Saturday, September 5, 2026

లోకాభిరామం : నవలా తరంగం - శిలాహాసం On a Tamil novel by LaSaRa

 


నవలా తరంగం - శిలాహాసం

నాకు పుస్తకాలు కొనే అలవాటు ఉంది. లేదు. నాలుగయిదు భాషలు చదువుతాను. కనుక నేను కొనదలచుకున్న పుస్తకాలకు సరిపడేన్ని పైసలు నా దగ్గర లేవు. కొన్న పుస్తకాలకు తగిన స్థలం ఇంట్లో లేదు. అయినా, ఫుట్‌పాత్‌ మీద మొదలు, పెద్ద అంగళ్లలో వరకు పుస్తకాలను చూస్తూ తిరగడం మాత్రం మానలేదు. అట్లనే వాల్డెన్‌ అనే ఒక అంగట్లోకి పోతిని (ఈ వాల్డెన్‌ అనే మాటకు అడవులు అని అర్థం ఉందని నా అనుమానం! జెర్మన్‌!) అక్కడ బెస్ట్‌ సెల్లర్స్‌ ఉండనే ఉంటయి. వాటి గురించి ఫ్లిప్‌కార్ట్‌, క్రాస్‌వర్డ్‌ వంటి వారంత ఊదరగొడుతునే ఉంటరు. వాల్డెన్‌లో ఒకచోట కొన్ని పుస్తకాల ధరలు తగ్గించి అమ్ముతున్నట్లు కనిపించింది. అనుకోకుండా అందులో ‘కథ’ అనే సంస్థ వారు వేసిన మంచి పుస్తకాలు కనిపించినయి. ఒకటి అనుకున్నవాణ్ని, అయిదు పుస్తకాలు తెచ్చి కూచుని చదివిన. అవన్నీ తమిళ రచనలకు ఇంగ్లీషు అనువాదాలు. వాటిల్లో ఒకటి రెండు చిరు నవలల జమిలి పుస్తకం.

రచయిత పేరు ‘లాసరా’ అని ఉంది. లోపల వివరంగా చూస్తే ఆ పెద్దాయన పేరు లాల్‌గుడి సప్తర్షి రామామృతం అని అర్థమయింది. (ఈ తమిళుల తస్సదియ్య సంస్కృతాన్ని కొమ్ములు విరిచి, చెవులు నులిమి ఎంత చెయ్యాలెనో అంత చేస్తరు. పేరును ‘లాల్‌గుడి సప్తరిషి రామామిర్తం’ అని రాసుకున్నారు. ఈ పుస్తకంలో లాసరా రాసిన రెండు చిరు నవలలున్నాయి. ఒకటి కల్‌ సిరిక్కిరదు, అంటే రాయి నవ్వింది, రెండవది ప్రాయశ్చిత్తం. ఈ రెండూ కలిసి నిజానికి ఒకటే నవల. మొదటి నవల అనువాదంలో 72 పేజీలు చదివి వదిలేస్తే, బాగనే ఉంది. తరువాతి నవల 80 పేజీలు చదివిన తరువాత మరింత బాగుంది. ఈ కథలో రాయి అంటే అమ్మవారి విగ్రహం. ఆమె మొదటి కథలో నవ్విందేమో తెలియదు. రెండవ భాగంలో ఆ సంగతి అర్థమవుతుంది. కమలాంబిక నవ్వుతుంది. కానీ, ప్రాయశ్చిత్తం ఎవరికి, ఏమో తెలియదు. రెండవ భాగంలో నిజానికి కొత్త పాత్రలు కొన్ని వచ్చి కొంప ముంచింది లేదు. కానీ, కథ ముందుకు సాగుతుంది. ప్రాయశ్చిత్తం తరువాత కూడా కథ మరింత ముందుకు నడుస్తుందేమో? నడిస్తే బాగుండునన్న భావం మిగులుతుంది. ఈ రెండు చిరు నవలలను కలిపిన నవల గురించి వ్యాఖ్యానించడానికి నాకు మనస్కరించడం లేదు. అయినా వాటిని గురించి అందరికీ చెప్పాలన్న భావం మాత్రం బలంగ మిగిలింది. ఈ రచయిత మరో బోలెడన్ని నవలలు, కథలు రాసినరు. అందులో కొన్ని ఉచితంగ నెట్‌లో అందుబాటులో ఉన్నయి. నాకు ధారాళంగ తమిళం చదవడం రాదు. ఎవరయినా చదివి వినిపిస్తే అర్థం చేసుకోగలను. లాసరా రచనలు కడు సరళంగ సాగుతయి కనుక మరింత సులభంగ, అర్థమవుతయని నమ్మకం. ఇంతకు ఒకటి రెండు సందర్భాలలో తమిళం చదువు అభ్యాసం చెయ్యలేదే, అని అనిపించడం వాస్తవం. ఈ అనువాద నవల చదివిన తరువాత ఆ భావం మరింత బలంగ మరోసారి కలిగింది.

నవలలో ధర్మరాజన్‌ గారని ఒక నడివయసు కూడ దాటిన పెద్దాయన నాయకుడు. ఆయనను ఆదర్శంగ చూడడమా, మెచ్చుకోవడమా, జాలి పడడమా, అసహ్యించుకోవడమా, మనకు, కనీసం నాకు అంతుపట్టలేదు. ఇటువంటి ఒక పాత్ర మరెక్కడో ఒక్కచోట మాత్రం ఎదురయిందని అనుమానం. ‘తెరచిరాజు’లోనా?

కథాక్రమంబెట్టిదనిన: నాకు కథ చెప్పాలనిపించడం లేదు. అంత కలగాపులగంగ గుర్తొస్తున్నది. అది కావాలని, రచయిత పన్నిన పన్నాగమని నాకర్థమవుతున్నది. ధర్మరాజన్‌కు తలిదండ్రులు లేరు. పెద్దనాయన దగ్గర బుద్ధులు నేర్చి, ఆయన చెప్పినందుకు ప్రపంచం మీద పడతడు. మంచి ఉద్యోగమే చేస్తడు. కానీ, వ్యక్తిగతంగ నాకులాగే, ఎక్కడా నిలకడ లేదు. ధర్మరాజన్‌ను చూచి అందరూ గౌరవిస్తరు. తలకెత్తుకుంటరు. ఆయన మాత్రం జారిపోయి కష్టాలలో మునిగిపోతడు. ఆయన దగ్గర ఉద్యోగం చేసిన ఒక అమ్మాయి, వివాహిత, ఆమెకు కొడుకు కూడ ఉంటడు. కానీ, ఆమెకు సుఖం లేదు. మొగుడు ఎందుకూ పనికిరాని సన్నాసి. ఆ అమ్మాయికి, ధర్మరాజన్‌కు బిడ్డ-తండ్రి వంటి ప్రేమ. ధర్మరాజన్‌కు ధర్మత: కమలాంబిక గుడిలో పూజారితనం హక్కుగ ఉంటుంది. అక్కడ పెదనాయన కొడుకు ఉన్నడు. పని చేయడం ఇష్టమే. పైసలు మాత్రం వద్దు. ఒక మార్వాడీ ఇంట్లో వంటవానిగ పనికి చేరుతడు మన నాయకుడు. కథలోని అమ్మాయి నగలు ఆ మార్వాడీ దగ్గర కుదువబెట్టి ఉన్నయి. వాటినీయన దొంగిలిస్తడు. సేఠ్‌ చని పోతడు. మన హీరో జెయిలు పాలవుతడు. తిరిగి బయటకి వస్తడు. కథ సాగుతుంది.

చెప్పిన గద, కథ చెప్పాలని లేదని! సినిమాకు కుదరదేమో గానీ, టీవీ సీరియల్‌కు బాగ పనికివచ్చే రచన యిది. ఇన్ని మలుపులు, ఇన్ని రకాల పాత్రలు, మామూలుగ మనకు నవలల్లో కనపడవు! ఇంగ్లీషు, నవలలు చదవడం అలవాటున్న వాండ్లందరు, ఈ పుస్తకం సంపాయించి చదవాలని నాకనిపించింది. ఇది గొప్ప నవల కాదు. గొప్ప నవల అంటే ఎట్లుంటుందో నాకు తెలియడము లేదు. ఆ చర్చలోకి పోయే సంకల్పము ప్రస్తుతము లేదు. కానీ, లాసరా రచనలు అందరూ చదవదగినవి. ఈ మాట నేననడం లేదు.

డా.గాబ్రియేలా అయిషింజర్‌ ఫెరొ-లుజీ అనే భాషావేత్త, ద్రావిడ భాషల గురించి పరిశోధించినరు. ఆమె ఈ రచయితను ఆకాశానికెత్తింది. ఆమె చెప్పిన ఒక సంగతి మాత్రం నాకు ముఖంలో గుద్దినట్లుగ తగిలింది. లాసరా ప్రతీకలను అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మల బ్రతుకు తీరు, వారి సంప్రదాయాలు తెలిసి ఉండాలంటుంది ఆమె. శ్రీపాద గురించి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి ఈ మాట ఎవరయినా అని ఉండవచ్చు. అనకున్నా, ఇప్పుడు నేనంటున్న. ఈ మహా రచయితల ఎక్స్‌ప్రెషన్‌ సిసలయిన బాపనితనం నిండినదే.

ఒక రచయిత నాలుగయిదు రచనలు చదివితే, రచయితను గుర్తించగలగడం నిజంగా ఒక ఫీటు. లాసరా విషయంలో ఇది నిజమంటారు మరో తమిళ విమర్శకులు. లాసరా కాస్త కఠినమయిన రచయిత. ఆయన చెప్పినదంత అర్థమయిందని నేను అనలేను అంటారు గాబ్రియేలా! ఆయన వాక్యాలు సింపుల్‌కన్న సింపుల్‌. భాష తప్పకుండా సింపుల్‌. ఎక్కడ ప్రయత్నించినా కాంప్లెక్సిటీ కనిపించదు. కానీ, ఆ పాత్రలు, అవి చేసే పనులు, అనే మాటలు మనలను ఆలోచనల్లో ముంచుతయి. ధర్మరాజన్‌ ఒకనాడు దారి పక్కన కూచుని, ముందు ఉత్తరీయం పరిచి, పిల్లంగ్రోవి మీద సంగీతం వాయించడం మొదలుపెడతడు. ఆయనకు ఆ పని చేయవలసిన అవసరం ఏమి? అర్థంకాదు. కానీ, దాంతోనే ‘ప్రాయశ్చిత్తం’ మొదల వుతుంది. ‘చదువరులారా, రండి. కన్నీళ్ల కలయిక, నదులన్నిటి సంగమంకన్న గొప్పది. అక్కడ ఇక మన అవసరం లేదు. మనం వాళ్లని వదిలేద్దము! సరేనా!’ అంటూ ముగుస్తుంది రెండవ నవల, తరువాత కమలాంబ నవ్వుతుంది!!

అనువాదం: అనువాదం విషయంలో ఎందరో పెద్దలు సిద్ధాంతాలు చేసినరు. నాకవేవీ పట్టలేదు. నా సిద్ధాంతాలు నేను చేసుకుని కొన్ని అనువాదాలు చేసిన. తిట్లు దీవెనలు, రెండూ తిన్న. నన్ను అర్థం చేసుకోలేని వారున్నరని అర్థమయింది. అనువాదం చేస్తున్నది కాల్పనిక సాహిత్యమయితే, మూల రచయిత, దయ్యమయి మనకు పట్టాలె. వారి శైలి కూడ విషయమంత బలంగ, అనువాదంలో ప్రతిబింబింప వలె. ఇది నా పద్ధతి. కల్‌ సిరిక్కిరదు, తమిళ ప్రతి చదవడానికి ప్రయత్నించిన తరువాత, పద్మా నారాయణన్‌ అనువాదం బాగుందని తోచింది గాని, భాష, భావం కలయిక, అంటే అభివ్యక్తి మూలానికి ఎంత సమీపంగ ఉన్నదీ తెలియలేదు. అనువాదం చదువుతుంటే, అడుగడుగున, మూలభాష గుర్తుకు రావాలని నాకనిపిస్తుంది. రచన అసలయిన ఇంగ్లీషు ఇడియంతో సాగుతుంటే నాకు అసౌకర్యంగ తోస్తుంది. ఈ విషయం గురించి చాల మందితో, చాల చర్చించిన. ఇంకా అది కొనసాగవలసి ఉంది.

ప్రాయశ్చిత్తం: తిరిగి గోమతి యింట్లో, ఆయన తన పెట్టెను పరీక్షించాడు. తాళం బదులు ఒక తీగ చుట్టి ఉంది. తన బట్టలన్నీ ఉన్నాయని గమనించాడు. కాఫీ ఫిల్టరు, స్టీలుగ్లాసు కూడా. పాస్‌బుక్‌, ఎఫ్‌డీ రసీదు, చెక్కుబుక్కు లేవు. పోలీసు వాళ్లు తీసేసుకుని ఉంటారు. ఒక వస్తువు కంటికి కనపడింది. అది గుడ్డలో చుట్టి ఉంది. ఆకారం వల్ల అదేమిటో తెలిసింది - తన పిల్లంగ్రోవి. ఆయన దాన్ని తీశాడు. శుభ్రంగా తుడిచాడు, కళ్లతో తడిమాడు.. ఆయన తన పరిసరాలను మరిచిపోయాడు.

మూడున్నర సంవత్సరాలు... మొదటి స్వరపు తీయని గాలి వెలికివచ్చి గుండెను తడిపింది. ఆయన సర్వస్వాన్ని ముంచెత్తింది. లోపల ఒక పచ్చని చిగురు తలయెత్తింది.

అక్కడ రచయిత రాసిన మాటలు మనసులో కుచ్చుకుంటయి. అదే రచన యొక్క సక్సెస్‌కు గుర్తింపు. అట్లని రచన గొప్పది కానవసరం లేదు.

ఈ జమిలి నవల నిజంగా ఒక మసాలా మిక్స్‌! కానీ మసాలా నవల్లో ఇలాంటి మాటలుంటయా? ఏమో?


No comments: