల అనువాదంలో 72 పేజీలు చదివి వదిలేస్తే, బాగనే ఉంది. తరువాతి నవల 80 పేజీలు చదివిన తరువాత మరింత బాగుంది. ఈ కథలో రాయి అంటే అమ్మవారి విగ్రహం. ఆమె మొదటి కథలో నవ్విందేమో తెలియదు. రెండవ భాగంలో ఆ సంగతి అర్థమవుతుంది. కమలాంబిక నవ్వుతుంది. కానీ, ప్రాయశ్చిత్తం ఎవరికి, ఏమో తెలియదు. రెండవ భాగంలో నిజానికి కొత్త పాత్రలు కొన్ని వచ్చి కొంప ముంచింది లేదు. కానీ, కథ ముందుకు సాగుతుంది. ప్రాయశ్చిత్తం తరువాత కూడా కథ మరింత ముందుకు నడుస్తుందేమో? నడిస్తే బాగుండునన్న భావం మిగులుతుంది. ఈ రెండు చిరు నవలలను కలిపిన నవల గురించి వ్యాఖ్యానించడానికి నాకు మనస్కరించడం లేదు. అయినా వాటిని గురించి అందరికీ చెప్పాలన్న భావం మాత్రం బలంగ మిగిలింది. ఈ రచయిత మరో బోలెడన్ని నవలలు, కథలు రాసినరు. అందులో కొన్ని ఉచితంగ నెట్‌లో అందుబాటులో ఉన్నయి. నాకు ధారాళంగ తమిళం చదవడం రాదు. ఎవరయినా చదివి వినిపిస్తే అర్థం చేసుకోగలను. లాసరా రచనలు కడు సరళంగ సాగుతయి కనుక మరింత సులభంగ, అర్థమవుతయని నమ్మకం. ఇంతకు ఒకటి రెండు సందర్భాలలో తమిళం చదువు అభ్యాసం చెయ్యలేదే, అని అనిపించడం వాస్తవం. ఈ అనువాద నవల చదివిన తరువాత ఆ భావం మరింత బలంగ మరోసారి కలిగింది.

నవలలో ధర్మరాజన్‌ గారని ఒక నడివయసు కూడ దాటిన పెద్దాయన నాయకుడు. ఆయనను ఆదర్శంగ చూడడమా, మెచ్చుకోవడమా, జాలి పడడమా, అసహ్యించుకోవడమా, మనకు, కనీసం నాకు అంతుపట్టలేదు. ఇటువంటి ఒక పాత్ర మరెక్కడో ఒక్కచోట మాత్రం ఎదురయిందని అనుమానం. ‘తెరచిరాజు’లోనా?

కథాక్రమంబెట్టిదనిన: నాకు కథ చెప్పాలనిపించడం లేదు. అంత కలగాపులగంగ గుర్తొస్తున్నది. అది కావాలని, రచయిత పన్నిన పన్నాగమని నాకర్థమవుతున్నది. ధర్మరాజన్‌కు తలిదండ్రులు లేరు. పెద్దనాయన దగ్గర బుద్ధులు నేర్చి, ఆయన చెప్పినందుకు ప్రపంచం మీద పడతడు. మంచి ఉద్యోగమే చేస్తడు. కానీ, వ్యక్తిగతంగ నాకులాగే, ఎక్కడా నిలకడ లేదు. ధర్మరాజన్‌ను చూచి అందరూ గౌరవిస్తరు. తలకెత్తుకుంటరు. ఆయన మాత్రం జారిపోయి కష్టాలలో మునిగిపోతడు. ఆయన దగ్గర ఉద్యోగం చేసిన ఒక అమ్మాయి, వివాహిత, ఆమెకు కొడుకు కూడ ఉంటడు. కానీ, ఆమెకు సుఖం లేదు. మొగుడు ఎందుకూ పనికిరాని సన్నాసి. ఆ అమ్మాయికి, ధర్మరాజన్‌కు బిడ్డ-తండ్రి వంటి ప్రేమ. ధర్మరాజన్‌కు ధర్మత: కమలాంబిక గుడిలో పూజారితనం హక్కుగ ఉంటుంది. అక్కడ పెదనాయన కొడుకు ఉన్నడు. పని చేయడం ఇష్టమే. పైసలు మాత్రం వద్దు. ఒక మార్వాడీ ఇంట్లో వంటవానిగ పనికి చేరుతడు మన నాయకుడు. కథలోని అమ్మాయి నగలు ఆ మార్వాడీ దగ్గర కుదువబెట్టి ఉన్నయి. వాటినీయన దొంగిలిస్తడు. సేఠ్‌ చని పోతడు. మన హీరో జెయిలు పాలవుతడు. తిరిగి బయటకి వస్తడు. కథ సాగుతుంది.

చెప్పిన గద, కథ చెప్పాలని లేదని! సినిమాకు కుదరదేమో గానీ, టీవీ సీరియల్‌కు బాగ పనికివచ్చే రచన యిది. ఇన్ని మలుపులు, ఇన్ని రకాల పాత్రలు, మామూలుగ మనకు నవలల్లో కనపడవు! ఇంగ్లీషు, నవలలు చదవడం అలవాటున్న వాండ్లందరు, ఈ పుస్తకం సంపాయించి చదవాలని నాకనిపించింది. ఇది గొప్ప నవల కాదు. గొప్ప నవల అంటే ఎట్లుంటుందో నాకు తెలియడము లేదు. ఆ చర్చలోకి పోయే సంకల్పము ప్రస్తుతము లేదు. కానీ, లాసరా రచనలు అందరూ చదవదగినవి. ఈ మాట నేననడం లేదు.

డా.గాబ్రియేలా అయిషింజర్‌ ఫెరొ-లుజీ అనే భాషావేత్త, ద్రావిడ భాషల గురించి పరిశోధించినరు. ఆమె ఈ రచయితను ఆకాశానికెత్తింది. ఆమె చెప్పిన ఒక సంగతి మాత్రం నాకు ముఖంలో గుద్దినట్లుగ తగిలింది. లాసరా ప్రతీకలను అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మల బ్రతుకు తీరు, వారి సంప్రదాయాలు తెలిసి ఉండాలంటుంది ఆమె. శ్రీపాద గురించి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి ఈ మాట ఎవరయినా అని ఉండవచ్చు. అనకున్నా, ఇప్పుడు నేనంటున్న. ఈ మహా రచయితల ఎక్స్‌ప్రెషన్‌ సిసలయిన బాపనితనం నిండినదే.

ఒక రచయిత నాలుగయిదు రచనలు చదివితే, రచయితను గుర్తించగలగడం నిజంగా ఒక ఫీటు. లాసరా విషయంలో ఇది నిజమంటారు మరో తమిళ విమర్శకులు. లాసరా కాస్త కఠినమయిన రచయిత. ఆయన చెప్పినదంత అర్థమయిందని నేను అనలేను అంటారు గాబ్రియేలా! ఆయన వాక్యాలు సింపుల్‌కన్న సింపుల్‌. భాష తప్పకుండా సింపుల్‌. ఎక్కడ ప్రయత్నించినా కాంప్లెక్సిటీ కనిపించదు. కానీ, ఆ పాత్రలు, అవి చేసే పనులు, అనే మాటలు మనలను ఆలోచనల్లో ముంచుతయి. ధర్మరాజన్‌ ఒకనాడు దారి పక్కన కూచుని, ముందు ఉత్తరీయం పరిచి, పిల్లంగ్రోవి మీద సంగీతం వాయించడం మొదలుపెడతడు. ఆయనకు ఆ పని చేయవలసిన అవసరం ఏమి? అర్థంకాదు. కానీ, దాంతోనే ‘ప్రాయశ్చిత్తం’ మొదల వుతుంది. ‘చదువరులారా, రండి. కన్నీళ్ల కలయిక, నదులన్నిటి సంగమంకన్న గొప్పది. అక్కడ ఇక మన అవసరం లేదు. మనం వాళ్లని వదిలేద్దము! సరేనా!’ అంటూ ముగుస్తుంది రెండవ నవల, తరువాత కమలాంబ నవ్వుతుంది!!

అనువాదం: అనువాదం విషయంలో ఎందరో పెద్దలు సిద్ధాంతాలు చేసినరు. నాకవేవీ పట్టలేదు. నా సిద్ధాంతాలు నేను చేసుకుని కొన్ని అనువాదాలు చేసిన. తిట్లు దీవెనలు, రెండూ తిన్న. నన్ను అర్థం చేసుకోలేని వారున్నరని అర్థమయింది. అనువాదం చేస్తున్నది కాల్పనిక సాహిత్యమయితే, మూల రచయిత, దయ్యమయి మనకు పట్టాలె. వారి శైలి కూడ విషయమంత బలంగ, అనువాదంలో ప్రతిబింబింప వలె. ఇది నా పద్ధతి. కల్‌ సిరిక్కిరదు, తమిళ ప్రతి చదవడానికి ప్రయత్నించిన తరువాత, పద్మా నారాయణన్‌ అనువాదం బాగుందని తోచింది గాని, భాష, భావం కలయిక, అంటే అభివ్యక్తి మూలానికి ఎంత సమీపంగ ఉన్నదీ తెలియలేదు. అనువాదం చదువుతుంటే, అడుగడుగున, మూలభాష గుర్తుకు రావాలని నాకనిపిస్తుంది. రచన అసలయిన ఇంగ్లీషు ఇడియంతో సాగుతుంటే నాకు అసౌకర్యంగ తోస్తుంది. ఈ విషయం గురించి చాల మందితో, చాల చర్చించిన. ఇంకా అది కొనసాగవలసి ఉంది.

ప్రాయశ్చిత్తం: తిరిగి గోమతి యింట్లో, ఆయన తన పెట్టెను పరీక్షించాడు. తాళం బదులు ఒక తీగ చుట్టి ఉంది. తన బట్టలన్నీ ఉన్నాయని గమనించాడు. కాఫీ ఫిల్టరు, స్టీలుగ్లాసు కూడా. పాస్‌బుక్‌, ఎఫ్‌డీ రసీదు, చెక్కుబుక్కు లేవు. పోలీసు వాళ్లు తీసేసుకుని ఉంటారు. ఒక వస్తువు కంటికి కనపడింది. అది గుడ్డలో చుట్టి ఉంది. ఆకారం వల్ల అదేమిటో తెలిసింది - తన పిల్లంగ్రోవి. ఆయన దాన్ని తీశాడు. శుభ్రంగా తుడిచాడు, కళ్లతో తడిమాడు.. ఆయన తన పరిసరాలను మరిచిపోయాడు.

మూడున్నర సంవత్సరాలు... మొదటి స్వరపు తీయని గాలి వెలికివచ్చి గుండెను తడిపింది. ఆయన సర్వస్వాన్ని ముంచెత్తింది. లోపల ఒక పచ్చని చిగురు తలయెత్తింది.

అక్కడ రచయిత రాసిన మాటలు మనసులో కుచ్చుకుంటయి. అదే రచన యొక్క సక్సెస్‌కు గుర్తింపు. అట్లని రచన గొప్పది కానవసరం లేదు.

ఈ జమిలి నవల నిజంగా ఒక మసాలా మిక్స్‌! కానీ మసాలా నవల్లో ఇలాంటి మాటలుంటయా? ఏమో?


Tuesday, September 1, 2026

చింపిరిజుట్టు పరిశోధన On Anthropology!

 


ఆదివారం 11 ఫిబ్రవరి 2001 ఆంధ్రభూమి దినపత్రిక

చింపిరి జుట్టు పరిశోధన

పరిశోధన, సైంటిస్టు అనగానే మనకంతా చింపిరి జుట్టు, గడ్డం, పాతకాలం తరహా దుస్తులు వేసుకున్న ఒక పిచ్చి మారాజు మనసులో మెదులుతాడు. పరీక్షనాళికలో రంగురంగుల ద్రవాలను కలిపి సక్సెస్ అని కేకలేస్తాడతను. సినిమాలు, నవలల పుణ్యమా అని మనకు ఇలాంటి ఆలోచనలు స్థిరపడతాయి. అటు సైన్స్ అంచులను తాకుతూ, ఇటు సాంఘికశాస్త్రం గురించి కూడా పట్టించుకుంటూ ఆంత్రపాలజీ అనే శాస్త్రం ఒకటి ఉంది. దాన్ని అచ్చంగా అనువదించాలంటే మానవశాస్త్రం అనాల్సి ఉంటుంది. మానవుల తీరుతెన్నులు, జీవన విధానాలను వర్ణించే శాస్త్రం అది. అందులో ముక్కులు కొలవడం మొదలు, మునుపటి వారి విశేషాలను సేకరించడం దాకా ఎన్నెన్నో అంశాలు ఉంటాయి. అసాధారణంగా జీవిస్తున్న జాతులను పట్టించుకోవడం ఈ రంగం వారి ప్రస్తుత ప్రత్యేక కార్యక్రమం.

ఆదిలాబాద్ లోని గోండులను గురించి పరిశోధించడానికి జర్మనీ నుంచి హేమిండార్ఫ్ దంపతులు వచ్చి మర్లవాయి అనే ఊళ్లో గోండ్లతోనే కలిసి జీవించారు. శ్రీమతి హేమిండార్ఫ్ సమాధి అక్కడే ఉంది ఇంకా. ఈ దంపతులు గోండులు అయిపోయారన్నా అతిశయోక్తి లేదు. పరిశోధన శాలలు, పరికరాలు, సమావేశాలు, అందుకు తగిన ఆధునిక కాలం హంగులు ఏవి అవసరం లేకుండా ఈ రకం పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. మిచిగన్ యూనివర్సిటీ మానవశాస్త్ర పరిశోధకుడు టామ్ ఫ్రిక్ రెండు సంవత్సరాలకు పైగా కాల్ ఆఫ్ అనే మధ్యతరగతి కుటుంబీకుడితో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్లు ఉండేది ఒక నిజమైన పల్లె. అక్కడ సౌకర్యాలు అంతగా లేవు. అటువంటి ప్రాంతాల్లో బతుకుతున్న వారి జీవితాలను పరిశోధించడమే ఫ్రిక్ పెట్టుకున్న పని. అందుకు వారి మధ్య వారిలో, ఒకడుగా బతకడం కన్నా మంచి మార్గం లేదు. తాను పరిశోధకుడనే విషయాన్ని పక్కనపెట్టి ఫ్రిక్ తన యజమానితో కలిసి వారి పొలాల్లో పని చేస్తుంటాడు. పశువులను కాస్తుంటాడు. ఈ పేరుతో బీద రైతుల పనితీరును, పరిశోధకుడు స్వయంగా నేర్చుకుంటున్నాడు. ఆయా విషయాలను గురించి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుంటున్నాడు. అతను మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఆగి, అప్పుడు విరామం దొరికినప్పుడు ఆ రోజు సేకరించిన వివరాలు అన్నింటిని ఒక పుస్తకంలో రాసుకుంటాడు. మారుతున్న మధ్యతరగతి జీవితాలు, వారి పనితీరులన్నీ త్వరలోనే ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నంలో ఇదొక భాగం!

కాలువ గట్టు మీద నిలబడి, కర్రతో గుచ్చి, రాయి వేసి, లోతు గురించి, ప్రవాహం గురించి తెలుసుకోవచ్చు. నేరుగా అందులోకి దిగి సంగతులను మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఫ్రిక్ పాటిస్తున్నది ఈ రెండవ మార్గం. దీన్ని పనిలోనే పరిశీలన అనవచ్చు. పరిశోధనకు వస్తువైన వారికి అనవసరంగా కాలయాపన జరుగుతున్నది అన్న భావం ఉండదు. పరిశోధకులకు వివరాలు అనుమానం లేకుండా అర్థమవుతాయి. ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగింది. ఏ విషయాలయితే, ఈ మధ్య తరగతి రైతు కుటుంబాలు, సమస్యలుగా గుర్తించి చర్చిస్తున్నారు అన్నది గమనించి ఈ పరిశోధకుడు వాటిని పట్టించుకుంటున్నాడు. మారిపోతున్న ప్రపంచంలో ఇప్పుడు ఎవ్వరూ ఎక్కడికక్కడ ఉండిపోయే వీలు లేదు. రైతులకు సమాచారం కావాలి. వారి ఫలసాయం పైచోట్లకు అందాలి. కొత్త కొత్త పద్ధతులు అన్ని రంగాల్లోనూ వస్తుంటే పట్టించుకోకుండా ఉండలేరు. అవి కాక మానవ సంబంధాల విషయంగా వచ్చే మార్పులు మరోవైపు ఉన్నాయి.

మన పరిస్థితులు మారుతున్నాయని మనకి ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ దేశమంతా మారుతున్న పరిస్థితులలో తేడాలు, పోలికలు, అందుకు కారణాలు కూడా తెలిస్తే కొన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. జనజీవనం గురించి పట్టించుకోవడం పరిశోధన. అదే చింపిరి జుట్టు పరిశోధన!